కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
posted on Jul 29, 2025 5:23PM

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆగష్టు 25 నుంచి అర్హులు అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఆగష్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పంపీణీ కొనసాగుతుందని వెల్లడించారు. QR కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. నూతన రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండబోవు అని స్పష్టం చేశారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని అన్నారు.
ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, రేషన్ డీలర్ల దగ్గర ఈ-పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. అటు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రోజూ ఉదయం. 8 గంటల నుండి 12 వరకు సాయంత్రం 4 గంటల నుండి 8 వరకు రేషన్ షాపుల్లో సరకులు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.