అర సెంటులో మూడంతస్తుల మేడా?
posted on Jun 12, 2025 1:22PM

నేనేడా సూళ్లా అంటోన్న జనం
ఇదేందయ్యా ఇదా నేనేడా సూళ్లా! అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారంట ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ. అప్పట్లో జగన్ సెంటు భూమిస్తా ఎంచక్కా ఇళ్లు కట్టుకోండని అన్నప్పుడు ఏకంగా బాబు కూడా సెటైర్ వేశారు. సెంటు భూమిలో ఏమొస్తుందని అన్నారు. అలాంటిది ఒక వ్యక్తి అరసెంటులో ఏ చిన్నా చితకా ఇల్లో కట్టలేదు. ఏకంగా మూడంతస్తుల మేడ లేపేసేశాడు. ఒక్కసారి మెడ పైకెత్తి ఎంత ఎత్తులో కట్టాడో చూద్దామనుకున్న వాళ్ల మెడ పట్టేస్తుందంటే నమ్మరే. అంతగా కట్టేశాడీ మూడంతస్తుల మేడ. ఇక ఈ భూభాగం మీద ఇంతకన్నా మించిన చోటు లేదన్నట్టు. ఇక్కడ తప్ప ఇంకెక్కడా కట్టడానికి వీల్లేదన్నట్టూ.. ఇతడు కడుతూనే వెళ్లాడీ మేడ. దీంతో ఇప్పుడీ మూండంతస్తుల మేడ అందరి దృష్టినీ తెగ ఆకర్షిస్తోందట.
గతంలో రాజుల కాలంలో ఒంటిస్థంభం మేడలుండేవని అంటారు. అక్కడ యువరాజులు, రాణులు ఏకాంత వాసం గడిపేవారనీ చెబుతారు. అలా ఏ రాజు, రాణి ఏకాంత వాసం కోసం ఈ మేడ కట్టాడో తెలీదుగానీ.. ఈ మేడ యజమాని అందరినీ ఆశ్చర్య చకితులను చేశాడు. ఇంతకీ ఈ ఒంటిస్థంభం మేడ ఎక్కడ కట్టారో తెలుసా…పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో. ఈ వార్త ఆ నోటా ఈ నోటా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు తెలియడం.. ఆయన కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనై.. ఎవరక్కడ.. అత్యవసరముగా ఈ ఒంటి స్థంభపు మేడను కూల్చివేయుడీ! అని ఆజ్ఞాపించడం చక చక జరిగిపోయాయట.
దీన్నిలాగే ఉంచేస్తే వచ్చే రోజుల్లో ఇలాంటి మేడలు మరిన్ని ఎగసి.. ఎక్కడ ప్రమాదరకంగా మారుతుందో అన్న ఆందోళన కొద్దీ ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది చూశాక రెండు సెంట్లు ఇస్తానని చెప్పిన ఎపి సీఎం మనసు మార్చుకోరు గదా! ఏది ఏమైనా ఈ అరసెంటులో కట్టిన ఒంటి స్థంభపు మేడకి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంలో వింతేముంది.