సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

  భారత్ మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ మంత్రిగా సోమవారం  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదలు తెలిపారు.  ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. గత నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.

మాయ‌మై పోయిండ‌మ్మా అందెశ్రీ అన్న‌వాడూ!

అందెశ్రీ  ఈ పేరు వింటే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది.. ప‌ల్లె పాట‌. జ‌నం మాట‌. జాన‌ప‌దులు పాడుకునే  ఆట పాట‌. ఎలాంటి  చ‌దువు చ‌ద‌వు లేకుండానే..  మాయ‌మై పోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు అంటూ ఆయ‌న రాసిన పాట ఏకంగా ఒక పాఠ్యపుస్త‌కంలో సిల‌బ‌స్ గా మారిన ఘ‌న‌త చ‌రిత సొంతం చేసుకుందంటే ప‌రిస్థితి  ఏమిటో ఊహించుకోవ‌చ్చు. ఇక జ‌య‌జ‌య‌హే  తెలంగాణ అనే రాష్ట్ర గీతం గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇదిప్పుడు ప్ర‌తి  బ‌డిలో పాడుకునే పాట‌గా ప్ర‌తి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి పాడుకోవ‌ల్సిన బాట‌గా మారింది.  వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గాం దగ్గ‌ర్లోని రేబ‌ర్తి అనే గ్రామంలో 1961 జూలై 18న  జ‌న్మించారు అందె శ్రీ. ఈయ‌న అస‌లు పేరు అందె ఎల్లయ్య‌. అనాథ‌గా  పెరిగిన ఎల్ల‌య్య తొలినాళ్ల‌లో ప‌శువుల‌ కాప‌రిగా  ప‌ని చేసేవారు. ఆయ‌న ప్ర‌కృతిలోని ఎన్నో అంతుచిక్క‌ని ర‌హ‌స్యాల‌కు ప్రేర‌ణ చెంది పాట‌లు రాసేవారు. అది కూడా  రాయ‌డం తెలీకుండానే ఆశువుగా చెప్పిన  క‌విత్వం పాట‌మ్మ‌గా మారి  అది ప‌ల్లె ప‌ల్లెనా  ప‌ర‌వ‌ళ్లు తొక్కి.. జ‌నం గుండెల‌ను తాకేది. అలా అలా ఇంటిపేరు అందె కి శ్రీ  క‌లుపుకుని అందెశ్రీగా ప్రాచుర్యం పొందారు ఎల్ల‌య్య‌. ఎక్క‌డ ప‌శువుల‌  కాప‌రి ఉద్యోగం? ఎక్క‌డ  ప్ర‌కృతికి ప‌ర‌వ‌శించి పాడిన పాట? ఆపై అది  పాఠ్య‌పుస్త‌కాల‌కు ఎక్క‌డం ఏమిటీ?  కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం నుంచి డాక్ట‌రేట్ అయితేనేమి ఇంకా ఎన్నో ప్ర‌సిద్ధ పుర‌స్కారాల వ‌ర‌కూ సాగిన ఈ పాటల‌ ప్ర‌యాణం తెలంగాణ సాహిత్యంలోనే ఒక ప్ర‌త్యేక అధ్యాయం.   జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ మాతృగీతం రాయ‌డంతో పాటు అందెశ్రీ.. రాసిన గీతాలేంటో చూస్తే.. పల్లెనీకు వందనములమ్మో,మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జన జాతరలో మన గీతం యెల్లిపోతున్నావా తల్లి, చూడ చక్కని వంటి ఎన్నో పాట‌లు రాశారు.  ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే గంగ‌, బ‌తుక‌మ్మ‌, ఆవారాగాడు అంటూ ప‌లు చిత్రాల‌కు గేయ ర‌చ‌న చేశారు అందెశ్రీ. గంగ చిత్రానికి గానూ నంది అవార్డు అందుకోగా, బ‌తుక‌మ్మ చిత్రానికి సంభాష‌ణ‌లు కూడా అందించారు అందెశ్రీ.  2014లో తెలంగాణ ప్ర‌భుత్వం అందెశ్రీ పేరు ప‌ద్మ‌శ్రీకి ప్ర‌తిపాదించింది. అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదులు దక్కాయి. 2015లో వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం ఇచ్చి స‌త్క‌రించారు. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం సైతం ల‌భించింది.   మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా కీల‌క పాత్ర పోషించారు అందెశ్రీ. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు అందెశ్రీ.ఇక‌ సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారంతో పాటు అందెశ్రీని లోక్ నాయక్ పురస్కారం సైతం వరించింది. ఇటీవ‌ల సీఎం రేవంత్ చేతుల మీదుగా కోటి రూపాయ‌ల న‌గ‌దు పుర‌స్కారం సైతం పొందారు అందెశ్రీ. ఇలా చెప్పుకుంటూ  పోతే  మ‌ట్టిలో పుట్టిన ఈ తేనె తుట్టెలాంటి పాట అంత‌ర్జాతీయంగాను విస్త‌రించి అక్క‌డా గుర్తింపు పొంది ఎన్నో అవార్డులూ రివార్డుల‌ను పొందింది.  అందెశ్రీ 2025 నవంబర్ 10న అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  ఇది ప‌ల్ల‌పాటకు విషాద‌క‌ర‌మైన రోజు. చ‌దువుల‌మ్మ త‌ల్లి చింతించాల్సిన రోజు. తెలంగాణ మ‌ట్టిలో మాణిక్యం దిగ‌ంతాల‌కు ఏగిన రోజు. ఓ పాట కాలం మ‌నిషీ, ఆ పాట మ‌ధురాల‌ను మ‌న‌కు అందించిన‌ మ‌నిషీ.. ఇలా దివికేగ‌డంతో తెలంగాణ సాహిత్యం శోక‌సంద్రంలో మునిగిపోయిన రోజుకూడా  ఇదే.   పాట‌ల్లో ఎన్నో తంగేడు పూల‌ను, పాల‌పిట్ల కేరింత‌ల‌ను పూన్చిన ఓ మ‌నిషీ.. నువ్విలా అర్ధంత‌రంగా వెళ్లిపోయి నీలోని మాన‌వ‌త్వాన్ని మాయం చేశావా! అంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు సాహితీ అభిమానులు.

ఉగ్రకుట్ర భగ్నం.. గుజరాత్ లో ముగ్గురు అరెస్టు

అరెస్టైన వారిలో హైదరాబా డాక్టర్ మరో ఘటనలో హరియానా డాక్టర్ నివాసంలో భారీగా ఆర్డీఎక్స్ స్వాధీనం  భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు భగ్రం చేశారు.  ఈ సందర్భంగా  ఐఎస్ఐఎస్  తో సంబంధాలు ఉన్న  ముగ్గురిని అహ్మదాబాద్ లో ఆదివారం (నవంబర్ 9) అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసుల కథనం  అరెస్టు అయిన వారిపై  గత ఏడాదిగా నిఘా పెట్టారు. ఇప్పుడు వారు పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా  అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు ఆయుధాలు మార్పిడి చేసుకోవడానికి గుజరాత్ కు వచ్చారనీ, అలాగే దేశవ్యాప్తంగా  వివిధ ప్రాంతాల్లో ఉగ్రదా డులు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారనీ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఉండటం హైదరాబాద్ లో కలకలం రేపింది. హైదరా బాద్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌  ఫ్రాన్స్‌లోఎంబీబీఎస్  పూర్తి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వైద్యుడైన  తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి.. సైనైడ్ ను తలదన్నేలాంటి  అత్యంత ప్రమాదకరమైన  రైసిన్  అనే విష రసాయనాన్ని తయారు చేయడం కలకలం రేపుతోంది.  మొహియుద్దీన్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్‌లను అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్, సలీంఖాన్‌లు దిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో విధ్వంసం కోసం రెక్కీ నిర్వహించారని, పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సేకరించారని ఏటీఎస్ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరంతా, రైసిన్ ఉపయోగించి దేశంలో పెను విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ పేర్కొంది. వీరిలో హైదరాబాద్ రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో నివసించే డాక్టర్ మొహియుద్దీన్ తన ఇంట్లోనే ఆముదం గింజల వ్యర్థాల నుంచి రైసిన్ తయారుచేసినట్లు పోలీసులు గుర్తించారు.  గుజరాత్ లో మొహియుద్దీన్ అరెస్ట్‌తో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గుజరాత్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు   అతడి నివాసంలో తనిఖీలు చేపట్టారు. నగరంలో మొహియుద్దీన్‌కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.  ఇదిలా ఉండగా మరో ఉగ్రకుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి.  ఇంటిలిజెన్స్ బ్యూరో, జమ్ముూకశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 300 కేజీల ఆర్డీఎక్స్,  ఏకే 47, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం, జమ్ముకశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా   భద్రతా సంస్థలు ఈ దాడులు నిర్వహించాయి.  నవంబర్ 6న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కి మద్దతుగా పోస్టర్లు అతికించారనే ఆరోపణలతో డాక్టర్ ఆదిల్ రాథర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు అతడి  నివాసంలోనే భారీ ఎత్తున ఆర్డీఎక్స్ అలాగే  ఏకే 47  లభ్యమయ్యాయి. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేశారని భద్రతాబలగాల సమాచారం.  

యాదాద్రికి పోటెత్తిన్న భక్తులు.. ఒక్క రోజే రూ. కోటికి పైగా ఆదాయం

కార్తీకమాసం సందర్భంగా యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసంలో  యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఈ క్రమంలో యాదాద్రిలో ఆదివారం (నవబర్ 9) ఒక్క రోజు లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దాదాపు రెండు వేల సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ  మొత్తం 1968 సత్యనారాయణ వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.  వీటిలో యాదగిరి గుట్టలో 1758, పాతగుట్టలో 200 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్లు వివరించారు. అలాగే ఆదివారం ఒక్కరోజే యాదగిరి గుట్టకు కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా 27లక్షల 43 వేల 220 రూపాయలు, వ్రతాల ద్వారా 19 లక్షల 58 వేల రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 16.96 లక్షల రూపాయలు, కొండపైకి వాహనాల ప్రవేశాల ద్వారా 9 లక్షల 17 వేల రూపాయలు, ఇతరత్రా మరో 8 లక్షల 16వందల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. కాగా కొండపై భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  

తిరుమలలో తిరుమల శాటిలైట్ కిచెన్ కు వంద కోట్ల విరాళం

అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ  తిరుమల అన్న ప్రసాదం ట్రస్ట్ కు వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తిరమలలో నిత్యం దాదాపు రెండు లక్షల మందికి నిత్యం అన్నప్రసాదాలు తయారు చేయడానికి వీలుగా కొత్త శాటిలైట్ కిచెన్ నిర్మాణం కోసం ఆయన ఈ విరాళం ప్రకటించారు. ఈ శాటిలైట్ కిచెన్ ను తాను అన్నదానం ట్రస్ట్ కు అంకితం చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. ముఖేస్ అంబానీ ఆదివారం (నవంబర్ 9) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనీ విరాళం ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని పేర్కొన్నారు.   ఆ తరువాత ఆయన రాజస్థాన్ లోని నాథ్ ద్వారా ఆలయాన్ని కూడా ఆదివారం (నవంబర్ 9) సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడ భక్తుల కోసం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం తొలి విడతగా 15 కోట్ల రూపాయలు అందజేశారు.   అలాగే అదే రోజు ఆయన కేరళలోని గురవాయూర్ కృష్ణ దేవాలయాన్ని సందర్శంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురవాయూర్ లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలటీస్ ఆస్పత్రికి 16 కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు ఆయన 15 కోట్ల రూపాయల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.  

తుపాకి పట్టి కాల్పులు జరిపిన పవనకల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తుపాకి చేతపట్టి కాల్పులు జరిపారు. ఔను నిజమే.. పవన్ కల్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన సందర్భంగా అక్కడి అధికారులతో మాట్లాడారు. ఫైరింగ్ విధి విధానాలు, ఆయుధాల వినియోగం తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలను అత్యంత ఆసక్తిగా విన్నారు. ఆ తరువాత ఆయన తుపాకి పట్టి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత తుపాకి గ్లాక్ 0.45ను ఉపయోగించారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఫైరింగ్ చేస్తున్న పిక్చర్ ను కూడా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   తాను చెన్నైలో ఉన్న సమయంలో  మద్రాస్ రైఫిల్ క్లబ్‌లో సభ్యుడినని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ పాతరోజులన్నీ గుర్తుకు వచ్చాయంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించడం, ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ కాల్చిన కొన్ని రౌండ్లు 'బుల్స్ ఐ'కి అత్యంత సమీపంలో  తాకాయి. 

జూబ్లీ బైపోల్.. అమలులోకి 144 సెక్షన్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రచారం ఆదివారం (నవంబర్ 9)తో ముగిసిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు అధికారులు పూర్తిగా లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించారు. ఆదివారం (నవంబర్ 9) సాయంత్రం నుంచీ.. మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం పోలింగ్ ముగిసే సమయం  వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని బార్లు మూసి ఉంటాయని తెలిపారు.  ఎక్సైజ్ చట్టం 1968, సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే  జూబ్లీహిల్స్ నియోజకవర్గంవ నియోజకవర్గ పరిధిలో 144వ సెక్షన్ విధించారు.  దీని ప్రకారం  ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడంపై నిషేధం ఉంటుంది.  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హైచ్చరిక జారీ చేశారు.  ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ క్యాండిడేట్ గా లంకల దీపక్ రెడ్డి పోటీలో  ఉణ్న సంగతి తెలిసిందే.  గ్రేటర్ పరిధిలో  సత్తా చాటాలనీ కాంగ్రెస్, చాటుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకుని, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ, రాష్ట్రంలో మరింత బలోపేతం కావడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 

టారిఫ్ ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ కూ రెండు వేల డాలర్లు!?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అస్తవ్యస్థ, హేతురహిత టారిఫ్ వార్ ను సమర్ధించుకున్నారు. తన టారిఫ్ విధానం కారణంగా వస్తున్న ఆదాయం నుంచి త్వరలోనే  ప్రతి అమెరికన్‌కు కనీసం 2వేల డాల‌ర్ల‌ చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటన ఇచ్చారు.  ఈ పంపిణీ పరిధిలోకి అధిక ఆదాయం ఉన్న సంపన్నులు రారని పేర్కొన్నారు.  ఈ మేరకు డోనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.  తన టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. అమెరికా టారిఫ్ లను వ్యతిరేకించే వారిని మూర్ఖులుగా అభివర్ణించారు.  తన హయాంలోనే  అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న, గౌరవనీయమైన దేశంగా మారిందని చెప్పుకుకున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం లేదనీ, స్టాక్ మార్కెట్లలో రికార్డ్ స్థాయి టేడింగ్ జరుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు.  తాను అనుసరిస్తున్న టారిఫ్ విధానం కారణంగా దేశానికి ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని పేర్కొన్న ఆయన ఈ నిధులతో  జాతీయ రుణాన్ని తగ్గిండమే కాకుండా, ప్రజలకు డివిడెండ్ రూపంలో నగదు అందిస్తానని పేర్కొన్నారు.  అయితే ఈ డివిడెండ్ ను ప్రజలకు ఎలా, ఎప్పటి నంచి పంపిణీ చేస్తారన్న విషయం మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.   మరోవైపు దాదాపు అన్ని ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతులపై భారీ టారిఫ్‌లను విధించడం ద్వారా ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ న్యాయపరమైన సవాళ్లను ట్రంప్ తోసిపుచ్చారు. టారిఫ్‌లే తన బలమైన ఆర్థిక ఆయుధమని, ఈ విధానం అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా, స్వతంత్రంగా మార్చిందని ఆయన పునరుద్ఘాటించారు.

నేలకూలిన తెలంగాణ సాహితీ శిఖరం

ప్రముఖ  కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ   సోమవారం (నవంబర్ 10) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (నవబర్ 10) తెల్లవారు జామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో  కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన  ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.   జనగాం సమీపంలోని రేబర్తి   గ్రామంలో 1961, జులై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్రగీతగా ప్రకటించింది.  తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్రపోషించిన అందెశ్రీని రేవంత్ సర్కార్ ఈ ఏడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సత్కరించి రూ. కోటి నగదు పురస్కారాన్ని అందజేసింది.  ఇక ఆయన పలు సినీ గేయాలు కూడా రాశారు. ముఖ్యంగా నారాయణ మూర్తి నటించి, నిర్మించిన పలు సినీమాలకు అందెశ్రీ పాటలు రాశారు.   మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు', 'సుడా సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి', 'పల్లెనీకు వందనములమ్మో', 'జన జాతరలో మన గీతం' వంటి అద్భుత గీతాలు అందెశ్రీ కలం నుంచి జాలువారినవే. అందెశ్రీకి 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరధ్వాజ సాహితీ పురస్కారాలను అందెశ్రీ అందుకున్నారు. ఇక 2022 లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది.   అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచిందన్న ఆయన అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. 

మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ...తల్లి సంచలన వ్యాఖ్యలు

  దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తన కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారనేది జూన్ 6, 8 మిస్టరీగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాతే మరణవార్త బయటపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. ‘గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా చూడటానికి సమయం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ తమకు కనీసం సమాచరం ఇవ్వలేదని ఆమె అన్నారు.  తన కుమారుడి మృతి వెనుక నిర్లక్ష్యం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ గోపీనాథ్ తల్లి మాగంటి మహానందకుమారి నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తన కుమారుడు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, చివరకు జూన్ 8న మరణించినట్లు ప్రకటించిన తర్వాత కూడా తనను చూడనివ్వలేదని మహానంద కుమారి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు మాగంటి సునీత కుమార్తె దిషిర సూచన మేరకే ఆసుపత్రి సిబ్బంది తనను అడ్డుకున్నారని తెలిపారు.  అయితే,   కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా గోపీనాథ్‌ను కలిశారని, ఈ వివక్ష తన అనుమానాలను మరింత బలపరిచిందని ఆమె పేర్కొన్నారు. కేటీఆర్ వచ్చి వెళ్లేంత వరకు మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదని, అసలు ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కిడ్నీ మార్పిడి తర్వాత డాక్టర్లు సరైన శ్రద్ధ చూపలేదని, డయాలసిస్‌లో జాప్యం చేశారని మహానంద కుమారి ఆరోపించారు. అంతేకాకుండా గోపీనాథ్‌కు కేటాయించిన గన్‌మెన్‌లు, భద్రతా సిబ్బంది ఆయన కుప్పకూలినప్పుడు అందుబాటులో లేరని, అత్యవసర చికిత్స (సీపీఆర్) అందించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  తన కోడలు సునీత, కేటీఆర్ ఇద్దరూ నిజాలు దాస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. గోపీనాథ్‌ 3 సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్క రోజు కూడా చూడటానికి తల్లిగా సమయం ఇవ్వలేదన్నారు. ఒక్క అటెండర్‌ను కూడా పెట్టలేదు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది.  లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేదు. మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదు. నేను గోపీనాథ్‌తో సునీత వివాహం చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో మా పేరు లేదు. కేటీఆర్‌ వెంట పరుగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదు. ఇది డబ్బు సమస్య కాదు. మాకు గుర్తింపు లేదు. అందుకే మీడియా ముందుకొచ్చామని తెలిపారు.

కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

  చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల క్యాంప్ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కర్ణాటక నుంచి 4 ఏనుగులు తీసుకోచ్చినట్టు ఆయన తెలిపారు. ఇళ్లు, పొలాల్లోకి అడవి ఏనుగులు రాకుండా ఎలా కట్టడి చేస్తారో వివరించారు. గజరాజులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నా పవన్.. వాటి విన్యాసాలను తిలకించి ఆహారం తినిపించారు.  అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కుంకీ ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు., కుంకీ ఏనుగులతో పరేడ్ నిర్వహించారు. కుంకీ ఏనుగులు పవన్ కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి, వాటికి అభివాదం చేశారు. 

కూలీగా మారి పార పట్టిన మంత్రి నిమ్మల

  ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భవన నిర్మాణ కూలీగా మారి శ్రమదానం చేశారు. పాలకొల్లులో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న గౌడ, శెట్టిబలిజ కల్యాణ మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా మంత్రి నిమ్మల లేబర్ మారి కార్మికులతో కలిసి మంత్రి సైతం కంకర, ఇసుక, సిమెంట్‌ను తట్టల్లో మోసుకెళ్లి మిక్సర్‌లో వేశారు.  మంత్రి తమతో కలిసి పనిచేయడం చూసి కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.1.50 కోట్లతో మొదటి స్లాబ్ నిర్మాణం జరిగిందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అరబస్తా సిమెంట్ పని నోచుకోలేదని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.3 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఎవరిది అగ్రికల్చరో... ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి : సీఎం రేవంత్

  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ 100 శాతం గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీల మధ్య ఫెవికాల్‌ బంధం ఉందని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ ఎందుకు చేయలేని రేవంత్ ప్రశ్నించారు.  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ తెచ్చుకుంటే దేశం మొత్తం గెలిచినట్లేని ఆరోపించారు.. మరో కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 జూన్‌ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం అన్నారు.  శ్రీలీల ఐటమ్ సాంగ్ కు, కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదని రేవంత్ విమర్శించారు. సొంత చెల్లి కవితను , మాగంటి తల్లిని కేటీఆర్ అవమానించారని రేవంత్ అన్నారు. సొంత కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని సరిగ్గా చూసుకుంటాడా? అనిప్రశ్నించారు.  రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని కిషన్ రెడ్డి.. గుజరాత్ కు గులాంగిరీ చేస్తూ.. తనపై ఒంటికాలిపై లేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై ఎగిరితే ఏమీ రాదని, ఏమన్నా ఉంటే ప్రధాని మోదీ దగ్గర మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో  ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు,  రేషన్ కార్డులు, సన్నబియ్యం ,రూ.500కే గ్యాస్ సిలిండర్, సంక్షేమ పధకాలను అమలు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన  రాష్ట్రంగా తెలంగాణను నిలిచిందని తెలిపారు. కులగణన చేశామని సీఎం అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు ఇచ్చామని. మరో 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశామని సీఎం అన్నారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండిని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది... బీహార్‌కి ఆ పరిస్థితి రావద్దు : లోకేష్

  వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. బీహార్ సర్వతో ముఖాభివృద్ధికి మరోమారు బీహార్ యువత ఎన్ డీఏను గెలిపించాల్సిందిగా  ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్... అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు. బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనది.  బీహార్ యువత మరోమారు ఎన్ డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్ డీఏని గెలిపించాలి. ఏపీలో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అటువంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ అభివృద్ధి కోసం ఎన్ డీఏను మరోమారు గెలిపించాలి. బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్ డీఏ ని గెలిపించాల్సిన అవసరం ఉంది.        లీడర్ షిప్ ట్రాక్ రికార్డు – స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్ డీఏని గెలిపించాలి.ప్రధాని మోదీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. బీహార్ లో నాని నరేంద్ర మోడీ , నితీష్ కుమార్ నాయకత్వం ఉంది. ఏపీలో నరేంద్ర మోడీజీ, నాయుడు  నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వారు పాలన చేస్తున్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దది. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ఆయన లక్ష్యం.  డబుల్ ఇంజన్ సర్కారు – బీహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్రబడ్జెట్ లో భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. అంతేగాక కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్ డీఏ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. ఎన్ డీఏ ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారమేర్పడుతుంది. ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ లో మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.  బీహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను బీహార్ యువత నమ్మవద్దు. ఎన్ డీఏ భాగస్వామిగా చెబుతున్నాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది. ప్రధాని మోడీజీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగానో బీహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యులు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.  

కేసీఆర్ పిలిస్తే వెళ్తా... కవిత సంచలన వ్యాఖ్యలు

  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న… ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ తిరగడం… జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేయడం తప్ప ప్రజల సమస్యలపై...అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో అన్నారు.  వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా... జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ముందుగా పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన మాదన్నపేట చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.  కట్ట పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాలల అధ్యాపకులు ఫీజు రియంబర్స్మెంట్ పై వినతిపత్రం జాగృతి అధ్యక్షురాలు కవితలు అందించారు. అనంతరం కవిత మాట్లాడుతూ... జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాలలోని ప్రజలకు సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గం రావడం జరిగిందని నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు.  ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట చెరువుకు సంబంధించి పట్టేవాగుపై లో లెవెల్ వంతెన నిర్మాణంతోపాటు... చెరువు మత్తడి ఎత్తు పెంచి నిర్మించవలసి ఉన్నదని... ఆ విధంగా నిర్మించినట్లయితేనే ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. లో లెవెల్ వంతెన మత్తడి ఎత్తు పెంచేందుకు ఇంతకుముందే టెండర్ అయినట్టు తెలిసిందని, ఆ రెండు నిర్మించలేదని ఈ రెండిటిపై స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. నర్సంపేట పట్టణంలోని నల్లవెల్లి మార్గం రోడ్ అంతా గుంతలు ఏర్పడిందని ఎప్పటికప్పుడు రోడ్లు మరమ్మతులు చేయవలసి బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అన్నారు.  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రజల సమస్యపై కానీ అభివృద్ధి పైన కానీ ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదు అన్నారు. అదేవిధంగా నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీలోను అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తి చేయలేదని 150 పడకల ఆసుపత్రి తగ్గట్టు ఇంతవరకు ఏర్పాట్లు పూర్తి కాలేదని ఈ సమస్యపై శ్రద్దపెటంటలని అన్నారు.  మొంథా తుఫాను ప్రభావంతో పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మొక్కుబడిగా సమావేశం నిర్వహించారని అన్నారు. అధికారులను లోతుగా సర్వే చేయించి రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా... కళాశాలలకు సంబంధించి ఫీజ్‌ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అవమానకరంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని తెలిపారు. తండ్రిగా కేసీఆర్ పిలిస్తే ఇంటికి వెళ్లానని కానీ బీఆర్‌ఎస్‌కు తనకు సంబంధం లేదని స్ఫష్టం చేశారు. ఈ చర్య వెనుక పార్టీలోని కొందరి కుట్ర ఉందని  ఆరోపించారు.

తెలంగాణ పోలీసుల ఆపరేషన్...81 మంది అరెస్ట్

  తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఐదు రాష్ట్రాల్లో సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించింది. సైబర్‌ మోసాల్లో పాల్పడుతున్న 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.95 కోట్ల విలువైన మోసాలు జరిపినట్లు తేలింది. అరెస్టు చేసిన వారిలో 17 మంది ఏజెంట్లు, 7 మంది మహిళలు ఉన్నారు. అలాగే 58 మంది మ్యూల్‌ ఖాతాదారులు (మోసపూరిత డబ్బు బదిలీకి ఉపయోగించే వారు) ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుండి 84 మొబైల్‌ ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్‌ చేశారు. ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందించే చర్యలు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చేపడుతోంది.

దొంగ, పోలీస్‌ ఆటాడించి అత్తను చంపిన కోడలు

  అత్త కోడలు మధ్య విభేదాలు సహజంగా ఉంటాయి. కానీ ఆ కోడలు ప్రేమతో అత్తతో దాగుడుమూతలు ఆట ఆడింది. నిజంగా అన్యోన్య భావంతో కోడలు ఆటాడిందని పొరపాటు పడొచ్చు. ఆ ఆట వెనక ఓ హత్య ఉంటుందని అత్తకు తెలియ లేదు. ఓ నిండు ప్రాణం ఆ ఆటలో ఆగిపోయింది. విశాఖలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు  సంచలనంగా మారింది.  ఆ దాగుడుమూతల ఆటలో ఏం జరిగింది విశాఖ నగర శివారు సింహాచలం దగ్గర అప్పన్నపాలెం వద్ద వర్షిని అపార్ట్మెంట్లో జయంతి కనకమాలక్ష్మి అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె కుమారుడు పురోహితుడు. భార్య ఇద్దరు పిల్లలు 66 సంవత్సరాల ఆ  తల్లితోపాటు భార్య తల్లి కూడా ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ దశలో ఈనెల 7వ తేదీన కోడలు లలిత అత్త కనక మహాలక్ష్మి తో దాగుడుమూతలు ఆట ఆడాలని చెప్పింది దీనికి పిల్లలను కూడా పిలిచి నాన్నమ్మకు కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్లకు తాళ్లు కట్టి దాగుడుమూతల ఆట ఆడాలని చెప్పింది .  దాంతో పిల్లలు ఆమె కలిసి అత్త కనక మహాలక్ష్మికి చేతులు కాళ్లు కుర్చీకి కట్టేశారు ఆటలో భాగంగా చిన్న పిల్లలు గదుల్లో దాక్కున్నారు. ఆ తర్వాత కొంత సేపటికి మంటలతో అత్త కనకమహాలక్ష్మి కేకలు వేస్తూ మంటల్లో తాళ్లు తెగిపోవడంతో హాల్ నుంచి దేవుడు గదిలోకి పరుగులు తీసింది ఆ కేకలు విని గదిలో ఉన్న మనవరాలు కూడా రావడంతో ఆమె కూడా మంటలకు గాయపడింది కొద్దిసేపటికి కోడలు లలిత తల్లి కూడా బయటకు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే తీవ్రమైన మంటల గాయాలతో కనక మహాలక్ష్మి కుప్పకూలి చనిపోయారు.. .. అతను అంతం చేసేందుకు కోడలు ట్రిక్.. .. ఒక ఇంట్లో అత్తా కోడలు నివాసం ఉండడంతో మనస్పర్ధలు ఇటీవల ఏర్పడ్డాయి తరచూ తనపై భర్తకు అత్త విషయాలు చెప్పడంతో ఆయన తనను నిందిస్తున్నారని కోడలు లలిత కోపం పెట్టుకుంది. అత్తను చంపేస్తే మంచిదని నిర్ణయించింది దీనికోసం హౌ టు కిల్ అనే యూట్యూబ్ వీడియోలను పరిశీలించింది అందులో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ఆమెను ఆకట్టుకుంది.  ఆ ప్రకారం అతను దాగుడుమూతలు ఆట ఆడుదామని చెప్పి లలిత పద్ధతి ప్రకారం చంపేసింది. ముందుగా పిల్లలతో కలిసి కుర్చీలో అత్తకు కాళ్ళు చేతులు కాళ్లతో కట్టి కట్టి వాళ్లు గదుల్లో దాక్కునగా ముందు రోజు తీసుకు వచ్చిన పెట్రోల్ అత్తపై పోసి కోడలు లలిత నిప్పు అంటించింది. మంటల్లో కాలి చనిపోతుందని ఆమె లలిత భావించింది. ఆ క్రమంలోనే అతను హత్య చేసింది. .. నిందితురాల్ని పట్టించిన రెండు కారణాలు  .. సాంప్రదాయ రీతిన జీవనం సాగించే ఇంటిలో జరిగిన ఈ ఘటన పై ఎవరికి అనుమానం రాలేదు. అత్త దాగుడుమూతలు ఆట ఆడుతుండగా టీవీ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి కాలిపోయారని కోడలు లలిత ముందుగా పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు కూడా అనుమానించలేదు. అయితే ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడగా అత్త దేవుడికి దీపం పెడుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని చెప్పారు  పరస్పర విరుద్ధమైన ఈ రెండు కారణాలు ఆ కోడలు ఎందుకు చెప్పారని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసుల విచారణలో రాత్రి 11:30 గంటలకు నిజం బయటికి వచ్చింది. తానే హత్య చేసినట్టు కోడలు లలిత అంగీకరించింది.. హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ను ఆధారంగా ఈ కోడలు అత్తను అమానుషంగా చంపేసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ప‌వ‌న్ చెప్పిన‌...ఎర్ర‌చంద‌నం కొత్త సెంటిమెంట్ క‌థ‌!

  శేషాచలంలో మాత్ర‌మే పెరిగే ఎర్ర‌చంద‌నం చెట్ల వెన‌క ఉన్న ఒకానొక ఆధ్యాత్మిక గాథ‌ను వెలుగులోకి తెచ్చారు డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖా మంత్రి కూడా అయిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌. గ‌తంలో ఈ ప్రాంతంలో సంచ‌రించిన వెంక‌టేశ్వ‌ర‌స్వామివారికి గాయం అయ్యింద‌ని. ఆ గాయం  కార‌ణంగా ర‌క్తం చిందింద‌ని. ఆ ర‌క్త‌మే  ఇక్క‌డి గంధ‌పు చెట్ల‌కు అంటి అవి ఎర్ర‌చంద‌నం చెట్లుగా మారాయ‌ని అన్నారాయ‌న‌. ఇంత‌టి డివైన్ స్టోరీస్ ఈ రెడ్ శాండ‌ల్ ట్రీస్ వెన‌క దాగి ఉన్నాయి కాబ‌ట్టి.. ఎవ్వ‌రూ వీటి స్మ‌గ్లింగ్ కి పాల్ప‌డ వ‌ద్ద‌ని సూచించారు. కొన్నాళ్ల పాటు చూసి ఇలాంటి రెడ్ స్మ‌గ్ల‌ర్ల ప‌ట్ల తాము క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నామ‌ని కూడా వార్న్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అదెలా ఉండ‌బోతుందంటే ఇప్ప‌టికే తాము నాలుగు కింగ్ పిన్స్ ని ఐడెంటిఫై చేశామ‌నీ.. ఇలాంటి వారి కింద  ప‌ని చేసే చోటా మోటా సాధార‌ణ  కూలీల‌తో స‌హా త‌మ వ‌ద్ద వివ‌రాలున్నాయ‌ని.. ఎవ‌రైనా స‌రే వ‌చ్చే రోజుల్లో ఈ ఎర్ర‌చంద‌నం  స్మ‌గ్లింగ్ ని గానీ కంటిన్యూ చేస్తే.. వారిని ఆప‌రేష‌న్ క‌గార్ లా.. మ‌రో కొత్త ఆప‌రేష‌న్ని నిర్వ‌హించి.. ఈ రెడ్ స్మ‌గ్ల‌ర్ల‌ను స‌మూలంగా నాశ‌నం  చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే రెడ్ శాండ‌ల్ దేశాంత‌రాలు దాటుతోంద‌ని.. ఇక్క‌డి శేషాచ‌లం కొండ‌ల్లో మాత్ర‌మే  పెరిగే  ఎర్ర‌చంద‌నం ఎక్కోడో నేపాల్లో ప‌ట్టుబ‌డుతోంద‌ని అన్నారు డీసీఎం ప‌వ‌న్. ఇటీవ‌ల మొత్తం ఐదు రాష్ట్రాల‌తో తాము ఒప్పందం చేసుకున్నామ‌నీ.. ఈ ఒప్పందంలో భాగంగా ఎక్క‌డ ఎర్ర‌చంద‌నం దుంగ‌లు ప‌ట్టుబ‌డ్డా వాటిని  ఏపీకి అప్ప‌గించాల‌న్న టై- అప్ చేస్తున్న‌ట్టు చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇటీవ‌ల ఒక రాష్ట్రం వారు త‌మ‌కు ప‌ట్టుబ‌డ్డ ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను అమ్మితే ఏకంగా వంద కోట్ల‌కు పైగా  సొమ్ము వారి రాష్ట్ర ఖ‌జానాకు అందివ‌చ్చింద‌ని అన్నారు ప‌వ‌న్. తాము అడ‌వుల్లోకి వెళ్లి చూడ‌గా.. ఎర్ర‌చంద‌నం చెట్టు ఒక్క‌టీ  స‌జావుగా క‌నిపించ‌లేద‌నీ.. అన్ని చెట్ల‌ను న‌రికివేసిన‌ట్టు గుర్తించామ‌నీ చెప్పుకొచ్చారు ప‌వ‌న్.. ఇలా చేస్తే ఈ ప్రాంత  జియోగ్రాఫిక‌ల్ ఐడెంటిఫికేష‌న్ గా ఉన్న ఈ ఎర్ర‌చంద‌నం చెట్టు కొన్నాళ్ల‌కు పూర్తిగా క‌నుమ‌రుగై పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది చెట్ల‌ను న‌రికి, కోట్లాది రూపాయ‌ల‌ను వెన‌కేశార‌నీ.. ఇలాంటి  నేరం ఘోరం ఇక‌పై జ‌ర‌గ‌గ‌డానికి వీల్లేదంటూ.. సాక్షాత్ ఆ వెంక‌టేశ్వ‌ర స్వామి  ర‌క్తంతో త‌డిసిన  ఈ చెట్ల ప‌ట్ల  అంద‌రూ జాగ్ర‌త్త వ‌హించాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టుబ‌డ్డ దుంగ‌ల‌ను ప‌రిశీలించారు ప‌వ‌న్. వీటి విలువ ఐదు వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.  ఇదిలా ఉంటే.. గ‌తంలో టాస్క్ ఫోర్స్ వారు త‌మ‌కు ప‌ట్టుబ‌డ్డ త‌మిళ‌నాడు స్మ‌గ్ల‌ర్ల చేత వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారిపై ఒట్టు వేయించేవారు. ఈ సెంటిమెంటు ద్వారానైనా త‌మిళ‌నాడు జావాదిమ‌లై వంటి ప్రాంతాల నుంచి వ‌చ్చే స్మ‌గ్ల‌ర్ల‌ను అరిక‌ట్టాల‌ని చూశారు. ఆపై ఎన్ కౌంట‌ర్లు చేయ‌డం, అటు పిమ్మ‌ట‌ చెట్ల కోసం మ‌నుషుల‌ను చంపుతారా!? అంటూ త‌మిళ‌నాట పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డం  తెలిసిందే. ప‌వ‌న్ హెచ్చ‌రిక‌ల‌ను బ‌ట్టీ చూస్తుంటే.. మ‌ళ్లీ అలాంటి ఉప‌ద్ర‌వం ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో  స్మ‌గ్ల‌ర్లు వెన‌క్కు త‌గ్గుతారా? లేక‌.. ఎప్ప‌టిలాగా లైట్ తీస్కుని త‌మ న‌రుకుడు తాము చేస్కుంటూ పోతారా; తేలాల్సి ఉంది.