డ్రోన్ కెమెరాలు పని చేయకుండా జామర్లు!
posted on Mar 8, 2025 9:01AM

తిరుమల ఆలయ భద్రత విషయంలో తిరమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధి డ్రోన్ కెమేరాల నిషేధ ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఆ ఆరు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమేరాలు పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై భాగం నుండి విమానాలు హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆగమ శాస్త్ర విరుద్ధమనే కాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల పై భాగంలో విమానాలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని టిటిడి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే అదేమీ ఫలించలేదు. అంతే కాదు.. అలా విమానాల రాకపోకలను నియంత్రించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పేసింది. తిరుమల తిరుపది వేవస్థానం చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దిశగా మరో ప్రయత్నం చేశారు.
తిరుమలలో భద్రత దృష్ట్యా శ్రీవారి ఆయల పైభాగంలో విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణించకుండా దారి మళ్ళించాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి స్వయంగా లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనిపై సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక కేంద్రం నుంచి ఆ నిర్ణయం వచ్చేలోగా ఆలయ భద్రత దృష్ట్యా నిరంతర నిఘా ఉంచాలని బీఆర్నాయుడు టిటిడి విజిలెన్స్ వర్గాలను ఆదేశించారు.
అంతే కాకుండా ఆలయం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిని డ్రోన్ నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందు కోసం డ్రోన్ కెమేరాలు పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు సాంకేతిక సంస్థలతో సంప్రదింపులు జరిపారు. త్వరలో జరగనున్న టీటీడీ పాలకమండలిలో ఈ అంశంపై చర్చలు జరిపి యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.