సల్మాన్ ఖాన్ దోషి కానప్పుడు నష్టపరిహారం ఎందుకు చెల్లించినట్లు?

posted on: Dec 24, 2015 12:43PM

 

సల్మాన్ ఖాన్ కేసుపై బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయబోతోంది. ఈ కేసులో సరయిన సాక్ష్యాధారాలు లేనందున సల్మాన్ ఖాన్ న్ని నిర్దోషిగా ప్రకటించి, అతనికి దిగువ కోర్టు విధించిన ఐదేళ్ళ జైలు శిక్షని కూడా బోంబే హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోషి అని న్యాయస్థానంతో సహా అందరికీ తెలుసు. కానీ సల్మాన్ నిర్దోషి అని తేల్చి చెప్పింది. అతను నిర్దోషి అని తీర్పు చెప్పిన బోంబే హైకోర్టే ఈ కేసుపై విచారణ మొదలయినప్పుడు బాధితులకు నష్టపరిహారంగా కొంత సొమ్మును జమా చేయమని ఆదేశించింది. అంటే అతని వలననే ఆ ప్రమాదం జరిగిందని బోంబే హైకోర్టు నమ్మినట్లు అర్ధమవుతోంది. హైకోర్టు అదేశం మేరకు సల్మాన్ ఖాన్ మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 10 లక్షలు, గాయపడిన నలుగురుకి ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున కోర్టులో మొత్తం రూ.30 లక్షలు జమా చేసాడు. అంటే అతను కూడా నేరం ఒప్పుకొన్నట్లేనని అర్ధమవుతోంది.

 

ఒకవేళ అతని వలన ఆ ప్రమాదం జరగలేదని న్యాయస్థానం నమ్ముతున్నట్లయితే అతనిని నష్టపరిహారం చెల్లించమని అడిగి ఉండకూడదు. కానీ అడిగింది. అలాగే సల్మాన్ ఖాన్ తన వల్ల ఆ కారు ప్రమాదం జరుగలేదని నమ్ముతున్నట్లయితే, భాధితులకు నష్టపరిహారం చెల్లించి ఉండకూడదు. కానీ చెల్లించాడు. అతనిని నష్టపరిహారం చెల్లించమని హైకోర్టు ఆదేశించినపుడు, దానిని ఆయన చెల్లించినపుడే అతనే ఈ కేసులో దోషి అని ఖరారు అయిపోయింది. కానీ దిగువకోర్టు అతనికి శిక్ష కూడా విధించిన తరువాత అకస్మాత్తుగా అతను నిర్దోషి అయిపోయాడు!

 

బోంబే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయగా దానిలో జోక్యం చేసుకోవలసిన అవసరం కనబడటం లేదని సుప్రీం కోర్టు చెప్పడంతో ఇక సల్మాన్ ఖాన్ నిశ్చింతగా తన సినిమా షూటింగులు చేసుకొంటున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిశ్చయించుకోవడంతో మళ్ళీ సల్మాన్ ఖాన్ కి ఆదుర్ద మొదలవుతుంది. కానీ ఈకేసులో కలుగజేసుకొనేందుకు సుప్రీం కోర్టు మొదటే నిరాకరించింది కనుక మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళినా అది కూడా బోంబే హైకోర్టు తీర్పునే సమర్ధించే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.

 

దీనికి కొసమెరుపుహా చాలా ఆసక్తికరమయిన పరిణామం ఒకటి జరిగింది. నిఖిల్ వాగ్లే అనే ఒక జర్నలిస్ట్ ఈ కేసులో బాధితులు అందరికీ సల్మాన్ ఖాన్ చేత నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితమే బోంబే హైకోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం దాఖలు చేసారు. దానిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. సల్మాన్ ఖాన్ నిర్దోషి అని ప్రకటించిన తరువాత కూడా మళ్ళీ బోంబే హైకోర్టు ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించడానికి అర్ధం ఏమిటో న్యాయనిపుణులే చెప్పాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...