పేర్ని నాని ఇక అరెస్టేనా?
posted on Jun 12, 2025 12:41PM
.webp)
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నానికి నకిలీ పట్టాల వ్యవహారంలో ఉచ్చు గట్టిగా బిగిసిందా? అంటూ ఔనన్న సమాధానమే వస్తున్నది. ఇప్పటికే వైసీసీ సీనియర్లు, కీలక నేతలు అన్న ఒక్కొక్కరూ జైలు దారి పడుతున్నారు. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి, కొమ్మినేని.. రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప.. ఇలా జగన్ కు సన్నిహితులంతా ఒకరి తరువాత ఒకరుగా జైలు బాటపడుతున్నారు. ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారంలో ఉండగా నిబంధనలకు తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా చేసిన అక్రమాలు, అవినీతి కారణంగానే ఈ అరెస్టులు అన్న క్లారిటీ ఇప్పటికే ప్రజలలో కనిపిస్తున్నది. ఇక వైసీపీ మౌత్ పీస్ లాంటి ఓ చానల్
ఇటీవల నిర్వహించిన చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు, వాటికి వంతపాడినట్లుగా వ్యవహరించిన సదరు చానల్ ఇన్ పుట్ ఎడిటర్ కొమ్మినేని అరెస్టయ్యారు. వీరి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను ఉద్దేశించి వైసీపీ సీనియర్ నేత, పార్టీ కోఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఆయన కూడా నేడో రేపో కటకటాలు లెక్కించక తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు.
సరిగ్గా ఈ తరుణంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా మరో కేసు విషయంలో పీకల్లోతు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో గత ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ కువచ్చారు. ఆ కేసులో పేర్ని నాని అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు గురువారం (జూన్ 12) విచారిస్తుంది. అయితే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు కాకుంటే? అన్న భయం పేర్ని నానిని వెంటాడుతోంది.
ఆ భయంతోనే హడావుడిగా నాని పార్టీ నాయకులు, శ్రేణులు, తన అనుచరులతో గురువారం (జూన్ 12) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన పోలీసులపై, తెలుగుదేశం కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సందర్భం లేకుండా గతంలో రేషన్ బియ్యం అక్రమాల విషయంలో తన భార్యను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించిన సందర్భాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి టైం నడుస్తోంది.. మన టైం వస్తుంది ఇంతకు ఇంతా తిరిగి ఇస్తాం అంటూ వార్నింగులకు దిగారు. అంతే తప్ప అత్యవసర సమావేశం లక్ష్యం, వ్యూహంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు విషయంలో ఆయన టెన్షన్ పడుతున్నారని పరశీలకులు విశ్లేషించడానికి కారణంగా చెప్పవచ్చు.