పంచ్ ప్ర‌భాక‌ర్‌కు హైకోర్టు పంచ్‌.. త్వ‌ర‌లోనే అరెస్ట్‌!

వాడో పెద్ద వెద‌వ‌..అంటారు. కోతికి కొబ్బ‌రి చిప్ప‌లా.. వాడికి సోష‌ల్ మీడియా..అని విమ‌ర్శిస్తుంటారు. వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ.. ప్ర‌తీదానికీ టీడీపీని త‌ప్పుబ‌డుతూ.. శాడిజం ప్ర‌ద‌ర్శిస్తుంటార‌ని చెబుతారు. అద్దూఅదుపూ లేని అడ్డ‌గోలు పోస్టుల‌తో.. ఊర‌కుక్క మాదిరి నోటికొచ్చిన‌ట్టు వాగుతూ.. విదేశాల్లో న‌క్కి.. ఏపీలో చిచ్చు రాజేస్తుంటాడ‌ని మండిప‌డుతుంటారు. సోష‌ల్ మీడియాలో పంచ్ ప్ర‌భాక‌ర్ చేసేంత‌ ర‌చ్చ‌..రొచ్చు.. మ‌రెవ‌రూ చేయ‌ర‌ని అంటారు. అదే ఊపులో, అదే బ‌లుపుతో, అదే వెర్రిత‌నంతో.. త‌న వెనుక‌ వైసీపీ ఉంద‌నే విచ్చ‌ల‌విడిత‌నంతో.. కోర్టుల‌పైనా నెగ‌టివ్ పోస్టులు పెట్టాడు. కోర్టు తీర్పుల‌నే త‌ప్పుబ‌డుతూ.. త‌ప్పుడు కామెంట్లు చేశాడు. క‌ట్ చేస్తే.. పంచ్ ప్ర‌భాక‌ర్‌కే పంచ్ ప‌డింది. జ‌డ్జిల‌పై వివాదాస్ప‌ద పోస్టులు పెట్టిన కేసులో ఆయ‌న‌పైనా సీబీఐ విచార‌ణ జ‌రుగుతోంది. కాక‌పోతే.. వాడు మ‌న‌ దేశంలో లేడుగా. అందుకే, అరెస్ట్‌ కాస్త ఆల‌స్యం అవుతోంది. కానీ, కోర్టులు, సీబీఐ త‌ల్చుకుంటే.. ఎంత‌టి వాడినైనా లొంగ‌దీసి.. సంకెళ్లు వేసి ప‌ట్టుకొచ్చి.. న్యాయ‌స్థానాల ముందు నిల‌బెడ‌తాయ‌నే విష‌యం వాడికింకా అర్థం కావ‌ట్లేదు. కాస్త‌ లేటైనా.. ప‌నిష్మెంట్ మాత్రం ప‌క్కా అంటున్నారు.  తాజాగా, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జ‌రుగుతున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా, పంచ్‌ ప్రభాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. తెలుగువారి  ఆత్మగౌరవాన్ని ప్రభాకర్ దెబ్బ తీస్తున్నాడని, అతనిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని గ‌ట్టిగా నిలదీసింది హైకోర్టు.  తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ.. స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విని కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పంచ్ ప్ర‌భాక‌ర్‌కి కనీసం ఒక్క నోటీసు కూడ ఇవ్వలేక పోయారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని.. ప్రభాకర్‌ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఆగ్ర‌హం చూస్తుంటే.. పంచ్ ప్ర‌భాక‌ర్‌కు బిగ్ పంచ్ ప‌డే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్టే ఉన్నాయి. 

బీజేపీకి టీడీపీ, జనసేన మద్దతు? బద్వేలు ఫార్మూలా అసెంబ్లీకి రిపీట్!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. రాజకీయ చర్చల్లో తరచూ వినిపించే ఈ మాట, ఇప్పుడు, ఉప ఎన్నిక జరుగతున్న కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గంలో  వినిపిస్తోంది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య  చనిపోవడంతో ఉపఎన్నిక జరుగుతున్నఈనియోజక వర్గం నుంచి వైసీపే అభ్యర్ధిగా ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సంప్రదాయాన్ని మన్నించి తెలుగు దేశం, జనసేన ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించాయి. అయితే, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్ధులను బరిలో దించాయి. బీజేపీ యువ నేత పనతల సురేశ్ బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్ల్యే కమలమ్మ పోటీ చేస్తన్నారు. చిత్రంగా తెలుగు దేశం, జన సేన పార్టీలు రెండూ కూడా, అనధికారికంగానే అయినా, బీజీపీ అభ్యర్ధికి మద్దతు నిస్తున్నాయి. దీంతో మాజీ మిత్రులు (బీజేపీ, టీడీపీ, జనసేన) ఒకటవుతాయానే చర్చ మొదలైంది. స్థానిక నేతల చొరవతో, బీజేపీకి తెలుగు దేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు సహకరిస్తున్నారే కానీ, పార్టీల స్థాయిలో ఎలాంటి ఒప్పందం లేదని బీజేపీ, టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాకు చెందిన బీజేపీ కీలక నాయకులు సత్యకుమార్, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డికి స్థానిక టీడీపీ నేతలతో మొదటినుంచీ మంచి సంబందాలే ఉన్నాయి. సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి అయితే, టీడీపీలో ఎదిగారు, ఎన్నికలలో గెలిచారు. అందుకే, స్థానిక  నాయకులు క్యాడర్ వ్యక్తిగత స్థాయిలో బీజేపీకి సహకరిస్తున్నారని అంటున్నారు. ఇలా అనుకోకుండా, మాజీ మిత్రుల నుంచి అందుతున్న మద్దతుతో, అసలు పోటీలో ఉండదనుకున్న బీజేపీ.. పోలింగుకు రెండురోజుల ముందు, అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆరంభంలో కాంగ్రెస్ రెండవ స్ధానంలో ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీ రెండవ స్థానంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.నిజానికి బద్వేలో  బీజేపీ నియోజకవర్గంలో, కనీసం డిపాజిట్ తెచ్చుకునే పాటి ఓటు కూడా లేదు.అంతే కాదు, బీజేపీకి అన్ని పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ బూత్ ఏజెట్లు, స్లిప్పులు పంపిణీ చేసేవారు, పోలింగ్‌బూత్‌ల వద్ద టేబుల్ వేసుకుని కూర్చునేంత సంఖ్యలో కార్యకర్తలు- యంత్రాంగం కూడా లేరన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ కొరత లేకుండా టీడీపీ కర్యకర్తలు పనిచేస్తున్నారు.  టీడీపీ నేతలు కూడా తమ పార్టీ బరిలో లేకపోవడం, స్థానికంగా వైసీపీ నేతల దాడులు, తమ పార్టీ కార్యకర్తలకు పథకాలు వర్తింపచేయకపోవడం, ఉన్నవాటిని తొలగించడం వంటి కారణాలతో ఉప ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంతటితోనే బీజేపీ,టీడీపీ ఒకటై పోతయ్యా అంటే .. కాకపోవచ్చును. కానీ ఆ దిశగా ఇదొక అడుగు అని అయితే అనుకోవచ్చును.  

మాజీ 'మిస్‌ తెలంగాణ' సూసైడ్ అటెంప్ట్‌.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌.. పోలీసులు అల‌ర్ట్‌

ఆమె మాజీ 'మిస్‌ తెలంగాణ'. ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ఎవ‌రు మోసం చేశారో తెలీదు కానీ.. సూసైడ్ చేసుకోవాల‌ని అనుకుంది. సెల‌బ్రిటీ కావ‌డంతో ఆమెకు సోష‌ల్ మీడియాలో చాలా మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారు. ప్ర‌తీ చిన్న విష‌యం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసే అల‌వాటు ఉంది. చిన్న చిన్నవే పోస్ట్ చేసే తను.. సూసైడ్ చేసుకునే అంత పెద్ద మేట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌కుండా ఎలా ఉంటుంది? అదే ప‌ని చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ.. ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టింది. క‌ట్ చేస్తే.. క‌థ సుఖాంతం. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే... హైద‌రాబాద్‌లో ఉండే మాజీ మిస్ తెలంగాణ.. త‌న ఇంట్లో ఆత్మహత్యకు ప్ర‌యత్నించారు. ఉరి బిగించుకున్న ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తున్నారు. ల‌వ్ మేట‌రా? కెరీర్ అంశ‌మా? మ‌రేదైన ఇష్యూనా అనే దిశ‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు.   

పీకే డైరెక్షన్ లో కొత్త పార్టీ! తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఆట వారిదే..

తెలుగు రాష్ట్ర రాజకీయాలు చాలా చాలా వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీలు బలహీనపడుతున్నాయి. దీంతో కొత్తగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. జాతీయ పార్టీలు మేమున్నామంటూ ముందుకొస్తున్నాయి. పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త నాయకులు తెరమీదకు వస్తున్నారు. అయినా ఎవరు అవునన్నా ఎవరు కాదన్న తెలంగాణలో తెరాస ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత  వ్యతిరేకత ఉన్నా, అక్కడక్కడా, అప్పుడప్పుడు కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా, ఇంకా ఇప్పటికీ, రాష్ట్ర రాజకీయాలపై తెరాస ఆధిపత్యమే కొనసాగుతోంది. అలాగే, తెరాస మీద కుటుంబ ఆధిపత్యం ముఖ్యంగా  తండ్రీ కొడుకుల ఆధిపత్యమే కొనసాగుతోంది.  కొద్ది నెలల క్రితం రాజన్న రాజ్యం నినాదంతో దివంగత  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా, వైఎస్సార్ టీపీ  పార్టీని ఏర్పటు చేశారు. సదస్సులతో మొదలుపెట్టి  మంగళవారం దీక్షల మీదగా, ఇప్పుడు వైఎస్ బాటలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగిస్తున్నారు. అయితే  ఆమె తెరాస ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నా, ఆమె  ఎవరు వదిలిన బాణం, ఎందుకోసం, ఏ లక్ష్యంతో పార్టీ పెట్టారు? అనే విషయంలో ఎవరి అనుమానాలు వారికున్నాయి. ఆమె తెలంగాణ రాజకీయ తెర మీద ఒక ప్రశ్నగానే మిగిలి పోయారు.  అలాగే ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, ఉద్యోగానికి రాజీనామా చేసి, బీఎస్పీలో చేరారు. ఆయన కూడా తెరాస ప్రభుత్వ్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటైన విమర్శలే చేస్తున్నారు. అయినా ఆయన సొంత సర్కిల్ మినహా ఇతర వర్గాల్లో అంతగా కదలిక రాలేదు. నిజానికి, కారణాలు ఏవైనా, ఇటు షర్మిల అటు ప్రవీణ్ కుమార్  ఈ ఇద్దరినీ నడిపించే రిమోట్ కంట్రోల్ ఇంకొకరి చేతుల్లో ఉందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందుకే, తెలంగాణ ప్రజలు ఆ పార్టీలను పట్టించుకోవడం లేదు. అదలా ఉంటే, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెరాసకు ప్రత్యాన్మాయంగా ఎదిగేందుకు పోటాపోటీగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే, రెండు ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు సమాంతరంగా ఎదిగి రావడం వలన తెరాస ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని, రాజకీయ వర్గాలలో చాలా కాలంగా వినస్తోంది.  అలాగే ముక్కోణపు పోటీలో తెరాస బలహీనపడినా చివరాఖరుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న జాతి వైరం కారణంగా, తెరాస కీలకంగా మారుతుందని, కేసీఆర్ కుటుంబ పాలనే కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బలిదానాలు పునాదులుగా, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ కుటుంబ(తెరాస) ఆధిపత్యాన్ని తప్పించి, ఉద్యమ లక్ష్యాలను  ముందుకు తీసుకుపోయే  ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా, మరో ఉద్యమ  పార్టీ  ఏర్పాటుకు ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల వెనక జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్న ఒక సీనియర్ నేతతో పాటుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ కూడా  ఉన్నట్లు సమాచారం.  నిజానికి, ప్రశాంత్ కిశోర్ ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే గత కొంత కాలంగా రాష్ట్రంలో తెరాస పాలనను అంతమొందించే లక్ష్యంతో, కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న విభిన్న స్థాయిల్లో చర్చలు జరుపుతున్న తెరాస మాజీ నేత ఢిల్లీలో మకాం చేసి, తెరాసను గద్దె దించే ఏకైక లక్ష్యంతో  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మరో పార్టీ ... వలన ఎవరికీ మేలు జరుగుతుంది. ఇది ఇప్పటికైతే జవాబు లేని ప్రశ్న అనే అంటున్నారు.

జ‌గ‌న్ ఇంట్లో 'నాగ్' లంచ్‌ మీటింగ్‌.. అందుకేనా? ఆ ప‌ని కోస‌మేనా?

సీఎం జ‌గ‌న్‌రెడ్డిని క‌లిసిన హీరో నాగార్జున‌. సినిమా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్‌తో క‌లిసి విందు భోజ‌నం. ఇదీ న్యూస్‌. పైపైన చూస్తే ఇంతే. కానీ, ఆస‌క్తిగా గ‌మ‌నిస్తే ఈ భేటీ వెనుకు ఇంకేదో మేట‌ర్ ఉంద‌నే అనుమానం. ఇంత‌కీ ఏంట‌ది? జ‌గ‌న్‌-నాగార్జున స‌మ‌వేశానికి కార‌ణం ఏమై ఉంటుంది?  సినీ ప‌రిశ్ర‌మ సమ‌స్య‌ల‌పై మాత్ర‌మే చ‌ర్చించాల‌నుకుంటే.. టాలీవుడ్ త‌ర‌ఫున నాగార్జున మాత్ర‌మే ఎందుకు వెళ‌తారు? ఇంత‌కుముందు ఎప్పుడూ అలా వెళ్ల‌లేదే. చిరంజీవి, నాగార్జున‌, సి.క‌ల్యాణ్‌, దిల్‌రాజు, సురేశ్‌బాబు, రాజ‌మౌళి.. ఇలా హేమాహేమీలంతా క‌లిసి సీఎం జ‌గ‌న్ ఇంటికి వెళ్లేవారు. అలా కాకుండా నాగ్ మాత్ర‌మే వెళ్లారంటే.. అది టాలీవుడ్ మేట‌ర్ కాక‌పోవ‌చ్చ‌ని తేలిపోతోంది. మ‌రి, నాగార్జున తాడేప‌ల్లి ప్యాలెస్‌కు ఇంకెందుకు వెళ్లి ఉంటారు? 'మా' గురించి అని కూడా అనుకోలేం. ఎందుకంటే.. మంచు విష్ణుతో జ‌గ‌న్‌రెడ్డికి ద‌గ్గ‌రి బంధుత్వ‌మే ఉంది. కాబ‌ట్టి, విష్ణును కాద‌ని మా అంశాల గురించి మాట్లాడ‌టానికి అక్కినేని చొర‌వ తీసుకునే అవ‌కాశ‌మే లేదు. ఇక చైత‌న్య‌-స‌మంత‌ల ఫ్యామిలీ గురించి ముఖ్య‌మంత్రితో మాట్లేడేదేముంటుంది.. అది వారి ప‌ర్స‌న‌ల్‌ ఫ్యామిలీ మేట‌ర్‌. ఇవేవీ కాక‌పోతే.. నాగార్జున స‌డెన్‌గా తాడేప‌ల్లికి ఎందుకు వెళ్లుంటార‌నే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా ఒక్కోటి ఎలిమినేట్ చేసుకుంటూ పోతే.. చివ‌రాఖ‌రికి చిరంజీవి ద‌గ్గ‌రికొచ్చి ఆగుతోంది విష‌యం. చిరు కోసం మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెర‌ప‌డానికే నాగార్జున.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసుంటార‌ని అంటున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌, టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై ఇటీవ‌ల చిరంజీవి ఓపెన్‌గా సీఎం జ‌గ‌న్‌కు రిక్వెస్టులు చేశారు. ద‌య‌చేసి.. ప్లీజ్ మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండంటూ వేడుకున్నారు. చిరులాంటి వారు అంత దీనంగా మాట్లాడ‌టం చూసి.. సీఎం జ‌గ‌న్ టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌ను అస‌లేమాత్రం ప‌ట్టించుకోకుండా.. ఎంత‌లా టార్చ‌ర్ చేస్తున్నారో అంటూ తెగ చ‌ర్చ న‌డిచింది. ఏపీ ప్ర‌భుత్వ తీరును ఇలా చిరంజీవి దీనంగా త‌ప్పుబ‌ట్టారో లేదో.. ఆ వెంట‌నే త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాన్ సీన్‌లోకి వ‌చ్చి జ‌గ‌న్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. స‌న్నాసుల నుంచి దిగ‌కుండా.. ఆన్‌లైన్ టికెటింగ్‌పై జ‌గ‌న్‌ను, వైసీపీని ఆటాడుకున్నారు. అప్ప‌టి నుంచీ మెగా ఫ్యామిలీపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో త‌న‌ భేటీ జ‌ర‌గాల్సి ఉన్నా.. ఆల‌స్యం చేస్తూ వ‌చ్చారు.  మ‌రోవైపు, త‌మ పార్టీ మ‌నిషి మోహ‌న్‌బాబు త‌న‌యుడు, త‌న ద‌గ్గ‌రి బంధువు విష్ణు 'మా' అధ్య‌క్షునిగా బ‌రిలో దిగితే.. త‌మ వారికి పోటీకా నిలిచిన ప్ర‌కాశ్‌రాజ్‌కు మెగా కుటుంబం స‌పోర్ట్ చేయ‌డం కూడా జ‌గ‌న్‌కు ఆగ్ర‌హం తెప్పించింద‌ని అంటున్నారు. అందుకే, జ‌గ‌న్‌ను కూల్ చేసేందుకే.. చిరు త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ నాగ్‌.. తాడేప‌ల్లి వెళ్లార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్‌కు మొద‌టి నుంచీ నాగార్జున మంచి క్లోజ్ కాబ‌ట్టి.. ఆయ‌న చెబితే వినే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. నాగ్‌ను ముందుంచార‌ని టాక్‌. చిరంజీవి త‌ప్పేమీ లేద‌ని స‌ర్ది చెప్పి.. మ‌ళ్లీ మ‌రో మీటింగ్‌కు ముహూర్తం పెట్టించ‌డానికి నాగార్జున‌ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది.   

అడ్డగోలు జీవోలపై హైకోర్టులో కేసు.. జగన్ సర్కార్ కు చిక్కులేనా?

ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలకై ఎన్నుకునే ప్రజాప్రభుత్వాల్లో దాపరికం ఎంత తక్కువగా ఉంటే అంత మంచింది. అందుకే ప్రభుత్వాలు తమ విధాన పరమైన జీవోలను పబ్లిక్ డొమెన్ లో ఉంచుతాయి. 2009 నుంచి ఆన్ లైన్ లో జీవోలను ఉంచటం.. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్ని డౌన్ లోడ్ చేసి.. చూసుకునే అవకాశం ఉంది. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం రూల్స్ మార్చేసింది. జీవోలను వెబ్ సైట్ లో పెట్టడం మానేసింది. అడ్డగోలుగా జీవోలు ఇస్తుండటం వల్లే... వాటిని వెబ్ సైట్ లో పెట్టడం లేదనే ఆరోపణలు వచ్చాయి. జీవోలను  ఆన్ లైన్ లో ఉంచకూడదన్న జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాల విషయంలో వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానంగా  మరో వారంలో కౌంటర్‌ వేయాలని పిటిషనర్లకు సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.    ‘జీవోఐఆర్‌’ సైట్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచకపోవడం మరోవైపు అత్యల్ప సంఖ్యలో జీవోలను ఏపీఈ గెజిట్‌ వెబ్‌సైట్లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 7న జారీచేసిన జీవో 100ను సవాలు చేస్తూ.. జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ‘తెలుగువన్‌.కామ్‌’ డిజిటల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కంఠంనేని రవిశంకర్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. ప్రభుత్వాలు పాలనా నిర్ణయాల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. జగన్ సర్కార్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రభుత్వ కౌంటర్ ఎలా ఉండబోతోంది, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నది ఆసక్తిగా మారింది. 

విచ్చలవిడిగా డబ్బు..హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దు?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణి జరుగుతోంది. ఓటుకు 10 వేల రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కవర్లలో డబ్బులు పెట్టి పంచుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఓటర్లు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ లో ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప  ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ను కలిసి విజ్ఞప్తి చేయనుంది.  ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీఈసీని కలవబోతున్నారు.  అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్ లో ఓటర్లను టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందుకు తగిన ఆధారాలను సీఈసీకి సమర్పించబోతోంది.ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరిగాయని ఆరోపణ.. మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని, ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని ఆరోపణ లతో ఫిర్యాదు చేయనున్నరు.  కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈనెల 30న హుజురాబాద్ పోలింగ్ జరగనుంది. 

శ్రీశారదా పీఠానికి 15 ఎకరాలు.. ఏపీ కేబినెట్ పచ్చజెండా.. 

అమరావతిలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు, రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం లభించింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ పడింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు, అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు తీర్మానం చేసింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి జగన్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్.. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇక వచ్చేనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ మంత్రివర్గం నిర్ణయించింది. 

హుజురాబాద్ పోలింగ్ కు ముందు కేసీఆర్ కు బిగ్ షాక్.. కారులో కలవరం..

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన, అన్ని పార్టీలకు సవాల్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొన్ని గంటలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ తగిలింది. హుజురాబాద్ లో ప్రభుత్వ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేత అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చి చెప్పింది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఇటీవల ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టీఆర్ఎస్ తోపాటు పలువురు కోర్టుకు ఎక్కడంతో విచారణ జరిపిన కోర్టు తాజాగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికల వేళ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేయకుండా కొందరు కోర్టుకు ఎక్కగా.. దానిపై విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు పథకాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికలో దీని ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతోంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రతాపం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు పథకం ప్రకటించి కోర్టు ఆదేశాలతో నిలిపివేసిన టీఆర్ఎస్ సర్కార్ కు గట్టి దెబ్బ తగిలింది. జనాలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడే అదే జరుగబోతోందని.. దళితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందంటున్నారు.  మరోవైపు దళిత బంధుకు సంబంధించి హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని.. అక్కడ దళితబంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్ లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కడ సురేష్ కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తోపాటు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్ లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.   

ప‌ట్టాభి క‌స్ట‌డీ కోరిన పోలీసులు.. షాక్ ఇచ్చిన కోర్టు..

ఏపీలో డ్ర‌గ్స్‌, గంజాయి దందాపై మండిప‌డుతూ.. సీఎం జ‌గ‌న్‌రెడ్డిని ఉద్దేశించి బోసిడీకే అన్నారు టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి. అంతే.. వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. విజ‌య‌వాడ‌లోని ప‌ట్టాభి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలోనూ వంద‌లాది వైసీపీ మూక‌లు బీభ‌త్సం సృష్టించారు. ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదంపై పోరంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు 36 గంట‌ల నిర‌వ‌ధిక దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ని క‌లిసి ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరారు. విష‌యం తెలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. చంద్ర‌బాబుకు స్వ‌యంగా ఫోన్ చేసి వివ‌రాలు క‌నుగొన్నారు. ఓవైపు ఇంత ర‌చ్చ జ‌రుగుతుంటే.. పోలీసులేమో.. ప‌ట్టాభిపై ప‌డ్డారు. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌ ప‌ట్టాభి ఇంటి త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ విధించ‌డంతో జైలుకూ త‌ర‌లించారు. బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ట్టాభిని.. తాము క‌స్ట‌డీలోకి తీసుకుంటామంటూ తాజాగా కోర్టును ఆశ్ర‌యించారు గ‌వ‌ర్న‌ర్‌పేట పోలీసులు.    పట్టాభిరామ్‌ పోలీసు కస్టడీ పిటిషన్‌ను విజయవాడ న్యాయస్థానం కొట్టేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల అరెస్టై బెయిల్‌పై విడుదలైన పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని గవర్నర్‌పేట పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల్లో కుట్ర కోణం దాగి ఉందని.. పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీలోకి ఇవ్వాలని కోరారు.  పట్టాభి అరెస్టు ప్రక్రియ సరిగా లేదని.. ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం కూడా ప్రస్తావించిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. దాడి చేసిన వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. బాధితుడైన ప‌ట్టాభినే పోలీసులు ఇలా టార్గెట్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు.. జ‌గ‌న్ కేసుల్లో ట్విస్ట్‌.. కొత్త వేరియంట్ క‌ల‌క‌లం.. టాప్‌న్యూస్ @1pm

1. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ తెలంగాణలో కలకలం రేపుతోంది. 48 ఏళ్ల వ్య‌క్తికి, 22 ఏళ్ల యువతికి ఏవై 4.2 నిర్ధారణ కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొత్త వేరియంట్‌పై స్పందించేందుకు వైద్యాధికారులు నిరాక‌రిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్‌ విస్తరిస్తున్న‌ట్టు స‌మాచారం.  2. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇకపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ జరగనుంది. దాఖలైన రిట్ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను త్వరగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టనుంది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలను విచారణ జాబితాలో ఉన్నత న్యాయస్థానం చేర్చింది.  3. ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్ర‌జా ప్ర‌స్థాన‌ పాదయాత్ర కొనసాగిస్తూనే.. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ష‌ర్మిల దీక్ష‌ల‌ను టార్గెట్ చేస్తూ.. మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లంటూ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి చేసిన కామెంట్లు కాంట్ర‌వ‌ర్సీగా మారాయి.  4. మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురిపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేయడంతో పులివెందులతో పాటు కడప జిల్లాలో కలకలం రేగుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మరికొందరిని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో పులివెందులలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అధికారపార్టీ నేతల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  5. హుజురాబాద్ నియోజకవర్గం కమలపూర్ మండలంలో అధికార పార్టీ నేతలు కొందరికి డబ్బులు ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓట‌ర్లు రోడ్డెక్కారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ ఏకంగా తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. డ‌బ్బుల కోసం పెద్ద సంఖ్య‌లో మహిళలు రావడంతో పోలీసులు ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న వారిని అక్కడినుంచి పంపించేశారు.  6. పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలంటూ విజయవాడలో లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రం పన్నుల రూపంలో రూ. 32 వసూలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు 22.25శాతం వ్యాట్ టాక్స్‌తో పాటు అదనంగా నాలుగు రూపాయలు, రోడ్ సెస్ కింద 1.22 రూపాయలు వసూలు చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  7. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందని ప్రేమ సింగ్ అనే యువకుడు ఓ యువతి ఇంటిలో చొరబడి.. గొంతు, చేతి మణికట్టు ద‌గ్గ‌ర క‌త్తితో దాడి చేశాడు. యువ‌తి అరుపులతో బంధువులు, స్థానికులు యువకుడిని ప‌ట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.  8. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మాడుగుపల్లి గ్రామానికి చెందిన నరేష్ కుమారెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ లో చూసి నాటు బాంబులు తయారీ చేశాడు. అమ్మేందుకు అనంతపురం తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  9. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం, ఎన్ గొల్లపల్లిలో సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ ఉదయ్ కిరణ్ దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడు. చెప్పినట్లు వినకపోతే ఉన్నతాధికారులకు అనవసర ఫిర్యాదులు చేస్తున్నాడని, మహిళా సిబ్బందిని తరచూ తిడుతున్నాడ‌నే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వాలంటీర్ రెచ్చిపోతున్నాడని అంటున్నారు. వాలంటీర్ ప్రవర్తనతో విసుగు చెందిన సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10. నల్గొండ జిల్లా చిట్యాలలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. జాతీయ రహదారిపై బస్సులలో తనిఖీలు చేస్తుండ‌గా.. ఏపీలోని సీలేరు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సులో 22 కేజీల గంజాయి దొరికింది. గంజాయిని స్వాధీనం చేసుకొని.. తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.  

అబ్రకాదబ్రా.. మాయమైన రుషి కొండ.. ఆ మాంత్రికుడు ఎవరంటే?

గుడిని  మింగేవాళ్లు కొందరు ఉంటే.. గుడిలో లింగాన్ని మింగేవాళ్లు మరి కొందరుంటారు. ఇదంతా గతం. ఇప్పుడు కొండను మింగేవాళ్లు కొందరు ఉంటే.. రుషి కొండలో కొండను మింగేవాళ్లు మరికొందరు తయ్యారయ్యారు. ఇది ప్రస్తుతం.  గద్దె నెక్కిన నాయకులు ప్రజల ఆస్తుల కర్పూరం చేసే పనిలో ఉన్నారంటే కలికాలం అని ఇన్నాళ్లు జనాలు బుగ్గలు నొక్కకున్నారు. కానీ.. కొండలను మింగే అనకొండలుగా తయారయ్యారనే వాస్తవాన్ని మాత్రం జనం జీర్ణించుకోలేక పోతున్నారు. అందునా విశాఖ ప్రజలు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతటి వాడు.  అయితే తాజాగా విశాఖలో విజయసాయిరెడ్డి పేరిట రచ్చ రచ్చ జరుగుతోంది. విశాఖపట్నం రుషి కొండ సుందరమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో రుషి కొండను పిండి చేయడానికి విజయసాయిరెడ్డి కంకణం కట్టుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. వారు సైతం ఆందోళనకు దిగారు. విజయసాయిరెడ్డి కుమార్తె కోసం రుషికొండ వద్ద హోటల్ నిర్మిస్తున్నారని సమాచారం.  అందుకోసం రుషి కొండను విజయసాయిరెడ్డి ఆదేశాలతో ఫిండి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆ పార్టీ సీనియర్ నేత సీహెచ్ అయ్యన్న పాత్రుడు అయితే ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టి మరి ఏకంగా జగన్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.  అంతేకాదు రుషి కొండను పిండి చేస్తున్న పోటోలను సైతం టీడీపీ నేతలు తమ పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అవి చూసిన విశాఖ నగర ప్రజలతోపాటు తెలుగు ప్రజలు.. అందునా విశాఖ అందాలు తిలకించిన ప్రతి ఒక్కరి మనస్సు మూగగా రోదిస్తుంది. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా టైపులో విజయాసాయిరెడ్డి తలుచుకుంటే.. కొండలు పిండి చేయడం సులువే అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు.. ష‌ర్మిల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఆమె మానాన ఆమె పాద‌యాత్ర చేసుకుంటున్నారు. తెలంగాణ కోడ‌లినంటూ రాజ‌న్న రాజ్యం కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి, రాజ‌న్న రాజ్యం సాధించాలంటే.. కేసీఆర్ పాల‌నపై తిర‌గ‌బ‌డాల్సిందేగా? అందుకే దొర‌ల పాల‌న‌పై ష‌ర్మిల ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేసీఆర్‌ది గుండె కాదు బండ అంటూ రాజ‌కీయ‌ బండ‌లేస్తున్నారు. ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో ఆరోప‌ణ‌ల డోసు మ‌రింత పెంచారు.  ఆమెను అలానే వ‌దిలేస్తే.. మ‌రింత రెచ్చిపోతార‌నుకున్నారో.. లేక‌, త‌మ అధికారానికే దెబ్బ‌కొడ‌తార‌ని భ‌య‌ప‌డ్డారో ఏమో కానీ.. అధికార పార్టీ నుంచి గట్టి కౌంట‌ర్లే ప‌డుతున్నాయి. మొద‌ట్లో ష‌ర్మిల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని టీఆర్ఎస్ నేత‌లు.. ఇప్పుడు నోటికి ప‌ని చెబుతున్నారు. గ‌తంలో మ‌హిళ‌లు మంగ‌ళ‌వారం నోములు నోస్తుంటార‌ని మంత్రి కేటీఆర్ ష‌ర్మిల‌ను ఉద్దేశించి కామెంట్లు చేయ‌గా.. తాజాగా మ‌రో మంత్రి నిరంజ‌న్‌రెడ్డి వైఎస్సార్‌టీపీ అధినేత్రిపై మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్లు తీవ్ర కాంట్ర‌వ‌ర్సీగా ఉండ‌టం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. మంత్రి నిరంజ‌న్‌రెడ్డి మాట‌ల‌పై మ‌హిళ‌లంతా మండిప‌డుతున్నారు. ఇంత‌కీ.. ఆయ‌న ఏమ‌న్నారంటే.... ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ష‌ర్మిల పేరును నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ష‌ర్మిలను ఉద్దేశించేన‌ని ఈజీగా తెలిసిపోతున్నాయి.  వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్ర‌జా ప్ర‌స్థాన‌ పాదయాత్ర కొనసాగిస్తూనే.. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ష‌ర్మిల దీక్ష‌ల‌ను టార్గెట్ చేస్తూ.. మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు ఒకామె బ‌య‌లు దేరిందన్న మంత్రి మాట‌లు మంట‌లు రాజేస్తున్నాయి. మంత్రి నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక.. 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని కూడా ఆరోపించారు. ఇలా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లపై ఇటు మ‌హిళ‌లు, అటు నిరుద్యోగులు మండిప‌డుతున్నారు. టీఆర్ఎస్ నేత‌లు మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా అని ప్ర‌శ్నిస్తున్నారు. 

హుజురాబాద్ లో ఓటర్ల హంగామా.. డబ్బుల కోసం ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి

హుజురాబాద్ నియోజకవర్గంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటర్లకు పార్టీలు జోరుగా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. పోటాపోటీగా మందు, మనీ పంపిణి చేస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆందోళన చేస్తున్నారు. ఏకంగా రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఓట్లకు డబ్బులు ఇవ్వాలని ఓపెన్ గానే డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటింగులో పాల్గొనబోమని తేల్చి చెబుతున్నారు.  హుజురాబాద్ నియోజకవర్గం కమలపూర్ మండలంలో అయితే ఓటర్లు రగిలిపోతున్నారు. అధికార పార్టీ నేతలు కొందరికి డబ్బులు ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ ఏకంగా తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాది మంది మహిళలు రావడంతో పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. సెంట్రల్ బలగాలు ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న మహిళలను అక్కడినుంచి తరలించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమలాపూర్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామం. ఇక్కడ ఈటలకు గట్టి పట్టుంది. దీంతో కమలాపూర్ లో సెలెక్ట్ చేసిన ఓటర్లకే టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచారని తెలుస్తోంది. అయితే తమ పక్క ఇంట్లో డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వకపోవడంతో కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అందరికి ఇవ్వాలని డబ్బులు పంపించారని, లోకల్ లీడర్లే ఇవ్వడం లేదని కొందరు ఓటర్లు ఆరోపించడం ఆసక్తిగా మారింది.  ఓట్లకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు ఓటర్లు వస్తుండటంతో అధికారులు పరేషాన్ అవుతున్నారు. వాళ్లకు ఏం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొందరు మహిళలు ఎంత చేపినా వినకపోవడంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఓటుకు ఆరు నుంచి 10 వేల రూపాయలు ఇస్తుండటం వల్లే ఓటర్లు డబ్బులు కావాలని రోడ్డెక్కుతున్నారనే చర్చ సాగుతోంది. పోలింగ్ నాటికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్నఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. 

యువతిపై కత్తితో దాడి.. ఉన్మాదిని చిత‌క్కొట్టిన స్థానికులు..

మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా.. ఎంత క‌ఠినంగా శిక్షించినా.. ప్రేమోన్మాదుల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. ప్రేమంటూ వెంట‌బ‌డ‌టం.. కాదంటే దాడుల‌కు తెగ‌బ‌డ‌టం. ప్రేమ పేరుతో అరాచ‌కం సృష్టిస్తున్నారు కొంద‌రు. తాజాగా హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ప‌రిధిలో ఇలాంటి ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.     గచ్చిబౌలి పీఎస్‌ పరిధి వట్టినాగులపల్లిలో యువతిపై ఓ యువకుడు కత్తితో దాది చేశాడు. ఇంటికొచ్చి మ‌రీ హత్యకు ప్ర‌యత్నించాడు. యువతి అరుపులతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. స్థానికులు ప‌రుగున వ‌చ్చారు. హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన యువ‌కుడిని ప‌ట్టుకొని చిత‌క్కొట్టారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు.  వట్టినాగులపల్లికి చెందిన ప్రేమ్‌సింగ్‌ డిగ్రీ చదువుతున్నాడు. ప్రేమించాలంటూ బాధిత యువ‌తిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. స‌డెన్‌గా బుధ‌వారం అర్థ‌రాత్రి య‌వ‌తి ఇంటికొచ్చిన ప్రేమ్‌సింగ్ ఆమెపై క‌త్తితో అటాక్ చేశాడు. ఆ దాడిని యువ‌తి ఎదుర్కోవ‌డంతో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.  దాడి స‌మ‌యంలో ప్రేమ్‌సింగ్ ఫుల్‌గా తాగి ఉన్నాడు. మ‌ద్యం మ‌త్తులోనే ఈ ఘాతుకానికి ప్ర‌య‌త్నించాడు. స్థానికులు వాడిని కుమ్మేయ‌డంతో.. ప్రేమ్‌సింగ్‌కు బాగా గాయాల‌య్యాయి. వైద్యం కోసం ప్రేమ్‌సింగ్‌ను సైతం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

జ‌గ‌నన్న‌ ఆటం బాంబ్‌.. దీపావ‌ళి స్పెష‌ల్ ఐట‌మ్‌...

సీఎం జ‌గ‌న్‌రెడ్డి. పాల‌న ప‌క్క‌న ప‌డేసి.. ప్ర‌తిప‌క్షాన్ని ల‌క్ష్యంగా చేసుకున్న ఫైర్ బ్రాండ్‌. ఆయ‌న టార్గెట్ అంతా ఒక్క‌టే.. ఏపీని అభివృద్ధి ప‌ర‌చ‌డం కాదు.. రాష్ట్రానికి పెట్టుబడులు, ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌డం అంత‌క‌న్నా కాదు. అమ‌రావ‌తిని నాశ‌నం చేయ‌డం.. చంద్ర‌బాబుపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పరిపాలిస్తున్నార‌ని అంటారు. దూకుడు ముఖ్య‌మంత్రికి.. బూతులు మాట్లాడే మంత్రులు, దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలు, గ్రామాల్లో అరాచ‌కాల‌కు పాల్ప‌డే పార్టీ శ్రేణులు.. ఇలా మందీమార్బ‌ల‌మూ ఎక్కువే అంటుంటారు. చంద్ర‌బాబుపై, క‌మ్మ కులంపై అదే ప‌నిగా మాట‌ల బాంబులు పేల్చే జ‌గ‌న్‌రెడ్డికి సింబాలిక్‌గా ఈ దీపావ‌ళికి జ‌గ‌న్ బాంబులు రెడీ చేశారు కొంద‌రు. జ‌గ‌న్ ఆటంబాంబ్ పేరుతో ఈ దివాళీకి స్పెష‌ల్ బాంబ్ తీసుకొచ్చారు.  కృష్ణా జిల్లా గన్నవరంలో పలు క్రాకర్స్‌ దుకాణాలలో జగన్ ఆటంబాంబ్ స్టిక్కర్‌తో ఉన్న దీపావళి క్రాకర్స్‌ను పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. బాగా బ‌త‌క‌నేర్చిన వ్యాపారులు ఇలా జ‌గ‌న్ ఫోటోతో బాంబులు త‌యారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. బాంబుల‌పై పెట్టిన జ‌గ‌న్ ఫోటో కూడా సూట‌బుల్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. వేలు చూపిస్తూ.. కోపంగా ఉన్న జ‌గ‌న్ ఫోటోను బాంబుల‌కు పెట్టారు. దీపావ‌ళికి ట‌పాసులు కొందామ‌ని వ‌చ్చే క‌స్ట‌మ‌ర్లు.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఫోటో క‌మ్ పేరుతో ఉన్న బాంబులు చూసి షాక్ అవుతున్నారు.  సీఎం ఫోటోతో బాంబులు త‌యారు చేయ‌డం క‌రెక్టేనా? ఆ బాంబులు పేలిస్తే.. జ‌గ‌న్ ఫోటో ఉంది కాబ‌ట్టి ఆయ‌న్ను పేల్చిన‌ట్టేనా?  రావ‌ణాసురిడి బొమ్మ‌ను బాంబుల‌తో పేల్చిన‌ట్టు ఇది ఉందంటూ అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్ ఆటంబాంబ్ పేలుతుందా?  తుస్సు మంటుందా? అంటూ సెటైర్లు కూడా ప‌డుతున్నాయి. ప‌నిలో పనిగా, నాటు బాంబుల‌కు ఫేమ‌స్ అయిన క‌డ‌ప జిల్లా నుంచి వ‌చ్చిన సీఎం.. జ‌గ‌న‌న్న బాంబుల ప‌థ‌కం పేరుతో ప్ర‌జ‌లంద‌రికీ ఈ బాంబులు ఫ్రీగా ఇచ్చేస్తే.. జ‌గ‌న్ బాంబుల‌ను కాల్చుకొని పండ‌గ చేసుకుంటాంగా అని కూడా అంటున్నారు. ఏదిఏమైనా ఈ దీపావ‌ళి స్పెష‌ల్ ఐట‌మ్‌.. జ‌గ‌న‌న్న ఆటంబాంబ్‌. 

కేసీఆర్ పై హుజురాబాద్ ఓటర్ల ఫైర్.. ఈటలకు లైన్ క్లియరేనా? 

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరాటం సాగడంతో నియోజకవర్గంలో గంటగంటకు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రచార గడువు ముగిసినా.. అంతర్గతంగా నేతలు జనాన్ని కలుస్తూనే ఉన్నారు. ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల నుంచి 10 వేల వరకు ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. లిక్కర్ ఏరులై పారుతుందని అంటున్నారు. ప్రలోభాల్లో అధికార పార్టీ ముందుందనే చర్చ సాగుతోంది.  అయితే హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచేందుకు ఎత్తులు వేస్తున్న అధికార పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ప్రలోభాలు ఆ పార్టీకి నష్టం నష్టం కల్గిస్తుందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు అందకపోవడంతో వారంతా రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి శాపనార్దాలు పెడుతున్నారు. తాము  ప్రజలము కాదా? మేము ఓటు వేయకుండానే కేసీఆర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు గెలిచారా ?మా ఓట్లు ఎందుకు వద్దంటారు అంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ లో పలు వార్డులకు సంబంధించిన మహిళలు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ చుట్టుపక్కల ఉన్న వాళ్లందరికీ నాయకులు ఓటుకు ఆరువేల రూపాయల చొప్పున నిర్ణయించి, డబ్బులు పంపిణీ చేశారంటూ ఆందోళనకు దిగారు. మాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే ఇన్‌చార్జీలు, నాయకులు నిర్ణయించినట్లుగా ఇస్తున్నామని, ఒకవేళ మీకు డబ్బులు కావాలంటే ఓటు వేసి వచ్చిన తర్వాత మాకే ఓటు వేశారని రుజువు చూపిస్తే డబ్బులు ఇస్తామని సమాధానం చెబుతున్నారని మహిళలు మండిపడ్డారు. మేము డబ్బులు అడిగామా? ఎందుకు ప్రమాణం చేయాలంటూ, మా ఓటు ఎందుకు వద్దంటున్నారు అని, అందరికీ కేసీఆర్ ప్రమాణం చేయించుకునే డబ్బులు ఇచ్చారా? అంటూ నిలదీశారు. కేసీఆర్ చెప్పిండ్రా? అంటూ వారు ప్రశ్నించారు. ఆరువేల రూపాయలు తీసుకున్న వారంతా కేసీఆర్‌కే ఓటేస్తామని చూపించగలరా? అంటూ టీఆర్ఎస్ ‌నేతలకు కొత్త టెన్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.  కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటర్లు ఆందోళన చేయడంతో గులాబీ పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. తమకు ఇది తీవ్ర నష్టం కల్గించవచ్చనే ఆందోళన వాళ్లలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోలను నియోజకవర్గంలో వైరల్ చేస్తూ.. పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో గంట గంటకు నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయని తెలుస్తోంది.   

వాలంటీర్లా.. రౌడీలా! సచివాలయ ఉద్యోగులపై వేధింపులా? 

ఏపీలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. దాదాపు రెండున్నర లక్షల మందిని నియమించింది. వాలకు వేతనాలు కూడా చాలా తక్కువ. అయితే వాలంటీర్ వ్యవస్థను చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నారు సీఎం జగన్ రెడ్డి.వాలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనమని చెప్పారు. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థ అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉండటంతో.. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గతంలోనూ చాలా ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వైసీపీ నేతల అండతో ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాలంటీర్లు లెక్కచేయం లేదనే వార్తలు వచ్చాయి. కొందరు ఉద్యోగులు వాలంటీర్లపై కేసులు పెట్టిన ఘటనలు కూడా జరిగాయి.  తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం, ఎన్ గొల్లపల్లిలో సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ ఉదయ్ కిరణ్ దౌర్జన్యం ప్రదర్శించాడు. సిబ్బందిపై పెత్తనం చేస్తూ.. తాను చెప్పినట్లు వినకపోతే ఉన్నతాధికారులకు అనవసర ఫిర్యాదులు చేస్తున్నాడని, మహిళా సిబ్బందిపై తరచూ దుర్భాషలాడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వాలంటీర్ రెచ్చిపోతున్నాడు. వాలంటీర్ ప్రవర్తనతో విసుగు చెందిన సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీశైలం మండలం, సున్నిపెంటలోని నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఎంపీడీవో మోహన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్ల వద్ద ఉన్న బయోమెట్రిక్, మొబైల్ ఫోన్లు పంచాయితీ కార్యదర్శికి అప్పజెప్పాలని ఆదేశించారు. విధుల నుంచి తొలగించిన వాలంటీర్లు.. వినోద్ కుమార్, ప్రవల్లిక, శివాజీ, రాకేష్.  

నవంబర్ లో బ్యాంకు సెలవులు ఇన్ని రోజులా..!

దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ కొనసాగుతోంది. దసరా ముగియగా దీపావళి రాబోతోంది. తర్వాత క్రిస్మత్, సంక్రాంతి రానున్నాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో సెలవులు ఎక్కువగానే ఉంటాయి. అయితే నవంబర్ లో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 17 సెలవులు వచ్చాయి. అంటే నెలలో సగానికి కన్నా ఎక్కువ రోజులు సెలవులే అన్నమాట. నెలలో కేవలం 13 రోజులు మాత్రం వర్కింగ్ డేస్.  దేశవ్యాప్తంగా నవంబర్ లో బ్యాంకులకు సెలవులు ఇవే...  నవంబర్ 1     కన్నడ రాజ్యోత్సవ, కుట్ (బెంగళూరు, ఇంఫాల్) నవంబర్ 3     నరక చతుర్దశి (బెంగళూరు)  నవంబర్ 4     దీపావళి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు) నవంబర్ 5     దీపావళి, బలి ప్రతిపాద, విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే, గోవర్ధన పూజ  నవంబర్ 6     భాయ్ దుజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ, దీపావళి, నింగోల్ చక్కౌబా  నవంబర్ 7     ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)  నవంబర్ 10     ఛాత్ పూజ, సూర్య పస్థి దళ ఛాత్ (పాట్నా, రాంచీ)  నవంబర్ 11     ఛాత్ పూజ (పాట్నా)  నవంబర్ 12     వంగల ఫెస్టివల్ (షిల్లాంగ్)  నవంబర్ 13     రెండో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)  నవంబర్ 14     ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)  నవంబర్ 19     గురునానక్ జయంతి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)  నవంబర్ 21     ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)  నవంబర్ 22     కనకదాస జయంతి (బెంగళూరు)  నవంబర్ 23     సెంగ్ కుత్స్‌నెమ్ (షిల్లాంగ్)  నవంబర్ 27     నాలుగో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)  నవంబర్ 28     ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు) హైదరాబాద్ రీజియన్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు.. నవంబర్ 4    దీపావళి నవంబర్ 7    ఆదివారం నవంబర్ 13    రెండో శనివారం నవంబర్ 14    ఆదివారం నవంబర్ 19    గురునానక్ జయంతి నవంబర్ 21    ఆదివారం నవంబర్ 27    నాలుగో శనివారం నవంబర్ 28    ఆదివారం నవంబర్ నెలలో హైదరాబాద్ రీజియన్‌లో 8 సెలవులు వచ్చాయి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో బ్యాంకులు 8 రోజులు తెరుచుకోవు. అందులో 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది.