సొంత పార్టీని టెన్షన్ పెడుతున్న సజ్జల కామెంట్స్

ఏపీలో వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కాక  రేపుతున్నాయి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో కొమ్మినేని, కృష్ణంరాజు వివాదం నడుస్తున్న తరుణంలో  అమరావతి మహిళా రైతులపై సజ్జల కామెంట్స్ అగ్గికి అజ్యం పోసినట్లు అయింది. కొమ్మినేని అరెస్టు నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల.. కొమ్మినేని అరెస్టుకు ఖండిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైపీపీని పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టాయంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఏ ముఖం పెట్టుకు తిరగాలని వైసీపీ నేతలే సజ్జలపై ఆగ్రహంతో ఉన్నారంట.

అమరావతి రైతులనును ఉద్దేశించి సంకర జాతి అంటూ జగన్ సలహాదారు, వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసి వ్యాఖ్యలు ఇప్పుటు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అటు కొమ్మినేని, కృష్ణంరాజు ఇష్యూ చల్లారకముందే సజ్జల రాజేసిన వివాదంతో ఆయనపై సొంత పార్టీ నేతలు సహా అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సజ్జల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్యలపై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకర జాతి, పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంకర జాతి వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన మహిళల ఆవేదనను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

ఇప్పటికే రాజధాని ప్రాంతంలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సజ్జల వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. సజ్జలపై  రాజధాని రైతులు, మహిళలతో పాటు కూటమి పార్టీలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సజ్జలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

మహిళలను అలా అవమానించడం అనుచితమని, వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. సంకరజాతి పదప్రయోగం చేసిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. గత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను తాను ప్రశ్నించినందుకు నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్‌లోని అన్ని గ్రామాల్లో తన ఫోటోలను చెప్పులతో కొట్టించారని.. ఇప్పుడిలా మాట్లాడుతున్న వైసీపీ నేతలను ఏం చేయాలని ప్రశ్నించారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సజ్జల వ్యాఖ్యలపై సీరియస్‌గా సోషల్ మీడియాలో స్పందించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల వ్యాఖ్యలు చేస్తున్నారన్న శ్రీధర్ రెడ్డి... సజ్జల జగన్ గుమస్తా అని, రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని అటువంటి వ్యక్తికి రాజకీయ విమర్శలు చేసే హక్కు లేదని ట్వీట్ చేశారు. సజ్జలను రాష్ట్ర బహిష్కరణ చేస్తే రాష్ట్రానికి శ్రేయస్కరమన్నారు కోటంరెడ్డి. 

సజ్జల వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ కూడా సీరియస్‌గానే ఉంది. సజ్జల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..  వైసీపీపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ నేతలు.. సజ్జల వ్యాఖ్యలతో జనానికి ముఖం చూపించడానికి సంశయించే స్థితిలో పడ్డారంట. ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని భయపడుతున్నారంట. పార్టీ ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తరుణంలో వైసీపీలో నెంబర్ 2గా చెలామణీ అవుతున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి మరింత నష్టాన్ని చేస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ వివాదాన్ని రాజకీయంగా వినియోగించుకునే పనిలో పడటంతో వైసీపీపై  మరింత ఒత్తిడి పెంచుతోంది. సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను కూటమి  పార్టీలు ఎండగడుతున్నాయి. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికే విమర్శలను మూటగట్టుకున్న పరిస్ధితి. తాజా పరిణమాలతో రాజధాని ప్రాంతానికి వైసీపీ పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వైసీపీ నాయకులపై ఇప్పటికే పలు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత ఎపిసోడ్‌తో సజ్జల కూడా కేసుల్లో బుక్ అవుతున్నారు. మరి ఆయనపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.