పవన్ కళ్యాన్ పై పెదవి విరుపు మాటలు...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నేతలు ఒకరి తరువాత ఒకరు స్పందిస్తున్నారు. ఎవరెవరూ ఎలా స్పందిస్తున్నారో ఓ లుక్కేద్దాం..

 

మంత్రి గంటా శ్రీనివాసరావు..

 

ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం సీఎం చంద్రబాబుకి లేదని.. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రిగారు కృషిచేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.

 

కేశినేనినాని..

 

పవన్ కు నాపై ప్రేమ ఉంది.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నాపేరు తలుచుకుంటారు.. ప్రజలందరికీ నన్ను తన నోటి ద్వారా గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు అని అన్నారు. నాకు ఇంగ్లీష్ హిందీ వచ్చు.. తెలుగువారికి అర్ధం కావాలని పార్లమెంట్లో తెలుగులో మాట్లాడతా అని వెల్లడించారు. ఏపీలో ధర్నాలు, రాస్తా రోకోలు ఇక్కడ చేయడం కాదు..ఢిల్లీలో చేస్తే ప్రయోజం ఉంటుంది.. ప్రత్యేక హోదాపై పవన్ దగ్గర ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉంటే అతనితో కలిసి పోరాడతాం.. ఎంపీలందరూ ధనవంతులు కాదు.. కనీసం పీఏని కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు అని అన్నారు.

 

టీజీ వెంకటేశ్..

 

బీజేపీ ఆధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండేళ్లు అవుతుంది.. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు.. రెండేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయాడని..ఇప్పుడు లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని.. ఎంపీల‌పై ప‌వ‌న్ చేసింది చౌక‌బారు విమ‌ర్శ‌లని టీజీ వెంకటేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాలని సూచించారు. రాజకీయం చేయ‌డ‌మంటే నెల‌నెలా జీతం తీసుకున్న‌ట్లు కాదు.. ఇలాంటి వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించేవార‌ని ఆయ‌న అన్నారు.

 

డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో కదలిక తెచ్చినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ పోరాటం చేస్తామని, తమ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదని.. తాము సంవత్సరానికి ఒకసారి వేదికపైకి ఎక్కి హోదా గురించి మాట్లాడి మరో ఏడాది పాటు కనిపించకుండా వెళ్లిపోయే రకాన్ని కాదని అన్నారు. హోదా కోసం కేంద్రంపై అనునిత్యం ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu