సింగపూర్ బయలు దేరిన పవన్, చిరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.   చిన్న కొడుకు మార్క్ శంకర్ తాను చదువుతున్నపాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లే ముందు ఈ విషయంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజునాడే చిన్న కుమారుడు ప్రమాదానికి గురయ్యాడని గద్దద స్వరంతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రస్తుతం తన చిన్న కుమారుడు క్షేమంగానే ఉన్నాడనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ పవన్ కల్యాణ్ చెప్పారు.  ఈ ప్రమాదంలో చాలా మంది పిల్లలు గాయపడ్డారన్న పవన్ వారిలో తన కుమారుడు కూడా ఒకరని చెప్పారు.    తన కుమారుడు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తనకు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, మంత్రి నారా లోకేష్ తదితరులందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.   ఇలా ఉండగా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డాడన్న విషయం తెలిసిన వెంటనే పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.  

వలంటీర్లను వంచించింది జగనే.. తేల్చి చెప్పిన పవన్

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ జగన్ కోసం జగన్ చేత జగనే సృష్టించుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థను జగన్ గాలి కొదిలేశారు. తన కోసం పని చేయడం తప్ప వలంటీర్లకు ఉద్యోగ భద్రత అన్నది లేకుండా చేశారు.   వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో సంక్షేమ పథకాల అమలులో జగన్ హయాంలో కీలక భూమిక పోషించింది. చెప్పాలి.  ఈ కారణంగా తాము అధికారంలోకి వచ్చినా కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని   ఎన్నికలకు ముందు  తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అంతే కాకుండా   వలంటీర్లకు అప్పటి వరకూ ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని పది వేలు చేస్తానని కూడా వాగ్దానం చేశారు. ఇదీ వాస్తవమే. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశంతో చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేశారు. అధాకారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి క్యాబినెట్ లోనే వలంటీర్ల వ్యవస్థపై చర్చించారు. ఇదే విషయాన్ని అడవి తల్లి బాటలో భాగంగా సోమ, మంగళవారాల్లో (ఏప్రిల్ 7, 8) తేదీల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఏ కరంగానూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేని పరిస్థితిని జగన్ సృష్టించారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.  వలంటీర్లను వంచించింది, ఆ వ్యవస్థ మనుగడ లేకుండా చేసిందీ జగన్ సర్కారేనని కుండబద్దలు కొట్టారు.   వలంటీర్లను నియమించుకున్న వైసీపీ ప్రభుత్వం వారితో పనిచేయించుకుందే గానీ, వారి భవిష్యత్తు గురించి, ఉద్యోగ భద్రత గురించి పట్టించుకోలేదన్నారు. వలంటీర్ వ్యవస్థకు జగన్ సర్కార్ అధికారిక ముద్ర వేయలేదన్నారు.   ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ వద్ద కూడా వలంటీర్ వ్యవస్థ గురించి ఒక్కటంటే ఒక్క పత్రం కూడా లేదన్నారు. అసలు వలంటీర్లకు వేతనాలను కూడా వైసీపీ సర్కారు ప్రభుత్వం ద్వారా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. వలంటీర్లకు ఏ విధంగానూ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ చేసిందన్నారు.అసలు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా జగన్ సర్కార్ జీవో కూడా జారీ చేయలేదనీ, అయినా కూడా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులేనన్న భ్రమల్లో వారిని ఉంచిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వలంటీర్లను ప్రభుత్వం వంచించిందనీ, ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను కొనసాగిద్దామన్నా కొనసాగించలేని పరిస్థతి ఉందనీ చెప్పారు.  

బ్రహ్మకుమారీ చీఫ్ దాదీ రతన్ మోహిని కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీల చీఫ్​ దాది రతన్ మోహిని ఇక లేరు. ఆమె వయస్సు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆమె పరమపదించిన విషయాన్ని బ్రహ్మకుమారీ సంస్థ పీఆర్వో ధృవీకరించారు.    గత నెల 25న వందవ పుట్టిన రోజు జరుపుకున్న రతన్ మోహిని గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజస్థాన్లోని ట్రామా సెంటర్ కు తరలించారు. అయితే సోమవారం నాటికి ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో అహ్మదాబాద్ లోని జైడన్ ఆస్పత్రిలో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె పార్ధివదేహాన్ని రాజస్థాన్ లోని బ్రహ్మకుమారీస్   ప్రధాన కార్యాల‌యానికి తీసుకువెళ్లారు.      సింధ్‌లోని హైద‌రాబాద్‌లో జన్మించిన  దాది ర‌త‌న్ మోహిని అసలు పేరు పేరు ల‌క్ష్మీ. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారిస్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌లో బ్రహ్మకుమారీల తరపున పాల్గొన్నారు.  

మావోయిస్టు పార్టీ బెదిరింపు లేఖ 

చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లతో  మావోయిస్టులకు  కోలుకోలేని దెబ్బ తగిలింది.  నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాజాగా  మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను ఇన్ ఫార్మర్లుగా చేసుకుని ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం జల్లెడపడుతుంది. 2026 మార్చి వరకు మావోయిస్టు రహిత దేశం చేస్తామని కేంద్రం ప్రకటించింది.   మావోయిస్టులు  ఇటీవల ఎన్ కౌంటర్లతో భారీ మూల్యం చెల్లించుకోవడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కర్రెగుట్టపై రావొద్దంటూ  బాంబులు అమర్చినట్టు చెప్పారు. అమాయక ఆదివాసులు ప్రాణాలు కోల్పోకూడదని నక్సలైట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని నక్సలైట్లు ఆరోపించారు. ఆదివాసులకు మాయమాటలు చెప్పి ప్రలోభపెడుతున్న పోలీసులను నమ్మొద్దని నక్సలైట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వెంకటాపురం వాజేడు కమిటీ  పేరిట  లేఖ విడుదలైంది. 

అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకు స్థాపన 

ఎపి రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత ఇల్లు శంఖు స్థాపన కార్యక్రమం  బుధవారం (ఏప్రిల్ 9) జరుగనుంది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వెలగపూడి సచివాలయం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నిర్మించుకోవడంతో  పలువురు హర్షం వెలిబుచ్చారు. అమరావతిలో చంద్రబాబు నివాసం చేసుకోవడంతో ఈ ప్రాంత అభివృద్ది పనులు వేగవంతమయ్యే అవకాశముందని వారు భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిపై దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు తన స్వంతింటిని పూర్తిగా నిర్లక్యం చేశారు. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి నుంచే పాలన సాగిస్తున్న చంద్రబాబు దేశంలోనే పేరొందిన రాజధాని నిర్మించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. నిలిచి పోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నారు. అమరావతిని రాజధాని చేయకుండా గత ప్రభుత్వం చేసిన కుట్రలను చంద్రబాబు  ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. చంద్రబాబు నూతన ఇల్లుతో అమరావతికి కొత్త శోభ వస్తుందనడంలో సందేహం లేదు. 

కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?

  #కొత్త రక్తం మోజులో లోకేష్.. దూరమౌతున్న సీనియర్లు  #ఏ ఎమ్మెల్యేను కదిపినా వెళ్ల గక్కుతున్న అసంతృప్తి  #సీనియర్-జూనియర్ కాంబినేషన్ లేకుంటే ఎలా అంటూ విమర్శలు త్వరలో టీడీపీ మహానాడు జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరుపుకోబోతున్నారు. జరగబోయే మహనాడులో కడప బాంబుల్లాంటి విషయాలేం పేలతాయో..? ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో..? ఆ తర్వాత పరిణామాలు ఎలా దారి తీస్తాయోననే అంశంపై టీడీపీ సానుభూతిపరుల్లో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది. అదేంటంటే సీనియర్లను సైడ్ చేస్తే ఎలా? అనేదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్. పెద్దలను గౌరవించాలని చెబతారు.. కానీ ఇప్పుడు టీడీపీలో ఆ పెద్దలకు సరైన గౌరవం లభించడం లేదనే చర్చ నడుస్తోంది. పాత నీరు పోవాలి.. కొత్త నీరు రావాలి అంటారు. కానీ రాజకీయాల్లో సీనియర్-జూనియర్ కాంబినేషన్ లేనిదే పార్టీ నడవడం కష్టం. రాజకీయాలు చేయడం కష్టం. దీనికి తాజా ఉదాహరణ వైసీపీనే. రాజకీయ పార్టీని నడిపే విషయంలో అంతగా అవగాహన లేని కారణంగా విఫల నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడంతా పార్టీలో సీనియర్ల సంగతేంటీ అనే అంశం చుట్టే తిరుగుతోంది. పార్టీలో ఏ ఇద్దరు కలిసినా.. పార్టీలో సీనియర్ల సంగతేంటీ అనే దిశగానే చర్చ జరుగుతున్న వాతావరణమే కన్పిస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారు నెమ్మదిగా సైడ్ కావడమో.. లేదా పార్టీ అధిష్టానమే సైడ్ చేయడమో జరుగుతోంది. పార్టీతో ప్రస్తుతం అంటీ ముట్టనట్టుగా ఉంటోన్న సీనియర్ల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు పార్టీ అధినాయకత్వానికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న యనమల, అశోక్ గజపతి రాజు, కళా వెంకట్రావు వంటి వారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. ఈ ముగ్గురిలో కళా వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా, తనకు తగ్గిన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎంత వరకు ఉండాలో అంత వరకే పరిమితం అవుతున్నారు. వీలుంటే తన వారసుడికైనా సరైన ప్రాధాన్యత లభించే స్థానాన్ని కల్పిస్తే చాలునని భావిస్తున్నట్టు సమాచారం. ఇక అశోక్ గజపతి రాజు. ఈయన ఎన్నికలకు ముందు నుంచే నెమ్మదిగా పార్టీతో డిటాచ్ అవుతున్నట్టే కన్పించారు. ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ వ్యవహరాల్లో కన్పించడమే మానేశారు. యనమల అప్పుడప్పుడు కన్పిస్తున్నా.. పార్టీ అధిష్టానం ఆయనకు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గిస్తోంది. దీంతో ఆయన కూడా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అనే థియరీని పాటించడానికి అలవాటు పడుతున్నట్టు కన్పిస్తోంది. రాజ్యసభ వస్తే సరే సరి.. లేకుంటే రాజకీయాలకు సెలవని ప్రకటించేసే పరిస్థితి యనమల వైపు నుంచి ఇప్పటికే కన్పించింది. ఒకప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తీ,  అన్ని కీలక సమాయాల్లో పార్టీకి సరైన సలహాలు, సూచనలు ఇచ్చిన పెద్దమనిషిని దూరం చేసుకోవడంపై కూడా కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇక సీనియర్లుగా ఉండి.. సరైన పదవులు రాకుండా ఉన్న వారి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరు గడచిన ఎన్నికల్లో గెలిచారు. అయినా వీరికి ఎలాంటి మంత్రి పదవులు దక్కలేదు. అయినా వీరిలో సోమిరెడ్డి, గోరంట్ల మినహా మిగిలిన ఇద్దరు పెద్దగా యాక్టివ్ గా కన్పించడం లేదు. సోమిరెడ్డి తన వారసుడికి సరైన దారి చూపించాల్సిన అవసరం కన్పిస్తోంది. అలాగే గోరంట్ల విషయానికొచ్చేసరికి.. ప్రస్తుతానికైతే.. ఆయనకు వారసులనే విధంగా ఎవ్వర్నీ ప్రొజెక్ట్ చేయలేదు. ఓ విధంగా చెప్పాలంటే 2029 ఎన్నికల నాటికి గోరంట్ల సైడ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడుని స్పీకర్ ఛైరులో కూర్చొబెట్టడం ద్వారా ఆయన నోటికి తాళం వేసేసిన పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్న తప్పుకుని వారి కుమారులు తెర మీదకు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమ పరిస్థితి అయితే కొడిగట్టిన దీపంలా మారింది. కానీ ఆయన మాత్రం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. వీరు కాకుండా.. తెర వెనుక ఉండి.. పార్టీని ఓ దారిలో పెట్టడానికి.. పార్టీని వివిధ వేదికల మీద బాగా ఎలివేట్ చేయడానికి పని చేసిన కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్ వంటి వారికి పార్టీలో అంతంత మాత్రం గౌరవమే దక్కుతోంది. టీడీ జనార్దన్ 2004-2014 అనేది టీడీపీకి చాలా టఫ్ టైం. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి టీడీ జనార్దన్ స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచారు. పార్టీ కార్యాలయ కార్యదర్శిగా అందర్నీ సమన్వయం చేసుకుంటూ.. పార్టీ కేడరుకు.. నేతలకు.. నేతలకు.. అధిష్టానానికి సంధానకర్తగా మారి.. అంతా తానై పార్టీని కాచుకుని పని చేశారు. ఇక 2019-24 మధ్య కాలంలో కూడా పార్టీ కోసం విశేషమైన సేవలే అందించారు. కానీ ఆయన్ను ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఆ రీతిలో గౌరవిస్తున్నదా..?  అంటే లేదనే సమాధానమే వస్తున్నది. ఇక కంభంపాటి రామ్మోహన్. ఢిల్లీ స్థాయిలో కంభంపాటికి ఉన్న పేరు.. పరపతి సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఢిల్లీ స్థాయిలో టీడీపీకి కంభంపాటి తరహాలో లాబీయింగ్ చేసేవారు లేరు. వివిధ జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో.. ఆ పార్టీల అధిష్టానాలతో నేరుగా మాట్లాడగల.. సంప్రదింపులు జరపగల నేర్పరితనం కంభంపాటికి ఉంది. కానీ కంభంపాటి సేవలను హైకమాండ్ సరిగా వినియోగించుకోవడం లేదనే చెప్పాలి. ఇలాంటి వారంతా సైడ్ అయిపోతే.. పరిస్థితేంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో పార్టీ వర్గాల్లో సీనియర్ల గురించి చర్చ జరగడానికి కారణాల్లేకపోలేదు. చాలా మంది సీనియర్ నేతలను మహానాడు తర్వాత పక్కకు పెట్టే అవకాశాలు కన్పిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే ప్రభుత్వంలో సీనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. దాదాపు జూనియర్ టీం రాజ్యమేలుతోంది. ఇదే తరహాలో పార్టీలో కూడా చిన్నోళ్లకే పెద్ద బాధ్యతలు అప్పగించే దిశగా మహానాడులో యాక్షన్ ప్లాన్ ఉండి ఉండొచ్చనేది టీడీపీలో వినిపిస్తున్న టాక్.  దీంతో సీనియర్లను ఈ స్థాయిలో సైడ్ చేయడం కరెక్టా అనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జూనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. సీనియర్లను గౌరవించే విషయంలో టీడీపీ హైకమాండ్ సరైన కోణంలో ఆలోచించడం లేదేమోననేది అందరి మనస్సుల్లోనూ ఉన్న భావన. సీనియర్లను ఒక్కసారిగా సైడ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో జూనియర్లనే మంత్రులుగా చేయడం వల్ల.. ఊహించిన స్థాయిలో ప్రభుత్వానికి.. పార్టీకి మైలేజ్ రావడం లేదు. ఏం మాట్లాడినా.. చంద్రబాబు, లోకేష్ మాట్లాడితేనో.. ప్రెస్ మీట్ పెడితేనో తప్ప.. పెద్దగా ప్రజల్లోకి పోవడం లేదు. పైగా పార్టీకి ఎప్పుడైనా కష్ట కాలం వచ్చినా.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా.. వాటిని జూనియర్లుగా ఉన్న వారు ఎంత వరకు డీల్ చేస్తారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. కనీసం మహానాడు జరగకముందే ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీనియర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారికి సముచిత బాధ్యతలు అప్పగించి, వారి సేవలు వినియోగించుకుంటే మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్లు వ్యవహరించినంత సమయస్ఫూర్తితో జూనియర్లు వ్యవహరిస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా మానవ సంబంధాలను మెయిన్ టెయిన్ చేయడంలో జూనియర్లు చాలా ఘోరంగా విఫలమవుతున్నారు. మనీ రిలేషన్స్ పెరిగాయని ప్రచారం జరుగుతోంది. లోకేష్ వెంట ఉండే ఇద్దరు అనుచరులు వల్లనే ఆయనపై ఈ ముద్ర పడుతోందని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. అలాగే తమ కోసం పని చేసిన వారెవ్వరు.. అనే విషయాన్ని ఆలోచించి.. ఆ కోణంలో నిర్ణయాలుతీసు కోవాలి కానీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ జూనియర్ మంత్రి వద్దకు వినతిపత్రం తీసుకెళ్తే.. ఆ వినతి పత్రాన్ని ఆయన ఎదుటే చించేసి.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి చూస్తుంటే.. జూనియర్ల చేతుల్లో పార్టీని పెడితే అది ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. పైగా  జూనియర్ నేతల్లో చాలా మంది కమర్షియల్ యాంగిల్లో ఆలోచన చేస్తున్న వారే కన్పిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నంత వరకూ ఫర్వాలేదు కానీ.. రాజకీయంగా.. పార్టీ పరంగా చూసుకుంటే ఈ తరహా మనస్తత్వాలు ఉన్న వాళ్లు పార్టీని రన్ చేయడంలో కీలకంగా మారితే అది పార్టీకి అత్యంత ప్రమాదకర అంశంగా మారుతుందనేది చాలా మందిలో కన్పిస్తున్న ఆందోళన. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఎలా ఉన్నా.. పార్టీలో మాత్రం సీనియర్, జూనియర్ కాంబినేషన్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు బలంగా వస్తున్నాయి. సీనియర్ల గైడెన్సుతో జూనియర్లు పని చేస్తే.. వారి అనుభవం.. వీరి ఉత్సాహం కలిసి పార్టీ అన్ని రకాలుగా నిలకడగా పరుగులు పెడుతుంది. సీనియర్ల పర్యవేక్షణలో జూనియర్లు పని చేస్తారు కాబట్టి.. కొంత కాలానికి జూనియర్లు కూడా అనుభవం గడిస్తారని అంటున్నారు. అయితే ఇవన్నీ చాలా మంది మనస్సులో ఉన్న ఆలోచనలు. వారు ఇస్తున్న ఫీడ్ బ్యాక్.. దీన్ని పార్టీ అధిష్టానం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియడం లేదంటున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే మహానాడులో కడప బాంబులు పేలతాయేమోననే ఆందోళన కన్పిస్తోంది

 మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ 

ప్రియుడి మోజులో పడి  మీరట్ యువతి  ముస్కాన్ తన భర్తను హత్య చేసిన కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ గర్బవతి అని నిర్దారణ అయ్యింది. జైలులో ఆమె కు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ సంగతి తెలిసింది. భర్త కొన్నేళ్ల నుంచి లండన్ లో ఉండగా ముస్కాన్ గర్బవతి కావడం చర్చనీయాంశమైంది.  29 ఏళ్ల రాజ్ పుత్  లండన్ లో   మర్చంట్ నేవీ అధికారి. చాలా సంవత్సరాలనుంచి లండన్ లోనే ఉన్న రాజ్ పుత్ ఇటీవల ఇండియాకు వచ్చి హత్యకు గురయ్యాడు. తన భర్తను హత్య చేసింది తాను తన ప్రియుడు అని ముస్కాన్ అంగీకరించింది. దేశవ్యాప్తంగా మీరట్ మర్డర్ కేసు సంచలనమైంది.

జంటపేలుళ్ల నిందితులకు ఉరి.. హైకోర్టు తీర్పును స్వాగతించిన కేంద్ర మంత్రి

దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ హైకోర్టు పేర్కనడాన్ని ఆయన హర్షించారు. ప్రజాస్వమ్యంలో హింసకు, ఉగ్రవాదానికి చోటు లేదని హైకోర్టు తీర్పుద్వారా మరో సారి స్పష్టమైందని కిషన్ రెడ్డి అన్నారు.  పుష్కర కాలంగా దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్లు ఆ పెలుళ్ల బాధితులను ఓ పీడకలగా వెంటాడుతున్నాయన్న ఆయన.. ఎట్టకేలకు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు జీరో లోలరెన్స విధానంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు.  జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించింది.ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందిని కిషన్ రెడ్డి అభినందించారు. 

హెలికాప్టర్ లో వచ్చి.. కారులో తిరిగి వెళ్లిన జగన్.. ఎందుకో తెలుసా?

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాపిరెడ్డి పల్లిలలో మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం (ఏప్రిల్ 8) జరిపిన పర్యటన పెద్ద ప్రహసనంగా మారింది. ఇటీవల హత్యకు గురైన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్, హెలికాప్టర్ లో వచ్చి, కారులో తిరిగి బెంగళూరు వెళ్లారు.  హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో హెలిపాడ్ మీదకు చొచ్చుకుపోగా, ల్యాండింగ్ సమస్య తలెత్తింది. రెండో ప్రయత్నంలో హెలికాప్టర్ ల్యాండ్ కాగా, చుట్టుముట్టిన కార్యకర్తలు బలవంతంగా డోర్ లాగారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు కానీ పైలట్ డోర్ లాగడంతో కిందపడ్డ పైలెట్ బ్యాగ్ ను ఎవరో ఎత్తుకు పోయారంటున్నారు. జగన్ దిగిన వెంటనే హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. సాంకేతిక సమస్యల వల్ల హెలికాప్టర్ బదులు కారులోనే జనగ్ బెంగళూరుకు వెళ్లిపోయారని చెబుతున్నారు. హెలికాప్టర్ డోరుకు ఎయిర్ బ్రేక్ వచ్చిందని వైపీపీకి చెందిన వారు ఓ ఫొటో ప్రచారంలో పెట్టారు. జగన్ యథావిధిగా బాధితుల పరామర్శ కన్నా, పబ్లిక్ల లో ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించి, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. దీంతో గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వచ్చినప్పుడు మిర్చి ఎత్తుకు పోయిన సంఘటనను జనం గుర్తు చేసుకుని వీళ్లు మారరని నిట్టూర్పు విడుస్తున్నారు.   

అలేఖ్య పికిల్స్ వివాదం పై చెల్లి  సుమ స్పందన

అలేఖ్య పికిల్స్ వివాదం గత నాలుగోజులుగా నలుగుతూనే ఉంది. అలేఖ్య బూతుపురాణం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. అదే సమయంలో ముగ్గురు అక్కా చెల్లెల్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఈ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  అలేఖ్య ఆరోగ్యం క్షీణించి ఐసియులో చేరింది. దీని సంబంధించిన వీడియో ఒకటి అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో అలేఖ్య మీద ట్రోలింగ్ హద్దులు మీరిందని సుమ అంటున్నారు. అలేఖ్య ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి లేదని ఆమె అంటోంది. ట్రోలర్స్ తమ తండ్రి ఫోటోను కూడా వాడుకునే స్థితికి దిగజారిపోయారన్నారు. మూడు నెలల క్రితమే తమ తండ్రి చనిపోయిన దుఖంలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.  మా ఇంట్లో మరో చావు చూడకూడదని అనుకుంటున్నాము అని ఆమె అన్నారు. ఆడపిల్లను టార్గెట్ చేశారని ఆమె రోదిస్తూ చెప్పారు. మమ్మల్ని బతకనివ్వరా మా అక్కకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ట్రోలర్స్ దేనని  సుమ హైచ్చరించారు.

ఆలోచనల్లో ఆకాశం.. ప్రజలతో మమేకం.. నయా చంద్రబాబు

నాలుగుదశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ ఆయనలో మారిన మనిషి ప్రస్షుటంగా కనిపిస్తున్నారు. సాంకేతికతను సుపరిపాలనకు కీలక ఇరుసుగా మార్చిన చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పలువురు జాతీయ నాయకులతో ఆయనకు సన్నిహిత పరిచయాలున్నాయి. ప్రపంచ కుబేరులు, పారిశ్రామిక దిగ్గజాలతో ఆయనకు నేరుగా పరిచయాలు ఉన్నాయి.   హైదారబాద్ అభివృద్ధి ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర ఉంటుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత కచ్చిదంగా చంద్రబాబుదే. హైటెక్ సిటీ అంటే, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రబాబు నాయుడే గుర్తుకు వస్తారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆయన ప్రత్యర్థులు సైతం ఆ విషయాన్ని ఎలాంటి సంకోచం, భేషజాలూ లేకుండా అంగీకరిస్తాయి.  రాష్ట్ర విభజన తర్వాత కూడా  తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోందన్నా, అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నా చంద్రబాబు చలవే, దార్శనికతే కారణం అనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనహైదరాబాద్ లోఐటీ రంగ అభివృద్ధి కోసం చేసిన కృషి, చూపిన పట్టుదల పడిన శ్రమ వల్లనే   మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరాయి. ఈ రోజు  హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది అంటే చంద్రబాబు  విజన్ 2020 యే కారణం.  అయితే ఈ క్రమంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కంటే.. అభివృద్ధి దార్శనికుడిగానే వ్యవహరించారు. దాంతో రాజకీయంగా ఒకింత నష్టపోయిన సంగతి ఎవరూ కాదనలేరు. హైటెక్ సీఎం అన్నది ఆయనకు ఒక పొగడ్త, ప్రశంసగానే కాకుండా విమర్శగా కూడా మారింది. చంద్రబాబు అంటే ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆలోచిస్తారు. అందుకోసం కార్యాచరణ రూపకల్పన చేస్తారు. అమలు చేస్తారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనే అంటారు. ప్రజలతో మమేకం కారన్న అపప్రధ అయనపై ఉంది. కార్యర్తలకు, పార్టీ నేతలకు పెద్దగా సమయం ఇవ్వరనీ, ఆయన దృష్టంతా పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిపైనే ఉంటుందని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి. ఈ క్రమంలో పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మారారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, దార్శనికత ఉన్న ఆయన ఎటువంటి సంకోచం లేకుండా ప్రజలతో మమేకం అవుతున్నారు. పేదల ఇళ్లలోకి నేరుగా వెళ్లి వాళ్లకు తానే స్వయంగా టీ పెట్టి తన స్వహస్తాలతో అంది స్తున్నారు. ఇంత కాలం ప్రజలను కలవకుండా వారి బాగు, ప్రగతి కోసమే పరితపించిన చంద్ర బాబు ఇప్పుడు వారి బాగోగులను స్వయంగా పట్టించుకోవడమే కాకుండా వారితో మమేకమౌతున్నారు. ఈ మార్పు చంద్రబాబును ప్రజలకు మరింత చేరువ చేస్తున్నదనడంలో సందేహం లేదు. ఇది తెలు గుదేశం పార్టీకి కూడా ఒక సానుకూల అంశంగా మారుతున్నది. గతంలో చంద్రబాబు ఎంత ప్రజలకు ఇంకా ఏంచేయగలం అన్న ప్రణాళికలు రూపొందిస్తూ, అధికారులతో సమీక్షలతో బిజీబిజీగా ఉంటూ జనానికి అందుబాటులోకి వచ్చే వారు కాదు. ఆ కారణంగానే ప్రభుత్వం, పార్టీ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బాబు పూర్తిగా మారి.. ఒకే సమయంలో ప్రగతి పథక రచనలు, ప్రజలతో మమేకమవ్వడానికి సమయం కేటాయించడం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం మధ్య గ్యాప్ వచ్చే అవకాశాలు లేకుండా పోవడమే కాకుండా ప్రజలతో  చంద్రబాబు మమేకం కావడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  

పలాస వద్ద రెండుగా విడిపోయిన ఫలక్ నూమా ఏక్స్ ప్రెస్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

సికింద్రాబాద్  హౌరా జంక్షన్  ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తృటిలొ పెను ప్రమాదం తప్పింది.    శ్రీకాకుళం సమీపంలో  ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అది కూడా సరిగ్గా మధ్యలో అంటే రైలు రెండు భాగాలుగా విడిపోయింది.  దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన రైలు డ్రైవర్ సకాలంలో స్పందించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.  శ్రీకాకుళం జిల్లా పసాల సమీపంలో ఈ సంఘటన జరిగింది.  ఈ ఘటనలో ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదు.  సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రయాణ మధ్యలో బోగీలు విడిపోయిన సంఘటనను సీరియస్ గా తీసుకున్న రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.  

అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు.. చంద్రబాబు, జగన్ దిగ్భ్రాంతి

సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో మార్క్ శకంర్ తో పాటు పలువురు విద్యార్థలు గాయపడ్డారు. కాగా పవన్ కల్యాణ్ కుమాడురు అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తదితరులు తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలియగానే చాలా ఆందోళన చెందానని ఎక్స్ వేదికగా పేర్కొన్న ముఖ్యంమంత్రి చంద్రబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మంత్రి లోకేష్ కూడా పవన్ కల్యాణ్ కుమారుడు అగ్ని ప్రమాదఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో పవన్ కల్యాణ్ కు ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ కుమారుడికి గాయలపై  స్పందించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.  అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా పవన్ కుమారుడికి గాయలపై ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

తమిళనాడు గవర్నర్ కు సుప్రీం షాక్!

గవర్నర్‌ అధికారాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలకు పంపడాన్ని సవాల్ చేస్తూ స్టాలిన్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.    ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా,  వాటిని రాష్ట్రపతికి పంపడాన్ని  చట్టవిరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని సుప్రీం కోర్టు పేర్కొంది.  ఈ పది బిల్లులను  గవర్నర్ ఒక సారి తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని మరోసారి గవర్నర్ కు పంపింది. అలా రెండో సారి గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పది బిల్లులూ గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీ నుంచే ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని   జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతొ కూడిన ధర్మాసనం మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు చెప్పింది. గవర్నర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొంది.  అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెంటనే క్లియర్ చేయాల్సి ఉందనీ, అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే బిల్లులను ఆమోదించలేదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బిల్లులను రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు ఆయన  ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపివేయవచ్చు. కొన్ని సవరణలతో బిల్లును తిరిగి శాసనసభకు పంపవచ్చు. అయితే, శాసనసభ తిరిగి అంటే రెండో సారిఆమోదించి పంపితే గవర్నర్ తప్పనిసరిగా దానికి ఆమోదం తెలపాలి.  అయితే తమిళనాడు గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరించారని కోర్టు తప్పుపట్టింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తీసుకునే ప్రతి చర్యను కోర్టు సమీక్షించవచ్చునని పేర్కొంది.  

పోలీసుల విచారణలో మాట మార్చిన వైకాపా నేత బెన్నిలింగం

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న వైకాపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు బెన్నిలింగం పూటకో మాట మాట్లాడుతున్నారు.  పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యే నని , ఇందులో అనుమానాలకు తావు లేదని చెప్పిన బెన్నిలింగం పోలీసుల విచారణలో  మాత్రం మాట మార్చారు. ఇటీవల ఆయన రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ ‘‘ పాస్టర్ ప్రవీణ్ ది హత్యే. అందులో అనుమానమే లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఉచకోత కోస్తాం, మమ్మల్ని కెలకొద్దు, మేం మంచి వాళ్లం కాదు. మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు’అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బెన్నిలింగంపై కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు  ఆయనకు నోటీసులు జారి చేశారు. ఈ నోటీసులు అందుకున్న బెన్నిలింగం పోలీసుల విచారణకు హాజరయ్యారు పోలీసుల విచారణకు హాజరైన బెన్నిలింగం మాట మార్చారు.  తనది నరం లేని నాలుక అని నిరూపించే విధంగా ఆవేశంతో  ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.  పోలీసుల ప్రశ్నలకు బెన్నిలింగం నీళ్లు నమిలారు. బెన్నిలింగం సమాధానాలను పోలీసులు వ్రాతపూర్వకంగా స్వీకరించారు. మత కలహాలు ప్రేరేపించే  వ్యాఖ్యలు చేసిన బెన్నిలింగం తాను చెప్పిన మాటలకే కట్టుబడి లేకపోవడం చర్చనీయాంశమైంది. 

 నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పున: ప్రారంభం

ఎపిలో ఎన్టీఆర్ వైద్య సేవలు యదాతధంగా అమలు కానున్నాయి. వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం( ఆశా)  ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర చర్చలు జరిపి వైద్య సేవలు పునరుద్దరించింది. రూ 500 కోట్ల బకాయలను చెల్లించడానికి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారి చేయడంతో ఈ ప్రతిష్టంభన ముగిసింది.  మంగళవారం  ఎన్టీఆర్ వైద్య సేవలు పున: ప్రారంభమయ్యాయి.  రూ 3, 500 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అనంతరం  ఈ ప్రతినిధులు వైధ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చలు జరిపారు. మంగళవారం తక్షణ సాయం క్రింద రూ 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు కృష్ణబాబు ఆశ ప్రతినిధులకు హామి ఇచ్చారు. దీంతో ఆశ సంఘం వైద్య సేవలను పున:రుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. 

ట్రంప్ సుంకాల దెబ్బకు ఆంధ్ర రొయ్యల రైతులు ఫ్రై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఏపీ ఆక్వా రైతులపై పడింది. ట్రంప్ వేసిన ట్యాక్సులు మేం కట్టలేం బాబో అని మన వ్యాపారులు చేతులెత్తేశారు. ఇప్పటికే లక్షలు, కోట్లలో నష్టపోయామని, ఇప్పట్లో రొయ్యలు కొనలేమని తెగేసి చెబుతున్నారు. మరి కొంత మంది రొయ్యల రేట్లు తగ్గించి మరీ కొంటున్నారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే ఆక్వా ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులపై ఈ నిర్ణయం ప్రభావం గట్టిగా పడింది.  ఇంపోర్ట్ టారిఫ్ భారం మన ఆక్వా రైతులపై డైరెక్ట్‌గా పడుతుండటంతో ఇప్పటికే తాము చాలా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు.  ట్రంప్ టారిఫ్ దెబ్బకు భీమవరం, పాలకొల్లు, పెద్దాపురం, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లోని ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలను కొనుగోలు చేయడం మానేశాయి. రైతులు ప్రాధేయపడితే మార్కెట్ ధర మీద 30 రూపాయల నుంచి 90 రూపాయల వరకు తగ్గించి కొంటున్నారు. దీని వల్ల చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  మరోవైపు ఏప్రిల్‌ మొదటి వారంలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు ఆక్వా ప్రొడక్ట్స్‌తో 2 వేల షిప్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2500 షిప్‌మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3500 షిప్‌మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు చెబుతున్నారు. అమెరికా కొత్తగా విధించిన ఇంపోర్ట్ టారిఫ్ ప్రకారం లెక్కిస్తే వీటిపై నష్టభారం 600 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కస్టమర్లపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఓ పక్క వ్యాధులు, మరోపక్క ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం మింగుడు పడటం లేదు. భారత్‌ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో, గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్ఠంగా రూ.40 వరకు పడిపోయింది. భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం. ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏటా ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా, 3.5 లక్షల టన్నుల వరకు విదేశాలకు పంపిస్తున్నారు. మొత్తంగా రూ.18 వేల కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటే అధికం. ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. బుధవారం 100 కౌంట్‌ రొయ్య ధర కిలో రూ.240 ఉండగా, గురువారం రూ.200కి తగ్గిపోయింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే, ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్ఠంగా కిలోకు రూ.30-40 వరకు తగ్గించారు. కొన్నిచోట్ల కొనుగోళ్లు లేవని, ట్రేడర్లు ముందుకు రాలేదని రైతులు వాపోయారు. సాగుదారులపైనే కాదు, ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని ట్రేడర్లు చెబుతున్నారు.

అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నారు. అతడు చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. అతడి చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. అదే విధంగా అగ్నిప్రమాదం కారణంగా వచ్చిన దట్టమైన పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో ఉక్కిరిబిక్కిరై ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో పాఠశాల సిబ్బంది మార్క్ శంకర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కోలుకుంటున్నారు.  అగ్నిప్రమాదంలో తన చిన్న కుమారుడు గాయపడిన సంగతి  అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్  తెలిసింది. పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లాల్సిందిగా పవన్ కు అధికారులు, పార్టీ నేతలూ సూచించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శించి, వారి సమస్యలు తెలుసుకున్న తరువాత వెడతానని తెలిపారు. అలాగే కురిడి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉందనీ వాటిని కూడా పూర్తి చేసిన తరువాత విశాఖ చేరుకుని అక్కడ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.