మెసేజ్ లో ఒకటి.. ప్రెస్ మీట్ లో మరొకటి
posted on Dec 5, 2018 9:23AM

టీఆర్ఎస్ కంటే ప్రజాకూటమే ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంలో ఉందని, అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదైతే హంగ్ వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో తన సర్వే వివరాలు వెల్లడించారు. అయితే లగడపాటి సర్వే చిలక జోస్యమంటూ టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. అందుకు కారణాలు వెల్లడిస్తూ కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. నవంబర్ 20వ తేదీన రాజగోపాల్ తనకు పంపిన మెస్సేజ్లో టీఆర్ఎస్ 65 నుంచి 70 సీట్లు, ప్రజా కూటమి 35-40 సీట్లు, బీజేపీ 2-3 సీట్లు, ఎంఐఎం 6 లేక 7 సీట్లు, ఇతరులు ఒకటి లేక రెండు స్థానాల్లో నెగ్గుతారని సర్వే వివరాలు వెల్లడించారని కేటీఆర్ స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. మీరు చెప్పిన స్థానాలను మేం అధిగమించి మీకు సర్ప్రైజ్ ఇస్తామని కేటీఆర్ లగడపాటికి రిప్లై ఇచ్చారు. కేవలం 17 రోజులే ఉందని, మీ నైపుణ్యం, తెలివితేటలు తనకు తెలుసునని.. ఆశ్చర్యపోవడానికి ఏం లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని లగడపాటి మరో మెస్సేజ్ చేశారు.
అప్పుడు టీఆర్ఎస్ మెజార్టీ సాధిస్తుందని చెప్పిన లగడపాటి.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకురావడంతో సర్వే వివరాలను తారుమారు చేసి చెప్పినట్లు ట్వీట్ ద్వారా వెల్లడించారు. లగడపాటి తాజాగా చెప్పిన సర్వే వివరాలు తప్పు అని చెప్పేందుకు ఇటీవల ఆయన పంపిన సర్వే రిపోర్టును షేర్ చేయక తప్పడం లేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం..సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే లాస్ట్ మినిట్ ప్రయత్నం, లగడపాటి , బాబు పొలిటికల్ టూరిస్టులు..డిసెంబర్ 11 న తట్ట బుట్ట సర్దేస్తారు. వెయిట్ అండ్ వాచ్ అని మరో ట్వీట్ చేశారు.

