కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లే : కవిత

 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్  కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కేసీఆర్‌ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు నోటీసులు ఇస్తే, యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే" అని ఆమె అన్నారు.. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్‌ చేసిన తప్పా అని నిలదీశారు.

"ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది జవాబుదారీతనం కోసం కాదు. కేవలం రాజకీయంగా పరువు తీయడం కోసమే అని ఆమె అన్నారు.ఈ ప్రాజెక్టులో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌కు ఇటీవల నోటీసులు జారీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదని పేర్కొన్నారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును అడ్డుకోవాలని ఆమె అన్నారు.