సంకుచిత ధోరణులకి బలవుతున్న తెలుగు కీర్తి

  దేశ నాయకుల్నీ, స్వాతంత్ర సమర యోధులను, చివరకి దేవుళ్ళనీ కూడా కులాలవారిగా పంచుకకోగల సంకుచిత మనస్తత్వం పెరిగిపోయిన ఈరోజుల్లో ఒక కళాకారుడిని కళాకరుడిగా, ఒక రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడటం చాలకష్టం అని నిరూపిస్తోంది ఈ రోజు హైదరాబాదులో అల్వాల్ జరిగిన సంఘటన. తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిన మహానీయుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి కొందరు దుండగులు నిప్పుపెట్టారు.   ఆయన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడయి ఉండవచ్చును. గానీ, ఆయన తనను తానూ తెలుగు ప్రజలకి ప్రతినిధిగా భావించుకొన్నాడే తప్ప, తానో పార్టీకి, కులానికి, ప్రాంతానికి మాత్రమే చెందినవాడినని ఎన్నడూ అనుకోలేదు. తెలుగు బాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఆత్మగౌరవం, తెలుగు సినిమా ఇలా తెలుగు జాతికి చెందిన ప్రతీ అంశాలతో ఆయన అనుసంధానంమయ్యారు తప్ప, కులం, పార్టీలకు ప్రాధాన్యం ఈయలేదు.   ఆనాడు స్వర్గీయ పీవీ.నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తుంటే, ఒక తెలుగు వ్యక్తీ ప్రధానమంత్రి అవుతుంటే సాటి తెలుగువాడిగా మనం సహకరించాలి తప్ప అడ్డుపడకూడదు బ్రదర్ అంటూ ఆయనమీద తమ పార్టీ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టకుండా ఆయన ఎన్నికకు మార్గం సుగమం చేయడమే రామారావుగారి నిష్కల్మష హృదయానికి చక్కని ఉదాహరణ.   రాజకీయాలను, పార్టీలను, కులాల సంకుచిత పోరును, ప్రాంతీయ విద్వేషాలను పక్కన బెట్టి చూస్తే, ఆయనలో కల్మషం లేని ఒక నిజాయితీ పరుడయిన రాజకీయ నాయకుడు కనిపిస్తాడు. తెలుగు చిత్ర సీమలో నభూతో నభవిష్యతి అనదగ్గ మహా నటుడు మనకి కనిపిస్తాడు. తెలుగు బాషాపై ఎనలేని మమకారం గల బాషాభిమాని కనిపిస్తాడు. తెలుగు జాతి ఆత్మగౌరవం డిల్లీలో తాక్కటు పెట్టబడినప్పుడు విలవిలలాడిన ఒక సగటు తెలుగు వ్యక్తీ కనిపిస్తాడు.   మరి, అటువంటి వ్యక్తిని కూడా కొందరు కులం, ప్రాంతం, పార్టీ కళ్ళద్దాలలోంచి మాత్రమే చూడగల సంకుచిత దృష్టి కలిగి ఉండటం మన తెలుగు జాతి చేసుకొన్న దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. మన కోసం ఆరాట పడి, మనకొక గుర్తింపును తెచ్చిపెట్టిన మహనీయులను కూడా కుల, మత, ప్రాంత, పార్టీలకు చెందిన వారిగానే విడదీసుకొని ఈ విధంగా అవమానించుకోవడం, వారికి కాదు మనకే సిగ్గు చేటు.    మన తెలుగుదనం, మన జాతి గౌరవం, మన తెలుగు కీర్తిని ఈవిధంగా మనమే చేజేతులా నాశనం చేసుకొంటే, అసలు మనమెవరం? మన చరిత్ర ఏమిటి? మన గొప్పదనం ఏమిటి? అని మన ఉనికిని మనమే ప్రశ్నించుకోవలసిన ఆగత్యం ఏర్పడుతుంది.ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మన మొహం మీదనే పడినట్లు, మహానీయుల విగ్రహాలను ద్వంసం చేస్తే అది వారి మానసిక దౌర్భల్య స్థితిని బయటపెడుతుంది తప్ప ఆ మహనీయుల కీర్తిని ఇసుమంత కూడా తగ్గించలేదు.

నాగంపై తెరాస ఎదురు దాడి, ఇతర పార్టీ నేతలకు కనువిప్పు

  కేసీర్ మరియు ప్రొఫసర్ కోదండరాం తనను తెలంగాణా జేయేసీలోకి చేరనీయకుండా అడ్డుపడుతున్నారని, వారిరువురూ తెలంగాణా ఉద్యమాలను పక్కనపెట్టి వచ్చేఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశం గురించి మాట్లాడుతున్నారని, నాగం జనార్ధన్ రెడ్డి నిన్న తీవ్ర విమర్శలు చేశారు.   నిన్న గాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన మాజీ తెలంగాణా యన్.జీ.ఓ. నేత శ్రీనివాస్ గౌడ్ కు రాజకీయలలోను తెలంగాణా ఉద్యమాలలోనూ ఏమాత్రం అనుభవం, అవగాహన లేకపోయినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వోద్యోగుల మద్దతు పొందేందుకు అటు తెరాసలోకి, ఇటు తెలంగాణా జేయేసీలోకి సాదరంగా ఆహ్వానించి పెద్ద పీటవేసిన కేసీర్, సుదీర్గ రాజకీయ అనుభవం, తెలంగాణా ఉద్యమాల పట్ల పూర్తి అవగాహన, చిత్తశుద్ది ఉన్నతనను మాత్రం అంటరాని వాడినన్నట్లు దూరం ఉంచుతూ అవమానించడంతో నాగం ఆవేశంతో రగిలిపోతున్నారు.బహుశః అందువల్లే ఆయన కేసీర్, ప్రొఫసర్ కోదండరాంలపై ఈవిధంగా తీవ్ర విమర్శలు చేసి ఉండవచ్చును.   తమపై జనార్ధన రెడ్డి సందించిన నాగాస్త్రానికి తెరాస కూడా అంతే దీటయిన మరో అస్త్రంతో బదులిచ్చింది. ఆయన తెలంగాణా ఉద్యమంలో తెలుగు దేశం పార్టీ కోవర్టుగా పనిచేస్తునాడని తమకు తెలుసునని, అయినా ఉపేక్షిస్తున్నామని తెరాసకు చెందిన ఒక నాయకుడు అన్నారు.   కానీ, తెలంగాణా జేయేసీ అధ్యక్షుడు ప్రొఫసర్ కోదండరాం మాత్రం వేరే విధంగా స్పందించడం గమనార్హం. నాగం ఇంతవరకు తెలంగాణా జేయేసీలోసభ్యడు కాకపోయినప్పటికీ, ఆయనను తెలంగాణా జేయేసీలో జరిగే ప్రతీ సమావేశానికి కూడా తాము ఆహ్వానిస్తున్నామని, అయన కూడా వచ్చి పాల్గొంటున్నారని, తెలంగాణా జేయేసీలో అధికారికంగా సభ్యుడు కానంత మాత్రాన్న, అయనను దూరం పెట్టినట్లు భావించరాదని అన్నారు. త్వరలోనే ఆయనను తెలంగాణా జేయేసీలో సభ్యుడిగా తీసుకొనే అవకాశాలను పరిశీలిస్తామని ప్రొఫసర్ కోదండరాం అన్నారు.   ఇంతవరకు తానూ తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నానని భావిస్తున్ననాగం తెరాస చేసిన ఎదురు దాడితో కంగుతిన్నారు. తెలంగాణా ఉద్యమం కోసం తెలుగుదేశం పార్టీని విడిచి బయటకు వచ్చిన తనను తెరాస మెచ్చుకోకపోగా, ఇప్పుడు తెలంగాణాపై తన నిజాయితీనే ప్రశ్నించడంతో అది తెలంగాణాలో ఆయన ఉనికికి సవాలు విసిరినట్లయింది. దీనికి ఆయన ఏవిధంగా స్పందించినప్పటికీ, నాగం వ్యవహారంలో తెరాస వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన తెలంగాణా నేతలను కనువిప్పు కల్పిస్తుందని చెప్పవచ్చును. తమను తెలంగాణా ఉద్యమం కోసం పార్టీలు వీడి బయటకి రావాలని డిమాండ్ చేస్తున్న తెరాస, ఒకవేళ నిజంగా బయటకి వస్తే వారికి ఎటువంటి దుస్తితి కల్పిస్తుందో కళ్ళకి కట్టినట్లు చూపించింది. తద్వారా, ఇక తెరాస ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఇతర పార్టీల నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా మంత్రులు, శాసన సభ్యులు, యంపీలు తదితరులు పార్టీని వీడే దైర్యం చేయకపోవచ్చును.

నాగమన్నకు కోపమోచ్చే

  తెలంగాణా జేయేసీని తన పెరట్లో తిరిగే కోడిగా భావించే తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, ఆ విషయాన్నితన మనసులోఎన్నడూ దాచుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయనకు తగ్గటుగానే తెలంగాణా జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా, తెలంగాణా జేయేసీ అంటే తెరాస, తెరాస అంటే తెలంగాణా జేయేసీ అన్నట్లు, కేసీర్ ఆదేశానుసారం వ్యవహరించడం జరుగుతోంది. ఈ విషయంపై తెలంగాణా జేయేసీలో సభ్యపార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసాయి. అయినా కూడా, కేసీర్ ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరూ కూడా వాటిని పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు.   ఇక విషయానికి వస్తే, తెలంగాణ నగారా భేరీ నేత నాగం జనార్ధనరెడ్డి ఈ రోజు మొట్టమొదటిసారిగా బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ, వారిరువురూ కూడా ఉద్యమం గురించి కాకుండా ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న తనను తెలంగాణా జేయేసీలోకి చేరనీయకుండా కేసీర్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. అసలు తెలంగాణా ఉద్యమాల గురించి, తెలంగాణలో జరుగుతున్నబలిదానాల గురించి ఆలోచించకుండా, వారిరువురూ ఎన్నికల గురింఛి ఎందుకు ఆలోచిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.   అసలు నాగమన్నతనని తెలంగాణా జేయీసీలో జేరనివ్వనందుకు బాధపడుతున్నారా లేక వారిరువురూ ఉద్యమం పక్కదారి పట్టిస్తునందుకు బాధపడుతున్నారో తెలియదు గానీ,  (ఆ అక్కసుతో) ఆయన చేసిన ఆరోపణలతో తెలంగాణా జేయీసీ చేస్తున్న ఆలోచనలను మాత్రం బయటపెట్టారు.     ఆయన ప్రశ్నలకు వారిరువురూ సమాధానం ఇస్తారో లేదో తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ వదిలివచ్చి నాగమన్నకు ఇప్పుడు రెంటికీ చెడినందుకు బాధ మాత్రం మిగిలిపోయింది. పోనీ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోదామనుకొన్నా, ఇప్పటికే ఆయన చంద్రబాబు విషయంలో చాలా సార్లు నోరు జారారు. ఒకవేళ సిగ్గువిడిచి వెనక్కు వెళ్ళినా అక్కడ ఇదివరకటి గౌరవం దక్కదని ఆయనకీ తెలుసు.   అసలు తెరాస తనకు ఎర్ర తివాచీ పరిచి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తుందనే ఆలోచనతోనో, లేక భ్రమతోనో తెలుగుదేశం పార్టీని విడిచి బయటకి వస్తే, తనను తెరాసలో చేర్చుకోకపోతే పాయె, కనీసం తెలంగాణా జేఈసీలోకూడా చేరనీయకుండా అడ్డుపడటం నాగమన్ననకు మింగుడు పడటం లేదు.  ఆయన ఎంత చమటోడ్చి నగారా మ్రోగించినా తెలంగాణాలో వినేవారేలేకుండా పోయారు.   ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఆయన ఏ పార్టీకి చెందని అభ్యర్ధిగా మిగిలిపోయారు. ఇక తెలంగాణాలో మిగిలిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణాకు ఎలాగూ అనుకూలమే గనుక, ఆపార్టీకి నాగమన్నవంటి గెలుపు గుర్రం అవసరం కూడా ఉంది గనుక, ఎన్నికల ప్రకటన వెలువడేలోగా నాగమన్న ఆ పార్టీలో తేలే అవకాశం ఉంది.ఇది కూడా ఉద్యమంలోనే భాగమే అని ఆయన అంటే ఎవరూ నవ్వకూడదు సుమా.  

పొన్నాల కధ రేపటి ఎపిసోడ్ లో

  2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేవలం 236 ఓట్ల మెజారిటీతో జనగామ నుండి గెలుపొందారు. అయితే, తెరాసకు చెందిన ఆయన సమీప ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల కౌటింగ్ అధికారులను బెదిరించి తనకనుకూలంగా ఫలితాలు ప్రకటింపజేసుకొన్నారని ఆరోపిస్తూ, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించమంటూ హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ కేసు హైకోర్టు విచారణకొచ్చేసరికి పొన్నాల దాదాపు నాలుగు సం.లు పదవీ కాలం కూడా పూర్తి చేసేసుకొన్నారు. కేవలం మరో ఏడాది మాత్రం మిగిలి ఉన్నఈతరుణంలో, ఈరోజు ఆయన కేసును హైకోర్టు విచారణకు స్వీకరించడంతో తప్పనిసరిగా పొన్నాల కోర్టుమెట్లు ఎక్కవలసి వచ్చింది. దాదాపు రెండు గంటలపాటు ఇరుపక్షాల లాయర్ల మద్య జరిగిన వాదనలు విన్నతరువాత, న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.   ఈ కేసుపై స్టే కోరుతూ పొన్నాల గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోవలసిన విషయాన్నీ తన వద్దకు తెచ్చినందుకు కోర్టు ఆయనను మందలించింది. అప్పటికే ఆ కేసు విచారిస్తున్న హైకోర్టు ‘ఈవీయం మెషిన్ల’ను తన అధీనంలో ఉంచుకొంది. ఈ రోజు వాదనలు పూర్తయినందున, బహుశః రేపు హైకోర్టు ఈవీయం మెషిన్లలో రికార్డ్ అయిన ఓట్లను మళ్ళీ లేక్కించమని ఆదేశిస్తే, పొన్నాలకు ఎన్ని ఓట్లు పడిందీ స్పష్టమయిపోతుంది.   ఒకవేళ ఇప్పుడు కూడా 236 ఓట్ల మెజారిటీ ఉన్నట్లు నిరూపితం అయితే పరువలేదు. కాని పక్షంలో, ఆయనకి పదవి పోవడమే కాకుండా, మోసానికి పాల్పడినందుకు, మోసపూరితంగా పదవిలో కొనసాగి రాజ్యాంగ అతిక్రమణకు పాల్పడినందుకు కొత్త కేసులు మెడకు చుట్టుకోక తప్పదు. అదే జరిగితే, ఇంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆయనకు, వచ్చే ఎన్నికలకు పోటీ చేసే అవకాశం కూడా కోల్పోవచ్చును.   ఆయన ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మీడియావారితో మాట్లాడుతూ , పొన్నాల మోసానికి పాల్పడకపోయి ఉంటే, ఆనాడే మళ్ళీ రీకౌంటిగ్ కు అంగీకరించేవారని, కానీ ఓడిపోయినందునే ఈ విధంగా మోసానికిపాల్పడటమేకాక, ఇంతకాలంలో మంత్రిపదవిలో కొనసాగి మరో తప్పు చేసారని ఆరోపించారు.   ఇంతకీ పొన్నాల దోషా? నిర్దోషా? ఆయన మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా? దోషి అనితేలితే ఆయన పదవికి రాజీనామా చేస్తారా లేక సుప్రీం కోర్టుకు వెల్లి మిగిలిన ఏడాది కాలం కూడా లాగించేస్తారా? వంటి ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే ‘పొన్నాల ఎన్నిక’ సీరియల్ రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే.

ఇక అంత ‘ములాయం’గా ఉండను స్మీ!

  ఇంతకాలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్న సమాజ్ వాదీ పార్టీనేత ములాయం సింగ్ యాదవ్, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే మధ్యంతర ఎన్నికలు రానున్నాయని మొన్న అకస్మాత్తుగా ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచారు. తన ప్రకటనకు కొనసాగింపుగా మళ్ళీ స్వయంగా ఈ రోజు మరింత వివరణ ఇవ్వడంతో ‘ఆయన ఆవిధంగా ఎందుకు అన్నారని రాజకీయ విశ్లేషకులు కధనాలు అల్లే శ్రమ తప్పింది.   ములాయం సింగ్ లక్నోలో మీడియావారితో “అసలు కాంగ్రెస్ పార్టీకి మద్దతునీయడమే ఒక బుద్ది తక్కువ పని. ఆనాడు, భారత్-అమెరికా అణు ఒప్పంద బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు మేము ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. తనకి మద్దతు ఇస్తున్న మా మీదనే కాంగ్రెస్ పార్టీ సీబీఐను ప్రయోగించి చాలా ఇబ్బందులు పెడుతూ, మమ్మల్ని లొంగదీసుకొని మా మీదనే సవారీ చేయాలని చూస్తోంది.   కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ కుటుంబానికి తప్పవేరెవరికీ చోటు లేదు. అయినప్పటికీ, రాహుల్ గాంధీకి కానీ, ప్రియాంకా గాంధీకి గానీ ప్రజల్లోఎక్కడా ఆదరణ లేదు. వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదు. ఎన్నికల తరువాత మూడవ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ చేతినుడి ప్రభుత్వ పగ్గాలు గుంజుకోవడం కూడా అంతే ఖాయం,” అని అన్నారు.   ఆయన ఈ కొత్త పల్లవి అందుకోవడానికి కారణం ఏమిటంటే, కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆయన అక్రమాస్తుల పైన, తన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ అక్రమాస్తులపైనా మరియు అతని తమ్ముడి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీతో ఇంతవరకు ఆయన చేసిన సంధి ప్రయత్నాలు విఫలమయి, ఇక నేడో రేపో సీబీఐ దర్యాప్తు మొదలు కావడం తధ్యం అని గ్రహించిన తరువాత, సహజంగానే ఆ అక్కసు ఈ రూపంలో బయటపడింది. ఈ ప్రకటన, ఈ ఆరోపణలు దాని ఫలితమే.   తన అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు కేంద్రం చక్రం అడ్డువేసి ఉంటే, అప్పుడు ఆయన ఎటువంటి ఆరోపణలు చేసి ఉండేవారు కాదు. సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన ఆయన కేసుల వ్యవహారంలో కలుగజేసుకోవడం కష్టమే కాక ఆ ప్రయత్నం కొత్త సమస్యలను కూడా తెచ్చిపెతటే అవకాశం ఉందని తెలుసు గనుకనే కాంగ్రెస్ ఈ వ్యవహారంలో వ్రేలు పెట్టలేదు. తద్వారా, ఎన్నికల సమయానికి ములాయం సింగ్ మరింత ఇరకాటంలో పడినట్లయితే, ఎన్నికలలో లాభపడవచ్చునని మరో ఆలోచన కూడా చేసిన కాంగ్రెస్ పార్టీ సీబీఐను ముందుకు సాగనిచ్చింది.   అదే జరిగితే, తానూ కాంగ్రెస్ వ్యతిరేఖ రాజకీయ పార్టీలను పోగేసి మూడో ఫ్రంటు కడతానని ములాయం కూడా హెచ్చరిక జారీ చేసాడు. అయితే, అటువంటి తాటాకు చప్పుళ్ళకి కాంగ్రెస్ భయపడితే ఇంతకాలం అధికారంలో ఉండ గలిగేదే కాదు.   కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబానికి తప్ప వేరే ఎవరికీ చోటు లేదని విమర్శించిన ఆయన, తన ముఖ్యమంత్రి పీఠాన్నితన కొడుకు అఖిలేష్ యాదవ్ కు అప్పగించినప్పుడు మాత్రం ఆ సూత్రం తనకి వర్తించదని భావిన్చడం విడ్డూరం. అధికారంలో ఉనంతకాలం అవినీతికి పాల్పడి, అక్రమాస్తులు పోగేసుకొని తన జోలికి ఎవరూ రాకూడదనుకొనే ములాయం వంటి నేతలకి మనదేశంలో కొదవలేదు. ఆస్తులు, అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయాలలో ఇటువంటి ములాయములు అందితే జుట్టు లేకపోతె కాళ్ళు పట్టుకొంటూ, పైకి మాత్రం ప్రజాసేవ గురించి గంభీర ఉపన్యాసాలు ఇస్తుంటారు. అటువంటి వారిని, తన ప్రభుత్వం నడవడం కోసం ఇంత కాలం వెనకేసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా నిందించక తప్పదు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కొత్త ఆలోచన?

  రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ కేంద్రం నెత్తిన వ్రేలాడిన ‘జనవరి 28’ కత్తిని ‘రోజంటే రోజూ కాదూ...నెలంటే నెలా కాదూ’ అంటూ పాడి అలవోకగా తీసి ప్రక్కన పడేసిన తరువాత, కాంగ్రెస్ పార్టీ గుండెల మీదనుంచి పెద్ద భారం దింపుకొన్నంత సంతోషపడింది. అప్పటి నుండి, ఇక ‘జనవరి 28’ వంటి మాటలు మాట్లాడకుండా, బుద్ధిగా, ప్రశాంతంగా రాష్ట్ర విభజనపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గవర్నర్ నరసింహన్, మాజీ ముఖ్య మంత్రి రోశయ్యలను డిల్లీ రప్పించుకొని, వారితో సలహా సంప్రదింపులు చేస్తోంది.   ఆ విధంగా చేయడంవల్ల ఒకవైపు తెలంగాణా సమస్యకి పరిష్కారం వెతకడమే కాకుండా, రాష్ట్రంలో తమ తెలంగాణా కాంగ్రెస్ నేతలకు భరోసా కూడా ఇవ్వగలుగుతోంది. ఇక తరువాత అంకంలో రాష్ట్రం లో మూడు ప్రాంతాల నాయకులతో చర్చల ప్రక్రియ మొదలుపెట్టి, ఎన్నికల వరకు లాగించగలిగితే, ఇక అప్పుడు తాడో పేడో తేలుస్తూ ఒక నిర్దిష్ట ప్రకటనతో ఎన్నికలలో అనుకూల ఫలితాలు రాబట్టుకోవచ్చును అని కాంగ్రెస్ ఆలోచన అయిఉండవచ్చును.   ఈ అంచనా ప్రకారం, మళ్ళీ చర్చల ప్రక్రియ బడ్జెట్ సమావేశాల తరువాత మొదలుపెడితే, వాటితో ములాయం సింగ్ ప్రకటించినట్లు మధ్యంతర ఎన్నికలు వచ్చే సెప్టెంబర్ నెలవరకు లాగించేయవచ్చును. ఇక ఒకసారి ఎన్నికల గంట మ్రోగిన తరువాత, ఏ రాజకీయ నాయకుడికయినా పార్టీ టికెట్ గురించి తప్ప తెలంగాణా గురించి ఆలోచించే ఓపిక ఉండవు. గనుక, అప్పుడు కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా కూడా తప్పనిసరిగా వారు ఆమోదించడమే గాక, ఆ నిర్ణయాన్ని ప్రజల చేత కూడా ఆమోదింపజేసుకొనే బాధ్యత కూడా సదరు పోటీదారుపైనే ఉంటుంది.   ఇక, జాతీయ మీడియా వండివార్చిన తాజా కధనాల ప్రకారం, కేంద్రం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కన్నా, రాష్ట్రంలో ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా మూడు ప్రాంతాలకు వేర్వేరు అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసి, వాటికి తగినన్ని అధికారాలు, నిధులు సమకూర్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కనీసం 10 నుండి 15 సం.ల కాల వ్యవధిని నిర్ణయించి, ఆలోగా మూడు ప్రాంతాలలో జరిగిన అభివృధి ఆధారంగా, రాష్ట్ర విబజన అవసరమా కాదా అని నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. అప్పటికీ తెలంగాణావాసుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక బలంగా ఉంటే అప్పుడే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.   అయితే, ఈ విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు సమర్దించలేదు, అలాగని ఖండించలేదు. ఏమి చేసినా దానికి ఏదో ఒక వైపు నుంచి ఊహించని రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది గనుక, మీడియాని తనకు నచ్చినట్లు ఊహించుకొని వ్రాసుకొనే సౌకర్యాన్నికల్పించింది. డిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి, గవర్నర్ కాంగ్రెస్ అధిష్టానంతో తాము ఏమి మాట్లాడారో చేపుతారని ఊహించడం అడియాసే అవుతుంది.   ఇక ఏదయినా క్లూ దొరికితే అది బొత్స సత్యనారాయణ నుండే దొరకాలి. ఆయనని మీడియా నోరు జారేలా చేయగలిగితేనే కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఉన్న ఆలోచనలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే, అంతవరకూ ఎవరికి తోచిన ఊహాగానాలు, విశ్లేషణలు, భాష్యాలు చెప్పుకొంటూ కాలక్షేపం చేయడమే.

సారధి కోసం సమరం

  కాంగ్రెస్ పాలనపట్ల ప్రజలలో వ్యతిరేఖత పెరుగుతున్నపటికీ, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అందివస్తున్నఆ అవకాశాన్నిసద్వినియోగపరుచుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ, ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎవరిని ప్రకటించాలి? అనే సందిగ్ధంలోపడి, అందివస్తున్న అవకాశాన్నివదిలిపెట్టి, అంతః కలహాలలోములిగి తేలుతోంది. వచ్చేఎన్నికలలోపార్టీని గెలిపించుకోవడమే ప్రధానం అని గ్రహించక, పార్టీకి ఎవరు సారద్యం వహించాలని అనే అంశంపై పార్టీ నేతలు ముఠాలుగా విడిపోయి వారిలో వారే కలహించుకొంటున్నారు. పార్టీలో ఉన్నసీనియర్లు మోడీ అనుకూల, వ్యతిరేఖ వర్గాలుగా చీలిపోయి, శత్రువుల మీద దూయవలసిన కత్తులను తమ స్వంత మనుషులమీదే దూసుకొంటూ, అందరికీ చులకనయిపోయారు.   వచ్చే ఎన్నికలలో పార్టీని ఖచ్చితంగా గెలిపించగలమని ప్రధాని రేసులో ఉన్న ఏఒక్కరూ చెప్పలేకపోతున్నా పార్టీకి నాయకత్వం వహించేందుకు మాత్రం అందరూ తహతహలాడుతున్నారు. వారి ఆరాటం చూసి అందని ద్రాక్షలకోసం అంత పోటీలెందుకు? అని కాంగ్రెస్ పార్టీ హేళన చేసింది.   గుజరాత్ లో నరేంద్ర మోడీ మూడోసారి వరుసగా గెలిచినప్పుడు దేశమంతా మోడీ జపం మొదలు పెట్టింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు భారతీయజనతా పార్టీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుకొన్నాయి. ఆ పార్టీకి ఊహించని విధంగా ప్రజల నుండి సానుకూల స్పందన కనిపించినప్పటికీ, కనీసం దానిని సైతం సద్వినియోగపరుచుకోలేకపోయింది.   తమ పార్టీ నాయకత్వ సమస్యను తీర్చమంటూ ఒకసారి సంఘ్ పరివార్ వద్దకి, మరో మారు శివసేన దగ్గరికీ, ఇంకోసారి విశ్వహిందూ పరిషత్ దగ్గరికీ అక్కడి నుండి వారు చూపించిన సాధుసన్యాసుల దగ్గరికీ పరుగులు తీస్తుంటే, ప్రజలు నవ్వుకొంటున్నారు. తమ నాయకుడినే తామే స్వయంగా నిర్ణయించుకోలేని ఆ పార్టీ రేపు అధికారం కట్టబెడితే, విధాన నిర్ణయాలు ఎలా తీసుకోగలదు? దేశాన్ని ఎలా పరిపాలించగలదనే అనే ప్రశ్నలు తలఎత్తుతున్నాయి.   మరో వైపు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడయిన రాహుల్ గాంధి సారధ్యంలో ఎన్నికలకి వెళ్లేందుకు సన్నధం అవుతుంటే, అతనిని డ్డీ కొనగల నాయకుడని నిరూపించుకొన్న నరేంద్ర మోడీ పేరు ప్రకటించడానికి కూడా భారతీయజనతా పార్టీకి దైర్యం చాలట్లేదు. కారణం పార్టీలో లుకలుకలు!   అద్వానీకి ప్రధాని పదవి ప్రతీసారి చేతికి అందినట్లే అంది చేజారిపోతోంది. అందువల్ల 85 సం.ల వయసులోఉన్నఆయన జీవితంలో ఇదే ఆఖరి అవకాశం. గనుక, ఆయన తాపత్రాయం ఆయనది. తన నాయకత్వంలో, రాహుల్ గాంధీ వంటి యువకుడిని ఎదుర్కొని, దేశం మొత్తం మీద పార్టీని గెలిపించగలననే నమ్మకం ఆత్మవిశ్వాసం ఆయనలో ఉంటే, మోడీయే కాదు పార్టీలో ఎవరూ కూడా అభ్యంతరం చెప్పే అవకాశం ఉండేది కాదు. పార్టీని ఎన్నికలలో గెలిపించడం అంత తేలికయిన పని కాదని, అది తన వయసుకు మించిన పని అని ఆయనకీ తెలుసు. అయినా కూడా, పార్టీకి నాయకత్వం వహించి తన చిరకాల వంచ నెరవేర్చుకోవాలని తాపత్రాయపడుతున్నారు.   అయితే, ఎన్నికలలో అసలు పార్టీ గెలవకపోతే మరో ఐదు సం.లు ప్రతిపక్షంలో కూర్చోవడం మంచిదా? లేకపోతే, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, సగౌరవంగా పక్కకు తప్పుకొని మోడీ వంటి సమర్దుడయిన నాయకుడి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టడం మంచిదా? అని ఆ పార్టీలో అందరూ తమని తాము ప్రశ్నించుకోవలసిన తరుణం ఇది. ప్రజల అభీష్టం మేరకు నడుచుకొంటే అధికారం చేతికి వస్తుంది.   సాధువులు, సంఘ్ పరివార్లు అభీష్టం మేరకు నిర్ణయం తీసుకొంటే మరో ఐదేళ్ళు ప్రశాంతంగా ప్రతిపక్షంలో కూర్చొనే అవకాశం దక్కుతుంది. పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంపై చర్చలు చేయడం కన్నా ముందు, అసలు పార్టీని వచ్చే ఎన్నికలలో గెలిపించుకోవాలా వద్దా అని ఆలోచించుకొంటే, నాయకత్వ సమస్య కూడా తీరిపోతుంది.

బొత్స ప్రకటన మతలబు ఏమిటి?

  ఉప్పు పప్పులా కలిసిపోయున్న కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్య ఉన్న అనుబంధాన్ని నిర్వచించడం కొంచెం కష్టమే. జగన్ మోహన్ రెడ్డిని జైల్లో ఉంచిన కారణంగా ఆ రెండు పార్టీలు రెండూ బద్ధ విరోధులని సూత్రీకరిద్దామనుకొంటే, జగన్ సానుభూతిపరుల సహాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తున్నవిషయం, రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసిన విషయాలు అందుకు అడ్డంకిగా నిలుస్తాయి. పోనీ మిత్రులుగా పరిగణిద్దామంటే, జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల 9మంది శాసన సభ్యుల బహిష్కరణవంటి అంశాలు వారు మిత్రులుకారని ఋజువు చేస్తాయి. ఇంతకీ వారు, మిత్రులా లేక శత్రువులా అనేది (రానున్నఎన్నికల) కాలమే నిర్ణయిస్తుంది.   గానీ, వారిరువురు ఒకరినినొకరు ద్వేషించుకొంటూ, లోలోన ప్రేమించుకొంటూ తప్పని పరిస్థితుల్లో ఒకే పడవలో పులీ మేకలా ముందుకు (ఎన్నికల తీరం వైపు)పయనిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ దీపం కొడిగట్టకుండా ఉండాలంటే, జగన్ మోహన్ రెడ్డి విధేయుల మద్దతనే తైలం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరి. అందువల్ల, వారిని వదులుకోలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. పక్కలో పామముందని తెలిసినా దానిని ఏమిచేయలేని అసహాయత కాంగ్రెస్ పార్టీది. గానీ, మొన్న పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒకేసారి 9మంది జగన్ అనుచరులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నానని సంచలన ప్రకటన చేయడంతో, కాంగ్రెస్ ఏదో ఆలోచనతోనే ఆ పని చేసిందని అనిపిస్తోంది. గానీ, ప్రకటన చేసిన మూడు నాలుగు రోజులయినా కూడా దానిని అమలు చేయాడానికి మీనమేషాలు లెక్కించడం చూస్తే, కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశ్యం వారిని బయటకి సాగనంపడం కాక మరేదో ఉందని అర్ధమవుతుంది.   ఇంతవరకు, జగన్ మోహన్ రెడ్డి ని జైలు నుండి విదుదల చేయకపోయినా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కానీ, అటు వైపు నుండి ఇంతవరకు సానుకూల ప్రతిస్పందన కనబడలేదు. పైగా, మున్ముందు కాంగ్రెస్ పార్టీయే తమపై ఆధారపడకతప్పదన్నట్లు సాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు, కాంగ్రెస్ పార్టీకి అసహనం కల్గించడం సహజమే. ఒకవేళ ఇప్పటికీ తమతో పొత్తులకు ఇష్టపడని పక్షంలో ఇక ఆ పార్టీతో పూర్తిగా తెగ తెంపులు చేసుకొనడానికి కూడా వెనకాడమనే హెచ్చరికగా బొత్స సత్యనారాయణ ఇటువంటి ప్రకటన చేసి ఉండవచ్చును.   కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపకపోతే జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కావడం కూడా కష్టమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి విడుదల కోరుకొంటే, ఎన్నికల పొత్తుల గురించి సానుకూల ప్రకటన చేసితీరాలి. అప్పుడు, ఈ బహిష్కరణ తంతు కూడా ఎప్పటిలాగానే స్పీకర్ వద్ద నిలిచిపోతుంది. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తులు, జగన్ విడుదల అవసరం లేదనుకొంటే బొత్స సత్యనారాయణ ప్రకటనను, త్వరలో స్పీకర్ నిజం చేసి చూపిస్తారు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఈ ‘గ్రేస్ పీరియడ్’ ను సద్వినియోగం చేసుకొంటుందా లేదో చూడాలి.   కానీ వారి వాలకం చూస్తే, ఈరోజు కాకపొతే రేపయిన కోర్టులు జగన్ మోహన్ రెడ్డిని జైలు నుండి బెయిలు పై విడుదల చేస్తాయి గనుక, ఇటువంటి తరుణంలో తమకి కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన అవసరంలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేత సబ్బం హరి ఇటీవలే స్పష్టం చేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ జగన్ అనుచరులను బహిష్కరించుకొంటుందో, లేక మళ్ళీ నిసిగ్గుగా వారి అండతోనే మిగిలిన ఏడాది కాలక్షేపం చేసేస్తుందో చూడాలి.

బాబుకి ఎన్నికలు ఎదుర్కొనే దైర్యం లేకనే...అలా! పేర్ని నాని

  బాబుకి ఎన్నికలు ఎదుర్కొనే దైర్యం లేకనే...అలా! పేర్ని నాని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టే అనేక మంది నాయకుల్లో పేర్ని నాని కూడా ఒకరు. అయితే, మిగిలిన వారిలా కాకుండా దైర్యంగా పార్టీకి రాజీనామా చేసేసి(స్పీకర్ ఇంకా ఆమోదించలేదు గనుక, ఆయన ఇంకా కాంగ్రెస్ శాసనసభ్యుడే) వైయస్సార్ కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి ఆయన. సాక్షి న్యూస్ లో ప్రసారమయిన ఆయన ఇంటర్వ్యు వివరాలు:   నేను ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా ఉన్నపటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాను. సాంకేతికంగా అ పార్టీలో చేరలేదు తప్ప, ఆ పార్టీ సభ్యులమనే భావన నాకు, నా అనుచరులకు ఎప్పటినుంచో ఉంది. ఆ పార్టీ జెండా పట్టుకొని నేను నా అనుచరులు కూడా చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాము. వచ్చే నెలలో మచిలీపట్నంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి వైయస్.విజయమ్మ సమక్షంలో మేమందరమూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరడం కేవలం లాంచనప్రాయమే.   కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం పనిచేసాను గనుక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకి మద్య ఎటువంటి తీవ్ర విబేధాలున్నాయో నాకు బాగా తెలుసు. మొన్న, బొత్స సత్యనారాయణ 9మంది శాసనసభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు చేసిన ప్రకటన, కిరణ్ కుమార్ రెడ్డిని ఇబ్బందులు పెట్టడానికే చేసారని నేను భావిస్తున్నాను.   ప్రతిపక్ష నేతగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించట్లేదంటే, కిరణ్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ప్రభుత్వాన్ని పడగొడితే ప్రస్తుతం ఆయన పార్టీ ఎన్నికలను ఎదుర్కోలేమనే ఆలోచనతోనే వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు వెంటనే ఎన్నికలోస్తే గెలుస్తామనే నమ్మకం ఆయనలో లేనందునే, మెజార్టీ కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ఆయన వెనకడుగు వేస్తున్నారు. అదిగాక, ఆ రెండు పార్టీలకి మద్య ‘జగన్ మోహన్ రెడ్డిని వీలయినంత కాలం జైల్లో ఉంచాలనే రహస్య అవగాహన’ కూడా అందుకు అడ్డుపడుతోందని భావిస్తున్నాను. జగన్ మోహన్ రెడ్డిని వీలయినంతకాలం జైలుకే పరిమితం చేసి, రాష్ట్రంలో ఆ రెండు పార్టీల పరిస్థితులు మెరుగుపడిన తరువాత వారు ఎన్నికలకు వెళ్లాలని కోరుకొంటున్నారని భావిస్తున్నాను.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలాగు అధికారంలోకి రాలేనని గ్రహించడంవల్లనే గ్యాస్, కరెంట్ సర్ చార్జీలు పెంచుకొంటూ పోతోంది. నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరాను గాబట్టి, నా మీద పగతో నేను ప్రాతినిద్యం వహిస్తున్న కృష్ణా జిల్లా ప్రయోజనాలు దెబ్బతీయాలని కిరణ్ కుమార్ రెడ్డి, అతని ప్రభుత్వం గానీ ప్రయత్నిస్తే వచ్చే ఎనికల్లో కుక్క చావు చచ్చినట్లు, ప్రజలచేతుల్లో ఘోరంగా దెబ్బ తింటారని వారిని హెచ్చరిస్తున్నాను.

తెదేపా తెరాసాలు మళ్ళీ దగ్గరవుతున్నాయా?

  గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడుతున్న తెరాస నేతలు, పొరపాటున కూడా తమ ప్రసంగంలో తెలుగుదేశం పేరు ఎత్తట్లేదిప్పుడు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొనే ఆ రెండు పార్టీల నేతలు గత కొద్ది రోజులుగా, కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారే తప్ప, గత నెలరోజులుగా ఒకరినొకరు ఇదివరకులా తీవ్రవిమర్శలు చేసుకోవట్లేదు. అంటే, వారి మద్య మళ్ళీ స్నేహ పరిమళాలు విరజిమ్మే విరజిమ్మే సమయం వచ్చినట్లు భావించవచ్చును.   చంద్రబాబు పాదయాత్రలోకూడా తెరాస ప్రసక్తే లేదిప్పుడు. ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఈ తరుణంలో తెరాస ప్రసక్తి తెచ్చి, సమైక్యవాదులకు తమ పార్టీ తెలంగాణా అనుకూల వైఖరిని గుర్తుచేసి కోరుండి కొరివితో తల గోక్కోవడం ఎందుకని ఆయన మౌనం వహిస్తున్నారని అనుకొన్నా, ఈ రోజు (శుక్రవారం) తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సహకార ఎన్నికలలో తెరాస పార్టీకి తమ పార్టీ బేషరతుగా పూర్తీ మద్దతు ఇస్తుందని చేసిన ప్రకటన (చంద్రబాబు వెంటనే ఖండించినప్పటికీ) ఆ రెండు పార్టీలు మళ్ళీ ఎన్నికల పొత్తులకి ఆలోచిస్తున్నాయని తెలియజేస్తోంది.   తెలంగాణా ఇచ్చేమాటయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేసేందుకు అయిష్టంగానే సిద్దపడుతున్నఆ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుండా ఇప్పుడు ఆపగలిగితే, అటు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపడకుండా నిరోదించడమే గాకుండా, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ఒంటరిచేసి, అటు తెలుగుదేశం, ఇటు తెరాస కూడా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు కాపాడుకొనే అవకాశం ఉంది. తద్వారా తెరాస తన ఉనికిని తానూ కాపాడుకోవడమే గాకుండా, కాంగ్రెస్ పార్టీతో కలవకుండానే తెలంగాణా సాదించుకొనే అవకాశం ఉంటుంది కూడా. ఇక, తెరాస, తెదేపా చేతులు కలిపితే, తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.   కానీ, తెలంగాణాలో ఎవరి సాయం లేకుండా స్వంతంగా గెలవగల సత్తా ఉన్న తెరాస పార్టీ, తెలుగు దేశం పార్టీతో ఎందుకు పొత్తులు పెట్టుకోవాలి? పెట్టుకొని ఆ పార్టీకి తెలంగాణాలో అనవసరంగా వాటా ఎందుకు పంచాలి? అని ఆలోచిస్తే, జాతీయ స్థాయి రాజకీయాల గురించి చెప్పుకోవలసి వస్తుందిప్పుడు.   కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనంచేసి తమ ఉనికి కోల్పోవడం కంటే, వందరోజుల్లో తెలంగాణా ఇస్తామని నిర్ద్వందంగా చెపుతున్న భారతీయ జనతాపార్టీ ని నమ్ముకోవడమే మంచిదని తెరాసా ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే, తప్పనిసరిగా దానికి ప్రత్యమ్నాయంగా ఉన్న భారతీయ జనతాపార్టీతో తెదేపా మళ్ళీ చేతులు కలపక తప్పదు. అంటే, ఎన్డీయేలో తెదేపా, తెరాస ఇద్దరూ భాగస్వాములు కాక తప్పదు. అప్పుడు, తెలంగాణా ఏర్పాటులో తెరాసకు చంద్రబాబు అవసరం ఉండవచ్చును.   అందువల్ల, వచ్చే ఎన్నికలలో, విజయవంతమయిన నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపితే, లాభమే తప్ప నష్టం లేదు గనుక ఇప్పటి నుండే తెదేపా, తెరాస పార్టీలు  రెండు పార్టీలు కూడా  క్రమంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తునాయనుకోవచ్చును.   అప్పుడు, ఇక తెలుగుదేశంపార్టీ సీమంద్రా ప్రాంతంలో ‘రెండు కాంగ్రెస్ పార్టీలని’ లేదా ‘రెండూ కలిసిపోయిన కాంగ్రెస్’ పార్టీని ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశం గురించి మాత్రమే ఆలోచించుకోవలసి ఉంటుంది. ఇటు తెరాస, తెదేపాలు చేతులు కలిపితే, అటు 'రెండు కాంగ్రెస్ పార్టీలు' చేతులు కలిపే అవకాశం కూడా ఉంది.   అయితే, ఈ లెక్కలు ఏ నిమిషంలోనయినా, ఏ కారణం చేతనయినా మారవచ్చును. ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత మాత్రమే అన్ని పార్టీల అంతరంగాలు బయటపడతాయి. అంతవరకు ప్రజలను మభ్య పెట్టేందుకు ఒకరినొకరు తిట్టుకొంటూ వారికి కాలక్షేపం కలిగిస్తుంటారు.

Why did Sarad Pawar woke up for Telangana?

  The Nationalist Congress party president and member of UPA alliance, Sarad Pawar, as if woke up from his sleep knocks PM Dr.Manmohan Singh’s doors to explain him about the urgency of granting Telangana state formation. He stressed PM to take immediate decision on Telangana issue. Later speaking to media he also spoke about the Vidarbha state demand in Maharashtra and said that he has no objection for carving Vidarbha state. Then, he says he would like to retire from politics to give way to younger generation.   There are some interesting reasons underlying his sudden demand for Telangana. Although, his NCP plays vital role in UPA government, back at home in Maharashtra, his party is mainly confined to Vidarbha region only. Presence of his party in the rest of the region is hardly felt as either it happen to be a strong holds of Shivsena or Congress party. Since, he is growing old and plans to handover the party reins to younger generation, which means to his daughter Supriya Sule, who represents Baramati as member of Parliament, in wake of upcoming elections, he wish he could safeguard her political interests as well as ‘her’ party interests in the state.   But, he fears that in his absence the Congress party may invade into his daughter’s territory-Vidarbha region. So, to ensure Congress party stay away from her territory, he talks about Telangana and then about Vidarbha state formation. If, the Congress plays any games with his daughter in his absence, he hints a likely support to the ongoing agitation for separate Vidarbha state.   Hence, it is to be understood that he is just warning the Congress party, but not serious about Telangana. If, he is really honest and has sympathy for Telangana issue, he would have pressurized the Congress party as a member of UPA alliance long ago. But, he remain silent all these years and talks about it when he plans to retire from politics. However, TRS may not be interested about this story underneath his statement as it is just looking for support at national level come it may be a Pawar or some Maya.

నేతాజీ మరణంపై దిగ్భ్రాంతికరమయిన కధనం

  భారత స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుబాష్ చంద్ర బోస్ జీవితంలో చివరి అంకం గురించి అనేక కధనాలు ప్రచారంలో ఉన్నపటికీ, భారత ప్రభుత్వం మాత్రం నిజాలు కనుగొనేందుకు ఇంతవరకు చొరవ తీసుకోలేదు. ఆయన విమాన ప్రమాదంలో మరణించాడని కొందరు భావిస్తుంటే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఉత్తర భారతంలో సాధువుగా తన అంత్య జీవితం గడిపారని మరికొందరు నమ్ముతున్నారు. అయితే, అసలు నిజం ఏమిటనేది మాత్రం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు.   అనేక సం.లుగా రష్యాలో ఉన్న రామకృష్ణ మఠంలో సేవలందిస్తున్న రధిన్ మహారాజ్, అక్కడ కలిసిన అనేక మంది ప్రసిద్ధ వ్యక్తుల నుండీ, చరిత్రకారులనుండీ నేతాజీ గురించి సేకరించిన వివరాలను కలగలిపి సుబాష్ చంద్ర బోస్ అంతిమ దినాల గురించి ఇటీవల కొన్ని దిగ్బ్రాంతి కలిగించే విషయాలను బయట పెట్టారు. ఆయన బయట పెట్టిన వివరాలన్నీ ప్రస్తుతం భారతీయులు నేతాజీ గురించి ఊహించుకొంటున్న కధనాలకి పూర్తీ భిన్నంగా ఉన్నాయి.   నేతాజీ అందరూ ఊహించినట్లు విమాన ప్రమాదంలో కాక, సైబీరియా జైలులో అంత్యంత దీన స్థితిలో తన చివరి రోజులు గడిపి, తీవ్ర అనారోగ్యంతో మరణించారని ఆయన తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ చలి ఉండే ఆ దేశంలో, ఆయనకు కనీసం కప్పుకోవడానికి దుప్పటి గానీ, చలి నుండి కాపాడుకొందుకు కనీసం స్వెట్టర్ కూడా లేకుండా దుర్భరమయిన జీవితం గడిపి, చివరికి తీవ్ర మానసిక, శారీరిక అనారోగ్యంతో బాధపడుతూ మరణించారని అయన తెలిపారు.   మరో దిగ్భ్రాంతికరమయిన విషయం ఏమిటంటే, నేతాజీ అక్కడ ఆ దుస్థిలో ఉన్నట్లు భారత ప్రభుత్వానికి తెల్సి ఉండటం. అయినా కూడా అయన విడుదలకు గానీ, కనీసం ఆయనను రక్షించుకోవడానికి గానీ చిన్నపాటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని ఆయన తెలిపారు. ఆ నాడు రష్యాలో భారత రాయభారిగా పనిచేసిన విజయలక్ష్మీ పండిట్ స్వయంగా నేతాజీని జైలులో కలిసి ఆయన దుస్థితి చూసినప్పటికీ, అయన జైలు నుండి విడుదల కాకపోవడమే అందుకు ఉదాహరణగా చెపుతున్నారు.   దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళిన నేతాజీ విగ్రహాలు, అయన నామస్మరణ మనం చూస్తాము. అంతటి మహనీయుడిని నాటి మన భారత ప్రభుత్వం ఎందుకు అంత నిర్దయగా వదిలేసిందో ఎవరికీ తెలియదు. బహుశః గాంధీజీతో అహింసా సిద్దాంతముతో విభేదించి, సాయుధపోరటం ద్వారానే స్వాతంత్రం పొందగలమని భావించిన ఆయనను జైలునుండి విడిపించి భారత్ కు తిరిగిరప్పిస్తే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమస్యలేమయినా సృష్టిస్తాడని భయం చేతనో మరే బలమయిన కారణం చేతనో ఆ మహనీయునికి అత్యంత దైన్యమయిన చావుకి కారకులయ్యారు.

కేసిఆర్ గొంతెమ్మ కోరికలే తెలంగాణాని జాప్యం చేస్తున్నాయా?

  మొన్నతెలంగాణా జేయేసీ అద్వర్యంలో నిర్వహించిన సమరదీక్ష అనంతరం తెరాస నేతలు కాంగ్రెస్ పై దాడి మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, తెలంగాణా ఈయని కారణంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యం చేసుకొని దాడులు చేస్తామని ప్రకటించిన, కేసిఆర్ అదే సమయంలో తాము తెరసాను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్దపడిన కూడా కాంగ్రెస్ వెనకంజ వేసిందని ఆరోపించారు.   ఆ మరునాడే, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు తెరాసాను కాంగ్రెస్ లో విలీనం చేయనందునే తెలంగాణా విషయంలో ఆలశ్యం అవుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. అదే సమయంలో, సమరదీక్షను కేసిఆర్ హైజాక్ చేసినట్లు భావిస్తున్న తెలంగాణా ప్రజాసంఘాల నాయకుడు గజ్జెల కాంతం కూడా తెరాసా, కాంగ్రెస్ పార్టీల విలీనానికి ఏమి ఒప్పందం కుదుర్చుకోన్నారో ప్రజలకి తెలియజేయాలని డిమాండ్ చేసారు.   ఇంతవరకు, చంద్రబాబు ఆదేశాలతో జరుగుతున్న పరిణామాలను చేతులు ముడుచుకొని చూస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దూకారిప్పుడు. కేసిఆర్, అతని కుమారుడు కేటీర్ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో తెలంగాణా అంశంపై చర్చలు పేరిట గత సెప్టెంబర్ నెలలో డిల్లీలో నెలరోజులు మకాంవేసినప్పుడే తాము అనుమానించామని, వారు తెలంగాణా విషయం గురించికాక తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు తమ కుటుంభ సభ్యులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పదవులు, ప్యాకేజీలు మాట్లాడుకొనేందుకే అక్కడ తిష్టవేసారని తాము చెప్పిన సంగతిని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తూ, ఆ రెండు పార్టీల విలీనం కోసం చేసుకొన్న ఒప్పంద వివరాలను బహిరంగ పరచాలని వారు డిమాండ్ చేసారు.   హనుమంతరావు మాటలకు స్పందిస్తూ కేసిఆర్ తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి తాము చిన్నా చితక నేతల మాటలకు జవాబునీయనవసరం లేదని, తాము నేరుగా కాంగ్రెస్ అధిష్టానంతోనే చర్చించడానికి సిద్దమని అన్నారు.   అయినా కూడా, తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలు కేవలం విలీన సమస్య వల్లనే తెలంగాణాపై జాప్యం జరుగుతున్నట్లు, పార్టీ విలీనానికి కేసిఆర్ కోరుతున్న గొంతెమ్మ కోరికల కారణంగానే కేంద్రం వెనకడుగువేస్తోందనట్లు, కేసిఆర్ దీనికి మూల కారకుడనట్లు మాట్లాడుతుంటే, తెరసా నాయకుడు హరీష్ రావు నష్ట నివారణ చర్యలకు పూనుకొని , తాము ఇప్పటికీ తమ పార్టీనికాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నామని, అయితే తమను నిందిస్తున్న హనుమంతరావు, మధు యాష్కీ వంటి కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానాన్ని వారం రోజులలోపు తెలంగాణా ఇస్తామని ప్రకటన చేయించగలరా? అలాగయితే తక్షణమే తాము విలీనానికి ఆమోదం తెలుపుతూ కాగితం వారి చేతికే ఇస్తామని సవాలు విసిరారు. హరీష్ రావు ఆ విదంగా అన్నవెంటనే హనుమంతరావు హుటాహుటిన డిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలవడంతో, కేవలం రెండు పార్టీల విలీన సమస్య కారణం గానే తెలంగాణా జాప్యం అవుతోందనే వాదనకు బలం చేకూరింది.   ఇదే నిజమయితే, తెలంగాణా ఆకాంక్ష కన్నాతమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకొని తమను నమ్ముకొని తమ వెంటనడుస్తున్న తెలంగాణా ప్రజలను వారు మోసంచేస్తున్నట్లే భావించక తప్పదు.

కేసీఆర్ ప్రేలాపనల ఉద్దేశ్యం ఏమిటో?

  ఇంతవరకు తెలంగాణా ఉద్యామానికి తానొక్కడే పూర్తీ హక్కులు కలిగి ఉన్నట్లు, తెలంగాణా కాంగ్రెస్, తెలంగాణా తెదేపా, బీజేపీ మొదలయినవన్నీ తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నపటికీ ఆ పార్టీ నేతలను ఏదో ఓసమయంలో కించపరుస్తూనే,వారందరూ తెలంగాణా విషయంలో తననుసరించవలసిందే తప్ప తనకన్నా ముందు నడువరాదన్నట్లు ప్రవర్తించడం అలవాటయిన కేసీఆర్, మొన్న సమరదీక్ష అనంతరం జాతీయ నాయకులూ సైతం తన ముందు బలాదూర్ అన్నట్లు మాట్లాడి ప్రజాగ్రహానికి గురయ్యాడు. అయితే, ఇటువంటి మాటలు అతనికి కొత్త కాకపోయినా, అవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తుండటం అతనికి అలవాటు. ఇప్పుడు అతను ఏఉద్దేశ్యంతో ఆవిధంగా మాట్లాడేడో చూస్తే, దానికి కొన్ని కారణాలు కనబడుతాయి.   కేసీఆర్ తన ప్రేలాపనలతో, అతను తెలంగాణా రావాలని కోరుకోవట్లేదనే వాదనకు బలం చేకూరింది. ఇప్పటికే అతను 2014 ఎన్నికల గురించి చాలాసార్లు మాట్లాడాడు గనుక, ఇప్పుడు ఈ విదంగా మాట్లాడి, కాంగ్రెస్ అధిష్టానాన్నికూడా గిచ్చితే, వారికి సహజంగానే కోపం కలిగి, రాష్ట్రంలో శాంతి భద్రతల కారణం చూపిస్తూ ఇంతవరకు తెలంగాణాపై వారు చేస్తున్న కసరత్తును పక్కన బెట్టేసే అవకాశం ఉంటుంది. తద్వారా కేసీఆర్ తెలంగాణాకి సైందవుడిలా అడ్డుపడ్డాడని చెప్పవచ్చును.   ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొంటే, వచ్చేఎన్నికల వరకూ తెలంగాణా అంశాన్ని అతను ఆపగలిగితేనే అతనిపార్టీకి అఖండ విజయం సిద్దిస్తుందని, అందువల్లనే కేసీఆర్ కోరుండే రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఈ విదంగా మాట్లాడి ఉండవచ్చునని భావించవచ్చును.   కేసీఆర్ తెలంగాణా ను అడ్డుకొనేందుకు చేసిన మరో ప్రయత్నం గురించి కూడా ఈ సందర్భంలో ప్రస్తావించక తప్పదు. అతను కొద్దిరోజుల క్రితం ఎవరూ అడుగకముందే, హైదరాబాదుపై ప్రజాభిప్రాయ సేకరణకు(రిఫరెండం) వెళ్దామని, స్వయంగా ప్రకటించడం కూడా తెలంగాణాను జాప్యం చేయడానికి చేసిన ప్రయత్నమేనని చెప్పవచ్చును. అయితే, ఆ ప్రతిపాదనను జేయేసీతో సహా అందరూ వ్యతిరేఖించడంతో ఆ విషయం అప్పుడు మరుగునపడిపోయింది. కానీ, అది అతని మనసులో ఆలోచనలను బయట పెట్టింది.   ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఈ విదంగా మాట్లాడటం ద్వారా తానూ కోరుకొన్నవిధంగానే స్పందనలు వచ్చాయి. తన మాటలతో విషం చిమ్మి రెండు ప్రాంతాల మద్య మరింత ద్వేషం పెంచగలిగాడు. తూరుపు జయప్రకాష్ రెడ్డి కేసీఆర్ ని , ప్రొఫెసర్ కోదండరాంలను ఓవైసీ సోదరులతో సరిపోలుస్తూ ఒవైసీలు ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చుపెడితే, కేసీర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మద్య చిచ్చుపెడుతున్నారని చెపుతూ, వారిరువురి మద్య తేడాలేదని అన్నారు. ఇంతవరకు అయన మాటలను ఎవరూ అంతగా పట్టించుకోకపోయినా ఇప్పుడు కేసీఆర్ తన ప్రేలాపనలతో అయన మాటలను నిజం చేసినట్లయింది.   కేసీఆర్ కి వ్యతిరేఖంగా అనేక పోలీసు స్టేషన్లలో కేసులు వేయబడ్డాయి. అవి ముందుకు సాగుతాయ లేదా అనే విషయాన్నీ పక్కన బెడితే, అతను తన మాటలతో ఇరుప్రాంతాల ప్రజల మద్య ఇప్పటికే ఉన్న దూరాన్ని, విద్వేషాలను మరింత పెంచాడని అవి స్పష్టం చేస్తున్నాయి. ఒక ఉద్యమనేతగా, భాద్యతగల పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సరయిన మార్గ నిర్దేశం చేయవలసిన కేసీఆర్ తన మాటలతో ఉద్యమానికి కళంకం ఆపాదించాడు.   తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఈ విధంగా ప్రజలమద్య విద్వేషాలను రెచ్చగొట్టడం అతను మన ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాలు విసిరాడని చెప్పకతప్పదు. ఒకవేళ అతను, అతని పార్టీ ప్రస్తుతం తెలంగాణా వద్దని కోరుకొంటే, అదే విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా చెప్పి ఆపించుకోవచ్చును. తన పార్టీ రానున్న ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవాలని కోరుకొంటే అందుకు అతను ఇటువంటి ఆలోచనలకంటే ఇంతకంటే మేలయిన మరో ఆలోచన చేయడం మంచిది.

విశ్వరూపం చూపిన కిరణ్ కుమార్

  ఎప్పుడూ సౌమ్యంగా, మృదువుగా మాట్లాడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నిన్న సమర దీక్ష అనంతరం కేసీర్ జాతీయనేతలయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగుల గురించి చాలా చులకనగా మాట్లాడటంతో, మొట్ట మొదటిసారిగా తీవ్ర స్వరంతో కేసీర్ ను హెచ్చరించారు. ఈ రోజు డిప్యుటీ సీయం రాజానరసింహతో సహా మొత్తం తెలంగాణా మంత్రులందరినీ పక్కన కూర్చోబెట్టుకొని నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి కేసీర్ పై తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు.   “దేశ ప్రజలందరూ గౌరవించే జాతీయ నాయకులయిన జవహార్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, సోనియాగాంధీలను చులకన చేస్తూ నిన్న మీరు మాట్లాడిన తీరుగానీ, భాషగానీ చాలా నీచంగా ఉన్నాయి. మీ బాష మీ(కేసీర్) సంస్కృతికి అద్దం పడుతోంది. మీ భాషను వింటే మాకే కాదు ప్రజలందరికీ, చివరికి తెలంగాణా ప్రజలకి సైతం అసహ్యం కలుగుతోంది. జాతీయ నేతలయిన వారెక్కడ? మీరెక్కడ? మీ స్థాయేమిటి? మీరు మాట్లాడుతున్న నాయకుల స్థాయేమిటి? మీరొక ప్రాంతీయ పార్టీకి, అందునా రాష్ట్రంలో ఒక ప్రాంటానికి మాత్రమే ప్రాతినిద్యంవహించే ఒక చిన్నపార్టీకి చెందిన ఒక చిన్న నాయకుడివి మాత్రమే. పెద్దలగురించి మాట్లాడే ముందు అసలు మన స్థాయి ఏమిటని ఆలోచించనవసరం లేదా? అటువంటి మహనీయులను విమర్శించినంత మాత్రాన్న మీరేమి మహానీయులయిపోరని తెలుసుకోండి. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి అది మీ మొహం మీదనే పడుతుందని తెలుసుకోండి.”   “యావత్ ప్రపంచం చేత మేధావిగా కీర్తింపబడుతున్న ప్రధాని డా.మన్మోహన్ సింగును కించపరుస్తూ మాట్లాడిన మీ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి పెద్దమనిషి పేరు ప్రస్తావించే హక్కు కూడా మీకు లేదు.”   “ఇక్కడ కూర్చొన్న ప్రతీ తెలంగాణా శాసన సభ్యుడు, మంత్రీ, పార్లమెంటు సభ్యుడు కూడా తన స్వశక్తితో గెలిచేరే తప్ప మీ దయతో గెలవలేదని తెలుసుకోండి. మా ప్రభుత్వాన్ని పడగోడతామని మీరు విసిరిన సవాలును మేము స్వీకరిస్తున్నాము. మీరు వెంటనే అ పని చేసి చూపించమని ప్రతిసవాలు కూడా చేస్తున్నానిప్పుడు. మా ప్రభుత్వం మీ దయతోనో లేదా మీ పార్టీ దయతోనో మనుగడ సాగించడంలేదని గుర్తుంచుకోండి. గత ఎన్నికలలో మీరు ఎంత మందితో చేతులు కలిపినా కూడా కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగా, జాతీయ పార్టీ అయిన మా కాంగ్రెస్ పార్టీ ఒంటిగా 50 సీట్లను గెలుచుకొని తన సత్తా నిరూపించుకొంది.”   “సున్నితమయిన, క్లిష్టమయిన తెలంగాణా అంశం పరిష్కరించాలంటే మీరు చెప్పినంత తేలిక కాదు. దేశాన్ని పాలిస్తున్న జాతీయ పార్టీగా అటు తెలంగాణా, ఇటు ఆంధ్రా ప్రాంతాల ప్రజలను సమ దృష్టితో చూస్తోంది గనుకనే సున్నితమయిన ఈ సమస్యని అందరికి ఆమోదయోగ్యమయిన రీతిలో పరిష్కరించాలని మా పార్టీ కోరుకొంటోంది. అందుకు మరి కొంత సమయం అడగడం తప్పా? ఒక క్లిష్టమయిన సమస్యని పరిష్కరించే ముందు దాని వల్ల ప్రభావితులయ్యే వారందరితో మాట్లాడాలనుకోవడం ఏరకంగా తప్పు అవుతుంది?”   “ఇంతవరకు మీ ప్రవర్తనతో, నీచమయిన మీ మాటలతో మమ్మలిని, మా మంత్రులను, మా నాయకులను ఎంతగా అవమానిస్తున్నా కూడా ఓపిగ్గా సహిస్తున్నాము. గానీ, ఇప్పుడు ఏకంగా జాతీయ నాయకులయినే తూలనాడేవరకు వెళ్ళిపోయారు మీరు. ఇక చట్టం తన పని తానూ చేసుకు పోతుంది. మా ప్రభుత్వం ఆ విషయంలో ఇక జోక్యం చేసుకోబోదు.”   బహుశః కిరణ్ కుమార్ రెడ్డి తన జీవితంలో ఇంత తీవ్ర స్థాయిలో మాట్లాడటం ఇదే మొదటిసారయి ఉండవచ్చును. ఆయన అంత కోపంగా, పరుషంగా మాట్లాడటం అయన సహచర మంత్రులను సైతం విస్తుపోయేలా చేసింది. నిన్న కేసీర్ తీవ్రపదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో తెలంగాణా మంత్రులను, శాసన సభ్యులను, పార్లమెంటు సభ్యులను ఈసడించిన తీరుకి డీలా పడిపోయిన తన మంత్రి వర్గ సహచరులను తిరిగి పునరుత్తేజపరిచి కేసీర్ కు దీటుగా నిలబడేందుకే కిరణ్ కుమార్ రెడ్డి తన తెలంగాణా మంత్రులందరి సమక్షంలో ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చును.   ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో కేసీర్ ను ఎదిరించి నిలవడమే గాకుండా, అతని తెలంగాణావాదనని సైతం దైర్యంగా తిరస్కరిస్తున్న ఒకే ఒక్క తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు తూరుపు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) మాత్రమే. మిగిలిన వారందరూ కూడా అటు కేంద్రం నుండి సహకారం లేక, ఇటు రాష్ట్రంలోనూ తమకి అండగా నిలబడే నాధుడు లేక కేసీర్ నోటికి బలవుతున్నవారే. అందువల్ల, అటువంటి కాంగ్రెస్ తెలంగాణావాదులకు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కొండంత బలం ఇస్తాయని చెప్పవచ్చును. తద్వారా అయన తెలంగాణా మంత్రులకు బాసటగా నిలిఛి వారి విశ్వాసం కూడా పొందగలుగుతారని ఖచ్చితంగా చెప్పవచ్చును.

బందులతో విద్యార్దుల చదువులు నాశనం చేయొద్దు

  ఉద్యమాలపేరిట తరచూ బందులకు పిలుపునిస్తూ, విద్యార్దుల జీవితాలతో ఆడుకొంటున్న రాజకీయ నాయకులను నిలదీసే దైర్యంలేక, పిల్లల చదువులు పాడవుతున్నా చేసేదేమీలేక నిస్సహాయంగా జరిగే పరిణామాలను చూస్తూ ఉండిపోయారు తల్లితండ్రులు, స్కూలు యాజమాన్యాలు. మళ్ళీ ఇటీవల మొదలయిన తెలంగాణా ఉద్యామాలతో బందులు కూడా సర్వసాధారణం అయిపోవడంతో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో స్కూలు యాజమాన్యాలు బందులకు వ్యతిరేఖంగా నోరు విప్పక తప్పలేదు.   ఈరోజు జంట నగరాల ప్రైవేటు స్కూలు యాజమాన్యాల అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ “తెలంగాణా ఉద్యమాలకు మా మద్దత్తు ప్రకటిస్తున్నాము. కానీ, ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు బందులు ప్రకటించడం మాత్రం సబబు కాదు. దీనివల్ల ఉద్యమంతో సంబంధము లేని విద్యార్దుల చదువులు పాడవుతున్నాయి. మరొక్క నెలరోజుల్లో 10వ క్లాసు పరీక్షలుండగా ఈ విధంగా ప్రతీరోజు బందులు ప్రకటిస్తుంటే, సిలబస్ పూర్తికాక, పిల్లలు పరీక్షలకు సిద్ధం కాలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల వారు విలువయిన విద్యా సంవత్సరం కోల్పోవడమే గాకుండా, చదువుల్లోను వెనకబడిపోతున్నారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఉద్యమనేతలు స్కూళ్ళను బందుల నుండి మినహాయించాలి. ఒకవేళ వారు బందు చేయదలిస్తే, కనీసం రెండుమూడు రోజుల ముందు ఆ సంగతిని ప్రకటించగలిగితే మంచిది. ఏదో ఒకటి రెండు రోజుల బందు అంటే మేము సైతం స్కూళ్ళను మూసి మద్దత్తు ప్రకటించగలము గానీ ఈవిధంగా ఎప్పుడుపడితే అప్పుడు బందులు చేస్తే మాత్రం సహకరించలేము."   "ఇదివరకు, హై-కోర్టు కూడా మాకు అనుగుణంగానే తీర్పు చెప్పింది. అయినా కూడా తెలంగాణా ఉద్యమానికి సహకరించాలనే ఆలోచనతో ఇంతకాలం ఉద్యమనేతలు బంధులకు పిలుపునిచ్చినప్పుడల్లా, విద్యార్దులకు నష్టం జరుగుతోందని తేలినా కూడా కళాశాలలు మూసేస్తూన్నాము. అయితే, ఇప్పటికయినా ఉద్యమనేతలు కళాశాలలును బందులనుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము తప్పనిసరిగా పోలీసు రక్షణ తీసుకోనయిన సరే మా విద్య సంస్థలను నడిపించుకోవాలని నిశ్చయించుకొన్నాము,” అని తెలియజేసారు."   విద్యార్దుల తల్లి తండ్రులు కూడా పాల్గొన్న ఈ మీడియా సమావేశంలో "తరచూ జరుగుతున్న బందులవల్ల పిల్లల చదువులు పాడయి, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోతే, తమవంటి మద్య తరగతికి చెందినవారికి ఆర్దికంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని" వారు ఆందోళన వ్యక్తం చేసారు.   రెక్కాడితే గానీ డొక్కాడని నగర జీవులందరూ ఇదే వేదన అనుభవిస్తున్నపటికీ ఉద్యమనేతలకి భయపడి మౌనంగా బాధలు భరిస్తున్నారు. ఇప్పటికయినా ఉద్యమ నేతలు విద్యార్దులను తమ ఉద్యామలకు దూరంగా ఉంచగలిగితే మేలు.

రాష్ట్ర విభజన కిం కర్తవ్యమ్?

  అందరూ అనుకోన్నట్లే రాష్ట్ర విభజన సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో మూడు ప్రాంతాల నేతలతో మొదటి నుండి చర్చలు ప్రారంభించాల్సి ఉందని, దానికి నిర్దిష్ట గడువు కూడా చెప్పలేమని కేంద్రం ప్రకటనతో తెలంగాణా ప్రాంతంలో అగ్నికీలలు రాజుకోనుండగా, మిగిలిన ప్రాంతాలలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటాయి. అయితే, పోరుగింటికి నిప్పంటుకొంటే అది పక్కనున్న ఇంటికీ అంటుకోక మానదు.     అయితే, సమస్యను పరిష్కరించవలసిన కేంద్ర ప్రభుత్వం నాన్పుడు ధోరణితో సాగదీస్తోందనే వాదన అర్ధ రహితం. రాష్ట్రవిభజన చాలా క్లిష్టమయిన సమస్య అని ప్రతీ రాజకీయనాయకుడికీ స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, ఆ విషయాన్నీ బహిరంగంగా మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. ఈ రోజు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనో, విభజించమనో వీదులకెక్కి పోరాటాలు చేసేవారెవరూ కూడా ఒక్కనాడయినా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అనుకోలేదు. అలాగా అనుకొంటే ఈ సమస్యకి పరిష్కారం డిల్లీలో కాక రాష్ట్రంలోనే దొరికి ఉండేది. గానీ, తమను తాము మహా మేధావులుగా భావించుకొనే మన రాజకీయ నాయకులు గత పదేళ్ళబట్టి ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఇటువంటి చర్చలకు శ్రీకారం చుట్టకపోవడమే వారిలో చిత్తశుద్దిలేదని నిరూపిస్తోంది.   దేశంలో దరిద్రం ఉన్నంతకాలం వోటు బ్యాంకు పదిలంగా ఉన్నట్లే, ఈ సమస్య ఉన్నంత కాలం ప్రజలలో భావోద్వేగాలూ ఉంటాయి, వాటిని ఎప్పుడుకావలనుకొంటే అప్పుడు రాజేసుకోని వోట్ల రూపంలో మార్చుకోవచ్చును. అవసరం లేనప్పుడు ఉద్యమ నాయకులుగా అదే సమాజం మీద దాష్టికం చేయవచ్చును. ఉద్యామాలు, రాష్ట్ర విభజన అంశాలు ఇంతవరకూ ఊరుపేరులేని ఎందరో అనామకులకు కొత్త గుర్తింపు, కొత్త హోదాలను కల్పిస్తున్నాయంటే అవి ఏ స్థాయికి దిగాజారేయో అర్ధం అవుతుంది.     రాజకీయ పార్టీల మద్య సంప్రదింపులతో పరిష్కారం కావలసిన ఇటువంటి సున్నితమయిన సమస్యని గోటితో పోయే దానిని గొడ్డలి వరకూ తీసుకువచ్చాయి. రాష్ట్రం విడిపోవాలా,వద్దా అనే పంచాయితీని అసలు కేంద్రం వద్దకి తీసుకుపోవడమే మొదటి తప్పు. సామాజిక,రాజకీయ,ఆర్దిక ఇత్యాది విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగిన ఎందరో మేధావులు, సాంకేతిక నిపుణులు మనకి ఉండగా అటువంటి వారి సేవలు, సలహాలు తీసుకొని సమస్యని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా, తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం సమస్యని కేంద్రం పైకి నెట్టేసి పరిష్కరించలేదని రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిందిస్తున్నాయిప్పుడు.     మన రాష్ట్రం సమస్యని మనమే కూర్చొని పరిష్కరించుకొనేందుకు ఆసక్తి చూపనప్పుడు కేంద్రాన్నితప్పు పట్టడం కూడా తప్పే అవుతుంది. మన రాజకీయ ప్రయోజనాలు మనకి ముఖ్యమయినప్పుడు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా తన ప్రయోజనాలు తనకీ ముఖ్యమే అని మన రాజకీయ పార్టీలు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని ఎన్నికల వరకు సాగదీసి ప్రయోజనం పొందాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే, అదే తమకీ మేలనే ఆలోచన చేస్తున్నాయి. అందుకే, కేంద్రం ప్రకటన వెలువడగానే రాబోయే ఎన్నికల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి.      ఒక తీవ్ర సమస్య మన రాష్ట్రాన్ని ఇంతగా వేదిస్తున్నపుడు దానిని ఏవిదంగా పరిష్కరించావచ్చును, అందుకు మనం ఏమి చేయాలి అని ఏరాజకీయ నాయకుడు, ఏ పార్టీ గానీ మాట్లాడటం లేదిప్పుడు. ఒక వైపువారు ఓడినట్లు,మరొక వర్గంవారు గెలిచినట్లు భావిస్తున్నారు తప్ప, సమస్య పరిష్కారం చేసుకోలేకపోయమనే విచారం ఎవరికీ కలగలేదు. తద్వారా రాష్ట్రం మరింత సమస్యలలో చిక్కుకొంటుందనే ఆలోచన, భయం కూడా ఎవరిలో లేదు. ఎవరి స్వార్ద రాజకీయ ప్రయోజనాలు వారివే. రాష్ట్రం, ప్రజల గురించి ఆలోచించే అవసరం, ఆసక్తి, ఓపిక ఎవరికీ లేవు.     మన రాజకీయ పార్టీలలో ఈ సమస్యని చిత్తశుద్దితో పరిష్కరించాలని ఆలోచన కలగనంతవరకూ కేంద్రం మరెంత కాలం చర్చలు జరిపినా, మరెన్ని సమావేశాలు నిర్వహించినా కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకడం కూడా కష్టమేనని చెప్పక తప్పదు.     ఇప్పటికయినా విజ్ఞత చూపి, బేషజాలు, స్వీయ రాజకీయ ప్రయోజనాలు, విద్వేషాలు పక్కన పెట్టి మన రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారానికి కృషిచేస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అయితే, మన రాజకీయ పార్టీలనుండి ఇంత ఆశించడం దురాశే అవుతుందని మనకి తెలుసు. ఇటువంటి రాజకీయనాయకుల చేతుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఇక దేవుడే కాపాడాలి.

రోమ్ నగరం తగులబడుతుంటే....

  ఒకవైపు తెలంగాణా జేయేసీ నేతలు చేపట్టిన సమరదీక్షతో జంట నగరాలు అట్టుడుకుతుండగా మరోవైపు సీమంద్రాలో సమైక్యాంద్రా ఉద్యమం కూడా మెల్లగా ఊపందుకొంటోంది. డిల్లీ నుండి ఎటువంటి ప్రకటన ఇంతవరకూ రాకపోయినా కూడా రెండు వైపులా ఉద్యమాలు మాత్రం తీవ్రతరమవడంతో రాష్ట్రంలో మళ్ళీ అరాచక పరిస్థితులు మొదలయ్యాయి. రాష్ట్రం ఇంత అల్లకల్లోలంగా మారినప్పటికీ కూడా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ కనీస స్పందన కరువవడం విచారకరం. బహుశః తమ మాటలని ఎవరూ లెక్క చేయరని భావించడంవల్లనే ఈ నిర్లిప్తత అని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికయినా తన నిర్లిప్త ధోరణిని విడనాడకపోతే రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంది.     తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం అవసరమని ప్రకటించిన గులాం నబీ ఆజాద్, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కోరినట్లు స్పష్టమయిన మరో ప్రకటన చేయడం ద్వారా పరిస్థితులను అదుపులోకి తేగల అవకాశం ఎందుకు జారవిడుచుకొంటున్నారో తెలియదు. రేపు అనగా జనవరి 28వ తేదీన తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన చేయలేమని తేల్చిన గులాం నబీ ఆజాద్, మరి తమ తదుపరి ప్రణాళిక ఏమిటో ప్రకటించి, రాష్ట్ర కాంగ్రెస్ నేతల సహాయంతో పరిస్థితులను అదుపులో ఉంచే అవకాశం ఉన్నపటికీ అది పట్టించుకోకుండా, కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ సమావేశాలలో మునిగితేలుతోంది. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికి అది చేస్తున్న కసరత్తును ఎవరూ తప్పు పట్టకపోయినప్పటికీ, పూర్తిగా అదే ధ్యాసతో తలుపులేసుకొని సమావేశాలు అవడం చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని తలపిస్తోంది.     ఇటీవల కాంగ్రెస్ నాయకత్వం చేపట్టిన యువనాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇక్కడి పరిస్థితులకి స్పందించకపోవడం విచారకరం. దేశాన్ని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలని తన మంత్రం దండంతో సమూలంగా మాయం చేసేస్తానన్నట్లు మాట్లాడిన ఆయన, ఇటువంటి క్లిష్ట సమయంలో, క్లిష్ట సమస్యపై ఎందుకు నోరు మెదపట్లేదో ఆయనకే తెలియాలి. ఆయనకి రాష్ట్ర విబజన సమస్యపై పూర్తీ అవగాహన ఇంకా ఏర్పడలేదని పార్టీలో సీనియర్ నేతలు భావించిడంవల్లనే ఆయనను దీనికి దూరంగా ఉంచుతున్నారనుకొంటే, అటువంటప్పుడు అతి రధమహారధులని చెప్పుకొనే అనేక కాంగ్రెస్ నేతలలో ఒక్కరు కూడా ముందుకు వచ్చి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేయకపోవడం చాలా విచారకరం.     కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తిసున్న సీనియర్ నేత వాయలార్ రవి, ప్రస్తుతం హైదరాబాదులో ఉండి, అక్కడి పరిస్థితులను స్వయంగా చూస్తూ కూడా తెలంగాణా అంశంతో తనకు సంబంధం లేదని, అది వేరొకరు చూసుకొంటున్నారని అనడం చాలా దారుణం. ఇక తెలంగాణా అంశం తన పరిధిలో లేదని స్పష్టంగా చెప్పి చేతులుదులుపుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టడం అనవసరం. అది వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నపటికీ అది చేదు నిజం అని ఒప్పుకోక తప్పదు. అందువల్ల ఆయన తన పరిధిలో ఏమేమి ఉన్నాయో అవి చేసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజధానిలో తెలంగాణా జేయేసీ నేతలు తలపెటిన 36గంటల సమరదీక్ష వల్ల నగరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవడమే ఆయన చేతుల్లో ఉన్న పని. ఆ పనిని అయన సమర్ధంగానే నిర్వహిస్తున్నారని అనుకోవచ్చును. అయితే, తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న ఉద్యమ కారులవల్ల పరిస్థితులు ఎప్పడు అదుపు తప్పుతాయో ఎవరికీ తెలియదు. అదే జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్రానిదే బాధ్యతవుతుంది. అప్పుడు మళ్ళీ రాష్ట్రపతి పాలన అనే పాత ఆలోచన మరో సారి తెరమీదకి రావచ్చును. ఇది తెలంగాణా అంశాన్ని మరింత ఆలస్యం కావడానికే దోహదపడుతుంది అని ఉద్యమకారులు గ్రహించాల్సిన అవసరం ఉంది.

తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి గడ్డి కోసం

  ఎలాగూ త్వరలో తన పీసీసి అధ్యక్షపదవిని కాంగ్రెస్ అధిష్టానం కన్నాలక్ష్మినారాయణకు కట్టబెట్టబోతోందనే సూచనలు అందడంవల్లనేమో, బొత్స సత్యనారాయణ ఈ రోజు సాయంత్రం రాజమండ్రీలో ఉండవెల్లి నిర్వహిస్తున్న జై ఆంధ్రా మహాసభకు బయలుదేరి ఇంతకాలం మనసు పొరల్లో గుట్టుగా దాచుకొన్న సమైక్యాంధ్రా భావనలు బయటపెట్టుకొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బాధ్యత వహించవలసిన ఆయన సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభకు హాజరవడం సహజంగానే తెలంగాణా వాదులకు కోపం తెప్పించింది.   అదే విషయం ప్రస్తావిస్తూ వారు ఆయనని సంజాయిషీ కోరినప్పుడు ఉండవల్లితో తనకున్న స్నేహ సంబందాల దృష్ట్యా నేను వ్యక్తిగతంగా హాజరవుతున్ననే తప్ప పార్టీ తరపున పీసీసీ అధ్యక్షుడిగా హాజరవడంలేదని చెప్పడం తెలంగాణా వాదులకు పుండు మీద కారం చెల్లినట్లయింది. ఒక వైపు సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభకు హాజరవడమే గాకుండా, ‘నేను మీరు ఊహిస్తున్న ఆ నేను కాదు’ అన్నట్లు తానూ వేరు, పార్టీ అధ్యక్షుడు వేరు అన్నట్లు సినిమా డైలాగు చెప్పడం పార్టీ సీనియర్ నేతలయిన వీ.హనుమంతరావు వంటి వారికి సైతం ఆవేశం తెప్పించింది. తెలంగాణావాదులు నిర్వహించిన సభలకి హాజరు కావడానికి ఇష్టపడని ఆయన ఇప్పుడు సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభకు మాత్రం హాజరవడంలో ఆయన అంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం ఒకవైపు రాష్ట్రవిభజనపై తీవ్రమయిన కసరత్తు చేస్తున్న ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడిగాఉన్న బొత్స సత్యనారాయణ, ఉండవల్లి సభకు హాజరయి ప్రజలకు ఏసందేశం పంపినట్లు భావించాలి అని ఆయన ప్రశ్నించారు.   తొలుత రాష్ట్రం విడిపోతే నష్టం ఏమిటని ప్రశ్నిస్తూ తెలంగాణావాదుల నుండి ఇబ్బందులు లేకుండా నావ నడిపించుకోచ్చిన ఆయన, ఇప్పుడు తన పీసీసి అధ్యక్షపదవికి రోజులు దగ్గరపడగానే ఈవిధంగా రంగులు మార్చడం సబబు కాదు. అయన సమైక్యవాదుల సభకి హాజరయి, జై ఆంధ్రా ఉద్యమం గురించి తెలుసుకోవాడానికే వెళ్తునానని చెప్పడం ఎలా ఉందంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి గడ్డి కోసం అన్నట్లుంది.   సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభలో పాల్గొంటూ అధిష్టానం ఏనిర్ణయం తీసుకొంటే దానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించడం కేవలం వారినే కాకుండా తెలంగాణా వాదులను సైతం అపహాస్యం చేయడమే అవుతుంది. అంతకంటే ఆయన తన మనసులో మాట స్పష్టంగా బయటకి చెప్పేస్తే కనీసం సమైక్యాంద్రావారి విశ్వాసం అయినా పొందే అవకాశం ఉంటుంది. లేదంటే రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది ఆయన పరిస్థితి.