బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
posted on Oct 24, 2025 9:57AM

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్రమాదంలో మృతులలో అత్యధికులు తెలంగాణ వాసులే కావడం దురదృష్టకరమన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ను వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.