మోడీ అహంభావం.. జనం తిరస్కారం! తొలి రెండు విడతల పోలింగ్ సరళి సంకేతం అదేనా?

ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు విడతల ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. తీరా పోలింగ్ పూర్తి అయిన తరువాత ఆ ఆశలు ఆవిరయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ వెనుకబాటుకు కారణాలేమిటని ఆలోచిస్తే అతి ఆత్మవిశ్వాసం, అహంభావం కారణాలుగా కనిపిస్తాయి.  బీజేపీకి ప్రజాదరణ తగ్గడానికి, లేదా ప్రజావ్యతిరేకత పెల్లుబకడానికి ప్రధాన కారణం మోడీ అహంభావ పూరిత వైఖరిగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, ఈ సారి తమ సీట్ల సంఖ్య ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని  400 మార్కు దాటుతుందని మోడీ ఘనంగా ప్రకటించారు. 2004లో వాజపేయి ప్రభుత్వం   భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో  ఎన్నికలకు వెళ్లి చతికిల పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో తొలి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత   2004 ఫలితమే పునరావృతమయ్యే పరిస్థితులు కానవస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికలకు ముందే మోడీ ఈ సారి మరిన్ని కఠోర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే హిందూ ఓట్లను ఆకర్షించేందుకు కామన్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, సీఏఏ( ను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ ప్రకటనలు ఒక విధంగా దుస్సాహసంగానే చెప్పాలి. హిందూ ఓట్ల పోలరైజేషన్ కు దేశంలో మత పరమైన చీలకకు కూడా వెనుకాడబోమని మోడీ చెప్పకనే చెప్పారని అంటున్నారు.ఇది కూడా మోడీ సర్కార్ కు ప్రతికూలంగానే మారిందని అంటున్నారు.  ఇక ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు మోడీ సర్కార్ గత పదేళ్లుగా అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది.   తన ప్రభుత్వ విధానాలతో విభేదించే విపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి,సీబీఐ లను ప్రయోగించి విధేయులుగా మార్చుకోవడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలను జనం విశ్వసించేలా పరిస్థితులు ఉండటం కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైందన్నది పరిశీలకుల విశ్లేషణ.  బీజేపీ ఆర్థిక, రాజకీయ విధానాలపై విమర్శనాత్మకంగా మాట్లాడే మేధావులను అర్బన్ నక్సలైట్లుగా  ముద్ర వేయడం మధ్య తరగతి వర్గంలో మోడీ సర్కార్ పట్ల విముఖత ఏర్పడేందుకు కారణమైందంటున్నారు. ఇక  రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించించడం కూడా ప్రజాస్వామ్య వాదులలో ఆందోళన రేకెత్తిం చిందని అంటున్నారు. రెండోవిడత పోలింగ్ జరిగి 88 లోక్ సభ స్థానాలలో బీజేపీ మహా అయితే 28 స్థానాలలో విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయనీ, ఈ విడతలో పోటీలో ఉన్న   బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ గోవెల్, హేమమాలినీ,రాజీవ్ చంద్రశేఖర్, ఓం బిర్లా, తేజస్వీ సూర్య వంటి వారి విషయంలో ఫలితాలు రాకముందే ఓటమి ఖరారైపోయిందని అంటున్నారు. అదే విధంగా మొదటి విడత  102 స్థానాలకు జరి గిన పోలింగ్ లో బీజేపీ 30 స్థానాలలో విజయం సాధిస్తే గొప్పే అన్న అంచనాలు ఉన్నాయి. రాజపుట్, జాట్, ఠాగూర్ సామాజికవర్గాల పట్ల టికెట్ల విషయంలో బీజేపీ వివక్షా పూరితంగా వ్యవహరించిందన్న ఆగ్రహం ఆయా వర్గాలలో బలంగా కనిపిస్తోంది. రాజస్తాన్ లో వసుంధరా రాజే, మహారాష్ట్ర లో చౌహన్ లను పక్కన పెట్టడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారిందని అంటున్నారు. యూపీ, రాజ స్థాన్, ఎంపీ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర లలో దళితులు,ఆదివాసీలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొదటి నుంచీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. మోదీ ఈసారి మోడీ తన అద్భుత వాగ్ధాటితో చేస్తున్న వాగ్దానాలను కూడా ప్రజలు నమ్మేపరిస్థితి లేదంటున్నారు.  నల్లధనం వెలికి తీస్తా నని, అలా విదేశాలలో మగ్గుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి పేదల ఖాతాలలో వేస్తామని మోడీ చెప్పిన మాటల డొల్లతనాన్ని జనం అర్ధం చేసుకున్నారని, ఈ సారి అటువంటి వాగ్దానాలను జనం విశ్వసించే పరిస్థితి లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అని గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన మోడీ.. రెండో సారి అధకారంలోకి వచ్చిన తరువాత ఆదాయం రెట్టింపు మాట అటుంచి రైతుల కష్టాలను రెట్టింపు చేశారన్న ఆగ్రహం వ్యవసాయ దారులలో తీవ్రంగా ఉందంటున్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆయన అనాలోచిత నిర్ణయం,  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన వాగ్దానాన్ని విస్మరించడం, కరోనా సమయంలో వలస కూలీల ఆకలి కేకలు,  వంటి మోదీ ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.   ఇక చివరి క్షణంలో  హిందూత్వ అంశాన్ని మోదీ తన ఆఖరి ఆయుధంగా ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకా శాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ నిషేధం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిరంతరం భక్తులు స్వామి వారి దర్శనానికి అధికంగా వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ఇప్పటి నుండి ఈ నిబంధన పాటించి సహకరించాలని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఆలయానికి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకువచ్చారో.. ఇక జరిమానాలు తప్పవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ నిబంధన పాటించక పోతే చర్యలు తీసుకోనున్నారు ఆలయ అధికారులు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం అధికారులు సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి అంటే మే ఒకటో తేదీ నుంచి అధికారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేశారు.  పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం బోర్డు ఆదేశంతో పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగారు. చెక్‌పోస్టు పరిసరాల్లో పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లతోపాటు చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు.  అలాగే దైవ దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎవరూ క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా కట్టుదిట్టంగా ప్లాక్టిక్ బ్యాన్ ను అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలకు బదులుగా గాజు సీసాలనే విక్రయించాలని స్పష్టం చేశారు. అలాగే మట్టి, స్టీల్‌, రాగితో తయారైన బాటిళ్లను కూడా విక్రయించవచ్చని సూచించారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, జూట్‌ బ్యాగులు ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై దేవస్థానానికి సహకరించాలని స్థానికులు, వ్యాపారులు, హోటళ్లు, సత్రాల నిర్వాహకులను కోరారు.

బీఆర్‌ఎస్‌కి గుండుసున్నా ఇచ్చిన రవిప్రకాష్ సర్వే

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే బిఆర్ఎస్ వర్గాల్లో ఆ ఒక్క స్థానం ఆశలను కూడా జర్నలిస్టు రవిప్రకాష్ తుస్సుమనిపించారు. బుధవారం నాడు ఆయన తన సొంత మీడియా ఛానల్లో తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వస్తాయన్న అంశాలతో కూడిన కథనాన్ని ప్రసారం చేశారు. ఇందులో ఆయన తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, భారతీయ జనతాపార్టీకి 8 స్థానాలు దక్కుతాయని, ఎం.ఐ.ఎం. హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. బిఆర్ఎస్‌కి ఒక్క స్థానం కూడా దక్కదని బాంబు పేల్చారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఏ పార్టీ వున్నా ఎవరైనా సరే  ‘అయ్యోపాపం’ అంటారు. బిఆర్ఎస్ విషయంలో మాత్రం ఎవరూ ఆ మాట అనడం లేదు.. అంత పాతాళానికి పడిపోయింది బిఆర్ఎస్ పార్టీ.

గుడివాడ, గన్నవరం తెలుగుదేశం ఖాతాలోకే.. కొడాలి, వంశీ ఇక ఇంటికే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది.  ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి. అయితే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ దాకా, ఫలితం దాకా వేచి చూడాల్సిన పని లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సర్వేలు కుండబద్దలు కొట్టుస్తున్నాయి. అయితే కోడ్ అమలులో ఉన్నందున ప్రిపోల్ సర్వేలపై  నిషేధం ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో వచ్చే సర్వేల ప్రామాణికతను నిర్ధారించలేం. అయితే.. ప్రజల మూడ్ ను గమనించినట్లైతే ఆ సర్వేలలో నిజమెంతో ఇట్లే అవగతమైపోతుంది.  తాజాగా రైజ్ (RISE) సర్వే పేరిట సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న సర్వే ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. కోడ్ అమలులోకి రావడానికి ముందు వచ్చిన దాదాపు డజన్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన రైజ్ సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. తెలుగుదేశం కూటమి 108 నుంచి 120 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుందని పేర్కొంది. గత సర్వేలు కూడా దాదాపుగా ఇదే ఫలితాన్ని వెలువరించిన నేపథ్యంలో ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. కానీ ఈ సర్వేలో గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయం ఖరారైందని సర్వే పేర్కొంది. ఈ రెండు నియోజకవర్గాల పట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీల రాజకీయ ప్రయాణం తెలుగుదేశంతో ఆరంభమైంది. ఇరువురూ తరువాత వైసీపీలో చేరారు. రాజకీయాలలో పార్టీలూ మారడం అరుదేమీ కాదు. కానీ వీరు తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి చేరిన తరువాత తెలుగుదేశంపై నోరుపారేసుకున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. రాజకీయ విమర్శలు చేసి ఉంటే వారి పట్ల ప్రజలలో ఇంత ఆగ్రహం వ్యక్తమయ్యేది కాదు. కానీ ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేత, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు.  దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గుడివాడలో నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైజ్ సర్వేలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఓటమి బాటలో ఉన్నారని వెల్లడి కావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  రైజ్ సర్వే ప్రకారం గుడివాడలో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని కంటే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాముకు ప్రజాదరణ అధికంగా ఉందని పేర్కొంది. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఇందులో రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత వరుసగా రెండు సార్లు వైసీసీ అభ్యర్థిగా గెలిచారు. ఐదో సారి మాత్రం కొడాలి నానికి గుడివాడలో శృంగభంగం తప్పదని అంటున్నారు. ప్రజా వ్యతిరేకతను ముందుగానే పసిగట్టిన వైసీపీ అధిష్ఠానం ఒక దశలో  గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొడాలి నానిని తప్పించాలని కూడా యోచించిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి విపక్షంపైనా, విపక్ష నేత, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత భాషా ప్రయోగంతో చేసిన విమర్శలూ ప్రజలలో కొడాలి నాని ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, వారి ఆగ్రహానికి కూడా కారణమయ్యాయి. ఆ ప్రజాగ్రహమే రైజ్ సర్వేలో ప్రతిఫలించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక గన్నవరం అధికార పార్టీ అభ్యర్థి  వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఆయన ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపోందారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే 2019 విజయం తరువాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడి జగన్ గూటికి చేరిపోయారు.  గన్నవరంలో గెలుపు తన బలం అని భ్రమించిన వంశీ తెలుగుదేశంపైనా, తెలుగుదేశం నాయకత్వం పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  నియోజకవర్గ అభివృద్ధికి గుండు సున్నా చుట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది ఆయన నామినేషన్ దాఖలు ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. దీంతో తెలుగుదేశం బలం కానీ, తన విజయానికి తన బలం కారణం కాదన్న విషయం వంశీకి బోధపడినట్లైంది. అందుకే ఇవే గన్నవరం నుంచి తన చివరి ఎన్నికలు అంటూ ప్రజాసానుభూతి కోసం బేల మాటలు మాట్లాడారు. వైసీపీలో తన వ్యతిరేక వర్గాన్ని ఈ ఒక్కసారికీ సహకారం అందించాలంటూ బతిమలాడుకున్నారు. ఆ మాటలే వంశీ ఓటమి బాటలో ఉన్నారన్న విషయాన్ని తేల్చేశాయి. ఇప్పుడు తాజాగా రైజ్ సర్వే కొడాలినాని, వల్లభనేని వంశీల సీన్ అయిపోయిందని తేల్చేసింది.  

తప్పుడు ప్రచారం కేసులో బిఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్ 

ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో   బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి  కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్‌ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిశాంక్‌తోపాటు, ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్‌ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరినీ పంతంగి టోల్‌గేట్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో క్రిశాంక్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, క్రిశాంక్‌పై గతంలో 14 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

పిఠాపురంలో వంగా గీతకు మూసుకుపోయిన గెలుపు దారులు!?

రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా  కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో వంగా గీతకు గెలుపు దారులు మూసుకుపోయాయంటున్నారు. ఒక వైపు పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మిథున్ రెడ్డి వంటి వారికి బాధ్యతలు అప్పగించినా.. నియోజకవర్గంలో పరిస్థితి రోజురోజుకూ వైసీపీకి ప్రతికేలంగా, జనసేనకు అనుకూలంగా మారుతున్నదని పరిశీలకులు అంటున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేనానికి తెలుగుదేశం అండ కొండంత బలంగా మారిందంటున్నారు. కాపుసామాజిక వర్గ ఓట్లలో చీలిక కోసం కాపు ఉద్యమ నేతగా తనను తాను అభివర్ణించుకుంటున్న ముద్రగడ పద్మనాభంకు వైసీపీ కండువా కప్పి ప్రచారంలోకి దింపినా పెద్దగా ఫలితం కనిపించకపోవడం అటుంచి.. పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ చేసిన సవాల్ బూమరాంగ్ అయ్యిందంటున్నారు.  ఇక అన్నిటికీ మించి వైసీపీని, ఆ పార్టీ అభ్యర్థి వంగాగీతనూ ఆందోళనకు గురిచేస్తున్న అంశం పిఠాపురంలో పవన్ కు మద్దతుగా సినీనటుల ప్రచారం. ఇప్పటికే హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లు పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  వీరంతా బుల్లితెర ద్వారా ప్రజలలో మంచి గుర్తింపు పొందిన వారే కావడం గమనార్హం. వీరి ప్రచారానికి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇక ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే తన మేనమామకు మద్దతుగా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రానున్న రోజులలో  రామ్ చరణ్, చిరంజీవి కూడా పవన్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జనసేన ప్రచారం ముందు వైసీపీ ప్రచారం వెలతెలపోతున్నదంటున్నారు.   ఓటమి భయంతోనే  పవన్ కల్యాణ్  హైదరాబాద్ లో ఉండే  నటులలో సగం మందిని పిఠాపురంలో దింపారన్న వంగా గీత విమర్శలు ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆ విమర్శలు ఆమెలోని ఓటమి భయాన్నే ఎత్తి చూపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల మూడ్ ను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తేలిపోయిందంటున్నారు.  వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతోందంటున్నారు. 

కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. స్పందించని తెలంగాణ సమాజం

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి ఒకదాని వెంట ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత నుంచి ఆ పార్టీ పరిస్థితి పతనం నుంచి మరింత పతనానికి జారిపోతున్న చందంగానే కనిపిస్తోంది.  అయితే తమ ఓటమికి ప్రజా వ్యతిరేకత కారణం కాదనీ, ప్రజలు తమ వెంటే ఉన్నారనీ, కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపి ప్రజలను మభ్యపెట్టి గెలిచిందనీ చెప్పుకోవడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇసుమంతైనా సందేహించడం లేదు. అయితే వారి మాటలను జనం విశ్వసిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలూ, శ్రేణులే విశ్వసించడం లేదనడానికి ఆ పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న వలసలే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ పరిస్థితి కడు దయనీయంగా మారిందంటున్నారు. అధినేత కేసీఆర్ బస్సు యాత్ర వినా.. బీఆర్ఎస్ ప్రచారంలో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. ముందే పరాజయాన్ని అంగీకరించేసినట్లుగా అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారంపై దృష్టి సారించడం లేదు. కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గాలలో జరిగే సభలకే ఆ పార్టీ ప్రచారం పరిమితమైనట్లుగా కనిపిస్తోంది. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే పార్టీ క్యాడర్ తో సమావేశాలతోనే ప్రచారాన్ని మమ అనిపించేస్తున్నారు. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ప్రచారం మొత్తం రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోయడానికే పరిమితమైంది. నిండా ఆరు నెలలు కూడా నిండని రేవంత్ సర్కార్ పై విమర్శలను మించి దూషణలతో విరుచుకుపడుతూ అదే ప్రచారం అని జనాలను నమ్మించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది.  అభ్యంతరకరంగా మాట్లాడారంటూ కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించింది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్రంలో రాజకీయాలను కనుసైగతో సాధించిన కేసీఆర్ ను అధికారం కలోయిన క్షణం నుంచి ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి. పార్టీ పరాజయం పాలైన నాడే తన ఫామ్ హౌస్ బాత్ రూంలో కాలుజారి గాయపడ్డారు. దాని నుంచి కోలుకుని ప్రజలలోకి రావడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈ లోగానే పార్టీ నుంచి వలసల వరద మొదలైంది.  పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా కారు దిగేశారు. సరే ఆరోగ్యం కుదుటపడింది. వలసల వల్ల పార్టీకి నష్టం లేదు, పార్టీ వీడిన వారంతా  తెలంగాణ ద్రోహులు అంటూ ఆయన హుంకరించడం మొదలు పెట్టారో లేదో.. ఆయన కుమార్తె   కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై  తీహార్ జైలుకు వెళ్లారు. దాని నుంచి తేరుకుని కేంద్రం కుట్ర అంటూ ఆరోపణలు గుప్పించడానికి రెడీ అవుతుండగానే  కూడా ఫోన్ టాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు అరెస్టులు జరిగి.. ట్యాపింగ్ ఉచ్చు నేరుగా పార్టీ నేతల మెడకే చుట్టుకునే ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వచ్చాయి. ఇన్ని కష్టాల నడుమ పార్టీనీ  పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దచేసే పనిలో వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ప్రసంగాలలో సంయమనం కోల్పోయారు.  సిరిసిల్ల సభలో  కేసీఆర్ కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారంటూ అందిన ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకుంది. బుధవారం (మే 1) రాత్రి 8 గంటల నుంచిఈ   48 గంటల పాటు అంటే శుక్రవారం (మే 3) రాత్రి ఎనిమిది గంటల వరకూ కేసీఆర్ ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించింది. ఆ 48 గంటలూ కేసీఆర్ ఎటువంటి  సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూ లలో పాల్గొనకూడదు.  అయితే ఈసీ చర్యల పై స్పందించిన కేసీఆర్ తన మాటలు, స్థానిక మాండలికం ఈసీ అధికారులకు అర్ధం కాలేదంటూ నిందలు వేశారు.  తన ప్రచారాన్ని 48 గంటలు నిషేధిస్తే లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా 96 గంటల పాటు ప్రచారం చేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆయనపై నిషేధం విధించి గంటలు గడిచినా తెలంగాణలో ఎక్కడా నిరసన అన్నదే కనిపించని పరిస్ధితి ఉంది.  కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపునకు తెలంగాణ ప్రజల నుంచి స్పందన కరవైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ విధించిన నిషేధంపై ప్రజల నుంచి ఎటువంటి నిరసనలూ వ్యక్తం కావడం లేదు. ఆయన భాష అభ్యంతరకరంగానే ఉందన్న చర్చ కూడా జనబాహుల్యంలో సాగుతోంది. పరిశీలకులు సైతం అదే మాట చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం బీఆర్ఎస్ కు గోరుచుట్టుపై రోకలి పోటువంటిదేనని అంటున్నారు. 

 దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి 

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే సూచనతో ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలను ఎక్కించుకొని అటు, ఇటు తిప్పారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులోకి వెళ్ళడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడగా వారిని స్థానికులు ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. అందులో కొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు అబ్బయ్య చౌదరినే కారణమని…ఆయన ప్రచార ఆర్భాటమే పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో వెంకటేష్ కుమార్తె

ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.  ఆ యువతి మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత! వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురామ్‌రెడ్డి ఖమ్మం పార్టమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రఘురామ్‌రెడ్డి కుమారుడిని ఆశ్రిత పెళ్ళాడారు. పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో వున్న తన మామగారికి మద్దతుగా ఆశ్రిత ఎన్నికల ప్రచారంలోకి ఎంటరయ్యారు. రఘురామ్‌రెడ్డికి మద్దతుగా వెంకటేష్ ఎన్నికల ప్రచారం చేస్తారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలకు ట్విస్ట్ ఇస్తూ ఆశ్రిత కాంగ్రెస్ కండువా వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆశ్రిత ఈ ఒక్కరోజే ప్రచారంలో పాల్గొన్నారా.. ప్రచారం ముగిసేవరకూ పాల్గొంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావలసి వుంది. ఈసారి ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి రఘురామ్‌రెడ్డి గెలిస్తే, రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి ఆయన రాజకీయ వారసురాలిగా ఆశ్రిత ఎన్నికలలో నిలబడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంపిటీషన్ భారీగా వుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీలో వున్నారు. మరి ఆశ్రిత ప్రచారంలోకి ఎంటరైంది కదా.. ఏ మ్యాజిక్ జరుగుతుందో చూడాలి.

జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది! ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తారు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై  గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్‌, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువడాల్సి ఉంది. వీటి పరిష్కారానికి హైకోర్టు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది. ఈ గడువు సైతం ఏప్రిల్‌ 30తో ముగిసింది.  ఈ పిటిషన్‌లలో తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే, అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు పేర్కొన్నారు. ఇటీవల బదిలీల్లో రమేశ్‌బాబు సైతం వేరే కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులు వినేందుకు మే 15కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 12 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.  2013 నుంచి సీబీఐ కోర్టులో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. 2022, మే 4 నుంచి ఆయన జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన డిశ్చార్జి పిటిషన్‌లపై రమేష్ బాబు సుదీర్ఘంగా వాదనలు విన్నారు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు(రీ ఓపెన్‌) ప్రకటించారు. దీంతో కొత్తగా వచ్చే జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది.  జగన్మోహన్ రెడ్డి పై గల 11 చార్జిషీట్ల వివరాలుః మొదటి చార్జి షీట్: 75 ఎకరాల స్థలాన్ని M/s Hetero Group of companies కి మరియు M/s Aurobindo group కు కేటాఇంచినందుకుగాను రెడ్డికి ముట్టిన డబ్బు రూ.29కోట్లు. రెండవ చార్జి షీట్: వ్యక్తిగత పెట్టుబడిదారుల నుంచి రూ.35.64కోట్లు సేకరించి మోసగించినందుకు. మూడవ చార్జి షీట్: రూ.133.74కోట్ల M/s Ramky Pharmacity Project కు సంబంధించిన గ్రీన్ బెల్ట్ విషయంలో మితిమీరిన ప్రయోజనాలను ఆశించి పరస్పర ఒప్పందంతో రూ.10కోట్లను జగన్ లంచంగా తీసుకున్నందుకుగాను. నాలుగవ చార్జి షీట్: నియమనిబంధనలను కాలరాస్తూ 22000 ఎకరాల స్థలాన్ని VANPIC Project కు సంబంధించి Nimmagadda Prasadకి ఇచ్చినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ పరిశ్రమకు రూ.854 కోట్లను అందించినందుకుగాను. ఐదవ చార్జి షీటు: కడప జిల్లా తళ్ళమంచిపట్నం గ్రామంలో 407 హెక్టార్ల గనుల తవ్వకాల లీజును Puneet Dalmia కంపెనీకి మంజూరు చేసినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ కంపెనీలో రూ.95కోట్లు జమ చేసినందుకు. ఆరవ చార్జి షీట్: India Cements కు కృష్ణ, కగ్న నదుల జలాలను, స్థలాన్ని మితి మీరిన ప్రయోజనాలకు మంజూరు చేసినందుకుగాను India Cements అధినేత N Srinivasan పరస్పర ఒప్పందంతో జగన్  కంపెనీలో రూ.140కోట్లను జమ చేసినందుకు. ఏడవ చార్జి షీట్: M/s Penna Group కంపెనీస్ P Pratap Reddy తమ కంపెనీలకు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేసినందుకు, కర్నూలు జిల్లాలో 307 హెక్టార్ల భూమిలో   లైసెన్స్ పొందినందుకుగాను,రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల గనుల తవ్వకాల లైసెన్స్ పునరుద్దరించినందుకుగాను మరియు బంజారా హిల్స్ లో తలపెట్టిన హోటల్ ప్రోజేక్టుకు ప్రయోజనాలను చేకూర్చినందుకు ప్రతిఫలంగా పరస్పర ఒప్పందంతో జగన్ కంపెనీలో రూ.68 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు. ఎనిమిదవ చార్జి షీట్: కడప జిల్లాలో 2037.54 ఎకరాల పాలరాతి గనుల తవ్వకాలను నిబంధనలను అతిక్రమించి నియమాలను ఉల్లంఘించి M/s Raghuram Cements Ltd కు కట్టబెట్టినందుకు. తొమ్మిదవ చార్జి షీట్: అనంతపురం జిల్లాలో 8844 ఎకరాల M/s Lepakshi Knowledge Hub (LKH) ఏర్పాటుకు మరియు పెట్టుబడులకు నిబంధనలను అతిక్రమించి స్థలం కేటాయించినందుకు గాను పరస్పర ఒప్పందంతో జగన్ జగతి పబ్లికేషన్స్ కంపెనీలో రూ.50 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు. పదవ చార్జి షీట్: శంషాబాద్ పెట్టుబడుల పేరుతో M/s Indu Techzone Pvt Ltd కు 250 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా M/s Caramel Asia Holdings Pvt Ltd లో రూ.15 కోట్ల పెట్టుబడులను పొందినందుకు. ఇది మాత్రమే కాక హవాలా నేరానికి సంబందించి రూ.840. కోట్లను సరిక్రొత్తగా ED జత చేసింది. సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు.. ఎమ్మార్‌ కేసులో నిందితులు దాఖలు చేసిన 9 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువరించారు. జగన్‌ సన్నిహితుడు ఎన్‌. సునీల్‌రెడ్డి , కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ, శ్రీకాంత్‌ జోషి, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ హిల్స్‌, బౌల్డర్‌ హిల్స్‌ డిశ్చార్జి పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. మరో నిందితుడు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి బీపీ ఆచార్యపై 120బీ, 409 సెక్షన్లను తొలగించిన సీబీఐ కోర్టు.. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. ఇతర నిందితులను కేసు నుంచి తప్పించడానికి నిరాకరించింది.   జ‌గ‌న్ కేసుల క‌ద‌లిక లేదు. సిబిఐ, ఈడిల కేసుల లిస్ట్ చూస్తే...  అస్సాం హేమంత్ బిస్వాస్ శ‌ర్మ బిజేసి సి.ఎం, అజిత్ ప‌వార్ కేసుల్లో క‌ద‌లిక లేదు బిజెపి నేత‌, శివ‌సేన ఏక్‌నాథ్ షిండ్ ఎమ్మెల్య‌లే కేసుల్లో క‌ద‌లిక లేదు. అశోక్ చౌహాన్ ఆద‌ర్శ‌సొసైటీ కుంభ‌కోణం. ఇప్పుడేమో బీజేపీకీ స్టార్ క్యాంపెయిన‌ర్‌. అందుకే అత‌ని కేసుల్లోనూ క‌ద‌లిక లేదు. బెంగాల్‌కు చెందిన  సువేందో అధికారి బిజెపి ప్ర‌తిప‌క్ష నేత ఆయ‌న కేసుల్లోనూ క‌ద‌లిక లేదు. త‌మ వాళ్ళ‌ను బీజేపీ ముట్టుకోదు. అందుకే వాళ్ళు జైలు బ‌య‌ట వుంటారు.  త‌న వాడు కాద‌ని డిసైడ్ అయితే జైలుకు పంపుతుంది. కేసుల్లో క‌ద‌లిక ఏంటి తూఫాన్ వుంటుంది. జ‌గ‌న్‌కు బిజెపితో ఉన్న సాన్నిహితం తోనే ఆయ‌న కేసుల్లో క‌ద‌లిక లేదు. జ‌గ‌న్‌, ఎన్‌డిఏలో లేక‌పోయిన, త‌న‌ ప్ర‌త్యర్థి టీడీపీతో బీజేపీ క‌లిసిన, జ‌గ‌న్ స‌పోర్ట్ బిజెపికే. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా బిజెపికి మిత్రులే. ఢిల్లీలో స‌పోర్ట్ చేస్తారు. ఇక్క‌డ ఓ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. బిజెపికి జ‌గ‌న్ అవ‌స‌రంవుంది. ఎందుకంటే రాజ్య‌స‌భ‌లో 11 మంది ఎంపీలున్నారు. మ‌రో ప‌క్క బిజెపికి రాజ్య‌స‌భ‌లో బ‌లంత‌క్కువే.  కాబ‌ట్టి భ‌విష్య‌త‌లో బిజెపి జ‌గ‌న్ అవ‌స‌రం వుంది. అందుకే జ‌గ‌న్‌కు బిజెపి అనుకూలంగానే వుంటుంది.  ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థం కాని విష‌యం ఏమిటంటే.... జ‌గ‌న్ ప‌ట్ల బీజేపీ సానుకూలంగా వున్నా, జ‌గ‌న్‌కు అన్ని రకాలుగా స‌హ‌కారం ఇస్తున్నా, అలాంటి బిజెపితో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది?  జ‌గ‌న్ ప‌రోక్ష స్నేహ‌సంబంధాలే గ‌త 12 ఏళ్ళ గా కేసుల్ని ప‌ట్టించుకోవ‌పోవ‌డానికి కారణం. అంత‌గా జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా వున్న బిజేపీతో క‌లిసి వుండాలా? లేదా నిర్ణ‌యించుకోవాల్సిందే టీడీపీనే. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్

ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము  అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం. అది ఆగస్టు 13, 2013... తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ... కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు... ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ  ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు. వాటిలో మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.   ‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది.  బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ మరియు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్, ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాక చిన్నారి కలశ నాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి, గౌరవించుకోవడం ఒక సదవకాశం అని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని, ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని అన్నారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి.... పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి 

తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించిన తర్వాత మరో డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.  మాజీ ప్రదాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం రావడంపై సినీ, రాజకీయ సహా అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తికి కారణమైన పీవీ లాంటి వాళ్లకు నిజంగా దక్కాల్సిన గౌరవంగా అభివర్ణిస్తున్నారు. అదే టైంలో తెలుగు జాతీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌కి కూడా భారత రత్న ఇచ్చి ఉంటే తెలుగు నేల పులకించిపోయేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్య మంత్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే అని తెలంగాణ   మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి పొంగులేటి మద్దతు తెలిపారు.  రఘు రాం రెడ్డి, పొంగులేటి   కలిసి కార్డులపై సంతకాలు చేసి..పోస్టు చేశారు. అనంతరం పార్టీ నేతలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేత్తినేని హరీష్ లతో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు.ఆ ఫలితంగానే.. కొత్త వారు రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు అని ప్రశంసించారు. ఎమ్మెల్యే, ఎంపీలు,  మంత్రులు గా అనేకమందికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, విద్యా, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు ఎండీ.ముస్తఫా, కొప్పుల చంద్రశేఖర్ రావు, బాణోతు ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

జగన్ భయపడ్డారు.. అందుకే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పడ్డాయ్..

జగన్ హయాంలో  ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు. ఫిట్ మెంట్, డిఏ బకాయిల విషయంలో అడిగినందుకు జగన్ సర్కార్ వారిని నానా ఇబ్బందులూ పెట్టింది. అంతెందుకు ఫిట్ మెంట్ పేరుతో జీతాలు తగ్గించేసి ఉద్యోగ సంఘాల నేతలతో చప్పట్లు కొట్టించుకుంది. ఔను 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పీఆర్సీ విషయంలో  చేయగలిగినంత జాప్యం చేసి చివరకు ఇక తప్పదన్నట్లుగా 2022 జనవరిలో వారికి పీఆర్సీ  ఇచ్చింది. ఎక్కడైనా పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం రివర్స్ లో ఆలోచించింది.  జగన్ సర్కార్  పీఆర్సీ ప్రకటించిన తరువాత ఉద్యోగుల జీతాలు తగ్గాయి. నిజం వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా జరిగింది మాత్రం అదే.  ఉద్యోగులకు అప్పటికే మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం ఉండగా, జగన్ సర్కార్  ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనాలు 4 శాతం తగ్గాయి. దాంతో  తగ్గిన ఫిట్‌మెంట్‌ ప్రభావంతో డీఏలు.. హెచ్‌ఆర్‌ఏల్లో కూడా కోత పడింది.  దాంతో అప్పట్లో ఉద్యోగులు తమకు ఇచ్చింది పే రివిజన్ కాదు  పే రివర్స్‌  అని ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చే శారు.  అసలు జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఉద్యోగులకు కష్టాలూ వేధింపులు ఆరంభమయ్యాయనే చెప్పాలి. సమయానికి వేతనాలు ఇచ్చింది లేదు. వేతనాల కోసం రోడ్డెక్కితే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై జగన్ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడింది. కారాలూ మిరియాలూ నూరింది. వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించింది. రారయతీలు, అలవెన్సుల మాట దేవుడెరుగు అసలు జీతాలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వేతనాల కోసం నిలదీసినందుకు అసలు వారు పని చేయడం లేదంటూ ప్రచారం చేసింది.  సమయపాలన లేదని నిలదీసింది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్ అంది. పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ ప్రజలలో వారిని పలుచన చేయడానికి ప్రయత్నించింది.  విధులకు పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామని బెదరించింది. దీంతో జగన్ సర్కార్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు జగన్ పవన్ కట్ చేయడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయం అర్ధమైన తరువాత జగన్ సర్కార్ వారిని ఎన్నికల విధులకు దూరం చేయాలని ఎత్తుగడ వేసింది. వాలంటీర్లతో  పబ్బం గడిపేసుకోవచ్చని భావించింది. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు ఎన్నికల సంఘం దూరం చేయడంతో ఇప్పుడు మళ్లీ ఉద్యోగులను మంచి చేసుకోవడానికి తహతహలాడుతోంది. అందులో భాగమే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా మే నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించడం అని పరిశీలకులు అంటున్నారు. అయితే ఉద్యోగుల సహనం పూర్తిగా నశించాక ఇప్పుడు వారిని మంచి చేసుకోవడానికి జగన్ ఏ ప్రయత్నం చేసినా వృధాయే అని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు  జగన్  సర్కార్ విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ ఇప్పుడిక జగన్మాయలో పడే అవకాశమే లేదనీ అంటున్నారు. మొత్తం అనూహ్యంగా 1నే వేతనాలు పడటం ఉద్యోగులనే విస్మయానికి గురి చేసింది. తామంటే జగన్ భయపడ్డాడనడానికి ఇదే నిదర్శనమని వారంటున్నారు. ఈ ఒక్క నెల సమయానికి వేతనాలిచ్చేసినంత మాత్రాన తమ నిర్ణయం మార్చుకునే ప్రశక్తే లేదని తెగేసి చెబుతున్నారు. 

ఎన్నికల సంఘమా.. ఇదెక్కడి చోద్యం?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది. ప్రపంచానికి ఓటు హక్కు విలువను తెలియజెప్పిన మన దేశం ఇప్పుడు ఏదో ఒక ఆశ చూపితే తప్ప ఓటు వేయని ఓటర్లతో నిండిపోయి సర్వనాశనమయ్యే దిశగా వెళ్తోంది. రాజకీయ నాయకులు ఓటర్లకి తాయిలాల ఎరచూపి ఓట్లు వేయించుకోవడంతో ప్రారంభమైన ఈ జాడ్యం, ఇప్పుడు తాయిలాలు ఇస్తే తప్ప ఓటు వేయం అని ఓటర్లు చెప్పే పరిస్థితి వరకు పరిస్థితి దిగజారింది. ఎవరో ఒక రాజకీయ నాయకుడు డబ్బు ఇస్తే, విశ్వాసంతో అతనికే ఓటు వేసే పరిస్థితి నుంచి, అందరి దగ్గర డబ్బు తీసుకుని వేస్తే ఏ ఒక్కరికో.. లేక ఎవరికీ ఓటు వేయకుండా ఊరుకునే పరిస్థితికి ఓటర్లు చేరుకున్నారు. ఓటు వేయడం అనేది హక్కు, బాధ్యత అనే విషయం మరచిపోయి పథకాలు ఇస్తేనే, తాయిలాలు ప్రకటిస్తేనే ఓటు వేస్తామని చెప్పే దౌర్భాగ్య స్థితికి ఎన్నికల వ్యవస్థ చేరుకుంది. ఇప్పుడు చాలామంది ఓటర్లు ఎలా తయారయ్యారంటే, పథకాల ద్వారా డబ్బు ఇవ్వాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు  ఓటు వేయడానికి డబ్బు ఇవ్వాలి. ఇందులో ఓటర్లకు డబ్బు ఎరచూపే రాజకీయ నాయకులది తప్పా.. ఓటుకోసం డబ్బు ఆశించే ఓటర్లది తప్పా అంటే, అది ‘విత్తుముందా.. చెట్టుముందా’ అనే ప్రశ్నకంటే సంక్లిష్టమైన ప్రశ్న అవుతుంది. ఎలక్షన్ల వ్యవస్థలో రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య ఇలాంటి కానుకల బంధం కొనసాగుతూ, ప్రజాస్వామ్య విలువలను ఒకవైపు ప్రశ్నార్థకంలో పడేస్తుంటే, మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే కార్యక్రమానికి తెరతీసింది. ఓటు వేసేలా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ఓకేగానీ, ఓటు వేయండి, కానుకలు ఇస్తాం అని సాక్షాత్తూ ఎన్నికల కమిషనే అంటూ వుండటం ఘోరం.. దారుణం.. అన్యాయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లను ఓటు వేసేలా చేయడానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఓటు వేయండి.. బహుమతులు పొందండి’ అటూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రకారం, ఓటు వేసిన ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌లు గెలుచుకునే సదవకాశాన్ని ఇస్తోంది. ఓటర్లు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం బయటకి వచ్చి, తమ చేతికి వున్న ఇంకు గుర్తును చూపించి, లాటరీలో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇలా రెండు గంటలకోసారి లాటరీ తీసి, ఈ రెండు గంటల్లో ఓటు వేసిన వారికి ఒక డైమండ్ రింగ్ ఇస్తారు. భోపాల్ నియోజకవర్గంలో ఈనెల 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. రెండు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో మూడో విడత పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి అక్కడి ఎన్నికల కమిషన్ ఈ డైమండ్ రింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్నికల కమిషన్‌ని ఏమనాలో అర్థంకావడం లేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.

నక్కతోక తొక్కాడు.. లాటరీలో 10 వేల కోట్లు!

అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ చెంగ్ సైఫాన్. లావోస్ దేశానికి చెందిన చెంగ్ సైఫాన్ నలభై ఆరేళ్ళ క్రిందట అమెరికా దేశానికి వలస వెళ్ళాడు. చిన్నా చితకా ఉద్యోగాలేవో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సైఫాన్‌కి ఎనిమిదేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో బాధపడుతూనే, చాలీ చాలని సంపాదనతో కీమో థెరఫీ చేయించుకుంటూనే బతుకుమీద ఆశతో ముందుకు వెళ్తున్నాడు చెంగ్ సైఫాన్. జీవితం ఎంత దురదృష్టభరితంగా వున్నప్పటికీ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు సైఫాన్. పవర్‌బాల్ లాటరీ అనే ప్రఖ్యాత సంస్థకు చెందిన లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల డ్రా నిర్వహించగా, చెంగ్ సైఫాన్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్ల నంబర్లు సరిపోలి జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీ ద్వారా చెంగ్‌కి మొత్తం 1.3 బిలియన్ డాలర్లు... అంటే, మన కెరెన్నీలో అక్షరాలా పదివేల కోట్లు. పన్నులలో భాగంగా 422 మిలియన్ డాలర్లను తగ్గించి త్వరలో చెంగ్‌కి మిగతా డబ్బును అందించనున్నారు. ఈ లాటరీ టిక్కెట్లు కొనడానికి తనకు సాయం చేసిన తన భార్య, మిత్రుడితో ఈ డబ్బును పంచుకుంటానని, తనను వేధిస్తున్న క్యాన్సర్‌కి చికిత్స చేయించుకుంటానని చెంగ్ సైఫాన్ చెబుతున్నాడు.

గాజు గ్లాస్ సింబల్.. హైకోర్టులో జనసేనకు పాక్షిక ఊరట

ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై బుధవారం (మే1)న  విచారణ జరిగింది. మంగళవారం రోజు ఎన్నికల కమిషన్ హైకోర్టును 24 గంటల సమయం కోరిన సంగతి తెలిసిందే.  జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఎంపీ స్థానాలలో అలాగే   జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. అంటే గాజుగ్లాసు గుర్తు విషయంలో జనసేనకు పాక్షిక ఊరట మాత్రమే కలిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది.  కాగా హైకోర్టు   పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఇంకా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా జనసేనకు సూచించింది.  

నిప్పులుగుండం తెలంగాణ... వందేళ్ల రికార్డు బద్దలు

తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతుండటంతో తెలంగాణ నిప్పులగుండంగా మారింది. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు   46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో  సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే  వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు. మరోవైపు  బుధ, గురువారాలలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలోనే 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు జిల్లాలు హైదరాబాద్, మెదక్ లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు గత వందేళ్ల రికార్డును బద్దలు కొట్టేశాయి. వందేళ్లలో ఎన్నడూ రాస్ట్రంలో ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలకు మించి నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలోనే ఆ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో ఎండ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  అయితే అదే సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు కూడా చెప్పింది. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితి ఉండదని పేర్కొంది. నిర్దుష్ట సమయానికే నైరుతి రుతుపవనాలు ఉంటాయనీ, ఈ ఏదాడి సగటు కంటే అధిక వర్ష పాతం నమోదౌతుందనీ పేర్కొంది. అంటే జూన్ తొలి వారంలోనే తొలకరి వానలు పడతాయనీ, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనీ పేర్కొంది.