తుని మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలోకే !
posted on Feb 25, 2025 2:05PM
.webp)
తుని మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలో పడిపోయింది. మునిసిపల్ కౌన్సిలర్లలో 12 మంది వినా మిగిలిన వారంతా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో మునిసిపల్ చైర్మన్ కూడా రాజీనామా చేసేశారు. తుని మునిపిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేని కారణంగా వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తున్నది.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం గూటికి చేరారు. వైస్ చైర్మన్ స్థానం ఖాళీ అవ్వడంతో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆ స్థానం వైసీపీకే దక్కేలా చూడటానికి నానా ప్రయత్నాలూ చేశారు. ఎన్నిక జరిగితే వైస్ చైర్మన్ పదవి తెలుగుదేశం దక్కించుకోవడం ఖాయమన్న భావనతో వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు రాకుండా అడ్డుకున్నారు. నిర్బంధించారు. వారు మునిసిపల్ సమావేశానికి రాకుండా ఉండేందుకు సామదాన భేద దండోపాయాలను ప్రయోగించారు. ఎన్నిక నిర్వహించడానికి కోరం లేకుండా చేశారు. ఉద్రిక్తతలు సృష్టించారు. ఆ కారణంగా తుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటి వరకూ మూడు సార్లు వాయిదా పడింది.
ఇక నాలుగో సారి కూడా కోరం లేని పరిస్థితి ఏర్పడితే.. హాజరైన కౌన్సిలర్లలోనే మెజారిటీ కౌన్సిలర్లు ఎవరికి మద్దతు ఇస్తే వారినే ఎన్నుకుంటారు. కోరం లేదంటూ నాలుగో సారి ఎన్నిక వాయిదా పడే అవకాశం లేదు. దీంతో దాడిశెట్టి రాజీ ఇక కౌన్సిలర్లను నిలువరించి ఫలితం లేదన్న నిర్ణయానికి వచ్చి చేతులెత్తేశారు. దీంతో వారంతా తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పడు తుని మునిసిపాలిటీలో తెలుగుదేశం కౌన్సిలర్లు 20 మంది కాగా వైసీపీ కౌన్సిలర్లు 12 మంది మాత్రమే. తుని మునిసిపల్ చైర్ పర్సన్ కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు వైస్ చైర్మన్ తో పాటు చైర్ పర్సన్ ఎన్నిక కూడా జరగనుంది. ఏ విధంగా చూసినా ఇక్కడ వైసీపీకి పరాజయం, పరాభవం తప్పదని పరిశీలకులు అంటున్నారు.