ఓటుకు ఆరు వేలు.. హుజురాబాద్ లో పండుగే పండుగ..

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లకు ప్రలోభాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా.. వారం రోజుల ముందు నుంచే మనీ, మందు పంపిణి మొదలైంది. బుధవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో.. ఆ తర్వాత ఓటర్లకు భారీగా నజరానాలు ముట్టచెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డబ్బులతో పాటు మందును రహస్య స్థావరాల్లో డంప్ చేశారని తెలుస్తోంది.  నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచే డబ్బుల పంపిణి మొదలు పెట్టారని తెలుస్తోంది. కమలాపూర్ మండలంలో సోమవారమే అధికార పార్టీ ఓటర్లకు డబ్బులు ఇచ్చిందని తెలుస్తోంది. ఒక్కో ఓటుకు ఆరు వేలు రూపాయలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కమలాపూర్ మండలంలో ఓట్ల పంపిణికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏ వీడియోలో ఆరు వేల రూపాయలను కవర్ లో ప్యాక్ చేసి ఓటర్ ఇచ్చినట్లుగా ఉంది. ప్యాక్ లో 12 ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి. ఓటుకు ఆరువేల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం నియోజకవర్గ వ్యాప్తంగా 121గ్రామాలలో పంపిణీ జరుగుతున్నట్టు ప్రచారం అధికార పార్టీకి ధీటుగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఓటర్లను డబ్బులు పంపిణి చేస్తున్నారని తెలుస్తోంది. డబ్బులు, మందు పంపిణికి సంబంధించి ప్రధాన పార్టీలు ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపాయంటున్నారు. స్థానిక నేతలతో సంబంధం లేకుండానే వాళ్లు నేరుగా ఓటర్ల దగ్గరకు వెళ్లి డబ్బుల కవర్లు ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటుకు ఆరువేలు ఇస్తున్నారని, హోరాహోరీగా ఉన్న చోట 10 వేల వరకు ఇచ్చేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు.   మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. అయితే అధికార పార్టీ నేతలను వదిలేస్తూ బీజేపీ నేతలపైనే పోలీసులు నిఘా పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కమలం నేతలు మండిపడుతున్నారు. 

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిపై క‌త్తితో దాడి.. జూబ్లీహిల్స్‌లో క‌ల‌క‌లం..

వాళ్లిద్ద‌రూ బంధువులు. ఇన్నాళ్లూ వారి మ‌ధ్య మంచి రిలేష‌నే ఉంది. త‌రుచూ క‌లుసుకోవ‌డం.. వ‌చ్చిపోవ‌డం.. అంతా మ‌నం-మ‌నం రిలేష‌న్‌. కానీ, కొంత‌కాలంగా వారి మ‌ధ్య విభేదాలు.. త‌రుచూ గొడ‌వ‌లు.. అరుచుకోవ‌డాలు.. తిట్టుకోవ‌డాలు. క‌ట్ చేస్తే.. క‌త్తితో దాడి. ఒక్క‌సారిగా షాక్‌. ఇంత‌కీ వారిమ‌ధ్య అస‌లేం జ‌రిగింది? క‌త్తితో దాడి చేసుకునే వ‌ర‌కూ ఎందుకొచ్చింది? ఇంకేముందు డ‌బ్బుల మేట‌రే. ఓ భూమి గొడ‌వే వారి బంధుత్వాన్ని హ‌త్యాయ‌త్నం వ‌ర‌కూ తీసుకొచ్చింది. అస‌లేం జ‌రిగిందంటే... హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రియ‌ల్ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి జరిగింది. రవీందర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బేగంపేట ప్రాంతంలో విక్రయించిన స్థలానికి సంబంధించిన కమీషన్‌ సొమ్ము రూ.6 లక్షల వ్యవహారంలో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌రెడ్డి.. రవీందర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో రవీందర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు దాడికి పాల్పడిన మోహన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు న‌మోదు చేశారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.    

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జీషీట్.. హంతకులెవరంటే? 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జీషీట్  దాఖలు చేసింది సీబీఐ. నలుగురు నిందితుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ 90 రోజుల రిమాండ్ గడువు ముగుస్తున్నందున సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2019 మార్చితో తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేకానందరెడ్డి. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే హత్య జరగడంతో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులు మొదట ఏపీ పోలీసులే విచారించారు. అయితే వివేకా కూతురు సునీతా రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివేదా హత్య కేసులో సీబీఐ అధికారులు ఏడాదిపాటు దర్యాప్తు చేసి ఇప్పటివరకూ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ ను ఈ ఏడాది ఆగస్టు 4న అరెస్ట్ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ 9న సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో మొత్తం నలుగురి ప్రమేయం ఉందని సీబీఐ ప్రాథమిక విచారణలో తేల్చింది. వారిలో ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి డ్రైవర్ దస్తగిరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అవే విషయాలు పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా సీబీఐ పలు సార్లు విచారించింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కూడా ప్రశ్నించింది.  అయితే సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? హత్యకేసులో ఎవరి పాత్ర ఉందనే విసయాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. మరికొద్దిరోజుల్లోనే సీబీఐ అధికారులు పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఛార్జిషీట్ లో వివేకా హత్యలో అసలు పాత్రధారులు సూత్రధారుల ప్రమేయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.  

ధూళిపాళ్ల మ‌ళ్లీ టార్గెట్‌.. నరేంద్రకు నోటీసులు

ఏం మార‌లేదు. ప్ర‌భుత్వ తీరు ఏమాత్రం మార‌డం లేదు. క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల్లో అధికార పార్టీ అస‌లే మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఒక్కొక్క‌రిగా టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తోంది. పాత-కొత్త విష‌యాల‌న్నీ బ‌య‌ట‌కు తీసి.. లేనిపోని చిక్కులు సృష్టించి.. టీడీపీ నేత‌ల ఆర్థిక మూలాల‌ను, ప‌ర‌ప‌తిని దారుణంగా దెబ్బ కొడుతోందని అంటున్నారు.. ప్ర‌శ్నిస్తే కేసులు.. నిల‌దీస్తే నిష్టూరాలు. ఏపీలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా ఉన్న‌ట్టుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. అన్నిరంగాల్లో విఫ‌ల‌మైన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు.. ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే.. విప‌క్ష నాయ‌కుల‌ను భ‌యభ్రాంతుల‌కు గురి చేసేందుకు.. పాల‌క ప‌క్షం నిర్విరామంగా ప్ర‌య‌త్నిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.  తాజాగా, టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్‌ నోటీసులు జారీ చేశారు. సహకార చట్టం 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. పాల రైతుల కుటుంబ సభ్యులకు రాయితీతో అక్కడ వైద్యం అందిస్తున్నారు.  ఇప్ప‌టికే ధూళిపాళ్ల‌ను దెబ్బ‌కొట్టేందుకు సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే కుట్ర చేశారు. న‌రేంద్ర‌ను అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించి క‌క్ష్య తీర్చుకున్నారు. హైకోర్టుకు వెళ్లి మ‌రీ సంగం డెయిరీని కాపాడుకున్నారు ధూళిపాళ్ల‌. అది వ‌ర్క‌వుట్ కాలేద‌నుకున్నారో ఏమో.. ట్ర‌స్ట్ నుంచి న‌రుక్కొస్తున్నార‌ని మండిప‌డుతున్నారు ధూళిపాళ్ల న‌రేంద్ర‌.   

కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ కుట్ర? 

తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో నేతలు స్పీడ్ పెంచారు. హోరాహోరీగా పోరాడుతున్న అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికలో అంతా తానే వ్యవహరిస్తున్న మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు బీజేపీ నేతలు.  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో హరీష్‌రావుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్ రావు అని అన్నారు. హుజురాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని వ్యాఖ్యానించారు.  గతంలో కేటీఆర్‌ని ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్ రావని ఆరోపించారు. దుబ్బాకలో చెల్లని హరీష్ రావు హుజురాబాద్‌లో చెల్లుతారా అంటూ విజయశాంతి దుయ్యబట్టారు. 

ఏపీలో ముందస్తు ఎన్నికలకు స్కెచ్? కేసీఆర్ బాటలో జగన్.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది? ఓ వంక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం, మరో వంక అప్పు తలుపులు కూడా మూసుకు పోతున్న వైనం. అయినా అప్పులు చేయందే పూట గడవని గడ్డు పరిస్థితి.  తాజాగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుంది. ఇక రూ.10,500 కోట్ల వార్షిక రుణ పరిమితిలో మిగిలింది, ఆ పై రూ.500 కోట్లే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఐదు నెలలు మిగిలే ఉన్నాయి, ఈ ఐదు నెలలు బండి నడిచేదెలా? అయితే. కేంద్రం కాళ్లు   పట్టుకోవాలి,కాదంటే వెంకన్న జేబులు కొట్టాలి, అదీ కాదంటే, ఆస్తులు అమ్మేయాలి లేదా మందు బాబుల, సామాన్యుల మీద దుడ్డుకర్రతో దాడి చేయాలి, చార్జీలు, పన్నులు పెంచాలి, అవసరం అయితే అదీ ఇదీ ఇంకొన్ని కూడా చేయవలసి రావచ్చును. కానీ, ఎంతగా దిగాజారినా, బెగ్, బారో, స్టీల్ సూత్రాలు ఎన్ని పాటించినా, మరో రెండున్నర సంవత్సరాలు బండి లాగించడం అయ్యే పని కాదు.  ఆ నిజం, మన కంటే ముఖ్యమంత్రి, అయన సలహాదారులకే బాగా తెలుసు.. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి దేవుని నమ్ముకుని, దేవుని దయతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయానికి వచ్చారు. అవును, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ సీఎం జగన్ రెడ్డి, ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో పాటించిన పద్ధతినే, ఇప్పుడు జగన్ రెడ్డి ఏపీలో ఫాలో అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా,ఇప్పటికే, ప్రశాంత్ కిషోర్ టీమ్ కుడా రంగంలోకి దిగింది.  సర్వేలు మొదలయ్యాయి.ఏరి వేతలు, కుడికాలు, తీసివేతలు, అన్నీ మొదలయ్యాయి.ప్రజాగ్రహానికి గురవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకుహెచ్చరికలు వెళుతున్నాయి.   అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని భయపెడుతోంది ఒక్క ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, జగన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనలో అన్ని వ్యవస్థలు సుందర ముదనష్టంగానే తయారయ్యాయి. పాడుబడని వ్యవస్థంటూ ఏదీ మిగలలేదు.అన్ని వ్యవస్థలు ఒకే విధంగా  అఘోరిస్తున్నాయి, అందుకు  కళ్ళ ఎదుటే అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. ముఖ్యమంత్రి, పోలీసు బాసుల స్వీయ పర్యవేక్షణలో వైసీపీ ‘బీపీ’ బ్యాచ్ యద్దేచ్చాగా ఎవరి మీదనైనా దాడులు చేస్తుంది. అంతే కాదు, వైసీపీ పాలనతో ప్రజలు విసిగి వేసారి పోయారు. ఒక్కొక్క వర్గం తిరగ్ బడుతోంది. ప్రస్తుత పరిస్థితినే గమనించినా, ఓ వంక జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఎయిడెడ్ స్కూల్స్ మూత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన సాగుతోంది. “నీ అమ్మ ఒడి వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు,  నాడు నేడు కుట్రలు వద్దు, మా బడులు మూత పెట్టవద్దు” అంటూ తల్లి తండ్రులు ఆందోళన చేస్తున్నారు.  మరో వంక రేషన్ డీలర్లు రోడ్డెక్కారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, ఉపాధ్యులు ఎవరికీ వారు ఎవర్గానికి ఈ వర్గం ఆందోళన బాట పడుతున్నారు. ఇలా రోజు రోజుకు పరిస్థితి విషమిస్తున్ననేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులే కాకుండా, జాతీయి స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా జగన్ రెడ్డిని భయ పెడుతున్నాయి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చిన నేపధ్యంలో 2024 లోక్ సభ ఎన్నికల నాటికి, జాతీయ రాష్ట్ర స్థాయిల్లో, రాజకీయ సమీకరణలు మారే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.ఈ నేపధ్యంలో లోక్ సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల జరిగితే అసెంబ్లీ ఫలితాలపై జాతీయ అంశాలు  ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే, జగన్ రెడ్డి ముందు చూపుతో ముందడుగు వేస్తున్నారని, ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అలాగే,అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2023 ప్రదమార్దంలో, ఏపీ అస్సెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ముందస్తుకు వెళ్ళినంత మాత్రం చేతనే జగన్ రెడ్డికి ప్రజలు మరో అవకాశం ఇస్తారా, లేక, ‘ఒక్క ఛాన్స్ అన్నావ్, ఇచ్చాం, పాలన చూశాం, సత్తా తెలిసిపోయింది .. ఇక చాలు పోయిరా అనిసాగనంపుతారా,అనేది .. చెప్పేందుకు ఇంకొంత సమయం అవసరం. అయితే, బటన్ నొక్కి పైసలు జనం ఖాతాల్లోకి వేసినంత మాత్రాన జనం  సంతృప్తి చెందుతారు అనుకోవడం పొరపాటే అవుతుందని అంటున్నారు.

డ్ర‌గ్స్‌ హబ్‌గా ఏపీ.. గంజాయిపై జ‌న‌సేనాని గ‌రం గ‌రం..

డ్ర‌గ్స్‌-గంజాయి. కొంతకాలంగా ఏపీ రాజ‌కీయాలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. దేశం ఉలిక్కిప‌డేలా గుజ‌రాత్‌ ముంద్రా పోర్టులో ప‌ట్టుబ‌డిన వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ విజ‌య‌వాడ అడ్ర‌స్‌కే వ‌స్తున్నాయంటే మాట‌లా? బాలీవుడ్‌లో గాంజా దొరికితే కూడా.. అది విశాఖ నుంచే ముంబైకి స‌ప్లై అయింద‌ని ఏకంగా ఎన్‌సీబీనే ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం. ఇంత‌కు ముందు ఎప్పుడైనా ఏపీలో ఇలాంటి డ్ర‌గ్స్ సీన్ చూశామా? జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లోనే ఇలాంటి విప‌రీత ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని మండిప‌డుతున్నారు. అడ్డుకునే వాళ్లు లేక‌.. ప‌ట్టుకునే వాళ్లు ప‌ట్టించుకోక‌.. పాల‌కుల ఉదాసీన‌త వ‌ల్లే ఇలా ఏపీ డ్ర‌గ్స్‌-గంజాయికి కేరాఫ్‌గా మారింద‌ని అంటున్నారు. ఆ విష‌యం ప్ర‌శ్నిస్తే.. అధికార పార్టీకి బీపీ పెరిగింది. వీధి రౌడీల్లా టీడీపీ ఆఫీసుపై ప‌డి విధ్వంసం సృష్టించారు. ఆ కేసులో ఇంత‌వ‌ర‌కూ అరెస్టులు జ‌ర‌గ‌లేద‌నే విమ‌ర్శలు కూడా ఉన్నాయి.  ఏపీలో డ్ర‌గ్స్‌, గంజాయి దందాపై లేట్‌గా అయినా, లేటెస్ట్‌గా రియాక్ట్ అయ్యారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదక ద్రవ్యాల హబ్‌గా మారిందని ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందంటూ.. వ‌రుస‌ ట్వీట్లు చేశారు.  ‘‘గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి’’ అని పవన్ ట్వీట్ చేశారు.   ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన మీడియా ప్ర‌సంగ‌ వీడియో క్లిప్‌ల‌తో మ‌రో రెండు ట్వీట్లు చేశారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. 

పోలింగ్ కు కొన్ని గంటల ముందు టీఆర్ఎస్ కు ఊహించని షాక్? 

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేస్తున్న కరీంనగర్ జిల్లా హుజురుబాద్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరింది. ఎన్నికల సంఘం కొత్త ఆదేశాలతో మూడు రోజుల ముందే అంటే బుధవారం సాయంత్రమే గడువు ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనీ, మందును విచ్చలవిడిగా పంపిణి చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీకి.. పోలింగ్ అతి దగ్గరలో ఉండగా ఉహించని షాక్ తగిలింది. తాజాగా వచ్చిన సమస్యతో పోలింగ్ రోజున తమకు తీరని నష్టం జరుగుతుందనే ఆందోళనలో గులాబీ లీడర్లు కనిపిస్తున్నారు. అధికార పార్టీని అంతగా కలవరపడుతున్న అంశం కొవిడ్ వ్యాక్సినేషనే. కొవిడ్ టీకా తీసుకోనివారికి రేషన్ , పెన్షన్ ఇవ్వబోరని మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందంటూ డీఎంహెవ్ శ్రీనివాస రావు ప్రకటన చేసినట్లు వార్తలు వచ్చాయి. గంటల్లోనే ఈ ప్రచారం రాష్ట్రమంతా చేరింది. ఇదే ఇప్పుడు కారు పార్టీని కలవరపెడుతోంది. టీకా తీసుకోనోళ్లకు ప్రభుత్వ పథకాలు బంద్​ చేస్తామంటూ జరుగుతున్న ప్రచారం  టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నది. వ్యాక్సిన్​ ముఖ్యమే అయినప్పటికీ, పేదలు లబ్ధిపొందే స్కీంలను ఎలా ఆపుతారంటూ? పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. సోషల్​ మీడియా వేదికగా ఎంతో మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తమ కొంప ముంచేలా ఉందని గ్రహించిన అధికార పార్టీ వెంటనే రంగంలోకి దిగింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావుతో వివరణ ఇప్పించింది. టీకా తీసుకోనివాళ్ల రేషన్, పెన్షన్ ఇవ్వరంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని చెప్పించింది. అలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని స్పష్టం చేశారు శ్రీనివాసరావు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గ్రామాల్లోకి ఈ ప్రచారం వెళ్లిపోయింది. ఇదే అదనుగా బీజేపీ శ్రేణులు హుజురాబాద్ లో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో అక్కడి ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమైంది.  ఇదిలా ఉండగానే గద్వాల కలెక్టర్​ వల్లూరు క్రాంతి చేసిన ట్వీట్​కూడా సంచలనం రేకిత్తిచ్చింది. కొవిడ్ టీకా తీసుకోని వాళ్లకు నవంబర్ నెలలో రేషన్, పెన్షన్ ఇవ్వబోమని ఆమె ట్వీట్ చేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతీ జిల్లాలో అంతర్గతంగా ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్కువ వ్యాక్సినేషన్ అయిన గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు స్వయంగా అధికారులే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో రేషన్, పింఛన్ లబ్ధిదారుల లిస్టును కూడా తయారు చేసినట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్​ కోసం పథకాలు ఆపుతామని బెదిరిస్తున్న అధికారులు, రాబోయే రోజుల్లో ఓట్ల కోసం ఏదైనా చేస్తారేమోనని ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో ఇది ఎక్కడ తమను దెబ్బ కొడుతుందోనన్న ఆందోళనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. 

పోలవరం ప్రాజెక్ట్ భద్రమేనా? సొరంగాలు కుంగిపోవడంతో కలకలం..

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ భద్రమేనా? నిర్మాణ పనులు నాణ్యతతోనే జరుగుతున్నాయా?ఈ అనుమాననే కొన్ని రోజులుగా వస్తోంది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వరుసగా నాణ్యత లోపాలు కనిపిస్తుండం జనాలకు ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా గత రెండున్నర ఏండ్లుగా జరుగుతున్న పనుల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాటిని ప్రభుత్వం ఖండిస్తున్నా.. వరుసగా జరుగుతున్న ఘటనలతో మాత్రం భయాలు అలానే ఉన్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా తవ్విన జంట సొరంగాలు ప్రమాదంలో పడటం కలకలం రేపుతోంది. ఇటీవలి వర్షాలకు రాళ్లు జారిపడుతుండటంతో ఒక సొరంగం మట్టి, రాళ్లతో పూడుకుపోయింది. లైనింగ్‌ పనుల్లో నాణ్యతాలోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తోటగొంది-మామిడిగొంది గ్రామాల మధ్య జంట సొరంగాలు తవ్వారు. ఇటీవలి వర్షాలకు మామిడిగొంది వైపు తవ్విన సొరంగం పైభాగాన ఉన్న కొండ 30 మీటర్ల మేర కుంగిపోయి గొయ్యి ఏర్పడింది.  ప్రాజెక్టు కుడి కాలువ సామర్థ్యం పెంచాలని, జంట సొరంగాల వెడల్పు పెంచాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గతంలో సూచించడంతో సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆర్గనైజేషన్‌ అప్రూవల్‌ కోసం అధికారులు వేచి చూశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కొండపై మట్టి కరిగి రాళ్లు కిందకి జారడంతో సొరంగం సగం మేరకు పూడుకుపోయింది. ఆ రాళ్ల కింద ఏర్పాటుచేసిన లైనింగ్‌ సైతం కుంగిపోయింది. లైనింగ్‌లో వాడిన స్టీల్‌ సామర్థ్యం చాలకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. సొరంగాల తవ్వకంలో లైనింగ్‌ వేసుకుంటూ వెళ్లాల్సి ఉండగా అధికారులు ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. సొరంగం ఆరంభంలో మాత్రమే సుమారు 20 మీటర్ల మేర లైనింగ్‌ వేశారు.  సొరంగాల తవ్వకంలో జాప్యం వల్ల కొండలపై వర్షపు నీరు కిందకు దిగి అంతర్భాగంలో రాళ్లు జారిపడుతున్నాయి. లైనింగ్‌ లేకుండా ఈ పనులు చేయడం ప్రమాదకరమే అయినా.. కొందరు కార్మికులు అక్కడే పనిచేస్తున్నారు. లైనింగ్‌ లేకుండా ఇలాగే పనులు ఇలాగే కొనసాగిస్తే.. సొరంగం ఎగువన ఉన్న హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 20 వేల క్యూసెక్కుల జలాలు ప్రవహిస్తేజంట సొరంగాల లైనింగ్‌ సామర్ధ్యం నిలుస్తుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

లండన్ లో ఘనంగా లేబర్ పార్టీ MGFLP స్నాతకోత్సవం..

మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్ (MGFLP) ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థుల స్నాతకోత్సవం లండన్‌లోని లేబర్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రధాన కార్యదర్శి డేవిడ్ ఎవాన్స్ అధికారిక ధృవీకరణ పత్రాలను అభ్యర్థులకు అందించారు. లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా  కో ఛైర్మన్ రాజేష్ అగర్వాల్ , ఎంపీ డారెన్ జోన్స్ , వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ నాగరాజు మరియు కో-డైరెక్టర్ సామ్ జుతాని ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఆ సందర్భంగా అభినందించారు.  MGFLP అనేది లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాలో భాగం మరియు లేబర్ పార్టీలో భారతీయ సమాజ ప్రయోజనాలను కాపాడే సమూహం. ఈ బృందానికి ఎంపీ  డారెన్ జోన్స్ , లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ సహఅధ్యక్షులుగా ఉన్నారు.అభ్యర్థుల రాజకీయ ప్రయాణాన్ని బలోపేతం చేయడంలో సమిష్టి సన్నిహితంగా ఉండేలా, ఒకరికొకరు సహాయం చేసుకునే నెట్‌వర్క్‌ను రూపొందించడం ప్రోగ్రామ్ లక్ష్యం. పార్లమెంట్, అసెంబ్లీల్లో  యాక్టివ్ గా ఉండే రాజకీయ నేతలను తయారు చేయడమే తమ లక్ష్యమని  మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజు చెప్పారు.  లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా UKలోని భారతీయ సమాజం కోసం పని చేస్తూనే ఉంటుందని తెలిపారు. UK - భారతదేశం మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా  కో చైర్మెన్ రాజేష్ అగర్వాల్ చెప్పారు.  మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్ ద్వారా బ్రిటన్ లోని భారతీయులకు పార్లమెంటరీ మరియు ఇతర రాజకీయ అంశాలపై మార్గదర్శకం కల్పిస్తారు. MGFLPను 2020 ఆగస్టులో లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ ఏంజెలా రేనర్ ప్రారంభించారు. MGFLP కార్యక్రమాలను  డైరెక్టర్ ఉదయ్ నాగరాజు పర్యవేక్షిస్తారు.  మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని భారతీయ సమాజానికి చెందిన కొత్త తరం రాజకీయ నాయకుల రాజకీయ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. స్థానిక, ప్రాంతీయ మరియు జాతీయ ప్రభుత్వం అంతటా లేబర్ పార్టీలో కొత్త ప్రతిభను మెరుగుపరచడం మరియు పెంచడంపై దృష్టి పెడుతుంది. సమగ్ర ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. UK భారతదేశ సంబంధాలలో పాత్ర ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. నిబద్ధత, అంకితభావం మరియు కష్టపడి పనిచేసే కోహోర్ట్ మరియు బృందం చాలా విభిన్నమైన పని చేస్తుంది. వివిధ విశ్వాసాలు, లైంగికత, వైకల్యం మరియు కొంతవరకు భారతదేశంలోని భౌగోళిక ప్రాంతాలు మరియు సంస్కృతుల ఆధారంగా శిక్షణ ఉంటుంది. లేబర్ పార్టీ యొక్క అధికారిక శిక్షణా బృందం కూడా  ఇందులో భాగస్వామ్యం అవుతుంది. మెథడాలజీలో మెంటరింగ్ సెషన్‌లు, బ్రెయిన్‌స్టామింగ్, రియల్ లైఫ్ సిమ్యులేషన్ వ్యాయామాలు ఉంటాయి. లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ ఏంజెలా రేనర్, లేబర్ పార్టీ ఛైర్‌పర్సన్ అన్నెలిస్ డాడ్స్, జనరల్ సెక్రటరీ డేవిడ్ ఎవాన్స్, సీమా మల్హోత్రా, ఎంపీ మరియు షాడో మంత్రి క్లైర్ ఐన్స్లీతో సహా లేబర్ పార్టీ అగ్ర నాయకత్వం నుండి దాదాపు 14 మెంటరింగ్ సెషన్లలో పాల్గొంటారు.లీడర్ కార్యాలయంలో పాలసీ డైరెక్టర్, పార్లమెంటేరియన్లు వీరేంద్ర శర్మ, డారెన్ జోన్స్, నవేందు మిశ్రా, మీటే కోబన్, కౌన్సిల్ క్యాబినెట్ సభ్యుడు మరియు జాతీయ స్థాయిలో యువత భాగస్వామ్యాన్ని పెంచిన యువ నాయకుడు గ్రెగ్ బర్టన్, డైరెక్టర్ ఆఫ్ ఎలక్షన్ సపోర్ట్, క్యాంపెయిన్ డెలివరీ డైరెక్టర్, స్థానిక ప్రభుత్వం మరియు శిక్షణ, పాల్ ఉపెక్స్, రిచర్డ్ బెన్నెట్ ఎన్నికలు మరియు ప్రచారానికి నాయకత్వం వహించారు.  ప్రొగ్రామ్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజు  రూపొందించిన పొలిటికల్ స్కిల్స్  అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. రాజకీయ అవగాహన, లేబర్ పార్టీ యొక్క వర్కింగ్స్, స్టాండింగ్ ఫర్ పొలిటికల్ ఆఫీస్, ఆర్గనైజింగ్ మరియు క్యాంపెయినింగ్, కమ్యూనికేషన్ మరియు పాలసీమేకింగ్ అనే ఆరు కోణాలపై శిక్షణ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి వారం నిర్వహించే అనుకరణ వ్యాయామాల ద్వారా పబ్లిక్ స్పీకింగ్‌ సామర్ధ్యం పెరుగుతుంది.   

ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఫిక్స్.. కొత్తగా ఎవరెవరంటే? 

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వం కొత్త మంత్రులతో కొలువు తీరబోతోంది. అందుకోసం డిసెంబర్ 8వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. జగన్ తన కేబినెట్‌లోకి మంత్రులుగా అందరినీ కొత్త వారిని తీసుకుంటారని  తెలుస్తోంది. అయితే తన మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలని అనే అంశంపై సీఎం జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని అమరావతిలో వైరల్ అవుతుంది. ఆ క్రమంలో వివిధ జిల్లాల పార్టీ ఇన్ చార్జులతో సీఎం జగన్ పలుమార్లు సమావేశమై ఆ అంశంపై కూలంకుషంగా చర్చించారని సమాచారం.  ఈ సారి మంత్రివర్గ విస్తరణలో కులాలు, ప్రాంతాల ప్రాతిపదికతోపాటు తొలినాళ్ల నుంచి పార్టీని అంటి పెట్టుకున్న వారు, పార్టీలో సీనియర్లు, పార్టీ కోసం బలమైన వాయిస్ వినిపించే వారు, గత ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటి ఇచ్చిన వారు, 2024 ఎన్నికలు..... ఇలా పలు అంశాలను సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పును చేపట్టారని తెలుస్తోంది.  మరోవైపు రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేల పని తీరుపై ఇంటిలిజెన్స్ నివేదికలు ఇప్పటికే సీఎం జగన్ టేబుల్ పైకి చేరాయి. అలాగే ఇప్పటి వరకు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవులు నిర్వహించిన వారి వివరాలు సైతం సీఎం జగన్ వద్దకు చేరాయి. వాటి ఆధారంగా తాజాగా మాజీలవుతన్న వారికి పార్టీలోని వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సీఎం జగన్ మంత్రి వర్గ విస్తరణ కోసం కసరత్తు అని తెలియగానే.. ఫలువురు వైయస్ఆర్సీపీ ఆశావాహ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.    2019, ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 22 మంది లోక్ సభ సభ్యులుగా, 151 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. జూన్ 8వ తేదీన 25 మంది ఎమ్మెల్యేలతో జగన్ కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. వారిలో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే కొత్తగా కొలువు తీరిన మంత్రి వర్గం రెండున్నరేళ్ల వరకే ఉంటుందని... ఆ తర్వాత కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అప్పడే స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

గెలుపు ధీమా.. ఓటమి భయం! హుజురాబాద్ ఎవరిది..?

హుజూరాబాద్  ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరవుతున్న కొద్దీ పార్టీ నాయకులు, అభ్యర్ధులలో టెన్షన్,  క్షణం క్షణం పెరుగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ అభ్యర్ధికి ఆ అభ్యర్ధి పైకి గెలుపు తమదే అనే ధీమాను వ్యక్తపరుస్తున్నారు.కానీ గుండెల్లో గుబులు మాత్రం అందరినీ వెంటడుతూనే ఉందని,వారి మాటలు,ముఖకవళికలలో బయట పడుతూనే ఉందని సన్నిహితుల సమాచారం.  ముందు నుంచి సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్న అధికార తెరాస, ఇప్పటికీ అదే ధీమాతో వుంది. గడచిన ఏడేళ్ళలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గట్టేక్కిస్తాయని తెరాస గంపెడాశతో వుంది. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ముందు నుంచే ఓ పథకం ప్రకారం నియోజక వర్గానికి భారీగా నిధులను పంప్ చేశారు. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే వందల కోట్ల రూపాయల పనులు, అదే స్థాయిలో సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను మంజూరు చేశారు. చివరకు బ్రహ్మాస్రంక గా దళిత బంధును ప్రయోగించారు.ఈ అన్నటికీ తోడు, మరో రెండున్నరేళ్ళు అధికారంలో ఉండే పార్టీగా, ప్రజలు తమనే గెలిపిస్తారనే తెరాస నాయకులు ధీమాగా ఉన్నారు.  భారతీయ జనతా పార్టీ, బీజేపీ, అభ్యర్ధి ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్’,సానుభూతి పైనే ఆశలు పెట్టుకుంది. ఇంచుమించుగా 18 సంవత్సరాలుగా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ కు ప్రజల్లో మంచి పేరు  పలుకుబడి ఉన్నాయి. పిలిస్తే పలికే నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆలాగే కష్టం సుఖం పంచుకునే ‘ఇంటి మనిషి’ గా ప్రజల గుండెల్లో చోటుంది. ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి కేటీఆర్ కావాలనే, ఆయనపై అపనిందలు మోపి అన్యాయం చేసారనే సానుభూతి వుంది. తెలంగాణ ఉద్యమంలో  రాష్ట్ర ఏర్పాటులో తమకు కుడిభుజంగా ఉన్న ఈటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వేటు వేయడాన్ని స్థానిక తెరాస శ్రేణులు కూడా జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇది ఆయన పట్ల సానుభూతిని పెంచింది. ఈటలపై తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేసిన అక్రమ భూఆక్రమణల ఆరోపణలను ప్రజలు నమ్మలేదు. దీంతో ఈటల మంచి తనం, నిజాయతీలే ఆయన్ని గెలిపిస్తాయని, అటు ఈటల, ఇటు బీజేపీ ధీమాగా ఉన్నాయి.  అయితే వేటుకు , ఉప ఎన్నికకు మధ్య దూరం పెరగడంతో సానుభూతి చల్లారడంతో అంతిమ ఫలితం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా ధరల పెరుగుదల అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముడివేసి, తెరాస చేసిన ప్రచారం, అదే విధంగా గడచిన మూడు నాలుగు నెలల సమయంలో  ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈటల ఓటును దెబ్బతీసే ప్రమాదం ఉందని, పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.  ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, అసలు పోటీచేయాలా వద్డా, దగ్గర మొదలై, బరిలో దిగడమే కాకుండా ప్రాధాన ప్రత్యర్ధులు బీజేపీ, తెరాస అభ్యర్ధులు ఇద్దరికీ, హస్తం పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొండా సురేఖ సహా చాలా పేర్లను పరిశీలించి చివరకు విద్యార్ధి నాయకుడు వెంకట్’ను బరిలో దింపింది. వెంకట్ యువకుడే అయినా, కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన 60 వేల ఓట్లకు తోడు 32 వేలకు పైగా ఉన్నవిద్యార్ధి, నిరుద్యోగ ఓట్లను వైపుకు తిప్పుకుంటే, గెలుపు తమదే అవుతుందని కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు విషయం ఎలా ఉన్నా, హస్తం పార్టీ ఎవరి ఓటును ఎక్కువ పట్టుకు పోతుంది అనేదానిపై, బీజేపే, తెరాస గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.  ఇదలా ఉంటే ఉపఎన్నికల ప్రచారం మరో రెండు  రోజులో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రక్రియ మొదలైంది.  పత్రం, ఫలం, తోయం .. తాయిలం ఓటర్ల తలుపులు తడుతున్నాయి. అదే విధంగా ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అనేలా టీఆర్ఎస్, బీజేపీ, ప్రచారం కోరు పెంచాయి.  బిజెపి, టిఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు సొంతగా సర్వేలు చేయించుకుంటూ ఎవరి బలాలు బలహీనతలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా, మొదటినుంచి సర్వేలనే నమ్ముకుంటూ వస్తున్న తెరాస, ఇంతవరకు వెనకబడ్డా, ఇప్పుడు ముందడుగులో ఉందని ప్రచారం చేసుకుంటోంది. మరో వంక బీజేపీ ఈటల గ్రాఫ్ దూసుకుపోతోందని, చెప్పుకుంటోంది. అయితే, ఇందులో ఏది నిజమో, ఏది కాదో, నవంబర్ 2 కానీ తెలియదు. అదలా ఉంటే మరోవంక  నియోజక నియోజక వర్గంలోనే కాకుండా రాష్ట్రం అంతటా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలాలపై బెట్లు (పందాలు) జోరుగా సాగుతున్నట్లు సమాచారం. 

ఏపీ సర్కార్ వెయ్యి కోట్ల అప్పు.. పవన్ వార్నింగ్.. హుజురాబాద్ లో హీట్.. సమంతకు రిలీఫ్ టాప్ న్యూస్@7PM

మరో వెయ్యి కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. 7.2% వడ్డీతో ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన రుణ పరిమితిలో 10 వేల కోట్లు సెక్యూరిటీ బాండ్లను వేలం ద్వారా సమీకరించింది. మరో 500 కోట్లకు మాత్రమే ఏపీకి రుణ పరిమితి మిగిలి ఉంది.  మళ్లీ అప్పు కోసం కేంద్రం దగ్గరకు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు వెళ్తున్నారు.   ---- ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజాగా కాకినాడలోని జగన్నాథపురం సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ పాఠశాలను మూసివేయవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చుట్టుముట్టారు. స్కూలు మూసివేస్తే పిల్లలు ఇబ్బందిపడతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ---- రాష్ట్రంలోని ఎయిడెడ్‌  స్కూళ్లు, కాలేజీలను మూసివేయవద్దని ప్రభుత్వాన్ని ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. బెల్టులు, బూట్లు, అమ్మవడి మాకొద్దు.. తమ స్కూల్ తమకు కావాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు. సీఎం డౌన్‌ డౌన్ అంటూ నిన్న విశాఖ జ్ఞానాపురం దగ్గర విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేసారని పవన్ ట్వీట్‌ చేసారు. ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల మూసివేతకు అధికార వైసీపీ నిర్ణయంతో ఈ సమస్య ఏర్పడిందని పవన్‌ ట్వీట్‌ చేసారు.  --- టీడీపీ నేత పట్టాభి వీడియో విడుదలైంది. తన ఇంటిపై జరిగిన దాడిలో తన కుమార్తె తీవ్రమైన మనోవేదనలోకి వెళ్లిందని పేర్కొన్న ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెను తీసుకుని బయటకు వచ్చానని పట్టాభి వివరించారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించారని చెప్పారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విధ్వంసానికి దిగారని మండిపడ్డారు.  ----- ఉప ఎన్నిక జరుగతున్న హుజురాబాద్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటల రాజేందర్ ఏం చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. ఎవరెక్కువ దోచుకున్నారనే విషయంలోనే కేసీఆర్, ఈటల మధ్య పంచాయితీ వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని ఉత్తమ్ ఆరోపించారు. గతంలో ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఉత్తమ్ విమర్శించారు.  ------ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధినేత  షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం యాత్రలో ఆమె ఈ విమర్శలు చేసారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని  షర్మిల ఆరోపించారు. మాట తప్పితే రాళ్లతో కొట్టమన్నారని, ఇప్పుడు ఏం చేయాలో కేసీఆర్ చెప్పాలని షర్మిల డిమాండ్ చేసారు. అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకే ఉద్యోగాలా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులకు ఆత్మహత్యలా అని షర్మిల అన్నారు.  ------ ఐఐటీ తదితర జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం మెరుగైన ర్యాంకులు సాధించిన ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల విద్యార్థులను సీఎం జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఐఐటీ, ఇతర ర్యాంకర్లతో సీఎం జగన్ భేటీ అయ్యారు. వారికి ల్యాప్ టాప్ లు బహూకరించారు. ఉన్నతస్థాయికి ఎదిగే క్రమంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందుతాయని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ----- సమంతపై కంటెంట్ ను యూట్యూబ్ చానళ్లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈమేరకు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సీఎల్ వెంకట్రావు సైతం తన కంటెంట్ ను తొలగించాలని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. యూట్యూబ్ చానళ్లు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడరాదని, అదే సమయంలో సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. ----- పరువు నష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని తమ ముందు హాజరు కవాల్సిందిగా గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టు ఆదేశించింది. ‘మోదీ’ అనే పేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్‌పై పరువునష్టం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఈ ఏడాది జూన్ 24న కోర్టు ముందు రాహుల్ హాజరయ్యారు. --------- టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఆ మ్యాచ్ లపై బెట్టింగ్ జోరుగా సాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. క్రికెట్ లైవ్ గురు యాప్ ద్వారా బెట్టింగ్ జరుగుతోందని తెలిపారు. బెట్టింగ్ గురించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బెట్టింగ్ సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ---

హెల్మెట్ల‌తో డాక్ట‌ర్ల నిర‌స‌న‌.. ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌..

నేను రానుబిడ్డో స‌ర్కారు ద‌వాఖానాకు.. అనే పాట ఫుల్ ఫేమ‌స్‌. ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వ‌చ్చే రోగులు ప‌డే అవ‌స్థ‌ల గురించి వివ‌రించే సాంగ్‌. స‌ర్కారు ద‌వాఖానా అంటేనే స‌మ‌స్య‌ల నిల‌యం. స‌రైన వ‌స‌తులు ఉండ‌వు, మెరుగైన వైద్యం ల‌భించ‌దు, సిబ్బంది ప‌ట్టించుకోరు, టెస్టులు మందుల కొర‌త‌.. ఇలా రోగుల అవ‌స్థ‌లు అన్నీఇన్నీ కావు. అయితే, ఇలాంటి స‌మ‌స్య‌లు కేవ‌లం రోగుల‌కేనా?  మాకూ ఉన్నాయంటున్నారు జూనియ‌ర్‌ డాక్ట‌ర్లు. మేము ప‌నిచేయ‌లేం స‌ర్కారు దవాఖానాలో అంటూ జూడాలంతా ధ‌ర్నాకు దిగడం ఉస్మానియా ఆసుప‌త్రిలో ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.  ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పీజీ విద్యార్థినిపై ఫ్యాన్ విరిగి పడటం క‌ల‌క‌లం రేపింది. బాధిత‌ వైద్య విద్యార్థినికి గాయాలయ్యాయి. దీంతో జూడాల‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. స‌మ‌స్య‌లు తీర్చ‌డం లేదంటూ వారంతా ధ‌ర్నాకు దిగారు. ఫ్యాన్ విరిగి మీద‌ప‌డినందుకు నిర‌స‌న‌గా జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. హెల్మెట్లు ధరించి డ్యూటీల‌కు హాజ‌రై నిరసన తెలప‌డం సంచ‌ల‌నంగా మారింది.    ఉస్మానియా ఆసుప‌త్రిలో జూడాలు మౌన దీక్ష కూడా చేపట్టారు. ఘటనపై సూపరిండెంట్‌కి ఫిర్యాదు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఉస్మానియాలో రోగులు, వైద్య సిబ్బదికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. జూడాలు ఇలా హెల్మెట్లు ధ‌రించి డ్యూటీ చేయ‌డం.. మౌన దీక్ష చేప‌ట్ట‌డం.. ఉస్మానియాలో స‌మ‌స్య‌ల తీవ్ర‌త‌ను తెలుపుతోంది.   

నవరొచ్చు చానల్..  యూ ట్యూబ్ చానల్స్ కు నీతులా?

చెప్పచ్చు ... తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపోచ్చు ... దాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరినీ అదే గాటన కట్టేయడమే ఓ అడ్డగోలు వ్యవహారం అయితే, అలాంటి తప్పులు వందల్లోనో ఇంకా ఎక్కువో చేసిన ఓ పెద్ద ముత్తైదువ తగుదునమ్మాఅని ఎగరేసుకుని ... యూ ట్యూబ్ చానల్స్ కు నీతులు చెప్పడం, సిగ్గుచేటు... ఇంకా చెప్పాలంటే ...ఛీ... థూ .. యాక్ అని కూడా అనవచ్చును. ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ’మా’ ఎన్నికల సందర్భంగా సినిమా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడి బజారున పడ్డారు. నాలుగు గోడల మధ్య గుట్టుగా చక్కదిద్దుకోవలసిన వలసిన ‘మా’ కుటుంబ కలహాలను, వాళ్ళే బజారున పడేసుకున్నారు. సినిమా అన్నా,సినిమా వాళ్లాన్నా తెలుగోడికి ఉండే ప్రత్యేక క్రేజ్, ఇంటరెస్ట్ అందరికీ తెలిసిందే ..సో.. సహజంగానే మీడియా అటుకేసి ఫోకస్  పెట్టింది. అలాగే అదే సమయంలో హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్యల విడాకుల వ్యవహారం  కూడా రోడ్డెక్కింది. సెలబ్రిటీలు అయినా లేక సామాన్యులే అయినా వారి వారి సంసారం వ్యవహారాలు ... వారి వారి సొంతం ..కానీ, ఒక సారి గడప దాటితే ఇక అంతే .. అదే సెలెబ్రిటీల విషయం అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. అందుకే శ్రీ శ్రీ అంతటి మహాకవే ... పబ్లిక్’లో నిలబడితే ..ఏమైనా అంటాం..అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగని సెలెబ్రిటీల సొంత వ్యవహరాల్లోకి దూరి పోమని కాదు. ఈ నేపధ్యంలో కొన్ని కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్, గీత దాటితే దాటుండ వచ్చును. ఆమాటకొస్తే, యూ ట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాదు, తొమ్మిది నోములు చేసిన ఆ  పరమ పవిత్ర పత్తిత్తు చానల్ సహా అన్ని చానల్స్, చివరకు పత్రికలు కూడా, అదుపు తప్పి అడ్డగోలు రాతలు రాసాయి ... చర్చలు పెట్టాయి .. రచ్చ చేశాయి. అయితే, ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు యూ ట్యూబ్ ఛానల్స్’ పై ఎదో విమర్శ చేశారని, సమంత ఇకవరిపైనో కేసు పెట్టారని,  ఇంకెవరో ఎదో అన్నారని, తగుదునమ్మా అని,  ఆ నవరొచ్చు చానల్  యూ ట్యూబ్ చానల్స్’  నీతులు బోధించడం గురువింద నీతిని గుప్పుమనిపిస్తోంది.  యూ ట్యూబ్ చానల్స్’పై ఏ ఏ కేసులు పెట్టొచ్చో,  నవరొచ్చు యాక్’రమ్మలు వంతుల వారీగా వివరించారు. వ్యూస్ కోసం రోత రాతలనీ, రాతలపై వాతలనీ, అన్నీ రొచ్చుగుంట చానల్’ కు వర్తించే సూక్తులే వల్లే వేశారు. ఒకవేలు ఎదుటివారిపి చూపేటప్పుడు నలుగు వెళ్ళు తమ వైపు చుపుతాయనే ఇంకిత జ్ఞానం లేనప్పుడు ఇదిగో ఇలాంటి పిచ్చి కూతలు , రొచ్చుగుంట చర్చలే వస్తాయి.  అదే సమయంలో గురువింద 9’ తనని తాను తిరగేసి చూసుకుంటే,కింద నల్లని  అరే (6) కాదు, అంతకు ఆరేడు రెట్లు ఎక్కువ కేసులు కనిపిస్థాయి. ఒక్క డిఫేమేషన్ కేసులు మాత్రమే కాదు, ఇంకా ఫోర్జరీ సహా చాలా చాలా  ఇతర కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. వార్తలు రాతలకు సంబదించిన కేసులే కాదు. బ్లాకు మెయిల్ కేసులు, ఇంకా నీచమైన కేసులు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబదించి,గౌరవ శాసన సభ్యులను అవమాన పరిచే విధంగ పోగ్రాం చేసిన ఆ చానల్ సీఈఓ అరెస్ట్ అయ్యారు. అంతే కాదు,  టీవీ చానల్ ఆఫీస్ లో పోలీసులు తనిఖీలు చేశారు, అరెస్టులు జరిగాయి. టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్పుడు వార్తలు ప్రసారం చేయడం, సంచలనం కోసం  రెచ్చగొట్టే విధంగా సమాజంలో చిచ్చుపెట్టే చర్చలకు సంబంధించి ఇంకెన్ని కేసులున్నాయో ఏమో కానీ, కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు సమయంలో తెచ్చిన నోట్లలో చిప్  పెట్టిందని, ఆ నోటు మన దగ్గర ఉంటే , మనం  ఎక్కడుంది, మీరేం చేస్తోంది అంతా ప్రభుత్వానికి తెలిసి పోతుందని, తప్పుడు  ప్రచారం చేసింది మాత్రం అందరికీ తెలిసిన నిజం.  నిజానికి,  ఈ గురువింద 9 చానల్ చరిత్ర అంతా తొమ్మది నేరాలు తొమ్మది తొమ్ముదుల ఘోరాలు. అలాంటి, నీచ చానల్ కు యూ ట్యూబ్ చానల్స్ అన్నిటికి ఫ్రాడ్ ముద్ర వేసి బదనాం చేసే హక్కు ఎవరిచ్చారు .. నిజానికి ఈ ప్రోగ్రాం ప్రసారం చేసినందుకు ఎవరైనా డిఫెమేషన్  కేసు వేయవచ్చునేమో ...

రైతులకు సూపర్ గుడ్‏న్యూస్.. ఖాతాల్లో ఏకంగా 12 వేలు జమ! 

అన్నదాతలకు ఇది నిజంగా పండుగలాంటి వార్తే. రైతుల ఖాతాల్లో ఏకంగా 12 వేల రూపాయలు జమ కాబోతున్నాయి. దీపావళి సందర్భంగా రైతులకు సంబంధించి ఈ కీలక ప్రకటన రాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గత నాలుగేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోస కల్పిస్తోంది. ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా రూ. 6 వేల వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మోడీ ప్రభుత్వం.  అయితే తాజాగా రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రైతులకు ఇప్పటివరకు ప్రతి ఏటా  కేంద్రం రూ. 6 వేలను విడతల వారిగా అందిస్తుండగా.. ఇక నుంచి  6 వేలకు బదులుగా రూ. 12 వేలు ఇవ్వనుంది. ప్రతి విడతలో రైతులకు రూ. 2 వేలకు బదులుగా రూ. 4 వేలు జమ కానున్నాయి అన్నమాట. 2021 దీపావళీ నాటికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతోంది బీజేపీ సర్కార్.  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు త్వరలో 10వ విడత నగదు అందుకోనున్నారు. పదవ విడత నగదు ట్రాన్స్‏ఫర్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. డిసెంబర్ 15న రైతులకు 10వ విడత నగదు అందించనున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లను బదిలీ చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 10వ విడతను డిసెంబర్ 15, 2021 నాటికి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.  గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లేదా అంతకు ముందు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇంతకుముందు అందుకోకపోతే వాళ్లు చివరి విడత మొత్తాన్ని తర్వాతి విడతతో పాటుగా రూ. 4000 నేరుగా వారి ఖాతాలో పొందుతారు.  ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధిఖాతా నమోదుకు చివరి తేదీ 30 అక్టోబర్ 2021. PM-KSNY విడతను తనిఖీ చేయడానికి దశలు: * అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/. లాగిన్ కావాలి * హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ సెక్షన్ ఓపెన్ చేయాలి. * ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ లబ్ధిదారుడు.. వారి అప్లికేషన్ స్టేటస్ తనిఖీ చేయవచ్చు. అందులో రైతుల పేరు.. వారి బ్యాంకు వివరాలు ఉంటాయి. * ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. * ఆ తర్వాత గెట్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేయాలి

జ‌పాన్ మిత్ర‌వింద‌.. సామాన్యుడిని పెళ్లాడిన రాకుమారి..

ఆమె జ‌పాన్ రాకుమారి. పేరు మ‌కో. ఓ సామాన్యుడిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుంది. కానీ, రాజ కుటుంబం నిబంధ‌న‌లు క‌ఠినంగా ఉన్నాయి. బ‌య‌టి వారిని పెళ్లి చేసుకుంటే.. ఆమె రాచ‌రికాన్ని వ‌దులుకోవాల్సి ఉంటుంది. రాజ‌భ‌ర‌ణ‌మూ కోల్పోవాల్సి ఉంటుంది. అయినా, ఆమె రాచ‌రికం కంటే.. రాజ‌భ‌ర‌ణం కంటే.. ప్రేమే గొప్ప‌ద‌ని భావించింది. ప్రియుడు కీ కొమురోను పెళ్లాడింది. మూడేళ్లుగా సాగుతున్న ఆ వివాహ వివాదం.. తాజాగా వారి వివాహ‌బంధంతో సుఖాంతం అయింది. జ‌పాన్‌లో ఆ పెళ్లి సంచ‌ల‌నంగా మారింది. మకో - కిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్‌ ప్యాలెస్‌ అధికారికంగా ధ్రువీకరించింది. పెళ్లి తర్వాత మకో రాజప్రసాదాన్ని వీడారు. ప్యాలెస్‌లో ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు ప్రకటించారు.  జపాన్‌ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తె మకో. టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో చదువుకున్నారు. తనతో పాటు చదువుకునే కొమురోతో ప్రేమ‌లో ప‌డ్డారు. 2017లోనే వారి ప్రేమ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్టు వారు అప్పుడే ప్రకటించారు. అయితే ఏడాది తిరిగే స‌రికి అనుకోని స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో వారి పెళ్లి అప్పట్లో రద్దయ్యింది. దీంతో 2018లో కొమురో.. లా చదివేందుకు న్యూయార్క్‌ వెళ్లిపోయారు. మూడేళ్ల పాటు కొమురో యూఎస్‌లోనే ఉండిపోయారు. జపాన్‌కు ఒక్క‌సారి కూడా రాలేదు.  గత నెలలో చదువు పూర్తి చేసుకుని కొమురో జ‌పాన్‌కి తిరిగొచ్చారు. మ‌కో-కిమురోలు పెళ్లి ప్రతిపాదన మ‌ళ్లీ తీసుకొచ్చారు. అప్ప‌ట్లో త‌లెత్తిన‌ ఆర్థిక వివాదంపై కొమురో లిఖిత‌పూర్వ‌క హామీ ఇవ్వ‌డంతో.. వారి పెళ్లికి మ‌కో కుటుంబం అంగీకారం తెలిపారు. ఎలాంటి హ‌డావుడి లేకుండా చాలా సింపుల్‌గా మ‌కో-కిమురోల వివాహం జ‌రిపించేశారు. సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించలేదు. వీరు పెళ్లిని ధృవీక‌రిస్తూ అధికారికంగా పత్రాలు మాత్రం విడుదల చేశారు.  జపాన్‌ రాజ కుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల‌నేది రూల్‌. ప్రేమ కోసం.. గాఢంగా ప్రేమించిన ప్రియుడి కోసం అందుకు సిద్ధ‌మైన మ‌కో.. రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్లను వ‌దులుకొని మ‌రీ.. కిమురోను వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత రాజ‌మందిరం వీడుతూ భావోద్రేగానికి లోన‌య్యారు. మ‌గ‌ధీర మూవీలో మ‌రుజ‌న్మ ఎత్తి మ‌రీ ప్రేమ‌ను సొంతం చేసుకున్న మిత్ర‌వింద‌లా కాకుండా.. మ‌కో రాచ‌రికాన్ని త్య‌జించి మ‌రీ త‌న ప్రేమ‌ను సాధించుకోవ‌డం.. ప్రియుడిని పెళ్లి చేసుకోవ‌డం.. కాస్త‌ సినిమాటిక్‌గా ఉన్నా.. వారిది చ‌రిత్ర‌లో నిలిచే వివాహ‌బంధం. 

భారత్- పాక్ మ్యాచ్ పై సానియా మీర్జా సంచలన కామెంట్స్...

టీట్వంటీ వరల్డ్ కప్ లో కోహ్లీ సేన పై పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.భారత్ కనీస పోటీ ఇవ్వకపోవడంతో కోహ్లీ సేనపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. సోషల్ మీడియాలో తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత మాజీ క్రికెటర్లు, అనలిస్టులు కూడా భారత ఓటమిపై తమదైన విశ్లేషణులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ అభిమానుల మధ్య వార్ కూడా సాగుతొంది. పాక్ గెలుపుపై అక్కడి రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా భారత్ - పాక్ మ్యాచ్ పై స్పందించారు భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ సానియా మీర్జా.  తన భర్త షోయబ్ మాలిక్‌ ను ‘జిజాజీ’ లేదా బావ అని అభిమానులు పిలిచిన వైరల్ వీడియోపై సానియా మీర్జా తాజాగా వ్యాఖ్యానించింది.  ఆదివారం భారత్ తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అభిమానుల గుంపు ‘జిజా జీ’ అని నినాదాలు చేసింది. షోయబ్ మాలిక్ 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని పెళ్లాడినప్పటి నుంచి అభిమానులు మ్యాచ్ జరుగుతున్నపుడు జిజా జీ పదాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి తొమ్మిది సెకన్ల క్లిప్ ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. ఇది మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 4 లక్షలకు పైగా వ్యూస్ ను సంపాదించింది. ఈ వీడియో సానియా మీర్జా దృష్టిని కూడా ఆకర్షించింది.ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ సానియా మీర్జా నవ్వుతో కూడిన రెండు ఎమోజీలు, రెండు హృదయాల ఎమోజీలతో స్పందించారు.  ‘‘క్రీడాస్ఫూర్తి, సహృదయత యొక్క ఈ ప్రదర్శనను పలువురు ప్రశంసించారు.’’ అని సానియామీర్జా సమాధానం ఇచ్చారు.

హైద‌రాబాద్‌ను కోతులు స్వాధీనం చేసుకున్నాయా?

జి.ఉల‌గ‌నాథ‌న్. జ‌ర్న‌లిజంలో మేటి. పార్ల‌మెంటేరియ‌న్‌కు అసోసియేట్ ఎడిట‌ర్‌. ది న్యూయార్క్ టైమ్స్‌కు కాల‌మిస్ట్‌. గ‌తంలో ద‌క్క‌న్ హెరాల్డ్‌, ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌లో న్యూస్ ఎడిట‌ర్‌గా చేశారు. సిమ్‌బ‌యోసిస్‌లాంటి ప‌లు ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల్లో మీడియా కోర్సుల‌కు ప్రొఫెస‌ర్ కూడా. బెంగ‌ళూరులో సెటిల్ అయిన ఆయ‌న ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఐదు రోజులు ఉన్నారు. త‌న ఐదు రోజుల ఎక్స్‌పీరియ‌న్స్‌ను, గ‌త హైద‌రాబాద్‌కు ప్ర‌స్తుత న‌గ‌రానికి వ‌చ్చిన మార్పుల గురించి త‌న‌దైన శైలిలో అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఆ వివ‌రాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. హైద‌రాబాద్ గురించి జి.ఉల‌గ‌నాథ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే... హైదరాబాద్ టుడే (ఐదు రోజుల బస తర్వాత నేను గ్రహించిన విష‌యాలు):  1. లేటెస్ట్ ఓల్డ్ సిటీగా మారింది, ఇప్పుడు నాలుగు నగరాలు ఉన్నాయి. పురాతన నగరం చార్మినార్ & ఆవల, ప్రస్తుత హైదరాబాద్ పాత నగరం, సికింద్రాబాద్, కొత్త హైటెక్ సిటీ. ఇక్కడ పాక్షిక అక్షరాస్యులు మరియు ఎక్కువగా అసభ్యత కలిగిన ప్రజలు కోటీశ్వరులుగా మారారు. వారు శక్తి మరియు డబ్బును చాటుకోవడానికి ఇష్టపడతారు.  2. ట్రాఫిక్ ఎక్కువ‌. రోజుకు దాదాపు 20 గంటల ట్రాఫిక్ ఉంటుంది. పాదచారులకు రోడ్లు దాటడానికి కనీసం 15 నిమిషాలు పడుతుంది. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, జీవిత బీమా చేయించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ఒకప్పుడు ట్రాఫిక్ పోలీస్ అనే జాతి ఉండేది కానీ ఇప్పుడు అది అంతరించిపోయింది.  3. పాత సైకిల్ రిక్షా స్థానంలో వ‌చ్చిన‌ ఆటోలు విలాసవంతమైన ప్రజా రవాణా. బస్సులు తగ్గించబడ్డాయి. ఆటోలలో కనీస ఛార్జీ 100 రూపాయలు. ఆటో డ్రైవర్ల ఇష్టానుసారం ఆ ధ‌ర డ‌బుల్‌, త్రిబుల్ అవుతుంది. చిన్న కరెన్సీలు ఉన్నాయని ఆటోవాలాల‌కు తెలియదు.  4. కేవలం మూడు రకాల కార్లు మాత్రమే ఉన్నాయి. ఆడిస్, పోర్చే మరియు లెక్సస్‌లు ధనవంతులు & శక్తిమంతుల కోసం. బ్యూరోక్రాట్‌ల కోసం ఫార్చ్యూనర్లు. చిన్న రాజకీయనేత‌లు, వారి కుటుంబాల కోసం ఇన్నోవాలు. ఇతర బ్రాండ్లు దాదాపుగా లేవు.  5. మంచి శాఖాహార రెస్టారెంట్లను కనుగొనడం చాలా కష్టమైన పని. చౌకైన, రుచిలేని 'టిఫిన్ సెంటర్లు'..  లేదంటే, భోజనం ధర రూ .400 కంటే ఎక్కువ ఉండే  ఫాన్సీ హోటళ్లు. అక్క‌డ రుచిక‌ర‌మైన తాలీస్ తిన‌డానికి సీటు దొర‌కాలంటే పెద్ద క్యూలో వేచి ఉండాలి. ఈ లూటింగ్ కేఫ్‌లతో పోలిస్తే బెంగళూరు స్వర్గం.  6. ఇరానీ టీ కేఫ్‌లు వేల సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు ప్రతీ కాలనీలో వందలాది ఆసుపత్రులు వ్యాపారం చేస్తున్నాయి. ICMR ప్రకారం, తెలంగాణలో అత్యధిక సంఖ్యలో నకిలీ వైద్యులు ఉన్నారు. 7. కార్, టూ వీలర్ రైడర్లు.. రేపు లేదన్నట్టు డ్రైవ్ చేస్తుంటారు. హార్న్‌ను చాలా బిగ్గరగా ఉపయోగించ‌డం.. రోడ్డుపై ఉన్న మిగిలిన వ్యక్తులను చెవిటి వారిగా నిరంతరం ఒప్పించడం.  8. మాస్క్‌లు మరియు హెల్మెట్‌లు అవసరం లేదు. చాలామంది వాటిని చూడలేదు. వ్యక్తిగతంగా కంటే గులాబీ కటౌట్‌లలో ఎక్కువగా కనిపించే ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. 9. హైదరాబాద్ మెట్రో మాత్రమే ఆదా చేసే ఏకైక విష‌యం. ఢిల్లీ మెట్రో తర్వాత నేను దేశంలో రెండవ అత్యుత్తమ ర్యాంక్‌ని ఇస్తాను. బెంగళూరు మెట్రోతో పోలిస్తే సిగ్గుచేటు, ఈ కాంక్రీట్ అడవిలో చిన్న సందులు మరియు బైలేన్‌లలో స్తంభాలను స్థాపించడానికి వారు స్థలాన్ని కనుగొనడం ఒక అద్భుతం.  10. ఈ పరిస్థితికి క్రెడిట్ లేదా నింద ఎవరికి వస్తుంది? వాస్తవానికి మ‌న‌ స్నేహితుడు చంద్రబాబు నాయుడుకే. ఆయ‌న‌ బిల్లులను, క్లింటన్ మరియు గేట్స్‌ను  తీసుకురావడంలో విజయం సాధించారు. న‌గ‌రాన్ని మార్చారు. కానీ, కోతులు స్వాధీనం చేసుకుంటాయని ఊహించలేదు.