అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణం: వెంకయ్యనాయుడు

 

అమరావతి స్వర్ణభారత్‌ ట్రస్టులో వివిధ రంగాల ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ ధోరణి ప్రమాదకరమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు ఆలస్యం చేయడం సరికాదని, సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నికల కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆర్థిక నేరగాళ్లు దేశం దాటకుండా చర్యలు తీసుకోవాలని వెంకయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు చాలా విచిత్రంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలు గుప్పిస్తున్నారన్నారు. అమలు కాని హామీలు ఇవ్వడం పట్ల రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలని సూచించారు. కులం, మతం, ధనంతో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. అభ్యర్థి గుణం, సామర్థ్యాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధి అవసరమని.. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu