మరో ఉద్యమానికి తెర తీస్తున్న తృప్తి దేశాయ్.. దర్గాలోకి.. చెప్పులతో కొడతాం
posted on Apr 23, 2016 12:39PM
నిషేదం ఉన్న పలు ఆలయాల్లో ప్రవేశం కోసం భూమాతా బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఇప్పటికే మహారాష్ట్ర్ర శనిసింగనాపూర్ ఆలయంలోకి.. నాసిక్ త్రయంబకేశ్వరాలంలోని గర్భగుడిలో మహిళలు ప్రవేశించడానికి అనుమతిపొంది విజయం సాధించారు. ఇప్పుడు ముంబైలోని ప్రసిద్ధ హజీ అలి దర్గాలోకి కూడా ప్రవేశిస్తానని ఆమె తెలిపారు. ఈనెల 28న ఆ దర్గాలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు.
అయితే ఇప్పుడు తృప్తి చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడుతోంది. ఈ సందర్బంగా శివసేన నాయకుడు హజీ అరాఫత్ షేక్ స్పందిస్తూ తృప్తి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తృప్తీ దేశాయ్ హజీ అలి దర్గాలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే చెప్పులతో కొడతామని ఆయన హెచ్చరించారు. మరి 28న ఎలాంటి ఆందోళనకర సంఘటనలు చోటుచేసుకుంటాయో చూడాలి.