ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ సీరియస్

 

 

నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి , వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ, పదవులు పోయినా కూడా కొందరు వైసీపీ నేతలు హీరోలు లాగా ఫీల్ అవుతున్నారని అన్నారు.  మహిళల పట్ల వ్యక్తిత్వహననానికి పాల్పడటం సర్వ సాధారణమైపోయిందని అన్నారు. 

రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల అమరావతి మహిళల పై కూడా ఇలాగే కించపరిచేలా మాట్లాడారని, ఇటువంటి వారిపై మహిళా కమిషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పారు.మీరు అనుకుంటున్నట్లు మహిళలు బలహీనులు కాదని, మీకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని ఆమె అన్నారు.