వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం

 

ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. "మన ఊరు - మాటా మంతి" పేరుతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సక్రమంగా పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఇంకా వారికి ఉన్న సమస్యలపై ఆరా తీశారు.  ప్రజలు చెప్పిన సమస్యలను తెలుసుకున్న పవన్ వాటి పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమానికి హాజరైన రావివలస గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి తెలుపుకునే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.