కుమారస్వామి ప్రమాణస్వీకారంలో మమత తిట్లు

 

కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారం అన్ని ప్రాంతీయపార్టీలకీ పండుగలా కనిపించాయి. బీజేపీ ప్రభంజనంతో దిమ్మతిరిగిపోయినవారంతా ఈ వేడుకతో కాస్త ఒడ్డునపడ్డారు. అందుకే ఎక్కడెక్కడివారంతా తరలివచ్చారు. చంద్రబాబు, రాహుల్‌గాంధి, సోనియాగాంధి, మాయావతి, శరద్‌పవార్‌, అఖిలేష్‌ యాదవ్‌, కేజ్రీవాల్‌, మమతాబెనర్జీలాంటి వారితో వేదిక కిక్కిరిసిపోయింది. ఇంతలో మమతాబెనర్జీ తిట్ల దండకంతో వీళ్లంతా విస్తుపోయారు. కారణం! మమతా దీదీ కారుని స్థానిక సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడమే. దాంతో ఆమె కాస్త దూరం నడవాల్సి వచ్చింది. పైర్‌ బ్రాండ్‌ మమత చెలరేగిపోవడానికి ఈ మాత్రం కారణం చాలు కదా! వెంటనే కర్ణాటక పోలీస్‌ ఛీఫ్‌ నీలమణి రాజుని దులిపేసి వదిలిపెట్టారు. ఇదంతా చూస్తూ నిలబడటం తప్ప కుమారస్వామి తదితరులు ఆమెని ఆపేందుకు సాహసించలేదు. లేకపోతే నాలుగు తిట్లు వారికీ పడతాయని తెలుసు కదా!