అత్యాచారం కేసులో మురళీముకుంద్ అరెస్ట్, రిమాండ్

జూబ్లీ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ ను పోలీసులు అరెస్టు చేశారు.     తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నేరంపై మురళీముకుంద్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనను రిమాండ్ కు ఆదేశించింది.  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీముకుంద్‌ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు  న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడు మరళి ముకుంద్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలిచారు.   ఇదే కేసులో మురళీముకుంద్ కుమారుడు ఆకాశ్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్  బంజారాహిల్స్ మిథిలానగర్ లో నివాసం ఉండే మురళి ముకుంద్ ఇంట్లో  ఓ ఏగ్రేడ్ ఏజెన్సీ ద్వారా పనిమనిషిగా చేరిన యువతిని తన కుమారుడితో సహా వేధింపులకు గురి చేశారు.  ఈ ఏడాది  జూన్ 18న   మురళి ముకుంద్ నివాసంలో పని మనిషిగా  చేరిన యువతికి అలా చేరిన నెల రోజుల నుంచే  వేధింపులు ఎదురయ్యాయి. పలు మార్లు ఈ విషయమై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. తాను పని చేస్తున్న ఇంటి యజమాని మురళి ముకుంద్ మామూలు వ్యక్తి  కాదు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్. మురళి ముకుంద్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించే వాడు. ఆ క్రమంలోనూ  జూలై 16 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మురళి ముకుంద్ ఆమెను తన బెడ్ రూంలో బెడ్ షీట్ మార్చాలని ఆదేశించాడు. దీంతో ఆమె బెడ్ రూంలోకి వెళ్లగానే ఆమె ప్రతిఘటించేలోగానే రూం తలుపులు మూసేసి స్నానం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. తిరస్కరిస్తే బెదరింపులకు దిగాడు. ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించడంతో ఆమె బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసింది.

బాత్ రూంలో ఆమె స్నానం చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలూ చూపి బెదరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ  విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించాడు. తీవ్ర భయాందోళనకు గురైన  ఆ యువతి మురళీముకుంద్ కుమారుడు ఆకాష్ కు చెప్పింది.

అయితే  ఆకాష్ బాధితురాలిని తీవ్రంగా కొట్టి విషయం బయటపెడితే చంపేస్తానని  బెదరించాడు. అంతే కాకుండా తమ ఇంట్లో సిమ్ కార్డ్ చోరీ చేసిందంటూ ఎదురు కేసు పెట్టారు. తనను తీవ్రంగా  కొట్టారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీచేసుకోమని వారు ఆమెనే మందలించారు. దీంతో దిక్కుతోచక ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పలేకపోయింది. చెబితే తననూ తన తల్లినీ చంపేస్తామని మురళి ముకుంద్, అతని కుమారుడు ఆకాష్ బెదరించడంతో మౌనంగా ఉండిపోయింది.

తర్వాత కూడా అత్యాచార పర్వం కొనసాగిస్తుండటంతో ఆమె విషయాన్ని తల్లికి  చెప్పి ఆమెతో కలిసి ఈ  నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని  భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు నిందితులు మురళీముకుంద్, అతని కుమారుడు ఆకాష్ పై కేసు నమోదు చేశారు.