మొరాకోలో ఘోర ప్రమాదం, 31మంది క్రీడాకారులు సజీవ దహనం

 

 మొరాకో దేశంలో చిబ్కా జిల్లాలో టన్-టన్ అనే పట్టణం వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ సహారా ప్రాంతంలో లయోన్ అనే పట్టణంలో జరుగబోయే జాతీయ క్రీడలలో పాల్గొనేందుకు రాజధాని రబట్ నుండి మొత్తం 31మంది యువ అథ్లెట్లు వారితో బాటు మరో ఇద్దరు శిక్షకులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. వారు పయనిస్తున్న బస్సును టన్-టన్ అనే పట్టణం వద్ద ప్రమాదకర రసాయనాలను తీసుకువెళుతున్న ఒక ట్రక్కు డ్డీకొనడంతో క్షణాలలో మంటలు చెలరేగి బస్సును కమ్ముకొన్నాయి. అందరూ చూస్తుండగానే కళ్ళ ముందే బస్సులో ఉన్న పిల్లలు అందరూ అగ్నికి ఆహుతయిపోయారు. బస్సులో ఉన్నవారు అందరూ 8 నుండి 14 ఏళ్ళలోపు వయసుగల చిన్న పిల్లలే కావడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగి పోయింది. తొమ్మిది మంది పిల్లలు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడగలిగారు. వారిని సమీపంలోని గ్యూలిమిం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.