ఆ సామాజిక వర్గాలకూ సంక్షేమం.. జగన్ దింపుడు కల్లం ఆశ!
posted on Oct 24, 2023 3:27PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశ ఆరిపోయింది. ఈస్ట్ మన్ కలర్ లో, సినిమా స్కోపులో రానున్న ఓటమి కళ్లెదుట కనిపిస్తుంటే.. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుముంటున్న పరిస్థితి వైసీపీది. అయితే మేకపోతు గాంభీర్యమే, అతి విశ్వాసమో, అహంభావమో తెలియదు కానీ.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఏం చేసైనా సరే మరోసారి అధికార పగ్గాలు అందుకోవాలన్న తాపత్రయం మాత్రం వదలడం లేదు.
ఇందుకు కారణమూ లేకపోలేదు. ఈ సారి అధికారం దక్కకుంటే ఇక వైసీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయన్నది ఆయనకు విస్పష్టంగా అర్ధమైపోయింది. ఈ సారి ఎన్నికలలో పరాజయం పాలై, చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అమరావతి, పోలవరంను పరుగులు పెట్టించి పూర్తి చేయడం ఖాయమన్న సంగతి జగన్ కు స్పష్టంగా తెలుసు. అదే జరిగితే అంటే పోలవరం, అమరావతి పూర్తయితే ఇక ఏపీలో వైసీపీకి స్థానం అనేదే ఉండదు. ఆ విషయాన్ని గుర్తించే ఏం చేసైనా సరే మరోసారి అధికార పగ్గాలను అందుకోవాలని జగన్ నేల విడిచి సాము చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
నిజానికి చెప్పాలంటే 2019 ఎన్నికల సమయంలో కూడా వైసీపీదీ, జగన్ ది ఇదే పరిస్థితి. అప్పుడు కూడా అధికారమో, రాజకీయ సన్యాసమో అన్నట్లుగానే జగన్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఉంది. అయితే అదృష్టం కలిసి వచ్చింది. 2019లో కూడా అధికారం దక్కకపోతే తనకి ఇక భవిష్యత్ లేదని గుర్తించిన జగన్ ఆ ఎన్నికలలో ఎన్ని వాడాలో అన్నీ వాడారు. బాబాయ్ దారుణ హత్య, కోడి కత్తి కేసు, తండ్రి రాజశేఖరరెడ్డిది హత్యేనని ప్రచారం, తల్లి,చెల్లిని ప్రచారానికి వాడుకోవడం, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కుట్రలు చేశారని ఆరోపణలు, తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మాయం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు, అమరావతి గ్రాఫిక్స్ అనే ప్రచారం, మేధావులుగా చెప్పుకొనే కొంతమందితో నిత్య అసత్య ప్రచారాలు ఇలా ఏం చేయాలో అవి చేయడమే కాకుండా చేయకూడనివి కూడా చేసేశారు. ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచీ ఈ నాలుగున్నరేళ్లు ప్రజలకు నరకం చూపారు. జగన్ పాలనలో సమాజంలోని అన్ని వర్గాల వారు అసంతృప్తి, అభద్రతా భావంతోనే కాలం గడుపుతున్నారు. అన్ని వర్గాల వారి నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే తేల్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం తెలుగుదేశం పార్టీదే అని పలు సర్వేలు పేర్కొన్నాయి. చివరాఖరికి జగన్ కు ఎన్నికల వ్యూహకర్త అయిన పీకే కూడా చేతులెత్తేశారని అంటున్నారు. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్.. కుట్ర పూరితంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారు. చంద్రబాబును జనంలో తిరగకుండా నిరోధించగలిగితే.. తెలుగుదేశంలో స్తబ్దత నెలకొంటుందనీ, సులువుగా ఎన్నికలలో చక్రం తిప్పేయొచ్చని భావించారు. అయితే జగన్ అనుకున్నది ఒకటి అ యితే అయ్యింది మరొకటి అయ్యింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలుగుదేశం శ్రేణులే కాదు.. సామాన్య జనం, రాజకీయాలకు సంబంధం లేని తటస్థ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశాయి. దీంతో చంద్రబాబు అక్రమ అరెస్టుతో వైసీపీ ఓటమి మరింత ఖరారైంది. వైసీపీకి చంద్రబాబు అరెస్టు పూడ్చలేని నష్టాన్ని చేకూర్చిందని తేలడంతో దీని నుండి బయట పడేందుకు ఇంకా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు ప్రజలలో అసంతృప్తిని ఎలా తగ్గించాలని కోటాను కోట్లు ఖర్చు చేసి ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో వైసీపీకి ఏకైన ఆయుధం ఏదైనా ఉందంటే అది సంక్షేమం మాత్రమే. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టనీ, ముక్కు పిండి వసూళ్లు చేసి ఆ డబ్బులే వివిధ పేర్లతో పంచనీ, రకరకాల పేర్లతో పన్నులు బాది వాటినే తిరిగి ప్రజలకు జమ చేయనీ.. అప్పులు చేసి, ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇవ్వక ఎలాగోలా బటన్ నొక్కుడు ద్వారా సొమ్ముల పందేరం చేశారు. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు, వ్యవసాయం, నీటి పారుదల, పరిశమ్రలు, టెక్నాలజీ లాంటివి అసలు తమకు పట్టనే పట్టవనీ, సంక్షేమం ఒక్కటే తమ పాలసీ అన్నట్లుగా జగన్ పాలన కొనసాగించారు. ఆ సంక్షేమం కూడా అనేక కోతలతో అరకొరగానే సాగింది. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ఆయా సామాజికవర్గాలలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఇది గమనించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.
గత ఏడాది నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోతలు ఎక్కువయ్యాయి. ఆర్థిక భారం నుంచి సర్కారు తప్పించుకునేందుకు ఈ చర్యలకు దిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కొన్ని సామాజికవర్గాలకు అసలు వైసీపీ సంక్షేమం చేరనే లేదు. అందులో ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలలో నేటికీ ఒక్క రూపాయి సంక్షేమ ఫలాలు దక్కని కుటుంబాలు ఉన్నాయి. తమ సిద్ధాంతమే బటన్ నొక్కుడు కాగా.. అదే అసలు అందకపోతే వారి అసంతృప్తి అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పటి వరకు లబ్ధి పొందని కుటుంబాలను ఎంపిక చేసి వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నయోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా కోటి కుటుంబాలు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా. వీటిలో ముఖ్యంగా కాపు, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కుటుంబాలకు వచ్చే మూడు నెలల్లో ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని తాడేపల్లి కేంద్రంగా ప్రణాళికలు సిద్దమవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పరిశీలకులు మాత్రం చివరి క్షణంలో సంక్షేమం పేరుతో ప్రణాళికలు రూపొందించడాన్ని జగన్ దింపుడు కళ్లెం ఆశగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.