రాములమ్మ తెలంగాణా రాజకీయాలు
ఇటీవల జూ.యన్టీఆర్ నటించిన ‘బాద్షా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా వరంగల్ కు చెందిన రాజు అనే జూ.యన్టీఆర్ అభిమాని మరణించినపుడు, యన్టీఆర్ తో సహా ఆకార్యక్రమానికి వచ్చిన అందరూ చాలా బాధ పడ్డారు. తోబ్బుట్టువులు లేని తనకు తన అభిమానులే తోబ్బుట్టువులని, రాజు మరణం తనకు చాల బాధ కలిగించిందని అన్నారు. రాజును కోల్పోయిన ఆ కుటుంబానికి తానే అతని స్థానంలో నిలిచి అండగా ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో పొరపాటు వలన జరిగిన ఈ ప్రమాదానికి తనను క్షమించమని కోరారు.
ఆ తరువాత మాట్లాడిన నిర్మాత బండ్ల గణేష్ కూడా జరిగిన సంఘటనకు చాల బాధ వ్యక్తం చేస్తూ, చనిపోయిన వ్యక్తిని తానూ తిరిగి తీసుకు రాలేక పోయినప్పటికీ, రూ.5 లక్షలు రాజు కుటుంబానికి సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.
తదనంతరం వారు రెండు నిమిషాలు మౌనం పాటించి చనిపోయిన అభిమానికి శ్రద్దాంజలి ఘటించి ఉంటే బహుశః రాములమ్మ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉండేది కాదేమో. కానీ, వారు పొరపాటునో లేక జరిగిన సంఘటనకు షాకుకు గురయి ఉనందునో ఆ కార్యక్రమం చేయలేదు. అందరూ విషాదవదనాలతోనే క్లుప్తంగా ఆడియో విడుదల కార్యక్రమాన్నిముగించేసి వెళ్ళిపోయారు.
సాటి మనిషి మరణిస్తే బాధపడని వారెవరూ ఉండరు. అటువంటప్పుడు, ఏ సినిమా హీరోకయినా తన అభిమాని ఈ విధంగా మరణించడం చాలా బాధ కలిగించేదే. అయితే, అందుకు బాధ వ్యక్తం చేయడం, వీలయితే ఆ కుటుంబానికి సహాయ పడటం మాత్రమే ఎవరయినా చేయగలరు. జూ.యన్టీఆర్, నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ కూడా అదే చేసారు. ఆ కార్యక్రమానికి వచ్చిన మిగిలిన వారు కూడా అదే విధంగా బాధ పడ్డారు.
అయినప్పటికీ, ప్రతీ అంశంలో కేవలం ‘తెలంగాణా’ కోసమే భూతద్దం వేసుకొని వెతికే అలవాటున్న తెరాస పార్టీకి చెందిన విజయశాంతి కూడా అదే పని చేసింది. తమ తెలంగాణా వ్యక్తి చనిపోయినా కనీసం సానుభూతి కూడా చూపని కారణంగా ‘బాద్షా’ సినిమాను తెలంగాణా లో అందరూ బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆమె పిలుపుకు తెలంగాణాలో విలువుందా లేదా అనేది వేరే సంగతి. కానీ, ఒక విషాదకరమయిన సంఘటనను కూడా తెలంగాణా పేరుతొ ఆమె రాజకీయం చేయాలనుకోవడం చాలా హీనాతిహీనమయిన పని. ఏ సినీపరిశ్రమ వలన ఆమెకు ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో ఒక గుర్తింపు కలిగేయో ఆ పరిశ్రమకు చేతనయితే తగిన సలహాలు, సహాయాలు అందించి కృతజ్ఞత చూపకపోగా సినిమాను బహిష్కరించమని పిలుపు ఈయడం విచారకరం.
సినీ పరిశ్రమలో ఉండే కష్ట నష్టాలన్నీ ఆమెకు స్వయంగా తెలిసినపటికీ, రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత ఆమె సినీ పరిశ్రమకు చేసిన సహాయం ఏమిలేకపోగా, తెలంగాణా ఉద్యమకారులు, ముఖ్యంగా ఆమె పార్టీకే చెందిన తెరాస కార్యకర్తలు సినిమా షూటింగులకు అడ్డుపడి రసబాస చేస్తుంటే ఆమె ఏనాడు కలుగజేసుకొని సినీ పరిశ్రమకు అండగా నిలిచిన సందర్భం లేనేలేదు. అందుకు ఆమెను ఎవరూ, ఏనాడు కూడా నిందించలేదు. ఆమె సినీ పరిశ్రమకు సాయం చేయకబోతే పోయె కనీసం నష్టం కల్గించకుండా ఉంటే అదే ఆమె చేసే గొప్ప సహాయం అవుతుంది.
ఇప్పుడు ఆమె స్వయంగా సినిమాను బహిష్కరించమని పిలుపును కూడా ఇవ్వడం చాలా అహేతుకం. ఒకవేళ ఆ చనిపోయినది ఏ ఆంధ్ర వ్యక్తో అయితే బహుశః ఆమె పట్టించుకోనేది కూడా కాదేమో. కానీ, అప్పుడు కూడా సదరు నిర్మాత, నటులు అందరూ కూడా ఇదే విధంగా బాధపడి ఆర్ధిక సహాయం చేసేవారని తప్పక చెప్పవచ్చును.
మరణించిన వ్యక్తీ ఎవరయినప్పటికీ,మానవత్వం ఉన్న అందరినీ అది బాధ కలిగిస్తుంది. వ్యక్తుల మరణంతో రాజకీయాలు చేయడం చాలా హేయమయిన పని అని ఆమె తెలుసుకొంటే మంచిది.