లగడపాటి సర్వే...కూటమికే అనుకూలం

 

ఆంధ్ర ఆక్టోపస్ రాజగోపాల్ సర్వే కోసం అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు లగడపాటి సర్వే తో డైలమాలో పడుతున్నాయి. తన సర్వే పూర్తిగా వెల్లడించకుండా రోజుకో ప్రకటన చేసి మరింత ఆసక్తి రేవుతున్నారు లగడపాటి. మొన్న 8  నుంచి 10 స్థానాల్లో స్వతంత్రులు గెలుస్తారని చెప్పి సంచలనం రేపిన లగడపాటి.. తాజాగా మీడియా తో తన అభిప్రాయాలను, సర్వే వివరాలను పంచుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడి హస్తం వైపే ఉందని లగడపాటి తెలిపారు. 2014లో పోలింగ్‌ శాతం 68.5గా నమోదైందని, అంతకుమించి నమోదైతే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు విజయావకాశాలు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. పోలింగ్‌ శాతం తగ్గితే మాత్రం హంగ్‌ రావొచ్చని జోస్యం చెప్పారు. పోలింగ్‌ శాతాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయని, పోలింగ్‌ పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావించాలన్నారు. గత ఎన్నికల్లోలాగానే 68.5 పోలింగ్‌ శాతం నమోదయితే ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఆ వివరాలను 7వ తేదీసాయంత్రం 5 గంటల తర్వాత వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు. 

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాఫ్రంట్‌ ఆధిక్యంలో ఉందని.. ఉమ్మడి వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉందని.. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉందని లగడపాటి వివరించారు. గతంతో పోలిస్టే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, ఆ పార్టీ గ్రేటర్‌ పరిధిలోనే కాక, జిల్లాల్లోనూ కొన్ని స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంఐఎం బలంగా ఉందని, మొత్తం 14 స్థానాల్లో ఏడు చోట్ల ఆ పార్టీ గెలుస్తుందని, మిగతా సీట్లను బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు పంచుకుంటాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్, మక్తల్‌ నుంచి జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలవబోతున్నారని చెప్పారు. అందరూ ముందు నుంచి అనుకున్నట్టుగా తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షంగా మాత్రం జరగడం లేదని తెలిపారు.  

తెలంగాణలోని 119 స్థానాలకుగాను 100 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని లగడపాటి వివరించారు. రెండు నెలల క్రితంతో పొల్చితే తెలంగాణ ప్రజల ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందని లగడపాటి అభిప్రాయపడ్డారు. అందుకు ప్రజాకూటమి అభ్యర్థుల ప్రచారం, ఇచ్చిన వాగ్దానాలు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. 100కుపైగా స్థానాలు గెలుస్తామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఎవరి అంచనాలు వారికి ఉంటాయని బదులిచ్చారు. గత నెల రోజులుగా తన పేరుతో సర్వే ఫలితాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని.. కానీ, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. పలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందనే విషయాన్ని ముందే ప్రకటించానని గుర్తుచేశారు. 2009 ఎన్నికల్లో సర్వేలన్నీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్పగా.. తాను ముందుగా ప్రకటించినట్లుగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గెలుస్తారని స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. సర్వేలను నమ్మొద్దన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. రోజూ పలు సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని, తన సర్వేను లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లు తాను భావించట్లేదని అన్నారు. సర్వేల విషయంలో రాజకీయ పార్టీలు, టీవీ చానళ్ల అంచనా వేరే ఉంటుందన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌ మిజోరం సర్వే ఫలితాలనూ డిసెంబర్‌ 7నే వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu