వెన్నుపోటు పొడిచారు.. ఓడిపోయారు...
posted on May 17, 2014 12:25PM
తెలుగు ప్రజలకు.. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు దారుణంగా ఓడిపోయారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తుంటే రాజీనామాలు చేయడానికి కూడా మనసు రాక పదవులు పట్టుకుని వేలాడుతూ చోద్యం చూసినవాళ్ళంతా ఈ ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోయారు. రాయపాటి సాంబశివరావు అయితే ఎన్నికల ముందే నెత్తిన గుడ్డేసుకున్నారు. మిగతా సీమాంధ్రకి చెందిన కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, పళ్ళంరాజు, పనబాక లక్ష్మి విభజనకు పూర్తిగా సహకరించారు. దానికి ఫలితం ఇప్పుడు అనుభవించారు. పనబాక లక్ష్మి అయితే నేను విభజనకు అనుకులం, విభజన చేస్తే ఏమవుతుందంట లాంటి డైలాగ్స్ వాడి సీమాంధ్రుల మనసులను గాయపరిచారు. అంత గాయపరిచినా మళ్ళీ ఎన్నికలలో సీమాంధ్రులు తమని గెలిపిస్తారని కలలు కన్నారు. ఆ కలలన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. ఇంకా సీమాంధ్రులను వెన్నుపోటు పొడిచిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఎవరినీ ప్రజలు క్షమించలేదు. వీరిని ఇప్పుడే కాదు.. ఎప్పుడూ గెలిపించరు. వీళ్లంతా పదవుల మీద ఆశలు పెట్టుకోకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటే బెటర్ అని సీమాంధ్రులు అనుకుంటున్నారు.