బ్లో అవుట్ ప్రాంతంలో తెరుచుకున్న పాఠశాలలు
posted on Jan 7, 2026 1:16PM

బ్లోఅవుట్ ముప్పు ఎదుర్కొంటున్న కోనసీమ జిల్లా మలికిపురం మండలంఇరుసుమండలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అక్కడ పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు. ఇరుసుమండలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి. ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్ లో బ్లో ఔట్ సంభవించి భారీగా మంటలు ఎగసిపడిన సంగతి తెలిసిందే.
మూడు రోజులు అవుతున్నా మంటలు అదుపులోనికి రాలేదు కానీ, బుధవారం (జనవరి 7) నాటికి మంటల తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. మంటలు పూర్తిగా ఆగిపోవడానికి వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. బ్లో అవుట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు.
బ్లో అవుట్కు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ మాదుర్ కోరారు. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. పాత గ్యాస్ పైపులైన్లు మార్చాలని కూడా కోరుతున్నారు.