ఆంధ్రప్రదేశ్ లో దేవుడికే రక్షణ కరువైంది!!

అందరికీ ఆ దేవుడే రక్ష అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దేవుడికే రక్షణ కరువైంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 19 నెలల  కాలంలో హిందూ ఆలయాలపై అనేక దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం, రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనలు వెలుగు చూశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.    ఏపీకి వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఐన తరువాత ఈ 19 నెలల కాలంలో 20 కి పైగా హిందూ దేవాలయలపై దాడుల జరిగాయి. 1. 2019 నవంబర్ 14 న.. గుంటూరు దుర్గ గుడి ధ్వంసం  2. 2020 జనవరి 21 న.. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ధ్వంసం 3. 2020 ఫిబ్రవరి 11 న.. రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం 4. 2020 ఫిబ్రవరి 13 న.. ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ధ్వంసం చేశారు 5. 2020 ఫిబ్రవరి 14 న.. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం 6. 2020 సెప్టెంబర్ 6 న.. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం 7. 2020 సెప్టెంబర్ 13 న.. విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ 8. 2020 సెప్టెంబర్ 15 న.. కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ధ్వంసం 9. 2020 సెప్టెంబర్ 16 న.. ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 10. 2020 సెప్టెంబర్ 16 న.. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం 11. 2020 సెప్టెంబర్ 17 న..  కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ధ్వంసం 12. 2020 సెప్టెంబర్ 19 న.. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో శివాలయంలో శివుడు విగ్రహాలు ధ్వంసం 13. 2020 సెప్టెంబర్ 20 న.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ధ్వంసం 14. 2020 సెప్టెంబర్ 23 న.. కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 15. 2020 సెప్టెంబర్ 25 న.. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం 16. 2020 అక్టోబర్ 5 న.. కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా సుగని జలాశయం దగ్గర వున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం లో నరసింహ స్వామి శేషపడగలు ధ్వంసం 17. 2020 అక్టోబర్ 6 న.. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ  స్వామి విగ్రహం ధ్వంసం 18. 2020 అక్టోబర్ 6 న.. గుంటూరు జిల్లా నరసరావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం 19. 2020 అక్టోబర్ 17 న.. తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం 20. 2020 నవంబర్ లో.. యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం.. 21. 2020 డిసెంబర్ 29 న.. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం 22. 2020 డిసెంబర్ 31 న.. రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం   ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడి ఘటనలు వెలుగులోకి వచ్చినవి కొన్నే.. వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరైన చర్యలే లేవు. మతిస్తిమితం లేని వారి చర్యలంటూ ప్రభుత్వం, పోలీసులు కాలయాపన చేశారు. ఇక సీఎం సంగతి సరేసరి. ఇన్ని నెలలుగా దాడులు జరుగుతుంటే ఆయన నుండి సరైన స్పందనే లేదు. తాజాగా ఒక్కసారి స్పందించారు. దేవుడితో పెట్టుకోవద్దని, శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. అయితే ఆయనలా హెచ్చరించిన కొద్ది గంటల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటన జరగడం గమనార్హం. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో హిందూ ఆలయాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ఇక ప్రభుత్వానికి తగ్గట్టే ప్రతిపక్షాల తీరు కూడా ఉంది. దాడి జరిగినప్పుడు ఖండిస్తున్నాం అంటూ రెండు వ్యాఖ్యలు చేయడమే తప్ప.. ఇది కోట్ల మంది మనోభావాలకు సంబందించిన అంశం అంటూ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేయడం లేదు.   మరోవైపు హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందన్న అనుమానాలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీ.. రాష్ట్రంలో హిందూ మతం లేకుండా చేసి, మరో మతాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుందని అనమానపడుతున్నారు. లేదా మరో పార్టీ.. ఈ దాడులతో హిందూవులలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి ఆ ఓట్లన్నీ రాబట్టే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న ఈ దాడుల వెనుక ఏ పార్టీ రాజకీయ పార్టీ కుట్ర కోణం ఉందో గానీ.. ఈ దాడుల మూలంగా కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ దాడుల వెనుక ఉన్న కోణాన్ని ఆ దేవుడు ఎంత త్వరగా బయటపెడితే.. అంత మంచిదన్న అభిప్రాయం అటు హిందువుల్లోనూ, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.

కోమటిరెడ్డి బాటలో ఇంకెందరు? రేవంత్ రెడ్డే వాళ్ల టార్గెట్టా?

ఘోర పరాజయాలు, నేతల వలసలతో 2020 సంవత్సరంలో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. కొత్త ఏడాది కూాడా కలిసొచ్చేలా కనిపించడం లేదు. 2021 న్యూఇయర్ తొలిరోజే హస్తం పార్టీకి షాకిచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏడాది క్రితం జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ తాను బీజేపీలోకి వెళతానని ప్రకటించారు. త్వరలోనే తాను కాషాయ కండువా కప్పుకుంటానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని మరోసారి స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారి సన్నిధిలో కోమటిరెడ్డి చేసిన రాజకీయ ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీలోకి వెళతారా లేక ఆయనతో పాటు ఇంకెవరైనా వెళతారాదా అన్నది సస్పెన్స్ గా మారింది.     2020లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అంతేకాదు బీజేపీ కంటే దిగువకు పడిపోయింది. గత సంవత్సరం చాలా మంది పార్టీ నేతలు, కొందరు సీనియర్లు కూడా బీజేపీలో చేరారు.  దీంతో తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీలో ప్రక్షాళనకు  సిద్ధమైంది. కొత్త పీసీసీని నియమించే పనిలో పడింది. పీసీసీ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఎవరో ఒకరిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఖాయమని తెలిసినందు వల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డికి మొదటి నుంచి మంచి సంబంధాలు లేవు. కోమటిరెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళతారనే చర్చ జరుగుతోంది.    రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తమకు ఇబ్బంది అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఓటు మొత్తం కమలానికి వెళుతోంది. రేవంత్ పీసీసీ బాస్ గా వస్తే కాంగ్రెస్ బలోపేతం కావడంతో పాటు ప్రజా వ్యతిరేకత ఓటు కొంత అటు వైపు వెళుతోంది. దీంతో తమకు నష్టం కల్గుతుందని భావిస్తున్న బీజేపీ హైకమాండ్... తెలంగాణ కాంగ్రెస్ ను బలహీనం చేయడమే లక్ష్యంగా.. ఆ పార్టీ నేతలను ఆహ్వానిస్తోంది. రేవంత్ కు పీసీసీ వస్తున్నందున.. అందుకు కౌంటర్ గా కమలనాధులు తమ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ కు బలపడే అవకాశం ఇవ్వకుండా.. పావులు కదుపుతోంది.  ఇందులో భాగంగానే మొదటగా సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బాటలోనే కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా కాషాయం గూటికి చేరుతారంటున్నారు. రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వీహెచ్ తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా కాంగ్రెస్ నుంచి బయటికి రావచ్చంటున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ ను వ్యతిరేకించే నేతలందరికి బీజేపీ వల వేస్తుందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ వచ్చిన వెంటనే కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు ఉండేలా తెలంగాణ బీజేపీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది.    మరోవైపు తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా కోమటిరెడ్డి సోదరులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదని చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన తల్లిగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టారు రాజగోపాల్ రెడ్డి. కాని ఆ కార్యక్రమాలకు తన అన్న వెంకట్ రెడ్డిని ఆయన పిలవలేదు.  తన అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి ఎంపీ పరిధిలోనే ఉన్నా..ప్రోటోకాల్ ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి వెళ్లలేదు. అప్పడే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు అన్న టీపీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్తానని ప్రకటించడంతో ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని భావిస్తున్నారు.    మొత్తంగా రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. అతనితో పాటు ఇంకా ఎవరెవరు నేతలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తే.. ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయనే అభిప్రాయం కూడా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరీ బీజేపీ వ్యూహాలకు కాంగ్రెస్ నేతలు ఎలా చెక్ పెడతారో చూడాలి మరీ..

కేసీఆర్ కి కొత్త బిరుదు.. యూటర్న్ ల వీరుడు!!

"టర్న్ లందు యూటర్న్ లు వేరయ్యా యూటర్న్ ల్లో కేసీఆరే తోపయ్యా" అని భవిష్యత్ తరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చెప్పుకుంటారేమో అనిపిస్తోంది. అదేదే సినిమాలో చెప్పినట్టుగా "ఈరోజు రైట్ అనిపించింది రేపు రాంగ్ అనిపించొచ్చు. ఈరోజు రాంగ్ అనిపించింది రేపు రైట్ అనిపించొచ్చు" అనే మాటని కేసీఆర్ నిజమని రుజువు చేస్తున్నారు. ముందేమో అబ్బే ఇది అసలు పనికిరాదు అంటారు. కట్ చేస్తే కొన్నిరోజులకి ఇది అమోఘం అంటారు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఎన్నెన్నో.. ఆ ఎన్నెన్నోలో ఇప్పుడు కొన్ని యూటర్న్ ల గురించి తెలుసుకుందాం.   తెలంగాణలో రైతులంతా నియంత్రిత సాగు విధానాన్ని పాటించాలని సూచించిన కేసీఆర్.. తరువాత ఆ మాటను వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు అవసరం లేదని.. రైతులు ఇక నుంచి తమకు నచ్చిన పంటను పండించవచ్చని.. నచ్చిన చోట అమ్ముకోవచ్చని తాజాగా కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్.. కొన్ని రోజులకే ఆ చట్టాలకు జై కొట్టారు. 'నూత‌న వ్య‌వ‌సాయ బిల్లు తేనేపూసిన క‌త్తి లాంటి చ‌ట్టం. దీన్ని క‌చ్చితంగా వ్య‌తిరేకించి తీరాలి' అని కేసిఆర్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ ‌లో మిగతా పార్టీల కంటే ఉత్సాహంగా టీఆర్ఎస్ పాల్గొంది. టీఆర్ఎస్ కీలక నేతలు, మంత్రులు సైతం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఓ రకంగా అది టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారిక బంద్ గా కనిపించింది. కానీ కొన్నిరోజులకే సీన్ మారిపోయింది. కొత్త చట్టాలకు జై కొడుతూ.. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలని తీసివేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.   అప్పట్లో 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని అసలు ఎందుకు పనికి రాదన్న కేసీఆర్.. తాజాగా ఈ విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఇక తెలంగాణలోనూ అమల్లోకి రానుంది. ‌ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గతంలో అసెంబ్లీ సాక్షిగా 'ఆయుష్మాన్ భారత్' పై కేసీఆర్ విమర్శలు చేశారు. ‌ఆరోగ్యశ్రీతో పోల్చితే అసలు 'ఆయుష్మాన్ భారత్' దేనికి పనికి రాదన్నారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు 'ఆయుష్మాన్ భారత్' కి ఆహ్వానం పలికారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుపై వైద్యం చేయడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు, మరో వైపు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అందుకే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.   వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో మాత్రమే కాదు. పలు విషయాల్లో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. సీఎం కాకముందు నుండి ఇప్పటి వరకు ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత నాయకుడిని సీఎం చేస్తానన్నారు.. ఆయనే సీఎం అయ్యారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. తరువాత ఆ ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. తరువాత అదసలు సాధ్యమేనా? అని ఆయనే రివర్స్ లో క్వశ్చన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో యూటర్న్ లు ఉన్నాయి. అయితే, తాజాగా వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో కేసీఆర్ తీసుకున్న యూటర్న్ మాత్రం.. యూటర్న్ సీఎం అంటూ విమర్శల పాలు చేసింది.

తోటి విద్యార్థిని తరగతి గదిలో కాల్చి చంపిన టెన్త్ క్లాస్ స్టూడెంట్

టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య తరగతి గదిలో కూర్చునే సీటు కోసం జరిగిన గొడవ ఏకంగా ఒక బాలుడి ప్రాణాలు బలి తీసుకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. క్లాస్ రూములో సీటు కోసం పదో తరగతి విద్యార్థులు ఇద్దరు నిన్న గొడవ పడ్డారు. దీంతో కోపంతో రగలిపోయిన ఒక బాలుడు ఈ ఉదయం స్కూలుకు వస్తూ తన అంకుల్ తుపాకిని వెంట తెచ్చుకున్నాడు. అతడు వచ్చీ రావడంతోనే నిన్న తనతో గొడవకు దిగిన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో రెండు పిరియడ్లు ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.   ఆ బాలుడు మొత్తం మూడుసార్లు కాల్పులు జరిపాడని, వాటిలో ఒక తూటా పొట్టలోకి, మరొకటి చాతీలోకి, మూడోది తలలోకి దూసుకుపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. అయితే కాల్పుల జరిపిన తరువాత నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన అతడు తనను పట్టుకునేందుకు వచ్చిన వారిని బెదిరించేందుకు మరోసారి గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. చివరికి కొంత మంది ఉపాధ్యాయులు అతికష్టం మీద ఆ బాలుడిని పట్టుకుని తుపాకి లాక్కున్నారు. అయినప్పటికీ అతడు వారిని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. ఈలోగా ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు వచ్చి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.   నిందితుడైన బాలుడు తుపాకిని తన అంకుల్ నుంచి దొంగలించి తీసుకు వచ్చినట్లుగా గుర్తించారు. ఆ బాలుడి అంకుల్ సైన్యంలో పనిచేస్తుంటారని, ఆయన సెలవులపై ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా అయన లైసెన్స్‌డ్ తుపాకిని తీసుకొచ్చి ఈ అఘాయిత్యనికి పాల్పడినట్టు పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. బాలుడి పుస్తకాల సంచిలో మరో నాటు తుపాకి కూడా ఉందని, పోలీసులు దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అయన తెలిపారు.

బీజేపీకి షాక్.. రైతు చట్టాలను వ్యతిరేకించే తీర్మానానికి ఎమ్మెల్యే సపోర్ట్ 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతులు ఇటు ప్రతి పక్షాలు ఉద్యమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా కేర‌ళ రాష్ట్ర అసెంబ్లీలో వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానాన్ని కేర‌ళ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. అయితే కేర‌ళ‌లో బీజేపీ తరుఫున ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాజ‌గోపాల్ కూడా ఈ బిల్లుకు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌టం ఇపుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.   అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలను వ్య‌తిరేకిస్తూ తీర్మానం చేసిన త‌ర్వాత కూడా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతుల పక్షాన నిలిచిన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూడా తన పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, సాయంత్రానికి ఎమ్మెల్యే ఓ.రాజ‌గోపాల్ యు టర్న్ తీసుకుని.. త‌ను అలా అన‌లేద‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కన్న కొడుకు మీద కోపంతో.. పెంపుడు కుక్కకు ఆస్తి రాసిచ్చిన రైతు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతు తాను సంపాదించిన ఆస్తిలో సగం వాటాను తన పెంపుడు కుక్కకు రాసిచ్చాడు. మిగతా సగ భాగం ఆస్తిని తన భార్య పేరున రాశాడు. అయితే అయన తన కుమారుడి తీరు నచ్చక అతడికి ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలోని బరిబాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.   మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ వర్మ ఒక వారం క్రితం తన ఆస్తికి సంబంధించిన వీలునామా రాశాడు. ఈ వీలునామా ప్రకారం తన వారసులుగా అయన తన భార్య చంపాబాయి, తన పెంపుడు కుక్క జాకీని చట్టబద్దమైన వారసులుగా పేర్కొన్నారు. నారాయణ వర్మ రాసిన వీలునామాలో పేర్కొన్న ఆస్తుల్లో 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన భార్య చంపాబాయి తనను జాగ్రత్తగా చూసుకొంటుందని అలాగే తన పెంపుడు కుక్క జాకీ కూడ తనను జాగ్రత్తగా కాపాడుతోందని ఆయన చెప్పారు. తన భార్యతో పాటు తన పెంపుడు కుక్క అంటే కూడా తనకు చాలా ప్రేమ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందని.. ఒకవేళ తాను చనిపోతే తన పెంపుడు కుక్క అనాథగా మారే అవకాశం ఉందని భావించి ఆయన ఈ పని చేశారట.   అంతేకాకుండా తన చివరి కర్మలు కూడ భార్య, కుక్క చేయాలని అయన తన వీలునామాలో రాశాడు. అంతేకాకుండా తన తర్వాత తన పెంపుడు కుక్కను ఎవరైతే జాగ్రత్తగా చూసుకొంటారో వారికే జాకీకి చెందిన ఆస్తి దక్కుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే ఈ వీలునామా గురించి తెలుసుకొన్న తన కుమారుడు ఈ వీలునామాను రద్దు చేయాలని తనను కోరాడని అయితే తాను మాత్రం వెనక్కు తగ్గేది లేదని అయన స్పష్టం చేస్తున్నాడు.

లోకేష్ ధర్నాతో దిగొచ్చిన జగన్ సర్కార్.. హత్య కేసులో ఎమ్మెల్యేపై కేసు నమోదు

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య రెండు రోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే సుబ్బయ్య మరణానికి కొన్ని గంటల ముందు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో సుబ్బయ్య హత్య జరగడంతో ఈ హత్య కేసులో ఎమ్మెల్యే, అయన బావమరిది, అధికారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయాలని హతుడి భార్య అయిన అపరాజిత డిమాండ్ చేయగా పోలీసులు నిరాకరించారు.   ఈ నేపథ్యంలో సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రొద్దటూరు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తరువాత.. సుబ్బయ్య మృతదేహంతో ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే, ఆయన బంధువు, మున్సిపల్ అధికారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే వరకు ప్రొద్దుటూరు వీడేదిలేదని స్పష్టం చేసారు. దీంతో డీఎస్పీ వచ్చి ఆందోళన విరమించాలని లోకేశ్‌ను కోరారు. అయితే అందుకు లోకేష్ ససేమిరా అనడంతో 161 సెక్షన్‌ ప్రకారం ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను ఈ కేసులో చేర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో సుబ్బయ్య భార్య అపరాజిత దగ్గర పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తరువాత ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు అందించనున్నారు. ఈ హత్య కేసుపై 15 రోజుల్లో త్వరిత గతిన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ హామీ ఇచ్చారు.

తిరుమల వెంకన్న మాలలో ఉన్న వైసీపీ నేత జీసస్ స్తుతి.. 

కలియుగ దైవం అయిన తిరుమల వెంకటేశ్వర స్వామి మాల ధరించిన ఆ వైసీపీ నేత ఏసుక్రీస్తును స్తుతిస్తూ క్రిస్మస్‌ గీతాలు ఆలపించడం తాజాగా వివాదాస్పదమైంది. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సోదరుడు జయదేవ్‌ కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వరస్వామి మాల ధరించారు. అయితే ఈనెల 25న నియోజకవర్గంలోని ద్వారకానగర్‌లో క్రిస్మస్‌ వేడుకలకు ఎమ్మెల్యే ధర్మశ్రీతో పాటు అయన సోదరుడు జయదేవ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరుని మాలలో ఉన్న జయదేవ్ వేదికపై క్రీస్తును స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు జయదేవ్ పై తీవ్రంగా మండిపడుతున్నాయి. వెంకటేశ్వర స్వామి మాల ధరించి.. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా, క్రైస్తవ గీతాలు ఆలపించడం ఏమిటని ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఇన్నింగ్స్ డిక్లేర్? టీడీపీలో సోదరుల యాక్టివ్ రోల్ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ, సమైక్య ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయనే ముఖ్యమంత్రి. ఏపీ విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించిన నేత. స్వతాహాగా క్రికెటర్ అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... విభజన సమయంలోనూ సమైక్యాంధ్ర కోసం లాస్ట్ బాల్ వరకు పోరాడి.. చివరికి చేసేది లేక సీఎం పదవిని వదులుకున్నారు. ఏపీ విభజనకు వ్యతిరేకంగా సీఎం పోస్టుకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి... 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.    2017లో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు ఆయన ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఉమెన్‌చాందీ కిరణ్‌ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించారని అందుకు సోనియాగాంధీ ఆమోద ముద్రవేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డిని సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించారని, ఆయననే ఏపీసీసీ చీఫ్ గా నియమించనున్నారని భావించారు. అయితే పీసీసీ పగ్గాలు చేపట్టే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చారు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి తనకేనంటూ వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనన్నారు. తర్వాత కొంత కాలానికి తిరుపతిలో మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎంతో భాదేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సాగు, తాగునీరు ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి.      కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా యాక్టివ్ రాజకీయాలు మాత్రం చేయడం లేదు. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో అన్న స్థానంలో పీలేరు నుంచి  జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడి పోయిన కిషోర్ కుమార్ రెడ్డి.. తర్వాత టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో  పార్టీని బలోపేతం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ గానే పని చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీలో ఇప్పుడు కీలక నేతగా ఉన్నారు నల్లారి  కిషోర్ కుమార్ రెడ్డి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా.. కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు.    ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ లోనూ బలపడే సూనచలు కనిపించకపోవడం, టీడీపీలో తన కుటుంబ సభ్యులు యాక్టివ్ గా ఉండటం తదితర అంశాలతో రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటరనే నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని చెబుతున్నారు. దాదాపుగా ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని తెలుస్తోంది. ఆయన అభిమానులు, అనుచరులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికి సమైక్య ఉద్యమ చాంపియన్ గా నిలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగియడంతో ఆయన అనుచరులు నిరాశ పడుతున్నారు.

హర్యానా స్థానిక ఎన్నికలలో బీజేపీ కూటమికి ఘోర పరాభవం 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 36 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రైతులు చేస్తున్న ఆందోళన ప్రభావంతో హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని ముఖ్య నగరాలైన సోనిపట్, అంబాలా మునిసిపల్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడగా, హిస్సార్ జిల్లాలోని ఉకలానా, రేవారీ పరిధిలోని ధారూహెరాలను బీజేపీ కూటమి కోల్పోయింది. ఇప్పటివరకు ఈ రెండు స్థానాలూ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కంచుకోటలుగా ఉన్న సంగతి తెలిసిందే.   ప్రస్తుతం హర్యానాలో బీజేపీ - జేజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేస్తుండగా, వారికి స్థానిక రైతులు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. దీని ప్రభావం స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.   మరోపక్క రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గమైన అంబాలాలో కూడా బీజేపీ ఓటమి పాలవడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలైందని తెలిసి ధర్నాల్లో ఉన్నరైతులు మిఠాయిలు పంచుకుని, ఆనందంతో పాటలు పాడుతూ స్టెప్పులేశారు. హర్యానా జనచేతన పార్టీకి చెందిన శక్తి శర్మ అంబాలాలో మేయర్ కాబోతున్నారు. సోనేపట్ లో కాంగ్రెస్ కు చెందిన లలిత్ బాత్రా మేయర్ పదవిని చేపట్టబోతున్నారు. అయితే పంచకుల మేయర్ పదవి మాత్రం బీజేపీకే దక్కింది. ఇక్కడ కుల్ భూషణ్ గోయల్ విజయం సాధించారు. అంబాలాలో 20 సీట్లకు గాను అధికార బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలవడం ఇక్కడ గమనార్హం.

ఆ ముగ్గురు మంత్రులు తోకలేని కోతులు వంటివారు.. జనసేన ఫైర్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాజాగా ఏపీ మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై జనసేన ముఖ్య నేత శివశంకర్ స్పందించారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ వెనుక ఉన్న ముగ్గురు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని కూడా ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులులాంటివారని అన్నారు. ఆ మంత్రులకు మంత్రివర్గ సమిష్టి బాధ్యతలు ఎంతమాత్రం తెలియవని, అంతేకాకుండా ప్రజస్వామ్యం గురించి గానీ, రాజ్యాంగం గురించి కానీ ఓనమాలు కూడా తెలియని మంత్రులని విమర్శించారు. ఈ ముగ్గురు ప్రాచీనయుగంలో పుట్టవలసినవాళ్లని అయన అన్నారు. ఆ మంత్రులు ఈ యుగంలో పుట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు.   మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడడంలేదని శివశంకర్ విమర్శించారు. మంత్రులు తమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. బూతులు మాట్లాడే మంత్రులను పక్కన పెట్టుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. నివర్ తుఫాను వల్ల 19 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని... ఇప్పుడు 11 లక్షల మంది రైతులని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల సమస్యను పూర్తిగా గాలికొదిలేశారని, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు తడిసిన ధ్యాన్నాన్ని కొనుగోలు చేస్తానని సీఎం జగన్ చెప్పారని.. అయితే ఇప్పుడు మిల్లర్లు శాసిస్తున్నారని, దీంతో రైతులు రోడ్డుపై ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వ్యక్తిగత దాడులు ఆపాలని, రైతులకు నివర్ నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని శివశంకర్ డిమాండ్ చేశారు.

బి కేర్ ఫుల్... ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా..

కరోనా మహమ్మారి నుండి తమ దేశ ప్రజలను రక్షించడం కోసం బ్రిటన్, అమెరికా వంటి కొన్ని దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న వారం తరువాత ఓ మేల్ నర్సు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మాథ్యూస్ స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. అయన మొన్న డిసెంబర్ 18న ఆయన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతంలో చేతిపై కొద్దిగా ఎర్రబడటం తప్ప తనకు ఎటువంటి ఇబ్బందులూ కలగలేదని మాథ్యూస్ తెలిపారు.   అయితే అయన ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు రోజుల తరువాత.. క్రిస్మస్ సందర్భగా విధుల్లో ఉన్న తనకు కొంత అనారోగ్యంగా అనిపించిందని.. ఆ తరువాత కొంత సేపటికే చలి, ఒళ్లునొప్పులు వచ్చాయని ఆయన తెలిపారు. మరుసటి రోజు మ్యాథ్యూస్ అనుమానం కలిగి టెస్టు చేయించుకోగా.. రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే ఈ ఘటన పై స్పందించిన అంటువ్యాధుల నిపుణుడు ఒకరు ఈ ఘటన అనూహ్యమైనదేమీ కాదని వ్యాఖ్యానించారు. "క్లినికల్ ట్రయల్స్‌లో తేలిన వివరాల ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న 10 నుంచి 14 రోజుల తరువాతే కరోనాను ఎదుర్కొనేందుకు మన రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తరువాత మనలో ఇమ్మునిటీ 50 శాతం, రెండు డోసు తీసుకున్న తరువాత 95 శాతం శక్తిని పుంజుకుంటుందని" ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నతరువాత కూడా కొంతకాలం పాటు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందుబాబులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని అబ్కారీశాఖ తెలిపింది. బార్లు, క్లబ్బులకు ఒంటిగంట వరకు తెరిచి ఉంచడానికి అనుమతులు ఇచ్చింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది.   కాగా, కరోనా నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆయా రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కు అనుమతి లేదని ఇటీవల సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలోని మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడం గమనార్హం.

17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు జంప్ ? బీహార్ కు కొత్త సీఎం వస్తారనే ప్రచారం 

బీహార్ రాజకీయాల్లో సంచలనం జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది. 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు అర్జేడీలో చేరబోతున్నారన్న..  ఆ పార్టీ నేత వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్‌  పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్‌   పార్టీలో చేరనున్నట్లు ఆర్జేడీ  నేత శ్యామ్ రజక్ అన్నారు. జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు   ఏ క్షణమైనా ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించబోమని చెప్పిన ఆయన.. 28 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తే మాత్రం  పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.  ‘17 మంది జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారు ఆర్జేడీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏ క్షణమైనా జరగొచ్చు. ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినప్పటి నుంచి ఆ చట్టం నిబంధనలను మేం అతిక్రమించడం లేదు. అయితే మేం వారికి ఒక విషయం స్పష్టం చేశాము. 28 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఈ సంఖ్య 28కి చేరే అవకాశం ఉంది’’ అని జేడీయూ నేత శ్యామ్ రజక్ అన్నారు.  శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ లో నితీశ్ కుమార్ సర్కార్ కూలిపోబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే  రజాక్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొట్టి పారేశారు. ఆర్జేడీ చేస్తున్న వాదనలు నిరాధారమని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని, ఆర్జేడీ తప్పుడుగా ప్రచారం చేస్తోందని తెలిపారు. గత  నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఆర్జేడీ, బీజేపీ కంటే అతి తక్కువ స్థానాలను గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చినా..  ఎన్నికల ఒప్పందం ప్రకారం నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. గతంలోనూ జేడీయూ ఎమ్మెల్యేలను ఆర్జేడీ ప్రలోభ పెడుతుందనే ఆరోపణలు వచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచే కొందరు నితీశ్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని జేడీయూ నేతలు ఆరోపించారు. తాజాగా మళ్లీ ప్రలోభాల ఆరోపణలు రావడం ఆసక్తి రేపుతోంది.   

హైకోర్టు సంచలన తీర్పు.. మిషన్ బిల్డ్ ఏపీ అధికారిపై కేసు నమోదుకు ఆదేశం

మిషన్ బిల్డ్ ఏపీ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ అధికారి ఐఏఎస్ ప్రవీణ్‌‌ కుమార్‌ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం అభియోగాల కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.    కాగా, మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జగన్ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్‌ రాకేష్ కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ మేరకు మిషన్ బిల్డ్ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంలో వ్యహరించే అవకాశం ఉందని ఆయన అఫిడవిట్‌లో ఆరోపించారు.

మళ్లీ తెరపైకి నిర్మాత సి కల్యాణ్  భూకబ్జా ! బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత 

హైటెక్ సిటీకి సమీపంలోని  హఫీజ్ పేటకు సంబంధించిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ భూ కబ్జా వివాదం మళ్లీ ముదురుతోంది. పేదల భూములను కల్యాణ్ అక్రమించారంటూ  భూ నిర్వాసితులు చందానగర్  మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్ ను ముట్టడించారు. పేదలను తరిమేసి భూములను ఆక్రమించుకున్న బడా నిర్మాత.. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారంటూ ఆందోళనకు దిగారు. కబ్జా స్థలంలో నిర్మాణాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని చందానగన్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. నిర్మాత సి కల్యాణ్ తో పాటు సర్కార్ కు వ్యతిరేకంగా హఫీజ్ పేట నిర్వాసితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చందానగర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర  తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.   శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట గ్రామంలో సర్వే నంబర్ 80లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రముఖ నిర్మాత  సి. కల్యాణ్ కబ్జా చేశారని 2017లో వెలుగులోనికి వచ్చింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. సర్వే నంబర్ 80లో మొత్తం  484.31 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ దాదాపు వెయ్యి మంది పేదలు గుడిసెలు వేసుకుని నివసించేవారు. రికార్డుల ప్రకారం ఈ భూమి  ప్రభుత్వానిదే అయినా..  తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నది సీ కల్యాణ్ పై ఆరోపణ.  2006 ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి రంగారెడ్డి ఎస్ ఆర్‌ ఏ వో ఈ  భూమిని సి కల్యాణ్ కు రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఈ భూమిని యూకో బ్యాంక్ కు ఐదు కోట్ల రూపాయలకు తనఖా పెట్టారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అప్పు  కట్టకపోవడంతో బ్యాంకు వాళ్లు  కల్యాణ్ కు నోటీసులు కూడా ఇచ్చారు. అదే సమయంలో 8 ఎకరాల భూమిని 80 ఎకరాలుగా పత్రాల్లో చూపించారనే  ఆరోపణలు వచ్చాయి. అయితే యూకో బ్యాంకుతో వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకున్న సీ కల్యాణ్ ఈ  భూమిని విడుదల చేయించుకున్నాడు.  తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను గతంలో ఖండించారు సి కల్యాణ్. తాను ఎవరి భూములను ఆక్రమించలేదని చెప్పారు. అయితే మూడేండ్ల కిందట దుమారం రేపిన భూ వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వివాదాస్పద భూమిలో నిర్మాత సి కల్యాణ్ నిర్మాణాలు చేపట్టడంతో బాధిత నిర్వాసితులు చందా నగర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారని చెబుతున్నారు. 2017లో కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలతో సి కల్యాణ్ రాజీ కొచ్చారనే  నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.

 రేవంత్ రెడ్డికి పదవి కోసం కేసీఆర్ మొక్కులు! 

తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కీలక పదవి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారట.. ఏంటీ తప్పుగా రాశారని  అనుకుంటున్నారా...  ఆరున్నర ఏండ్లుగా  పాలనలో తనకు  పక్కెలో బల్లంలా మారిన రేవంత్ రెడ్డికి ఉన్నత పదవి రావాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించడమేంటని ఆశ్చర్యపోతున్నారా..  కాని ఇది అక్షరాల నిజం. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డికి పొలిటికల్ ప్రమోషన్ రావాలని  సీఎం కేసీఆర్  బలంగా కోరుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.  తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా ఉంది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో సంచలన విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతోంది. వరుస విజయాలతో  కమలం గూటికి చేరడానికి నేతలు క్యూ కడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న గ్రాఫ్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారమంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. బీజేపీ దూకుడుతో కలవరపడుతున్న కారు పార్టీ అధినేత.. ఆ పార్టీ స్పీడ్ కు బ్రేక్ వేయడం ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యమనే ఆలోచనకు వచ్చారట. తెలంగాణలో తమ పార్టీకి ఢోకా లేకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డికి కీలక పదవి రావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారని తెలుస్తోంది.   దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టమ్ నిర్వహించిన కేసీఆర్.. బీజేపీకి మంచి ఫలితాలు రావడానికి కాంగ్రెస్ బలహీనంగా ఉండటమే కారణమనే అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ఇటీవల కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. అయితే కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో అది బీజేపీకి ఫ్లస్ అవుతోంది. కేసీఆర్ ను ఓడించాలనే కసిగా ఉన్న ఓటర్లంతా అయిష్టంగానైనా బీజేపీ వైపు మళ్లుతున్నారని టీఆర్ఎస్ సమీక్షలో తేలిందట. కాంగ్రెస్ ఎలాగూ గెలిచే పరిస్థితిలో లేదు కాబట్టి.. ఆ పార్టీకి ఓటేయడం కంటే బీజేపీకి వేస్తే టీఆర్ఎస్ ను ఓడించవచ్చని ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నవారు భావించారని, అలానే ఓటింగులో పాల్గొన్నారని కేసీఆర్ అంచనా వేశారని తెలుస్తోంది.  తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు 30 శాతానికి పైగానే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇది 20 శాతానికి పైగానే ఉంటుంది. అయితే దుబ్బాకలో పీసీసీ నేతలంతా గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రమించినా కాంగ్రెస్ కు 20 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదనే భావనతో హస్తం సానుభూతి పరులు, కేసీఆర్ పని తీరుపై కసిగా ఉన్న జనాలంతా కమలానికి జై కొట్టారని  తేలింది. దుబ్బాకలో ఇలా దాదాపు 10 శాతం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లాయంటున్నారు. అక్కడ బీజేపీ గెలిచింది కేవలం వెయ్యి ఓట్లతోనే. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే.. ఆ పార్టీ ఓట్లు వారి అభ్యర్థికే పడితే.. దుబ్బాకలో టీఆర్ఎస్ దాదాపు 10 శాతం ఓట్లతో గెలిచేదని గులాబీ నేతల భావన. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ కూడా దుబ్బాకలో ఇదే ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలవదు కాబట్టి.. ఆ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టేనని జనాల్లోకి తీసుకెళ్లింది. ఇది కూడా బీజేపీకి వర్కవుట్ అయిందని ఫలితాల తర్వాత తేలింది.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్  బీజేపీ వైపు వెళ్లిందని  స్పష్టమైంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ దాదాపు 26 శాతం ఓట్లు సాధించింది. ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ కేవలం 12 శాతం ఓట్లు సాధించింది. కాని ఈసారి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 35 శాతానికి పైగా ఓట్లు సాధించిన బీజేపీ.. 48 డివిజన్లు గెలుచుకుంది. బీజేపీకి అదనంగా వచ్చిన ఓట్లన్ని కాంగ్రెస్ తో పాటు టీడీపీవేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా, బీజేపీ హిందుత్వ నినాదం వినిపించినా గత ఎన్నికల కంటే గ్రేటర్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు తగ్గాయి. కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా ఉన్న చోట బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ గెలిచిన ఉప్పల్, ఏఎస్ రావు నగర్ తో పాటు గట్టి పోటీ ఇచ్చిన గాజుల రామారంలో బీజేపీ అభ్యర్థులు బాగా వెనకబడ్డారు. ఈ లెక్కన కాంగ్రెస్ కొంత బలంగా ఉంటే గ్రేటర్ లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటకపోయేదని టీఆర్ఎస్ నేతలతో పాటు కేసీఆర్ అంచనాకు వచ్చారట.   తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను సమగ్రంగా విశ్లేషించిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంటనే బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయగలమనే భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఒకే పార్టీకి వెళుతుండటంతో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. అదే ప్రజా వ్యతిరేక ఓటు చీలితే తమకు ఇబ్బంది ఉండదని గులాబీ బాస్ భావిస్తున్నారట. కాంగ్రెస్ బలంగా ఉంటనే టీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే భావనలో  ఉన్నారట. అందుకే రాష్ట్రంలో  రోజురోజుకు బలహీన పడుతున్న కాంగ్రెస్ బలోపేతం కావాలంటే టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి రావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.  మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే,  తమకు ఎదురు లేకుండా ఉండాలంటే కాంగ్రెస్ కనుమరుగు కావాలని కోరుకుంటున్న కమలం నేతలు.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావొద్దని బలంగా కోరుకుంటున్నారట. మొత్తంగా ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి ఎంపీ  రేవంత్ రెడ్డిపైనే టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉండటం ఆసక్తిగా మారింది. తెలంగాణ రాజకీయాలన్ని ఆయన చుట్టే తిరుగుతున్నాయనడానికి టీఆర్ఎస్, బీజేపీ ఆలోచనలే నిదర్శమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.     

చదువుతోంది సీఏ.. ఆధార్ నంబర్, నీటిచుక్కల సాయంతో ఘరానా మోసం  

వైరస్ లు రూపం మారుస్తున్నట్లే.. మన సమాజంలో మోసాలు కూడా కొత్త కొత్త రూపం మార్చుకుంటున్నాయి. నేరస్తుల కొత్త కొత్త క్రియేటివిటీ పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలతో సామాన్య జనం హడలి పోతున్నారు. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఫొటో, నీటిచుక్కల సాయంతో తాజాగా పలువురు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.   ఏపీకి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి కొంత మంది నిందితులు భూముల దస్తావేజులు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫొటోలతో మధురానగర్ కు చెందిన సిద్ధిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి బ్యాంకు అకౌంట్ లోని రూ. 10వేలు మాయం చేసారు. దీంతో బాధితుడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపాయింట్ ద్వారా ఆ డబ్బును స్వాహా చేసినట్టు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు విశాల్, అర్షద్ లు సీఏ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

దేశంలో 20కి పెరిగిన కరోనా స్ట్రెయిన్ కేసులు! 

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కరోనా స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ కొత్త కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం వరకు కొత్త కరోనా కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండగా.. 24 గంటల్లోనే  మొత్తం 20 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. మంగళవారం నాడు ఆరుగురికి కొత్త వైరస్ సోకిందని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ, తాజాగా.. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోనూ న్యూ స్ట్రెయిన్ కనిపించిందని స్పష్టం చేసింది. కోల్ కతా, పూణేలో ఒక్కో కేసు, బెంగళూరులో  7, హైదరాబాద్ లో  3, ఢిల్లీలో   2 కరోనా  స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.  నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య యూకే నుంచి భారత్ కు వచ్చిన 33 వేల మందికి ఇప్పటి వరకు టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఇప్పటి వరకు 20 మందికి కరోనా సోకినట్లు కేంద్రం ఆరోగ్యశాఖ నిర్ధారించింది.  యూకే కరోనా కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. జినోమ్ పరీక్షల దేశంలో 10 ల్యాబ్ లు ఏర్పాటు చేసింది. కరోనా కొత్త వైరస్ సోకిన బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులను ట్రేస్ చేసి కరోనా టెస్ట్ లు నిర్వహిస్తోంది. కరోనా స్ట్రెయిన్ సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన వారందరిని  క్వారంటైన్ కు తరలిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. కరోనా స్ట్రెయిన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు.  రూపాంతరం చెందిన కరోనా  70 శాతం వరకూ వేగంగా వ్యాపిస్తున్నా.. పెద్దగా భయపడాల్సిందేమీ లేదని చెబుతున్నారు. కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పాటిస్తుంటే కొత్త వైరస్ కూడా సోకకుండా ఉంటుందని సీసీఎంబీ పేర్కొంది. మాస్క్ లు, భౌతికదూరం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కొత్త స్ట్రెయిన్ కు కూడా దూరంగా ఉండవచ్చని  సూచిస్తోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్  కొత్త స్ట్రెయిన్ ను కూడా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.