జూబ్లీహిల్స్ పై చంద్రబాబు దృష్టి?
posted on Jul 2, 2025 9:04PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగడమే కాక హైదరాబాద్లో ఉన్న పాత టీడీపీ క్యాడర్కు మళ్లీ చురుకుగా మార్చే లక్ష్యంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైపోయింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం… అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.