పందెం కోసం పెన్ను మింగేశాడు!
posted on Jan 1, 2026 10:19PM

తోటి విద్యార్థులతో పందెం కాసి పెన్ను మింగేసిన విద్యార్థి ఉదంతమింది. అలా పెన్ను మింగేసిన మూడేళ్ల తరువాత తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. స్కానింగ్ లో కడుపులో పెన్ను ఉందని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా పెన్ను బయటకు తీసి అతడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెడితే..
గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడేళ్ల కిందట అంటే అతడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. స్నేహితులతో పందెం కాసి పెన్ను మింగేశాడు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ మూడేళ్లుగా తరచుగా కడుపునొప్పి వస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు.
అయితే తాజాగా గత నెల 18న తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాపాయ స్ధితికి చేరుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు సర్వ జనాస్పత్రికి తీసుకు వెళ్లారు, అక్కడ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి పెన్ను ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే పెన్నును బయటకు తీసి అతడి ప్రాణాలు కాపాడారు.