హర్షకుమార్ అరెస్ట్ కు వారెంట్ జారీ

  2004 ఎన్నికల్లో మలాపురం నుంచి ఎం.పి.గా పోటీ చేసిన హర్షకుమార్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా నగరంలో కొంతమంది ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు హర్షకుమార్ కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభ వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేయగా హర్షకుమార్ విచ్చేసి సభా వేదికపై ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమ జరుగుతుండగా కృష్ణస్వరూప్ అనే విద్యార్థికి హర్షకుమార్ మద్దతుదారులకు మధ్య గొడవ జరిగింది. హర్షకుమార్ సహా సభా వేదికపై వున్న పలువురు తనపై దాడిచేశారని కృష్ణస్వరూప్ కేసు దాఖలు చేశారు. మంగళవారం నాటి విచారణకు హర్షకుమార్ గైరుహాజరయ్యారు. దీంతో విశాఖపట్నం నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ న్యాయమూర్తి హర్షకుమార్ పై అరెస్టు వారెంట్ జారీచేసి కేసును ఏప్రిల్ 10కి వాయిదా వేశారు.

సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం

  డిఎంకే అధినేత కరుణానిధి సంచలనాత్మక నిర్ణయంతో కేంద్రలోని యుపిఏ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. శ్రీలంకలోని తమిళుల ఊచకోతను ఖండిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయటంతో పాటు శ్రీలంక యుద్ధనేరాలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్ పట్టుబట్టాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న డిఎంకే అధినేత కరుణానిధి మంగళవారం రాత్రి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. యూపీఏలోని అతిపెద్ద మిత్రపక్షమైన డిఎంకే తన మద్దతును ఉపసంహరించుకుంది. కేంద్రంలోని మంత్రిపదవులను సైతం త్యజిస్తామని కరుణానిధి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరిస్తూ టి.ఆర్. బాలు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల డిఎంకే బృందం తమ అధినేత కరుణానిధి రాసిన లేఖను రాష్ట్రపతికి స్వయంతా అందజేశారు. బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి మన్త్ర౪ఇపదవుల రాజీనామాలు సమర్పిస్తామని బాలు బృందం విలేఖరులకు తెలిపారు.యూపీఏ ప్రభుత్వానికి బయటనుండి కూడా మద్దతునిచ్చే ప్రసక్తే లేదని కరుణానిధి స్పష్టం చేశారు. ఈ నెల 21న జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమావేశానికి ముందుగా తమ డిమాండ్లను నెరవేరిస్తే తమ మద్దతుపై పునః పరిశీలిస్తామని కరుణానిధి పేర్కొన్నారు.

శ్రీలంకతో టీంతో కరుణానిధి, జయలలిత ఐపీయల్ మ్యాచ్

  శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళ ప్రజల మీద చేస్తున్న మారణ ఖాండకు వ్యతిరేఖంగా ఈనెల 21న జెనీవాలో జరుగనున్న మానవ హక్కుల సదస్సులో భారతదేశం తప్పనిసరిగా ఓటేస్తానని యుపీయే ప్రభుత్వం తనకు మాటివ్వనందుకు కరుణానిధి యుపీయే ప్రభుత్వంతో చెడుగుడు ఆడుకొంటుంటే, మరో వైపు అదే శ్రీలంక క్రికెట్ టీం కు చెందిన ఆరుగురు ప్లేయర్లు త్వరలో చెన్నైలో జరుగనున్న ఐపీయల్-6 మ్యాచులు ఆడేందుకు బయలుదేరుతున్నారు.   ఈ నేపద్యంలో అసలు వారిని మన తమిళ తంబిలు చెన్నైలో అడుగుపెట్టనిస్తారా అనే సందేహం కలగడం సహజమే. అయితే, కరుణానిధి ఎడ్డెం అంటే జయలలిత తెడ్డెం అంటుందనే సంగతి జగమెరిగిన రహస్యమే గనుక, తన ఆటగాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తెలివిగా జయలలితకు ఒక లేఖ వ్రాసింది.   శత్రువు శత్రువు మిత్రుడన్నట్లు కరుణానిధికి శత్రువులు అందరూ జయలలితకు మిత్రుల కిందే లెక్క. వారు శ్రీలంక వారయినా సరే! గనుక వారిని కాపాడే బాధ్యత జయలలిత సంతోషంగా స్వీకరిస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలుసు గనుకనే తమ ఆటగాళ్ళు నిర్భయంగా వచ్చి చెన్నైలో ఆడుతారని ప్రకటించింది.   ఇదివరకు విశ్వరూపం సినిమా విడుదల సందర్భంలో కమల్ హాసన్ తో వీరిరువురూ ఏవిధంగా ఆడుకోన్నారో అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఐపీయల్ మ్యాచులలో వీరిరువురూ శ్రీలంక ఆటగాళ్ళతో ఏవిధంగా ఆడుకొంటారో వేచిచూడక తప్పదు.

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు...

  ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల రెండింటి పరిస్థితి జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లుంది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడినందుకు సంతోషపడాలో లేక తమ ప్రభుత్వం మైనార్టీలో పడినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. తనకు వ్యతిరేఖంగా ఓటువేసిన 9 మంది జగన్ అనుచరులపై వేటు తప్పదని బింకాలు పలికిన కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ కూడా మళ్ళీ తమ మాటలను మింగక తప్పేట్లు లేదు. అంతేకాక మళ్ళీ వారి దయా దాక్షిణ్యాలపైనే తమ ప్రభుత్వం మనుగడ సాగించవలసి రావడం అవమానకరం అయినా తప్పట్లేదు.   అక్కడ కేంద్రంలో తమిళ తంబి కరుణానిధి అకస్మాత్తుగా యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి ప్రత్యామ్నాయ పార్టీల వైపు పరుగులు పెట్టిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానంలో ఓటేసిన 9 మంది జగన్ అనుచరులను పార్టీలోంచి పీకేయాల వద్దా? లేక వారిపై అనర్హత వేటువేయకుండా మరో ఆరు నెలలు తాత్సారం చేస్తూ వారి సాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకు రావాలా? వంటి అనేక ధర్మసందేహాల చిట్టాతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డిల్లీ బయలుదేరెందుకు తయారవుతుంటే, అక్కడ డిల్లీలో యుపీయే ప్రభుత్వం కరుణానిధి తుమ్మితే ఊడిపోయే ముక్కులా పరిస్థితులు ఇంతకంటే అద్వానంగా తయారయ్యాయి.   ఇంతవరకు యస్పీ, బీయస్పీలను పులుసులో కరివేపాకులా వాడుకొంటున్న యుపీయే ప్రభుత్వం, ఇప్పుడు తన మనుగడకోసం వాటిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో పడింది. ఇంతవరకు బయట నుండి మద్దతు ఇస్తున్న ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐను అస్త్రంగా చేసుకొని తమను బెదిరించి మద్దతు పొందుతోందని బహిరంగంగానే చెపుతున్నాయి. తమిళ తంబి సగం కాచి వదిలేసిన ‘యుపీయే సాంబారులో’కి ఆ కరివేపాకు రెమ్మలు రెంటినీ కాంగ్రెస్ వేసుకోవాలంటే మళ్ళీ సీబీఐకి పని చెప్పక తప్పదేమో.   ఒకవైపు కేంద్రం మరో వైపు రాష్ట్రం రెండూ కూడా మైనార్టీలోపడటం కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా ఇబ్బందే. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ప్రభుత్వానికి డోకాలేదు అంటూ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శించక తప్పట్లేదు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం చాల కష్టమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తనంతట తానూ పూర్తి మెజారిటీ సాదించలేదు కనుక ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాలపై ఆధార పడక తప్పట్లేదు.   ఇటీవలే పార్టీ సారద్య బాద్యతలు చేప్పటిన యువనాయకుడు రాహుల్ గాంధీ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన గూటి నుండి బయటకి వచ్చిపార్టీని గట్టెకించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం యుపీయే ప్రభుత్వానికి కొత్త కాకపోయినప్పటికీ, ఆయనకు ఇంకా తగిన అనుభవం లేదు గనుక దూరంగా ఉంటున్నారో లేక వేరే కారణాలు ఏమయినా ఉన్నాయో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని తన సారద్యంలో ఎక్కడికో తీసుకు పోవాలనుకొనే ఆయన తన సామర్ద్యం నిరూపించుకోవాలంటే ఇదే తగిన సమయం.

పాదయాత్ర కష్టాలు..బాబు కన్నీళ్లు

    నేడు పాదయాత్ర ప్రారంభానికి ముందు చంద్రబాబు పోలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీకి చెందిన సీనియర్ నేత గరికపాటి రామ్మోహన రావు కార్యకర్తలకు బాబు పాదయాత్ర కష్టాలు ఏకరువు పెట్టారు. ఎంత కష్టంగా ఉన్నప్పటికి బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆయన కష్టాలను తాము కళ్లారా చూస్తున్నామని, ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు తల్లి బతికి ఉండి ఉంటే ఆయన పాదయాత్రను చూసి కన్నీళ్లు పెట్టేదని అన్నారు. అరవై నాలుగేళ్ల వయస్సులో చంద్రబాబు సాహసం చేస్తున్నారని, ఆయన ఎవరి కోసం ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నారో ప్రజలు, కార్యకర్తలు గుర్తించాలని గరికపాటి రామ్మోహన రావు అన్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు కూర్చోవడానికి, నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. అయినా, ఆయన ప్రజల కోసం ఇదంతా చేస్తున్నారన్నారు. గరికపాటి మాటలు కార్యకర్తలను, నేతలను ఉద్వేగానికి గురి చేశాయి. వేదిక పైనున్న చంద్రబాబు కూడా గరికపాటి మాటలకు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు కళ్లలో నీళ్లు తిరగడం చూసిన కార్యకర్తలు మరింత ఉద్వేగానికి గురయ్యారు.   

యూపీఏ కు ప్రమాదం లేదు

        యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలగడం వల్ల యుపిఏ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. యుపిఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, అధికారంలో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరుణానిధి డిమాండ్లను పరిశీలిస్తున్నామని, మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నామని చిదంబరం పేర్కొన్నారు.   యూపీఏ ప్రభుత్వానికి తాము మద్ధతు ఉపసంహరించుకుంటున్నామని యూపీఏ భాగస్వామ్య పక్షం డీఎంకే ప్రకటించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోయే ప్రమాదమేమీ లేదన్నారు. యూపీఏకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని ఆయన తెలిపారు. శ్రీలంక తమిళల అంశంపై పార్లమెంట్లో తీర్మానానికి సంబంధించి డీఎంకేతో చర్చిస్తున్నామని చిదంబరం పేర్కొన్నారు. కరుణానిధి తన నిర్ణయంపై పునరాలోచించే సూచనలు ఉన్నాయని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.

బాబు పాదయాత్ర ముగింపుకు ముహూర్తం

        టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు ముగింపు ముహూర్తం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గాంధీ జయంతి నాడు మొదలు పెట్టిన పాదయాత్ర ను తన జన్మదినం రోజున ముగించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.   అయితే ఆయన మే 1 వరకు పాదయాత్ర చేసి టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు ఊరు నిమ్మాడ దాకా వెళతారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పాదయాత్ర ముగించి హైదరాబాద్ వచ్చి సమీక్షలు చేస్తారని, ఆ తరువాత మిగిలిపోయిన ఆరుజిల్లాలలో పాదయాత్ర చేయాలా ? లేక బస్సు యాత్ర చేయాలా ? అనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది.  

కోర్ట్ లో లో౦గిపోయిన నిర్మాత బండ్ల గణేష్

    ఎన్టీఆర్ 'బాద్ షా' ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. 'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో రాయదుర్గ పోలీసులు గణేష్ పై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందున వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బండ్ల గణేష్తో పాటు బాద్షా ఆడియో ఫంక్షన్ నిర్వాహకుడు కూడా కోర్టులో లొంగిపోయాడు. తొక్కిసలాటలో మరణించిన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ ఐదు లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ ఐదు లక్షలు చొప్పున రాజు తల్లి ఈశ్వరమ్మ కి మొత్తం పది లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.  

యూపిఏ కు డీఎంకే షాక్

        యూపిఏ ప్రభుత్వానికి డీఎంకే షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలుగుతున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ఈరోజు వెల్లడించారు. శ్రీలంకలోని తమిళ హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి డీఎంకే కు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జెనీవాలో జరిగే ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ భేటీలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కరుణానిధి మరోసారి డిమాండ్ చేశారు. 18 ఎంపీల బలం వున్న డీఎంకే యూపిఏ లో రెండో అతిపెద్ద భాగస్వామి. డీఎంకే నిర్ణయంతో యూపిఏ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

రాములమ్మ తెలంగాణా రాజకీయాలు

  ఇటీవల జూ.యన్టీఆర్ నటించిన ‘బాద్షా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా వరంగల్ కు చెందిన రాజు అనే జూ.యన్టీఆర్ అభిమాని మరణించినపుడు, యన్టీఆర్ తో సహా ఆకార్యక్రమానికి వచ్చిన అందరూ చాలా బాధ పడ్డారు. తోబ్బుట్టువులు లేని తనకు తన అభిమానులే తోబ్బుట్టువులని, రాజు మరణం తనకు చాల బాధ కలిగించిందని అన్నారు. రాజును కోల్పోయిన ఆ కుటుంబానికి తానే అతని స్థానంలో నిలిచి అండగా ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో పొరపాటు వలన జరిగిన ఈ ప్రమాదానికి తనను క్షమించమని కోరారు.   ఆ తరువాత మాట్లాడిన నిర్మాత బండ్ల గణేష్ కూడా జరిగిన సంఘటనకు చాల బాధ వ్యక్తం చేస్తూ, చనిపోయిన వ్యక్తిని తానూ తిరిగి తీసుకు రాలేక పోయినప్పటికీ, రూ.5 లక్షలు రాజు కుటుంబానికి సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.   తదనంతరం వారు రెండు నిమిషాలు మౌనం పాటించి చనిపోయిన అభిమానికి శ్రద్దాంజలి ఘటించి ఉంటే బహుశః రాములమ్మ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉండేది కాదేమో. కానీ, వారు పొరపాటునో లేక జరిగిన సంఘటనకు షాకుకు గురయి ఉనందునో ఆ కార్యక్రమం చేయలేదు. అందరూ విషాదవదనాలతోనే క్లుప్తంగా ఆడియో విడుదల కార్యక్రమాన్నిముగించేసి వెళ్ళిపోయారు.   సాటి మనిషి మరణిస్తే బాధపడని వారెవరూ ఉండరు. అటువంటప్పుడు, ఏ సినిమా హీరోకయినా తన అభిమాని ఈ విధంగా మరణించడం చాలా బాధ కలిగించేదే. అయితే, అందుకు బాధ వ్యక్తం చేయడం, వీలయితే ఆ కుటుంబానికి సహాయ పడటం మాత్రమే ఎవరయినా చేయగలరు. జూ.యన్టీఆర్, నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ కూడా అదే చేసారు. ఆ కార్యక్రమానికి వచ్చిన మిగిలిన వారు కూడా అదే విధంగా బాధ పడ్డారు.   అయినప్పటికీ, ప్రతీ అంశంలో కేవలం ‘తెలంగాణా’ కోసమే భూతద్దం వేసుకొని వెతికే అలవాటున్న తెరాస పార్టీకి చెందిన విజయశాంతి కూడా అదే పని చేసింది. తమ తెలంగాణా వ్యక్తి చనిపోయినా కనీసం సానుభూతి కూడా చూపని కారణంగా ‘బాద్షా’ సినిమాను తెలంగాణా లో అందరూ బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.   ఆమె పిలుపుకు తెలంగాణాలో విలువుందా లేదా అనేది వేరే సంగతి. కానీ, ఒక విషాదకరమయిన సంఘటనను కూడా తెలంగాణా పేరుతొ ఆమె రాజకీయం చేయాలనుకోవడం చాలా హీనాతిహీనమయిన పని. ఏ సినీపరిశ్రమ వలన ఆమెకు ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో ఒక గుర్తింపు కలిగేయో ఆ పరిశ్రమకు చేతనయితే తగిన సలహాలు, సహాయాలు అందించి కృతజ్ఞత చూపకపోగా సినిమాను బహిష్కరించమని పిలుపు ఈయడం విచారకరం.   సినీ పరిశ్రమలో ఉండే కష్ట నష్టాలన్నీ ఆమెకు స్వయంగా తెలిసినపటికీ, రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత ఆమె సినీ పరిశ్రమకు చేసిన సహాయం ఏమిలేకపోగా, తెలంగాణా ఉద్యమకారులు, ముఖ్యంగా ఆమె పార్టీకే చెందిన తెరాస కార్యకర్తలు సినిమా షూటింగులకు అడ్డుపడి రసబాస చేస్తుంటే ఆమె ఏనాడు కలుగజేసుకొని సినీ పరిశ్రమకు అండగా నిలిచిన సందర్భం లేనేలేదు. అందుకు ఆమెను ఎవరూ, ఏనాడు కూడా నిందించలేదు. ఆమె సినీ పరిశ్రమకు సాయం చేయకబోతే పోయె కనీసం నష్టం కల్గించకుండా ఉంటే అదే ఆమె చేసే గొప్ప సహాయం అవుతుంది.   ఇప్పుడు ఆమె స్వయంగా సినిమాను బహిష్కరించమని పిలుపును కూడా ఇవ్వడం చాలా అహేతుకం. ఒకవేళ ఆ చనిపోయినది ఏ ఆంధ్ర వ్యక్తో అయితే బహుశః ఆమె పట్టించుకోనేది కూడా కాదేమో. కానీ, అప్పుడు కూడా సదరు నిర్మాత, నటులు అందరూ కూడా ఇదే విధంగా బాధపడి ఆర్ధిక సహాయం చేసేవారని తప్పక చెప్పవచ్చును.   మరణించిన వ్యక్తీ ఎవరయినప్పటికీ,మానవత్వం ఉన్న అందరినీ అది బాధ కలిగిస్తుంది. వ్యక్తుల మరణంతో రాజకీయాలు చేయడం చాలా హేయమయిన పని అని ఆమె తెలుసుకొంటే మంచిది.

విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం

  పరస్పర అంగీకార శృంగారానికి అవసరమైన వయసు 16కు తగ్గించాలని గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయించిన విషయం విదితమే. అయితే నెర న్యాయ (సవరణ) బిల్లు-2013కి సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన అఖిలపక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ, ఎస్పీతో పాటు వివిధ పార్టీలు పరస్పర అంగీకార శృంగార వయస్సును 18 నుండి 16కు తగ్గించాలనే నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీంతో ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం పరస్పర అంగీకార శృంగార వయస్సును 18గా కొనసాగేందుకు నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తాజాగా కొత్త బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వెంటపడి వేధించడం, ఇతరుల శృంగార కార్యకలాపాల్లోకి తొంగిచూడటం వంటి సెక్షన్లను ప్రభుత్వం నీరుగార్చింది. తాజా బిల్లు ప్రకారం తొలిసారి ఈ రెండు నేరాలకు పాల్పడినవారికి బెయిల్ తీసుకోవటానికి అవకాశముంటుంది.  తరచుగా ఈ నేరాలకు పాల్పడితే మాత్రం బెయిల్ లభించదు. గరిష్టంగా ఐదేళ్ళ వరకు జెలు శిక్ష పడుతుంది.బహిరంగ ప్రదేశాల్లో స్త్రీని వివస్త్రను చేయటాన్ని శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ వచ్చారు.   కాని బహిరంగ ప్రదేశం ప్రస్తావన దుర్వినియోగానికి గురవుతోందనే అభిప్రాయంతో తాజా బిల్లు ప్రకారం ఇంట్లోగానీ, రహస్య ప్రాంతంలో గానీ బలవంతంగా స్త్రీని వివస్త్రను చేస్తే శిక్షార్హ నేరంగా పరిగణించి ఈ నేరానికి పాల్పడిన వారికి ఏడేళ్ళ వరకు జైలుశిక్ష విధించవచ్చు.

ఎస్.పి. త్యాగిపై ఆంక్షలు ... సిబీఐ

  వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్.పి.త్యాగి ఇటలీ సంస్థ అగస్తా వెస్ట్ ల్యాండ్ నుండి వివిఐపి హెలికాప్టర్ల కొనగోలు చేసేందుకు కుదుర్చుకున్న 3,600 కోట్ల రూపాయల ఒప్పందంలో ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆయనతో సహా సహనిందుతులు భారతదేశం విడిచి వెళ్ళరాదని, ఒకవేళ వెళ్ళవలసివస్తే సిబీఐకి ముందుగా తెలియజేయాలని సిబీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు వెళ్ళవచ్చా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. హెలికాప్టర్ల కొనగోళ్ళ కుంభకోణంలోని వారు దేశం విడిచి వెళ్ళకుండా లుక్ ఔట్ సిబీఐ జారీ చేసిందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆ వార్తలన్నీ ఊహాగానాలే తప్ప ఇప్పటివరకూ అటువంటి నోటీసులు ఏవీ జారీ చేయలేదని మీడియాకు తెలిపారు.

విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమిస్తున్న వామపక్షాలు

  విద్యుత్ సర్ ఛార్జీ నెపంతో ప్రజల నుండి రూ.33 వేల కోట్లకు వసూలుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వానికి వామపక్షాలు గట్టి షాక్ ఇవ్వబోతున్నాయి. వామపక్ష సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష నేతలు బి.వి.రాఘవులు, గాదె దివాకర్ (న్యూ డెమోక్రసీ), వై.వెంకటేశ్వరరావు (సిపియం), కె. రామకృష్ణ (సిపీఐ), బండ సురేందర్ రెడ్డి, దయానంద్ (ఫార్వర్డ్ బ్లాక్), జానకిరాములు (ఆర్.ఎస్పీ), ఎండి గౌస్ (ఎంసిపిఐ-యు), మురహరి (ఎస్.యూ.సి.ఐ.) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపు, సర్ చార్జీ భారం, కరెంటు కోతలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టాలని, కేంగ్రేసేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిజెపి సహా అన్ని విపక్షాల నేతలకు లేఖ రాయడంతో పాటు వారిని స్వయంగా కలవాలని తీర్మానించింది. విద్యుత్ చార్జీలపై విడివిడి పోరాటాలతో ప్రభుత్వాన్ని కదిలించలేరని, అందరూ కలిసి ఒకేరోజు ఉద్యమిస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందని వామపక్ష నేతలు తీర్మానించారు.

ములాయంకు టెర్రరిస్ట్ లతో సంబంధాలు ... బేణీ ప్రసాద్

  కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీప్రసాద్ వర్మ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ములాయం సింగ్ యాదవ్ కు టెర్రరిస్ట్ లతో సంబంధాలు ఉన్నాయని, తీవ్రవాదానికి మతం, రంగు లేదు, గోద్రా ఘటన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత అన్నీ తీవ్రవాద ఘటనలేనని, బాబ్రీ మసీదును కూల్చివేసిన కళ్యాన్ సింగ్ లాంటి వారితో ములాయం సింగ్ చేతులు కలిపారని, గుజరాత్ లో బిజెపి విజయం సాధించేందుకు ములాయం సింగ్ పార్టీ (సమాజ్ వాదీ పార్టీ) పరోక్షంగా తోడ్పందని'' సోమవారం పార్లమెంట్ లో అన్నారు. ఈ వ్యాఖ్యలతో సమాజ్ వాదీ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతూ బేణీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. కేంద్ర మంత్రివర్గంనుండి బేణీ ప్రసాద్ వర్మను వెంటనే తొలగించాలని పట్టుబట్టారు. బేణీ ప్రసాద్ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు.

బ్రిటన్ హెచ్చరిక-భారత్ కు మరో చెంప దెబ్బ

  బ్రిటన్ హెచ్చరిక-భారత్ కు మరో చెంప దెబ్బ ఇంతవరకు వివిధ దేశాల ప్రభుత్వాలు భారత్ లో పర్యటిస్తున్న తమ పౌరులను ఉగ్రవాదుల దాడులను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించ వద్దని హెచ్చరించడం విన్నాము. కానీ, ‘ఉగ్రవాదుల దాడిని అరికట్టడం మన చేతుల్లో లేదు’ అని మనకు మనం సర్ది చెప్పుకొని విదేశీ ప్రభుత్వాలు చేసిన హెచ్చరికలను మనకి అవమానకరంగా భావించక తేలికగా తుడిచేసుకోగలిగాము. కానీ, ఇప్పుడు బ్రిటన్ దేశ ప్రభుత్వం భారత్ లో పర్యటించే తన మహిళా పర్యాటకులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం మనకి చెంపపెట్టు వంటిదేనని చెప్పవచ్చును.   మొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్విట్జర్లాండ్ మహిళా పర్యాటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచారంతో ఉలిక్కి పడిన బ్రిటన్ ప్రభుత్వం, భారత్ లో పర్యటించే తన మహిళా పర్యాటకులను బీచుల వద్ద, మారుమూల ప్రాంతాలలో ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేసింది. తగిన రక్షణ లేకుండా ఒంటరిగా తిరుగవద్దని, తమ భద్రతా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఇది, బ్రిటన్ దేశం తన పర్యాటకులకు చేస్తున్న ఒక హెచ్చరికగా పైకి కనిపిస్తున్నపటికీ, మన దేశంలో మహిళలపై నానాటికి పెరిగిపోతున్న అత్యాచారాలను అంతర్జాతీయ సమాజం కూడా నిశితంగా గమనిస్తోందని సూచిస్తోంది. ఈ హెచ్చరిక మన దేశానికి చెంప దెబ్బ వంటిదని గుర్తించవలసి ఉంది.   డిల్లీ సంఘట జరిగిన తరువాత దానిని నుండి మనం కొత్తగా నేర్చుకొన్న గుణపాఠం ఏమి లేకపోగా శృంగారానికి 16 ఏళ్ల వయసు ఆమోదకరమా లేక 18 ఏళ్ల వయసే అమోదకరమా? అంటూ మన కేంద్ర ప్రభుత్వం చర్చలలో మునిగిపోయుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లిప్త వైఖరి అవలంబిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు, ప్రణాళికలు తీసుకోవలసిన ప్రభుత్వాలు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తాము చాల బాద్యతాయుతంగానే ఉన్నామని చెప్పుకోవడానికి ప్రజల ముందు ఏదో హడావుడి చేయడం, గంభీరమయిన ప్రకటనలు చేయడం తప్ప ఇటువంటి వాటిని శాశ్వితంగా నిరోధించడానికి చేపట్టవలసిన ప్రణాళికలు కానీ ఆలోచనలు కానీ చేయడం లేదు.   ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి మద్య ఉన్న సన్నటి గీత ఎప్పుడో చెరిగిపోయి నందున, ఇప్పుడు ప్రభుత్వాలు అంటే వాటిని నడిపిస్తున్న సదరు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మానవీయ కోణంలో చూడకపోగా, తమ ప్రత్యర్ది పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని తమను ఏవిధంగా ఇరుకున పెడతాయి, దానిని తాము సమర్ధంగా ఏవిధంగా ఎదుర్కోవాలి అనే ఆలోచిస్తు, ఇటువంటి సామాజిక రుగ్మతలను కూడా రాజకీయం చేస్తూ అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి.   రాష్ట్ర ప్రభుత్వాలే ఈవిధంగా ఉన్నపుడు వాటి కనుసన్నలలో నడిచే సదరు పోలీసు శాఖలు అంతకంటే గొప్పగా ఎలా ఆలోచించగలవు? నానాటికి పెరిగిపోతున్న అత్యాచారాలను కేవలం ‘కేసులుగా’నే పరిగణిస్తున్నారు పోలీసులు.   యధా రాజ తధా ప్రజా అన్నట్లు డిల్లీ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన ప్రజలు నేడు ఇటువంటి సంఘటనలు దేశంలో ఎన్ని జరుగుతున్నపటికీ స్పందించడం లేదు.   డిల్లీ సంఘటన తరువాత మన దేశంలో మాహిళలపై పెరుగుతున్న సామూహిక అత్యాచారాలను మన ప్రభుత్వాలు పట్టించుకోనందునే నేడు విదేశీ ప్రభుత్వాలు కూడా నేడు మనకి సుద్దులు చెప్పగలుగుతున్నాయి. ఇప్పటికయినా, మన ప్రజల, ప్రభుత్వాల, వ్యవస్థల ఆలోచనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

పురందేశ్వరికి పొగ పెడుతున్న టి.సుబ్బిరామిరెడ్డి

  ఇంకా సాధారణ ఎన్నికలకి ఒక సం. సమయం ఉండగానే, విశాఖలో రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డికి, విశాఖ లోక్ సభ సభ్యురాలు మరియు కేంద్ర మంత్రి పురందేశ్వరికి మద్య విశాఖ లోక్ సభ స్థానం గురించి యుద్ధం మొదలయింది. తనకు గతంలోనే కేంద్రం మాట ఇచ్చింది గనుక వచ్చే ఎన్నికలలో విశాఖ నుండి తానేపోటీ చేయబోతున్నాని ప్రకటించుకోవడంతో బాటు, ఆమెను పక్కనున్న నర్సాపురం నుండో మరో నియోజక వర్గం నుండో పోటీ చేయమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. పురందేశ్వరి కూడా తానూ విశాఖ నుండే పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించడంతో ఇద్దరి మద్య యుద్ధం అనివార్యం అయింది.   ఈ నేపద్యంలో ఆయన అనుచరుడయిన భీమిలి శాసన సభ్యుడు మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖకు వచ్చినప్పుడు పురందేశ్వరి వల్ల జిల్లాలో పార్టీకి చాల నష్టం జరుగుతోందని పిర్యాదు కూడా చేసారు. సుబ్బిరామి రెడ్డి వెనుకుండి ఈ కధ అంతా నడిపించారని మీడియాలో ఊహాగానాలున్నాయి.   ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయన సోదరుడు బొత్స లక్ష్మణరావు వచ్చే ఎన్నికలలో భీమిలి నుండి శాసన సభకు పోటీ చేయాలనీ కోరుకొంటున్నందున త్వరలో ఆయన భీమిలి సమీపంలో గల ఆనందపురం అనే ప్రాంతానికి తరలి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.   భీమిలికి ప్రస్తుతం ప్రాతినిద్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ ను అక్కడి నుండి తప్పించే ప్రయత్నంలో బొత్సకు బావగారయిన శంకర్ రావు తన మద్దతు దారులుతో కలిసి మొన్న ఆనందపురంలో ఒక సభ ఏర్పాటు చేసి భీమిలి శాసన సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేస్తున్న బ్లాక్ మెయిలింగు రాజకీయాల వలన పార్టీకి స్థానికంగా చాలా నష్టం కలుగుతోందని, ఆయనను వెంటనే తప్పించడం చాల అవసరం అని అన్నారు. అంతే కాకుండా భీమిలి మాజీ శాసన సభ్యుడు కర్రి సీతారంను వేదిక మీదకు తీసుకువచ్చి, వచ్చే ఎన్నికలలో ఆయనకు పురందేశ్వరి మద్దతు తెలుపాలని కూడా అయన కోరారు. ప్రస్తుతం కర్రి సీతారాంను తమ డమ్మీ అభ్యర్ధిగా అడ్డం పెట్టుకొని అవంతి శ్రీనివాస్ తో బొత్స సోదరులు యుద్ధం మొదలు పెట్టినప్పటికీ, పార్టీ టికెట్లు ఇచ్చే సమయానికి ఆయనను పక్కకు తప్పించి బొత్స సత్యనారాయణ తన సోదరుడికే టికెట్ ఇప్పించుకొంటారనేది అందరూ ఊహిస్తున్నదే.     అందువల్ల, ఆయన వర్గం ప్రస్తుతం సుబ్బిరామి రెడ్డి వర్గానికి చెందిన అవంతి శ్రీనివాస్ ను డ్డీ కొనే ప్రయత్నంలో పురందేశ్వరికి చేరువకావడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగానే, ఆమెను ఇటీవల భీమిలి పరిధిలోకి వచ్చే ఆనందపురం సభకు ఆహ్వానించినపటికీ, అవంతి శ్రీనివాస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.   అయితే, ఆమె విశాఖ నుండి మళ్ళీ పార్లమెంటుకు పోటీ చేయాలనుకొంటే పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అండదండలు కోరుకోవడంలో అసహజమేమి లేదు. అందుకు ప్రతిగా, ఆయన సోదరుడికి ఆమె తన మద్దతు తెలుపడం కూడా తప్పక పోవచ్చును. అప్పుడు కేంద్రంలో మంచి పలుకుబడి కల సుబ్బిరామి రెడ్డి కూడా తనకు, తన అనుచరుడయిన అవంతి శ్రీనివాస్ కు అనుకూలంగా పావులు కదపవచ్చును.

ఉన్నవాటికి విద్యుత్ ఇవ్వలేరు కానీ...

            తాను దూరకంత లేదు తన మెడకో డోలన్నట్లు, విద్యుత్ సంక్షోభం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోఅనేక పరిశ్రమలు మూతబడుతుంటే, మళ్ళీ నిన్న కొత్తగా రెండు పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబోతున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాల సంతోషం వ్యక్తం చేసారు. ఆయన స్వస్థలమయిన చిత్తూరు జిల్లాలో ఒకటి, భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి స్వంత జిల్లా మెదక్ లో జహీరాబాద్ వద్ద మరొక పరిశ్రమ స్థాపనకు రంగం సిద్ధం అయింది. రెండు పరిశ్రమలు కూడా వాహన తయారీ రంగానికి చెందినవే కావడం మరో విశేషం.   చిత్తూరు జిల్లాలో పీలేరువద్ద ‘ఇసుజి’ తన వాహన తయారీ సంస్థను స్థాపించడానికి ముందుకు రాగా, దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా’ తన ట్రాక్టర్ల తయారీ సంస్థను జహీరాబాదు వద్ద స్థాపించేందుకు సిద్ధం అవుతోంది. గత రెండు సం.లలో కొత్తగా వస్తున్న పెద్ద పరిశ్రమలు ఈ రెండు మాత్రమే. అయితే, ఉన్నవాటికి విద్యుత్ సరఫరా చేయలేక చేతులెత్తేసిన మన రాష్ట్ర ప్రభుత్వం, పూర్తిగా విద్యుత్ మీదనే ఆధారపడి పనిచేసే ఈ రెండు భారీ పరిశ్రమలకు ఏవిధంగా విద్యుత్ సరఫరా చేస్తారో వివరించలేదు.   వాహన తయారీ సంస్థలు తమ వాహన విడిభాగాల ఉత్పత్తికి ప్రధానంగా వాటికి అనుబంధంగా ఏర్పడే చిన్న పరిశ్రమలు, వర్క్ షాపులపైన ఆధారపడి ఉంటాయి. అవికూడా పూర్తిగా విద్యుత్ మీద ఆధారపడి పనిచేసేవేనని ప్రత్యేకంగా చెప్పకరలేదు. గత నాలుగు సంలలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్న పెద్దా పరిశ్రమలు పవర్ హాలీడేస్ మరియు సరయిన విద్యుత్ సరఫరా లేని కారణంగా దివాలా స్థితికి చేరుకొంటున్నాయి. ఇక చిన్నచిన్న వర్క్ షాపులు అనుబంధ పరిశ్రమల సంగతి అంతకంటే దారుణంగా ఉంది. విద్యుత్ కోతలతో తీవ్ర నష్టలపలవుతున్న చిన్న పరిశ్రమలు, విద్యుత సరఫరా సరిగ్గా ఉన్నా లేకపోయినా కూడా భారీగా వస్తున్నా విద్యుత్ బిల్లులతో కుదేలవుతున్నారు.   పెద్ద పరిశ్రమలపై ఆధారపడిపనిచేసే ఆ చిన్న సంస్థలు, విద్యుత్ సమస్య వల్ల ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకంజ వేస్తుంటే, మరో వైపు సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయని కారణంగా వాటిని పెద్ద పరిశ్రమలు బ్లాక్ లిస్టులో పెట్టక తప్పట్లేదు. ఇక, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకోనేవారు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిపోతుంటే, ఉన్న పరిశ్రమలు మెల్ల మెల్లగా తమ ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గించుకొంటూ అంతిమంగా మూసేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇక, ఇటువంటి సమయంలో మరి ఈ రెండు భారీ పరిశ్రమలు ఏ భరోసాతో మన రాష్ట్రంలో అడుగుపెట్టాయో వాటికి విద్యుత్ ఏవిధంగా అందిస్తారో ఎవరికీ తెలియదు.