మరోసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు జగన్ నిర్ణయం.. రోజాకు ఉద్వాసనేనా?

ఏపీ సీఎం జగన్ మరో సారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారా? ఇటీవల కేబినెట్ సమావేశం అనంతరం ఆయన కొందరు మంత్రులను ఉద్దేశించిన నేరుగా, మరి కొందరిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన ఆగ్రహం, మంత్రి పదవులు పీకేస్తా జాగ్రత్త అంటూ చేసిన హెచ్చరికలను  బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తుంది. ఆయన హెచ్చరికల అనంతరం కూడా కేబినెట్ మంత్రులలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మోస్ట్లీ నవంబర్ లో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారనీ, ప్రస్తుత కేబినెట్ లో కనీసం అరడజను మందికి ఉద్వాసన తప్పదనీ కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కిన రోజాకు తదుపరి పునర్వ్యవస్థీకరణలో అంటే నవంబర్ లో ఆమె పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందనీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆమెకే కాకుండా మరో మహిళా మంత్రి విడదల రజనికి కూడా ఉద్వాసన తప్పకపోవచ్చునని అంటున్నారు. రోజాపై జిల్లాలోనే కాకుండా, మంత్రి పదవి చేపట్టిన తరువాత ఆమె వ్యవహారశైలిపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారనీ, ఇక మరో మహిళా మంత్రి విడదల రజనీ అయితే సామాజిక మాధ్యమంలో సొంత ప్రచారంపై పెడుతున్న శ్రద్ధ, పార్టీ వ్యవహారాలలోనూ, విపక్ష విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలోనూ చూపడం లేదన్నది జగన్ భావనగా చెబుతున్నాయి. అందుకే జగన్ ఆరు నెలల వ్యవధిలోనే తన మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఆరు నెలల కిందట జగన్ కొత్త టీమ్ ను ఎంపిక చేసిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ కూర్పు చేసిన సందర్భంగా ఈ కేబినెట్ ను రెండున్నర సంవత్సరాలు మాత్రమేననీ, రెండున్నర సంవత్సరాల అనంతరం కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకుంటాననీ జగన్ విస్పష్టంగా చెప్పారు. అన్నట్లుగా సరిగ్గా రెండున్నర సంవత్సరాలకే కాకుండా మూడేళ్లు కావస్తుండగా జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. అయితే ఆయన ముందుగా చెప్పిన విధంగా మొత్తం కేబినెట్ ను మార్చేయలేదు. కొందరు పాతవారిని కొనసాగిస్తూ కొందరిని తప్పించి కొత్తవారికి స్థానం కల్పించారు. ఈ కారణంగానే ఉద్వాసనకు గురైన మంత్రులలో అసంతృప్తి భగ్గు మంది. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొందరు మౌనం దాల్చి తన నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ 2.0 టీమ్ లో గట్టిగా మాట్లాడేవారు కానీ, విపక్ష విమర్శలను దీటుగా ఎదుర్కొనేవారు కానీ లేరన్న భావన సీఎం జగన్ లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే జగన్ సతీమణి భారతిపై ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంగా కేబినెట్ సహచరులే కాదు.. పార్టీలో ఎవరూ కూడా దీటుగా స్పందించకపోవడంతో జగన్ లో అసహనం కట్టలు తెంచుకుందంటున్నారు. ఆ కారణంగానే కేబినెట్ సహచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరోసారి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి నోరున్న మంత్రులకు చోటు కల్పించాలన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని నిర్ధారణ అయిన తరువాతనే కొడాలి నాని మళ్లీ తన గొంతు సవరించుకున్నారనీ, చంద్రబాబుపై, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పూర్వంలా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో పదవి కోల్పోయిన కొడాలి నానికి మలి పునర్వ్యవస్థీకరణలో పదవి గ్యారంటీ అని పరిశీలకులు అంటున్నారు. 

లిక్కర్ దందా...బయటపడుతున్న తాడేపల్లి ప్యాలస్ లింకులు!?

ఢిల్లీ లిక్కర్ స్కారం విషయంలో విపక్షం తన సతీమణి భారతిపై ఆరోపణలు చేస్తుంటే కౌంటర్ ఇవ్వకుండా సైలంట్ గా ఉంటారా? అంటూ జగన్ తన మంత్రివర్గ సభ్యులపై ఫైర్ అయినే మంత్రి పదవులు ఊడబీకి పారేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించినా ఎవరూ కూడా పెదవి విప్పకపోవడానికి కారణమేమిటన్నది మెల్లమెల్లగా బయటకు వస్తోంది. ఏ ఢిల్లీ లిక్కర్ స్కాంపై జగన్ సతీమణి భారతిపై ఆరోపణలు వచ్చాయో అదే లిక్కర్ స్కార్ డొంక మెల్లిమెల్లిగా కదులుతోంది. తాజాగా జరిగిన ఈడీ రైడ్స్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి పాత్ర ఉందని బయటపడింది. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు మీడియాకు వెల్లడించారు. తాజాగా ఈడీ జరిపిన సోదాల్లో విజయసాయి అల్లుడి పేరు బయటపడింది. సృజన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలపై దాడులు నిర్వహించిన ఈడీ దాడుల్లో ఇందుకు సంబంధించి ఆధారాలు లభ్యమయ్యయని ఆయన మీడియా ముందు చెప్పారు. విజయసాయి లింకులు ఢిల్లీ లిక్కర్ దందాలో ఉన్నాయంటే.. వాటి వెంబడే తాడేపల్లి లింకులు కూడా బయటపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన సతీమణిపై వచ్చిన ఆరోపణలతో జగన్ తీవ్ర అసహనానికి లోనయ్యారని చెబుతున్నారు. అయితే జగన్ ఎంతగా బెదరించినా, హెచ్చరికలు జారీ చేసినా ఆయన కేబినెట్ సహచరులు జగన్ కోరుకున్న విధంగా విపక్షం విమర్శలను అగ్రసివ్ గా ఖండించకపోవడమే.. విపక్షాల ఆరోపనల్లో ఏదో మేరకు వాస్తవం ఉందనడానికి నిదర్శనంగా వారు చెబుతున్నారు. ఇలా ఉండగా జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసన చెబుతానని హెచ్చరించిన తరువాత అమాత్యుల నుంచి మర్యాద గీత దాటిన ఖండనలు మాత్రమే రావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గకార్లు ఎక్కి తిరగడానికా ? అంటూ కొందరు మంత్రులకు జగన్ ముఖం మీదనే క్లాసు పీకారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  కొందరు మంత్రులు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల విషయంలో అంటీ ముటగ్టనట్టు వ్యవహరిస్తున్నారనీ, అటువంటి వారికి ఉద్వాసన తప్పదనీ సీఎం ఘాటుగానే హెచ్చరించారని కూడా అంటున్నారు. ఇంత ఘాటు హెచ్చరికలు చేసిన మంత్రులలో ఏ మాత్రం స్పందన లేకపోవడం.. కేబినెట్ లో సీఎంకు పట్టు సడలిందనడానికి తార్కాణమని అంటున్నారు.  అందుకు కారణం మంత్రులు, ఎమ్మెల్యేలలో పలువురికి సీఎం తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం కావడమేనని పరిశీలకులు అంటున్నారు. సీఎం మీటలు నొక్కి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నారనీ, ప్రభుత్వం, పార్టీపై వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకత అంతా మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనేనని సమయం, సందర్భం వచ్చినా రాకున్నా పదేపదే చెబుతూ తమ ప్రతిష్టను జనాలలో చిన్నబుచ్చడానికే ప్రయత్నిస్తున్నారన్నది వారి అసహనానికి, ఆగ్రహానికీ కారణంగా చెబుతున్నారు. 

గెలుపే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు.. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్టేనా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయం ఉంది. అయినప్పటికీ సీఎం జగన్ ను, వైసీపీని ఓడించేందుకు టీడీపీ అధినేత  కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభించారు. వైసీపీ సర్కార్ ఏర్పాటైన తొలి నాళ్లలో ఫీల్ గుడ్ అని భావించిన జనాల్లో ఇప్పుడు ఫీల్ బ్యాడ్ ఒపీనియన్ బాగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని పలు సర్వేల్లో వెల్లడవుతోంది. వైసీపీ సర్కార్ పని తీరు పైనా, జగన్ పైనా జనం పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు పలు సర్వేల్లో వస్తోంది. దానికి తోడు వైసీపీ సర్కార్ గ్రాఫ్ గత ఆరు నెలల్లో బాగా పడిపోయిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. ‘పార్టీ కోసం త్యాగాలు చేయాలి.. మీ కోసం పార్టీ త్యాగం చేయదు’ అని పార్టీ నేతలకు ఆయన కచ్చితంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగా కృషిచేయాలని, అందు కోసం త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఓడిపోతారని సర్వేల్లో తేలితే సీనియర్లు అయినా పక్కన పెట్టేయడానికి సిద్ధమనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు. పనితీరు సరిగా లేకపోతే గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి కూడా టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రకరకాల కార్యక్రమాలతో తాను ప్రజల మధ్యే ఉండటం కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు నిత్యం రాష్ట్ర ప్రజల మధ్యనే  ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అది ‘బాదుడే బాదుడు’ కావచ్చు.. లేదా తాను స్వయంగా చేస్తున్న జిల్లాల పర్యటనలు కావచ్చు.. ఏపీలో నెలకొన్న వివిధ సమస్యలపై టీడీపీ నేతల్ని వారి వారి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించేలా పురమాయించడం కావచ్చు.. ఏదైతేనేం వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ.. చంద్రబాబు అండ్ కో జనం మనసులో మరింత దృఢమైన స్థానం సంపాదించుకునే యత్నం  చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికి ప్రజలు పట్టం కట్టారు. ఆ క్రమంలోనే ఒక పక్కన ఆంధ్రుల ప్రజా రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారాయన. మరో చేత్తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా నడిపించారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారు. అయితే.. ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వ పగ్గాలు అందుకున్న జగన్ ఈ మూడున్నరేళ్లలో చేసిందేమీ లేదని, పైగా రాష్ట్రాన్ని అన్నింట్లోనూ అధోగతిపాలు చేశారనే ఆగ్రహం ప్రజల్లో బాగా వచ్చేసింది. ఇద్దరి పరిపాలనా విధానాలను, వారి అనుభవాలను, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ఎవరు పరుగులు పెట్టించగలరనే అంశాలపై జనం బేరీజు వేసుకుంటున్నారంటున్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే వినాయక చవితి తర్వాత జగన్ సర్కార్ ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో వ్యక్తిగత నైతిక విలువలను జగన్ పాతిపెట్టేశారనేది విష్ణుకుమార్ రాజు ఆరోపణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఏపీలో సంచలన పరిణామాలు చూస్తారని కామెంట్ చేయడం గమనార్హం. కరోనా కాలం రెండేళ్లలో ఏపీ అన్ని విధాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఈ దశలో ఏపీలో ఏమి అభివృద్ధి జరుగుతోందనే ప్రశ్న జనం మదిలోకి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, రోడ్ల దుస్థితి, ఆ రోడ్లపై నిత్యం ప్రత్యక్ష నరకం చవిచూస్తుండడం, విద్యుత్, బస్సు చార్జీల పెంపు తమ జీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో జగన్ సర్కార్ పై జనంలో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనితో పాటు అధికారపక్షం వాయిస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. విపక్షాల వాయిస్ జనంలోకి పూర్తిగొ చొచ్చుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా చంద్రబాబు స్వయంగా రంగంలో దిగారు. టీడీపీ కొంచెం వీక్ గా ఉందనిపించిన నియోజకవర్గాలపై ఆయనే దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి వాటిలో కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెంచారంటున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయడం.. మరో పక్కన టీడీపీపైన, తన కుటుంబంపైన వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ నేతలను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకుని వ్యూహాలు రచిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్న మాట.

ఫైన‌ల్ రిహార్స‌ల్‌లా సూప‌ర్ 4.. పాక్‌పై లంక 5 వికెట్ల‌తేడాతో విజ‌యం

ప‌థుమ్ నిస్సాంక 55 పరుగులతో అజేయంగా రాణించడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన చివరి సూపర్ 4 ఆసియా కప్ మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అతనికి తోడు భానుక రాజపక్సే 24 పరు గులు చేయగా, దసున్ షనక 21 పరుగులు చేశాడు. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే శ్రీలంక విజయభేరి మోగించడంతో వనిందు హసరంగా చివ‌ర‌గా ఒక‌ ఫోర్ కొట్టి జ‌ట్టు విజ‌యం ఖ‌రారు చేశాడు.  ఆసియాక‌ప్ సూప‌ర్ 4 చివ‌రి మ్యాచ్‌లో శుక్ర‌వారం శ్రీ‌లంక 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలిచింది. ఆట మొత్తం ఫైన‌ల్‌కి రిహార్సిల్ లాగానే అనిపించింది. రెండు జ‌ట్లు అంత సీరియ‌స్‌గా ఆడుతున్న‌ట్లు క‌న‌ప‌డ‌లేదు. కానీ శ్రీ‌లంక మాత్రం ఈ టోర్నీలో ఆరు పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచి ఫైన‌ల్లో పాక్‌కు గ‌ట్టి పోటీనిచ్చేస్థాయిలో ఉంది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్లో ఈ జ‌ట్ల‌మ‌ధ్య హోరా హోరీ పోరునే క్రికెట్ వీరాభిమానులు ఆశిస్తున్నారు. లంక జ‌ట్టు త‌మ అల్‌రౌండ్ ప్ర‌తిభ‌తో త‌ప్ప‌కుండా పాకిస్థాన్‌కు అంత సులు వుగా ఫైన‌ల్ సాగ‌నిచ్చేట్టు లేద‌న్న‌ది శుక్ర‌వారం మ్యాచ్ లో పాక్ జ‌ట్టును అడ్డుకున్న తీరు తెలియ‌జేసింది. లంకే క‌దా అనుకు న్న పాక్ కు లంక బౌల‌ర్లు బెద‌ర‌గొట్టేరు. 19.1 ఓవ‌ర్ల‌లో 121 ప‌రుగుల‌కే పాక్ కుప్ప‌కూలి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కొంత ఫైన‌ల్ చేరామ న్న ధీమాతో ఆడిన‌ప్ప‌టికీ అజామ్ సేన చాలా పేల‌వంగా ఆడింది. ఓపెనర్‌ నిస్సాంక (55) అజేయ అర్ధసెంచరీ సాధించగా, రాజ పక్స (24), షనక (21) ఆకట్టుకున్నారు. రౌఫ్‌, హస్నైన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హసరంగ నిలి చాడు.

బిగ్ బాస్ నాగ్ పొలిటికల్ ఎంట్రీ?

నిజానికి, అక్కినేని నాగార్జునకు అలాంటి ఆలోచన లేదు.   ఆ ఉద్దేశమూ లేదు. అయినా ఆప్పుడే, అంతా అయిపోయినట్లే ప్రచారం జరుగుతోంది. కనీసం వన్ సైడ్ లవ్ అయినా లేకుండానే, ఏకంగా ట్రైయాంగిల్ లవ్ స్టొరీ అల్లేసిన విధంగా, సోషల్ మీడియా క్రియేటివ్ రైటర్స్ జగన్, అక్కినేని నాగార్జున మధ్య  పొలిటికల్ లవ్ స్టొరీ ని అల్లేశారు.  అవును మనం,మాట్లాడు కుంటోంది బిగ్ బాస్ నాగార్జున పొలిటికల్ ఎంట్రీ గురించే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఆయన ప్రేమలో పడ్డారంటూ వస్తున్న కథనాల గురించే. గత కొద్ది రోజులుగా, సోషల్ మీడియాలో కొంత వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇలాంటి వదంతులు బాగా షికారు చేస్తున్నాయి. నాగార్జున త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని, వైసేపీలో చేరుతున్నారని, అదే విధంగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని, వండి వార్చిన కథనాలు చాలానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, గాలి కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే  వైసీపీ సోషల్ మీడియాలో ఈ ‘వంటక’ స్టొరీ బాగా వైరల్ అవుతోంది.  అయితే, ఇందులో అంతా కాకున్నా కొంతైనా నిజం ఉందా అంటే, అసలే లేందంటున్నారు, ఆ ఇద్దరినీ ఎరిగిన సినీ, రాజకీయ రంగ ప్రముఖులు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి, ముఖ్యంగా ఆయనకు సినిమా రంగం గురించి, సినిమా హీరోలు, నిర్మాతల గురించి ఉన్న ‘గౌరవ’ భావం తెలిసిన ఎవరు, ఆయనతో రాజకీయ సంబంధాలు పెట్టుకునే సాహసం చేయరని  అంటున్నారు. అలాంటిది, అందాల నటుడు,  అక్కినేని నాగేశ్వరరావు వారసుడు,అన్నిటినీ మించి,నాగేశ్వరరావు నుంచి నటనతో పాటు వ్యాపార సూత్రాలనూ బాగా వంట పట్టించుకున్న నాగ్  అలాంటి తప్పు అసలే చేయరని అంటున్నారు.   నాగార్జున ప్రధానంగా నటుడే కావచ్చును,కానీ, అంతకు మించి ఆయన,ఓ మంచి బిజినెస్ మ్యాన్, అయన వేసే ప్రతి అడుగులో ‘నా కేంటి?’ అని ఒకటికి పది సార్లు బేరీజు వేసుకుని ఆ తర్వాతనే ముందడుగు వేస్తారని అంటారు. అన్నిటినీ మించి ఆయనకు రాజకీయ సొద అసలే గిట్టదని అంటారు.అలాగని ఆయనకు రాజకీయ సంబంధాలు లేవా అంటే ఉన్నాయి.. అయితే... అవన్నీ కూడా వ్యాపార సంబధాలతో ముడి పడిన రాజకీయ సంబంధాలే తప్ప, రాజకీయ రంగులు పూసుకునే సంబంధాలు కాదని అంటారు. కారల్ మార్క్స్, ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటూ చేసిన సూత్రీకరణను కమ్యూనిస్టులు ఎంతవరకు నమ్ముతారో ఏమో కానీ, అక్కినేని నాగార్జున మాత్రం పూర్తిగా నమ్ముతారని, ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఆడుకు ముందుకు వేయరని అంటారు.  అవును, ఆయన వైఎస్  ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆరోగ్య‌శ్రీ ప్రకటనలో నటించారు. అలాగే జగన్ రెడ్డి పాద యాత్ర సమయంలోనూ ఆయన వైసేపీకి మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది కానీ, ఆయన ఎప్పుడూ బహిరంగంగా అలాంటి  ప్రకటన చేయలేదు. నాగర్జున, నాగ చైతన్య అభిమాన సంఘం అధ్యక్షుడి పేరున బి,రాము అనే వ్యక్తి చేసిన ప్రకటనను నాగార్జునకు ముడి పెట్టి వైసేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారని అంటారు. నాగార్జున అప్పుడు గానీ, ఇప్పడు గానీ, ఎప్పుడూ ఒక్క వైసీపీ కనే కాదు ఏ పార్టీకి కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు.  అదలా ఉంటే గతంలో రాజ్యసభ టికెట్’ కు సంబంధించి చిరంజీవితోనూ జగన్ రెడ్డి ఇలాంటి కథనే నడిపించారు. లంచ్ కి పిలిచి సోషల్ మీడియాలో రాజ్యసభ టికెట్ జరిపించారు.   చివరకు మెగా స్టార్ నవ్వుల పాలయ్యారు. మీడియా ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు .ఇక పోసానీ, అలీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇదిగో అదిగో అంటూ నామినేటెడ్ పదవులను .. చూపించడమే కానీ.. ఇచ్చింది లేదని, చివరకు ఇచ్చినా వద్దనే స్థితికి వారిని నేట్టివేశారని అంటారు.  అయితే ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు విజయవాడ నియోజక వర్గం నుంచి పోటీచేసేందుకు, వైసీపీకి సరైన అభ్యర్ధి లేరు. గత  (2019) ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి కేసీనేని నాని గెలిచారు. ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్ధి పొత్తూరి వరప్రసాద్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే, 2014లో పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.సో .. అభ్యర్ధి వేటలో ఉన్న వైసీపీ  నాగార్జునను తెర మీదకు తెచ్చిందని అంటున్నారు. అయితే, సహజంగానే వ్యాపార రాజకీయాలు తప్పించి ప్రత్యక్ష రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదనే అంటున్నారు.

తృణ‌మూల్ ప‌ప్పూ టీష‌ర్టు!

తృణమూల్ కాంగ్రెస్ టీ-షర్ట్ అమిత్ షా ముఖంతోడి కార్టూన్‌ తో పాటు ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అనే క్యాప్షన్ తెలుపు, నలుపు, పసుపు రంగులలో వస్తుంది. గ్లోబల్ ప్లేబుక్ నుండి  ఒక ఆకును తీసి, ఫ్యాషన్‌ను చాలా కాలంగా రాజకీయ ప్రకటనగా ఉపయో గిస్తున్నారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి,  దాడిచేయడానికి టీషర్ట్‌ను రూపొందించింది బిజెపి నాయకుడు, హోం మంత్రి అమిత్ షా. ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అనే క్యాప్షన్‌తో పాటు అమిత్‌ షా ముఖం కార్టూన్‌గా ఉన్న టీషర్టు తెలుపు, నలుపు,  పసుపు రంగులలో వస్తుంది. బిజెపి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీని  పప్పు అనే పేరు పెట్టింది, దీనిని ఇప్పుడు మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్  షాను ఎగతాళి చేయడానికి ఉపయోగిస్తోంది. అక్టోబరు మొదటి వారంలో దుర్గాపూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్ అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలు పండల్‌లను సందర్శి స్తున్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఈ టీ-షర్టు ప్రచారా న్ని ఎక్కువగా ఉపయో గించుకోవ డానికి ఆసక్తిగా ఉంది.. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన తర్వాత సెప్టెంబర్ 2న విలే కరులతో మాట్లాడుతూ, అభిషేక్ బెనర్జీ,  షా ను భారతదేశంలో అతిపెద్ద పప్పు అని అభివర్ణించారు. అదే రోజు,  బెనర్జీ కజిన్స్ ఆకాష్ బెనర్జీ ,  అదితి గేయెన్ అమిత్‌ షా  కార్టూన్ పప్పు నినాదంతో టీ-షర్టులు ధరించి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. 300 నామమాత్రపు ధరకు విక్రయించబడే దుస్తులు  కొత్త డిజైన్లపై బెనర్జీ యువ పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

రెండు పుట్టిన రోజుల రాణి ఎలిజిబెత్‌!

క్వీన్ ఎలిజబెత్ II సెప్టెంబరు 8, 2022న తన నిద్రలో ప్రశాంతంగా కన్నుమూశారు. ఆమె యునై టెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నార్తర్న్ ఐర్లాండ్‌లలో ఎక్కువ కాలం పాలించిన రాణిగా ప్ర‌సిద్ధి. ఎలిజబెత్ II ఏప్రిల్ 21, 1926న లండన్‌లో జన్మించింది.  కింగ్ జార్జ్ VI, క్వీన్ ఎలిజబెత్‌ లకు పెద్ద కుమార్తె. ఆమె పుట్టిన సమ యంలో, ఆమెకు ఎలిజబెత్ అలెగ్జాండర్ మేరీ అని పేరు పెట్టా రు, ఎందుకంటే ఆమెకు ఆమె తల్లి క్వీన్ ఎలిజబెత్, ఆమె తండ్రి తరపు ముత్తాత అలెగ్జాండ్రా, ఆమె నాన్నమ్మ క్వీన్ మేరీ పేరు పెట్టారు. ఎలిజబెత్ II నవంబర్ 20, 1947న ఎడిన్‌బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఫిలిప్‌ను వివాహం చేసుకుంది. 70 ఏళ్లకు పైగా క్వీన్ఎలిజబెత్ పాలన ముగి యడంతో, బ్రిటన్‌ను ఎక్కువకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II గురించిన కొన్ని ప్ర‌త్యేక అంశాలు తెలుసుకుందాం. క్వీన్ ఎలిజబెత్ II రెండు పుట్టినరోజులు, ఎందుకంటే ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21న జరిగింది, ఇది ప్రైవేట్‌గా జరిగింది. జూన్‌లో రెండవ మంగళవారం అధికారిక బహిరంగ ప్రకటన, వేసవి వాతావరణం కవాతులకు అనుకూలంగా ఉంటుంది. క్వీన్ ఎలిజబెత్ ఇమెయిల్ పంపిన మొదటి మోనార్క్ అయ్యారు.1976లో, క్వీన్ ఎలిజబెత్ II ఇ-మెయిల్ పంపిన మొదటి రాయల్ గా మారింది. మార్చి 26, 1976న ఆమె ఇంగ్లాండ్‌లోని టెలికమ్యూనికేషన్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి నప్పు డు, ఆమె అర్పానెట్‌ ని ఉపయోగించి ఒక ఇమెయిల్ పంపింది. క్వీన్ ఎలిజబెత్ II బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ చరిత్రలో సైన్యంలో పనిచేసిన మొదటి మరియు ఏకైక మహిళ కూడా. రెండ‌వ ప్ర‌పం చ యుద్ధంలో, ఆమె మహిళల సహాయక టెరిటోరియల్ సర్వీస్ (ఏటీఎస్‌)లోకి ప్రవేశించినప్పుడు ఆమె వయస్సు కేవలం 18 సంవత్సరాలు. ఎలిజబెత్ II, నాజీలతో పోరాడటానికి ఆమె శిక్షణగా యుకే మాజీ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ యొక్క టామీ గన్‌తో తుపాకీ ని ఎలా కాల్చాలో నేర్చుకున్నారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 14 సంవత్సరాలు. ఇంగ్లాండ్ రాణి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు క్వీన్ ఎలిజబెత్ II ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఇంగ్లండ్ రాణి అనుభవించిన అనేక అధికారాలలో ఇది ఒకటి. కారణం ఏమిటంటే, ప్రతి ఒక్క పాస్‌పోర్ట్ రాణి పేరు మీద జారీ చేయబడుతుంది కాబట్టి ఆమె తన స్వంతంగా తీసుకువెళ్లిందో లేదో అర్థం కాలేదు. రెండ‌వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె సైన్యంలోకి వచ్చిన తర్వాత, క్వీన్ ఎలిజబెత్ II ట్రక్ చక్రాలను ఎలా మార్చాలో ఇతరులతో పాటు కారు ఇంజిన్‌లను ఎలా సరిచేయాలో నేర్చుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 15 మంది ప్రధాన మంత్రులకు సేవలందించారు. ఈ జాబితాలో విన్‌స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్  చివరిగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉన్నారు. ఇంగ్లాండ్ రాణిగా, ఎలిజబెత్ II దేశంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడానికి అనుమతించబడింది. ఆమె తరువాతి సంవత్స రాలలో కూడా, ఆమె చాలా సందర్భాలలో డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. క్వీన్ ఎలిజబెత్ II 6 సంవత్సరాల వయస్సులో ఇంటి యజమాని అయ్యారు, వేల్స్ ప్రజలు ఆమెకు విండ్సర్ యొక్క రాయల్ లాడ్జ్ మైదానంలో ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీనికి వై.బితైన్ బాచ్‌ అని పేరు పెట్టారు, అంటే చిన్న కుటీరమ‌ని అర్ధం. ఇంగ్లాండ్ రాణి  చేసిన మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ 2019లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ‘ది రాయల్ ఫ్యామిలీ’ అని పిలుస్తారు.

పోలీసులు ఏం తీరిది?.. చంద్రబాబు ఫైర్

వడ్డించే వాడు మన వాడైతే పంక్తిలో చివరన కూర్చున్నా భక్ష్యాలన్నీ మనదగ్గరకే వస్తాయని సామెత.. దానిని ఏపీలో   అధికార పక్షం వారైతే చాలు ఏం చేసినా పోలీసులు వారికి అండగా ఉంటారు అని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కన్ను పొడిచేసినా స్టేషన్ బెయిలు దొరుకుతుంది. గాయపడిన వ్యక్తి మెడికల్ రిపోర్టు రాకుండానే రిమాండ్ రిపోర్టు రాసేసి స్టేషన్ బెయిలు ఇచ్చేస్తారు. విపక్ష నేతపై దాడికి యత్నించినా పోలీసులు మర్యాదగా ఆ దాడియత్నం చేసిన వారిని వారి వారి ఇళ్ల దగ్గర దిగబెడతారు. అదే అధికార పార్టీకి వ్యతిరేకంగా చిన్న నిరసన ప్రదర్శన చేస్తే చాలు హత్యాయత్నం కేసులు నమోదు చేసేస్తారు. నినాదాలు చేస్తే శాంతి భద్రతలకు విఘ్నం కలిగించారంటూ కేసులు నమోదు చేసేస్తారు. ఇదీ ప్రస్తుతం ఏపీలో పోలీసుల తీరు. ఆ తీరుపైనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. కన్ను పొడిచేసిన వారికి స్టేషన్ బెయిలు ఇస్తారా?  కేవలం నినాదాలు చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తారా అంటూ ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసుల తీరు అధ్వానంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు తామేంటో, తామెవరి కోసం పని చేస్తున్నారో తమ తీరు ద్వారా స్వష్టంగా వెల్లడిస్తున్నారని దుయ్యబట్టారు. కుప్పంలో సాధారణ నిరసనలు చేపట్టిన తెలుగుదేశం వారిపై హత్యాయత్నం సెక్షన్ కేసు పెట్టి రిమాండ్ కు పంపిన పోలీసులు  విజయవాడలో తెలుగుదేశం నేతపై దాడిచేసి కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాదగా ఇంటికి పంపారని విమర్శించారు. ఈ రెండు ఘటనల్లో ఖాకీల వ్యవహరించిన తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ అని చంద్రబాబు అన్నారు.  ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు మరీ ఇంతగా దివగజారడాన్ని ప్రజలు  ఆమోదించరన్నారు. ఏపీ పోలీస్ అనే బ్రాండ్ సర్వనాశనం కావడానికి, ప్రజలకు పోలీసులపై నమ్మకం పోడానికి ఈ ఘటనలు చాలన్నారు.  ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు వారికి రక్షణ కల్పించడం మాని పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

గవర్నర్’తో ఘర్షణకు మూడేళ్ళు

 నిజమే కావచ్చును, వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు,, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనే అభిప్రాయమే ప్రముఖంగా వినిపిస్తోంది.  నిజానికి, ముఖ్యమంత్రి ఘర్షణాత్మక వైఖరి అవలబిస్తోంది, ఒక్క గవర్నర్’తో మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, చివరకు నిన్న మొన్నటివరకు 20 సంవత్సరాలకు పైగా తనతో కలిసి నడిచిన, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందేర్’ .. ఇలా, చెప్పుకుంటూ పోతే, ముఖ్యంత్రి వ్యక్తిగత ద్వేషం పెంచుకున్న వ్యక్తుల చిట్టా ఇంకా ఉంటుదని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్’కు తన ముఖం చూడడం కూడా ఇష్టం లేదని, ఈటల రాజేందర్’ ఆరోపించారు. నిజానికి అది ఆరోపణ కాదు, నిజం.   ఈటలను చూడలేక ఆయన్ని, ఆయనతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యేలు  ముగ్గురినీ, బడ్జెట్ సమావేశాల మొత్తం కాలానికి, సస్పెండ్ చేశారు. ఇక కేవలం మూడు రోజులకు కుదించిన ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో పాల్గొనేందుకు కూడా అవకాశం లేకుండా, సాకేతిక కారణాలు చూపించి బడ్జెట్ సమావేశాల సస్పెంన్షన్’ ను వర్షాకాల సమావేశాలకు కూడా పొడిగించారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించలేదు. ముఖం చాటేశారు.  సరే అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్’గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్’  మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు.  ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని ఈ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని గవర్నర్ అన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యల చూసి చలించిపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని తమిళిసై చెప్పారు.నిజానికి,గడచిన మూడు సంవత్సరాలు అనేకంటే, హుజురాబాద్’ పరాభవం మొదలు ముఖ్యమంత్రిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఓటమి తర్వాతనే ముఖ్యమంత్రి అటు ప్రధాని మోడీని , ఇటు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’ తో దూరం పెరిగిందని అంటున్నారు.   తెలంగాణలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెరిగిన దూరం ఇంకా ఇంకా ముందకు పోతోంది. గడచిన్ రెండేళ్లలో కేవలం, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి మాత్రమే ముఖ్యమంత్రి రాజ్ భవన్ గదప్ తొక్కారు. మరో వంక స్వాతంత్ర, గణతంత్ర  దినోత్సవ వేడుకల సందర్భంగానూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ , ముఖ్యమంత్రి ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎడముఖం పెడ ముఖంగానే ఉంటున్నారు. చివరకు, రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో, గవర్నర్ ప్రసంగం లేకుండానే సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరో వంక గవర్నర్ ప్రొటోకాల్ వివాదం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి, ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం సృష్టించాయి. కాగా, రాజ్యాంగబద్ద వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదని ఇలాంటి పరిస్థితి చిలికి చిలికి గాలివానగా మారి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేక పోలేదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కొట్టేశాడు కోహ్లీ సెంచరీ..!

ఎన్నాళ్లకెన్నాళ్లకు..విరాటుడి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ నాడే ఎదురైందన్నట్లు.. దాదాపు మూడేళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టలేక ఇబ్బందులు పడుతుంటే.. ఆభిమానులు మళ్లీ పూర్వపు ఫామ్ ను ఎప్పుడు అందిపుచ్చుకుంటాడా అని ఎదురు చేస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఆసియా కప్ లో భాగంగా గురువారం ఆప్ఘనిస్థాన్ తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ విరాట్ కోహ్లీ అద్బుత బ్యాటింగ్ విన్యాసాలకు వేదికైంది. తనకు మాత్రమే సాధ్యమైన క్లాసిక్ బ్యాటింగ్ మ్యాజిక్ ను కోహ్లీ ప్రదర్శించాడు. కళ్లు చెదిరే షాట్లతో పరుగుల పండుగ చేసుకున్నాడు. కేవలం 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 61 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ  122 పరుగులతో అజేయింగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీకి ఇది 71వ శతకం. టి20లలో కోహ్లీకి ఇది తొలి శతకం. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో టెస్టులో సెంచరీ తరువాత కోహ్లీ సాధించిన తొలి సెంచరీ ఇది.  ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ (100) తరువాత పాంటిగ్ (71)తో కలిసి కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ ఈ మ్యాచ్ ఆడకపోవడంతో కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ ఆకాసమే హద్దుగా చెలరేగాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. అందులో కోహ్లీ స్కోరే 122. రాహుల్ 52 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఛేదనలో ఆప్ఘనిస్థాన్ చేతులెత్తేసింది. భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులతో ఆప్ఘన్ టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆప్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. 101 పరుగుల ఆధిక్యంతో భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఆసియాకప్ నుంచి నిష్క్రమించిన భారత్ కు ఇది ఊరటనిచ్చే విజయం. అయితే ఈ విజయం కంటే కోహ్లీ పూర్వపు ఫామ్ ను అందిపుచ్చుకుని సెంచరీతో చెలరేగడం మాత్రం ఆసియా కప్ విజేతగా నిలిస్తే వచ్చే ఆనందం కంటే ఎన్నో రెట్ల ఆనందాన్నిచ్చింది. కోహ్లీ ఫామ్ ను అందిపుచ్చుకుని సెంచరీతో చెలరేగడం భారత జట్టులోనూ, కోహ్లీ అభిమానుల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరిలోనూ ఆనందాన్ని నింపింది. కోహ్లీని అభినందిస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. డివీలియర్స్ వంటి క్రికెటర్లే కాదు.. ప్రధాని మోడీ,  తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటి వారు కూడా కోహ్లీని అబినందిస్తూ ట్వీట్లు చేశారు. కోహ్లీ ఈ సెంచరీని తన కుమార్తెకు అంకితం చేశాడు.

సివంగి సాయం అడిగింది...ఆప‌రేష‌న్ చేస్తే చిప్ దొరికింది!

జంతుప్రేమ ఉండ‌వ‌చ్చు.వాటిని పిల్ల‌ల‌తో స‌మానంగా పెంచ‌నూవ‌చ్చు. దూరంనుంచి ఫోటోలు తీస్తూం డావ‌చ్చు. కానీ సింహం, సివంగి వంటి క్రూర‌మృగాల‌తో  అంత‌టి స‌ర‌దా క‌ష్ట‌మే.  క్రూర‌మృగాలు ఉండే ప్రాంతాల‌కు వెళ్లేవారు స‌హ‌జంగా జాగ్ర‌త్త‌గానే ఉంటారు. వారిలో ఫోటోతీయాల‌న్న పిచ్చి ఉన్న వారు అత్యుత్స‌హంతో వాటికి కాస్తంత ద‌గ్గ‌ర‌గా వెళ్లి ఫోటోలు తీయాల‌నుకుంటే మాత్రం మ‌రీ జాగ్ర‌త్త‌గా ఉండాలి. వాటికి మీరు ఫోటోగ్రాఫ‌ర్ ఆన‌క తెలుగు ప‌త్రిక‌ల్లోనో, సైట్‌లోనో ఫోటో వ‌చ్చేస్తుంద‌నుకోవు. అమాంతం మీద‌ప‌డి చంపుతాయంతే!  కానీ జార్జిని మాత్రం సివంగి ఏమీ చేయ‌లేదు. వెన‌గ్గా వ‌చ్చి కాలుతో వీపు మీద చిన్న‌దెబ్బ‌వేసింది, ఏదో చిర‌కాల స్నేహితురాలిలా! అత‌ను ఆశ్చ‌ర్య‌పోయాడు. వెన‌క్కి తిరిగి చూడ‌గానే సివంగిని చూసి జార్జ్‌కి ప్రాణం పోయినంత ప‌న‌యింది. కానీ మ‌రీ అంత కూల్‌గా ఉందేమిటా అని అత‌నికి అనుమానం వ‌చ్చింది. వెన‌గ్గా సింహంగారు వ‌చ్చి టిఫిన్ కింద లాగించేస్తా రేమో న‌న్న భ‌య‌మూ క‌లిగింది. కానీ అలా ఏమీ జ‌ర‌గ‌లేదు. సివంగిని ప‌రిశీల‌న‌గా చూశాడు జార్జ్‌. దాని పొట్ట బాగా పెద్ద‌గా ఉంది. ఏకంగా ప‌క్క‌టెముక‌ల వ‌ర‌కూ! సివంగి ఏదో మెడిక‌ల్ సాయం కోర‌డానికి వ‌చ్చిన పేషెంటులా క‌న‌ప‌డింది. కానీ జార్జ్ ఏం చేయ‌గ‌ల‌డు. వెంట‌నే ఆ ప్రాంతీయుడిని ఒక‌త‌న్ని పిలిచాడు. అత‌నికీ ఈ దృశ్యం మ‌హాఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప‌నిలో ప‌నిగా సివంగి త‌ల నిమిరి, ముద్దెట్టుకుని వెళిపోయా డు! కొంత‌సేప‌టికి అడ‌వి మృగాల సంర‌క్ష‌ణ కేంద్రానికి ఫోన్ చేసి సివంగి గురించి చెప్పాడు జార్జ్‌. వాళ్లు వ‌చ్చారు. చూస్తే దాని పొట్ట మ‌రీ పెద్ద‌గా ఉంద‌ని ఏదో పెద్ద స‌మ‌స్యేన‌ని తెలుసుకున్నారు. దానికి ముందు మ‌త్తుమందు ఇచ్చి నిద్ర‌పుచ్చారు. త‌ర్వాత పోలీసులు వ‌చ్చి సివంగితో పాటు అధికారుల‌ను, జార్జ్‌ని కూడా తీసికెళ్లారు. సివంగిని ఆస్ప‌త్రికి తీసికెళ్లారు. ఆప‌రేష‌న్ చేయాల‌నుకున్నారు. ముందుగా మ‌ళ్లీ దానికి మ‌త్తు మందు ఇన్‌జ‌క్ష‌న్ ఇచ్చారు. దాని పొట్ట‌ని స్కాన్ చేశారు. కానీ స్ప‌ష్టంగా ఏ వ‌స్తువూ పొట్ట‌లో ఉన్న‌ట్టు తెలియ‌లేదు. త‌ర్వాత రెండు గంట‌లు దానికి విశ్రాంతి నిచ్చారు. మ‌ళ్లీ అది బాధ‌తో క‌ద‌ల‌డం మొద‌లెట్టింది. ఇక లాభంలేద‌ని వెట‌న‌ర‌రీ స‌ర్జ‌న్ ని పిలిచారు. ఆయ‌న త‌న బృందంతో వ‌చ్చి సివంగికి ఆప‌రేష‌న్ చేయాల‌న్నాడు. చేస్తే ఆఖ‌రికి పొట్ట‌లో ఒక పెద్ద మాంసం ముక్క ఎముక‌తో పాటు ఇరుక్కు పోయింది. దాన్ని చిన్న సుత్తితో కొట్టార‌ట‌. దాని కింద ఒక మైక్రోచిప్ క‌న‌ప‌డింది. జార్జ్‌తో పాటు డాక్ట‌ర్లూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదెలా సాధ్య‌మ‌ని.  జంతువుల వేట‌గాళ్లెవ‌రూ సింహాలు బాగా తిరిగే స‌వానా లో మైక్రోచిప్‌లు ప‌డేసి ఉంటార‌ని అవి మాంసం తో పాటు ప‌డేసి ఉండ‌డంతో ఈ సివంగి మాంసంతో పాటు తిని అది అడ్డుకుని లోప‌ల క‌ద‌లిక‌లేక క‌డుపు ఉబ్బింద‌ని తేల్చారు. అధికారులు పోలీసుల‌కు ఈ సంగ‌తి చెప్పారు. వెంట‌నే స‌వానా చుట్టూరా వేట గాళ్ల‌కు  వ‌ల‌ప‌న్నారు. ఒక‌రిద్ద‌రు దొరికార‌ట‌. 

ఎరక్కపోయి ఇరుక్కు పోయారా?.. కమలం ట్రాప్ లో పవన్ కల్యాణ్

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను, ఏ సినిమాలోదో ఏమో కానీ,ఈ సాంగ్ ఒక్పప్పుడు బాగా పాపులర్ అయిన పాటల్లో ఒకటి. అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ,   ఈ పాటకు స్టెప్పులేస్తుంటే హల్లో ఈలలే ...ఈలలు. అయితే, ఇప్పుడు  సిట్యువేషన్, అది కాక పోయినా, రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన, ప్రముఖ హీరో, జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు   ఆయన అభిమానులు. బీజేపీ, జనసేన మిత్ర పక్షాలు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీతో జట్టు కట్టారు. మాంగల్యానికి మూడు ముళ్ళు అన్నటుగా బీజేపే మెడలో మరో మూడు ముళ్ళు వేశారు. అయితే, ఆ తర్వాత, ‘చెలియ లేదు చెలిమి లేదు, వెలుతురే లేదు’ అన్నట్లుగా, ‘చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఉసులు’ ఏమై పోయాయో కానీ, ఎవరి దారిన వారు, అడుగులు వేస్తున్నారు,నడక సాగిస్తున్నారు.  అయినా, బీజేపీ నాయకులు టీవీ చర్చల్లో జనసేన తమ మిత్ర పక్షం అనే అంటారు. 2024 ఎన్నికల్లో ఇద్దరం కలిసి దుమ్ముదులిపేస్తాం అంటారు.అధికారం మాదే అంటారు. అంతే, అంతకు మించి ఇంకొక్కమాట మాట్లాడరు. అలాగే, ముఖ్యమంత్రి ఎవరన్నది బీజేపీ నాయకులు వాళ్ళంతట వాళ్ళు చెప్పరు. చివరకు, జనసేన నాయకులు సిగ్గువిడిచి, నోరు తెరిచి అడిగినా, బీజేపే నేతలు పెదవి విప్పరు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని ప్ల  కార్డులు పట్టుకుని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎదుట ప్రదర్శనలు చేసినా, పట్టించుకోరు.   ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా, పార్టీ జాతీయ నాయకులు వచ్చి పోతుంటారు, కానీ, రాష్ట్రంలో మిత్ర పక్షం ఒకటుందని ఒక్కరు కూడా కనీసం గుర్తించనైనా గుర్తించరు. ఒక పిలుపు ఒక పలకరింపు ఏవీ ఉండవు.  మెగా ఫ్యామిలీ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నా ఆయన్ని పట్టించుకోరు, కానీ అదే అమిత్ షా జూనియర్ ఎన్టీఅర్ తో గంటలు భేటీ అవుతారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, మరో హీరో నితిన్ తో భేటీ అవుతారు. సరే ఆయన కలుద్దామనుకున్నది నితిన్ ను కాదు, మరో కుర్ర హీరో నిఖిల్ ని అనీ, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ తో అల జరిగిపోయిందని అంటున్నారు. సరే, ఆయన కలవాలనుకున్నది నితిన్ అయినా నిఖిల్ లేదా హీరో ఎవరైనా ఆది ఇప్పడు అప్రస్తుతం. మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ అని కాకపోయినా, మిత్ర పక్షం అధ్యక్షుడిగా అయినా జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు,పవన్ కళ్యాణ్ ను కనీసం హలో అని అయినా పలకరించాలి కదా, అని ఆయన అభిమానులు నొచ్చుకుంటున్నారు. బీజేపీ ఉచ్చులో చిక్కుకుని, పవన్ కళ్యాణ్  ఎటూ కాకుండా, త్రిశంకు నరకంలో తేలియాడుతున్నారని అంటున్నారు.  అయితే, కొంచెం చాలా ఆలస్యంగానే అయినా పవన్ కళ్యాణ్  బీజేపీ గేమ ప్లాన్ అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షం పేరును అడ్డుపెట్టుకుని జనసేనను బీజేపీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని, అందుకే, పవన్ కళ్యాణ్ బిగ్ బ్రదర్, మెగా స్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక మంది హీరోలను తమ గూటికి తెచ్చుకునే ప్రయత్నం కమల దళం  చేస్తోందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ కబంధ హస్తాల నుంచి ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదని పవన్ కళ్యాణ్ హితేషులు సూచిస్తున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్ మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనే, వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందుకే, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెదిరి పోకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే జనసేన ముందు మూడు ప్రత్యన్మాయాలున్నాయని వివరించారు. అయితే, బీజేపీ మాట తప్పి పక్క చూపులు చూస్తున్న తాజా  పరిణామాల నేపధ్యంలో, బీజేపీతో పొత్తు ఆప్షన్ ఇక లేనట్లేనని అంటున్నారు. ఈ నేపద్యంలో  పవన్ కళ్యాణ్ ముందు రెండే ప్రత్యన్మాయాలున్నాయని, అందులో ఒంటరిగా పోటీచేసే ఆప్షన్ , మరొకటి తెలుగు దేశంతో పొత్తు ఆప్షన్  అని అంటున్నారు. అయితే, దేనికైనా సరైన సమయం రావలసి ఉంటుందని అంటున్నారు. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఎదురు చూపులు ఇక చాలు అంటున్నారు. అంతేకాదు, పవర్ స్టార్ అభిమానులే కాకుండా మెగా అభిమానులు కూడా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

పాయ్‌గారూ, క‌ర్ణాట‌క ప‌రువు తీయొద్దు..బీజేపీ

దేశంలోనే అత్యంత ప్రశాంత నగరంగా, ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు భూతల నర కంగా మారిపోయింది. రహదారులు చెరువులయ్యాయి. భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికింది. దారీ తెన్నూ కానరాక జనం నానా అవస్థలూ పడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నకర్నాటకలో అడ్మి నిస్ట్రేషన్ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి గత మూడు రోజులుగా బెంగళూరు వాసులు అనుభవి స్తున్న కష్టాలే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   తాజాగా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త  టి. వి. మోహ‌న్ దాస్ పాయ్ సేవ్ బెంగుళూర్ అంటూ భారీ ప్ర‌చారానికి పూనుకున్నారు. ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా ఉన్నాయని  ఆయ‌న న‌గ‌రాన్ని గురించి ఆయ‌న ప్ర‌చారం చేశారు. దీంతో క‌ర్ణాట‌క బీజేపీ ఆగ్ర‌హించింది. పాయ్ చేస్తున్న ప్ర‌చారంవ‌ల్ల క‌ర్ణాట‌క ముఖ్యంగా బెంగుళూరు ప్ర‌తిష్ట దెబ్బ‌ తింటుంద‌ని బీజేపీ నేత ఎన్‌.ఆర్‌. ర‌మేష్,  పాయ్ పై మండిప‌డుతున్నారు.  వాస్త‌వాలు కేంద్రానికి తెలియ‌జేయ‌డంలో త‌ప్పులేద‌ని నెటిజ‌న్లు కూడా భావిస్తున్నారు. కానీ వాస్త‌వ చిత్రం రాజ‌కీయాల దృష్టితో చూస్తూ బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌ల‌ను భ‌రించ‌లేక‌పోతున్నారు.  నగరంలో ఏ దారి చూసినా గోదారే అన్నట్లుగా తయారైంది. భారీ వర్షాలకు ర‌హ‌దారులు, హైవేలు మునిగాయి. ఉద్యోగులు బస్సుల్లోనూ, కార్లలోనూ కాకుం డా కార్యాలయాలకు వెళ్లడానికి ట్రాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్ప డింది. న‌గ‌ర ప‌రిస్థితిపై వాణిజ్య‌వేత్త మోహ‌న్ దాస్ సోష‌ల్ మీడియాలోనూ, మీడియాలో ఉత్త‌రాల రూపం లోనూ  ప్ర‌చారం చేస్తున్నారు. వాస్త‌వ స్థితి ప్ర‌భుత్వానికి తెలియాల‌ని, ప్ర‌భుత్వ చ‌ర్య‌లు తీసుకోవాలన్న ఆశ‌తోనే తాను అందుకు పూనుకున్న‌ట్టుగా పాయ్ అన్నారు. కానీ ఇది బీజేపీ వారికి మింగుడుప‌డ‌టం లేదు. ఇదిలా ఉండ‌గా, గురువారం కూడా న‌గ‌ర దుస్థితిని  వివ‌రిస్తూ నెటిజ‌న్లు వీడియో ల‌ను మంత్రుల‌కు కూడా పోస్టు చేశారు.  బెంగుళూరునుంచి తెలంగాణాకు ఐటి సంస్థ‌లు వెళిపోతున్నాయంటూ కూడా  ప్ర‌ధానికి, ముఖ్య‌మంత్రికి లేఖ‌లు రాయ‌డం, వీడియోలు న‌గ‌రం ప‌ర‌స్థితుల‌ను తెలియ‌జేయ‌డం కంటే ఆయ‌నకు ప్ర‌భుత్వం ప‌ట్ల విముఖ‌త‌నే స్ప‌ష్టంచేస్తున్నాయ‌న్నాయ‌ని  బీబీఎంపి మాజీ స‌భ్యుడ‌యిన ర‌మేష్  అన్నారు. వాస్త‌వానికి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని అన్నారు.                       

ఆక్లాండ్ వాన‌పాము..4 అడుగుల 7 అంగుళాలు!

ఇంటి పెర‌ట్లోనో, వీధి గేటు ద‌గ్గ‌రో పిల్ల‌లు ఆడుతూనే మ‌ట్టిలో కాళ్ల‌తో, చేతుల‌తో రాస్తూ వింత‌గా ఏద‌న్నా క‌న‌ప‌డితే ఏమిటా అని చూస్తుంటారు. అదుగో అలా బార్న్‌బే కూడా త‌న త‌మ్ముడు, చెల్లెలితో ఆడుతూ న్నాడు.  కొంత‌సేప‌టికి మ‌ట్టి దిబ్బ గోతిలో చేయి పెట్టాడు. ఏదో తాడులాగా చేతికి ప‌ట్టుకుంది.  దాన్ని పైకి తీద్దామ‌నుకున్నాడు. అదేమ‌న్నా చిన్న తాడుముక్కా..కాదు పేద్ధ వాన‌పాము. ముందు భ‌య‌ప‌డ్డా డు. అరుపులు విని కొద్దిదూరంలోనే ఉన్న త‌మ్ముడు, చెల్లి కూడా ప‌రుగున వెళ్లారు. వాళ్లు పాములా ఉన్న దాన్ని చూసి అలా చూస్తుండిపోయారు.  చేత్తో లాగ‌లేక క‌ర్ర తెచ్చి ముగ్గురూ దాన్ని బ‌య‌టికి లాగారు. తీరా చూస్తే అది పాము కాదు. వాన‌పాము లాంటిది. మా టీచ‌ర్ ఎప్పుడూ దీన్ని గురించి చెప్ప‌లేదే అనుకున్నాడా పిల్ల‌వాడు. మిగ‌తా ఇద్ద‌రు భ‌యం భ‌యంగా దాన్ని తాకి చూశారు. ప్రాణంతోనే ఉంద‌ని తెలుసుకున్నారు. అదేమీ చేయ‌ద‌ని చేతుల‌తో ప‌ట్టు కుని క‌ర్ర‌కు చుట్టి మ‌రీ ఇవ‌త‌ల‌కు తీసుకువ‌చ్చారు. ప‌రుగున వెళ్లి అంద‌ర్నీపిలిచారు. దాన్ని చూసి అం ద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక పెద్దాయ‌న దాన్ని పెద్ద క‌ర్ర‌తో ఎత్తి ప‌ట్టుకుని గ‌మ‌నిస్తే, అది ఏకంగా నాలుగు అడుగులా ఏడు అంగుళాలు ఉంది! న్యూజిలాండ్‌, ఆక్లాండ్‌లో  క‌నిపించిన అంత పెద్ద వాన‌పాములాంటి  జీవాన్ని చూసిన శాస్త్ర‌వేత్త‌లు దాన్ని మెగాస్కోలిసిడె జాతికి చెందినద‌ని తేల్చేరు. దీనికే ఆక్లాండ్ వామ్ అనీ పేరుందిట‌. సాధార‌ణంగా అంత పెద్ద పాము, వాన‌పామో, మ‌రేద‌యినా క‌న‌ప‌డితే మ‌న ఊళ్ల‌లో అయితే వెంట‌నే క‌ర్ర‌తో కొట్టి చంప‌ డ‌మే చేస్తాం. కానీ అక్కడి వారు అలా చేయ‌లేదు. మ‌ళ్లీ దాన్ని తోట‌లో దొరికిన చోట‌నే వ‌దిలేశారు. అది తీరిగ్గా శ‌రీరాన్ని క‌దులుస్తూ ప‌దినిమిషాల‌కు ఆ మ‌ట్టి గొయ్యిలోకి వెళ్లింద‌ట‌! 

రాజధానులకు జగన్ శఠగోపం?

మూడు రాజధానుల సాకుతో ఇప్పటిదాకా అమరావతి నిర్మాణాన్ని ఆపేసిన జగన్ లో జనం నుంచి ఛీత్కారాలు వచ్చినా, కోర్టులు మొట్టిక్కాయలు వేసినా మార్పేమీ రాలేదు. అమరావతిపై కసితో, పగతో రగిలిపోతున్న జగన్ ఇప్పుడు ఏపీ రాజధానిని సర్వనాశనం చేసేందుకే పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నారు. రాజధాని ప్రణాళికల్లో మార్పులకు వీలుగా సీఆర్డీయే చట్టానికి సవరణలు చేస్తూ కేబినెట్ సమావేశం ఆమోదించడమే ఇందుకు ఉదాహరణ. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు సీఆర్డీయే చట్టానికి విరుద్ధమని గతంలోనే హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు దొడ్డిదారిన ఆ చట్టాన్ని సవరించి అమరావతిని మురికివాడగా మార్చేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద బయటి ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించాలన్న ఏపీ సర్కార్ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపి వేసింది. దీంతో తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా సీఆర్డీయే చట్టాన్నే సవరించాలనే తెంపరితనానికి జగన్ సర్కార్ రెడీ అయిపోయింది. రాజధాని పర్స్ పెక్టివ్ ప్లాన్, బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల ప్లాన్ లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ సీఆర్డీయే చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 2014 నాటి సీఆర్డీయే చట్టంలోని 41(1), 41(3) సెక్షన్లను సవరించడంతో పాటు, కొత్తగా 41(6) సెక్షన్ చేర్చింది. 2 (22)సెక్షన్ ను సవరించడంతో పాటు కొత్తగా 53(1) సెక్షన్ జత చేసింది. రాజధానిలో గృహనిర్మాణ పథకానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా అర్హులే అంటూ.. అమరావతిని నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. సీఆర్డీయే చట్టం ప్రకారం రాజధాని పర్స్ పెక్టివ్ ప్లాన్ ను పదేళ్ల దాకా మార్చడానికి వీల్లేదు. తర్వాత కూడా గ్రామసభల ఆమోదంతోనే మార్పుచేర్పులు చేయాలి. అలాంటి అమరావతిలో అశాంతి రేకెత్తించేందుకు, ఘర్షణలు తలెత్తేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు మాస్టర్ ప్లాన్ వేశారంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు ముసుగులో సీఆర్డీయే చట్టంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్స్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల చట్టంలోనూ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. అయితే వీటిలో సీఆర్డీయే చట్టంలో ప్రతిపాదించిన సవరణలే అత్యంత కీలకమైనవి. రాజధానికి భూముల్లో బయటివారికి ఇళ్ల స్థలాల కేటాయింపు జోనల్ రెగ్యులేషన్ విధానానికి వ్యతిరేకమని హైకోర్టు ధర్మాసనం 2020 మార్చి 23న స్పష్టం చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయడానికి వీల్లేదని, ఉన్నది ఉన్నట్టు రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలని 2022 మార్చి 3న ఇచ్చిన మరో తీర్పులో హైకోర్టు ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. దానికి భిన్నంగా ఇప్పుడు రాజధాని మాస్టర్ ప్లాన్లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం సీఆర్డీయే చట్టానికి సవరణలు తేవడం హైకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించడమే అవుతుందంటున్నారు. పర్సన్ ఇన్ చార్జులుగా ఉన్న ప్రభుత్వ అధికారుల నుంచి ప్రతిపాదన తీసుకుని, రాజధాని ప్రణాళికల్లో మార్పులు చేసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని న్యాయనిపుణులు అంటున్నారు. సీఆర్డీయే చట్టంలో గతంలో లేని సెక్షన్ 53(1)ని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది. అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూమిలో 1251 ఎకరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 54,307 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 25న జీఓ 107 జారీ చేసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం సీఆర్డీయే చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం. 107ని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ చట్టాన్నే సవరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ వైసీపీకి లేదని, ప్రస్తుత ప్రభుత్వానికి కూడా త్వరలోనే నూకలు చెల్లిపోయే పరిస్థితి రావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకే తన శక్తియుక్తులను వినియోగించాల్సిన జగన్ రెడ్డి ఒక్క అమరావతికే కాదు.. తానే చెబుతున్న మూడు రాజధానుల అంశానికి కూడా ఎగనామం పెట్టేయొచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ మంత్రివర్గంలోమళ్ళీ మార్పులు?..ఆ .. మంత్రులకు ఉద్వాసన?

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి   నిండా ఆరు నెలలు  అయినా కాలేదు.  నిజానికి, ఇదే మంత్రివర్గం ఎన్నికల వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు భరోసా ఇచ్చారో లేదో గానీ, చాలా వరకు  మంత్రులు, మాజీలు, ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, చివరకు సామాన్య ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ, ఇప్పుడు, మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించి, వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే కొందరు మంత్రులకు ఉద్వాసన ఉంటుందని అంటున్నారు.  నిజానికి, 2019లో తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, పౌరాణిక నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండవ కృష్ణుడు అన్నట్లుగా, రెండున్నరేళ్ళ తర్వాత మొత్తానికి మొత్తంగా మంత్రులందరినీ మార్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తానని, చెప్పారు. అయినా, అది జరగలేదు. చివరకు ఇంచుమించుగా మూడేళ్ళు కావస్తున్న సమయంలో గత ఏప్రిల్ రెండవ వారంలో జగన్ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. నిజానికి, మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ పేరిట ముఖ్యమంత్రి చాలా భారీ కసరత్తే చేశారు. అయితే  చివరకు చాంతాడంత రాగం తీసి అదేదో పాట పడినట్లుగా, తొలి కాబినెట్’లో సగం మందిని సాగనంపి, సగం కొత్త, సగం పాత ముఖాలతో పాత కొత్త కాబినెట్’ను ఏర్పాటు చేశారు. కొత్త కాబినెట్ కొలువు తీరి ఇంకా నిండా ఆరు నెలలు కూడా కాలేదు, కానీ ఇంతలోనే కొత్త మంత్రివర్గంఫై ముఖ్యమంత్రికి ముఖం మొత్తినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల పని తీరు బాలేదని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వారిపై గుస్సా అవుతునట్లు తెలుస్తోంది.   బుధవారం(ఆగస్టు 7) జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ మాత్రం మొహమాటం లేకుండా, కొందరు సీనియర్ మంత్రులు సహా ఓ డజను మందికి పైగా మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గకార్లు ఎక్కి తిరగడానికా ? అంటూ కొందరు మంత్రులను ముఖం మీదనే క్లాసు పీకారని తెలుస్తోంది. అంతే కాదు కొందరు మంత్రులు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు తమకు అసలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని,ఇలా అయితే మంత్రివర్గంలో మార్పులు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారని సమాచారం.  అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఒక్కసారిగా ఇంతలా కోపం ఎందుకొచ్చింది అంటే, మంత్రులు తమ శాఖలకు సంబందించి తప్పులు చేశారనో, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనో కాదు, ప్రతిపక్షాల నుంచి ఆరోపణలకు వస్తున్నా, ముఖ్యంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా, మంత్రులు పట్టించుకోవం లేదని ముఖ్యమంత్రి మండిపడినట్లు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యంత్రి జగన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలపై మంత్రులు ఎవరూ స్పందించక పోవడంపై ముఖ్యమత్రి గుస్సా అయినట్లు సమాచారం. మరో వంక  ప్రస్తుత, మాజీ మంత్రులు సహా అనేక మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా అసహనంతో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి మీటలు నొక్కి తన గ్రాఫ్ బాగుందని మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయక పోవడం వలన వారి గ్రాఫ్ పడిపోతోందని ముఖ్యమత్రి భావిస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. అదలా ఉంటే ఎన్నికల లోపు ముఖ్యమంత్రి మరోమారు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేస్తారా? అంటే, అవకాశం లేక పోలేదని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. అదే జరిగితే, కనీసం అరడజను మంది మాత్రులకు ఉద్వాసన తప్పక పోవచ్చని అంటున్నారు. అందుకే కావచ్చును, కుర్చీ కాపాడుకుందుకు సీనియర్ మంత్రులు మీడియా ముందుకొచ్చి లిక్కర్ కుంభకోణం పై స్పందిస్తునారు.భారతి పై నిందలేస్తారా?అంటూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. అదలా ఉంటే ఆశావహులు, మళ్ళీ మరోమారు తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యనేతలను కలిసి, దండాలు పెడుతున్నారు. ముడుపులు కడుతున్నారని అంటున్నారు.అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, పార్టీలో పెరుగతున్న అసంతృప్తి చల్లార్చేందుకు, ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తెర మీదకు తెచ్చారనీ అంటున్నారు.  

భార‌త్ జోడో  యాత్ర‌...రాహుల్ వెంట యువ‌త‌

వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీ సుస్థిర‌త్వాన్ని ఆశిస్తూ బీజెపీ  భారీ ప్ర‌చారాలు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌త‌రుణంలో  అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా దేశం అన్నిప్రాంతాల్లో త‌మ పార్టీని మ‌రింత ప‌టిష్ట‌ప‌ర‌చ‌డానికి, ప్ర‌జ‌ల‌కు బీజేపీ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న గురించి వివ‌రించేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర బుధ‌వారం ఆరంభించారు. క‌న్యాకుమారిలో ఆరంభ‌మ‌యిన యాత్ర‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కాంగ్రెస్ నేత‌లు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు  కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభమ యింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు. ఇవాళ మొత్తంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. మధ్యా హ్నం 2 గంటలకు మహిళలతో భేటీ కానున్నారు. ఇక రాత్రి 7 గంటల వరకు పాదయాత్ర  సాగనుం ది.  ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు రెండు విడతలుగా రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ సీని యర్ నేతలతో పాటు వేలాదిగా కార్య కర్తలు హాజరయ్యారు. రెండో రోజు పాదయాత్ర సమయంలో చిన్నారులతో మమేకం అయ్యారు. కేరళలోని 12 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాల్లో సెప్టెంబర్ 29 వరకు యాత్ర సాగనుంది. రాష్ట్రం లోని త్రిసూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

మూడో ఫ్రంట్ కోసం మరో ప్రయత్నం..ఈ సారి ఐఎన్ఎల్డీ నేత చౌతాలా

కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి దిశగా మరో ప్రయత్నం ప్రారంభమైంది. ఇందు కోసం ప్రాంతీయ పార్టీలన్నీ  జట్టుకట్టాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆర్ఎన్‌ఎల్డీ నేత చౌతాలా ఇందుకు నడుం బిగించారుర. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయత్నాలే చేసి విఫలమైన నేపథ్యంలో తాజాగా ప్రాంతీయ పార్టీల ఐక్యతకు చౌతాలా నడుంబిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇందుకోసం ఆయన తన స్వ రాష్ట్రం అయిన హర్యానాలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు ఈ నెల 25 ముహూర్తం ఫిక్స్ చేశారు.  ఆ రోజే ఎందుకంటే సెప్టెంబర్ 25 మాజీ  ఉప ప్రధాని దేవీలాల్‌ జయంతి కనుక.  ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి  బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో లేని అంటే ఎన్డీయేతర, యూపీఏయేతర పార్టీల నేతలను ఆహ్వానించారు.  సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌, జేడీ ఎస్ నేత దేవెగౌడ, అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ఈ సమావేశానికి హాజరయ్యేందకు ఇప్పటికే అంగీకారం తెలిపారని చౌతాలా పేర్కొన్నారు.  ఎన్సీపీ , టీఎంసీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ , ఆర్‌ఎల్డీ వంటి పార్టీలనూ ఆహ్వానించినప్పటికీ ఆయా పార్టీల నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందనా రాలేదు. గతంలోనే ఇటువంటి ఐక్యత కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఐఎన్ఎల్డీ నుంచి ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియరాలేదు. ఒక వేళ అందినా కేసీఆర్ హాజరౌతారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. కాగా తెలంగాణలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే అభిప్రాయం ప్రకారం బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అంటే అంతిమంగా అది బీజేపీకి ప్రయోజనం చేకూర్చేదిగానే మిగిలిపోతుంది.   కాంగ్రెస్ నేతృత్వంలో  బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి నడిస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి దీటుగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నది పీకే అభిప్రాయం. ఇక కేసీఆర్ కూడా ఇటీవలి పరిణామాల అనంతరం కాంగ్రెస్ పంచన చేరాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 25న నిర్వహించనున్న ప్రాంతీయ పార్టీల సమావేశానికి హాజరవ్వడం అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. 

ఉమ్రాన్‌, చాహ‌ర్ ప‌నికిరాలేదా?.. సెల‌క్ట‌ర్ల‌ను ప్ర‌శ్నించిన హ‌ర్భ‌జ‌న్‌

ఆసియాక‌ప్‌లో పాకిస్తాన్‌, శ్రీ‌లంక చేతిలోనూ భార‌త్ ఓట‌మి ప‌ట్ల మాజీ క్రికెట‌ర్లు, వీరాభిమానులు మండి ప‌డుతున్నారు. అస‌లు సెల‌క్ష‌న్ విష‌యంలోనే పొర‌పాట్లు చేశార‌ని మాజీ స్టార్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ ఆగ్రహం వ్య‌క్తం చేశాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ ముందు బ్యాట్చేసిన భార‌త్ పెద్ద‌గా స్కోర్ చేయ‌క‌పోగా ప్ర‌త్య‌ర్ధు ల‌ను నిలువ‌రించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌యింద‌ని హ‌ర్భ‌జ‌న్ ఆరోప‌ణ‌లు గుప్పించాడు. ఉమ్రాన్ మాలిక్‌, దీప‌క్ చాహ‌ర్‌ల‌ను వినియోగించ‌క‌పోవ‌డం మీద టీమ్ ఇండియా కెప్టెన్ శ‌ర్మ‌ను, సెల‌క్ష‌న్ క‌మ‌టీని మాజీ స్పిన్న‌ర్ ప్ర‌శ్నించాడు. పాక్‌తో త‌ల‌ప‌డిన మ్యార్‌లో 7 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేశారు. మంచి స్కోర్ అనుకున్నా, ఆ త‌ర్వాత పాక్‌ను నిలువ‌రించ‌డంలో బౌల‌ర్లు విఫ‌లం కావ‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రిచంద‌ని అన్నాడు. ఆ మ్యాచ్‌లో మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్‌, మ‌హ‌మ్మ‌ద్ న‌వాజ్‌లు అద్భుతంగా ఆడారు. అంత‌కంటే మ‌న బౌలర్లు వారిని నిలువ‌రించ‌డంలో చేతులెత్తేశారన్నాడు. మంచి బౌల‌ర్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ వారిని స‌మ‌యానికి జ‌ట్టులోకి తీసుకోకుండా ఉన్న‌వాళ్ల‌తో స‌ర్దుకుపోయే ప్ర‌య‌త్నాలే జ‌రిగాయ‌ని ఆరోపించాడు. అస‌లు ఉమ్రాన్ మాలిక్‌, దీపక్ చాహ‌ర్‌ను ప‌నికి రార‌ని ఎలా భావించారో అర్ధంకావ‌డం లేద‌ని మండి ప‌డ్డా డు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌.  శ్రీ‌లంక‌తో మ్యాచ్ విష‌యానికి వ‌స్తే, కెప్టెన్ శ‌ర్మ అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 72 ప‌రుగులు చేయ‌డం ఆశ‌లు క‌ల్పించింద‌ని కానీ ఆ త‌ర్వాత ఏ బ్యాట‌ర్ అత‌నికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌లేక‌పోవ‌డం దారుణ‌ మ‌న్నాడు. కింగ్ కోహ్లీ, సూర్య‌, పాండ్యాల మీద పెట్టుకున్న ఆశ‌లు దెబ్బ‌తిన్నాయ‌న్నాడు. మ‌రో వంక కుశాల్ మెండిస్‌, నిస్సంక ఇద్ద‌రూ 97 ప‌రుగుల ఓపెనింగ్ భాగ‌స్వామ్యం ఆ జ‌ట్టును విజ‌యానికి గ‌ట్టిమార్గం వేసింది. వారిని అరిక‌ట్ట‌డానికి భార‌త్ బౌల‌ర్లు గ‌ట్టిగా వారి ప్ర‌త్యేక‌త‌లు ప్ర‌ద‌ర్శిం చ‌లేద‌నే హ‌ర్భ‌జ‌న్ విమ‌ర్శించాడు. కాయితంమీద క‌నిపించిన అద్భుతం ఫీల్డ్‌లో లోపించ‌డ‌మే మ‌న‌ సును గాయ‌ప‌రిచింద‌న్నాడు. రెండు మ్యాచ్‌ల్లో చేతులుఎత్తేయ‌డంతో క‌ప్ ఫైన‌ల్ ఆశ‌లు దెబ్బ‌ తిన్నా య‌ని, దీన్ని గురించి సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌త్యేకంగా ఆలోచించాల‌న్నాడు.  హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఒక్క‌డేకాదు, పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కూడా భార‌త్ ప‌రాజ‌యం ప‌ట్ల ఆశ్చ ర్యం వ్య‌క్తం చేశాడు. భార‌త్ అనుస‌రించిన గేమ్ ప్లాన్ ఘోరంగా విఫ‌లం కావ‌డం ఇప్పుడే చూశా న‌న్నాడు. పాకిస్తాన్‌తో ఓడిన‌ప్ప‌టికీ ఆ మేర‌కు శ్రీ‌లంక మీద గెలిచి పాక్ జ‌ట్టుకు స‌వాలు విస‌రు తుంద‌ని ఆశించాన ని కానీ రెండో మ్యాచ్ ప‌రాజ‌యం అస్స‌లు ఊహించ‌లేద‌న్నాడు. మ్యాచ్ ఆడే ఫైన‌ల్ లెవెన్ ఎంపిక విష యంలోనే భార‌త్ సెల‌క్ట‌ర్లు పొర‌పాటు చేసిన‌ట్టుగా క‌న‌ప‌డుతోంద‌ని అక్త‌ర్ అనుమానం వ్య‌క్తం చేశాడు.  జ‌ట్టుకు దినేష్ కార్తీక్‌, ఆవేష్‌ఖాన్‌, బిష్ణోయ్‌, రిష‌బ్ పంత్, హుడా ల‌లో జ‌ట్టుకు ఎవ‌రు ఎప్పుడు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డ‌తార‌న్న‌ది ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటే ప‌రాభ‌వాల‌కు అవ‌కాశం ఉండేది కాద‌ని అక్త‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.