కిరికిరి కిషన్!
posted on May 22, 2025 2:48PM
.webp)
ఇంతవరకూ రాష్ట్రానికి ఏం చేశారో తెలీక పరేషాన్
ఇప్పటి వరకూ తెలంగాణకు ఒక కేంద్రమంత్రిగా కానీ, అంబర్ పేట్ ఎమ్మెల్యేగా గానీ, సికింద్రబాద్ ఎంపీగా గానీ కిషన్ రెడ్డి ఏం చేసినట్టు? అని గూగుల్ సెర్చ్ చేస్తే.. కనిపించే ఒకే ఒక్క ఆన్సర్.. ఆయన సీతాఫల్ మండీలో ఓపెన్ చేసిన ఒకే ఒక్క లిఫ్ట్. అంతకు మించి మరేం కనిపించదని అంటారు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రిగా కిషన్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంటన్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వరకూ అందరూ అడిగి చూశారు. నో ఆన్సర్. ఇక రాజాసింగ్ ని అడిగితే కిషన్ రెడ్డి కిరికిరిలన్నీ ఇట్టే బయట పెట్టేస్తారు. అధికారంలో ఎవరుంటే వారితో చెలిమి చేయడం కిషన్ రెడ్డికి కాషాయంతో పెట్టిన విద్యగా చెబుతాడాయన. దీంతో ఇదో దుమారం.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాకపోవడానికి కిషన్ రెడ్డి అతి పెద్ద కారణంగా చెబుతారు. మోడీ తో ఇంత సాన్నిహిత్యముండి.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. ఎందుకలా చేస్తారని అడిగితే అదంతే. అలా ఎప్పటికీ ఉండదంతే అంటారు కాంగ్రెస్ లీడర్లు. అదేమంటే రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందన్న ప్రెజంటేషన్లు ఇచ్చి మమ అనిపించేస్తారు కిషన్ రెడ్డి. ఇవి కాదు మీరు మీరేం చేశారో చెప్పాలని నిలదీస్తారు కాంగ్రెస్ లీడర్లు. మొన్నటికి మొన్న కాంగ్రెస్.. ఒక అఖిల పక్షం వేస్తే అందుకూ డుమ్మా కొట్టారు కిషన్ రెడ్డి. అదేమంటే తనకు లేటుగా తెలిసిందని తేల్చేశారు. ఇకపై ముందుగా చెప్పండి వస్తానని కవర్ చేశారు. ఈ మేనేజ్మెంట్ మెంటాల్టీ ఆయనకు తొలినాటి నుంచి ఉందని అంటారు.
దీనంతటికీ కారణమేంటి? ఒక యడ్యూరప్పలా ఇక్కడ కూడా కిషన్ రెడ్డి ఎందుకు ఎదగలేక పోతున్నారు? పార్టీని అధికారంలోకి ఎందుకు తేలేక పోతున్నారు? అని చూస్తే ఆయనకు అధికారంలో ఉండటం కన్నా ఇలా కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవితో.. రాష్ట్రంలో ఉన్నామంటే ఉన్నామన్న పాత్ర పోషించడమే చాలా చాలా ఇష్టమని అంటారు. రాష్ట్ర అధ్యక్ష పదవి గత కొంతకాలంగా ఖాళీ ఉందిక్కడ. ఈటలకు ఈ పోస్టు దాదాపు ఖరారైతే.. మోకాలడ్డేసిన ఘనత కూడా కిషన్ రెడ్డి పేరిటే లిఖించబడి ఉందని అంటున్నారు. ఒక వేళ ఈటల అధ్యక్షుడిగా వచ్చే ఎన్నికలకు వెళ్తే అదెక్కడ ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే వరకూ వెళ్తుందోనని.. తన పాత బ్యాచ్ మొత్తాన్ని పోగేసి కొత్త వ్యక్తి అధ్యక్షుడు కాకుండా కిషన్ రెడ్డి కిరికిరి చేసినట్టు చెప్పుకుంటున్నారంతా.
గతానికి వర్తమానానికి తేడా చూస్తే ఒకప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్కడిగా ఉన్న ఎమ్మెల్యే కాస్తా ఇప్పుడు 8 మంది వరకూ చేరింది. ఎంపీల సంఖ్య కూడా 8కి చేరింది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రాణింపు. ఇక గ్రేటర్ లో బండి హయాంలో 4 నుంచి సుమారు 50 వరకూ చేరింది. కానీ వీరిలో ఏ ఒక్కరిలోనూ మరొకరికి సఖ్యత ఉండదు. పాత కొత్త బ్యాచ్ లు వేరు వేరు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీల గ్రూపులు వేరు వేరు. ఇలా రకరకాల గ్రూపులుగా పార్టీ తయారయ్యి.. అదో కప్పల తక్కెడగా మారిందని సమాచారం. దీనంతటికీ కారణం కిషన్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్ వంటి వారు.
ఇక్కడ కూడా ఏపీలా ఒక కూటమి కట్టి.. ఎలాగైనా అధికారంలోకి రావచ్చని భావిస్తుంటే.. అందుకు మోకాలడ్డుతున్నది కూడా కిషన్ రెడ్డేనంటారు. కారణం ఇప్పటికే అక్కడ తమ జగన్ రెడ్డిని ఓడించిన కూటమి అంటేనే కిషన్ రెడ్డి కి కోపం చిరాకు. అలాంటి కూటమితో ఇక్కడా ఎన్నికలకు వెళ్లడమా? నథింగ్ డూయింట్ అంటున్నారట కిషన్ రెడ్డి. అదేమంటే రేవంత్ రెడ్డి.. టీడీపీ- బీజేపీ- జనసేన కూటమికట్టడాన్ని అడ్డుకుంటున్నట్టు ఒక రూమర్ వదిలి... నిందంతా ఆయనపైకి తోసేస్తున్నారట కిషన్ రెడ్డి.
అంటే రాష్ట్రంలో పార్టీ దానంతట అది మోడీ హవాలో ఓట్లు, సీట్లు సాధించడం తప్ప.. ఒక పద్దతి ప్రకారం.. అధ్యక్ష స్థాయిలో చేసిన కృషిని అనుసరించి తెచ్చిన విజయం కిషన్ రెడ్డి పేరిట ఒక్కటీ ఉండదని అంటారు.. కాలసాపేక్ష సిద్దాంతం.. అంటే పార్టీలో అధిక కాలం ఉండటం వల్ల వచ్చే పదవులను అనుభవించి అక్కడితో ముగిద్దాం అన్న ధోరణి తప్ప.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడాన్ని కిషన్ రెడ్డి పెద్దగా ఆస్వాదించరని తెలుస్తోంది.
కారణం అదే ఇతర పార్టీలు అధికారంలో ఉంటే వారితో లాలూచీ పడి.. అడ్డంగా సంపాదించుకోవచ్చు. ఎవరూ అడిగే వారుండరు. ఒక వేళ తమ పార్టీ స్వయానా అధికారంలో ఉంటే ఫోకస్ అంతా మన మీదే ఉంటుంది కాబట్టి.. ఆ ఊసే వద్దని అంటారట కిషన్ రెడ్డి. అలాంటి అవకాశం ఇతరులకు వచ్చినా.. దాన్ని తనకున్న పాత పరిచయాలతో ఎలాగోలా మేనేజ్ చేసి చెక్ పెట్టడంలో ఆరితేరిన నిపుణుడట కిషన్ రెడ్డి.
తన మొత్తం కెరీర్ లో కిషన్ రెడ్డి నేర్చుకున్న విద్యే ఇదేనట. పార్టీని అధికారంలోకి తెస్తే ఎంత? తేకుంటే ఎంత? అదే ఎవరు అధికారంలో ఉంటే వారితో కుమ్మక్కై నాలుగు రాళ్లు వెనకేసుకోక ఏంటీ చాదస్తమని మొహం మీదే అడిగేస్తారట కిషన్ రెడ్డి.
కిషన్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఏదైనా ఉందంటే అది ఇదేనంటారు. గతంలో ఇటు కేసీఆర్, అటు జగన్ తో బాగా దగ్గరయ్యి.. వారి ద్వారా కావల్సినంత వెనకేశారట కిషన్ రెడ్డి. అందుకే ఈ సారికి పార్టీ నుంచి పెద్దగా ప్రతిఘటన ఉండకూడదని చెప్పి పైన తనకున్న పలుకుబడితో అధ్యక్ష పదవి సాధించారట. అప్పుడే అనుకున్నారంతా.. ఈ సారి ఎన్నికలకు కిషన్ రెడ్డి అధ్యక్షతలో వెళ్లడం అంటే అది ఓటమిని కొని తెచ్చుకోవడమని.
ఇలా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయక, పార్టీకి ఏం చేయక.. అధికారంలోకి తెచ్చే దారిలేక.. ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఓర్చుకోలేక.. ఒకరంగా సైంధవుడి పాత్ర పోషిస్తున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు పార్టీలో.. అందుకే ఆయనకు కిరికిరి కిషన్ రెడ్డి అని పేరుపెట్టుకుని.. తమ అక్కసు మొత్తం తీర్చుకుంటున్నారట రాజాసింగ్ లాంటి కొందరు. మరి చూడాలి తనపై వస్తున్న ఈ ఆరోపణలకు కిషన్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారో. తెలాల్సి ఉంది.