మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే.. ఇలా చేయండి..!


మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు.  మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో ధనం అంతగా పెరుగుతుందని నమ్మకం.  అయితే కొన్ని ఇళ్లలో మనీ ప్లాంట్ అస్సలు సరిగ్గా పెరగదు.  వర్షాకాలంలో అయినా, సాధారణ రోజులలో అయినా మనీ ప్లాంట్ పెరుగుదల విషయంలో గందరగోళ పడే వారు ఉంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా ఉంది.  మనీ ప్లాంట్ బాగా,  గుబురుగా పెరగాలన్నా,  వేగంగా పెరగాలన్నా ఇంట్లోనే ఉన్న 5 పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది.  ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే..

మనీ ప్లాంట్ కోసం ఎరువు..

మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే ఇంట్లోనే దీనికి మంచి పోషకం కలిగిన ఎరువును తయారు చేసుకోవాలి. దీనికోసం ఇంట్లోనే లభించే 5 పదార్థాలు చక్కగా పనిచేస్తాయి.

కావలసిన పదార్థాలు..

టీ ఆకులు లేదా టీ పౌడర్

పసుపు

బెల్లం

బంగాళదుంప తొక్కలు

ఆవాలు

తయారు చేసే విధానం..

ముందుగా టీ తయారు చేసిన తరువాత మిగిలిపోయే టీ పౌడర్ ను పడేయకూడదు.  ఈ టీ పౌడర్ ను మళ్లీ ఎండబెట్టాలి.

వంటింట్లో బంగాళదుంపలను వినియోగించినప్పుడు తొక్కలు తీస్తుంటారు.  ఈ తొక్కలను కూడా ఎండబెట్టాలి.  

టీ పౌడర్, బంగాళదుంప తొక్కలు బాగా ఎండిన తరువాత వీటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.  ఈ టీ పౌడర్ లో కాసింత చిన్న బెల్లం ముక్క వేయాలి.  దీంతో పాటు ఆవాలు,  పసుపు కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి.  ఇలా తయారైన పొడిని మనీ ప్లాంట్ మొదట్లో కాసింత ఎరువులాగా వేసి నీరు పోయాలి. ఇలా 10 లేదా 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటే మనీ ప్లాంట్ చాలా వేగంగా, బాగా పెరుగుతుంది.  కేవలం మనీ ప్లాంట్ కు మాత్రమే కాదు.. ఇతర తీగ జాతి మొక్కలకు,  పూల మొక్కలకు కూడా ఇలా చేయవచ్చు.

ఏ పదార్థాలు ఎలా పనిచేసాయి..

బెల్లం..

బెల్లం నేలలో చిన్న చిన్న మంచి సూక్ష్మక్రిములను ఉత్పత్తి చేస్తుంది, నేలను మరింత సారవంతం చేస్తుంది.  మొక్క అవసరమైన పోషకాలను సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది.

టీ ఆకులు..

ఉపయోగించిన టీ ఆకులు మనీ ప్లాంట్ ఆకులను ముదురు ఆకుపచ్చగా,  పెద్దవిగా చేస్తాయి. ఇందులో నత్రజని ఉంటుంది.  ఇది ఆకుల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది.

ఆవాలు..

ఇందులో నత్రజని, భాస్వరం,  పొటాషియం ఉంటాయి. ఇవి మొక్క బాగా పెరగడానికి, వేర్లు బలంగా,  ఆకులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది నేలను కూడా మెరుగుపరుస్తుంది.

పసుపు..

పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మొక్కను వ్యాధులు,  కీటకాల నుండి రక్షిస్తుంది.  ముఖ్యంగా వేరు కుళ్ళును నివారిస్తుంది. ఇది నేలను శుభ్రంగా ఉంచుతుంది.

బంగాళాదుంప తొక్కలు..
బంగాళాదుంప తొక్కలలో పొటాషియం ఉంటుంది. ఇది మనీ ప్లాంట్ ఆకులను మెరిసేలా ఆరోగ్యంగా చేస్తుంది. ఇది మొక్క యొక్క బలాన్ని పెంచుతుంది  వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

                       *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu