ఏపీలో ఎన్నికల ప్రక్రియ కబ్జా!

మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో త‌మ‌ పార్టీతో పోటీ పడలేకే వైసీపీ నేత‌లు ఆస్తుల విధ్వంసానికి పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటన్నారు చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదల భూములను వైసీపీ నేతలు కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి షాపును అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాసలో బెదిరింపులకు గురి చేసి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీలో చేర్చుకున్నారని, పోటీ నుండి తప్పుకోకపోతే టీడీపీ అభ్యర్థులపై వైసీపీ విష పంజా విసురుతోందన్నారు. జగన్ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చమైందన్నారు. జగన్ రెడ్డి ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికృతి చేష్టలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్ఈసీ, పోలీసులపై వుందన్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుండి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుబట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.