శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి.. ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారి తీసిన శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(CEA)తో  విచారణకు అదేశించాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పవర్ ప్లాంట్ దుర్ఘటనలో క్రిమినల్ కోణం ఉందని వాస్తవాలు అన్నీ బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ప్రధానికి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదం వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుతు సరఫరా చేసే ఈ ప్లాంట్ లో ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి, ప్లాంట్ ప్రమాదంపై వాస్తవాలు సీబీఐ విచారణ తోనే నిజాలు బయటకు వస్తాయని రేవంత్ తన లేఖలో పేర్కోన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల కారణంగా జెన్కో ట్రాన్స్కో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయని, టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని ఆయన కోరారు.

 

శ్రీశైలం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ గతంలోనూ రేవంత్ ప్రధానికి లేఖ రాశారు. ప్రమాద సంకేతాలపై సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా వారు స్పందించ లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సిబ్బంది ప్రాణాలు, వేల కోట్ల రూపాయల ప్రజా సంపద కాలి బూడిద అయ్యిందన్నారు. ఈ మొత్తం అంశంపై నిజానిజాలు బయటకు రావాలంటే.. దీనిపై నిస్పాక్షింగా విచారణ జరగాలన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని.. బాధిత కుటుంబాలకు రూ. కోటి సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గతంలోనూ ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 

 

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిఐడీ విచారణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సిబ్బంది స్పందిస్తున్నారు. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో బ్యాటరీలు మార్చాలని రెండేళ్లుగా కోరుతున్నా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఇంజనీర్లు సిఐడీ టీమ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.