గేట్ర‌ర్‌పై బీజేపీ గురి.. చంద్ర‌బాబు, అమిత్‌షా భేటీలో చ‌ర్చ‌!

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి స్థానాలు ద‌క్క‌క‌పోయినా.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మంచి ఫ‌లితాల‌నే రాబ‌ట్టింది. ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో.. తెలంగాణ‌లో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నట్లు బీజేపీ చాటింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తర‌హాలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తూ అధికార పార్టీకి స‌వాళ్లు విసురుతోంది. ఈ క్ర‌మంలోనే గ్రేటర్ ఎన్నిక‌ల‌పై బీజేపీ గురి పెట్టింది. వ‌చ్చే ఏడాది జ‌రిగే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని ఆ పార్టీ నేత‌లు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో ఎన్డీయే కూట‌మిలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ఉన్నాయి. తెలంగాణ‌లోనూ తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌ను క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నికల్లో పోటీ చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం లాంటి బ‌ల‌మైన పార్టీ అండ‌దండ‌లు ఉంటే గ్రేట‌ర్‌లో విజ‌యం న‌ల్లేరుపై బండి న‌డకే అవుతుంద‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ప‌దేళ్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో బీఆర్ఎస్ హ‌వా కొనసాగుతూ వ‌చ్చింది. రాజకీయంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గేమ్ ఆడితే అదే హైదరాబాద్ లో కీలకంగా మారేది. కానీ, ఇప్పుడు కథ మారింది. బీఆర్ఎస్ క్ర‌మంగా త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో గ్రేటర్ లోని ప‌లువురు నేతలు పార్టీని వీడారు. గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లోని కీలక నేతలు ఆ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ, హైడ్రా పేరుతో హడలెత్తిస్తోంది. ముఖ్యంగా నగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ పరిణామం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. మ‌రో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు, మూసీ సుందరీకరణకు ఎందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నార‌న్న‌ది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ప్ర‌భుత్వ తీరును  త‌ప్పుప‌డుతున్నారు. మ‌రో వైపు ప్రభుత్వ తీరుపై గ్రేటర్ వాసుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటున్నది.  గ్రేటర్ పరిధిలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎన్నోఏళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిరపడిపోయారు. వీరంతా ఎక్కువ శాతం తెలుగుదేశం మద్దతుదారులు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెదగా క్రీయాశీలంగా లేకపోవటంతో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పుడు  గ్రేటర్ పరిధిలోని తెలుగుదేశం సానుభూతిపరులను తమవైపుకు తిప్పుకొనేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లోనూ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది.  బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ తోపాటు ప‌లు జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తెలంగాణ బీజేపీలోని కొంద‌రు నేత‌లు తెలుగుదేశంతో పొత్తుకు అభ్యంత‌రం చెప్ప‌డంతో బీజేపీ ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లింది. తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. దీంతో తెలుగుదేశం సానుభూతిప‌రులు అధిక‌శాతం మంది రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌హించిన కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు.  మ‌రో ఏడాది త‌రువాత జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పోటీలో లేకుంటే ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు కాంగ్రెస్ కే మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పుచేయ‌కుండా,  తెలుగుదేశంతో క‌లిసి పోటీ చేస్తేనే బాగుంటుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. తెలుగుదేశంతోపాటు జ‌న‌సేనని కూడా క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వెళితే మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌టం సాధ్య‌మ‌వుతుంద‌ని బీజేపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌టంతో ఆ స‌మ‌యానికి రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఏ విధంగా మారుతోయో వేచి చూడాల్సిందే.

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 చంద్రబాబుతో తొలి ఎపిసోడ్?

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ 4వ సీజన్ రెడీ అయ్యింది. తొలి మూడు సీజన్లూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు సినిమాలలోనూ బాలయ్య అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకు పోతున్నారు. మరో వైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇక తన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపారేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. గత మూడు సీజన్లకు మించి ఈ నాలుగో సీజన్ ఉంటుందని అంటున్నారు. అన్ స్టాపబుల్  సీజన్ 2లో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అప్పటికి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ లో కూడా పాల్గొంటున్నారు.   అన్ స్టాపబుల్ 2 షోలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభం నాటి పరిస్థితులపై మాట్లాడారు. నాటి సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారకులు వంటి విషయాలపై వివరంగా చెప్పారు. చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఈ కార్యక్రమంలో ఎలాంటి శషబిషలకూ తావులేకుండా వివరించారు. మరీ ముఖ్యంగా 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి సంబంధించి విమర్శలను భరించారు.  1995 పరిణామాల అనంతరం ఎన్టీఆర్ కుటుంబం మొత్తం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం చంద్రబాబు వెనుక నిలబడటం ద్వారానే నాడు అది రాష్ట్ర భవిష్యత్ కు, ప్రగతికి, పురోగతికి, అభివృద్ధికి అనివార్యం అని నిరూపితమైంది. అలాగే 1999 ఎన్నికలలో ప్రజలు కూడా చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టడం ద్వారా చంద్రబాబు విధానాలకు ఆమోదముద్ర వేశారు. అయినా కూడా వెన్నుపోటు విమర్శను ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆ విమర్శలను ఖండిస్తూ, లేదా నాటి పరిస్థితులను వివరిస్తూ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. అందరూ సమష్టిగా చంద్రబాబు వెంట నిలవడం ద్వారా తామేమనుకుంటున్నామో చెప్పకనే చెప్పారు. అయితే వారి మౌనాన్ని ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుని ఇన్నేళ్లుగా సందర్భం వచ్చినా, రాకున్నా, సమయం అయినా కాకున్నా.. అవే విమర్శలు గుప్పిస్తూ వికృతానందం పొందుతూ వచ్చారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే  సీజన్ 2 తొలి ఎపిసోడ్ లో వారి విమర్శలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టక తప్పని రీతిలో చంద్రబాబు బాలయ్య చేతే సమాధానం చెప్పించారు. ఇప్పుడు మళ్లీ బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ కు కూడా చంద్రబాబు హోస్ట్ గా రానున్నారు. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ  అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్ లో ఆదివారం జరగనుంది. ఇదే కాకుండా ఈ సీజన్ లో అల్లు అర్జున్, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ కూడా రానున్నారు.   ముఖ్యంగా నాలుగో సీజన్ లో  అల్లు అర్జున్ పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికలలో కూటమి అభ్యర్థికి వ్యతి రేకంగా వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ నిర్వహించిన రోడ్ షో అనంతరం అల్లు ఏం మాట్లాడతారా అన్నదానిపై అన్ని వర్గాలలోనూ ఆసక్తి నెలకొని ఉంది.  

బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ఇక సల్మాన్

బెదరింపు కాల్స్ నేపథ్యంలో  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఖతం చేస్తామన్న బెదరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్  రూ.2కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్  రూ. 5 కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు బెదరింపులు పంపిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే సల్మాన్ తన భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఆయనకు భారీ స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు.  సల్మాన్ ఖాన్ ఓ వైపు సినీమా షూటింగులున, మరో వైపు బిగ్ బాస్ షూటింగ్ తో యమా బిజీగా ఉన్నారు.  వాస్తవానికి సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని తలపెడతామంటూ బెదరింపులు రావడం ఇదే తొలి సారి కాదు.  కృష్ణజింకల కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్  సల్మాన్ ఖాన్ ను బెదరించింది.  ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకూ  కొందరు ప్రయత్నించారు. దీంతో సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం  ఆయనకు   భద్రతను పెంచింది. తాజాగా మరోసారి చంపేస్తామని బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సల్మాన్ ఖాన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశారు. ఆ కారు మరి కొద్ది రోజులలో దుబాయ్ నుంచి ముంబైకి చేరుకుంటుంది. 

ముందస్తుకు చంద్రబాబు సిద్ధమౌతున్నారా?

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయన్న ఆందోళన ఆయా పార్టీలలో వ్యక్తం అవుతోంది. బీజేపీ శాశ్వతంగా కేంద్రంలో అధికారంలో కొనసాగే వ్యూహంలో భాగంగానే.. జమిలి జపం చేస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటికే జమిలికి సై అనేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం జమిలికి సై అనడమే కాకుండా ఇప్పటి నుంచే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారా అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు, వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఇక జగన్ అయితే రెండేళ్లలోనే ఎన్నికలు వస్తే రాష్ట్రంలో అధికారాన్ని మళ్లీ అందుకోవచ్చన్న ఆశతో జమిలికి సై అనేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఐతే ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతో జమిలికి జై అనేసింది. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  ఇవన్నీ పక్కన పెడితే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం జమిలి తథ్యమన్న ఉద్దేశంతో రెండేళ్లలోనే మళ్లీ ఎన్నికలను ఎదుర్కొన వలసి వస్తుందన్న భావనతో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. మామూలుగా అయితే ఈ ఏడాది జూన్ లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి సర్కార్ కు 2029 వరకూ అంటే ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. కానీ జమిలి కనుక వస్తే ముందుగానే ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రకారం 2026 లేదా 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో మోడీ సర్కార్ ఉంది. అందుకోసం జమిలి బిల్లును ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే ప్రవేశ పెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇందు కోసం రాజ్యంగ సవరణలకు సైతం రెడీ అవుతోంది.   బీహార్ లో అధికారంలో ఉన్న  నితీష్ మాత్రం జమిలికి నో అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వినా ఎన్డీయే కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలూ జమిలికి రెడీ అంటున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే ఈ విషయాన్ని అంటే ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంటుందన్న సంగతిని అన్యాపదేశంగానైనా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు చెప్పేశారు. తాజాగా అంటే శుక్రవారం (అక్టోబర్ 18)న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మన టార్గెట్ 2029 కాదు 2026 అని కుండబద్దలు కొట్టేశారు. సమయం తక్కువ ఉంది.. హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పారు.  అలా చెప్పడం ద్వారా జమిలి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామన్న సంగతిని చెప్పకనే చెప్పేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన విజయాలు, అమలు చేసిన వాగ్దానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. స్పష్టంగా 2026లోనే జమిలి ఎన్నికలు జరుగు తాయని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. అందుకు సన్నద్ధులు కావాలన్న విస్పష్ట సంకేతాన్ని అయితే ఇచ్చేశారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు 2027లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికే జమిలికి మోడీ సర్కార్ ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తున్నది. 

ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా?

ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అన్నట్లుగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటిగా తుపానులు రాష్ట్రంపై దాడి చేస్తున్నాయి. ఒక తుపాను తీరం దాటిందని ఊపిరి పీల్చుకునేలోగానే మరొకటి అన్నట్లుగా రాష్ట్రాన్ని వీడటం లేదు. రోజుల తరబడి భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దౌతోంది.  ఈ నెల 16న వాయుగుండం నెల్లూరు సమీపంలో తీరం దాటింది. ఆ వాయుగుండం ఇంకా పూర్తిగా బలహీనపడలేదు. వానలు కురుస్తూనే ఉన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇంతలోనే వాతావరణ శాఖ మరో తుపాను హెచ్చరిక జారీ చేసింది.  ఈ నెలలో  మరో రెండు తుపానుల ముప్పు ఇంకా ఉందని హెచ్చరించింది. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అది తీరం దాటగానే మరో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. అయితే వీటి దిశ, గమనంపై మరో రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 

ఏపీకి వైసీపీ అవసరం లేదని చాటుతున్న షర్మిల!

ఆంధ్రప్రదేశ్ లో ఇక వైసీపీ అవసరం ఏ మాత్రం లేదంటున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. వైసీపీ అధినేత, సొంత అన్న అయిన జగన్ కు నోరెత్తే అవకాశం, అవసరం లేకుండా చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలసిందే. వైసీపీ అధికారం కోల్పోయి ఐదు నెలలైంది. అధికారంలో ఉన్నంత కాలం సందర్భం ఉన్నా లేకపోయినా ఇష్టారీతిగా ప్రతిపక్ష నేతలపై బూతులతో విరుచుకుపడడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు ఇప్పడు నోరెత్తడానికి భయపడుతున్నారు. అసలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన దాదాపు అందరూ కూడా ఇప్పుడు పబ్లిక్ లో ముఖం చూపడానికి వెరుస్తున్నారు. ఎన్నికలలో వైసీపీ ఎటూ ప్రతిపక్ష హోదా కోల్పో యింది. కానీ ఒక రాజకీయ పార్టీగా కూడా ఆ పార్టీని జనం గుర్తించడం లేదు. దీంతో ఏపీలో విపక్షం అన్నదే లేకుండా పోయింది. అయితే ఆ లోటును నేను తీరుస్తానంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఇక ఉనికి మాత్రంగా కూడా ఉండే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని కాంగ్రెస్ పార్టీకి ఆ లోటు తెలయకుండా రాష్ట్రమంతా కలియదిరుగుతూ ఏక కాలంలో ఇటు ప్రభుత్వంపై, అటు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉండగా  యథేచ్ఛగా అక్రమాలు, అవినీతి, దాడులతో విరుచుకుపడిన ఆ పార్టీ నేతలందరూ ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగువెలిగిన సజ్జల సహా ఆ పార్టీలో నోరు, పేరు ఉన్న నేతలంతా ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. పారిపోవడమో, కోర్టుల నుంచి అరెస్టు కాకుండా తెచ్చుకున్న రక్షణతోనే బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. అందుకే ఆ పార్టీ అధినేత జగన్ సహా నాయకులెవరూ రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు సుముఖంగా లేరు. జగన్ అయితే బెంగళూరు నుంచి రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు.  ఉచిత ఇసుక విధానం సహా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఆరోపణలు వస్తున్నా.. ఎవరూ వాటిని హైలైట్ చేసి ప్రజలలోకి వచ్చేందుకు రెడీగా లేదు. అయితే ఇక్కడే షర్మిల అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నలు సంధిస్తూనే.. జగన్ హయాంలోని అరాచకాలను, అక్రమాలను ఎత్తి చూపుతున్నారు.  పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గట్టిగా కసరత్తు చేస్తున్నారు.   ఇటీవల బెజవాడను వరదలు ముంచెత్తినప్పుడు వరద బాధితులకు అండగా నిలవడంలో వైసీపీ అధినేత కంటే ముందున్నారు. జగన్ కంటే ముందు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ప్రభుత్వ సాయం సత్వరమే అందాలన్న డిమాండ్ చేయడమే కాకుండా, మేన్ మేడ్ ఫ్లడ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పి కొట్టారు. మెల్లిమెల్లిగా రాష్ట్రంలో వైసీపీ ప్లేస్ ను ఆక్రమించడమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఇప్పటి వరకూ యాక్టివ్ గా కనిపించిన షర్మిల ఇప్పుడు బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి చేరికలపై దృష్టి పెట్టారు. వైఎస్ తో సాన్నిహిత్యం ఉన్న నేతలతో టచ్ లోకి వెడుతూ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు.  ఆమె ప్రయత్నాలు ఫలిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలకు షర్మిల ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ బహిరంగ సభలకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించి, వారి సమక్షంలో వైఎస్ మరణం తరువాత వివిధ కారణా లతో వేరే వేరే పార్టీలలోకి వెళ్లిన సీనియర్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పాలన్న వ్యూహంతో షర్మిల ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఇంత వరకూ ఎన్నడూ కాంగ్రెస్ లో ఈ స్థాయి సందడి కనిపించలేదని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడుతుందన్న సందేశాన్ని ఇవ్వడం ద్వారా జగన్ పార్టీ వైపు జనం చూడాల్సిన అవసరం లేకుండా చేయడమే షర్మిల వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సజ్జల దారి జైలుకేనా?

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముంబై విమానాశ్రయంలో సోమవారం ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విదేశాలకు పారిపోకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని భావించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఆయననున అక్కడే అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన   కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు రక్షణ ఉన్నందున ఆరెస్టు చేయవద్దంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సమాచారం పంపడంతో  సజ్జలను అరెస్టు చేయలేదంటున్నారు. ఇంతకీ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఏ కేసులు జారీ చేశారన్నదానిపై క్లారిటీ లేదు.   మంగళగిరిలోని తెలుగుదేశం  కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో  నిందితుల జాబితాలో సజ్జల పేరు కూడా ఉంది.  ఆ కేసును సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అధికారుల ఎప్పుడు పిలిస్తే అప్పుడు సజ్జల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.  ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోయారు.  సరే అదలా ఉంటే మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కంటే పెద్ద కేసులోనే ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకోవడంపై స్పందించిన సజ్జల తనపై అసలు కేసులే లేవు.. లుక్ ఔట్ నోటీసు ఎలా జారీ చేస్తారంటూ ప్రశ్నించడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. కేసులే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం సజ్జల కోర్టును ఎందుకు ఆశ్రయించారంటున్నారు.  ఇక ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మీడియాతో మాట్లాడుతూ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉందనీ, ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయనీ విస్ఫష్టంగా చెప్పారు.  వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారు. ప్రతి కీలక నిర్ణయం వెనుక ఉన్నదీ సజ్జలేనని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన నంబర్ 2గా వ్యవహరించారు.  వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పిదానికీ, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులకూ సజ్జలే మాస్టర్ మైండ్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది.  సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో కూడా స్క్రిప్ట్ మొత్తం ఆయనదేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జలను పోలీసులు అరెస్టు చేసే రోజు ఎంతో దూరంలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు బుధవారం (అక్టోబర్16) నోటీసులు ఇచ్చారు. గురువారం(అక్టోబర్ 17) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.  

ఒక వీరునికి కడసారి వీడ్కోలు

2024 అక్టోబర్ 14, హైదరాబాద్. మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్.మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనాలతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి  ఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొ డవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద... రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా వుంది. ఒక ఉద్వేగం, విషాదం అక్కడ కలిసి ప్రవహిస్తున్నాయి. వందలమంది స్త్రీలు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వందలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ఏదో పోగొట్టుకున్న  వాళ్ళలా అక్కడ తిరుగుతున్నారు. గులాబీ పూల రేకులు తీసి, సాయిబాబా వున్న చల్లని గాజుపేటిక మీద వేసి, పిడికిలి బిగిస్తున్నారు కొందరు. నాయకులు, ఉద్యమకారులు, పేద జనం కోసం పని చేస్తున్న వాళ్లు, కళాకారులు, రచయితలు, కవులు, సంపాదకులు, జర్నలిస్టులు, పబ్లిషర్లు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, సాయిబాబా మిత్రులు, మాజీలు, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు... ఎందరెందరో.. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో అమలాపురంలో పుట్టి, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసినాయన కోసం, హైదరాబాద్‌లో ఇంత జనం రావడమేమిటి? సాయిబాబా పీజీ చదువుకున్నది ఇక్కడ... పీహెచ్‌డీ చేసింది యిక్కడే, అంతే కాదు, మిత్రులతో, సామాన్యజనంతో కలుపుగోలుగా వుండే మనిషి. నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పొందిన ఉత్తమ విద్యార్థి. నిరంతరం చదువుతో, మేల్కొలిపే మాటలతో ఎందరిలోనో జ్ఞాన దీపాలు వెలిగించిన వాడు. నాగపూర్ అండా సెల్‌లో మృత్యు నీడల్లో రోజులు వెళ్ళదీస్తున్న కాలంలో కూడా ఆదీవాసీలైన అక్షరం ముక్క రాని అక్కడి ఖైదీలు కొందరికి సాయిబాబా చదువు చెబితే వాళ్లు డిగ్రీ పరీక్షలు పాసయ్యారు.  అక్రమం, అధర్మం నాలుగు పాదాల మీద నడిచే నేల మీద నిర్భీతి, నిజాయితీ, నిబద్ధతలను మూడు చక్రాల మీద ముందుకు నడిపించిన వాడు సాయిబాబా. దుర్మార్గపు వ్యవస్థల్ని తప్పితే వ్యక్తుల్ని ద్వేషించే మనిషి కాదతను!  అతి సామాన్య జనాన్ని అమితంగా ప్రేమించే మనసు. వాళ్ళ హక్కుల కోసం తెగించి పోరాడే సంకల్పం. అందుకే ఈ రోజు సాయిబాబా కోసం అంతమంది జనం దుఃఖించారు.    ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న ఆ దీపాల్లాంటి కళ్ళని దానం చేశాడు. పోరాడి అలసిపోయిన దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజికి యివ్వమని చెప్పాడు.   ఆదివాసులను తరిమివేసి, లేదా అంతం చేసి ఆ కొండలూ, భూములూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే దుర్మార్గం పేరే 'ఆపరేషన్ గ్రీన్ హంట్.' దానికి వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాకి జీవిత ఖైదు. మోడీ, అమిత్ షా ప్రభుత్వం యిప్పుడు 'ఆపరేషన్ కగార్' అంటోంది. 2026 కల్లా ఆదివాసులనూ, మావోయిస్టులనూ సమూలంగా హతమార్చి, కార్పొరేట్ ఇండియాగా మార్చే పథకం పేరే కగార్. అంటుబుల్ 'అంతిమ యుద్ధం' అని అర్థం. బలహీనులైన నిస్సహాయులైన ఈ దేశ ప్రజల్ని బలి యిచ్చి, కార్పొరేట్లకు కోట్ల డాలర్లు కట్టబెట్టే ఈ అమానుషాన్ని మనందరం వ్యతిరేకించాలని సాయిబాబా గట్టిగా చెప్పారు. ఆచరించి చూపారు.  కలలు కలలుగానే మిగిలిపోయాయి. 3558 రోజులు, అంటే దాదాపు పది సంవత్సరాలు ఇనప వూచల వెనకాల, గోడల మధ్య ఇరుకు గదిలో ఒంటరిగా మిగిలిపోయిన మనిషికి కన్నీళ్ళు తప్ప కలలేముంటాయి? ఒక్కటే ఒక్క కల. ఎప్పటికైనా ఈ నరకం నుంచి బయటపడాలి. వెలుతురు చూడగలగాలి. లేటుగా అయినా ఆ కోర్కె నెరవేరింది. బైటికి రాగలిగాడు. తన కోసం పోరాడి, తపించి, నిరీక్షించిన వసంతకి భర్తగా ఒకింత ఆనందాన్ని యివ్వాలి. ఎమ్మే లిటరేచర్ చేస్తున్న కూతుర్ని యిష్టంగా, కళ్ళ నిండా చూసుకోవాలి, మృతదేహమై కాకుండా, తమ్ముడు రాందేవ్ ఇంటికి వెళ్లి, వాణ్ణి పలకరించి, టీ తాగి రావాలి, రాసి వున్న కవితలన్నీ ఒక చోట చేర్చి పుస్తకం వేయాలి, ఎన్నేళ్ళయిపొయింది! పాత కామ్రేడ్స్ అందర్నీ కలిసి మాట్లాడి కొత్త కార్యాచరణకి సిద్ధం కావాలి.   సుకవి సాయిబాబా కన్న కలలన్నీ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి మార్చురీ చీకటిలో వూపిరాడక విలవిలలాడి చచ్చిపోయాయి.     కవి వెళ్ళిపోయాడు. కలలు మిగిలిపోయాయి. అదిగో, పాటలు పాడే విమలక్క వచ్చింది. సాయిబాబా మీద అప్పటికప్పుడే కట్టిన పాట అందుకుంది. డప్పులు మొగుతున్నాయి. నలుగురు కోరస్ పాడుతున్నారు. అమరవీరుడి పోరాటాలను గుర్తు చేసుకుంటూ విమల గొంతెత్తి పాడుతున్నారు.    ఒక మంచి ఉపన్యాసకుడు మైక్ అందుకున్నాడు. తెల్లవాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు. నల్లవాడు నిన్ను నక్సలైట్ అన్నాడు... శ్రీశ్రీ గీతం జనానికి వినిపిస్తున్నాడు. వూగరా, వూగరా! నువ్వూగితే శత్రువులకు గాభరా! అన్న శ్రీశ్రీ ఫేమస్ పోయెమ్‌లోని మాటలివి. అంతిమ వీడ్కోలు: అందరూ సిద్ధం అవుతున్నారు. వీరుడా జోహార్లు...! అమరుడా... లాల్ సలామ్! గొంతులు విచ్చుకుం టున్నాయి. నినాదాలు నిప్పు రవ్వలై ఎగురుతున్నాయి.  నిజాయితీని ఆయుధంగా ధరించిన మనిషి ఒకడు అక్కడ దీర్ఘ నిద్రలో వున్నాడు. ప్రేమ పూల జలపాతం ఒకటి అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది!   అన్ని దిక్కుల నుంచీ, దిగులు నిండిన అందరి హృదయాల నుంచి ఒక భావోద్వేగం తన్నుకువస్తోంది.  కన్నీటి వాన కురవడానికి ఆకాశంలో నల్లమబ్బులన్నీ సమాయత్తమౌతున్నాయి.    అల్విదా.... సాయిబాబా... అల్విదా!   వీరుడా! మానవుడా... అల్విదా! -తాడి ప్రకాష్

ప్రసాదాల్లో కల్తీలు.. దేవుడికే పంగనామాలు!

కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే కొందరు కాంట్రాక్టర్లు మాత్రం కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు.   ఇప్పటి వరకూ ప్రసాదాల తయారీలో కల్తీ లేదన్న భావన భక్తుల్లో ఉండేది. కానీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలతో ఆ నమ్మకం సైతం ఆవిరైపోయింది. తినే తిండ, పీల్చే గాలీ, తాగే నీరు ఇలా అన్నిటినీ  కల్తీకి ఆనవాళ్లుగా మార్చేశారు. దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడానికి గుత్తేదార్లు తెగించేశారు.  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ   విషయం దర్యాప్తులో ఉండగానే  శబరిమల అయ్యప్ప స్వామి  ప్రసాదంలో మోతాదు మించి క్రిమిసంహారకాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. దీంతో  ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచకుండా నిలిపివేశారు.  దాదాపు 6.65లక్షల  డబ్బాలలో అరవణ అనే అయ్యప్ప ప్రసాదంలో కల్తీ జరిగినట్లు గుర్తించారు. దీనిని ఏడాదిగా వాడకుండా ఉంచారు. దీనిని ఎరువుగా మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది భక్తులు మాల వేసుకునే సమయంలో ఈ ప్రసాదాన్ని తయారుచేసారు. ప్రసాదంలో వాడే యాలకుల్లో కల్తీ జరిగిందని గుర్తించారు.దాంతో భక్తులకు అమ్మకాలు నిలిపివేసారు. శబరిమల వెళ్లిన భక్తులు డబ్బాల్లో ఉండే అరవణ ప్రసాదం తెచ్చి బంధువులకు స్నేహితులకూ పంచుతారు. ప్రసాదం పారవేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతిం టాయని,దాన్ని ఏమి చేయాలనే విషయంపై ట్రావెన్ కోర్ దేవస్థానం మల్లగుల్లాలు పడి చివరకు ఆ కల్తీ ప్రసాదాన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆమేరకు టెండర్లు పిలిచి చర్యలు ప్రారంభించింది. ఇలా దేవుడి ప్రసాదాలను కల్తీ చేయడానికి కొంతమంది పాపపుణ్యాలు మరచి కేవలం ధనార్జనే ధ్యేయంగా  అడ్డగొలుగా, ఇష్టారీతిగా తెగించేస్తున్నారు. దేవుని ప్రసాదం అంటే దేవునితో సమానంగా భక్తులు భావిస్తారు. కాని లాభాల కోసం,కమిషన్లకోసం మంచీ చెడులను కాంట్రాక్టర్లు గాలికి వదిలేస్తున్నారు.  భక్తులు ఆ పాపానికి దేవుడే శిక్షిస్తాడనీ నమస్కారం పెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.పెత్తనం చేసే పాలక మండళ్లు ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల చేతకానివిగా తయారయ్యారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్వతంత్ర సిట్ ను దర్యాప్తునకు ఆదేశించింది.   పాత ప్రభుత్వం ఇది ఆరోపణ మాత్రమేనని, ఇది కూటమి ప్రభుత్వ రాజకీయకుట్ర అని ఆరోపిస్తున్నది. కాని ప్రస్తుత ప్రభుత్వం కల్తీ జరిగిందనేది వాస్తవమని చెబుతు న్నది. భక్తుల నుంచి,సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల మేరకు ప్రభుత్వ ల్యాబ్ పరిక్షలలో కల్తీ జరిగిందనీ, అదీ జంతు కొవ్వు కలిసిందనే నివేదికే ఇందుకు ఆధారమని అంటున్నారు. ఆమేరకు నిజానిజ నిర్ధారణకు సిట్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు దాన్నే మరింత విసృత పరచింది.ఏది ఏమైనా కల్తీలో అదీ నిషేధ పదార్ధాలు కలవడం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే కనీస విషయం మరచిన బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్..!

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంతో 2023లో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసిందని తేటతెల్లమైంది.  ఆంద్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకంలో సీమెన్స్ ప్రాజెక్ట్ నుండి నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు జగన్ ప్రభుత్వం ఆరోపించి చంద్రబాబును అరెస్టు చేసి, 53 రోజులు జైల్లో వుంచింది. ఇప్పుడు ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో నిధుల మళ్ళింపుకీ, చంద్రబాబుకు ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

84 లక్షల వాట్సప్ అకౌంట్లు ఫసక్!

 మెటాకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సప్‌ని మన దేశంలో కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సప్‌ని అడ్డాగా చేసుకుని అనేక మోసాలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వాట్సప్ ద్వారా మోసాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఖాతాలను వాట్సప్ డిలీట్ చేసింది. ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపుగా 84 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. తమ సంస్థ నిర్ణయించిన ప్రైవసీ పాలసీకి కట్టుబడనందుకు గాను ఈ చర్యలు తీసుకున్నట్టు వాట్సప్ తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2021 నిబంధనల ప్రకారం ఆగస్టులో  84.58 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ తెలిపింది. వీటిలో దాదాపు 16.61 లక్షల అకౌంట్లను ముందు జాగ్రత్త చర్యగా డిలీట్ చేశామని వాట్సప్ తెలిపింది. మోసానికి ఆస్కారం ఉండే బల్క్ మెసేజ్‌లు, అబ్‌నార్మల్ మెసేజ్‌లను వాట్సప్ తన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా గుర్తించి ఈ చర్యలు చేపట్టింది. అలాగే, ఆగస్టు నెలలో యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సప్ వెల్లడించింది.

బెంగళూరులో ఫ్లయింగ్ టాక్సీలు!

బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌కి మరోపేరు నరకం. ఆ నరకాన్నుంచి బెంగళూరు నగరాన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్లయింగ్ టాక్సీల సదుపాయాన్ని ఆస్వాదించడానికి బెంగళూరు నగరం సిద్ధమవుతోంది. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్య ఇబ్బంది లేకుండా హాయిగా, తక్కువ ఎత్తులో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడానికి బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రెడీ అవుతోంది. త్వరలోనే బెంగళూరు నగరానికి ఫ్లయింగ్ టాక్సీలను తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం సార్లా ఏవియేషన్ సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్నట్టు బెంగళూరు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి నగరంలోని వివిధ ప్రదేశాలకు హాయిగా గాలిలో ఎగురుతూ వెళ్ళిపోవచ్చు. ఈ విషయాన్ని సార్ల ఏవియేషన్ ప్రతినిధులు వివరిస్తూ, ‘‘బెంగళూరు విమానాశ్రయం నుంచి నగరంలోని ఇందిరా నగర్‌కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక గంట 50 నిమిషాలు పడుతోంది. అదే ఫ్లయింగ్ టాక్సీలు వచ్చిన తర్వాత ఆ సమయం 5 నిమిషాలకు తగ్గిపోతుంది. రవాణా వ్యవస్థలో ఇదొక గేమ్ ఛేంజర్. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభ దశలో వుంది. ఈ ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి రావడానికి ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది’’ అన్నారు.

బోడిగుండుకీ మోకాలికీ ముడేసిన విజయసాయి!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలై నాలుగు నెలలు గడిచింది. ఇప్పటికీ ఆ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం లేదు. అసలు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు.  ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు తమ పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని చెబుతున్నారు. ఘోర పరాజయం పాలైన నాలుగు నెలల తరువాత కూడా ఈవీఎంలనే నిందిస్తూ కూర్చున్న పార్టీ దేశంలో వైసీపీ తప్ప మరొకటి ఉండదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అక్కడితో ఆగకుండా హర్యానా ఎన్నికలలో బీజేపీ విజయానికి కూడా ఈవీఎంల ట్యాంపరింగే కారణమన్నారు. బోడిగుండుకీ మోకాలికీ ముడేసిన చందంగా విజయసాయి అసందర్భంగా  హర్యానా ఎన్నికల ఫలితాలకు, ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ కు ముడి పెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల ద్వారా జగన్ ను చిక్కుల్లోకి నెట్టేసి తాను వైసీపీ పగ్గాలు అందుకోవాలన్నదే విజయసాయి వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి విజయం సాధించడం వెనుక ఉన్నది ఈవీఎం ట్యాంప రింగేనని విజయసాయి ఆరోపణలు కచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, మరీ ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కలిగిస్తాయి. అసలు అలా వారికి ఆగ్రహానికి గురి కావాలన్న ఉద్దేశంతోనే విజయసాయి ఈ ఆరోపణలు చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా మోడీ, షాలకు జగన్ పై ఆగ్రహం కలిగేలా చేయడమే విజయసాయి వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అలా చేస్తే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకుని జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని, అదే జరిగితే.. వైసీపీని తన గుప్పెట్లో పెట్టుకోవచ్చునన్నది విజయ సాయి వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అయితే విజయసాయి ఇక్కడో విషయాన్ని మరచిపోతున్నారంటున్నారు.  జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుంటే.. జగన్ తో పాటు ఆ కేసులో ఏ2గా ఉన్న ఆయన కూడా చిక్కుల్లో పడతారనీ, జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే విజయసాయి కూడా కటకటాలు లెక్కించడానికి రెడీ అవ్వాల్సిందేననీ గుర్తు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ కూ బుల్లెట్ రైలు!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అభివృద్ఢికి అవకాశాలు ఉన్నాయో ఆయా రంగాలలో అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు బుల్లెట్ రైలు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ముంబై అహ్మదాబాద్ ల మధ్యా రానుంది. కేంద్రం దేశంలో ఏడు మార్గాలలో  బుల్లెట్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో తొలి రైలు ముంబై ఆహ్మదాబాద్ ల మధ్య నడవనుంది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. ఒక అంచనా ప్రకారం ముంబై అహ్మదాబాద్ ల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రయాణం 2026కల్లా సాకారం అవుతుంది. ఇక మిగిలిన ఆరు బుల్లెట్ రైళ్లలో రెండు దక్షిణాదికి కేటాయించారు. అవి చెన్నై బెంగళూరు, ముంబై హైదరాబాద్ మార్గంలో నడుస్తాయి. కేంద్రం ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు మార్గాల్లో ఏ ఒక్కటీ కూడా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లదు. అయితే ఇప్పుడు కేంద్రం బుల్లెట్ రైలు మార్గంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా చోటు కల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలియజేశారు. చైన్నె బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాన్ని అమరావతి, హైదరాబాద్ వరకూ విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని అశ్విని వైష్ణవ్ తో భేటీ అనంతరం చంద్రబాబు స్వయంగా తెలుగుదేశం కూటమికి చెందిన కేంద్ర మంత్రులకు చెప్పారు.   ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడ నుంది.

వరద ఖర్చులు ఇవిగో ఫేక్ జగన్..!

వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం చేసిన ఖర్చు విషయంలో వైసీపీ నాయకులు నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారన్న అభిప్రాయాలను తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ద్వారా ఒక మెసేజ్ విడుదల చేశారు. ‘‘వరద బాధితులకు ఇస్తామన్న కోటి రూపాయలలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్.. వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని ఫేక్ జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నాడు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ  ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడు. వీటికి ఖర్చు 23 లక్షలు కూడా కాలేదు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి.. ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయి.. చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు.. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ప్రజాధనం కోట్లు పందికొక్కులా ఎగ్‌ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు.. ...నారా లోకేష్, విద్య, ఐటి శాఖల మంత్రి’’ అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. దానితోపాటు వరద ఖర్చుల జాబితాను కూడా విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు!

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.  ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో  పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.  కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.  జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్  ఐదేళ్ల  హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు  మొహం చాటేశాయి.  ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్టరానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు.  2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.  ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా  జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన   లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారు తున్నది. తాజాగా  టాటా గ్రూప్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమెబైల్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది.   టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో గత నెలలో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలకు కొనసాగింపుగా అన్నట్లు రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్లి నటరాజన్ చంద్రశేఖరన్ తో మంగళవారం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం లోకేష్ చేసిన ఓ ట్వీట్ రాష్ట్రంలో టాటా పెట్టు బడులు ఖాయమని తేల్చేసింది. నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అద్భుతంగా జరిగింది. బుధవారం(అక్టోబర్ 9)న రాష్ట్రంలో టాటా పెట్టుబడులకు సంబంధించి ఓ ప్రకటన వెలువడుతుందని లోకేష్ చేసిన ట్వీట్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుందన్న హింట్ ఇచ్చింది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురంలో టీసీఎష్ క్యాంపస్, రాయలసీమలో సెమికండక్టర్ ప్లాంట్, అనంతపురం సమీపంలో విమానాల తయారీ సంస్థల ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గొప్ప ఊతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏపీలో తిరుగు ఉండదు.  

హర్యానాలో కాంగ్రెస్ కొంప ముంచిన ఆప్!

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్సే కాదు.. స్వయంగా బీజేపీ సైతం రాష్ట్రంలో ఓటమి ఖాయమన్న అంచనాకు వచ్చేసింది. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉండటం, అలాగే ప్రధాని మోడీవి రైతాంగ వ్యతిరేక విధానాలంటూ రైతులలో వెల్లువెత్తిన తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో పరిశీలకులు సైతం హర్యానాలో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండినడకే నంటూ విశ్లేషణలు చేశారు. ఇక బీజేపీ అనుకూల  మీడియాగా అంతా భావించే మీడియా సంస్థలు కూడా హర్యానాలో మూడో సారి కమల వికాసం అనుమానమే అంటూ వార్తా కథనాలు ప్రచురించాయి. అయితే మంగళవారం (అక్టోబర్ 9) వెలువడిన ఫలితాలు మాత్రం అందరి అంచనాలనూ తల్లకిందులు చేసేశాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత ఆరంభంలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచినా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత తగ్గి బీజేపీ విజయం దిశగా దూసుకు వెళ్లింది. చివరికి మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయాన్ని అందుకుంది.  ఇక ఫలితాల తరువాత విశ్లేషణలు చూస్తే హర్యానాలో కాంగ్రెస్ పరాజయానికి ప్రధాన కారణం ఆప్ అని తేలింది. చాలా నియోజకరవర్గాలలో ఆప్ కు వచ్చిన ఓట్లే కాంగ్రెస్ పరాజయానికి కారణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. హర్యానాలో బీజేపీ విజయం ఆ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న అభిమానం కాదనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య భారీగా చీలిపోవడమే కారణమని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృ తాపరాధమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయంపై అతి ధీమాయే కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెబుతున్నారు. అతి విశ్వాసంతో కాంగ్రెస్ చేతికి అందేలా వచ్చిన విజయాన్ని చేజార్చుకుందని విశ్లేషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా హర్యానాలో మాత్రం కాంగ్రెస్ ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుకు ససేమిరా అంది. ఏక పక్ష విజయంపై ఉన్న అతి ధీమాతో ఆప్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని చేజేతులా వదులు కుంది.  ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చూస్తే కాంగ్రెస్ విజయానికి అడ్డంగా నిలిచినవి ఆప్ కు పడిన ఓట్లేనని తేలిపోవడంతో ఇప్పుడు అంటూ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేని పరిస్థితిలో హస్తం పార్టీ పడింది. హర్యానా ఎన్నికలలో ఓట్ల పరంగా బీజేపీతో సమానంగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. సీట్ల విషయంలో మాత్రం భారీగా నష్టపోయింది. అందుకు కారణం ఆప్ కు వచ్చిన ఓట్లే. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ కు రెండు శాతం ఓట్లు వచ్చాయి. ఆప్ తో పొత్తు పెట్టుకుని ఉంటే ఆ రెండు శాతం ఓట్లే కాంగ్రెస్ కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టేవి. అయితే కాంగ్రెస్ ఆప్ తో పోత్తుకు వెనుకాడటంతో హర్యానాను ‘చే’ జార్చుకుంది.   కేవలం సర్వేలను నమ్ముకునే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోవడానికి విముఖత చూపింది. అదే సమయంలో బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ ను తక్కువగా అంచనా వేసింది. ఫలితం అనుభవిస్తోంది. 

అప్పుడూ ఇప్పుడూ వలంటీర్లు జగన్ ఉద్యోగులే!

వలంటీర్ల వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చిందో... వారు ఎవరి కోసం పని చేశారో తేలిపోయింది. ఇప్పటి వరకూ వలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణల స్థాయిలోనే ఉంది. అయితే జగన్ సర్కార్ పతనమైన నాలుగు నెలల తరువాత ఆ వ్యవస్థ ఎందుకు పని చేసింది? ఎవరి కోసం పని చేసింది అన్న విషయాలను స్వయంగా వైసీపీ అధినేత జగన్ చెప్పేశారు. వలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేననీ, వారికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదనీ ప్రకటించేశారు. అలా ప్రకటించి ఊరుకోకుండా.. వలంటీర్లందరికీ ఇక నుంచి వైసీపీయే వేతనాలు చెల్లిస్తుందని ప్రకటించేశారు. వరద సాయం కోటి రూపాయలులా ఆయన ప్రకటన మిగిలిపోతుందో? నిజంగానే వారికి ప్రతినెలా ఠంచనుగా జీతాలు ఇస్తారో చూడాల్సిందే కానీ.. జగన్ మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థ ఆవిర్బావ రహసం మాత్రం తేటతెల్లమైపొయింది. ఆ వ్యవస్థను జగన్ తన కొరకు తన చేత తానే ఏర్పాటు చేశారని ఆయనే స్వయంగా అంగీకరించేశారు.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోవడం లేదనీ, అందు చేత వారిని వైసీపీ ఉద్యోగులుగా గుర్తించి నెలనెలా వారికి ఒక్కొక్కరికీ ఐదేవేల చొప్పున  గౌరవ వేతనం చెల్లిస్తాననీ చెప్పారు. వైసీపీ సర్కార్ 2019లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వాలంటీర్లను నియమించింది. వారందరినీ ప్రభుత్వోద్యోగులుగా ప్రకటించింది. ప్రతి 50 మంది జనాభాకు ఒకరు చొప్పున ఆ వాలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాల అమలు వారి ద్వారా జరిగేలా మార్గదర్శకాలు రూపొందించింది. తద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా వాలంటీర్ల వ్యవస్థ తయారైంది. జనం అధికారులపై కాకుండా వాలంటీర్లపై ఆధారపడేలా పరిస్థితుల ఏర్పడేలా చేసింది. అంతే కాకుండా వారికే ఎన్నికల విధులు అప్పగించి ఎన్నికలలో లబ్ధి పొందాలని జగన్ భావించారు. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించడాన్ని ఈసీ అంగీకరించకపోవడంతో జగన్ వ్యూహం దెబ్బతింది. దీంతో వాలంటీర్లు రాజీనామా చేసి  పార్టీ కోసం పని చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్నికలలో గెలిచి మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందనీ, అప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లనందరినీ తిరిగి నియమిస్తాననీ అప్పట్లో జగన్ పేర్కొన్నారు. జగన్ పిలుపును నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అయితే అలా చేయని వారు లక్షన్నర మందికి పైగా ఉంటారు. ఇప్పుడు వారి విషయంలోనే జగన్ ఈ ప్రకటన చేశారు.  వాలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేనని ప్రకటించారు. గతంలో వారు వైసీపీ కోసం పని చేశారనీ, ఇప్పుడు కూడా అదే చేయాలనీ, వైసీపీయే వారికి నెల నెలా వేతనం చెల్లిస్తుందనీ అన్నారు. తద్వారా వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం ఎందుకు ఏర్పాటయ్యిందో శషబిషలకు తావు లేకుండా చెప్పేశారు.  

మద్య నిషేధం ఎత్తివేత.. ప్రశాంత్ కిశోర్ హామీ మందుబాబుల ఓట్ల కోసమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోన్ సొంత కుంపటి జన్ సురాజ్ ను ప్రారంభించేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి ఆయనే అధినేత, ఎన్నికల వ్యూహకర్త కూడా. ఆయన వ్యూహాల పదును పార్టీని ప్రారంభించిన మొదటి రోజే చూపారు. బీహార్ లో అత్యంత కీలకంగా మారిన మద్య నిషేధంపై ఆయన చేసిన ప్రకటన రాజకీయ పండితులను  సైతం విస్మయపరిచింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో తన పార్టీ జన్ సురాజ్ విజయం సాధించి అధికారం చేపడితే.. వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు.  సాధారణంగా ఏ పార్టీ అయినా సరే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటిస్తారు. కానీ నలుగురూ నడిచే దారిలో నేనసలు నడవను అనే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని తాను అధికారంలోకి రాగానే ఎత్తి వేస్తానని ప్రకటించారు.  మహిళల ఓట్ల కోసం రాజకీయ పార్టీలూ తరచూ ఎత్తుకునే మద్యపాన నిషేధం నినాదాన్ని కాదని ఆయన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించడం రాజకీయంగా సాహసమనే చెప్పవచ్చు. మందుబాబుల ఓట్ల కోసమే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రకటన చేశారా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని తాను  చేసిన ప్రకటన పూర్తిగా ఆర్థిక కారణాలతోనేనని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు.  మద్యపాననిషేధం ఎత్తి వేయడం ద్వారా రూ.20వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అవుతుందన్నారు.వాటిని విద్యావ్యవస్థ పటిష్టం చేయడానికి ఖర్చు చేస్తామన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచస్థాయిలో విద్యావ్యవస్థ అభివృద్ధి చేయడానికి ఐదులక్షల కోట్లు వ్యయం చేస్తానని చెప్పారు. జన సురాజ్ మార్టీకి మాజీ ఐఏఎస్ అధికారిణి ని కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించిన ప్రశాంత్ కిషోర్..  విద్యా,ఉపాధి రంగాలు అభివృద్ధే తన ఎన్నికల ఎజెండాగా చెప్పారు. ఆయన రాజకీయ ఎజెండా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే మద్య నిషేధం ఎత్తివేత ప్రకటన ద్వారా ఆయన మందుబాబుల అభిమానానికి పాత్రుడయ్యారనడంలో ఎంత మాత్రం సందేహం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.   ఇక జనసురాజ్ విషయానికి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 (బుధవారం ) ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను బీజేపీతో కలిసి పయనించే అవకాశం ఇసుమంతైనా లేదన్నారు. సొంతంగా, స్వతంత్రంగా జనసురాజ్ ఎదుగుతుందనీ, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత కాలం వేరే పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేసి వాటికి అధికారాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన సురాజ్ కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తారన్న ఆసక్తి బీహర్ కే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.