ప్రపంచ వింత: పూజారుల ఆశీస్సులు తీసుకున్న అసద్!

ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూ పూజారుల ఆశీస్సులు తీసుకున్నారు. పూజారి చేత మెడలో దండ వేయించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూసారాంబాగ్‌లో శనివారం నాడు అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడే వున్న ఒక హనుమాన్ గుడి దగ్గరకి వెళ్ళిన మజ్లిస్ కార్యకర్తలు తమ నాయకుడిని ఆశీర్వదించాలని అక్కడే వున్న పూజారిని కోరారు. పూజారి అసదుద్దీన్‌ని ఆశీర్వదించి, మెడలో దండ వేసి, శాలువా కప్పారు. సాధారణంగా హిందూ నాయకులు చర్చికి వెళ్తారు, మసీదులకు, దర్గాలకు టోపీ పెట్టుకుంటారు. కానీ ముస్లిం నాయకులు హిందూ సంప్రదాయాలను కొద్దిసేపైనా పాటించింది చాలా తక్కువ. అది కూడా కరడుగట్టిన ముస్లిం నాయకుడు అసదుద్దీన్ హనుమాన్ గుడి పూజారి చేత ఆశీస్సులు తీసుకోవడం నిజంగా వెరైటీనే.  అసదుద్దీన్ ఇటీవల వేరే ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ముగ్గురు పూజారులు కూడా పాల్గొన్నారట. ఈసారి ఎన్నికలలో బీజేపీ తరఫున మాధవీలత హెదరాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. హిందూ ఓట్లు ఆమెకే పడతాయి. ముస్లిం మహిళల ఓట్లను కూడా ఆకర్షించే విధంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏనాడూ ఇప్పుడున్న స్థాయిలో అసదుద్దీన్ ప్రచారం చేసిన దాఖలాలు లేవని, మాధవీలతకు భయపడే ప్రచారం జోరు పెంచారని, హిందూ పూజారుల చేత ఆశీస్సులు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం తిప్పల్లో భాగంగా అసదుద్దీన్ తాను ప్రచారం చేస్తున్న సమయంలో తెలుగు పాటలను కూడా వినిపిస్తున్నారు. హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి అసద్ చేస్తున్న మరో ప్రయత్నమిదని పరిశీలకులు అంటున్నారు.

ప్రియాంక గాంధీ పోటీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా?

కాంగ్రెస్​ పార్టీపై, బీజేపీ చేసే ప్రధాన ఆరోపణ.. వారసత్వ రాజకీయం. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే.. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ.. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు. అందుకే ఆమె ఈ లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయ‌డం లేదు. బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ఆమె విముఖత చూపారట‌. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తో పాటు బీజేపీ నేతలంతా, కాంగ్రెస్‌ ను వారసత్వ పార్టీ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  ఇప్పటికే సోనియా కుటుంబం నుంచి ఆమెతో పాటు ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఎంపీలుగా ఉన్నారు. సోనియాగాంధీ 1998 నుంచి రాహుల్‌ గాంధీ 2004 నుంచి ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీలుగా కొనసాగుతుండటంతో,  ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తే బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు.  అమేథి, రాయబరేలిల్లో ఎక్కడో చోట నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రతిపాదనను ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. బీజేపీ వారసత్వ రాజకీయాల విమర్శలకు భయపడే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు.  గ‌త కొంత కాలంగా రాయ్ బరేలిలో ప్రియాంక పోటీ చేస్తారంటూ తెగ ప్ర‌చారం జ‌రిగింది.  ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లోని అమేథి, రాయ్ బరేలి లోక్ సభ స్థానాలు మొదటి నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నాయి.  గత లోక్ సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీ అమేథి నుంచి ఓడిపోయినప్పటికీ కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో  వయనాడ్ తో పాటు, రాయ్ బరేలి నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నారు.  రాయబరేలిలో 2004 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్‌ గాంధీ  పోటీ చేస్తున్నారు. అయితే అమేథిలో ఓటమి భయం వెంటాడటం వల్లే రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి పారిపోయి రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.   ఈ ఎన్నికల్లో పోటీ చేసి కేవ‌లం ఒక‌ నియోజకవర్గానికే పరిమితం కావడం కంటే దేశవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ  బలోపేతానికి కృషి చేయాలని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు.  మోదీ వేవ్​తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్​కు స్టార్ క్యాంపెనీయ‌ర్ గా ప్రియాంక గాంధీ ప్ర‌చారం చేస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

17 మంది హత్య... 700 ఏళ్ళ జైలు శిక్ష!

అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాను పనిచేసే ఆస్పత్రిలోని రోగులకు ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి 17 మందిని హత్య చేసినందుకు ప్రెస్డీకి కోర్టు ఈ శిక్ష విధించింది. 2020-2023 మధ్యకాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో ఈ నర్సు వివిధ ఆస్పత్రుల్లో పనిచేసింది. ఈ సమయంలో తాను పనిచేసే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ఈమె ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఇంజక్ట్ చేసేది. ఈమె అలా మొత్తం 22 మందికి చేసింది. దాని వల్ల 17 మంది మరణించారు. ఇన్సులిన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల హైపోగ్లైసీమియాకి దారి తీస్తుంది. దానివల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. గుండె పోటు వస్తుంది. ఈ హత్యలు చేసినట్టు నిందితురాలు ఒప్పుకుంది. ఎక్కువ ఇన్సులిన్ ఇచ్చి ఇద్దరిని హత్య చేసినట్టుగా ఈమె మీద గతంలో కేసు నమోదైంది. అయితే పోలీసుల విచారణలో ఈమె చంపింది ఇద్దర్ని కాదు పదిహేడు మందిని అని తేలింది. ప్రెస్డీ రోగులతో, వారి బంధువులతో చాలా దురుసుగా ప్రవర్తించేదని, ఆమె తన తల్లికి ఫోన్లో మెసేజ్‌లు పెడుతూ, తన చుట్టూ వున్న పేషెంట్లు తనకు ఎంతమాత్రం నచ్చడం లేదని, వాళ్ళందర్నీ చంపేయాలని అనిపిస్తోందని పేర్కొనేదని పోలీసులు తెలిపారు. ఆమె మానసికంగా బాగానే వుందని, ఉద్దేశపూర్వకంగా ఈ హత్యాకాండ చేసిందని పోలీసులు వెల్లడించారు. 

డ్ర‌గ్స్ రాజ‌ధానిగా ఏపీ! గంజాయిపై పెమ్మసాని గర్జన

పుస్తకాలతో కుస్తీ పడాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్తీ అవుతున్నాయి. ఉన్నతంగా ఎదగాల్సిన జీవితాలు, గంజాయి కూపంలో కూరుకుపోతున్నాయి. బిడ్డలపై తల్లిదండ్రుల ఆకాంక్షలు, గుప్పుమనే గంజాయికి నిప్పులా కాలిపోతున్నాయి. బతుకు మార్గం తెలుసుకోవాల్సిన జీవితాలు, గంజాయికి మత్తుకు అర్థంతంగా ముగిసిపోతున్నాయి. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయారు గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని. గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు.  గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమ‌ర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.  బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ ను సీబీఐ ప‌ట్టుకుంది. ఈ డ్ర‌గ్స్‌ కేసు వైసీపీ చుట్టూ తిరుగుతోంది. గ‌తంలో ముంద్రా పోర్టులో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ మూలాలు, వివిధ రాష్ట్రాల‌లో ప‌ట్టుప‌డుతున్న గంజాయి స‌ర‌ఫ‌రా మూలాలు అన్నీ ఏపీ వైపే వేలెత్తి చూపుతున్నాయి. గ‌తంలో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ సరుకు మీద ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడ అడ్ర‌స్‌లో న‌మోదైంది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా దొరికిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ తో ఉండడంతో, ఆ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చింది కావడంతో, ఇక జీఎస్టీ నెంబర్ కూడా దానికి ఉన్న నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పార్టీ నేత‌ల హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి.  అలాగే బెంగుళూరులో పట్టుబడిన సింథటిక్ డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయని క‌ర్ణాట‌క పోలీసులు తేల్చారు.   యువ‌త‌ను టార్గెట్ గా చేసుకుని గంజాయి ముఠాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెచ్చిపోతున్నాయి. మైన‌ర్లు కొంద‌రు త‌మ‌కు తెలియ‌కుండానే ఈ రొంపిలోకి దిగుతున్నారు.  అందుకే గంజాయి, కొకైన్ లాంటి మ‌త్తు ప‌దార్థాల ర‌వాణా  సులువుగా సాగిపోతోంది. వీరి వెనుక రాజ‌కీయ నాయకుల అండ‌దండ‌లు ఉన్నాయంటారు పెమ్మ‌సాని. ఏపీకి దిగుమతి అవుతున్న నిషేధిత డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింద‌ని పెమ్మ‌సాని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హెరాయిన్ కేసులో కానీ, విశాఖ భారీ డ్ర‌గ్స్ కేసులోకానీ కింగ్‌పిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా తేల‌లేదు. ఏపీలో మ‌ద్యాన్ని ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నారు. 60 రూపాయ‌లు ఉన్న చీప్ లిక్క‌ర్‌ను రూ.200ల‌కు విక్ర‌యిస్తున్నారు. రాజ‌ధాని లేదు కానీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ పేరుతో మ‌ద్యం బ్రాండ్ల‌ను జ‌గ‌న్ అమ్ముతున్నారని పెమ్మ‌సాని మండిప‌డ్డారు. గత దశాబ్దకాలంగా భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగింద‌ని పెమ్మ‌సాని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాంతోపాటే వినియోగమూ విప‌రీతంగానే పెరిగింది. ఏదో ఒక మూలనుంచి మన దేశానికి మాదకద్రవ్యాలు చేరుతూనే ఉన్నాయి. డ్రగ్స్ కు బానిసలవుతున్నవారిలో యువతదే సింహభాగం.  ప్రపంచంలోనే ఓపియం (నల్లమందు)ను అధికంగా సాగు చేసే మయన్మార్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు సమీపంలో ఉండటం కూడా భారత్ కు శాపంగా పరిణమించింది. ఆప్ఘన్ లో సాగయ్యే ఓపియంను పాకిస్తాన్ హెరాయిన్ గా మార్చి ఇండియాలోకి అక్రమంగా రవాణా చేస్తోంది. మయన్మార్ లోని షా, కచిన్ రాష్ట్రాలలో తయారయ్యే హెరాయిన్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను భారత్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు స్థానిక తిరుగుబాటు ముఠాలను చైనా ప్రోత్సహిస్తోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అంచనాల ప్రకారం భారతదేశానికి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ లో 70 శాతం అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతం ద్వారా చేరుతున్నాయి.  త‌న‌ను గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపిస్తే, ఈ డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని దేశం నుంచి త‌రిమేయ‌డానికి పార్ల‌మెంట్‌లో పోరాడ‌తాన‌ని పెమ్మ‌సాని గ్యారెంటీ ఇస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వివాహేతర సంబంధాన్ని నేరం అనలేం: కోర్టు

స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం అనలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వివాహేతర సంబంధాన్ని నేరం అనలేమని చెప్పింది. వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధం వుండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమం మాత్రమేనని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.  కోర్టు ఈ వ్యాఖ్యలను ఒక కేసు విషయంతో తీర్పు ఇస్తూ చేసింది. ఒక మహిళ కొంతకాలంగా ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే ఆ వ్యక్తి తనకు పెళ్ళి అయిన విషయం దాచి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ కోర్టు మెట్లు ఎక్కింది. అతనితో శారీరక సంబంధాన్ని ఇష్టపూర్వకంగానే కొనసాగించి, అతనికి ముందే పెళ్ళయింది కాబట్టి తనను నమ్మించి మోసం చేశాడని అనడంలో అర్థం లేదని జస్టిస్ అమిత్ మహాజన్ స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి లొంగదీసుకున్నాడని చెప్పినప్పటికీ దీన్ని నేరంగా పరిగణించలేమని అన్నారు. 

బీఆర్ఎస్ ఎన్నికల ఎత్తుగడ... హైదరాబాద్ యూటీ బూచి?

హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి  కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరి కొన్నాళ్లు కొనసాగించాలని  తెలుగుదేశంనాయకుడు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు  తాజాగా ఆరోపించారు.ఇవి తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని తెలంగాణను కాపాడుకోవాలంటో లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓట్లేయాలని పిలుపునచ్చారు. తెలంగాణ అస్థిత్వం కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తగిన ఎంపీ స్థానాలు అవసరమని కేటీఆర్,హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.   జూన్ 1వతేదీతో 10ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బీఆర్ఎస్ వినా ఎవరూ ఉమ్మడి రాజధాని గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారానికి దూరమైన బీఆర్ఎస్ కు, ఈ నెలలో జరిగే ఎన్నికలలో ఓటమి భయంతో వణికి పోతున్న జగన్ పార్టీకీ మాత్రమే ఉమ్మడి రాజధాని గుర్తుకు వచ్చింది. వాస్తవానికి ఏపీలో జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఈ ఐదేళ్లలో  హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయమే ఆయనక గుర్తులేదు. ఇప్పుడు ఎన్నికల ముంగిట ఓటమి భయం వెంటాడుతుంటే.. ఆయన ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చి చంద్రబాబు తప్పు చేశారంటూ విమర్శలు ఎత్తుకున్నారు. వాస్తవానికి  చంద్రబాబు హయాం లోనే ఏపీకి సంబంధించిన కార్యాలయాలన్నీ దాదాపుగా ఏపీకి తరలి వచ్చాయి. మిగిలిన కార్యాలయాలు కూడా జగన్ అధికారం చేపట్టిన తరువాత ఏపీకి తరలివచ్చాయి.  జూన్ 1వ తేదీ తరువాత హైదరాబాద్ కేంద్రం చేతిలోకి వెళుతుందన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లు తెలంగాణలో ఎన్నికల హీట్ పెంచాలనీ, ఐటీ బూచిని చూపి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందాలనీ చూస్తున్నారు.   బీజేపీ నుంచి హైదరాబాద్ యూటీ అన్న ప్రతిపాదన ఏదీ రాకుండానే బీఆర్ఎస్ కీలక నేతలు ఎందుకు ఆ అంశాన్ని లేవనెత్తారన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే తమను లోక్ సభ ఎన్నికలలో జీరో స్థానాల పరాభవం నుంచి గట్టెక్కగలదని బీఆర్ఎస్ భావిస్తుండటమే యూటీ బూచిన ఎన్నికల అంశంగా మార్చాలని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు కారణం.   తెలంగాణ ఉద్యమం సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ యూటీ ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. అప్పట్లో ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రజలు ,నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన అప్పట్లోనే అటకెక్కింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనకు అప్పట్లో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.  ఆ తరువాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించినా, దానిని ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఉత్తరాది,దక్షిణాది అంశాలు   తెరపైకి వచ్చిన నేపథ్యంలో కొంత కాలం కిందట హైదరాబాద్ ను ఢిల్లీ తరువాత దేశానికి రెండవ రాజధానిగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. శీతాకాలపార్లమెంటు సమావేశాలు  దక్షిణాదిలో హైదరాబాద్ లో జరపాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.  రాజ్యాంగంలో కూడా  రెండవ రాజధాని ప్రస్తావన ఉందని కొందరు చెబుతున్నారు కూడా. మొత్తం మీద తెలంగాణలో కనీస స్థానాలను దక్కించుకుని పరువు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్రాల మధ్య సెంటిమెంటు మంటలు రగల్చడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అయితే సెంటిమెంట్ రగిల్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలైతే ఇసుమంతైనా కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా బీజేపీ మద్దతు పొందాలన్న తహతహ బీఆర్ఎస్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ బీజేపీకి గెలుపు అవకాశాలున్న ఐదు నియోజకవర్గాల గురించి పట్టించుకోవడం లేదనీ, తన ప్రచారంలో కేవలం 12 స్థానాల్లో విజయం అనే అంటున్నారని చెబు తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో  పెను మార్పులు అంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారీ ఒప్పందానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో జీరో కాకూడదని బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కపపడానికీ, తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికీ కూడా వెనుకాడటం లేదని అంటున్నారు. 

జనం చెవిలో రేవంత్ రెడ్డి పూలు!

రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పూలే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నారు. ఎందుకంటే, ఆ పూలు పెట్టక తప్పని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం పోలవరం పరిసరాల్లోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాయి. 2014లో ఈ విలీనం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రక్రియకు మద్దతు పలికారు. అది జరగక తప్పని అంశం అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ మాట మార్చారు. ఆంధ్రాలో కలసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు తెస్తాం అని చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చి పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అండ్ కంపెనీ విలీన గ్రామాలు అనే పాయింట్‌ని పట్టుకుని మొన్నటి వరకూ వేలాడింది. ఇప్పుడు అదే పాయింట్‌ని పట్టుకుని రేవంత్ రెడ్డి వేలాడ్డం ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రీసెంట్‌గా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ చేశారు. ఏపీలో విలీనం అయిన గ్రామాలను వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన 1. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, 2. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, 3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), 4. హైదరాబాద్-విజయవాడ రహదారి వెంటే వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు, 6. మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు... ఇవన్నీ సాధిస్తామని రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సినవి ఇవ్వాల్సిందే అని అడగడంలో న్యాయం వుంది. కాకపోతే అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కదా... తెలంగాణలోని గ్రామాలను ఆంధ్ర్రపదేశ్‌లో కలిపింది. మాకు రావలసినవి అడుగుతాం.. ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వం అనే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. పైగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే.  కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే జనాన్ని మభ్యపెట్టడానికి గ్రామాలను తిరిగి తెచ్చే హామీ ఇస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటే ఆయన ఇష్టం. ఎవరు కాదంటారు?

అసదుద్దీన్ కు ఓటమి భయం... తెలుగు పాటలతో హిందూ ఓటర్లకు గాలం

40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ  వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు హిందువులవి.  ముస్లింల  పార్టీగా ముద్ర పడ్డ మజ్లిస్ గెలుపొందుతూ వస్తోంది.  కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా  మారింది. బిజెపి తరపున మాధవిలత పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణం. బిజెపిలో ప్రాథమిక సభ్యత్వం తీసుకోకుండానే హైద్రాబాద్ టికెట్ దక్కించుకున్న మాధవిలత సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యం పొందారు. సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా లతామా ఫౌండేషన్ ద్వారా ఆమె అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆమె ఎలాంటి సెక్యురిటీ లేకుండానే దూసుకుపోయారు.ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆమెకు వై కేటగిిరి సెక్యురిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ బిజెపి అభ్యర్థికి ఇలా సెక్యురిటీ కల్పించడం ఇదే మొదటిసారి.  ముస్లిం గర్బిణీ స్త్రీలకు ఉచితంగా ప్రసవాలు చేయించడం , ఆకలితో అలమటిస్తున్న ముస్లిం కుటుంబాలను గుర్తించి రేషన్ సప్లయ్ చేయడం ఆమె గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. (పస్మందా) (దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నముస్లింలు) నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని 40 ఏళ్ల నుంచి వారి కోసం ఆలోచించడం లేదని మాధవిలత వాదన. మాధవిలత ఏనాడు హైదరాబాద్ టికెట్ అడగలేదు. ఆమె సేవలను గుర్తించి బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. టికెట్ వచ్చిన తర్వాతే ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఆమె జాతీయ మీడియాను ఆకర్షించారు. ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు క్యూ కట్టారు. ఇండియా టీవీ ఎడిటర్ రజత్ శర్మ మాధవిలత చేత ప్రతిష్టాత్మక ‘‘ఆప్ కీ అదాలత్ ’’ కార్యక్రమం  నిర్వహించారు. రజత్ శర్మ ప్రశ్నలకు ఒక మెచ్యురిటీ నేత మాదిరిగా మాధవిలత ఇచ్చే సమాధానాలు యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఆ ఇంటర్వ్యూను వీక్షించాలని సాక్షాత్తు ప్రధాని ట్వీట్ చేయడం గమనార్హం. మాధవిలతకు పెరుగుతున్న ఆదరణతో మజ్లిస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నట్టుంది. తెలుగు మీడియకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడని అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా తెలుగులో పాటలు రాయించుకుని  హిందూ వోటర్లను ఆకర్షించడానికి బయలు దేరారు. ఈ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. బ్రాహ్మణులతో సమావేశమయ్యారు.  ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ చేత పాటలు పాడించుకునే స్థితికి అసదుద్దీన్ చేరుకోవడం ఓటమి భయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం వోట్లను కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చీల్చింది. మజ్లిస్ కు కంచుకోటగా ఉన్న యాకుత్ పురా అసెంబ్లీలో కేవలం 800 పై చిలుకు ఓట్లతో మజ్లిస్ గెలుపొందడం  చూస్తే ఆ పార్టీ పరిస్థితి అంచనా వేయవచ్చు. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ నుంచి చీలిపోయిన మజ్లిస్ బచావ తాహ్రీక్(ఎంబిటి) పుంజుకుంది. చాంద్రాయణ గుట్ట మాజీ ఎమ్మెల్యే అమనుల్లా ఖాన్ మజ్లస్ తో విభేధించి ఎంబిటి ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు భారతీయ జనతాపార్టీ కారణమని , చివరకు మజ్లిస్ పార్టీ  ఆ పార్టీకి సపోర్ట్ గా ఉందని ఎంబిటి విస్తృతంగా ప్రచారం చేసింది. బహింగ సభల్లో అమనుల్లాఖాన్ కుమారుడు అమ్జదుల్లాఖాన్ బోరున విలపిస్తూ చేసిన ప్రసంగాలు ముస్లిం వోటర్లను ఆకట్టుకున్నాయి. యాకుత్ పురా, మలక్ పేట, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు చాలా తక్కువశాతం మజ్లిస్ పార్టీకి పడ్డాయి. ఎక్కువ వోట్లు ఇతర పార్టీలకు చీలిపోవడం అసదుద్దీన్ ఓవైసీని ఆలోచనలో పడేసింది. ఈ ఎన్నికల్లో ఆయన ప్రముఖ తెలుగు టీవీ చానల్స్ తో బాటు యూ ట్యూబ్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. _బదినెపల్లి శ్రీనివాసాచారి   

జగన్ వై నాట్ 175 ధీమా ఎక్కడ?.. ఓటమి గండం గట్టెక్కేదెలా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు.  కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు. అంత సీన్ లేదని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. అప్పటిలో వైసీపీ వర్గాల్లో కూడా జగన్ ధీమా ఏంటి అన్న విస్మయం వ్యక్తమైంది. అయితే ఆ ధీమా మాత్రం పార్టీ మొత్తంలో జగన్ ఒక్కరిలోనే కనిపించింది. మంత్రులూ, నాయకులూ మాత్రం తమకు గడపగడపలో ఎదురైన పరాభవ అనుభవంతో  ఆయన మాట నమ్మకపోయినా.. ఏమో జగన్ ధీమా ఏమిటో? అని గెలుపు ఆశలను నిండా నింపుకున్నారు. అయితే రోజులు గడిచిన కొద్దీ జగన్ లో ఆ ధీమా సన్నగిల్లుతూ వచ్చిందన్నది ఆయన ప్రసంగాలలో, అసహనంలో, ఫ్రస్ట్రేషన్ లో ప్రస్ఫుటంగా కనిపించింది కూడా. తీరా ఎన్నికలు  రోజుల వ్యవధిలోకి వచ్చేసరికి వైనాట్ 175 ధీమా పూర్తిగా పోయింది. ఆ స్థానంలో ఓటమి భయం పట్టుకుంది. సెంటిమెంటు, దౌర్జన్యం, విపక్షాలపై దాడులు ఇవేమీ గెలుపు దారి చూపలే కపోవడంతో ఇక ఆయన తన విశ్వాసాన్ని మార్చుకుని వాస్తును శరణుజొచ్చారు. తాడేపల్లిలోని తన అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీసులలో వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టారు. జగన్ పర్యవేక్షణలోనే ఈ పనులు జరుగుతున్నాయని అంటున్నారు.  కూల్చివేతలతో మొదలైన జగన్ పాలన చివరకు వాస్తు దోష నివారణ అంటూ సొంత ప్యాలెస్ లోనే కూల్చివేతల పర్వానికి తెరతీయాల్సి వచ్చింది.     వాస్తు పండితుల సూచనలకు అనుగుణంగా  జగన్ నివాసం  క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న ఇనుప కంచెలోని కొంత భాగం కూల్చివేత పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.  ఈ ఇనుప కంచెలను జగన్ అధికారంలోకి రాగానే  ఒక్క పురుగు కూడా  ఆ కంచెను దాటి లోనికి ప్రవేశంచే అవకాశం లేనంత పటిష్టంగా నిర్మించారు.  ఇప్పడు వాస్తుదోషమంటూ ఆ ఇనుప కంచెలోని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారు. స్వతహాగా క్రైస్తవుడైన జగన్ కు ఇటువంటి నమ్మకాలు లేవు. తిరుమలలో తనకు వెంకన్న దేముడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికే నిరాకరించిన జగన్ ఇప్పుడు వాస్తు పేరుతో తన ప్యాలెస్ లోనే మార్పులు చేయడానికి వెనుకాడలేదు.  మొత్తమ్మీద ఓటమి భయం జగన్ ను ఎంతగా వెంటాడుతోందో  ప్యాలెస్ లో వాస్తుదోష నివారణ పేరుతో చేపట్టిన కూల్చివేతలే చెబుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  

నేషనల్ మీడియా ముందు చేతులెత్తేసిన జగన్!

ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే. ఈ విషయం ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సాక్షాత్తూ జగన్ ముఖం చూస్తే చాలు. ఆయన ముఖంలో ఓటమి కళ అరచేతి మందంలో కనిపిస్తోంది. జగన్ మాటల్లో ఈ వాస్తవం డీటీఎస్‌లో వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా ఎవరికైనా డౌట్స్ వుంటే, శుక్రవారం నాడు నేషనల్ మీడియా టైమ్స్ నౌలో సీనియర్ లేడీ జర్నలిస్టు నవికా కుమార్‌కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూలో జగన్ ఆద్యంతం ఏడుపు ముఖంలో, ఓటమి కన్ఫమ్ అయిపోయిన ఎక్స్.ప్రెషన్‌తో కనిపించారు.  ఇంటర్వ్యూలో జర్నలిస్టు నివకా కుమార్ ఒక్కో ప్రశ్న సంధిస్తుంటే జగన్ తెల్లముఖం వేసుకుని, సమాధానాలు చెప్పడానికి నానా తంటాలూ పడ్డారు. ఒక సందర్భంలో జగన్ ఆమె ప్రశ్నకు సమాధానంగా- ‘‘మీరు నా స్థానంలో వుంటే అర్థమవుతుంది’’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దానికి నవికా కుమార్ చురుగ్గా స్పందిస్తూ, ‘‘దేవుడి దయవల్ల నేను మీ స్థానంలో లేను’’ అన్నారు. దాంతో షాకైపోవడం జగన్ వంతు అయింది. జగన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనను జైల్లో వేయడం దగ్గర నుంచి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తనకు వ్యతిరేకంగా పని చేస్తూ వుండటం వరకు... తాను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ చంద్రబాబే కారణం అని చెబుతుంటే నవికా కుమార్ జగన్‌ని ఇదేంట్రా బాబూ అన్నట్టు చూస్తూ, మీరు ప్రతీదానికీ చంద్రబాబే కారణం అంటున్నారు అని వెటకారంగా అన్నారు. దానికి మన జగన్ సార్ ఒక వెర్రి నవ్వుతో ప్రతిస్పందించారు. రాహుల్ గాంధీ గురించి జగన్‌ని నవికా కుమార్ ప్రశ్నించినప్పుడు జగన్ దిక్కులు చూస్తూ, వెర్రినవ్వులు నవ్వుతూ వుండటంతో ఆమె ‘‘నవ్వడం కాదు.. సమాధానం చెప్పండి’’ అన్నారు. జగన్ ఓ సందర్భంలో నేషనల్ పాలిటిక్స్ గురించి తనకు అంతగా అవగాహన లేదు అన్నారు. అప్పుడు నవికా కుమార్ జగన్‌ని శుద్ధ మొద్దుని చూసినట్టు చూసి, ‘‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వున్న మీరు నేషనల్ పాలిటిక్స్ గురించి పట్టనట్టు వుండటం కరెక్టుగా లేదు’’ అంటూ కామెంట్ చేశారు. అయినా మనసార్ ఒక వయ్యారపు నవ్వు విసిరారు. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఈ ఎన్నికలలో మీకు ఎన్ని సీట్లు వస్తాయి అని నవికా కుమార్ అడిగితే, జగన్ జీవం లేని నవ్వు నవ్వుతూ ‘స్వీప్ చేస్తాం’ అన్నారు. నవీ కుమార్ మరోసారి రెట్టించి అడిగితే, ‘స్వీప్ చేస్తాం’ అని మరోసారి అన్నారు. ఆ ‘స్వీప్’ గెలుపు స్వీప్‌లా అనిపించలేదు.. చీపురు పట్టుకుని చేసే స్వీప్‌లా అనిపించింది. జగన్ మాటమాటకీ, షర్మిల నా కుటుంబం పరువు తీస్తోంది అని అన్నప్పుడు, అది మీ కుటుంబం మాత్రమే కాదు.. షర్మిల కుటుంబం కూడా అని నవికా కుమార్ చురక వేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆయన వారసత్వం కావచ్చు.. అది మీకు మాత్రమే కాదు.. షర్మిలకు కూడా సమానంగా దక్కుతాయి అని నవికా కుమార్ అన్నప్పుడు జగన్ ముఖం చూడాలి. అబ్బో... ఆ ఎక్స్.ప్రెషన్ ఇవ్వడం ఆయనకి తప్ప మరొకరికి రాదు. మీరు ఐదేళ్ళుగా అధికారంలో వుండి మీ బాబాయి హత్య కేసులో ఎలాంటి పురోగతి ఎందుకు సాధించలేదు అంటే, ఏదేదో సంబంధం లేని సమాధానం చెప్పి దాటవేశారు. మొత్తమ్మీద నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ చెప్పిన సమాధానాలు తక్కువ.. సాగదీసింది ఎక్కువ. వెంట వెంటనే సమాధానాలు చెబితే, ఇంకో ప్రశ్న దూసుకొస్తుందన్న భయంతో జగన్ లాగీ లాగీ సమాధానం చెప్పారు. అలా టైమ్ కిల్ చేయగలిగారు. పాపం జగన్‌కి ఇంకో దరిద్రం ఏమిటంటే, ఇంటర్వ్యూ నడిచినంతసేపూ బ్యాక్ గ్రౌండ్లో చంద్రబాబు విజయోత్సాహంతో ప్రచారం చేస్తున్న క్లిప్పింగ్స్, మోడీ ప్రచారం చేస్తున్న దృశ్యాలు, షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న దృశ్యాలు, షర్మిల ప్రచారం చేస్తున్న చూపించారు. జగన్ ప్రచారం చేస్తున్న విజువల్స్ కొద్ది క్షణాలు మాత్రమే చూపించారు.  మొత్తమ్మీద నీర్సంగా, అన్యమనస్కంగా, జిడ్డుకారుతున్న ముఖంతో, జీవం లేని నవ్వుతో, బిత్తర చూపులతో, క్లారిటీ లేని సమాధానాలతో సాగిన ఈ ఇంటర్వ్యూ ఇక జగన్ ఓటమి పక్కా అని కన్ఫమ్ చేసింది.

న‌గ‌రిలో రోజా ఓట‌మి లాంఛ‌న‌మే?!

ఏపీలో ఎన్నిక‌ల వేళ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్య‌ర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి.  రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం సాధించిన ఆమె.. మూడోసారి విజ‌యంతో హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని ఆశపడుతున్నారు.  అయితే నియోజ‌క‌వ‌ర్గంలో రోజాకు ప్ర‌జ‌ల నుంచేకాక సొంత పార్టీ నేత‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదుర‌వుతుండటంతో ఆమె ఆశ అడియాస కాకతప్పదన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. రోజా వ‌ద్దు.. కూట‌మి అభ్య‌ర్థి ముద్దు అంటూ నియోజ‌క‌వ‌ర్గంలోని మెజార్టీ వైసీపీ నేత‌లు నిన‌దిస్తున్నారు. ఇప్ప‌టికే స‌ర్వేల‌న్నీ రోజా ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చిచెప్పాయి. రోజాకు ఈ పరిస్థితి ఎదురుకావడానికి ఆమె స్వయంకృతాపరాథమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నారు. అలవిమాలిన   అహంకారంతోనే రోజాకు ఈ పరిస్థితి వచ్చిందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.  గ‌త ఐదేళ్ల కాలంలో రోజా నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి చేయ‌క‌పోగా.. త‌న సోద‌రులు, భ‌ర్త స‌హ‌కారంతో ఓ అవినీతి అన‌కొండ‌లా మారార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గం  ప్ర‌జ‌లుసైతం రోజా ప్ర‌చారాన్ని అడ్డుకుంటూ ఆమెను అడుగ‌డుగునా నిల‌దీస్తున్నారు. తాజాగా వ‌డ‌మారిపేట మండ‌లం వేమ‌పురం గ్రామ‌స్తులు రోజాను అడ్డుకున్నారు. ఐదేళ్లు అధికారంలోకి ఉండి కూడా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేద‌ని, ఎన్నిక‌లు రాగానే ఓట్లు అడ‌గ‌డానికి ఎలా వ‌స్తార‌ని రోజాను నిల‌దీశారు. రోజా ప్ర‌చార వాహ‌నాన్ని అడ్డుకున్నారు.  మ‌రోవైపు రోజా తీరుపై కొంత‌కాలంగా తీవ్ర ఆగ్ర‌హంతోఉన్న ఐదు మండ‌లాల వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో రోజాకు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అయ్యారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోసారి రోజా పోటీ చేస్తుండ‌గా.. కూట‌మి అభ్య‌ర్థిగా గాలి భాను ప్రకాష్ బ‌రిలో నిలిచారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా భాను ప్ర‌కాష్ కు గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అందుకు రోజాకు అడుగ‌డునా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ స‌మ‌స్య‌ల‌పై రోజాను నిల‌దీస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ఏ స‌మ‌స్య‌నూ ప‌రిష్క‌రించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రోజా ఓట‌మి ఖాయ‌మ‌ని భావిస్తున్నవేళ‌.. మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డిన చందంగా,  ఆమెకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. మంత్రి రోజాపై సొంత పార్టీ నేతలే రివర్స్ అయ్యారు. ఆమెను ఓడించి తీరుతామ‌ని చాలెంజ్ చేశారు. గ‌త ఎన్నికల్లో విజ‌యం త‌రువాత రోజా నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి అన‌కొండ‌లా మారార‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా ఆమెకు క‌ప్పం క‌ట్టాల్సిందేన‌ని వారు ఆరోపిస్తున్నారు. అవినీతిలో ఆరితేరిన రోజాకు మ‌రోసారి టికెట్ ఇవ్వొద్ద‌ని గ‌త కొంత‌కాలంగా వైసీపీ అధిష్టానంపై నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాల నేత‌లు ఒత్తిడి తెచ్చిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రోజాకే మ‌రోసారి టికెట్ కేటాయించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నైనా రోజాలో మార్పు వ‌స్తుంద‌ని భావించి ఇంత కాలం ఊరుకున్నామనీ, అయితే ఆమె తీరు మారకపోవడంతో  కీలక నిర్ణయం తీసుకున్నామనీ చెబుతు న్నారు. ఆ కీలక నిర్ణయం ఏమిటంటే  ఐదు మండలాల వైసీపీ కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేసేశారు. తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు.  దీంతో రోజాకు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. రోజాకు ఫుల్ సపోర్టుగా ఉండాల్సిన  నేతలు వైసీపీని వీడుతుండటంతో రోజా ఓట‌మి లాంఛ‌న‌మేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు, ఆరుగురు సర్పంచ్ లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వైసీపీకి శుక్రవారం( మే3)  రాజీనామా చేశారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడిపోతారని  ఎంతగా చెప్పినా వైసీపీ అధిష్టానం  పెడచెవిన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదలియార్ వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎంపీపీ ఏలుమలై వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన పుత్తూరు, నగరిలో పర్యటించి మంత్రి అవినీతి, అక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ఆయన వెంటఉన్న క్షత్రియ సామాజికవర్గ నాయకులు సైతం ఏకతాటిపైకి వచ్చి రోజాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో రోజా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షలు వరకు తీసుకున్నారని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచికూడా 10 శాతం కమిషన్ తీసుకున్నారని, బదిలీకైనా, అప్రూవల్ కయినా డబ్బులు ఇవ్వాల్సిందేనని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నికల వేళ నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీలోని ఓ వర్గంతోపాటు.. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండటంతో ఆమె ఓటమి ఖాయమని వైసీపీ అధిష్టానంసైతం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు రోజాపై మంత్రి పెద్దిరెడ్డి వర్గంకూడా గుర్రుగా ఉంది. రోజాకు ఎన్నికల్లో గట్టిషాక్ ఇచ్చేందుకు వారుకూడా సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇన్నాళ్లు అహంకారంతో ప్రతిపక్ష పార్టీల నేతలపై ఇష్టారీతిలో మాట్లాడిన రోజాకు ఎన్నికల్లో ప్రజల నుంచి పరాభవం తప్పదని అంటున్నారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలతోపాటు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రోజా చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపట్ల నియోజకవర్గంలోని మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. మహిళ అన్న విషయం మరచి నోటికి ఎంతవస్తే అంత మాట్లాడటం సరికాదని, ఆమెకు ఎన్నికల్లో సరియైన గుణపాఠం చెబుతామనీ నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు పేర్కొంటున్నారు. గమనార్హం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో సర్వేలు చెప్పినట్లు నగరి నియోజకవర్గంలో రోజా చీటీ చిరగడం ఖాయమన్నభావనే రాజకీయవర్గాల్లో, ప్రజలలో చివరాఖరికి వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతోంది. 

హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ లలో మోసాలు

TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళను నమ్మి మోసపోయానంటారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సి.హెచ్ శ్రీనివాస‌రావు. ఆ  కంపెనీ వాళ్ళు ప్రజల ఆరోగ్య అవసరాలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ లో పాలసిదార్లు గా చేర్చుకునే టార్గెట్లు పూర్తి చేసుకునే వరకు అనేక రకాలు గా కబుర్లు చెప్పి చేర్చుకొని ప్రీమియం వసూలు చేసుకుంటారు.  ఆ తరువాత అదే పాలసీ హోల్డర్ ఆసుపత్రి పాలై చికిత్స తీసుకుంటే మాత్రం క్లెయిమ్ ల దగ్గరకి వచ్చేసరికి హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీల అసలు రంగు బయటపడుతుంది. క్లెయిమ్ లను ఎగ్గొట్టడానికి ఎన్నెన్ని రకాలుగా ఎత్తులు వేస్తారో చెపితే కొత్తగా లేని బీపీ, షుగర్ వ్యాధులు వస్తాయంటున్నారు శ్రీనివాస్. ఇన్యూరెన్స్ కంపెనీ శ్రీనివాస్‌ను మోసం చేసిన తీరును ఆయ‌న వివ‌రించారు. నేను ఏప్రిల్ 19వ తేదీన గుండె పోటు కి గురయ్యి  సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరాను. అదే రోజున స్టంట్ వేశారు. ICCU నుంచి రూమ్ కు షిఫ్ట్ చేసిన తర్వాత మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంది కదా అని క్లెయిమ్ కోసం అక్కడే దరఖాస్తు చేసుకున్నాను. కిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కు అవసరమైన వివరాలు, రికార్డులన్నీ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళు రంగంలో కి దిగారు. మొదటి కొర్రిగా బీపీ గురించి అడిగితే దానికి ఒక డాక్టర్ లెటర్ పంపారు. ఆ తర్వాత ఒక గంట సమయం తర్వాత మరో కొర్రి అడిగారు. ఈసారి షుగర్ గురించి. దానికీ మళ్ళీ ఒక సర్టిఫికెట్ పంపాము. మరో గంట సమయం తర్వాత మరో కోర్రి అడుగుతూ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఈసారి హైపర్ టెన్షన్ గురించి. మళ్లీ దానికి డాక్టర్ లెటర్ పంపారు. మరో గంట సమయం తర్వాత మళ్లీ కోర్రీ అడుగుతూ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. షుగర్ గురించి పాత రికార్డులు అడిగారు. ఏదో జోక్ చెప్పినట్లుగా... "ఆరు నెలల క్రితం బ్రతికి ఉన్నట్లు గా లెటర్ తీసుకురామట్లుగా'' అడిగారు. పాత ప్రెస్క్రిప్షన్లు ఎక్కడో పడిపోయి ఉంటాయిగా... ఇక దాన్నే పట్టుకున్నారు TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళు. ఇక సహనం నశించి ఆ కంపెనీ మేనేజర్ నరేష్ గారి నెంబరు ఎలా గోలా కనుక్కొని ఫోన్ చేసి నా బాధ, టెన్షన్ మొత్తం వివరించా. వాదోప వాదనలు పూర్తయిన తర్వాత ఆయన ఒక ఆథ‌రైజేషన్ లెటర్ ఇవ్వమన్నారు. అది కూడా ఇచ్చాను. ఆ తరవాత సోమవారం రాత్రి ( ఏప్రిల్ 22వ తేదీ)  TATA AIG GENERAL INSURANCE కంపెనీ నుంచి నర్సయ్య అనే వ్యక్తి హాస్పిటల్ లోనీ నా రూమ్ (A9006)కు వచ్చారు. నా ఫోటో, నాతో పాటు నా పక్కనున్న నా భార్య ఫోటో తీసుకున్నాడు. మళ్లీ అదే వ్యక్తీ పక్కనే ఉన్న రిసెప్షన్ లో నర్సుల దగ్గరకు వెళ్ళి మొత్తం నా రికార్డులన్నీ ఫొటోలు తీసుకున్నాడు. ఇన్స్పెక్షన్ కు వచ్చినట్లుగా నా నుంచి సంతకం కూడా తీసుకున్నాడు. ఈ మొత్తం తతంగమంతా రెండు రోజుల పాటు జరిగింది. ఇంతా చేస్తే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఇచ్చారా... అంటే అదీ లేదు... పాత రికార్డులు లేవని నా క్లెయిమ్ ను ఇవ్వకుండా తిరస్కరించారు. అంటే ఆరేళ్ళ క్రితం నేను బ్రతికి ఉన్నట్లుగా రికార్డులు ఇవ్వనందుకన్నమాట...ఇందులో ఏమైనా అర్థముందా? నేను ఆసుపత్రిలో చేరింది గుండె పోటుతో... స్టంట్ వేశారు... దానికి చికిత్స చేశారు. బిల్లు కూడా అందుకే వేశారు... కొర్రీలు పేరుతో రెండు రోజుల పాటు వేధించారు... అయినా ఓపికగా డాక్యుమెంటరీ జవాబులు ఇచ్చాం. ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి ఇన్స్పెక్షన్ కు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. బోగస్ క్లెయిమ్ కాదు నిజమైన క్లెయిమ్ యే నని నిర్ధారించుకున్నారు. అయినా పాత ప్రిస్క్రిప్షన్ లు ఇవ్వలేదని రిజెక్ట్ చేసారు. ఇలా ఒక సీనియర్ జర్నలిస్ట్ కే వేధింపులు తప్పలేదు... క్లెయిమ్ ఇవ్వలేదంటే ఇక మిగతా సామాన్య జనం పరిస్ఠితి ఎలా ఉంటుందో మ‌రి... హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవ‌రు? - ఎం.కె.ఫ‌జ‌ల్‌

ఆటూ ఇటూ కాకుండా పోయిన కాపు ఉద్యమ నేత ‘ముద్ర’గడ!

కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆయన  ‘ముద్ర’ను సొంత కుటుంబమే చెరిపేసింది.  ఆయన వైసీపీ గూటికి చేరి.. ఫ్యాన్ గాలితో  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తానన్నారు.  అయితే సొంత ఇంటిలోనే ఫ్యాన్ రెక్కలు తిరగడం మానేశాయి. స్వయంగా ఆయన కుమార్తె  తండ్రిని నమ్మవద్దని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తానికీ పిలుపు నిచ్చింది. తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం కోసం పని చేస్తానని ప్రకటించి.. తన తండ్రి ముద్రను కాపు సామాజికవర్గంలో చెరిపేసింది.   దీంతో స్వయంప్రకటిత కాపు ఉద్యమ నేత ‘ముద్ర’ పద్మనాభానికి ఇక లేకుండా పోయింది.  పిఠాపురంలో పవన్ కల్యాణ్ జోరును అడ్డు కోవాలంటే కాపు సాజాజిక వర్గంలో తనదైన ‘ముద్ర’ ఉన్న పద్మనాభం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఒక్కటే మార్గమని భావించిన వైసీపీ అధినేత సీఎం జగన్  బోల్తాపడ్డారు. నాయకుడుగా ముద్రగడ వైఫల్యాలు తుని ఘటనతోనే బహిర్గతమయ్యాయి. ఆ తరువాత ఉప్మా ఖర్చులు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పేరు ఎత్తిన రోజునే  కాపు యువతలో ఆయన ‘ముద్ర’ చెరిగిపోయింది. ఇప్పుడు.. ఇక పిఠాపురంలో జనసేన కోసం ఆయన ప్రచారంలో చెస్తున్న వ్యాఖ్యలు సొంత కుమార్తెకే వెగటు కలిగిస్తున్నాయంటే.. ఆయన పరువు ఏ గంగలో కలిసిందో ఆయనే చెప్పుకోవాలి.  ఇక సొంత కుమార్తె వద్దే చెల్లని ముద్ర  ఇక బయట కాపు సామాజిక వర్గంలో ఏం చెల్లుతుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  తండ్రిపై కూతురు ఎగురవేసిన తిరుగుబావుటా.. కాపు సామాజికవర్గంలో తనకు ఉందని ఆయన స్వయంగా చెప్పకుంటున్న ఇమేజిని డ్యామేజీ చేసి గ్యారేజీకి పంపేసింది.   అన్నిటికీ మించి ముద్రగడ బానిసలా మారిపోయారనీ, జగన్ ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతూ, జగన్ పవన్ ను ఏం తిట్టమంటే అది తిడుతున్నారనీ సొంత కుమార్తె ఇచ్చిన వీడియో సందేశం ఏపీ రాజకీయాలలో ఒఖ సంచలనంగా మారింది. ఇప్పుడిక వైసీపీ కూడా ముద్రగడ విషయంలో పునరాలోచనలో పడినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ముద్రగడను ముందుపెట్టి.. కాపు సామాజికవర్గ ఓట్లను దండుకునే అవకాశం అటుంచి,  అసలు ఆయన తమ పక్కన ఉండటమే మైనస్ గా మారిందన్న భావన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. దీంతో ఆయనను పక్కన పెట్టేయడమే బెటర్ అని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

 ప్రధాని ఎపి పర్యటన ఖరారు... కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం 

ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. కూటమి అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయాలని  నిర్ణయించారు.  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.. పోలింగ్‌‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఓ వైపు అధికార వైఎస్సార్‌సీపీ మరోవైపు ఎన్డీఏ కూటమి, ఇంకోవైపు కాంగ్రెస్ కూడా జనాల్లోకి వెళుతున్నాయి. మేనిఫెస్టోలు కూడా విడుదల కావడంతో.. ఆ హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆంధప్రదేశ్‌లో పర్యటిస్తారు. జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 7న సాయంత్రం  తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు మోదీ. వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం  అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభకు కూడా హాజరవుతారు. మరుసటి రోజు 8న సాయంత్రం  అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7  విజయవాడలో కూడా ప్రచారంలో పాల్గొంటారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు ప్రధాని రోడ్‌షో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి రావాలని భావించారు. బిజీ షెడ్యూల్ కారణంగా మార్పులు, చేర్పులు జరిగాయని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ప్రధాని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

నగరిలో వైసీపీ ఖాళీ.. రోజాకు జబర్దస్త్ ఓటమి ఖాయం?!

నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం. నగరిలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనీ, సొంత పార్టీలోని కొందరు ఇందుకు సూత్రధారులనీ రోజా ఎంత మొరపెట్టుకున్నా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. ఒక దశలో ఆమెకు నగరి టికెట్ కూడా నిరాకరిస్తారన్న వార్తలు పార్టీ వర్గాల నుంచే వచ్చాయి. ఏమైతేనే మొత్తం మీద రోజా నగరి నుంచి పోటీలో నిలిచారు. ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు ఏ మాత్రం అనుకూలంగా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా నగరి లో ఐదు మండలాల వైసీపీ ఇన్ చార్జులు, ఆయా మండలాల్లోని నేతలూ పార్టీకి గుడ్ బై చెప్పాశారు. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు, మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాను నగరిలో ఓడించడమే తమధ్యేయమని ప్రకటించారు. నగరి బరిలో నిలిచిన రోజా నియోజకవర్గంలో తనను వ్యతిరేకించే పార్టీ నేతలను సస్పెండ్ చేయించగలిగారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేస్తూ, పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ జగన్ కు ఫిర్యాదు చేసి తన వ్యతిరేకులను సస్పెండ్ చేయించారు. అలా సస్పెన్షన్ కు గురైన వారంతా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు కావడంతో.. రోజా  నియోజకవర్గంలో పై చేయి సాధించారని అంతా భావించారు. అయితే ఇప్పుడు సీన్ తిరగబడింది. సస్పెన్షన్ కు గురైన వారితో పాటు వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీకి రాంరాం చెప్పేశారు. పార్టీలో ఉన్నంత కాలం అంతర్గతంగా రోజాకు వ్యతిరేకంగా పని చేసిన వీరంతా ఇప్పుడు బాహాటంగానే రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె అవినీతిని విపక్షాలకు మించి ఎండగడుతున్నారు. రోజా ఓటమే లక్ష్యమంటూ శపథం చేస్తున్నారు. నగరి నుంచి వరుసగా రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించిన రోజాకు ఆ రెండు సార్లూ కూడా పెద్దపెద్ద మెజారిటీ ఏమీ రాలేదు. తొలి సారి బొటాబొటీగా గెలిచిన రోజా, 2019 ఎన్నికలలో జగన్ వేవ్ లో కూడా రెండు వేల ఓట్ల ఆధిక్యతతోనే విజయం సాధించారు. అటువంటిది ఇప్పుడు రోజాకు ఇంటా బయటా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో  ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సారి ఆమె గట్టెక్కే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు.       తాజాగా రోజా ఓటమే లక్ష్యం అంటూ ఐదు మండలాల వైసీపీ ఇన్ చార్జ్ లు, వారితో పాటు ఆ మండలాల స్థానిక వైసీపీ నేతలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ ఐదు మండలాల్లో రోజా కనీసం ప్రచారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.   

పవన్ పర్యటనను అడ్డుకునే కుట్ర.. పొన్నూరులో హెలిపాడ్ ధ్వసం

యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ  వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఆ ఫ్రస్ట్రేషన్ లో ప్రత్యర్థి ప్రచారాన్ని అడ్డుకునేందుకు దౌర్జన్యాలూ, దాడులకు కూడా తెగబడుతున్నారు.  నిన్న కాక మొన్నమచిలీపట్నం వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం పేరుతో ప్రత్యర్థులకు మద్దతు ఇస్తున్న వారిపై దాడులకు తెగబడ్డారు.   తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు లక్ష్యంగా ప్రచారం పేరుతో వారి ఇళ్లకు వెళ్లి మరీ దాడులు దౌర్జన్యాలకు తెగబడ్డారు,. నిన్న కాక మొన్న  మచిలీపట్నంలో  జనసేన నేత కర్రి మహేష్ ఇంటి మీద దాడి చేయించారు. తాజాగా పొన్నూరులో వైసీపీ అభ్యర్థి అంబటి మురళి మరో అడుగు ముందుకు వేసి ఏకంగా జనసేనాని పవన్  కల్యాణ్ పొన్నూరు పర్యటనను అడ్డుకోవడానికి తెగించారు. పవన్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను ధ్వంసం చేయించారు. శనివారం పొన్నూరులో పవన్ కల్యాణ్ పర్యటించనుండగా, ఆయన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను శుక్రవారం అర్ధరాత్రి అంబటి మురళి ధ్వంసం చేయించారు. రాత్రికి రాత్రి హెలిపాడ్ ను జేసీబీతో తవ్వించేశారు.  ఓటమి భయంతోనూ అంబటి మురళి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అంబటి మురళీ దోపిడీ దౌర్జన్యాలను ఇటీవలే దూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టిన సంగతి తెలిసిందే.  ప్రశాంతమైన పొన్నూరులో ఎన్నికల వేళ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించే లక్ష్యంతో అంబటి ఇటువంటి విధ్వంసాలకు తెగబడుతున్నారని ఆరోపించారు.   అంబటి మురళి నిర్వాకంపై పొన్నూరు ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇటువంటి దౌర్జన్యాలు, విధ్వంసాలతో తమను బెదిరించలేరని తెగేసి చెబుతున్నారు. హెలిపాడ్ ధ్వంసం సంఘటన ఒక్కటి చాలు అంబటి మురళి పరాజయం ఇప్పటికే  ఖాయమైపోయిందనడానికి అని చెబుతున్నారు.   

రోహిత్ వేముల దళితుడు కాదు: క్లోజింగ్ దిశగా కేసు!

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని, అతనికి సంబంధించిన కేసును మూసివేస్తున్నామని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల దళితుడు అని చెప్పడానికి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. దళితుడు కాకపోయినప్పటికీ రోహిత్ వేముల తన కుల ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేశాడని, తాను దళితుడు కాదని బయటపడే పరిస్థితులు రావడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పోలీసులు కేసు మూసివేత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏవైనా అభ్యంతరాలు వున్నట్టయితే రోహిత్ వేముల కుటుంబ సభ్యులు కింది కోర్టులో సవాల్ చేసుకోవచ్చని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, అప్పటి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు ఏబీవీపీ నేతలకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. అయితే తెలంగాణ పోలీసులు కోర్టుకు సంబంధించిన వివరాలు అవాస్తవాలని రోహిత్ వేముల కుటుంబ సభ్యులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంపన్న అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ..ఎపి నుంచి  పెమ్మసాని  

మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.  తెలంగాణలో లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. రెండు రాష్ట్రాల్లో వేల కోట్లకు అధిపతులతో పాటు సామాన్యులు కూడా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత శ్రీమంతులు ఎవరనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం.  తెలంగాణ విషయానికి వస్తే... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత సంపన్న వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన తాతగారి పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. కెవి రంగా రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.  విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ. 4,568 కోట్లు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ లో చూపించారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతరెడ్డిని ఆయన పెళ్లాడారు.  ఏపీ విషయానికి వస్తే... గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనిక అభ్యర్థి. 2014లోనే ఆయన టీడీపీ తరపున నర్సరావుపేట లోక్ సభ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండటంతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవడంతో చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది. చంద్రశేఖర్ కుటుంబ ఆస్తులు రూ. 5,705 కోట్లు. మన దేశంలో పోటీ చేస్తున్న అత్యంత ధనిక వ్యక్తుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.  ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన చంద్రశేఖర్ కష్టపడి డాక్టర్ పట్టా తీసుకున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. యూఎస్ లో 'యూ వరల్డ్ ఆన్ లైన్ ట్రైనింగ్' పేరుతో నర్సింగ్, న్యాయ, వాణిజ్య, అకౌంటింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థను ప్రారంభించారు. బిజినెస్ మెన్ గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ వేల కోట్లు సంపాదించారు.

తీన్మార్ మల్లన్న వెరైటీ నిర్ణయం!

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఒక వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. కోటిన్నర విలువ చేసే తన వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న శుక్రవారం నాడు నల్గొండలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నల్గొండలో తీన్మార్ మల్లన్న భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. చీఫ్ సెక్రటరీ ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి వెళ్ళి ఆస్తుల పేపర్లను అప్పగిస్తానని తీన్మార్  మల్లన్న చెప్పారు. క్లీన్ రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. తీన్మార్ మల్లన్న చేసినట్టుగా ఎలక్షన్లలో పోటీ చేసేవాళ్ళందరూ వాళ్ళ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తే భలే వుంటుంది కదూ!