ఉత్తుత్తి అరెస్టులేనా?, బొండాపై మ‌రోకేసు.. క‌లెక్ట‌ర్‌పై రేవంత్‌ ఫైర్‌.. టాప్‌న్యూస్ @1pm

1. టీడీపీ నేత  బొండా ఉమాపై  అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. బొండా ఉమాపై 153 ఎ, 294 బి, 504, 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  2. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసుల ప్రకటనలపై టీడీపీ తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాడి కేసులో 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మూడు దఫాలుగా ఎస్పీ కార్యాలయం ప్రకటన చేసింది. కాగా ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని క్రిందిస్థాయి సిబ్బంది చెబుతోంది. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చామని విచారణ సిబ్బంది తెలిపింది.  3. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం వరి రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. ‘సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా ఊరుకోను’ అంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఈ ఎత్తుగడ అన్నారు. వరి పంటలు వేయనప్పుడు ఇక లక్షల కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టుల నిర్మాణాలు ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 4. వైసీపీ నేతలకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తనపై అవినీతి ఆరోపణలు చేసిన జెడ్పీటీసీ చేజర్ల సుబ్బారెడ్డి, త‌దిత‌ర‌ నేతలపై మేకపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో గోడలకు నీళ్లు పట్టుకొని బతికినవాళ్లు తన గురించి విమర్శిస్తే తరిమి కొడతానని.. తన దగ్గర ఎదిగి తననే విమర్శిస్తారా? అని మండిపడ్డారు. రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.  5. ఏపీలో నిరసనకు దిగిన వారి గొంతులు నొక్కేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఏపీలో నిరసన గొంతులు నొక్కేస్తున్నారు, అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి పాలన విధించాలి. డ్రగ్స్‌పై విచారణకు ఆదేశించి, డీజీపీని రీకాల్ చేయాలి. దాడులపై సీబీఐ విచారణ చేయాలి. అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై టీడీపీ పోరును దాడులతో ఆపలేరు’’ అని దేవినేని ఉమ అన్నారు. 6. కొవిడ్‌ మృతుల పరిహారం చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబానికి రూ.50,000 మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు నమునాను కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులలో పొందుప‌రిచింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 7. హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందని.. ఊర్లను బార్లుగా మార్చి, మద్యం ఏరులు పారిస్తున్నారని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పౌరులు ఏ పార్టీలో ఉండాలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. మీడియాలో తన మొహం కనిపించకుండా చేసేందుకు ఇప్పటికే 500 కోట్ల నల్లధనం ఖర్చు చేశారని ఆరోపించారు.  8. హుజురాబాద్ ఎన్నికలను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించాలని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్‌రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల మెడ చుట్టూ ఉరి తాడు బిగిస్తోందని అన్నారు. వరిసాగుపై జిల్లా కలెక్టర్ మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.  9. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సుదీర్ఘకాలంగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మహా పాదయాత్రకు అనుమతిపై డీజీపీ ఈనెల 28 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.  10. గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెవెన్యూలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా ఇస్తారో చెప్పాలని హైకోర్ట్ ఆదేశించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

రేవంత్ రెడ్డి కారు ఎవరిది? ఆంధ్రా కాంట్రాక్టర్ దేనా? 

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి సంబంధించిన పలు ఆధారాలు బయటపెడుతున్నారు. సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీపైనా సంచలన కామెంట్లు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు గులాబీ లీడర్లు. బ్లాక్ మెయిలింగ్ తో కోట్లాది రూపాయలు కూడబెట్టారని ఆరోపించారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగే అన్నారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ కోట్లాది రూపాయలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే ప్లీనరీ వేదికపై తెలుగు తల్లి ఫోటో పెట్టారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు ఎమ్మెల్యే కిషోర్ కుమార్. రేవంత్ రెడ్డి తిరుగుతున్న కారు ఆంధ్రా కాంట్రాక్టర్ ది కాదా అని ప్రశ్నించారు. కర్నూల్ కు చెందిన కాంట్రాక్టర్ సంస్థ పేరుతో రిజిస్టర్ అయిన కారులో రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని, దాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డికి ధమ్ముంటే తాను చెప్పేది నిజం కాదని నిరూపించుకోవాలన్నారు గాదరి కిషోర్ కుమార్.  సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీపై స్పందించిన రేవంత్ రెడ్డి..  ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఫ్లెక్సీ పెట్టారని అన్నారు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తురాలేదన్నారు. 2001 జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎగపాకిందని విమర్శించారు. పార్టీ కార్యాలయాల పేరుతో సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల  ఆస్తులను సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.420 కోట్లు ఉన్నాయంటే.. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 

మొన్న వైవీ.. నిన్న‌ ఆళ్ల‌.. ర‌చ్చనా? రాయ‌బార‌మా? ఏంటి సంగ‌తి?

వైఎస్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర చేస్తున్నారు. తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు వడివ‌డిగా అడుగులు వేసుకుంటున్నారు. ప్ర‌జ‌ల నుంచీ మంచి స్పంద‌నే వ‌స్తోంది. వైఎస్సార్ అభిమానులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు మిన‌హా ఆమె వెంట నిలిచే బ‌ల‌మైన నాయ‌కులు లేరు. ష‌ర్మిల‌ సింగిల్‌గా పాద‌యాత్ర‌తో దూసుకుపోతున్నారు. ఇదీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న టాక్‌.  క‌ట్ చేస్తే.. ఆదివారం వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఆమె బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ ష‌ర్మిల‌ను క‌లిసి మ‌ద్ద‌తు ప‌లికారు. వైఎస్ త‌ర‌హాలో ష‌ర్మిల‌ చేస్తున్న పాద‌యాత్ర‌కు స‌పోర్ట్ చేశారు. ష‌ర్మిల యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత వ‌ర‌కూ ఓకే. వైవీ సుబ్బారెడ్డి.. ఆమెకు బాబాయ్ కాబ‌ట్టి ప‌ర్స‌న‌ల్‌గా ఆయ‌న క‌లిసుంటార‌ని అన్నారు. ష‌ర్మిల‌ను జ‌గ‌న్ కాద‌నుకున్నా.. వైవీ సుబ్బారెడ్డి వెళ్లి ష‌ర్మిల‌ను క‌ల‌వ‌డం వైసీపీలో క‌ల‌క‌లం రేపింది. అదంతా ఫ్యామిలీ మేట‌ర్ అని లైట్‌గా తీసుకునే ప‌రిస్థితి లేదంటున్నారు.  ఇక సోమ‌వారం మ‌రింత ఇంట్రెస్టింగ్ ప‌రిణామం జ‌రిగింది. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆంధ్ర నుంచి తెలంగాణ‌కు త‌ర‌లివ‌చ్చి.. ష‌ర్మిల పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య కూర్చొని ఆమె ప్ర‌సంగాన్ని విన్నారు. పాద‌యాత్ర అనంత‌రం షర్మిల‌తో గంట‌కు పైగా స‌మావేశ‌మ‌య్యారు. ఇది మాత్రం క్యాజువ‌ల్ కానే కాదు. ఫ్యామిలీ మేట‌ర్ అంత‌క‌న్నా కాదు.  జ‌గ‌న్ కోట‌రీలో కీల‌క నేత‌లుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిలు వ‌రుస‌గా ఇలా ష‌ర్మిల పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం.. ఆమెతో స‌మావేశ‌మ‌వ‌డం.. అత్యంత ఆస‌క్తిక‌ర అంశం. జ‌గ‌న్‌ను కాద‌ని వారిద్ద‌రు స్వ‌త‌హాగా ఈ ప‌ని చేసి ఉంటార‌ని అనుకోలేం. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కీ రోల్ పోషించిన ఆళ్ల‌.. ఇప్పుడు ష‌ర్మిల పాద‌యాత్ర‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. వాళ్లిద్ద‌రూ జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లోనే ష‌ర్మిల‌ను క‌లిశారా?  ప్ర‌జా ప్ర‌స్థాన పాద‌యాత్ర‌కు బూస్టింగ్ ఇస్తున్నారా? జ‌గ‌న్ త‌ర‌ఫున రాయ‌బారానికి వ‌చ్చారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.  తాను జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణం కాదంటూ ష‌ర్మిల మొద‌ట్లోనే తేల్చి చెప్పారు. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆస్థి త‌గాదాలు, ఆధిప‌త్య పోరు, చెల్లిని అన్న ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఆమె అలిగి రావ‌డం.. ఇలా ర‌క‌ర‌కాలుగా అన్నారు. అయితే, అవ‌న్నీ ఉత్తి ప్ర‌చార‌మేనా? వాళ్లంతా ఒక్క‌టేనా? అనే చ‌ర్చ కొత్త‌గా స్టార్ట్ అయింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల మాట్లాడుతూ.. జ‌గ‌న్‌తో త‌న‌కు అంత పెద్ద‌గా విభేదాలు ఏవీ లేవ‌ని.. తాము ఇప్ప‌టికీ ఫోన్లో మాట్లాడుకుంటున్నామ‌ని.. వైఎస్సార్ స‌మాధి ద‌గ్గ‌ర గ‌తంలోనూ తాము మాట్లాడుకోలేద‌ని.. చిన్న చిన్న‌ గొడ‌వ‌లు ఉన్నా.. కూర్చొని మాట్లాడుకుంటే స‌మ‌సిపోయేవేన‌ని ఆమే స్వ‌యంగా స్ప‌ష్టం చేశారు. అది నిజ‌మేన‌న్న‌ట్టు.. ఇప్పుడు జ‌గ‌న్ స‌న్నిహితులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిలు ష‌ర్మిలను క‌లిసి చ‌ర్చించ‌డం ఆస‌క్తిక‌రం. అంటే.. వారంతా ఒకే తాను ముక్క‌లా? ష‌ర్మిల జ‌గ‌న‌న్న వ‌దిలినా బాణ‌మేనా? మ‌రి, ఫ్యామిలీలో గొడ‌వ‌లు ఉన్నాయ‌నే ప్ర‌చారం కావాల‌నే చేశారా? లేక‌... చెల్లి పాద‌యాత్ర చేయ‌డం చూడ‌లేక‌.. అన్న రాయ‌బారం పంపించారా? అనే అనుమాన‌మూ వ‌స్తోందంటున్నారు. ఇందులో ఏది నిజ‌మో.. జ‌గ‌న్‌-ష‌ర్మిల మ‌ధ్య అస‌లేం జ‌రుగుతోందో.. క్లారిటీ వ‌చ్చీ రానట్టుగా ఉందంటున్నారు.  

అటు కొవిడ్.. ఇటు ఆంథ్రాక్స్.. వరంగల్ జిల్లాలో వణికిపోతున్న జనం 

కొవిడ్ మహమ్మారి తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గకుండానే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో కలకలం రేగింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, చాపలబండలో ఆంథ్రాక్స్  వెలుగు చూసింది. ఆంథ్రాక్స్ వ్యాధి లక్షణాలతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. చనిపోయిన గొర్రెలు సాంబయ్య అనే రైతుకు చెందినవి. అధికారులు దగ్గరుండి గొర్రెలను ఖననం చేయించారు. ఆంథ్రాక్స్ లక్షణాలతో నాలుగు గొర్రెలు చనిపోవడంతో దుగ్గొండ మండలంలో తీవ్ర భయాందోళన నెలకొంది. గొర్రెలు చనిపోయిన చాపలబండ గ్రామంలో అయితే జనాలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడిపోతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆంథ్రాక్స్  లక్షణాలు కనిపిస్తున్నా..ఇంకా నిర్దారణ కాలేదని చెప్పారు. పూర్తి నివేదికలు వచ్చాకే తేలుతుందన్నారు. ఒకవేళ ఆంధ్రాక్స్ అయినా భయపడాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలతో ఉంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. 

కొవిడ్ టీకా తీసుకుంటేనే రేషన్, పెన్షన్.. 

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే కీలకం కావడంతో.. అందరికి టీకా అందిచండమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై చర్యలు తీసుకునేందు సిద్ధమైంది. రాష్ట్రంలో ఎవరైనా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే.. వారి రేషన్‌ మరియు పింఛన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు.  కొత్త నిబంధనలు నవంబర్‌ 1 వ తేదీ నుంచే అమలు చేస్తామని  శ్రీనివాస రావు స్పష్టం చేశారు. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు. కరోనా మూడో వేవ్‌ ను అరికట్టేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 3 కోట్ల వ్యాక్సిన్ మైలురాయిని క్రాస్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 179 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు కరోనా సోకి మరణించారు. అలాగే.. 104 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ఒక్కొక్కరిని చెండాడుతా.. సుప్రీంకోర్టు నన్నేం ఏం చేయలేదు! సిద్ధిపేట కలెక్టర్ కామెంట్ల కలకలం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాకు ఆయన కలెక్టర్. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం. ఆ కలెక్టర్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘంగా కాలంగా ఆయన సిద్దిపేటలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని రోజులు మార్చినా.. తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు బినామీగా కలెక్టర్ వ్యవరిస్తున్నారనే ఆరోపణలను విపక్ష నేతలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలాన్ని దక్కించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయనకు వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ బినామీ కాబట్టే.. అతని సంస్థకు ఖరీదైన భూములను తక్కువ ధరకు కట్టబెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఆయన అధికార పార్టీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఇన్ని ఆరోపణలు ఉన్న సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్రికల్చర్ మీటింగ్‌లోఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి  హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన సరఫరా చేసే డీలర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘యాసంగిలో ఏ ఒక్క డీలర్ కేజీ వరి విత్తనాలు కూడా అమ్మడానికి వీళ్లేదు. అలా అమ్మితే వెంటనే ఆ షాపును సీజ్ చేస్తాం. షాపును రీఓపెన్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పినా, ప్రజాప్రతినిధులు చెప్పినా, నా పైఅధికారులు చెప్పినా నేను వినను. నేను కలెక్టర్‌గా ఉన్నన్ని రోజులు ఆ షాపు ఓపెన్ కానివ్వకుండా చేస్తా. ఒకవేళ డీలర్లు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెన్షన్ అవుతారు.’’ అని సిద్ధిపేట కలెక్టర్ అన్నారు.  సిద్ధిపేట జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ తీరుపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.  సిద్దిపేట కలెక్టరేట్‌లో విత్తనాలు, ఎరువుల డీలర్లతో జరిగిన సమావేశం వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించలేక ప్రభుత్వం చేతులెత్తేసేంది. అందుకే ప్రభుత్వం విత్తనాల అమ్మకాన్ని నిలిపివేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. రాష్ట్రంలో వరి పండించే అవకాశం లేనప్పుడు మరి లక్షల కోట్లు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం దేనికి.’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కలెక్టర్ హోదాలో ఉండి ఇలా బెదిరించడం ఏంటని నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది.

చంద్ర‌బాబు మారాలా? కోట‌రీ వ‌ల్లే క‌ష్టాలా? నిజ‌మైన నేత‌ల నినాద‌మేంటి?

చంద్ర‌బాబు మారాలి. లోకేశ్ మారాలి. తండ్రీకొడుకులు మారాలి. టీడీపీలో కొత్త చ‌ర్చ న‌డుస్తోంది. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ మూక‌ల దాడి, బీభ‌త్సం త‌ర్వాత తెలుగు త‌మ్ముళ్లు కొత్త చ‌ర్చను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. మాజీ మంత్రి ప‌రిటాల సునీత మొద‌ట ఆజ్యం పోశారు. అదిప్పుడు దావాగ్నిలా పార్టీలో ర‌గులుతోంది. పార్టీ శ్రేణులంతా వైసీపీ దాడుల‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. దెబ్బ‌కు దెబ్బ‌.. దాడికి ప్ర‌తిదాడి చేయాలంటూ పిలుపిస్తున్నారు. ప‌రిటాల సునీత అయితే ఏకంగా.. చంద్ర‌బాబు సీఎం అయ్యాక ఓ గంట క‌ళ్లు మూసుకుంటే చాలు.. తామేంటో చూపిస్తాం అంటూ.. వైసీపీని ఫ‌స‌క్ చేస్తామ‌నే రేంజ్‌లో స‌వాల్ చేశారు. ఆమె ప్ర‌సంగాన్ని చంద్ర‌బాబు సైతం ఆస‌క్తిగా విన్నారు. సునీత పిలుపు త‌ర్వాత ఇత‌ర నాయ‌కులూ చంద్ర‌బాబు మారాల‌నే సూచ‌న చేస్తుండ‌టం ఆసక్తిక‌ర ప‌రిణామం.  ఇక‌ చంద్ర‌బాబును పార్టీ శ్రేణులే ప‌లు ర‌కాలుగా త‌ప్పుబ‌డుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న చుట్టూ గిరి గీసుకొని.. ఓ కోట‌రీని ఏర్పాటు చేసుకొని.. అందులోంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయార‌ని అంటున్నారు. పవ‌ర్‌లో ఉన్న‌ప్పుడు అధికారం అనుభ‌వించి.. హ‌వా న‌డిపించిన ఆ కోట‌రీ.. టీడీపీ అధికారం కోల్పోగానే.. ప‌టాపంచ‌లు అయిపోయింద‌ని.. చంద్ర‌బాబును వ‌దిలేసి ఎవ‌రి దారి వారు చూసుకున్నార‌ని మండిప‌డుతున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబుదే త‌ప్ప‌నే విధంగా చ‌ర్చ న‌డుస్తోంది. పార్టీ కోసం ప్రాణాలొడ్డి.. వైసీపీ కుతంత్రాల‌ను ఎదుర్కొటూ.. నిబద్ధ‌త‌తో ప‌ని చేస్తున్న‌ నిజ‌మైన నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అప్ప‌ట్లో చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని త‌ప్పుబ‌డుతున్నారు. తీరా.. అధికారానికి దూర‌మ‌య్యాక‌.. అధినేత‌కు ఇప్పుడు త‌త్వం బోధ‌ప‌డుతోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలుస్తున్న‌దంతా నిఖార్సైన తెలుగు త‌మ్ముళ్లేన‌ని గుర్తు చేస్తున్నారు.  అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు కొంద‌రివాడే అంటారు. మంత్రి నారాయ‌ణ‌, ఎంపీలు సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేశ్‌లాంటి వాళ్లు చంద్ర‌బాబును హైజాక్ చేశార‌ని చెబుతారు. అధినేత సైతం వారికే ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇచ్చే వార‌ని చెబుతారు. ఇప్పుడు వాళ్లెవ‌రూ పార్టీలో లేరు. ప్ర‌స్తుతం పార్టీని, చంద్ర‌బాబును కంటికి రెప్ప‌లా కాపుడుకుంటున్న‌ది.. ప‌రిటాల‌, చింత‌మ‌నేని, కూన ర‌వికుమార్‌, కొల్లు ర‌వీంద్ర‌, దూళిపాళ్ల‌, బుద్దా వెంక‌న్న‌, బొండా ఉమా, ప‌ట్టాభి లాంటి వాళ్లే. అందుకే, అధికారంలో ఉన్నా లేకున్నా.. నిజ‌మైన నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను పట్టించుకోవాల‌ని.. పార్టీని బ‌తికించుకోవాల‌ని.. త‌ద‌నుగుణంగా చంద్ర‌బాబు మారాల‌నే చ‌ర్చ న‌డుస్తోంది.  ఈ సంద‌ర్బంగా ప‌రిటాల సునీత చేసిన మ‌రో కామెంట్ సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్.. న‌ర‌సారావుపేట‌కు ప‌రామ‌ర్శ‌కు వెళుతుంటే.. ప్ర‌భుత్వ ప్రోద్బ‌లంతో పోలీసులు విజ‌య‌వాడ‌లోనే ఆయ‌న్ను అడ్డుకున్నారు. ఆ సంద‌ర్భంగా లోకేశ్ వెంట ప‌ట్టుమ‌ని ప‌ది మంది కార్య‌క‌ర్త‌లు కూడా లేర‌ని.. అలాంటి ప‌రిస్థితి రావొద్దంటూ సునీత సూచించారు. ఇదంతా గ‌తంలో క్రింది స్థాయి కార్య‌క‌ర్త‌ల‌కు చంద్ర‌బాబు కానీ, లోకేశ్ కానీ.. త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇప్పుడు ఆ కేడ‌ర్ కాస్త దూరంగా ఉంటోంద‌ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితులు మ‌ళ్లీ రావొద్దంటే.. నిజ‌మైన తెలుగు త‌మ్ముళ్ల‌కు త‌గిన‌ ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేడ‌ర్ నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి.  అయితే, టీడీపీ అధినేత తీరునూ గ‌ట్టిగా స‌మ‌ర్థించే వాళ్లూ ఉన్నారు. న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు నిత్యం ప‌రిపాల‌నా ప‌నుల్లో బిజీగా ఉండేవార‌ని.. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపైనే ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టార‌ని చెబుతున్నారు. లోకేశ్ సైతం కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా ఉంటూ ఏపీ అభివృద్ధి, పెట్టుబ‌డుల‌పైనే దృష్టి కేంద్రీక‌రించ‌డం వ‌ల్ల‌.. పార్టీని, కేడ‌ర్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేక‌పోయార‌ని.. అంతేకానీ వేరే ఉద్దేశ్యం లేద‌నేది చంద్ర‌బాబు త‌ర‌ఫు వ‌ర్ష‌న్‌. ఏది ఏమైనా.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ రౌడీల దాడుల త‌ర్వాత‌.. పార్టీని మ‌రింత ధృఢంగా, ప‌టిష్టంగా మార్చ‌డంపై అధినేత చంద్ర‌బాబు మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రాన్ని గ‌ట్టిగా సూచిస్తోంది. దీక్ష‌లు, ధ‌ర్నాల‌తో పాటు అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌పై ఇంకా దూకుడుగా, ధీటుగా జ‌వాబిచ్చేలా ప‌దునైన‌ వ్యూహాలు సిద్ధం చేయాల‌ని.. అందుకు అనుగుణంగా కేడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేయాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిని తీసుకొచ్చింద‌ని అంటున్నారు. మ‌రి, కేడ‌ర్ కోరుతున్న‌ట్టు.. చంద్ర‌బాబు మారుతారా? లోకేశ్ మ‌రింత అగ్రెసివ్ అవుతారా? కోట‌రీకి స్థానం లేకుండా చేసి.. నిజ‌మైన కేడ‌ర్‌తో రాజ‌కీయ ర‌ణ‌తంత్రం ర‌చిస్తారా? చూడాలి...

జ‌గ‌న్ ఇంటికి వైసీపీ కార్య‌క‌ర్త పాద‌యాత్ర‌.. మ‌రీ ఇంత అరాచ‌క‌మా?

ఏపీలో పాల‌న అనేదే లేదు. కేవ‌లం అరాచ‌కం మాత్ర‌మే. ఓవైపు అధికారులు.. మ‌రోవైపు వైసీపీ పెద్ద‌లు.. ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలు, ల‌బ్దిదారులు, అర్హుల ఎంపిక‌ విష‌యంలో పార్టీ లీడ‌ర్లదే పెత్త‌న‌మంతా. అయితే, వైసీపీ కండువా క‌ప్పుకున్న వారంద‌రి మాటా చెల్లుబాటు కావ‌ట్లేదు. కొంద‌రిదే హ‌వా. క్రింది స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునే వారే లేదు. పార్టీ ప్ర‌ముఖులే కాదు.. అధికారులు సైతం సామాన్యుల‌ను లెక్క చేయ‌డం లేదంటున్నారు. స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఉద్యోగుల్లో ఉదాసీన‌త, బ‌ద్ద‌కం, నిర్ల‌క్ష్యం బాగా పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు. ఇక‌ లంచగొండిత‌నం గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఏపీలో అధికారుల ఓవ‌రాక్ష‌న్‌ను మ‌రోసారి గుర్తు చేస్తోంది. కృష్ణా జిల్లా ధ‌నియాల‌పేట‌కు చెందిన వైసీపీ కార్య‌క‌ర్త ప‌ల్ల‌పు శ్రీనివాస‌రావుకు అధికారుల చేతిలో చేదు అనుభ‌వం ఎదురైంది. కుటుంబ సభ్యత్వ ధ్రువపత్రం కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు శ్రీనివాస‌రావు. య‌దావిధిగా లంచం అడిగార‌ట అక్క‌డి అధికారులు. అదేంటి.. లంచం ఎందుకు?  తాను వైసీపీ కార్య‌క‌ర్త‌న‌ని చెప్పార‌ట‌. అయితే ఏంటి? ఎవ‌రైనా స‌రే.. లంచం ఇస్తేనే ప‌న‌వుతుంద‌ని ఆ ఆఫీస‌ర్ నుంచి రిప్లై వ‌చ్చింది. మ‌నోడు షాక్‌. అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ను త‌న‌నే లంచం అడుగుతారా అంటూ గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. అధికారులు ఇంకా ముదురు క‌దా. అందుకే, శ్రీనివాస‌రావు ఎంత వాదించినా.. లంచం ఇస్తేనే ప‌న‌వుతుంద‌ని తేల్చేశారు. ఒళ్లు మండిన ఆ వైసీపీ కార్య‌క‌ర్త‌.. మీ సంగ‌తి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌రే తేలుస్తానంటూ పాద‌యాత్ర చేప‌ట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. లంచం అడిగారంటూ వైసీపీ కార్యకర్త పల్లపు శ్రీనివాసరావు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి పాదయాత్ర చేపట్టారు. ‘అధికారుల నిర్లక్ష్యం.. లంచగొండితనం..సీఎం సారూ నాకు న్యాయం చేయండి..’ అంటూ ప్లకార్డు ప‌ట్టుకొని.. మెడలో వైసీపీ కండువా క‌ప్పుకొని.. పాద‌యాత్ర‌గా తాడేప‌ల్లి ప్యాలెస్ వైపు వెళ్తున్న శ్రీనివాస‌రావు ఉదంతం ఏపీలో క‌ల‌క‌లంగా మారింది. మ‌రి, అవినీతికే బ్రాండ్ అంబాసిడ‌ర్ లాంటి సీఎం జ‌గ‌న్‌రెడ్డి.. అవినీతికి పాల్ప‌డుతున్న అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారా? అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు. 

టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి! రేవంత్ రెడ్డి దెబ్బకు మైండ్ బ్లాంక్...

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితీ ద్వదశాబ్ది వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ప్లీనరీ అట్టహాసంగా సాగింది. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కేసీఆర్. పార్టీ 20వ పండుగ కావడంతో హైదరాబాద్ మొత్తం గులాబీమయం చేసింది అధికార పార్టీ. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విపక్షాలు ఆందోళన కూడా చేశాయి. గ్రేటర్ పరిధిలో బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేదం ఉండగా.. ఇంత పెద్ద స్థాయిలో ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించాయి.  టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జలదృశ్యం నుంచి జనదృశ్యం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ ఉద్యమం ముసుగులో గులాబీ పార్టీని విస్తరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలు నగరంలో టులెట్ బోర్డ్ పెడితే జీహెచ్ఎంసీ 2 వేల జరిమానా వేస్తుందని, కాని హైదరాబాద్ కట్టిన టీఆర్ఎస్ జెండాలు వాళ్లకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు ఎంత ఫైన్ వేస్తారని బల్దియా అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నేత విగ్రహాలకు సైతం టీఆరెఎస్ జెండాలు కట్టారన్నారు. ప్లీనరీలో తెలంగాణ అమర వీరులను కూడా స్మరించుకోలేదన్నారు. జల దృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం అవినీతి దృశ్యంగా దోపిడీ దృశ్యంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఫ్లెక్సీ పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తురాలేదన్నారు. 2001 జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎగపాకిందని విమర్శించారు. కొండా లక్ష్మణ్ బాపు, బియ్యాల జనార్దన్ రావు, జయశంకర్, కేశవరావు, గుడ అంజయ్య, సాంబశివుడు, రహ్మాన్, చివరి నిమిషం వరకు కేసీఆర్ కోసం పనిచేశారన్నారు. గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, పాపారావు, విజయ రామరావు, ఆలే నరేంద్ర, విజయశాంతి.. ఎవర్ని గుర్తు చేసుకోలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మలే ప్లీనరీలో పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అన్నారు. ఓయూకు ఎంత నిధులు కేటాయించారో తెలపాలన్నారు. యువతను ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తలో లక్ష 7 వేల ఖాళీలున్నాయని కేసీఆర్ చెప్పారని, బిశ్వల్ కమిటీ రిపోర్ట్ కూడా లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని చెప్పిందన్నారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ, నిరుద్యోగుల సమస్యలపై కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంతా కలిసి పోరాటం చేశాలని కోరారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, కేసీఆర్ పై పెట్టిన కేసులు తొలగించుకున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయాల పేరుతో సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల  ఆస్తులను సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.420 కోట్లు ఉన్నాయంటే.. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బైలాస్ మార్చారంటే కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్ అని భవిష్యత్ ముఖ చిత్రం తెలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు

పాక్ విజయంపై భారత్ టీచర్ సెలబ్రేషన్.. ఉద్యోగం నుంచి ఊస్టింగ్.. 

ఐపీఎల్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది భారత జట్టు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక భారత్ పై గెలుపుతో పాకిస్తాన్ లో సంబరాలు జరిగాయి. అయితే పాకిస్తాన్ లోనే కాదు మన దేశంలోనూ చాలా ప్రాంతాల్లో మ్యాచ్ ముగియగానే బాంబులు కాల్చారనే వార్తలు వస్తున్నాయి. పాక్ గెలిస్తే భారత్ లో బాంబులు కాల్చడం కలకలం రేపుతోంది.  తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. భారత్ పై పాకిస్తాన్  జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజస్థాన్ లో ఓ ప్రభుత్వ టీచర్ తన వాట్సాప్ అకౌంట్ లో స్టేటస్ పెట్టుకుంది. ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంది. ఇది గమనించిన కొందరు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్ ను ఆరా తీసిన స్కూల్ యాజమాన్యం... ఆమెను  ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.  ఫీసా అత్తారి అనే మహిళా ఉపాధ్యాయురాలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్‌లో పని చేసేది. పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది. ‘‘మేం గెలిచాం’’ అని పేర్కొన్న పాకిస్థాన్ ఆటగాళ్ల చిత్రాలతో పాటు వాట్సాప్ స్టేటస్ ద్వారా నఫీసా సంతోషం వ్యక్తం చేసింది.మీరు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నారా అని తల్లిదండ్రుల్లో ఒకరు ఉపాధ్యాయురాలిని అడిగినప్పుడు, నఫీసా ‘‘అవును’’ అని సమాధానమిచ్చింది. వాట్సాప్‌లో టీచర్ స్టేటస్ స్క్రీన్‌షాట్‌లు వ్యాపించడంతో స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ని  ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేర టెర్మినేషన్ లెటరును నీరజ్ మోదీ స్కూలు యాజమాన్యం జారీ చేసింది. 

హరీష్ కు అనుచరులు దూరమవుతున్నారా? ఆయనపై కుట్ర జరుగుతోందా? 

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి ఇక మిగిలింది మూడే రోజులు. ఎన్నికల ప్రక్రియ మొదలు కంటే, మూడు నెలల ముందు నుంచే నియోజక వర్గంలో ప్రచారం మొదలైంది. అప్పటి నుంచి అలా వాడిగా వేడిగా ప్రచారం సాగుతూనే ఉంది. ఇలా సుదీర్ఘంగా సాగిన ప్రచారంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వం తరపున వరాల  జల్లులు కాదు కుంభవృష్టే కురిసింది. రేషన్ కార్డులు, పించన్లు, రైతు బంధు, దళిత బంధు అదీ ఇదీ అని కాదు,వేలకోట్ల రూపాయల పధకాలు హుజూరాబాద్’ను ముంచెత్తాయి. ముద్దచేశాయి. ఇక ఆరోపణలు, ప్రత్యారోపణలకు కొదవ లేదు. ముఖ్యంగా మాజీ మిత్రులు మంత్రి హరీశ్  రావు, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ మధ్యన అయితే, మాటల తూటాలు కాదు మర ఫిరంగులే పేలాయి. ఒక విధంగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక మంత్రి హరీశ్ మాజీ మంత్రి ఈటల మధ్య పోటీ అన్నట్లుగానే ప్రచారం సాగుతోంది.  ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందు ముఖ్యమత్రి కేసీఆర్ ప్రచార, వ్యూహరచనలో కొంచెం చాలా ఎక్కువగానే ప్రత్యేక శ్రద్ద చూపించారు. సర్వేలు చేయించారు.  ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పారు.అయితే  ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకనో  సైలెంట్ అయిపోయారు. ”అతి సర్వత్ర వర్జియేత్”  అన్న సంకేతం అందడం వలన,రివైజడ్ వ్యూహంలో భాగంగా  ఆయన అలా మౌనముద్రలోకి వెళ్ళిపోయారా,లేక ఇంకేదైనా కారణం ఉందా ఉన్న విషయాన్ని పక్కన పెడితే, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వత కేసీఆర్ ‘లో హుజూరాబాద్ జోష్ తగ్గింది. అలాగే, తెర వెనక ఏమి చేస్తున్నారో, ఏమి చేయడం లేదో కానీ, తెర మీద మాత్రం కేసీఆర్ కనిపించడం లేదు.అంతగా వినిపించడం లేదు.  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్  హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో అసలే పాల్గొన లేదు. అంతే కాదు  హుజూరాబాద్ అయినా ఇంకొకటి అయినా ఉప ఎన్నిక ఉప ఎన్నికే, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరమే లేదని తేల్చేశారు. ఒక విధంగా నెలల తరబడి, అక్కడే తిష్టవేసి తంటాలు పడుతున్న హరేశ్ రావుని కొంచెం నర్మగర్భంగానే అయినా అవహేళన చేశారు. హుజూరాబాద్’లో గెలిచినా ఓడినా ఫరక్ పడదని, గెలిచేస్తే కిరీటం వచ్చి నెత్తిన వాలుతుందని భ్రమలు వద్దని హరీశ్ రావుకు ఆయన స్థానం ఏమిటో గుర్తు చేశారు.హుజూరాబాద్’లో గెలిచినా ఓడినా, జరిగేదే జరుగుతుందని  చెప్పకనే చెప్పారు.అంతే కాదు, పోలింగ్ సమయానికి దేశంలోనే లేకుండా ఈ నెల 27 న ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్నారు. పోలింగ్ అయిపోయిన తర్వత కానీ, ఆయన తిరిగిరారు.    కేటీఆర్ విషయాన్ని పక్కన పెడితే, హుజూరాబాద్’లో విజయం సాధించి, ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో తమ ఉనికినీ, ప్రాధాన్యతను నిలుపుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్న హరీష్ రావు, చివరాఖరుకు ఏమి సాధిస్తారో ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే, అటు పార్టీలో ఇటు ప్రజల్లో చులక అవుతున్నారన్న అభిప్రాయమే పార్టీ వర్గాల్లో ముఖ్యంగా ఆయన అనుచర వర్గంలో వ్యక్తమవుతోంది.  నిజానికి ఆయన గతాన్ని, వాస్తవాన్ని మరిచి ఈటలఫై చేస్తున్న విమర్శలు బూమ్రాంగ్ అవుతున్నాయని అంటున్నారు. అంతే కాకుండా, హరేశ్ రావు ఇమేజ్’ని డ్యామేజి చేస్తున్నాయని ఆయన అనుచరులే చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా, ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్’ను మోసం చేశారని, వంచించారని హరీశ్ చేసిన తాజా విమర్శ, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు. హరీష్’ను అంతగా నమ్ముకుని, ఆయన వెంట నడించిన ఈటలనే, అంత మాట అన్న తర్వాత, మాలాంటి వారి విషయంలో ఆయన రిస్క్ తీసుకుంటారని నమ్మడం ఎలా, అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.  హరీశ్ రావు పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేయడం వేరు,స్వార్ధంతో ఈటలను టార్గెట్ చేయడం వేరు, ఈటలను టార్గెట్ చేయడం ద్వారా హరీశ్ రావు తమ విశ్వసనీయతను కోల్పోయారని ఆయన అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, హరీశ్ రావు నిజాయతీకి అగ్ని పరీక్షగా మారిన  హుజూరాబాద్ ఉప ఎన్నిక, (ఫలితం ఎలా ఉన్నా) అగ్ని పరీక్షలో మాత్రం హరీశ్రావు ఇప్పటికే ఓడిపోయారని, అనుచరుల విశ్వాసాన్ని కోల్పోయారని అంటున్నారు.

హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ ఓటమి ప‌క్కానా? అందుకే కేసీఆర్ స‌భ లేదా? 

సీఎం కేసీఆర్ తేల్చేశారు. హుజురాబాద్‌లో త‌న‌ స‌భ లేద‌ని చెప్పేశారు. అందుకు కార‌ణం విప‌క్షాల‌పై నెట్టేశారు. కానీ, అస‌లు కార‌ణం వేరే ఉందంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల‌డంతోనే ముఖ్య‌మంత్రి ముఖం చాటేశార‌ని చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు గ‌త అనుభ‌వాల‌ను గుర్తు చేస్తున్నారు. ఈ రెండున్న‌ర ఏళ్ల‌లో ఉప ఎన్నిక‌లు జ‌రిగిన హుజూర్ న‌గ‌ర్‌, దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల్లో కేసీఆర్ అమ‌లు చేసిన స‌భావ్యూహాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తున్నారు.  ప‌క్కాగా గెలుస్తామ‌ని అనుకుంటేనే ఉప పోరు బ‌రిలో కేసీఆర్ అడుగుపెడ‌తారు. ఇంటెలిజెన్స్ స‌ర్వేలో కారు టాప్ గేరులో దూసుకుపోతుంద‌ని రిపోర్టులు వ‌స్తేనే.. గులాబీ బాస్ బ‌హిరంగ స‌భ పెడ‌తారు. లేదంటే.. అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు. ఆ మూడు ఉప ఎన్నిక‌ల్లో అదే జ‌రిగింది. ఆ లెక్క ప్ర‌కారం.. ఇప్పుడు హుజురాబాద్‌లో ఏం జ‌ర‌గ‌బోతోందో ఈజీగా గెస్ చేయొచ్చ‌ని అంటున్నారు. ఇంత‌కీ.. కేసీఆర్‌కు.. ఉప ఎన్నిక‌ల స‌భ‌కు ఉన్న లింకేంటి? ఆ పొలిటిక‌ల్ మీటింగ్‌ స్ట్రాట‌జీ ఏంటి? ప‌రువు కోసం కేసీఆర్ ఎందాకైనా పోతారంటారు. పట్టుద‌ల‌కు పోతే.. పంతం నెగ్గించుకునే దాకా వ‌ద‌ల‌ర‌ని చెబుతారు. గెలుపునే కానీ ఓట‌మిని అస్స‌లు జీర్ణించుకోలేర‌నేది ఆయ‌న స‌న్నిహితుల మాట‌. గ‌తంలో రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌ల విష‌యంలో అలానే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ఉప ఎన్నిక కాక‌పోయినా కొడంగ‌ల్‌లో స‌ర్వ‌శ‌క్తులూ ప్ర‌యోగించి రేవంత్‌ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా చేయ‌గ‌లిగారు కేసీఆర్‌. అయితే, గోడ‌కు కొట్టిన బంతిలా.. మ‌ల్క‌ాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా పార్ల‌మెంట్ స్థాయికి ఎదిగారు రేవంత్‌రెడ్డి. అప్పుడు రేవంత్ త‌ర్వాత.. ఇప్పుడు ఈట‌లపైనే అంతటి క‌సితో ఉన్నారు కేసీఆర్‌. త‌న అధికారాన్నే ధిక్క‌రించార‌నే కోపంతో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎలాగైనా అణిచేయాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, హుజురాబాద్‌లో ఈట‌ల.. ఈటెలా గుచ్చుకుంటున్నారే కానీ, కరివేపాకులా తీసిప‌డేసే ప‌రిస్థితి లేద‌ని తేలిపోతోంది. ఇక ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ స‌భ‌ల విష‌యానికి వ‌స్తే... కేసీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు ముచ్చ‌ట‌గా మూడు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. హుజూర్‌న‌గ‌ర్‌, దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్‌. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలిచి.. ఎమ్మెల్యేగా రిజైన్ చేయ‌డంతో హుజూర్‌న‌గ‌ర్‌కు ఉప ఎన్నిక వ‌చ్చింది. అక్క‌డ గులాబీ గాలి బ‌లంగా వీస్తోంద‌ని ముందుగా స‌ర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదిక‌లు తేల్చేశాయి. దీంతో.. సీఎం కేసీఆర్ హుజూర్‌న‌గ‌ర్‌లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టేసి.. వ‌రాలు గుప్పించేశారు. హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలిచింది. తానే కారు పార్టీని గెలిపించేశాన‌ని గర్వంగా ఫీల‌య్యారు కేసీఆర్‌. ఆయ‌న‌కు బాగా కిక్ ఇచ్చేది ఆ విజ‌య‌గ‌ర్వ‌మే అంటారు.   నెక్ట్స్‌. దుబ్బాక‌. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈసారి బీజేపీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు బ‌రిలో నిలిచారు. ఎన్నిక‌ల ప్ర‌చారం హోరాహోరీగా సాగింది. హ‌రీశ్‌రావుకు దుబ్బాక పేరుతో అగ్నిప‌రీక్ష పెట్టారు. కేసీఆర్‌, కేటీఆర్ అటువైపు వెళ్ల‌నే లేదు. హుజూర్‌న‌గ‌ర్‌లో మాదిరి దుబ్బాక‌లో కేసీఆర్ స‌భ పెట్ట‌లేదు. ఎందుకంటే.. ఆ స‌మ‌యంలో దుబ్బాక‌లో ఎన్నిసార్లు స‌ర్వేలు చేయించినా.. ఎన్ని ఐబీ నివేదిక‌లు తెప్పించుకున్నా.. వాట‌న్నిటిలోనూ దుబ్బాక‌లో టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌మ‌ని.. బీజేపీ కేండిడేట్ ర‌ఘునంద‌న్‌రావు గెలుపు ప‌క్కా అని తేల్చేశాయి. దీంతో.. తీవ్ర నిరాశ‌లో మునిగిపోయిన కేసీఆర్‌.. దుబ్బాక‌లో బ‌హిరంగ స‌భ ఆలోచ‌న విర‌మించుకున్నారు. తాను స‌భ పెట్టి.. ఓట‌ర్ల‌కు స్వ‌యంగా పిలుపిచ్చినా.. దుబ్బాక‌లో ఓడిపోతే.. త‌న ఇజ్జ‌త్ అంతా పోతుంద‌నుకున్నార‌ని.. అందుకే స‌భ పెట్ట‌లేద‌ని అప్ప‌ట్లో అన్నారు.  తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేశారు. అయితే నాగార్జున సాగర్ లో కేసీఆర్ చేయించిన సర్వేల్లో అధికార పార్టీ సానుకూలత లభించింది. అందుకే కొవిడ్ భయపెడుతున్నా నాగార్జున సాగర్ లో బహిరంగ సభ పెట్టారు. ఆ సభ తర్వాతే సీఎం కేసీఆర్ సహా వందలాది మంది టీఆర్ఎస్ నేతలు కొవిడ్ భారీన పడ్డారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సాగర్ లో సర్వేలన్ని కారు గెలుస్తుందని నివేదికలు ఇవ్వడం వల్లే కేసీఆర్ ప్రచార సభ నిర్వహించారని తేలింది.  క‌ట్ చేస్తే.. ఇప్పుడు హుజురాబాద్ వంతు వ‌చ్చింది. ఇక్క‌డ ఈసారి కేసీఆర్ స‌భ పెడ‌దామ‌ని అనుకున్నా.. ఇప్పుడు క్యాన్సిల్ చేసేశారు. అంటే అర్థం.. కేసీఆర్‌కు ఓట‌మి మెసేజ్ వ‌చ్చిందా? స‌ర్వేలు, ఐబీ రిపోర్టులు టీఆర్ఎస్ ఓట‌మిని.. ఈట‌ల గెలుపును క‌న్ఫామ్ చేసేశాయా? అందుక‌నే ఈ నెల 27న భారీ బహిరంగ స‌భ పెట్టి అద‌ర‌గొడ‌దామ‌నుకున్న కేసీఆర్ మ‌న‌సు మార్చుకున్నారా? అంటే అవున‌నే అంటున్నారు. వారం వారం కేసీఆర్ చేయిస్తున్న స‌ర్వేలు, ఇంటెలిజ‌న్స్ పోలీసులు ఇస్తున్న నివేదిక‌లు హుజురాబాద్‌లో ఈట‌ల గెలుపునే సూచిస్తున్నాయ‌ని తెలుస్తోంది. హుజురాబాద్‌లో ఈట‌ల‌పై ద‌ళిత‌బంధులాంటి బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగించినా.. ఓడిపోతున్నామ‌నే విష‌యం ముందుగానే తెలీడంతో కేసీఆర్ బాగా హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు. తాను స‌భ పెట్టినా ఓట‌మిపాలైతే.. ఈట‌ల ముందు త‌న త‌ల తీసేసిన‌ట్టు ఉంటుంద‌ని.. ఆ అవ‌మానాన్ని భ‌రించ‌లేకే.. ఈసీ రూల్స్‌ను సాకుగా చూపిస్తూ.. దుబ్బాక త‌ర‌హాలోనే హుజురాబాద్‌లోనూ బ‌హిరంగ స‌భ‌ను క్యాన్సిల్ చేసుకుని.. టీఆర్ఎస్ ఓట‌మిని కేసీఆర్ ముందే ఒప్పేసుకున్నార‌ని అంటున్నారు. ఇక, దొర‌త‌నాన్ని, ప్ర‌గ‌తి భ‌వ‌న్ దుర‌హంకారాన్ని ధిక్క‌రించిన ఈట‌ల‌.. హుజురాబాద్‌లో గెలిచి.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా అడుగు పెడితే... కేసీఆర్ ప‌రిస్థితి ఎట్లుంట‌దో...!!

ఇటు మోడీ.. అటు ప్రియాంక! యూపీ కాంగ్రెస్ లో కొత్త ఆశలు.. 

ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకు పైగానే సమయం ఉంది. అయినా ఇంతలోనే మొదలైన ఎన్నికల వేడి రోజురోజుకు రైజ్ అవుతోంది. ఒక వంక ప్రధానినరేంద్ర మోడీ సిద్ధార్థ్నగర్ బహిరంగ సభ వేదిక నుంచి ఒకేసారి 9 వైద్య కళాశాలలను వర్చువల్గా ప్రారంభించి, గత ప్రభుత్వాల నిర్వాకం వల్లనే రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అనారోగ్యంపాలైందని ఆరోపించారు. ఇక ఆ పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు. అయిత అదే రోజున  కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియంకా గాంధీ, కరోనా సమయంలో పేదల ప్రాణాలు కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. ప్రభుత్వాల  వైఫల్యాలను ఎండ గట్టారు.అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం, వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఉచితంగా ఇస్తుందని హామీ, ఇచ్చారు.  ప్రధాని మోడీ ఎవరి పేరు ప్రస్తావించకుండానే,గత ప్రభుత్వాలు ఉచితాల పేరున సొంత ఖజానాలు నింపుకుంటే, తమ ప్రభుత్వం పైసా పైసా కూడబెట్టి, మౌలిక సదుపాయాలు కలిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ రోజు ప్రారంభించిన 9 వైద్య కళాశాలల వల్ల 2500 పడకలు అందుబాటులోకి వచ్చాయి,5వేల మందికి ఉపాధి లభిస్తుందని, ఉచిత వరాలు నాయకుల జేబులు నిమ్పుకునేందుకే కాని, ప్రజలకు మేలు చేయవని చెప్పకనే చెప్పారు.ఇలా నేరుగా ప్రధానమంత్రిని ప్రియాంకా వాద్రా నేరుగా ఎదుర్కోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసమైంది. మరో వంక ప్రియాంక రాకతోకాంగ్రెస్ పార్టలో కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.అలాగే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాల్లో అందరికంటే వేగంగా అడుగులు వేయడం ఒకవిధంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెర వెనక వ్యూహం ఎవరిదో ఏమో గానీ, ప్రియాంకా వాద్రా తెరమీదకు వచ్చిన తర్వాత ఎన్నికల లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. ప్రియాంక ఎంట్రీ వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క, అన్నట్లుగా రాజకీయ చర్చ కొత్తమలుపులు తిరుగుతోంది. నిజానికి, యూపీలో ప్రియాంక వాద్రా చూపుతున్న చొరవ వేస్తున్న అడుగులు కేవలం,ఒక్క యూపీకే పరిమితం కాదని, భవిష్యత్’లో దేశం అంతటా ఇదే దూకుడు చూపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఉత్తరప్రదేశ్’లో ప్రియాంక మాత్రం ఎక్కడ పారేసుకున్నమో అక్కడే వెతుక్కోవాలనే పెద్దల మాటను చక్కగా, తూచా తప్పకుండా పాటిస్తున్నారు.అందుకే, ఆమె అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వరాల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో అంచెల వారీగా ‘ప్రతిజ్ఞ’ పేరిట   పాదయాత్ర చేస్తున్న, ప్రియాంకా వాద్రా, విడతల వారీగా వారాల  జల్లు కురిపిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం, రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ చేస్తుందని  ప్రకటించారు. అలగే,  వరి, గోధుమకు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కరోనా సంక్షోభం వల్ల ఎదురైన నష్టం నుంచి బయటపడేందుకు ఒక్కో పేద కుటుంబానికి రూ.25 వేలు అందిస్తామని చెప్పారు.అంతే కాదు, యువతను ముఖ్యంగా చదువుకునే ఆడపిల్లలను ఆకట్టుకునేందుకు, స్మార్ట్ ఫోన్లు, ఈ – స్కూటర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్నమరో హమీనీ ప్రియంక ఇచ్చారు.  ,ఇప్పుడు ప్రియాంక గాంధీ.. తాజాగా మరో ప్రకటన చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు ప్రియాంక ట్వీట్ చేశారు.అయితే, ప్రియాంక హామీలతో కాంగ్రెస్ పార్టీ కొంత పుజుకున్నా,  అధికారానికి  చేరుకోవడం మాత్రం అయ్యేపనికాదని అంటున్నారు.

ఏపీలో మద్యం మాఫియా.. విదేశాలకు పట్టాభి.. చప్పగా గులాబీ ప్లీనరీ... షమీకి అసద్ సపోర్ట్ టాప్ న్యూస్@7PM

ఏపీలో మద్యపాన నిషేధమని చెప్పి జగన్‌రెడ్డి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు. డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ చేయమని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు --------- రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత  పట్టాభి విమానంలో ప్రత్యక్షమయ్యారు. జైలు నుంచి విడుదల తరువాత ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా విమానంలో ప్రయాణం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మాల్దీవ్స్‌కు పట్టాభి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు నిర్ధారించలేదు.  ------- జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నిర్వహించనున్న సభకు హాజరవనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభను నిర్వహించనున్నారు. 31వ తేదీన పవన్ విశాఖ చేరుకుంటారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి చేరుకుని సభలో పాల్గొంటారు. ------ టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంలో ఊరట లభించింది. గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీ మూసివేతకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. రూ.50 కోట్ల జరిమానాకు సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సవాలు చేశారు ------ ఏపీలో 46 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయినట్టేనని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికి ఏపీలో 5 కోట్ల 2 లక్షల 40 వేల పై చిలుకు డోసుల కరోనా వ్యాక్సిన్ పూర్తి అయ్యిందన్నారు. 1.85 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ 85.35 శాతం మేర పూర్తి అయ్యిందని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టూ డోర్ సర్వే చేస్తామని ఆయన తెలిపారు ------- తెలంగాణలో అమలుచేస్తున్న కార్యక్రమాలు, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ‘త్రీఐమంత్ర’ నడుస్తోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు అన్నారు. త్రీ ఐ అంటే ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌ అని వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో పార్టీవర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో తాను మాట్లాడుతున్నానని చెప్పారు.హైదరాబాద్‌నగరం గూగుల్‌కు గుండెకాయలా, అమెజాన్‌కు ఆయువుపట్టులాంటిదని కేటీఆర్‌ అభివర్ణించారు.  ----- ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు.  ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించడంలేదని నిలదీశారు. కవిత, కేటీఆర్, కేసీఆర్‌పై పెట్టిన కేసులు తొలగించుకున్నారని రేవంత్ ప్రశ్నించారు.  ------ రాష్ట్రంలో ప్రశ్నించేవారు ఉండొద్దనే కేసీఆర్ ఆలోచన అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో కేసీఆర్ చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ అబద్ధాల, అవినీతి, కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ బానిస అనుకుంటున్నారని చెప్పారు. ఈటలను, ఆయన భార్యను జైల్లో పెట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  ---------- ఏ సర్వే చూసినా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ దే విజయమని చెపుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోబోతోందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని... అందుకే హుజూరాబాద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం లేదని చెప్పారు. ఏప్రిల్ 27కి ముందు టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టుకోవాలి కదా? ఇప్పుడెందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. -------- పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలకి వచ్చి కార్యకలాపాలు నిర్వహించేలా భారత సరిహద్దు రక్షణా దళాలకు (బీఎస్‌ఎఫ్) అధికారం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన.. కేంద్రానికి పలుమార్లు ఈ విషయమై ప్రతిపాదనలు చేశారు --------- పాకిస్తాన్ తో ఓడిపోయిన మ్యాచ్ లో  బౌలర్ షమీని దూషిస్తున్నారంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై విద్వేషం, వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారని వివరించారు. క్రికెట్ లో గెలుపోటములు సహజమని, జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక ముస్లిం ఆటగాడినే లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారని తెలిపారు. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఖండిస్తుందా? అని ఒవైసీ ప్రశ్నించారు.

ఓ వైసీపీ ఎంపీని జ‌గ‌న్ చెంప మీద కొట్టారా? కార‌ణం అదేనా..?

సీఎం జ‌గ‌న్ ఓ ఎంపీ చెంప ప‌గ‌ల‌గొట్టార‌ట‌. ఆ ఎంపీ చేసిన అవినీతిపై ఒళ్లు మండి చెంప చెళ్లుమ‌నిపించార‌ట‌. ఆ ఎంపీనే అనే కాదు.. ఏపీలో తాను కాకుండా ఎవ‌రెంత అవినీతి చేస్తున్నారు? ఏ మంత్రి ఎంత దోచేశాడు? ఏ ఎమ్మెల్యే ఎంతెంత‌ కూడ‌బెట్టాడు? అనే లెక్క‌.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా, ప్ర‌జాప్ర‌తినిధి వారీగా సీఎం జ‌గ‌న్‌రెడ్డి టేబుల్‌పై ప‌క్కా స‌మాచారం ఉంద‌ట‌. ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండే ఓ కీల‌క నేత చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి.  వైసీపీ నేత‌ల అవినీతిపై ఇప్ప‌టికే అంతా కోడై కూస్తుంటే.. ఈ క‌రెప్ష‌న్ గురించి సీఎం జ‌గ‌న్‌రెడ్డి ద‌గ్గ‌ర ఫుల్ డిటైల్స్ ఉన్నాయ‌నే విష‌యం అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత‌కీ ఈ వ్యాఖ్య‌లు చేసింది ఎవ‌రంటే.. సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయ‌న ఇలా సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయ‌న ఎక్క‌డా విజ‌య‌సాయిరెడ్డి పేరు ప్ర‌స్తావించ‌కున్నా.. జ‌గ‌న్ చెంప‌దెబ్బ కొట్టిన ఆ ఎంపీ విజ‌యసాయిరెడ్డినే అయింటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకుంటే, ఏపీలో జ‌గ‌న్ త‌ర్వాత అంత‌టి అవినీతి తిమింగ‌ళం విజ‌య‌సాయినే అంటున్నారు.  ఏపీని జగన్ రెడ్డి దివాళా తీయించారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. దీనికి ఎవరూ ఏం లెక్కలు చెప్పనవసరం లేదన్నారు. రేపు ఒకటో తేదీ ఉద్యోగుల అకౌంట్ లో జీతం పడితే తెలుస్తుందని అన్నారు. జీతం పడాలంటే ఎవరో ఒకరు అప్పు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు.  కాంట్రాక్టర్లకు రూ.80వేల కోట్లు పెండింగ్ బిల్లులున్నాయని.. వాళ్లకి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదని.. ఏపీలో ప్ర‌భుత్వ ప‌నులు చేసిన‌ కాంట్రాక్టర్లు ఉరేసుకొని చచ్చే పరిస్థితి వచ్చిందంటూ సీపీఐ రామ‌కృష్ణ‌ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని మండిప‌డ్డారు.  గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి.. వీరందరూ పరిపాలన అంటే.. ముఖ్యమంత్రి మంత్రులు ప్రతిపక్షాలు కౌన్సిల్ అనేవి ఉండేవని.. ఇప్పుడు ఏపీలో ఏక్ నిరంజన్ పాలన అని.. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ జ‌గ‌న్‌రెడ్డి ఎవర్నీ దగ్గరికి రానీయడం లేదని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు.  

విదేశాలకు టీడీపీ నేత పట్టాభి! అందుకేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమానంలో ప్రత్యక్షమయ్యారు. జైలు నుంచి విడుదల తరువాత ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా విమానంలో ప్రయాణం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మాల్దీవ్స్‌కు పట్టాభి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు నిర్ధారించలేదు.  సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. కానీ పట్టాభి రాజమండ్రి నుంచి విజయవాడకు చేరుకునే సమయంలో హైడ్రామా నెలకొంది. పట్టాభి కాన్వాయ్‌ను తప్ప ఇతర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు మరోసారి అరెస్ట్ చేస్తారనే అనుమానంతో పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పట్టాభి ఆచూకీ లేదు. తాజాగా పట్టాభి విమానంలో ఉన్నారని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. 

మ‌గ‌వాళ్ల‌లో స‌న్నాసులు లేరా? ప్లీనరీలో కేసీఆర్ హాట్ కామెంట్స్..

టీఆర్ఎస్ ప్లీన‌రీలో తీర్మానాల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. పురుషుల‌కు చుర‌క‌లంటించారు. మ‌హిళ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. మ‌హిళ‌ల సంక్షేమంపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడిన అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు.  మ‌హిళ‌లు ఎక్క‌డైతే ర‌క్షించ‌బ‌డుతారో, గౌర‌వించ‌బ‌డుతారో.. ఆ దేశం బాగుప‌డుతుంది, సమాజం బాగుంటుందని కేసీఆర్ అన్నారు. మ‌హిళ‌లు ఎక్క‌డైతే పూజింప‌బ‌డుతారో అక్క‌డ దేవ‌త‌లు సంచ‌రిస్త‌రు అని అంటారని చెప్పారు.  ఆ స‌మాజం బాగుంటుంద‌ని అని వేదాల్లో కూడా చెప్పారు. కానీ వాస్త‌వానికి మ‌న దేశంలో అట్ల లేదు. ఎందుకు లేదంటే.. ఎక్క‌డైనా వ్య‌వ‌స్థ‌లో రెండు రంగాలుంటాయి. ఒక‌టి ఉత్పాద‌క రంగం.. రెండోది అనుత్పాద‌క రంగం. గొప్ప దేశం, స‌మాజం.. మ‌హిళ‌లు, పురుషులు, కుల‌మతాలు అనే బేధం లేకుండా.. మంచి ప్ర‌తిభావంతులైన మ‌హిళ‌ల‌ను ఉత్పాద‌క రంగంలో, త‌క్కువ ప్ర‌తిభ ఉన్న‌వారిని అనుత్పాద‌క రంగంలో ఉంచుతారు అని కేసీఆర్ అన్నారు.  మ‌న దేశంలో ఎవ‌డో పుణ్యాత్ముడు మాత్రం.. మ‌హిళ‌లు అనంగ‌నే వంటింట్లోనే ఉండాలి అనేట‌ట్టు త‌యారు చేశారని కేసీఆర్ అన్నారు.  మేం బ‌లాదూర్‌గా తిర‌గాలి అనేట‌ట్టు పురుషులు త‌యారయ్యారు.. మ‌హిళ‌ల్లో గొప్ప ప్ర‌తిభాశాలులు ఉన్నారు. మ‌న మ‌గ‌వాళ్ల‌లో స‌న్నాసులు లేరా? ప్ర‌తిభావంతులైన మ‌హిళ‌ల‌ను స‌మాజంలో ముందు వ‌రుసలో ఉంచ‌క‌పోతే ఈ దేశం బాగుప‌డ‌దు. మ‌నం 50 శాతం రిజ‌ర్వేష‌న్లు పెట్టుకున్నాం. కానీ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌ వెంట వారి భ‌ర్త‌లు వ‌స్త‌రు. ఎప్ప‌టిదాకా అయితే మ‌హిళ‌లు ముందు వ‌రుస‌లో రారు.. వారి ప్ర‌తిభ‌కు ప‌దును పెట్ట‌క‌పోతే మ‌నం అనుకున్న ప్ర‌గ‌తి రాదు. మ‌న‌తో పాటు వారిని స‌మానంగా ముందుకు తీసుకెళ్లాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. 

జమ్మికుంట సీఐపై ఈసీ వేటు.. గులాబీ పార్టీలో గుబులు.. 

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. మూడు రోజుల్లో ప్రచార గడువు ముగియనుండటంతో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నెలకొన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక అధికార పార్టీ విపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ఆరోపణలు ఉండగానే.. జమ్మికుంట సీఐపై వేటు పడింది. జమ్మికుంట పట్టణ సీఐ రామ్ చందర్ రావ్‌పై ఈసీ  వేటు వేసింది. రామ్ చందర్ రావ్‌ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో కరీంనగర్ ట్రాఫిక్ సీఐ గుర్రం తిరుమల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో సీఐ పై బదిలీ వేటు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతల ఫిర్యాదుతోనే సీఐను బదిలీ చేశారనే చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేయగానే నియోజకవర్గంలో రాజకీయాలకు దిగింది అధికార పార్టీ, హుజురాబాద్ పరిధిలోని అధికారులను బదిలీ చేసింది. గతంలో పని చేసిన అధికారులు ఈటలకు మద్దతుగా ఉన్నారనే కారణంతో వారందరిని ఉన్న ఫళంగా మార్చేసింది ప్రభుత్వం. ఏసీబీ సహా సీఐలు, ఎస్ఐలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలను ట్రాన్స్ ఫర్ చేసింది. వాళ్ల స్థానంలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేసేవారిని నియమించారనే విమర్శలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా హుజురాబాద్ పరధిలో అధికారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిందని విపక్షాలు ఆరోపించాయి.  పోలింగ్ కు నాలుగు రోజుల ముందు  జమ్మికుంట సీఐపై ఎన్నికల సంఘం బదిలీ వేయడం సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

మధ్యాహ్నానికే ప్లీనరీ ఖాళీ.. కేసీఆర్ ప్రసంగాన్ని పట్టించుకోని కేడర్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వార్షికోత్సవం అంటే ఒకప్పుడు ఎంతో సందడి ఉండేది. రెండేళ్లకోసారి జరిపే పార్టీ ప్లీనరీని గులాబీ శ్రేణులు పండుగలా జరుపుకునేవి. రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీలో చర్చలు రసవత్తరంగా సాగేవి. ఇక గులాబీ బాస్ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలంటే కేడర్ కు ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్దగా వినేవారు పార్టీ నేతలు, కార్యకర్తలు. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసే ప్రసంగాలు తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్ర ప్రజలు టీవీల్లో ఆసక్తిగా వీక్షించేవారు. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.  హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వెలవెలబోయింది. గతంలో ఉన్న వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ప్లీనరీకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్లో ఎలాంటి జోష్ కనిపించలేదు. ఏదో పార్టీ ప్లీనరీకి వచ్చామంటే వచ్చాం అన్నట్లుగా నేతలు కనిపించారు. గ్యాలరీల్లో ఎలాంటి హడావుడి కనిపించలేదు. నిజానికి 2109లో లోక్ సభ సభ ఎన్నికల కారణంగా టీఆర్ఎస్ ప్లీనరీ జరగలేదు. కరోనా కల్లోలంతో 2020లోనూ జరపలేదు. అంటే నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు ప్లీనరీ జరుగుతోంది. అది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 20 ఏండ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ద్వదశాబ్ది వేడుక. ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేడుక అయినా  గులాబీ కేడర్ లో పూర్తి నిర్లిప్తత కనిపించింది. గతంలో కేసీఆర్ వేదికపైకి వస్తున్నాడంటే సభా ప్రాంగణమంతా దద్దరిల్లేలా నినాదాలు చేసేవారు. కాని ఈసారి ప్లీనరీలో అలాంటిదేమి కనిపించలేదు. కేసీఆర్ వేదికపై తిరుగుతూ అభివాదం చేస్తున్నా రెస్పాన్స్ రాలేదు. ఇక కేసీఆర్ ప్రసంగం చప్పగానే సాగింది. అధ్యక్ష ఉపన్యాసం దాదాపు గంటసేపు చేసినా.. కేడర్ లో ఉత్సాహం కనిపించలేదు. విపక్షాలను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నా గులాబీ ప్రతినిధులు ఏమాత్రం స్పందించలేదు. అంతేకాదు కేసీఆర్ ప్రసంగిస్తుండగానే చాలా మంది నేతలు, ప్రజా ప్రతినిధులు భోజనం కోసం పరుగెత్తడం కనిపించింది.  ప్లీనరీలో కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే ప్రసంగించారు. అయినా కేసీఆర్ స్పీచ్ వినకుండా ప్రతినిధులు బయటికి వెళ్లడం టీఆర్ఎస్ ముఖ్యనేతలను కలవరానికి గురి చేసింది. ఇక లంచ్ చేయగానే చాలామంది ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. వందలాది వాహనాలు మధ్యాహ్నమే  వెళ్లిుపోయాయని పోలీసులు కూడా చెప్పారు. కేసీఆర్ ముగింపు ప్రసంగం సమయంలో సభలో సగం మంది కూడా లేరంటే ప్లీనరీ ఎంత చప్పగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. కేడర్ నుంచి స్పందన లేకపోవడం వల్లే కేసీఆర్ కూడా గతంలో కంటే చాలా సాదాసీదాగా మాట్లాడారనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ప్రసంగంలోనూ గతంలో వాడి వేడి లేదంటున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగం, ఇతర నేతల ప్రసంగాలు, కేడర్ స్పందనను బట్టి... అధికార పార్టీలో నిస్తేజం అలుముకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై పెరిగిపోతుందనే అభిప్రాయం ప్లీనరీ ద్వారా స్పష్టమైందని తెలుస్తోంది.