సీఎం జగన్ పాలనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు 

ఏపీ సీఎం జగన్ పరిపాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. "అయ్యా జగన్మోహన్‌రెడ్డి.. నువ్వు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే.. అది అప్పులు, అవినీతే" అంటూ సోము వీర్రాజు సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిన్న నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సీఎం అప్పులతో పాలన చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే గానీ, జగన్ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదన్నారు. ఒక్క ఇళ్ల స్థలాల పంపిణీకి 9వేల కోట్లు నిధులు కేటాయించి, అందులో సగం బొక్కేశారని ఆరోపించారు.   మరోపక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు కేటాయిస్తే, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల 8 లక్షల ఇళ్లు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలోని ఎర్రచందనం స్మగ్లర్లు అంతా వైసీపీ నేతల అనుచరులేనని అయన ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుకనూ దోపిడీ చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అందుకే వారంతా పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ ప్రభుత్వ దోపిడీ విధానాలను ఎండగడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తమపార్టీ ఉద్యమం చేస్తుందని అయన చెప్పారు. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం విచిత్రమైన జీవో.. ఇది కదా పరిపాలనంటే..  

ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక విచిత్రమైన జీవో తీసుకొచ్చింది. కుక్కలు, పందులకు లైసెన్స్‌లు ఉండాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే యజమానికి రూ.500 ఫైన్‌తో పాటు రోజుకు రూ.250 రుసుము వసూలు చేస్తారని జీవోలో పేర్కొంది. ఒకవేళ ఎవరూ వాటి ఓనర్లుగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కులు, పందులుగా పరిగణించి వాటికీ కుటుంబ నియంత్రణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. అంతేకాకుండా లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా వాటికి తిరిగి లైసెన్స్ పొందాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.   అంతేకాకుండా లైసెన్స్‌లు పొందే ముందు కుక్కలు, పందుల యజమానులు వాటికి సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్ కూడా అందజేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఇటు కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ అందచేయడం, అటు పందుల విషయంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం అదేశించింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించింది. ఆ టోకెన్లను పెంపుడు జంతువుల మెడలో నిరంతరం వేలాడేలా చూడాలని ఆ ఆదేశాలలో పేర్కొంది.

ముంబై ఈడీ ఆఫీసుకు బీజేపీ పార్టీ బ్యానర్..

మహారాష్ట్రలో ఒకప్పటి మిత్రులైన బీజేపీ శివసేనల మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం నడుస్తున్నసంగతి తెల్సిందే. ఈ మాటల యుద్ధం తాజాగా ఒకరి పై మరొకరు ప్రత్యక్ష చర్యలకు దిగే పరిస్థితులలోకి దారి తీశాయి. శివసేన ఎంపీ సంజయ్‌‌ రౌత్‌‌ భార్య వర్షా రౌత్‌కు తాజాగా ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఏకంగా బీజేపీ ప్ర‌దేశ్ కార్యాల‌య్ ( మహారాష్ట్ర స్టేట్ బీజేపీ ఆఫీసు) అంటూ ప్లెక్సీ క‌ట్టారు. అంతేకాకుండా ఈడీ, బీజేపీల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు కూడా చేశారు.   పీఎంసీ బ్యాంకు సొమ్ము అక్రమ రవాణా కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన విషయంపై శివ‌సేన మండిప‌డుతోంది. తమ పార్టీ నాయకులపై బీజేపీ ఈడీని ఉసిగొల్పుతుంద‌ని వారు ఆరోపించారు. మ‌హారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ కూట‌మిని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని, గత సంవ‌త్స‌రకాలంగా త‌మ‌ను బెదిరిస్తూనే ఉన్నార‌ని సంజ‌య్ రౌత్ ఆరోపించారు. బీజేపీ పాల్పడుతున్న ఇటువంటి కవ్వింపు చ‌ర్య‌ల‌కు శివ‌సేన భ‌య‌ప‌డదంటూ ఆధిత్య థాక్రే హెచ్చ‌రించారు.

మోడీ ఇలాఖాలో బీజేపీకి బిగ్ షాక్! 

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ గట్టి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి,  భరూచ్‌ లోక్‌సభ  సభ్యుడు మన్‌సుఖ్‌‌ భాయి వాసవ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌కు ఆయన లేఖ రాశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు వాసవ తెలిపారు. వాసవ రాజీనామా అంశంపై బీజేపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్‌ పాండ్యా స్పందించారు. ఆయన రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీకి అందిందన్నారు. మన్షుక్‌ భాయ్‌ తనతో మాట్లాడారని చెప్పారు. ఆయనో సీనియర్‌ ఎంపీ అని, వాసవ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.      గుజరాత్ లో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న వాసవ ఆరు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాను లేవనెత్తిన సమస్యలపై పార్టీ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. బీజేపీ  పనితీరుపైనా ఆయన కొంత కాలంగా  అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవలి తన నియోజకవర్గంలో పలు సమస్యలపైనా వాసన్ మాట్లాడారు. గత వారంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వాసవ లేఖ రాశారు. నర్మదా జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్‌ జోన్లుగా ప్రకటించే నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకొనేలా పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  అయితే తన లేఖపై స్పందించలేదనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని భావిస్తున్నారు.  ‘‘పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాను. పార్టీ విలువల రక్షణకు కృషిచేశాను. అన్నింటికి మించి నేనో మనిషిని. తెలిసో తెలియకో మనిషి తప్పులు చేస్తాడు. నేను చేసిన తప్పు పార్టీకి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నా. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలుస్తాను. లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను అందజేస్తా. నా నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియపరచండి’’ అని తన లేఖలో పేర్కొన్నారు మన్‌సుఖ్‌‌ భాయి వాసవ.   

రాజమండ్రి మహిళకు  కరోనాస్ట్రెయిన్‌! 

బ్రిటన్ ను వణికిస్తున్న కొత్త రకం వైరస్ కరోనా స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటరైంది.  యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్ట్రెయిన్‌ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ అధికారికంగా ప్రకటించారు. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లు ధ్రువీకరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. ఆమె కుమారుడి సహా కుటుంబసభ్యులకూ కరోనా నెగెటివ్‌ నిర్ధారణ అయింది.  కరోనా స్ట్రెయిన్ సోకిన మహిళ నుంచి మరెవరికీ వైరస్ వ్యాపించ లేదని  కాటమనేని భాస్కర్‌ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూకే స్ట్రెయిన్‌ రాష్ట్రంలో విస్తరించిన దాఖలాలులేవని , అపోహలను నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురికి స్ట్రెయిన్‌ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.   బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2, పూణేలో ఒక యూకే కరోనా కొత్త వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. యూకే నుంచి డిసెంబర్ 9 తర్వాత భారత్ కు 33వేల మంది ప్రయాణికులు వివిధ ఎయిర్ పోర్ట్ ల ద్వారా దేశానికి చేరుకున్నారు. వారిని ట్రేస్ చేసి కరోనా టెస్ట్ లు చేయగా..అందులో 114మందికి కరోనా సోకినట్లు తేలింది. యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్ వచ్చిన ఈ 114 మందిలో ఎంతమందికి ఈ యూకే కరోనా కొత్తవైరస్ సోకిందో తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆరు ల్యాబొరేటరీలకు ఈ జీనోమ్ సీక్వెన్సీకి పంపించారు. అక్కడ పలు టెస్టుల్లో ఆరుగురికి యూకే కొత్త వైరస్ సోకినట్లు గుర్తించారు. అనంతరం ఆ ఆరుగురికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పిన కేంద్రం.., ఈ కరోనా కొత్తవైరస్ పై దేశంలోని అన్నీ రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది.  

పవన్ చిడతల నాయుడు.. మెడపై మట్టి నలుపుకుంటాడు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను చిడతల నాయుడు అని సంబోదిస్తూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో దిట్ట అని విమర్శించారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ చిడతలు కొట్టారని విమర్శలు గుప్పించారు. "నేను వైఎస్‌ఆర్‌కు భక్తుడిని. చచ్చిపోతూ కూడా వైఎస్‌ కుటుంబానికే భజన చేస్తా. డబ్బులు కోసం చిడతలు కొట్టే వాడిని కాదు." అని పేర్ని నాని అన్నారు.    ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 2014లో పంటలు నష్టపోతే మీ జాయింట్ ప్రభుత్వం (టీడీపీ-బీజేపీ)తో ఎంత ఇప్పించావు..? ఏ అసెంబ్లీని ముట్టడించావ్..? అని ప్రశ్నించారు. నువ్వు, నీ పార్టనర్ కలిసి ఇచ్చినదానికంటే ఎక్కువే ఇస్తున్నాం అన్నారు.   గుడివాడ పర్యటనలో భాగంగా నాని అంటే ఎవరో తెలియదన్న పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరు?.. మెడపై మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయనేనా పవన్ అంటే అని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఈయన ఎప్పుడు వకీల్ అయ్యాడు..? ఏ యూనివర్శిటీలో వకీల్ చదివాడు..? అని ఎద్దేవా చేశారు. "జనం పవన్‌ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. పవన్‌ది అంతా సెట్టింగ్‌లు, ప్యాకప్‌లు వ్యవహారమే" అంటూ పవన్‌ పై మంత్రి విరుచుకుపడ్డారు.

చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా నిధులు, నివర్ తుఫాను నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. సీఎం వైఎస్ జగన్‌ క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో నిధులు విడుదల చేశారు. మొత్తం 1766 కోట్లను 50 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైయస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కింద ఇప్పటి వరకు మొత్తం రూ.13,101 కోట్లను ప్రభుత్వం అందించిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.13,500 లు చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు.    నివర్ తుఫాన్‌ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పామని.. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్షనేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒక్క రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారంటూ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, 12 కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మోసాన్ని భరించలేకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు‌.

బండి సంజయ్‌కు ఎంపీ పదవి కేసీఆర్ భిక్షే! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. బండి సంజయ్‌ నోరు అదుపులో పెట్టకొని మాట్లాడాలని, లేకుంటే అంతే ధీటుగా జవాబు ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదన్నారు బాల్క సుమన్. బీజేపీ ఎంపీలు స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు. ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్నారు. బండి సంబయ్ కి  ఎంపీ పదవి కూడా సీఎం కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు బాల్క సుమన్. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే… తెలంగాణ రాకుంటే సంజయ్‌కి ఆ పదవి ఎక్కడిదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

జర్నలిస్ట్ కుటుంబానికి రక్షణ! టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులో హైకోర్టు 

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు  టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై జర్నలిస్టు సంతోష్ నాయక్ వేసిన కేసుపై మంగళవారం  హైకోర్టు విచారించింది. తనను చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో జర్నలిస్టు సంతోష్ నాయక్ రిట్ పిటీషన్  దాఖలు చేశారు. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని  పిటీషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. ఎలాంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో త్వరగా కష్టడీలోకి తీసుకొని విచారణ చేయకపోతే ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రాముఖ్యతను తగ్గించిన వాళ్ళం అవుతామని కోర్టుకు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని  ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాలని తాము చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో సరైన దర్యాప్తు జరగకపోతే మరోసారి కోర్టుకు పిటిషనర్ రావొచ్చని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్‌కు ప్రాణ హాని ఉందని, దీంతో అతని, అతని కుటుంబం సభ్యులకు  పోలుసులు రక్షణ కల్పించాలి అని హైకోర్టు ఆదేశించింది. తనకు ప్రాణ హానీ ఉందని భావిస్తే డీఎస్పీకి దరఖాస్తు పెట్టుకోవాలని  జర్నలిస్ట్ సంతోష్ నాయక్ కు సూచించింన హైకోర్టు.. పోలీసులు కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

భవిష్యత్తులో కరోనా కంటే పెద్ద గండాలు!  

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతోంది.  ఏడాది క్రితం వెలుగుచూసిన ఈ వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. అన్ని రంగాలను ఈ మహమ్మారి కుదేలు చేసింది. కరోనా దెబ్బకు కొన్ని చిన్న దేశాలు పూర్తి చితికిపోయాయి. కరోనా ఇప్పుడు కొత్త రూపులో మరింత ఆందోళన కల్గిస్తోంది. కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కోవిడ్ వ్యాక్సిన్ కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చినా.. కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే  కరోనా మహమ్మారి అంత పెద్దదేం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ సెల్ చీఫ్ మైకేల్‌ ర్యాన్‌ సూచించారు.  కరోనా చాలా వేగంగా వ్యాపించి అనేక మందిని బలిగొందని ర్యాన్‌ గుర్తుచేశారు. అయితే భవిష్యత్తులో రాబోయే మహమ్మారులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరింత తీవ్రమైన అంటువ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు.  కరోనా సమయంలో అనేక నూతన ఆవిష్కరణలు, వేగవంతమైన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్‌వో సీనియర్‌ సలహాదారు బ్రూస్‌ ఇల్‌వర్డ్‌ గుర్తుచేశారు. భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అందుకోవడంలో ఇంకా చాలా దూరం ఉన్నామని తెలిపారు. కరోనా రోజురోజుకీ రూపాంతరం చెందుతూ రెండు, మూడో దశలోకి ప్రవేశిస్తోందని గుర్తుచేశారు. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి కూడా ఇంకా మనం పూర్తి సన్నద్ధంగా లేమని తెలిపారు. భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనేందుకు కరోనా మనల్ని సంసిద్ధుల్ని చేసిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానామ్‌ తెలిపారు.  అంటువ్యాధులపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. యూకే, దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు నిర్ధారణ పరీక్షల్ని చేస్తేనే కొత్త రకాల్ని గుర్తించగలమన్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానామ్‌.  

సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం.. పట్టపగలే టీడీపీ నేత హత్య!

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద అందరు చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.    టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌ లో ఎమ్మెల్యే పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చడం కిరాతక చర్య అని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టీడీపీ నేత హత్య సీఎం జగన్ రెడ్డికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని.. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందన్నారు.   సుబ్బయ్య హత్యపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సీఎం సొంత జిల్లాలో టీడీపీ నేత హత్య రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందన్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మారణాయుధాలతో పాలిస్తారా? అని నిలదీశారు. చివరకు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హత్య రాజకీయాలకు తెరదీశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారు టెర్రరిస్టులే!  

న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని కామెంట్ చేశారు సీపీ సజ్జనార్. ఈ వారం రోజులు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  సోమవారం  ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 402 మంది పట్టుపడ్డారని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ మరోసారి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే సంతోషంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. 

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ముగ్గురు.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను కలవాలని ఆదేశించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని వారు వివరించి చెప్పాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన వెంటనే మూడు రోజులలోపు ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది.    ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు ఎన్నికల కమిషన్ కు వివరించాలని తెలిపింది. అలాగే, ఇంతవేగంగా ఎందుకు ఎన్నికలు జరపాల్సి వస్తోందో.. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి వివరించాలని సూచించింది. ఈ చర్చలకు వేదికను ఎన్నికల కమిషన్ నిర్ణయించాలని పేర్కొంది. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

అనారోగ్యమా.. వెనుకంజా? రజనీకాంత్ పార్టీకి అసలు ఏమైంది?  

తెలుగు వన్ చెప్పిందే అక్షర సత్యమైంది.  తమిళ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పురుడు పోసుకోకముందే పత్తా లేకుండా పోయింది. తెలుగు వన్ ఊహించినట్లే రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గారు రజనీకాంత్. అనారోగ్య  కారణాలతో  రాజకీయ పార్టీ ఏర్పాటుపై  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించలేనంటూ మూడు పేజీల  లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన భాషా..  అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని అందులో  వివరించారు. రాజకీయ పార్టీపై తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను వేడుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ పార్టీ పెట్టబోరని అతను హాస్పిటల్ లో జాయిన్ కాకముందే కథనం ఇచ్చింది తెలుగు వన్.     రాజకీయ పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ వెనక్కి తగ్గడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి అందరికి అనుమానాలే ఉన్నాయి. సాఫ్ట్ గా ఉండే వ్యక్తిగా పేరున్న  రజనీకాంత్ పార్టీని నడపలేరనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపించింది.  రాజకీయ పార్టీని ఆయన  ముందుకు తీసుకెళ్లలేరని కొందరు ఓపెన్ గానే చెప్పారు. కేవలం బీజేపీ కోసమే అయిష్టంగానే ఆయన పార్టీ పెడుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. రజనీకాంత్ తో ఆరెస్సెస్, బీజేపీ నేతల సమావేశాలు కూడా ఆ వాదనకు బలం చేకూర్చాయి. బీజేపీకి మద్దతుగా రజనీకాంత్ కొన్ని ప్రకటనలు కూడా చేయడంతో.. తమిళనాడులో పుంజుకోలేకపోతున్న కమలం పార్టీ  రజనీకాంత్ ద్వారా కొత్త ఎత్తులు వేస్తుందన్న విమర్శలు వచ్చాయి.  యూపీఏలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే గెలవకుండా, తనకు మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకేకు ప్రయోజనం కలిగేలా చూసేందుకే రజనీకాంత్ ను బీజేపీ తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు పలు వర్గాల నుంచి వచ్చాయి.   తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. 2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. రాజకీయ పార్టీపై మూడేండ్లు నాన్చడం, మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆయన పార్టీ ఉండదనే దాదాపుగా అంతా భావించారు. ఇంతలోనే సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. గత నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.  పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే  సినిమా షూటింగ్ లో ఒక్కసారిగా అనారోగ్యానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. దీంతో రాజకీయ  పార్టీ ప్రకటన వాయిదా వేయడానికే రజనీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే విమర్శలు  వచ్చాయి.    గతంలోనూ  కొందరు రాజకీయ నేతల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ మార్పు సందర్భాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి.  ఏపీ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు కన్నా లక్ష్మినారాయణ . తెల్లారితే కన్నా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాల్సి  ఉండగా.. బీజేపీ పెద్దలు ఎంట్రీ అయ్యారు. కన్నాను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతలోనే  వైసీపీలో చేరడానికి అన్ని సిద్దం చేసుకున్న కన్నా లక్ష్మినారాయణ.. అర్ధరాత్రి పూట సడెన్ గా అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.  మరికొన్ని గంటల్లో వైసీపీలో చేరాల్సి ఉన్న  కన్నా.. అది తప్పించుకోవడానికే హాస్పిటల్ లో చేరారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలోనూ అచ్చం అలానే జరిగిందనే చర్చ  జరుగుతోంది.  రాజకీయ పార్టీపై రజనీకాంత్  వెనక్కి తగ్గారని  గతంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది.  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్..  అది తన ప్రకటన కాదంటూనే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను  పరోక్షంగానే అంగీకరించారు.  తనకు అనారోగ్యం ఉందని గతంలో అంగీకరించిన రజనీకాంత్.. పార్టీ ఏర్పాటుకు మళ్లీ ఎందుకు ముందుకు వచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది. వైద్యులు చెప్పినట్లు చేయకుండా డిసెంబర్ 31న పార్టీ పేరు ప్రకటిస్తానని ఎందుకు చెప్పారన్నది ఎవరికి అర్ధం కావడం లేదు. బీజేపీ కోసం ఏదో చేయాలని తలంచినా... ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇప్పుడు వెనక్కి తగ్గారని కొందరు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గడంతో ఆయన అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు.   

గన్నవరం మళ్లీ గరం.. వల్లభనేని వంశీకి చేదు అనుభవం

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యేను బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వేదిక వద్దకు వెళ్లనీయకుండా ఓ వర్గం అడ్డుకుంది. తమ గ్రామంలోకి రావద్దంటూ, రోడ్డుపై బైఠాయించి.. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో 1400 తెల్ల రేషన్‌ కార్డులు ఉంటే.. 400 మందికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. వేరే గ్రామాల వారికి తమ ఊరిలో పట్టాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేది ఏమీలేక వంశీ వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆ గ్రామంలో వైసీపీలో గ్రూపు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్నవర్గమే ఈ ఆందోళనను ప్రోత్సహించిందని వంశీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో గన్నవరం వైసీపీ నేతల వర్గీయులు తరచూ గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా.. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలు అక్కడికి చేరుకుని ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు.

పవన్ వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్

జనసేన నేత పవన్ కళ్యాణ్ సోమవారం గుడివాడ పర్యటన సందర్భంగా మంత్రి కొడాలి నాని పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కొడాలి నాని జనసేన అధినేత విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం జరిగిన పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని అయన వ్యాఖ్యానించారు. పవన్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే అటు గాజువాక, ఇటు భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్‌లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమని నాని విమర్శించారు. విజయవాడ నగరంలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో.. పేకాట క్లబ్ లు నిర్వహించిన చరిత్ర చంద్రబాబు, అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ది అంటూ నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అలాగే గుడివాడ లో పేకాట క్లబ్ లను మూయించిన చరిత్ర సీఎం జగన్ ది, తనది అని అయన అన్నారు. అసలు పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు. ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని నాని హెచ్చరించారు. పవన్ వకీల్ సాబ్ కాదు...షకీలా సాబ్ అని జనాలు అనుకుంటున్నారని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను సినిమాలు మానేయమని ఎవరూ చెప్పలేదు, ఆయన సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఒకటే అని నాని పేర్కొన్నారు. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్‌లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం సీఎం జగన్ బొచ్చు కూడా పీకలేరంటూ కొడాలి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

అవే ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగేదా.. రోజాకు నారాయణ కౌంటర్ 

నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా తనపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా కౌంటరిచ్చారు. విశ్వాసపాత్రమైన కుక్కలే కనుక ఉండి ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యేవారా? అని అయన రోజాను ప్రశ్నించారు. గతంలో చంద్రబాబును వ్యతిరేకించి, వైఎస్ఆర్‌ను సమర్ధించినప్పుడు తన కులం ఏమైనా మారిందా? అని నారాయణ నిలదీశారు. రోజా మాదిరిగా తాను పార్టీలు, కులాలు మార్చలేదని అయన అన్నారు.   అంతకుముందు.. సీపీఐ నేత నారాయణపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేసారు. గొప్ప కమ్యూనిస్ట్ భావాలున్న సీపీఐ కి ఆయన తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేంత స్థలం కూడా పేద ప్రజలకు ఇవ్వటం లేదని నారాయణ అంటున్నారని ఆమె మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేయకుండానే సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని అన్నారు. అసలు నారాయణ నగరికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. సీపీఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికి తెలుసునని.. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ మార్చేశారని రోజా విమర్శించారు.

రాజకీయ పార్టీ పెట్టడం లేదన్న  రజనీకాంత్! క్షమించాలని అభిమానులకు విన్నపం

అనారోగ్యానికి గురైన  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు రజనీ కాంత్. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన అందులో వివరించారు. రాజకీయ పార్టీపై తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు . రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు రజనీకాంత్.   2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్.  మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.  పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ లో చేరారు. ఆరోగ్య  పరిస్థితి దృష్ట్యా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రాజకీయ పార్టీ ప్రకటన ఉండబోదని క్లారిటీ ఇచ్చారు రజనీ కాంత్. రాజకీయ పార్టీ ఉండబోదన్న రజనీకాంత్ ప్రకటనతో ఆయన అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

జర భద్రం.. తెలంగాణాలో బయటపడ్డ రెండు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు 

బ్రిట‌న్ లో కొత్తగా వెలుగు చూసిన రూపాంతరం చెందిన క‌రోనా వైర‌స్ కేసులు తాజాగా భారత్ లోనూ న‌మోద‌వుతున్నాయి. బ్రిట‌న్ లో కొత్త స్ట్రెయిన్ మొదలైందని ప్ర‌క‌టించ‌గానే ఆ దేశం నుండి వ‌చ్చే విమానాల‌పై భార‌త్ నిషేధం విధించిన‌ప్ప‌టికీ… కేంద్రం రియాక్ట్ అయ్యే లోపే వైర‌స్ భారత్ లో ఎంట‌ర్ అయిపోయింది. తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్రకటించింది.   దేశ‌వ్యాప్తంగా ఈ కొత్త స్ట్రెయిన్ వైర‌స్ కేసులు 6 న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు వెల్ల‌డించింది. ఇందులో బెంగ‌ళూరులో 3, హైద‌రాబాద్ లో 2, పుణేలో ఒక‌రికి కొత్త స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు బులిటెన్ వెల్ల‌డించింది. బ్రిట‌న్ నుండి వ‌చ్చిన మొత్తం 33వేల మందిని ప‌రీక్షించ‌గా 114మందికి వైర‌స్ ఉన్న‌ట్ల నిర్ధార‌ణ అయ్యింద‌ని, అందులో 6గురికి ఈ కొత్త స్ట్రెయిన్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింద‌ని తెలిపింది.   ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, వైర‌స్ ఉన్న వారిని ప్రత్యేక గ‌దిలో ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. బ్రిటన్ లో గుర్తించిన ఈ కొత్త స్ట్రెయిన్ వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించిన సంగతి తెల్సిందే. ఈ క‌రోనా స్ట్రెయిన్ తో యువ‌త‌, పిల్ల‌ల్లోనూ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతాయని హెచ్చ‌రించింది.   ఇది ఇలా ఉండగా ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి (49)లో దీనిని గుర్తించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది. అయితే ఆమెకు సోకింది కొత్త కరోనానా? కాదా? అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. అయితే యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం ఫలితాల నివేదికను ఆదివారమే సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అందులోనే వరంగల్‌ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను నిర్ధారించినట్లు సమాచారం. ఇతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.   మరోపక్క రాష్ట్రంలో బ్రిటన్ నుండి వచ్చి ట్రేస్‌ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 21 మందిలో హైదరాబాద్ ‌వారు నలుగురు, మేడ్చల్‌వారు 9 మంది, జగిత్యాల జిల్లావాసులు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.