ఢిల్లీ సరిహద్దుల్లో  రైతుల ధర్నా ముగిసింది 

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సర కాలం పైగా, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిన నేపధ్యంలో ఆందోళన విరమించాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. ఆ ప్రక్రియ అంతా చకచకా సాగిపోయింది.

నూతన సాగు చట్టాలు రద్దయ్యాయి. అయినా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా ఇతర డిమాండ్లు నెరవేర్చాలని చెబుతూ రైతులు నిరసనలు కొనసాగిస్తూ వచ్చారు. వీటిపైనా సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే సంయుక్త కిసాన్ మోర్చా సమావేశమైంది. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి.. తుది నిర్ణయం తీసుకుంది. నిరసనలకు ముగింపు పలికినట్లు మోర్చా ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో రైతులు.. తమ టెంట్లను తీసివేస్తున్నారు. దిల్లీ- హరియాణా సింఘూ సరిహద్దు వద్ద నిరసన స్థలాల వద్ద ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను తొలగిస్తున్నారు.రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు. హామీల అమలుకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వకంగా ఉండాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని కేంద్రం మరో హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను విరమించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులు దిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేయనున్నారు.