టీఆర్ఎస్ కు వరంగల్, ఖమ్మం టెన్షన్ ! ఎన్నికల వాయిదాకు ప్లాన్ ?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఫలితాలతో షాకైన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలంటేనే భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉండటంతో ఇప్పట్లో ఎన్నికల జోలికి వెళ్లకపోవడమే బెటరని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గడువుకన్నా రెండు నెలల ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ సర్కార్... వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రం ప్లాన్ మార్చినట్లు చెబుతున్నారు. గడువు ముగిసిన తర్వాత కొంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలో పెట్టి పరిస్థితులు అనుకూలంగా వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. సోమవారం జరగాల్సిన మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన వాయిదా పడటంతో కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం మార్చి 14వ తేదీ వరకు ఉంది. పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో ప్రతికూల పరిస్థితి ఉన్నట్లు తేలిందట. గతేడాది వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోవడం, జీహెచ్ఎంసీ తరహాలో వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం లాంటి అంశాలు వరంగల్ లో అధికార పార్టీకి ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. దీంతో తొందరపడి ఎన్నికలకు వెళ్లడం కంటే. ఎన్నికల వాయిదా పద్ధతే ఉత్తమమన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాల్టీల పాలకమండళ్ల గడువు ఐదారు నెలల్లో ముగియనుంది. దీంతో వాటితో పాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉందని చెబుతున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఆ రెండు ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని కాస్త మెరుగుపర్చుకుని ఇప్పటివరకు జరిగిన డ్యామేజీని కాస్త చక్కిదిద్దుకోవచ్చన్నది గులాబీ పార్టీ ఆలోచనగా ఉందంటున్నారు.
గడువు ప్రకారమే ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వరదసాయం, ఎల్ఆర్ఎస్ లాంటి అంశాలను ప్రచారం చేస్తోంది. రెండు నెలల ముందస్తు ఎన్నికలకు పోయి జీహెచ్ఎంసీలో చేదు అనుభవాలను చవిచూసినందువల్ల వరంగల్, ఖమ్మం ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా గడ్డు పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోందట. వరంగల్, ఖమ్మం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మంత్రి కేటీఆర్ రెండు చోట్ల టెక్స్టైల్ పార్కు, ఐటీ పార్కు లాంటి పలు ప్రకటనలు చేశారు. స్వయంగా ఈ రెండు జిల్లాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాలనను గాడిలో పెట్టడానికి దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో సైతం లబ్ధి పొందడానికి కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
టీఆర్ఎస్ సర్కార్ తీరుతో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడువు ముగియడానికి మూడు నెలల ముందునుంచే ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టాల్సి ఉంటుంది. కాని ఇప్పటికింకా అలాంటి ప్రయత్నాలే ప్రారంభం కాలేదు. ఈలోగా కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయడం, దానికి అనుగుణంగా వార్డుల పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల ఖరారు, పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించడం లాంటివన్నీ జరగాల్సి ఉంది. ఇవేని జరగకపోవడంతో గడువు లోగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగడం కష్టమేననే అభిప్రాయమే అధికార వర్గాల నుంచి వస్తోంది.