తెలంగాణను 'హైటెక్ స్టేట్' గా మారుస్తున్న మంత్రి కేటీఆర్!!

రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కేటీఆర్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న కంపెనీల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరీంనగర్ ఐటీ హబ్ ను ఈ నెల పధ్ధెనిమిదిన ప్రారంభించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ కంపెనీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.  హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పరిశ్రమలు, ఐటీ శాఖలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని కెటిఆర్ తెలిపారు. టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కులు, ఇతర మౌలిక వసతుల కల్పన, సంబంధిత కార్యక్రమాలపై కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బండమైలారం, బండ తిమ్మాపూర్ వంటి పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. టీహబ్ రెండవ దశ భవనం త్వరలోనే పూర్తవుతుందని కేటీఆర్ చెప్పారు. దీంతో అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. జూలైలో ప్రోటో టైపింగ్ సెంటర్ కూడా ఏర్పాటవుతోందని తెలిపారు.  హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేటీఆర్ తెలిపారు. ఆ మేరకు పార్కుల అభివృద్ధి, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని ఇప్పటికే వరంగల్ నగరంలో పలు ప్రముఖ కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం కేసీఆర్...

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో బస చేసిన కేసీఆర్ కాసేపట్లో హెలిక్యాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. నీటి నిల్వకు సంబంధించి అధికారులతో సమీక్ష చేస్తారు. తుపాకులగూడెం ఆనకట్టను కేసీఆర్ పరిశీలించనున్నారు, తుపాకులగూడెం రిజర్వాయరకు సమ్మక్క బ్యారేజీగా పేరు పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.  హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరిన కేసీఆర్ కరీంనగర్ చేరుకున్నారు, రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో బస చేశారు, ఉదయం హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మి ఆనకట్టను పరిశీలించనున్నారు. ఆనకట్టలో నదీ జలాల నిల్వ తీరు, ఆనకట్టకు సంబంధించిన విషయాలు ఇతరత్రా అంశాలపై అక్కడే ఇంజినీరులు అధికారులతో సమీక్షించనున్నారు. గోదావరి నదితో పాటు పరిసర ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా సీఎం పరిశీలిస్తారు. లక్ష్మి ఆనకట్టతో పాటు సరస్వతి, పార్వతి ఆనకట్టల నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వకు సంబంధించి అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు.  అంతకుముందు కాళేశ్వరం టూర్ పై ప్రగతి భవన్ లో సంబంధిత అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటుందన్న కేసీఆర్.. బ్యారేజ్ లు నిండు కుండల్లా మారాయి అన్నారు. రానున్న వానాకాలం నుంచి వరదనీటి ప్రవాహం పెరుగుతుంది అన్నారు, ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజికి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోసి అటు నుంచి కాలువలకు మళ్లించే దిశగా ఇరిగేషన్ శాఖ ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.  

ఆ విషయంలో జగన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన ప్రధాని మోడీ...

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చర్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ప్రధాని మోదీ సీఎం వైఎస్ జగన్ వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంపై వారిలో అపనమ్మకం ఏర్పడిందని ఇటీవలి దావోస్ సదస్సులోనూ పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ ప్రధానితో దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష కేంద్రం ఉత్తర్వులిచ్చినా, హైకోర్టు ఆదేశించినా విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవటం, కియా మోటర్స్ యాజమాన్యానికి బెదిరింపులు దీంతో ఆ సంస్థ తమిళనాడుకు తరలిపోనుందని వస్తున్న వార్తలు మొదలైన అంశాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ లు వెనుకాడుతున్నారని దీని ప్రభావం దేశ వ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణంపై ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో విదేశీ పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాష్ట్రాలు తిరోగమన విధానాలు అవలంబించడం సరైంది కాదని చెప్పారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికినట్లు సమాచారం. ప్రధానంగా రాష్ట్రం నుంచి కియా మోటార్స్ ప్రాజెక్టు తరలిపోనుందని వచ్చిన వార్తలపై ఆరా తీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు, చిన్న చిన్న కాంట్రాక్టు విషయంలో కియా యాజమాన్యాన్ని వైసీపీ నేతలు ముఖ్యంగా హిందూపురం వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ బెదిరించినట్లు విమర్శలు రేగుతున్న నేపథ్యంలో మాధవ్ ను సీఎం తన వెంట ప్రధాని నివాసానికి తీసుకెళ్లడం గమనార్హం. జగన్ వినతి పత్రం సమర్పించి ఒక్కో అంశాన్ని వివరిస్తున్నప్పుడు ప్రధాని దాదాపు మౌనం పాటించినట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం పార్లమెంట్ లో చెప్పిన తర్వాత కూడా దానిని సీఎం తన వద్ద ప్రస్తావించటంతో మోదీ సీరియస్ గా విన్నట్లు తెలిసింది. పరిపాలన వికేంద్రీకరణ కోసం తాము మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని జగన్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి మరో వెయ్యి కోట్ల రూపాయలు ఉందని ప్రధానిని కోరటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్నూలును జుడీషియల్ రాజధానిగా మార్చాలని నిర్ణయించామని చెప్పిన జగన్ హైకోర్డు ప్రధాన బెంచ్ ను కర్నూలుకు తరలించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.  ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించాలని ప్రధాని సూచించినట్లు తెలిసింది. షాను కలిసేందుకు జగన్ ఒకట్రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ రానున్నట్లు సమాచారం. కాగా వినతిపత్రంలోని విషయాలను వివరించాక జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసులను ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం మూడు గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ను వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, వంగా గీత, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, తలారి రంగయ్య, బల్లి దుర్గా ప్రసాద్, రెడ్డెప్ప, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏ వ్యాఖ్యలైనా చెయ్యాలి అని మాధవ్ కు సీఎం అందరి సమక్షంలో సూచించినట్టు తెలిసింది. సీఎం వెంట ప్రధాని నివాసానికి మాధవ్ తప్ప ఎంపీలెవరూ వెళ్లలేదు. ఎలాగూ తనను ప్రధాని వద్దకు జగన్ తీసుకెళ్లరు అలాంటప్పుడు వెళ్లి పడిగాపులు కాయడం ఎందుకని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.

తమిళనాట కలకలం రేపుతోన్న జగన్ పోస్టర్...

ఆంధ్రప్రదేశ్‌‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మధ్యలో తమిళ స్టార్ హీరో విజయ్. ఈ ముగ్గురు ఫొటోలతో వెలిసిన పోస్టర్లు, తమిళనాట సంచలనంగా మారాయి. జగన్, పీకే ఇద్దరూ కలిసి, విజయ్‌కు ఏదో చెబుతున్నట్టుగా పోస్టర్లలో కనిపిస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ను మేం కాపాడుకున్నాం... తమిళనాడును మీరే కాపాడాలంటూ...జగన్‌, పీకేలు విజయ్‌కు చెబుతున్నట్టు పోస్టర్లపై రాశారు. దాంతో, ఈ పోస్టర్ తమిళనాట కలకలం రేపుతోంది. విజయ్ నివాసాలు, కార్యాలయాలపై ఐటీ రైడ్స్ ప్రకంపనలు రేపుతున్నవేళ పలుచోట్ల వెలిసిన పోస్టర్లు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదేదో ఆకతాయిల పనైనట్టుగా అనిపిస్తున్నా, దీని వెనక అర్థాలు చాలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హీరో విజయ్‌ నివాసాలు, కార్యాలయాలపై ఇటీవలే ఆదాయపన్నుశాఖ అధికారులు రైడ్స్ చేశారు. అనంతరం నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఐటీ రైడ్స్ పై విజయ్ ఘాటుగా స్పందించాడు. రజనీకాంత్‌లాగా సీఏఏకు అనుకూలంగా మాట్లాడి, ఐటీ దాడుల నుంచి తప్పించుకోగలను, కానీ తాను భారత రాజ్యాంగానికి బద్దున్ని, అలాగే చట్ట విరుద్ధంగా తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ చేసిన ఆ వ్యాఖ్యలు రచ్చరచ్చ చేశాయి. దాంతో, తమ అభిమాన హీరోను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకే, విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధురైతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లు వెలుస్తున్నాయి. అయితే, విజయ్‌-బీజేపీ సమరం ఇఫ్పటిది కాదు. చాలాకాలం నుంచి సాగుతున్నదే. అదిరింది మూవీలో, బీజేపీకి వ్యతిరేకంగా విజయ్ డైలాగ్స్ చెప్పాడు. చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందించలేని, చేతకాని ప్రభుత్వాలంటూ, యూపీ యోగి సర్కారుపై పరోక్షంగా చెలరేగిపోయారు. అది వివాదాస్పదమవడంతో చివరికి ఆ డైలాగ్‌ను కట్‌ చేశారు. ఇఫ్పుడు తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు, రజనీకాంత్, కమల్‌హాసన్‌లు ప్రయత్నిస్తున్నారు. రజనీ అయితే, బీజేపీతో కలిసి సాగేందుకు సంకేతమిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడులో విశేష అభిమానులున్న విజయ్‌ సైతం, పాలిటిక్స్‌లోకి రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకే రజనీకాంత్‌‌కు ఎక్కడ పోటీ అవుతాడోనన్న భావనతోనే ...విజయ్‌కు వ్యతిరేకంగా బీజేపీ పావులు కదుపుతోందన్న చర్చ జరుగుతోంది. విజయ్‌పై క్రిస్టియన్‌ అన్న ముద్ర వేసేందుకు, బ్లాక్‌మనీ దాచుకున్నాడని ఆరోపించేందుకు అన్ని అస్త్రాలనూ సంధిస్తోందన్న మాటలు వినపడ్తున్నాయి. మొత్తానికి విజయ్‌ సైతం రాజకీయాల్లోకి రావాలని తపిస్తున్న అభిమానులు, విజయాల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌‌తో కలిసి పని చేయాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే అక్కడక్కడా పోస్టర్లు అతికిస్తున్నారు. పీకే, విజయ్‌లిద్దరికీ బీజేపీ ఉమ్మడి శత్రువు కావడంతో, ఇద్దరూ కలిసి ఏపీ, ఢిల్లీ తరహాలో విజయఢంకా మోగించాలని కోరుకుంటున్నారు. ఏపీలో రావాలి జగన్-కావాలి జగన్ అంటూ.... ఢిల్లీలో లగే రహో కేజ్రీవాల్ అంటూ సరికొత్త నినాదాలను అందించి విజయాలను చేకూర్చిపెట్టిన పీకే... తమిళనాట కూడా విజయ్ కి విజయాన్ని అందించాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి, ఫ్యాన్ మాటను విజయ్ వింటారో లేదో చూడాలి.

కేటీఆర్ పేరు చెబితేనే వణుకుతున్న టీఆర్ఎస్ సీనియర్లు.!

గులాబీ వనంలో సీనియర్లకు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్నారు. తమ ఫ్యూచరేంటని కంగారు పడుతున్నారు. ఇంతకీ ఈ సీనియర్ల కంగారుకు కేటీఆరే కారణమట. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోవడం... మరోవైపు త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారంతో నేతలంతా చిన్న బాస్ చుట్టూనే తిరుగుతున్నారు. అంతేకాదు, ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ కేటీఆర్ హవానే కొనసాగుతుండటంతో సీనియర్లలో ఆందోళన మొదలైందట. ఇటీవల జరిగిన చీఫ్ సెక్రటరీ నియామకం దగ్గర్నుంచి... ఐఏఎస్ ల బదిలీల వరకు కేటీఆర్ మార్క్ కనపడిందని, అదే, ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ల గుబులు కారణమంటున్నారు. యువ ఐఏఎస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో... పార్టీలో సీనియర్లకు భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు సీనియర్ నేతలు సైలెంట్ అయిపోయారు. మరికొందరు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించటం లేదు. ఇంకొందరైతే అసలు కనపడటమే మానేశారు. మరోవైపు ఓటమిపాలైన సీనియర్ల నియోజకవర్గాల్లో... ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ లో చేరటంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీ పుల్ పవర్స్ ఇవ్వటంతో నియోజకవర్గాల్లో ఈ నేతలు పూర్తిగా సైలెంట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డయనే చర్చ జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ లో మొదట్నుంచీ కేసీఆర్ కు వెన్నంటి ఉన్న మధుసూదనాచారికి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తొలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం దక్కింది. నాలుగున్నరేళ్లపాటు స్పీకర్ గా పనిచేసిన మధుసూధనాచారి 2018 ఎన్నికల్లో, ఓటమిపాలు కావడం ఆయనకు శాపంగా మారింది. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మండలి చైర్మన్ చేస్తారని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఇక దీనికి తోడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరటంతో మధుసూదనాచారి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక రాజకీయంగా ఆయన భవిష్యత్  ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ టీఆర్ఎస్ లోనే జరుగుతోంది. ఇక, మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయిందనే చర్చ జరుగుతోంది. నర్సన్న అని కేసీఆర్ ఆప్యాయంగా పిలిచే నాయిని ఎమ్మెల్సీ పదవి కాలం త్వరలోనే ముగియబోతోంది. అయితే ఆయనను మళ్లీ రెన్యువల్ చేయరనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా... ఆ తర్వాత మాత్రం ఆయన జిల్లాకే పరిమితమయ్యారు. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశాలకు ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటంతో తుమ్మల ఇటువైపు రావటం మానేశారు. మరో మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి తన అనుచరులను బరిలో నిలబడటం ఆయనకు మైనస్ గా మారింది. పార్టీలో తాను కొనసాగుతానని ప్రెస్ మీట్ పెట్టీ మరి చెప్పినా...ఆయన పట్ల పార్టీ హైకమాండ్ ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్ తన పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనకు...పార్టీకి మధ్య గ్యాప్ బాగానే పెరిగిందనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన భావించినా, ఇప్పుడు అపాయింట్ మెంట్ కూడా దొరకటం లేదన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మరో నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరేటప్పుడు ఏదో ఒక పదవి ఆశించే చేరారు. కానీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవీ దక్కకపోవడంతో, ఆయనా మౌనంగానే వున్నారు. ఓవైపు పార్టీ పూర్తిగా కేటీఆర్ కంట్రోల్ లోకి రావటంతో, టీఆర్ఎస్ లో చాలామంది సీనియర్ నేతలకు భవిష్యత్ లో పదవులు దక్కటం కష్టమేననన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముద్ర అటు పార్టీపై...ఇటు ప్రభుత్వంపై కనిపిస్తోంది. పార్టీ పదవుల్లో...ఎమ్మెల్సీల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ మార్క్ స్పష్టం. ఎమ్మెల్సీలు శంభిపూర్ రాజు,  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ లాంటి యువ నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడంతో పార్టీలో యువ తారక మంత్రం పనిచేస్తోందన్న వాదనా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీలో కూడా యువతరానికి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లేనన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది.

ప్రధాని మోదీకి వైఎస్ జగన్ కోరికల చిట్టా.. లిస్ట్ భారీగా ఉందిగా!!

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో దాదాపు 100 నిమిషాలసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి నివేదించిన ముఖ్యమంత్రి.. ఈమేరకు లేఖ అందించారు. లేఖలోని అంశాలను ప్రధానికి వివరించిన సీఎం.. ఉగాది రోజున 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని కోరారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం వైయస్‌.జగన్‌ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు  ఈ యేడాది మార్చి 25, ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి రావాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం  నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపిన సీఎం తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పుభూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్రమంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా కోరిన సీఎం 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వినతిపత్రంలో వెల్లడించిన సీఎం ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ,పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని,  ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపిన సీఎం కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55549 కోట్లగా ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధానికి తెలిపిన సీఎం దీనికి పరిపాలనా పరమైన అనుమతులు ఇంకా రాలేదని,  ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపగలరని ముఖ్యమంత్రి వినతి పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని,  ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి.  ప్రత్యేక హోదా  అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన సీఎం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని వినతిపత్రంలో పేర్కొన్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించిన సీఎం దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని కోరిన సీఎం  రెవెన్యూలోటు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని,  ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని,  వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించగలరంటూ ప్రధానిని కోరిన సీఎం.  గ్రాంట్లు విడుదల  ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని ముందు ఉంచిన సీఎం.  పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి.  కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని వినతి కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరిన సీఎం  రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరిన సీఎం. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు -- గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు  మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి  కేటాయింపులు కూడా లేవని,  రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని గట్టిగా కోరిన సీఎం.  అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి తెలిపిన సీఎం. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం.  ఈమేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి.  రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడి.  ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని వెల్లడి.  దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపిన సీఎం. శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్న సీఎం గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందన్న సీఎం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్న సీఎం ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందన్న సీఎం తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి వివరించిన సీఎం.  మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి.

మరో దిశా కేసు నమోదు... కాలేజ్ వద్ద యువతితో అసభ్య ప్రవర్తన!!

విశాఖపట్నం మాడుగుల పోలీస్ స్టేషన్ లో దిశ కేసు నమోదైంది. గోపాలపట్నంలోని కెజె పురం కు చెందిన ఓ యువతి ని అదే గ్రామానికి చెందిన ఎల్లపు గణేష్, బోడ్డెటి అశోక్ పై ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం  చైతన్య కళాశాల వద్ద తనపై వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. దిశ యాప్ ద్వారా యువతి పోలీసులు కు పిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలు దిశ యాప్ ని బాగానే ఉపయోగిస్తున్నారు. దిశా యాప్ వచ్చిన తరువాత.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తొలి కేసు నమోదైంది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తున్న మహిళను ఓ వ్యక్తి వేధించాడు. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, వెంటనే ఆమె దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు 7 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి దగ్గరికి చేరుకొని.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు చర్యలు తీసుకోవడంతో.. మహిళలకు దిశా యాప్ పై నమ్మకం పెరిగింది. దీంతో ఆపదలో ఉన్నప్పుడు దిశా యాప్ ని ఉపయోగిస్తున్నారు. మొత్తానికి దిశా యాప్ పుణ్యమా అని ఆకతాయిలు గుండెల్లో భయం మొదలైంది.

మహిళా కానిస్టేబుల్ అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త!

ప్రకాశం జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ నిర్వాకాన్ని ఆర్మీలో పనిచేస్తోన్న ఆమె భర్త బయటపెట్టాడు. వేటపాలెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సునిల్ రాజ్.. ప్రియుడు అబిషేక్ తో కలసి ఉండగా ఆమెను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. భార్యపై వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, సునిల్ రాజ్.. ఆర్మీలో పనిచేస్తున్నాడని, కాశ్మీర్ లో ఉంటున్నాడని సమాచారం. కానిస్టేబుల్, అందులోనూ ఆర్మీ ఉద్యోగి భార్య అయ్యుండి ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం ఏంటని ఆమెపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడులో ఏపీ సీఎం జగన్‌ పోస్టర్లు.. హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ

ఆంధ్రాను కాపాడమని విజయ్‌కు జగన్‌, పీకే చెబుతున్నట్లు పోస్టర్లు విజయ్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నట్లు వ్యాఖ్యలు తమిళనాడుని విజయ్‌ కాపాడాలంటోన్న అభిమానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉన్న పలు పోస్టర్లు తమిళనాడులో వెలిశాయి. 'రావాలి విజయ్..కావాలి విజయ్' అనే నినాదంతో సినీ హీరో విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోస్టర్లలో జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండడం గమనార్హం. వీరిద్దరు కలిసి విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు ఆ పోస్టర్లు ఉన్నాయి.   ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాము ఏపీకి కాపాడుకున్నామని, ఇప్పుడు తమిళనాడును కాపాడుకోవడానికి విజయ్‌ కావాలని జగన్, పీకే కలిసి విజయ్‌కు చెబుతున్నట్లు ఈ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.  కాగా, ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్‌తో విజయ్‌ చర్చలు జరిపాడన్న ప్రచారం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే మండిపడుతోన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో  వైఎస్‌ జగన్‌ బొమ్మ ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వీటిపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా, కొందరు విమర్శలు చేస్తున్నారు.

విద్యార్థిపై టీచర్‌ ప్రతాపం.. చర్మం ఎర్రగా కందిపోయింది!

హైదరాబాద్ నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఎన్. సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ లో ప్లాస్టిక్ స్కేల్ తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో.. విద్యార్థి చర్మం ఎర్రగా కందిపోయింది. నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోని టీచర్.. రాక్షసంగా అరగంట పాటు కొట్టిందని.. ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలిపాడు.  టీచర్‌ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకొండి అంటూ బెదిరించారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. ‘క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించి.. ఆ టీచర్‌పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

అల ఏపీఎస్ ఆర్టీసీలో.. అంతా అయోమయం!!

ఎన్ని సంస్కరణలు చేపట్టినా ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలను నివారించ లేకపోతోంది ప్రభుత్వం. వివిధ వర్గాలు ఇచ్చే రాయితీలు చార్జీల పెంపులో రాజకీయ కోణం వెరసి ఆర్టీసిని నష్టాల్లోనే కొనసాగేలా చేస్తోంది. కొత్త సర్వీసులను నడిపేందుకు ముందుకు రావడం లేదు. దీంతో యాజమాన్యం నష్టాల్ని తగ్గించుకోవటానికే అనేక రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేటు బస్సులను నడిపేందుకు అనుమతించేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఆర్టీసీ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులు దీనిపై కార్యాచరణ సిద్ధం చేసి అవి చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా బస్సుల్ని నడిపించడం కష్టమనే అభిప్రాయంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఏటా వస్తున్న నష్టాలను అధిగమిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేమని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్, కాలేజీ బస్సులని ఆర్టీసీ రూట్లలో తిప్పేందుకు అనుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. వివిధ సంస్థల్లో సిబ్బందిని చేరవేసేందుకు నిర్దేశించిన బస్సులకు సైతం అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా విశాఖలో ఈ విధానాన్ని అమలు చేసి వచ్చే ఫలితాన్ని బట్టి రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్ధులను సిబ్బంది చేరవేసే బస్సులు మిగతా సమయాల్లో ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో బస్టాండ్ ల నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగేందుకు ఆర్టీసీ అనుమతివ్వనుంది. సమయాన్ని బట్టి రూట్లను ఎంచుకునే అవకాశాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకే ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది ప్రభుత్వంలో విలీనం కావడంతో వారికొచ్చే నష్టం ఉండదనే అభిప్రాయాన్ని కల్పించారు.  ప్రయాణికులని చేరవేయడంలో బస్సుల నిర్వహణ పై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో సమవేశాలు పూర్తయ్యాకే ముందుకొచ్చే ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సుల నిర్వహణకు అనుమతులు ఇచ్చే అవకాశమున్నట్లు తెలియజేశారు. ఆర్టీసీ ప్రతిపాదన పై కార్మిక సంఘాలు రవాణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం విద్యార్థులు సిబ్బందిని చేరవేసేందుకు మాత్రమే ఆయా బస్సులకు తాము పర్మిట్లు ఇచ్చామని దీనికి విరుద్ధంగా ప్రయాణికులను చేరవేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రైవేటు బస్సులు కాంట్రాక్టు సర్వీసులగా నిర్వహించేందుకు అనుమతులు ఉంటాయి తప్ప స్టేజి క్యారియర్ లుగా తిప్పడం సాధ్యపడదని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆర్టీసీని నిర్వీర్యం చేసే చర్యలను తాము సమర్థించమని కార్మిక సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉన్న నష్టాలను తుడిచిపెడుతుందో లేని కష్టాలను తెచ్చి పెడుతుందో అర్ధం కాక అందరిలో అయోమయం మొదలైయ్యింది.

ఏపీ డీజీపీకి హైకోర్టు నోటీసులు.. ఫిబ్రవరి 14న కోర్టుకి హాజరు కావాలి!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావాంగ్‌ ను.. ఫిబ్రవరి 14న హైకోర్టులో హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఈ మేరకు బుధవారం స్పందించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు.  హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయవిచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేశారు. నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇంగ్లీష్ మీడియం నిర్ణయానికి 45 వేలకు పైగా పాఠశాలల మద్దతు!!

ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సరైన నిర్ణయమే.. కానీ, తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగించడం సరికాదని విమర్శించాయి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో అసలు తెలుగు భాషనే మర్చిపోయే ప్రమాదముందని హెచ్చరించాయి. అయినా ఈ విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేయడం లేదు. ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, పేద విద్యార్థుల భవిష్యత్తు ఇంగ్లీష్ మీడియంతోనే మారుతుందని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు అందరి ఆమోదం ఉందని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తాజాగా ఇదే చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలు తమ అంగీకారాన్ని తెలియ చేస్తూ తీర్మానం చేశాయి. 45 వేల పై చిలుకు పాఠశాలల నుంచి ఈ తీర్మానాలు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం గురించి అంతా సానుకూలంగా నే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతా ఏకీభవిస్తూ, స్వాగతిస్తున్నామని చెప్పి తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలను అన్ని సచివాలయంలో ప్రదర్శనకు పెట్టామని మంత్రి తెలిపారు.

అక్రమాలకు పాల్పడితే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై!!

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు.   పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై సర్పంచ్‌లదే ఉంటుందన్నారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. సర్పంచ్ స్థానికంగా నివసించాలి, రోజు పంచాయితీ కార్యాలయానికి వెళ్లాలని అన్నారు. తాగునీటి అవసరాలు, ప్రకృతి వైపరిత్యాల నివారణకై సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే.. గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెడితే అనర్హత వేటు నిబంధన మున్సిపల్‌ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై చేస్తామని మంత్రి హెచ్చరించారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్... స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక,  స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15కల్లా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యానికి తావులేకుండా చేయాలని, ఒకవేళ ఏ అభ్యర్ధి అయినా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ దొరికితే అనర్హత వేటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం మూడేళ్ల శిక్షతోపాటు అనర్హత వేటు పడుతుందని గుర్తుచేశారు. ఇక, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13రోజుల నుంచి 15రోజులకు పొడిగించే చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

సినిమా కథ ఎందుకూ పనికి రాదు... ఇతని ప్రేమ ముందు... 

తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ప్రేమికులు ఎన్ని కష్టాలైనా పడతారు. ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు... ఇలా అన్నింటినీ దాటతారు. కుటుంబాన్ని ఎదిరిస్తారు. ఎవరు ఒప్పుకున్నా... ఒప్పుకోకపోయినా... చివరికి తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంటారు. వికారాబాద్ యువకుడు అలాంటి సాహసమే చేశాడు. తన ప్రేమ కోసం అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ యువకుడి పేరు బొబ్బిలి భాస్కర్... ఉండేది వికారాబాద్... డిగ్రీ వరకు చదువుకున్నాడు... అయితే, భాస్కర్... ఓ ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు... ఆ యువతి... భాస్కర్ కు చిన్ననాటి నుంచి తెలిసిన అమ్మాయే... స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ వరకు... ఒకే స్కూల్... ఒకే కాలేజీలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు... అమ్మాయి కూడా భాస్కర్ ను ప్రేమించింది... మొదట స్నేహంగా మొదలైన వీరిద్దరి అనుబంధం... ఆ తర్వాత పీకల్లోతు ప్రేమకు దారితీసింది... ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు ఇద్దరూ... భాస్కర్ ఇంటికి యువతి వచ్చిపోతూ ఉండేది... నువ్వు ముస్లిం అమ్మాయివి... మా ఇంటికి రావొద్దు... మా అబ్బాయిని ప్రేమించొద్దు... అంటూ భాస్కర్ కుటుంబ సభ్యులు చెప్పినా... నేను పెళ్లంటూ చేసుకుంటే... భాస్కరే చేసుకుంటానంటూ తన మనసులో మాటను చెప్పేది... అయితే, ఇద్దరూ డిగ్రీ చదువుతుండటంతో... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుని కలిసి బతకాలని అనుకున్నారు... అలా, రెండు మూడేళ్లు గడిచిపోయాయి... అయితే, వీళ్లిద్దరి ప్రేమకు మతం అడ్డొచ్చింది... భాస్కర్ హిందువు... అమ్మాయిది ముస్లిం... దాంతో, యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు... కానీ, తన ప్రేమను బతికించుకోవాలనుకున్న భాస్కర్... యువతి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు.... చివరికి, నువ్వు ఇస్లాం మతంలోకి మారితే, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామంటూ యువతి తల్లిదండ్రులు చెప్పడంతో... ఎలాగైనా తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. తన ప్రేమ కోసం ఏకంగా మతాన్నే మార్చుకున్నాడు.  తన ప్రేయసి చెప్పినట్లుగా తన పేరును మహ్మద్ అబ్దుల్ హునైన్ గా మార్చుకున్నాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించడమే కాకుండా తన పేరును మహ్మద్ అబ్దుల్ హునైన్‌గా మార్చుకున్న భాస్కర్‌ను చూసి అతని తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోయారు. భాస్కర్ కట్టూబొట్టు అంతా ముస్లింలా మారిపోయాడు. ఎంతలా అంటే, భాస్కర్ ను చూస్తే... ఇతను ఇంతకుముందు హిందువు అంటే నమ్మలేనంతగా మారిపోయాడు... అచ్చం ముస్లింలా మాదిరిగా గడ్డం పెంచుకున్నాడు... చాలా మంది ముస్లింలకు సైతంరాని ఇస్లాం ప్రవచనాలను, మహ్మద్ ప్రవక్త సారాన్ని నేర్చుకున్నాడు... మత మార్పిడి కోసం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ముస్లింగా మారినట్లు మత ధృవీకరణ పత్రాన్ని పొందాడు. పెళ్లికి అంతా సిద్ధం చేసుకుని యువతి ఇంటికి వచ్చాడు. అయితే, కథ ఇక్కడే కొత్త మలుపు తిరిగింది.  పూర్తిగా ముస్లింగా మారిపోయి, ఎన్నో ఆశలతో యువతి ఇంటికెళ్లిన మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఇస్లాం మతం స్వీకరిస్తే కూతురినిచ్చి పెళ్లి చేస్తామన్న యువతి కుటుంబ సభ్యులు... అతనెవరో తెలియనట్లు వ్యవహరించారు. పదేపదే ఇంటికి వస్తున్నాడంటూ మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌‌పై దాడికి పాల్పడ్డారు. ప్రేయసి నిక్కత్ సుల్తాన్‌‌ను కలవకుండా ఆంక్షలు విధించారు. యువతిని నిర్బంధించారు. దాంతో, ఏం చేయాలో దిక్కుతోచక మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అయితే, భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ ప్రేమ కథ... ఇక్కడ మరో మలుపు తిరిగింది. భాస్కర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్‌ఆర్సీ... యువతిని తమ ముందు హాజరుపర్చాలంటూ వికారాబాద్ పోలీసులను ఆదేశించింది. హెచ్‌ఆర్సీ‌ ఆదేశాలతో నిక్కత్ సుల్తాన్‌‌ను మానవ హక్కుల కమిషన్‌ ముందు హాజరుపర్చారు పోలీసులు. దాంతో, భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ నీకు తెలుసా? మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అంటూ యువతిని హెచ్‌ఆర్సీ ఛైర్మన్ ప్రశ్నించారు. అయితే, భాస్కర్‌తో తనకెలాంటి సంబంధం లేదని, మతం మార్చుకోమని తాను చెప్పలేదని నిక్కత్ సుల్తాన్ తెలిపింది. అంతేకాదు, భాస్కర్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది. తాను భాస్కర్‌ను ప్రేమించలేదని, మతం మారితే పెళ్లి చేసుకుంటానని చెప్పలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన కుటుంబ సభ్యుల నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. దాంతో, భాస్కర్ పిటిషన్‌ను హెచ్ఆర్సీ కొట్టివేసింది. నిక్కత్ సుల్తాన్‌ మాటలతో మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ భాస్కర్‌ కంగుతిన్నాడు. తాను ప్రేమించిన యువతి అలా మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయాడు... నీకోసమే కదా... ఎన్నో కష్టాలు పడ్డాను... ఎన్ని కష్టాలెదురైనా నీతోనే జీవితం అనుకున్నాను... అంటూ కోర్టు హాల్లో కన్నీరు మున్నీరయ్యాడు... అయితే, తన ప్రేమను గెలిపించుకునేందుకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని, కచ్చితంగా తన ప్రేమను దక్కించుకుంటానని భాస్కర్ అలియాస్ మహ్మద్ అబ్దుల్ హునైన్ అంటున్నాడు. అయితే, తన ప్రేయసి కోసం ముస్లింగా మారిన భాస్కర్ ను చూసి కోర్టుకొచ్చినోళ్లే కాదు... మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. అతని ప్రేమ కథను విని అయ్యో అంటూ చలించిపోయారు.

జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి... మళ్ళీ వెలుగులోకి వచ్చిన మైనర్ బాలిక రేప్ కేసు!

2017 ఆగస్టు 19న 15 సంవత్సరాల బాలిక మృతి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. కర్నూలులో నగర శివారు లోని లక్ష్మీ గార్డెన్స్ లో ఉంటున్న ఎస్ రాజు నాయక్, ఎస్ పార్వతీదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె ప్రీతి. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదివేది. 2017 ఆగస్టు 19 న ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తె ఉరివేసుకుని చనిపోలేదని స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.  కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం చేసిన వైద్యులు సైతం 2017 ఆగస్టు 20 న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ లో బాలికను రేప్ చేసినట్టు నిర్ధారించారు. పెథాలజీ హెచ్వోడీ డాక్టర్ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లితండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లితండ్రులు తాలుకు పోలీసు స్టేషన్ లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటుగా అతడి కుమారుల పై ఫిర్యాదు చేశారు. నిందితుల పై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.  ఈ ఘటన పై విచారణకు ముందుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరం పై ఉన్న గాయాలను అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థిని పై లైంగికదాడి చేసి హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా వుండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లితండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాగా ఎలాంటి న్యాయం జరగలేదు.  దీంతో ఇదే విషయమై ఆమె జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. దీంతో ఈ ఘటన పై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు నగరంలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్నూలు జిల్లా ఏఎస్పీ పకీరప్ప తెలిపారు. సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. జస్టీస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ ఈ కేసు మళ్లీ ప్రాణం పోసుకొని బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశ వారిలో చిగురించింది. జగన్ సర్కార్ ఇలాంటి కామాందులను శిక్షిస్తుందో రక్షిస్తుందో వేచి చూడాలి.

వైఎస్ జగన్ కు ఉపశమనం కలుగుతుందా.. సీబీఐ కౌంటర్ పిటీషన్ పై సర్వత్రా ఆసక్తి!

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను హైకోర్ట్ ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని గత వారం సిబిఐ కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హై కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో సీబీఐ కౌంటర్ పై ఆసక్తి నెలకొంది.  ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతోంది. ప్రధానంగా ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ సీబీఐ సరైన టైమ్ లో కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో విచారణ ఈ నెల 12 కు వాయిదా వేయడంతో  సిబిఐ అధికారులు ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తారో ఆ కౌంటర్ లో ఎటువంటి విషయాలు పొందుపరుస్తారనేది మాత్రం  సర్వత్రా ఆసక్తి నెలకొంది.  జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు దానిని కొట్టివేసిన నేపధ్యంలో హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనకు  ప్రతి వారం కోర్ట్ కు హాజరు కావాలంటే దాదాపు 60 లక్షల రూపాయల ఖర్చవుతుందని జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద నేడు దాఖలయ్యే కౌంటర్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.

ఢిల్లీ పర్యటనకు ముందు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు!!

జగన్ సర్కార్ ఏపీలో మరో పథకానికి రూపకల్పన చేపడుతోంది. ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించిన జగన్ సర్కార్ మరో నూతన పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ఆసాంతం సమూలంగా మార్చాలని ప్రవేశపెట్టిన నాడూ నేడూ పధకంతో పాటు జగనన్న అమ్మఒడి వంటి పథకాలను ప్రారంభించారు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక పేరుతో మరో కొత్త పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థికి ఒక స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోట్ బుక్స్ ఇవాలని ప్రభుత్వం యోచన చేస్తోంది.  రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణను వేగంగా పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం దొంగతనాల కేసులో విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేసేలా మంత్రి వర్గం ముందుకు ప్రతిపాదనలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీల పై నమోదైన కేసులను రద్దు చేయాలనే ప్రతిపాదన మంత్రి వర్గానికి పంపారు.  కేంద్రంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా ముసాయిదా బిల్లును ప్రభుత్వం రూపొందించగా మంత్రి వర్గంలో ఆమోదం పొందితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 27 రోజుల వరకు ఉండగా ఇక పై 20 రోజులకే కుదించాలని మునిసిపల్ శాఖ నుంచి మంత్రి వర్గం ఆమోదం కోసం ప్రతిపాదన వెళ్ళింది. కొత్తగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనిని ఏర్పాటు చేయటం ద్వారా 10,000 ల మెగావాట్ల విద్యుత్ ను సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు అధికారులు.ఇవాళ జరిగే మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎం జగన్ ఢిల్లి పర్యటణలో మోదీని కలిసి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించక పోవడం పై మరియు  రైల్వే ప్రాజెక్టుల పై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.