విజయవాడ డ్రగ్స్ అడ్డానా? 9వేల కోట్ల హెరాయిన్ మిస్టరీ ఏంటి?
posted on Sep 20, 2021 12:57PM
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా. 9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత. యావత్ దేశం షాక్. ఇండియా ఉలిక్కపడింది. ఆ భారీ డ్రగ్స్ దందాలో విజయవాడ పేరు బయటకు రావడం మరింత కలకలం. ఆ 9వేల కోట్ల విలువైన డ్రగ్స్ విజయవాడకే సప్లై కానుందని తెలిసి ఆంధ్రప్రదేశ్ అవాక్కైంది. అదేంటి, మన బెజవాడకు 9వేల కోట్ల హెరాయిన్ తరలిస్తున్నారా? అంటూ ప్రజలంతా నోరెళ్లబెట్టారు. ఏపీ కేంద్రంగా ఇలాంటి డ్రగ్స్ దందా ఎప్పటి నుంచి జరుగుతోందోనని.. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ డ్రగ్స్ దందా ఎలా బయటపడిందంటే....
సుమారు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్. అఫ్ఘానిస్థాన్ నుంచి విజయవాడకు అక్రమంగా రవాణా అవుతోంది. ముఖానికి రాసుకునే పౌడర్ పేరిట కంటైనర్లలో తరలిస్తుండగా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్న ముంద్రా పోర్టులో డీఆర్ఐ, నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. ఏపీలోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ ఫర్మ్ అనే సంస్థ వీటిని బుక్ చేసుకుంది. కన్సైన్మెంట్లో తెల్పిన అడ్రస్ మేరకు విజయవాడలోని సత్యనారాయణపురం వెళ్లిన అధికారులకు అక్కడ ఓ ఇల్లు మాత్రమే కనిపించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్తో విజయవాడకు లింకులుండటం సంచలనంగా మారింది. ఇరాన్కు చెందిన రెండు నౌకల్లో భారత్కు వస్తున్న 2,988 కిలోల హెరాయిన్ను నిఘా పెట్టి గుజరాత్లో పట్టుకున్నారు. ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి.. బందరు పోర్టుకు దిగుమతి చేసుకొంటున్నట్లు తేలింది. 988 కిలోల చొప్పున కంటైనర్లలో వాటిని ముంబైకి చేర్చేలా దిగుమతిదారులు బుక్ చేసినట్లు గుర్తించారు. కంటైనర్లలో ఉన్న పౌడర్ను ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలించి హెరాయిన్ అని తేలాక ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు అఫ్ఘాన్ జాతీయులు ఉన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆశి ట్రేడింగ్ కంపెనీలో అధికారులు సోదాలు చేసి గోవింద రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
మరోవైపు అతిపెద్ద డ్రగ్ రాకెట్లో బెజవాడ ఏజెన్సీ, ఇక్కడి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఏపీ పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? గుట్కా మాఫియా పాత్ర ఉండొచ్చా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నార్కోటిక్ బ్యూరో ఇప్పటికే రంగంలోకి దిగిందని, ఎన్ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది.
సోలార్ ప్లేట్ల ఏర్పాటు పనుల పేరిట విజయవాడ సత్యనారాయణపురంలో ఆశి ట్రేడింగ్ కంపెనీని మాచవరం సుధాకర్ అనే వ్యక్తి ప్రారంభించినట్టు సమాచారం. కంపెనీని ఏర్పాటు ఇక్కడ జరిగినప్పటికీ కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా నడుస్తున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.