జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.! త్వరలోనే యువరాజుకి పట్టాభిషేకం?

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారంటూ ఎప్పట్నుంచో విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఎక్కువగా వినిపించింది. ప్రధాని మోడీ సైతం... కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలు ఎలాగున్నా, తొందర్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాట టీఆర్ఎస్ వర్గాల్లోనూ వినిపించింది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు రావొచ్చనే భయంతో కేసీఆర్ వెనకడుగు వేశారని చెబుతారు. అందుకే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకగణమంతా కేటీఆర్ చుట్టూ తిరిగేలా చేశారని అంటారు. ఒకవిధంగా చెప్పాలంటే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేది కేటీఆరే. టికెట్ల దగ్గర్నుంచి... మంత్రి పదవుల వరకు... అన్నింటిలోనూ కేటీఆర్ మార్క్ కనబడుతుంది. అయితే, కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపడతారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ కూడా తన పదవికి తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టాలని సీరియస్  గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం-అఖిలేష్ మాదిరిగా... పార్టీకి గౌరవాధ్యక్షుడిగా, ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల నుంచి కేసీఆర్ కు ఊహించని కామెంట్స్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్ర నాయకత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందని, దాంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో... అన్నీ చక్కబడగానే... పార్టీలో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, యువరాజు పట్టాభిషేకం జరగడం ఖాయమని అంటున్నారు.  

నేతన్నలకు 24వేలు... మత్స్యకారులకు 10వేలు... జగన్ సర్కారు సంచలన నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని హామీల అమలు దిశగా తీర్మానాలు చేసింది. ముఖ్యంగా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల కోసం వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తోన్న ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా 24వేల రూపాయల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. డిసెంబర్ 21నుంచి వైఎస్సార్ చేనేత నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే, వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు 10వేలు చొప్పున ఆర్ధికసాయం చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. అదేవిధంగా మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌పై 9 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ మంత్రివర్గం... హోంగార్డుల రోజువారీ వేతనాన్ని 710 రూపాయలకు పెంచింది. దాంతో హోంగార్డుల నెల వేతనం 18వేల నుంచి 21వేల 300కి చేరనుంది. అదేవిధంగా బార్ అసోసియేషన్స్‌లో సభ్యత్వమున్న న్యాయవాదులకు నెలకు 5వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక, జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం... మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన పలాస ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతి తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి... ప్రభుత్వమే హామీగా ఉండి... రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కములకు ఊరటనిచ్చేందుకు... 4వేల 471కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

టీఆర్ఎస్ ఎంపీ నిర్వాకం.. ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం

  న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్ రోడ్ లో గజం నలభై వేల రూపాయల పై మాటనే పలుకుతుంది. పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండేది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో నూట యాభై మందికి పైగా కార్మికులు పని చేసేవారు. ఆ సెంటర్ ను ఇప్పుడు మూసేసి  కార్మికులను పంపేశారు. ఇపుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సొంతచేసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లో ఉండే ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంట్రర్ స్థలానికి టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్ దాన్ని ముప్పై మూడేళ్ళ లీజుకు దక్కించుకున్నారు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు.  హన్మకొండ హంటర్ రోడ్ లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆరు జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రిట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. భూముల ధరలు రానురాను ఆకాశాన్నంటాయి.ఇక్కడ ఎకరం విలువ పంతొమ్మిది కోట్ల రూపాయల పై మాటే, అంటే నాలుగు ఎకరాలు కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్ తో ఎటువంటి ఉపయోగం లేదని దీని కారణంగా ఆర్టీసీకి అపారమైన నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేశారు. ఆ తర్వాత ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశల వారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపి పసునూరి దయాకర్ తెరమీదకొచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్ లు పిలిచారు. సింగిల్ బిడ్ తోనే ఏకంగా ముప్పై మూడేళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకు నెలకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఏడాదికి అరవై లక్షల రూపాయల అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్ సెంటర్ లో భవనం ఇతర యంత్రాలు ఉన్నాయి కదా ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్ పిలిచారు. ఈ టెండర్ కూడా పదిహేను లక్షల రూపాయలకు పసునూరి దయాకర్ దక్కటం విశేషం. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్ లు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దని దాన్ని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతి నిధుల చుట్టూ తిరిగి టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దు అంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ కనుమరుగవుతుందని అంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోయింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే భూదందాలు కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ మాకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసివేత వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ తమకు తమ ఉపాధి కోల్పోనివ్వకుండా తమకు తగిన న్యాయం చేయ్యాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.

ఆర్టీసి సమ్మెను విరమించటానికి ప్రభుత్వం ఓ మెట్టు దిగనుందా..?

  పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా, ఉద్యోగాలు లేవని ప్రకటించిన సీఎం కేసీఆర్ కరుణిస్తారా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మహదావకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ఆయన రాసిన అంశం కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, సూసైడ్ ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని తెలిపారు. నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ పదహారు శాతం ఐఆర్ ఇచ్చి ఆర్టీసీ గొప్పగా ఆదుకున్న ఘనత టి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన లేఖ ద్వారా ఆయన గుర్తు చేశారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో తాను ఉన్నా అని, ఎక్కడా కూడా అర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు అని అలా చేయడమంటే పాలసీని మార్చుకోవడమే అన్నారు. ఇదంతా సాదాసీదా కామెంట్స్ అయినా కానీ పరిస్థితి చేజారిపోకముందే కార్మికులు సమ్మె విరమించాలి అని కూడా రాశారు. కార్మికులు ముందుకొస్తే పరిస్థితి అదుపు లోకి వచ్చినట్టే అని తెలుస్తుంది. అద్దె బస్సులు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్ పై సీఎం తీసుకున్న నిర్ణయం సమ్మె నేపథ్యంలోనే అని గుర్తించాలని చెప్పారు కేకే. అయితే అర్టీసి కార్మికుల సమ్మె తీవ్ర తరం అవడంతో ప్రభుత్వం దీనిని ఆపాలనే ఉద్దేశంతో కెకెతో అధికారికంగా కాకపోయినా ఆర్టీసి సంఘాలతో సంప్రదింపులు జరిపి సమ్మెను విరమించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టీఎన్జీవోలు కూడా తాము ఆర్టీసి తరపున ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిధ్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. వారు ముందే సీఎం కె.సి.ఆర్ ను సంప్రదించామని అన్నారు. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగటానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

బంగారు తెలంగాణ ఏమో కానీ... మేఘా కంపెనీ మాత్రం బంగారమవుతోంది..!

  కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా ప్రాజెక్టు... ఇప్పటికే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేశారు... ఇంకా వేల కోట్ల రూపాయల పని మిగిలే ఉంది. అయితే, ప్రాజెక్టును మాత్రం ప్రారంభించేశారు. అయితే, లక్షల కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ బీడు భూములను పారింది లేదు. ప్రాజెక్టు ట్రయల్ రన్స్ మినహా తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదు. కానీ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టరును మాత్రం అపర కుబేరుడిని చేసింది.  ఈ ఒకే ఒక్క ప్రాజెక్టుతో మేఘా కంపెనీ తలరాతే మారిపోయింది. అవును... కాళేశ్వరం ప్రాజెక్టు... మేఘా కంపెనీకి కాసుల పంట పండించింది. కాళేశ్వరంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తామన్న కేసీఆర్....  తెలంగాణను బంగారంగా మార్చారో లేదో తెలియదు కానీ... మేఘా కంపెనీ తలరాతను మాత్రం బంగారంగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత మేఘా కంపెనీ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అమాంతం దూసుకొచ్చింది. ఫోర్బ్స్ జాబితాలో మొన్నటివరకు 47వ స్థానంలో ఉన్న మేఘా కంపెనీ యజమానులు... కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 39వ ప్లేస్ కి చేరుకున్నారు. అయితే, మేఘా కంపెనీ ఒక్కసారిగా పుంజుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని ఫోర్బ్స్ విశ్లేషించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా నెట్ ప్రాఫిట్ 3వేల కోట్లు దాటిందని, అలాగే రెవెన్యూ 23శాతం వృద్ధి చెందిందని, దాంతో మేఘా ఫ్యామిలీ ఆస్తుల విలువ 6శాతం పెరిగాయని ఫోర్బ్స్ విశ్లేషించింది. ఇక, మేఘా కంపెనీ అంటే టక్కున గుర్తొచ్చేది మేఘా కృష్ణారెడ్డే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎండీగా ఉన్న కృష్ణారెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కలిసి దాదాపు 40వేల కోట్ల రూపాయలు పంచుకుని తిన్నారని ఆరోపిస్తున్నాయి. ఇరిగేషన్ నిపుణుల సైతం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని విమర్శిస్తున్నారు. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. ఇక, ఫోర్బ్స్ లిస్ట్ తర్వాతే మేఘా కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల బాగోతం బయటపడాల్సిందేనని విపక్షాలూ ఆశిస్తున్నాయి. అయితే, ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా టాప్ 40కి వచ్చేస్తే, ఇక ఏపీ, తెలంగాణలో దక్కించుకుంటున్న, దక్కించుకోబోతున్న ప్రాజెక్టులతో వచ్చే ఏడాడే టాప్ టెన్ లోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల దందా... మరీ ఇంత దారుణమా!!

  ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ మొదలు పెడుతున్నారు అని అందరికి చేరువవుతున్న విషయం. ఏ వ్యాపారమైనా సరే కప్పం కట్టాల్సిందే నని హుకుం జారీ చేశారని, వారిని బెదిరింపులతో దారిలోకి తెచ్చు కుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారాలూ కాంట్రాక్టులు ఇసుక ఇతరాత్ర లావాదేవీల సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే లకు ఇవే ఆర్ధిక వనరులు. కానీ కొందరు ఎమ్మెల్యే లు మరీ చెలరేగిపోతున్నారు. నాలుగు నెలల్లోనే నియోజక వర్గ ప్రజలు అమ్మో అని బెదిరిపోయేలా చేస్తున్నారు. చిన్నా చితక పోస్టుల విక్రయం నుంచి కోట్ల విలువ చేసే భూముల సెంటిమెంట్ల దాక అన్ని దారులల్లో చెలరేగిపోతున్నారు. మరికొందరేమో విగ్రహావిష్కరణ నుంచి పోస్టింగ్ ల దాకా ఏదైనా తమ కనుసన్నలలోనే జరగాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేల తీరు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.  పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే బ్రాందీ షాపులో పని చేసే ఉద్యోగాలను కూడా అమ్ము కున్నట్టు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖలో వుండే కొన్ని పోస్టులు ఆరు లక్షల రూపాయలకు భారం పెట్టేశారు. ఇదే కాదు ఏ చిన్నపోస్టు ఉన్న ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే తాము చెప్పిన మొత్తం ఇస్తామని ఒప్పుకున్న వారిని పిలిపించుకుని అందరి సెల్ ఫోన్ లు బయటపెట్టించి వ్యవహారం సెటిల్ చేశారు.  గుంటూరు జిల్లాలో కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే లు బ్రాందిషాపుల్లో పోస్టులతో సహా చిన్న చిన్న వాటిని కూడా వదలకుండా విక్రయించుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ యాభై వేలకు అమ్మినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు ఈ పనిని చక్కదిద్దేశారు అని సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే బిజినెస్ మెన్ తరహా రాజకీయం చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ వ్యాపార వర్గమైన తనతో మాట్లాడి సెటిల్ చేసుకోవాల్సిందేనన్న షరతు పెట్టారు. గ్రానైట్ క్వారీల నుంచి నియోజకవర్గస్థాయి సంతల వరకు ప్రతి వ్యాపార వర్గాన్ని పిలిచి నెలకు ఇంత అని మాట్లాడుకున్నట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యే తీరు పట్ల సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.  గుంటూరు జిల్లా కు చెందిన ఒక ఎమ్మెల్యే విగ్రహాల పైన కూడా ప్రతాపం చూపిస్తున్నారు. తమ గ్రామం లో ఫలానా నాయకుడు విగ్రహం పలానా కూడలి లో పెడుతున్నారట కదా పెట్టేందుకు వీల్లేదు అంటూ విగ్రహ ఆవిష్కరణ కోసం కట్టిన దిమ్మెను కూడా కూల్చి వేయించినట్టు తెలిసింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక నిర్వాహకులు ఒక ప్రైవేటు స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఆ ఎమ్మెల్యే వదల్లేదు. ఆ ప్రైవేటు స్థలం యజమాని ఎవరో తెలుసుకొని ఆయన కు ఫోన్ చేసి విగ్రహం పెట్టేందుకు అనుమతించనందుకు మీ సంగతి చూస్తాను అంటూ బెదిరించినట్లు తెలిసింది.  అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ ల వ్యవహారం మొదలుపెట్టినట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా భూ వివాదం ఉంటే అది చక్కబెట్టేస్తాను అంటూ దిగుతారు, లేకుంటే వారే తన దగ్గర కు వివాద పరిష్కారం కోసం వచ్చేలా చేస్తారు. ఇక అక్కడ కు వెళ్లాక ముందు గా ఆ స్థలం లో తనకు కొంత రాసివ్వాలి అంటూ అడుగుతున్నారని సమాచారం. ఇలా ఇప్పటికే కొన్ని స్థలా లు తమ వారి పేరు మీద రాయించుకొని ఆ తర్వాత వివాదాల సెటిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన నియోజక వర్గం దాటి అనంతపురం లో కూడా ఈ మేరకు సెటిల్ మెంట్ లు చేస్తున్నారని తప్పని సరి పరిస్థితుల్లో భయంతో అతన్ని మాట వినాల్సి వస్తుంద ని కొందరు వాపోతున్నారు.  ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే దెబ్బ కు ఇద్దరు వ్యాపారులు విపరీతమైన భయాందోళనకు గురయ్యారు అని అంటున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఒక లాడ్జి యజమానిని పిలిచిన ఎమ్మెల్యే భారీ మొత్తం లో డబ్బు డిమాండ్ చేశారని తెలిసింది. అంత మొత్తమా అంటూ ఆ వ్యాపారి భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత కొన్ని రోజులకు సదరు వ్యాపారి చనిపోవడం వెనుక ఈ బెదిరింపు ప్రభావం కూడా ఉన్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా ఇదే విధంగా బెదిరించినట్టు తెలిసింది. అతను వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ కు అవసరమైన అనుమతులు ఇవ్వాలంటే తనకు ఇంత ఇవ్వాల్సిందే నని హుకుం జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలకు విరాళా లు ఇస్తామని ఇలా వెంచర్ వేసినందుకు భారీ మొత్తంలో డబ్బు లు ఇవ్వలేమని చెప్పినా వినకుండా బెదిరింపులకు గురి చేశారని సమాచారం. ఈ ఎమ్మెల్యేల తీరు పై వారి నియోజకవర్గాలతో పాటు పార్టీ లోనూ చర్చ  కొనసాగుతోంది. మరి సీఎం జగన్ ఇప్పటికైనా జాగ్రత్త పడతారా లేదా అనేది వేచి చూడాలి.  

విశాఖపట్నంలో జనసేనకు ఏమవుతోంది...

రాజకీయ ప్రభంజనం అనుకున్న జనసేనకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నిశబ్దంగా ఉంది. ఆ పార్టీకి కీలకంగా భావించిన విశాఖపట్నం జిల్లాలో నాయకులు క్యాడర్ అత్మస్థైర్యం రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రశ్నించటమె లక్ష్యంగా ఎగసిన యువశక్తి స్తబ్దతగా మారిపోయింది. భవిష్యత్ పై క్లారిటీ లేకపోవడం, అధినాయకుడి అంతరంగం అర్థం కాకపోవడంతో నాయకత్వంలో అయోమయం నెలకొంది. రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఏర్పడినపుడు త్రిముఖ పోటీ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి బలహీనంగా ఉండటం, సామాజిక బలం, గట్టి పట్టు కలిగిన అభ్యర్ధులు బరిలో నిలవడంతో జిల్లాలో పీఆర్పీ నాల్గు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. రెండు వేల పంతొమ్మిది నాటికి జనసేన పిఆర్పిని మించిన అంచనాలతో ఓటర్ల ముందుకొచ్చింది. ప్రయోగాలు కొలిక్ కి రాకుండానే ఎన్నికల బరిలో దిగి పొయింది. స్వయంగా జనసేన చీఫ్ గాజువాక నుంచి పోటీ చేశారు. సీబీఐ మాజీ అధికారి వివి లక్ష్మీ నారాయణ, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య వంటి వారు జనసేన తరపున రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అభ్యర్ధుల ఎంపిక నుంచి ఎలక్షన్ నిర్వహణ వరకు జనసేన స్వీయ తప్పిదాలు ఒకటీ రెండు కాదు ఇంతటి ప్రతికూల పరిస్థితులలోనూ ఆ పార్టీ పలు స్థానాల్లో గౌరవప్రదమైన ఓట్లను కైవసం చేసుకుంది. యలమంచిలిలో టిడిపి, విశాఖ సౌత్ జోన్ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి, విశాఖ ఉత్తరంలో మాజీ మంత్రి గంటా మెజార్టీ తగ్గటానికి జనసేనకు పోలైన ఓట్లే కారణం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తొలిసారే జనసేన తరపున విశాఖ ఎంపిగా పోటి చేశారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ. ఈ ఎన్నికలలో జనసేనా ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు దక్కించుకుంది. గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ కు పరిమితమయ్యారు. వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఇమేజ్, కమ్యునిటి ఫ్యాక్టర్, టిడిపిలో అంతర్గత రాజకీయాలు వంటి ఎన్నో ఎన్నెన్నో అంశాలు అనుకూలించినా విజయం సాధించలేకపోయారు. ఆ క్రమంలో ఎన్నికలు సమీపించే నాటికి పార్టీలు పరిస్థితులూ అంతుపట్టకుండా అయిపోగా ఇపుడు పరిస్థితి మరి గందరగోళంగా తయారైంది. అధినాయకుడితో జిల్లా నాయకులకు సంబంధాలు దాదాపు తెగిపోయాయి. సీనియర్లకు సైతం సముచిత స్థానం, భవిష్యత్ పై భరోసా లభించని పరిస్థితి. ఈ తరుణంలో రాజకీయ మనుగడ సాగించాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోక తప్పదు అనే అభిప్రాయం నాయకులలో వ్యక్తమవుతోంది. జనం ఆదరణ పొందినప్పటికీ పార్టీ కార్యాచరణ తమ భవిష్యత్ అర్థంకాకపో నాయకులు నలిగిపోతున్నారు. రాజకీయంగా సంధికాలం గడుపుతున్నవారు, తమ భవిష్యత్తును ఇతర పార్టీలో వెతుక్కునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత వివి లక్ష్మీ నారాయణ సామాజిక సేవకు పరిమితమయ్యారు. జెడి ఫౌండేషన్ తో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆ జెండా కింద ఎటువంటి యాక్టివిటీ చేయటంలేదు. అనకాపల్లి నుంచి పోటీ చేసి రచయితల పార్థసారథి బీజేపీలో చేరి పోయారు. కేంద్ర కార్యాలయ వ్యవహారాలలో కీలకమైన పార్థసారథి పార్టీకి రాజీనామా చేసి జిల్లా స్థాయిలో పార్టీని వీడిన తొలి నాయకుడయ్యారు. పార్థసారథి ఒక్కరే కాదు, సమీప భవిష్యత్తులో మరికొంతమంది జనసేనకు గుడ్ బై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలరాజుతో వైసిపి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపికి స్థానిక సంస్థల ఎన్నికల పెద్ద సవాల్. విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ప్రతిష్ఠాత్మకం ఈ నేపధ్యంలో సీనియర్ అవసరం కావాలి అంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. ఇప్పటికే టిడిపిని కాలిచేయడం పనిగా భారీగా వలసలు స్వాగతిస్తుంది వైసిపి. ఈ తరుణంలో జనసెనలో మిగిలిన నేతలతో ఎలా డీల్ చేస్తుందో చూడాలి ఇక.

ఆస్తులు కాపాడుకోడం కోసం బీజేపీలో చేరబోతున్నారా?

మొన్నటి వరకు సంచలనం సృష్టించిన విషయం కరకట్ట నిర్మాణాల తొలగింపు చర్యలు .కృష్ణా కరకట్ట నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా వివిధ నిర్మాణాలకు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీయే నోటీసులిచ్చింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారని, వాటిని స్వచ్ఛంధంగా తొలగించాలని లేకుంటే తామే కూల్చివేతకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు డెడ్ లైన్ లతో గోడలకు నోటిస్ లను అంటించి హడావుడి చేసింది. ఓ నిర్మాణంలో నది లోపలికి చొచ్చుకుని వెళ్లి నిర్మించిన ర్యాంపును కూడా సీఆర్డీయే అధికారులు తొలగించారు. దాంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేస్తారనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు కూడా అదే ఊపులో ఉన్నట్టు కనిపించారు. అయితే తనను వేధిస్తున్నారని తన గెస్ట్ హౌస్ నిర్మాణం అంతా పద్ధతి గానే జరిగిందని అన్ని నిబంధనలు ఉన్నాయంటు లింగమనేని రమేష్ కోర్టుకెక్కారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామం అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిస్థితులను  ఏపీలో కరకట్ట కట్టడాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు చేరారు. వీరిలో చెప్పుకోదగ్గ ముఖ్యులు ఉన్న వారి సంఖ్య తక్కువే అయినా ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారి మీద శ్రద్ధ కొద్దిగా ఎక్కువ గానే వచ్చిందని చెప్పాలి. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. అలాగే ఏపీ నుంచి శనక్కాయల అరుణ కూడా పార్టీలో చేరారు. శనక్కాయల అరుణ కొంతకాలంగా టిడిపిలో యాక్టివ్ గా లేకున్నా సెడన్ గా బీజేపీలో చేరి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. వారితో పాటే ఇంకొంతమంది కూడా చేరి పోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా కరకట్టు మీదున్న నివాసాలకు చెందిన ఇద్దరు పెద్దలు బీజేపీలో చేరి పోయారు. పాతూరి నాగభూషణం అలాగే ఎస్ఆర్ఐ రామినేని బీజేపీ తీర్థం పుచ్చుకున్న బరిలో ఉన్నారు. ఇపుడిదే ఏపీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కరకట్ట విఐపిలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారినా, తమ నిర్మాణాలు కాపాడుకునేందుకు కర్కట్ట విఐపిలూ బిజెపిని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నివాసాలులో మాజీ ఎంపి బిజెపి సీనియర్ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం కూడా అక్రమమేనని సీఆర్డీయే బాధిస్తోంది. దీనికి సంబంధించిన చర్చ ఓవైౖపు జరుగుతూనే ఉండగా మరో ఇద్దరు కరకట్ట విఐపిలూ బీజేపీ పంచన చేరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో సదరు కరకట్ట పెద్దలు తమ తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొన్నటి వరకూ కరకట్టపై సింగిల్ స్థానానికి పరిమితమైన బిజెపి వీఐపీల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో వీరి నిర్మాణాల విషయంలో కానీ, మిగిలిన కరకట్ట నిర్మాణాల విషయంలో కానీ సర్కార్ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కరకట్ట నిర్మాణ విషయంలో మొన్నటి వరకు చూపిన దూకుడు ఇక పై కూడా చూపుతారా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం లేదు. కనీసం రాజకీయ పరమైన అవసరాల వల్ల కూడా కాకుండా ఇలా తమ ఆస్తులను కాపాడుకోవడానికి కమలం బాట పట్టడం చూసి ఆ సొంత పార్టీ నేతలకు ఎనలేని కోపంతో మండిపడుతున్నారు.

ఓరుగల్లు జిల్లాలో చక్రం తిప్పబోయేది ఎవరు...

  పూర్వం బలమున్నవాడిదే రాజ్యం అన్న మాట మనం విన్నం కానీ ఇప్పుడు రాచరికాలు పోయినా మాటల్లోని విషయాన్ని మాత్రం మనం కళ్లారా చూస్తున్నం. దీనికి ఉదాహరణ ఉమ్మడి ఓరుగల్లు జిల్లాని తీసుకుంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల బలపరీక్షలు పెరుగుతున్నాయి. స్థానికంగా గ్రూప్ రాజకీయాలు కొత్త కానప్పటికీ తాజగా ఏర్పడిన వర్గపోరు మోతాదు మించిందని చెప్పాలి. కొందరు నాయకులు రెండు గ్రూపులుగా విడిపోతే మరికొందరు ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే చేరువులో కి వెళ్లారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ రాజకీయాల్లో తలపండిన నేతలే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. పైకి ఇద్దరు కలిసున్నట్టే అనిపించినా అంతర్గతంగా మాత్రం ఎవరి వర్గం వారిదే గతంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా వీరి మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగేవి ఒక దశలో ఇద్దరు నేతలు నేరుగా ఎదురుపడి తిట్టుకున్న సందర్భాలున్నాయి. అయితే అదంతా గతం ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో ఉన్నారు. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. గత మంత్రి వర్గ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పట్నుంచి వీరిద్దరూ ఒక్కటయ్యారని అంత అనుకున్నారు. కానీ గతంలో వారి మధ్య ఉన్న విబేధాలు అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పైకి కనిపించినంతగా వారి మధ్య సఖ్యత లేదని టీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.  మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న కీలక నేతలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు కడియం శ్రీహరి వర్గమైతే, మరికొందరు ఎర్రబెల్లి వర్గం కొనసాగుతున్నారు. ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కొంత మంది నేతలు నేరుగా అధినాయకత్వంతోనే వారు చేరువులో ఉంటున్నారు. అభివృద్ధి పనుల విషయంలో గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని ఒక నేత పాల్గొంటే ఆయనకు అనుకూలంగా ఉండే ఇతర నేతలే వాటిని ముందుండి నడుపుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ముప్పై రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలోనూ ఈ గ్రూపు రాజకీయం స్పష్టంగా కనిపించింది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఈ గ్రూపు విభేధాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన నేతలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీరంతా మంత్రి పదవి ఆశించిన వారే. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడియం శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ లిస్ట్ లో నుంచి కడియం శ్రీహరి పేరు మాయమైంది. అయితే కడియంకు మంత్రి పదవి రాక పోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావునే కారణమని కడియం అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఊహించుకున్న దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. అయితే ఆశించిన వారికి మంత్రి పదవులు దక్కక పోవడంతో ఒకరి పై ఒకరు అనుచరులు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టిన కేసీఆర్ ఈ సారి మాత్రం కాస్త మొండి చేయి చూపారని చెప్పాలి. గత మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా మొదటి రాజయ్యను తీసుకున్నారు. తర్వాత ఆయన తప్పించి ఆ పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. ములుగు ఎమ్మెల్యేగా ఉన్నందుకు చందూలాల్ కు మంత్రి పదవి ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి ఓరుగల్లుకే రెండు మంత్రి పదవులు చీఫ్ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. మొన్నటి వరకు ఒకే ఒక మంత్రి గా ఎర్రబెల్లి దయాకరావు కొనసాగారు, ఇప్పుడు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు.దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనకంటే ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై రెడ్యా నాయక్ కొంత అలక వహించినట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశించిన వారికి అవి దక్కలేదు. అందువల్ల నామినేటెడ్ పోస్టులపై ఇప్పుడు వారి కన్ను పడింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సీఎంకు దగ్గరగా ఉండే వ్యక్తులతో పైరవీలు చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లో ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో కొందరు కడియం శ్రీహరిని, మరికొందరు ఎర్రబెల్లి దయాకర్ రావుని నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన దగ్గరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఒరుగల్లుల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారో చూడాలి.

రైతులకు రుణాలు ఇకపై అందేనా?

  అన్నదాతా సుఖీభవ అని అన్నం తిన్న ప్రతీ ఒక్కరు మనస్పూర్తిగా అనే మాట.రెండేళ్లుగా అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ పథకాలకూ క్రమంగా చరమగీతంపాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గడువు ప్రకారం రుణం చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పావలా వడ్డీ వడ్డీ లేని రుణం వడ్డీ రాయితీలను పూర్తిగా అటకెక్కించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల లోపు వ్యవసాయ రుణాలకు రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. దాంతో ఏడు శాతానికే వ్యవసాయ రుణం లభిస్తుంది. ఆ రుణం గడువులోగా చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డినీ రైతులకూ వెనక్కిస్తారు. అంటే నాలుగు శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం లక్ష రూపాయల రుణం వరకూ ఒక శాతం భారం భరించి, మూడు శాతానికే రైతులకు రుణం లభించేట్టు చేసింది. దీన్నే పావలా వడ్డీ రుణం అనేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులలో లక్ష రూపాయల లోపు రుణానికి ఆ పావలా వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గడువు ప్రకారం రుణం చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును తిరిగి ఇచ్చేవారు.  రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన నేపథ్యంలో స్తోమత ఉన్న రైతులు కూడా బ్యాంకు అప్పులు చెల్లించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అమలుచేసింది. ఈనేపధ్యంలో మొత్తం పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణ పథకం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఏ రైతూ గడువు లోగా చెల్లించక పోవడంతో ఎవరికి పావలా వడ్డీ లేద వడ్డీ లేని రుణం వర్తించని పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ ద్వారా రైతు పొందిన లబ్దిలో నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు గడువు దాటినందుకు అధిక వడ్డీల రూపంలో రైతు చెల్లించాల్సి వచ్చింది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి డబ్బులు కేటాయించడమే మానేసింది. మొత్తం మీద ఐదేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. కేంద్రం మాత్రం తన వంతు వాటాగా గడువులోగా చెల్లించిన రైతులకూ ఆర్బీఐ ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీ కింద బ్యాంకు లకు నగదు జమ చేస్తూ వస్తోంది. పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణం పథకం కింద రెండు వేల పద్నాలుగు, పదిహేను ఆర్థిక సంవత్సరం నాటి బకాయిలే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది. మే ముప్పై ఒకటి న రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల విడుదలకు జీవో వచ్చింది. కానీ ఆర్థిక శాఖ నయా పైసా విడుదల చేయలేదు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తుంది. రెండు వేల పధ్ధెనిమిదిలో ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి నాలుగు వేల చొప్పున ఏడాదికి ఎనిమిది వేల రూపాయల పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పది వేలకు పెంచింది. ప్రతి సీజన్ కు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బు ఇచ్చినప్పుడు ఇతర పథకాల అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వడ్డీ లేని రుణం పథకాన్ని నిలిపివేశారు. రుణమాఫీ పథకాన్ని కూడా పక్కాగా అమలు చేయటం లేదు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీ రాయితీకి కిసాన్ క్రెడిట్ కార్డులకు లింక్ పెడుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కేవలం కేసీసీ ఉన్న రైతులకే వడ్డీ రాయితీని అమలు చేయాలని బ్యాంకులు ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఎజెండాలో దీనిని పొందుపరిచారు. మూడు శాతం వడ్డీ రాయితీని రైతుల కిస్తున్న కేంద్రం బంగారు రుణాల పేరిట అనర్హులు వడ్డి రాయితీ పొందుతున్నారని భావిస్తోంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడుల్లో ఈ వ్యవహారం జరుగుతోందని కేంద్రం గుర్తించింది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు లేవు. వారందరికీ వడ్డీ రాయితీ ప్రయోజనాలూ బంగారం రుణం ప్రయోజనాలు అందవు. రైతన్నకు తోడుగా ఉంటూ 'జై కిసాన్' అని ప్రముఖ్యతను ఇస్తున్న రైతులకు రుణం అందుతుందో లేదో వేచి చూడాలి.

విశాఖ జిల్లా వైసీపీలో కోల్డ్ వార్... మంత్రి అవంతిపై జగన్‌కు ఫిర్యాదులు..!

విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా మండుతోన్న మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా గొడవలు రాజుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్న అవంతి... విశాఖ జిల్లాలో ఎవర్నీ లెక్కచేయడం లేదనే మాట వినిపిస్తోంది. జిల్లాలో తానే కింగ్ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని, దాంతో అందరితోనూ గొడవలు అవుతున్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో అవంతి గొడవపడ్డారన్న వార్త... వైసీపీలో కలకలం రేపగా, తాజాగా మరో కీలక నేత, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ తో ఏకంగా అందరి ముందే మాటల యుద్ధానికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో మంత్రి అవంతి... వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. అవంతి ప్రసంగిస్తుండగా, అదే స్టేజ్ పై ద్రోణంరాజు శ్రీనివాస్...కలెక్టర్ తో సంభాషిస్తున్నారు. అయితే, ఇబ్బందిగా ఫీలైన అవంతి... అన్నా శీనన్నా... నగరంలో పెరిగిన మీకు గ్రామీణ కష్టాలు తెలియవు... కొద్దిగా వినండన్నా అంటూ కామెంట్ చేయడంతో, ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. అవంతి మాటలతో నొచ్చుకున్న ద్రోణంరాజు... తాను మాట్లాడుతున్న టైమ్ లో ఘాటుగా బదులిచ్చారు. కుగ్రామంలో పుట్టి, పట్టణంలో పెరిగిన తనకు రెండు ప్రాంతాల గురించి అవగాహన ఉందని, కానీ ఎక్కడ్నుంచో వలసొచ్చి, ఇక్కడకొచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్లకు పల్లెటూళ్ల బాధలు ఏం తెలుస్తాయంటూ అవంతికి గట్టిగా కౌంటరిచ్చారు. అంతేకాదు చిన్నాపెద్దా చూసి మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో కంగుతిన్న అవంతి.... ద్రోణంరాజును బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన మాటలను అపార్థం చేసుకున్నారంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే, ఇదంతా వందల మంది ముందు జరగడంతో వైసీపీ నేతలు షాకయ్యారు. అయితే, అవంతి వ్యవహార శైలి, విశాఖ జిల్లా వైసీపీలో గొడవలు, నేతల మధ్య కోల్డ్ వార్... జగన్ దృష్టికి వెళ్లడంతో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సమయంలో నేతలు ఇలా బహిరంగంగా తిట్టుకుంటే ఎలా అంటూ మందలించారట. ప్రతి ఒక్కరూ విభేదాలను పక్కనబెట్టి, పార్టీ పటిష్టతకు కలిసి పనిచేయాలని, విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమరంలో హుజూర్ నగర్..

  తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ఏకైక ఉప ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ శాసన సభ నియోజకవర్గంపైనే రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఒక్క సీటు కోసం అధికార టీఆర్ ఎస్ పార్టీ వందల సంఖ్యలో గులాబి సైన్యాన్ని నియోజకవర్గంలో మోహరించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఆ పార్టీ మళ్లీ ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని బైపోల్ పోరుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన టిడిపి తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు ఒంటరిగా పోరులో నిలబడింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలతోనే త్వరలో జరగబోయే మున్సిపోల్స్ కి ఆ పార్టీ సన్నద్ధం కానుంది. ఇక ఈ సారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో సారు, కారు, పదహారు అంటూ టీఆర్ ఎస్ ప్రదర్శించిన జోరుకి బ్రేక్ వేసినా బిజెపి హుజూరునగర్ బైపోల్స్ ద్వారా తన సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. సిపిఎం సైతం తన ఉనికిని చాటుకునేందుకు ఒంటరిగా బరిలోకి దిగింది. అధికార టీఆర్ ఎస్ పార్టీకి సిపిఐ అధికారికంగా మద్దతు ప్రకటించింది. అలాగే ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు ప్రకటించింది. నామినేషన్ ల పర్వం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటా పోటీగా ప్రచారాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించేందుకు అధికార టీఆర్ ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రుల నుంచి పార్టీ ముఖ్య నేతల వరకు వందల సంఖ్యలో గులాబీ సైన్యాన్ని దించుతోందని సమాచారం. ఇటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం టీఆర్ ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు అందరినీ ఏకతాటి పైకి తీసుకు రావడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా గత నెల ముప్పై న నిర్వహించిన హుజూర్ నగర్ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతా రాగాన్ని వినిపించారు. ఈ సభలో జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ్ధర్ బాబు, దామోదర్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ వంటి నాయకుల చేసిన ప్రసంగాలు హస్తం శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి. పద్మావతి గెలుపు కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక అవసరం అని హుజూర్ నగర్ ఉప ఎన్నిక నాలుగుకోట్ల ప్రజలకు ఒక నియంతకు మధ్య జరుగుతున్నదని ఆ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు ఇంత మంది టీఆర్ ఎస్ మంత్రులు రంగంలోకి దిగడం, ప్రజలు గమనించాలన్న వారి వ్యాఖ్యలు కూడా హుజూర్ నగర్ నియోజక వర్గంలో పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్న మహిళా ఓటర్లను ఆలోచనల్లో పడేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై వేల ఓట్ల మెజారిటీ రాకుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయం విదితమే, అయితే ఆయన మాటలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుని డిసైడ్ చేసినట్టుగా ఉన్నాయని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. నియోజక వర్గ ఓటర్ల పై ఉన్న అపార అనుభవం నాన్ లోకల్ ఓట్ల క్లారిటీ ఉత్తమ్ కు కలిసి రానున్నాయి చెబుతున్నారు. అయితే టీఆర్ ఎస్ అభ్యర్థి సైది రెడ్డికి యాభై వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర నియోజక వర్గాల్లో గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. అయితే క్యాడర్ బలంగా ఉన్న టిడిపి, బిజెపి, సిపిఎం పార్టీలు అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. హుజూర్ నగర్ లో గత ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కారు పార్టీకీ మెజారిటీ తగ్గే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే మొన్నటిదాకా ఒకరంటే ఒకరికి పడని కాంగ్రెస్ ముఖ్య నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఏకతాటి పైకి రావడం ఉత్తమ్ పద్మావతి గెలుపునకు హస్తం పార్టీకి కలిసొచ్చే శుభపరిణామంగా భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరాలని ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఒక్క సీటు గెలిపించుకునేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టడానికైనా టీఆర్ ఎస్ వెనుకాడడం లేదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. శాసన సభలో ఇప్పటికే సంపూర్ణ మెజారిటీ కలిగిన టీఆర్ఎస్ కి ఈ ఒక్క స్థానంలో గెలిచే ఎమ్మెల్యేతో వచ్చే లాభం గాని, జరిగే నష్టం గానీ ఏమీ లేదు. కేవల ఉత్తమ్ కంచుకోటలో పాగా వేస్తామని తృప్తి పడడానికి కాంగ్రెస్ పార్టీ ఉనికి తగ్గిందని చాటి చెప్పడానికి గులాబీ నేతలు తహతహలాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను కూడగట్టుకొని యుద్ధాన్ని తలపించేలా ఓటర్లను ఆకర్షిస్తోందని అంటున్నారు. ఇప్పటికే కులాలు, మతాల ప్రాతిపదికన ఓటర్లను విభజించి ఆయా సామాజిక వర్గాల వారీగా నియమించిన కమిటీల నాయకుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో నామినేషన్లు భారీగా తిరస్కరణకు గురి కావడం చర్చ నీయాంశంగా మారింది. మొత్తం 76 మంది అభ్యర్థులు 119 సెట్ ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 30 మంది దాకా సర్పంచ్లుండటం గమనార్హం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు నామినేషన్లు వేశారు. కాగా ఈ నెల ఒకటి న జరిగిన స్క్రూటినీలో సిపిఎం అభ్యర్థి పారుపల్లి శేఖరరావుతో సహా నలభై నాలుగు మంది అభ్యర్ధులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఓకే అయ్యాయి. మొత్తమ్మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ కారు పార్టీ గెలిస్తే మహిళా అభ్యర్థిని పై ఇంత అధికారం మందీ మార్భలాన్ని మోహరించారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టే అవకాశాలున్నాయి. అలాకాక హస్తం పార్టీకి విజయం దక్కితే అధికార టీఆర్ ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేతలు జోరు పెంచే యోచనలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మహిళా సెంటిమెంట్ గుంపులు గుంపులుగా వచ్చే టీఆర్ ఎస్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే అక్టోబర్ ఇరవై నాలుగు వరకు వేచి చూడాల్సిందే.

కనుమరుగైన నాటి ఎక్సైజ్ శాఖామంత్రి...

  ఆ పార్టీ అధినేతకు అత్యంత విధేయుడు, పార్టీ పట్ల అంకితభావం కలిగిన నేత, అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నాయకుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించడమే కాకుండా పార్టీగళాన్ని ఎప్పటికప్పుడు మీడియాలో వినిపించేవారు. అలాంటి నాయకుడు మాజీ మంత్రిగా మారిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరమైపోయారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏర్పడిన అసంతృప్తి ఆయనను దహించి వేస్తోంది. ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి పెట్టి టిడిపిలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్. నాటి ఎన్నికల్లో గెలుపొందారు కూడా అంతేకాదు నాటి సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే జవహర్ మంత్రి అయ్యే వరకు కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆయనతో ఉన్నాయి. మంత్రి పదవి వచ్చిన తర్వాత మాత్రం నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. స్థానికంగా కొందరు నేతలు జవహర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం హైకమాండ్ మొగ్గలోనే తుంచి వేయకపోవడంతో అది పెరిగి పెద్దదైంది. ఎన్నికల నాటికి ఈ వివాదం జవహర్ కు టికెట్ ఇవ్వొద్దనే వరకూ వెళ్ళింది. చంద్రబాబు దగ్గర కూడా అసంతృప్త నేతలు వెళ్ళి జవహర్ కు టికెట్ ఇవ్వొద్దని కోరారు. కానీ చివరి నిమిషంలో జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి మార్చింది పార్టీ హైకమాండ్. నిజానికి ఆయన జన్మస్థలం తిరువూరు నియోజకవర్గమే అయినప్పటికీ ఆయన రాజకీయంగా ఎదిగింది మాత్రం కొవ్వూరులోనే, ఇప్పటి వరకు తిరువూరు టిడిపి ఇన్ చార్జి గా ఉన్న నల్లగట్ల స్వామి దాసు జవహర్ కు పార్టీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురయ్యారట. ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేసినప్పటికీ జవహర్ పరాజయం పాలయ్యారు. కొవ్వూరులో పోటీ చేసిన అనిత కూడా ఓడిపోయారు.  ఇదిలా వుంటే ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చు పెట్టాలనే హైకమాండ్ చెప్పడంతో అప్పులు చేసి తెచ్చిన జవహర్ ఇప్పుడు ఆ రుణం తీర్చలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో పాటు తనకు కొవ్వూరు లేదా తిరువూరులో ఏదో ఒక నియోజక వర్గాన్ని ముందే ఖరారు చేస్తే తాను రాబోయే ఎన్నికల నాటికి ఆ నియోజక వర్గంలో పనిచేస్తాననీ కేడర్ ను పటిష్ఠం చేసుకుంటానని ఆయన అధిష్టానం వద్ద ప్రతిపాదించారని సమాచారం. ఇంకా చాలా సమయం ఉంది కదా అని అగ్రనేతలు ఆ విషయాన్ని దాటవేశారు. ఉపాధ్యాయ వృత్తి, ఉపాధ్యాయ ఉద్యమాల గురించి వచ్చిన తనకు ఎదురైన పరిస్థితి పై జవహర్ ఆవేదన చెందారు. తన బాధను అగ్రనేతలందరి వద్ద వ్యక్తం చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు జవహర్ దూరంగా ఉన్నారు. అటు ఆర్ధిక ఇబ్బందుల చుట్టుముట్టడం ఇటు రాజకీయంగా భవిష్యత్ కూడా కనిపించకపోవడంతో ఆయన డీలా పడ్డారు. రాజకీయాలకు దూరంగా ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ లో చేరితే నెలకు యాభై వేల రూపాయల నుంచి డెబ్బై వేల వరకు వేతనం వస్తుందని జవహర్ నేరుగా సహచర నేతల వద్ద వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం కాస్తా పార్టీ అధినేత చంద్రబాబు వరకు వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు సూచన మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు జవహర్ తో ఫోన్ లో మాట్లాడి బుజ్జగించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జవహర్ ఆవేదన చల్లారలేదని, ఇటీవల ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీకి రాజీనామా చేసి ఉపాధ్యాయ వృత్తి లోకి వెళితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. గుంటూరులో ఉన్న తన ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారని, అయితే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో తక్కువ ధరకు అడుగుతున్నారని పార్టీ నేతలు వద్ద ఆయన చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబుకు తానేప్పుడ్డు విధేయుడినే అని ఉద్యమాల నుంచి వచ్చిన తనను విస్మరించడం భవిష్యత్ పై భరోసా ఇవ్వకపోవడమే బాధ కలిగిస్తోందని ఆయన బాహాటం గానే చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరమైన జవహర్ తో అగ్రనేతల సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.

హుజూర్ నగర్ లో చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోంది?

  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థినిగా చావా కిరణ్మయి ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రావాలని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహా కూటమి పేరుతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అంతేకాదు అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో రెండు విడతలుగా వారం రోజుల పాటు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అయితే ఖమ్మం జిల్లాలో తప్ప టీడీపీ ఎక్కడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రచారం కాంగ్రెస్ కు బెడిసికొట్టిందని ఆ పార్టీ నాయకులు ఓపెన్ గానే ప్రకటించారు. దాంతో ఈ సారి హుజూరునగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కోసం చంద్రబాబు ప్రచారం చేస్తారా చెయ్యరా,చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఏమవుతుంది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమిలో సీట్లు మాత్రమే పంచుకున్న టిడిపి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దత్తు మాత్రమే చేసి పోటీకి దూరంగా ఉంది. దాంతో తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా తయారైంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డ టిడిపి నేతలు డీలా పడిపోయారు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అధిష్ఠానం తెలంగాణ టిడిపిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఏపీలో టిడిపి ఓడిపోవటంతో తెలంగాణ పై దృష్టి సారించడమే కాకుండా పార్టీకి పునఃవైభవం తెస్తానని ప్రకటిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే బాబు ప్రచారం చేస్తే ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న హుజూర్ నగర్ లో ఆంధ్రా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని పోటీ చేసిన టిడిపికి ఇరవై ఐదు వేల ఓట్లు దక్కాయి. ఇక రెండు వేల పధ్ధెనిమిదిలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత అభ్యర్థిని కిరణమై భావించినప్పటికీ పొత్తుల కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా పార్టీ అధినేత ప్రచారం చేస్తే అంతో ఇంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.ఇక పై టీడీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

హుజూర్ నగర్ లో కనిపించని రేవంత్? కాంగ్రెస్ కు ఊహించని నష్టం తప్పదా.!

  హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య తలెత్తిన విభేదాలు, మనస్పర్ధలు ఇంకా సమిసిపోలేదు. దాంతో హుజూర్ నగర్ ప్రచారంలో రేవంత్ చప్పుడే వినిపించడం లేదు. హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో సీనియర్లంతా టార్గెట్ చేయడంతో.... రేవంత్ సైలెంట్ అయ్యారు. అదే సమయంలో తన మాటను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండానే, ఉత్తమ్ భార్య పద్మావతి పేరును అధిష్టానం ప్రకటించడంతో రేవంత్ అలకబూనినట్లు తెలుస్తోంది. అందుకే, రేవంత్ కనీసం హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదంటున్నారు.  ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రేవంత్ ఇప్పటివరకు అస్సలు హుజూర్ ప్రచారంలో పాల్గొనలేదు. అసలు ప్రచారానికి వస్తాడో రాడో కూడా తెలియదు. ఇక, ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి కూడా హుజూర్ నగర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రచారంలో కొంత స్తబ్దత నెలకొందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎంతకాదన్నా, రేవంత్ రెడ్డి అంటే యూత్ లో యమ క్రేజుంది. రేవంత్ మాటలను, పంచ్ డైలాగులను వినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు రేవంత్ మాటలు జనాన్ని ఆలోచింపచేసేలా ఉంటాయ్. ఎంతకాదన్నా, రేవంత్ ప్రచారం చేశాడంటే, ఎంతోకొంత ఇంపాక్ట్ ఉండకమానదు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉపఎన్నిక క్యాంపైయిన్ లో రేవంత్ ప్రచారం చేయకపోతే, అది కాంగ్రెస్ కు మైనస్ అయ్యే ప్రమాదముంది. ఒకవైపు, టీఆర్ఎస్, బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా, పంతానికి పోకుండా, అన్ని మార్గాలను వినియోగించుకుంటూ, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారానికి, మొత్తం బలగాన్ని రంగంలోకి దింపుతుంటే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ... కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం కనీసం తెలంగాణ ముఖ్యనేతలతో కూడా ప్రచారం చేయించలేకపోతుందనే మాట వినిపిస్తోంది. మరి, ఉత్తమ్ చొరవ తీసుకుని రేవంత్ లాంటి లీడర్లను స్వయంగా ప్రచారానికి ఆహ్వానిస్తే, వివాదానికి తెరపడటమే కాకుండా, అది పార్టీకి కూడా మేలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మరి ఉత్తమ్-రేవంత్ ల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకోకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఊహించని నష్టం జరగడం ఖాయమేనంటున్నారు కార్యకర్తలు.

టీఆర్ఎస్ కోసం రంగంలోకి వైసీపీ..! హుజూర్ నగర్ లో కుల రాజకీయం

  హుజూర్ నగర్ లో ఎలాగైనాసరే గులాబీ జెండా పాతి... ఉత్తమ్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటోన్న టీఆర్ఎస్... ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇప్పటికే సీపీఐ మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్... అదే బాటలో సీపీఎంను కూడా దాదాపు తన వైపు తిప్పుకుంది. మరోవైపు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు అందర్నీ రంగంలోకి దింపి, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారం చేయిస్తోంది. అయినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం... ఏపీ లీడర్లను కూడా రంగంలోకి దించాలని డిసైడైందట. హుజూర్ నగర్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండటం, అది కూడా కమ్మ, కాపు కులస్తులు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటంతో వైసీపీ కమ్మ, కాపు నేతలతో కులాల వారీగా ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ చూస్తోందట.  హుజూర్ న‌గ‌ర్ లో క‌మ్మ‌, కాపు ఓట‌ర్లు  ప్రభావం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. హుజూర్ న‌గ‌ర్ లో 11వేల మంది కమ్మ ఓట‌ర్లు ఉండ‌గా, కాపు ఓట‌ర్లు ఏడు వేల మందికి పైగా ఉన్నారు. అయితే, కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా... క‌మ్మ సామాజికవ‌ర్గం ఓట‌ర్లలో మాత్రం పూర్తి వ్యతిరేక‌త ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించిందట. దాంతో కమ్మ నేతలను రంగంలోకి దింపి... ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక, రెడ్డి ఓట్లు అత్యధికంగా 27వేల వరకు ఉన్నాయి. అయితే, మెజారిటీ రెడ్డి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపొచ్చన్న అంచనాలతో, క‌మ్మ‌, కాపు ఓట‌ర్లపైనే గులాబీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ కమ్మ, కాపు వైసీపీ నేతలను ప్రచారానికి పంపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. దాంతో దసరా తర్వాత, ఏపీ వైసీపీ నేతలు.... హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ, ఏపీ వైసీపీ నేతలు... టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారంచేస్తే అది కాంగ్రెస్ కు అడ్వాండేజ్ గా మారుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు... తెలంగాణలో ప్రచారం చేయడాన్ని కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నట్టే... ఇప్పుడు టీకాంగ్రెస్ కూడా ఏపీ నేతల క్యాంపెయిన్ ను అస్త్రంగా మార్చుకునే అవకాశముందంటున్నారు. మరి, నిజంగానే ఏపీ వైసీపీ నేతలు... హుజూర్ నగర్లో ప్రచారం చేస్తారో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో భారీగా విద్యుత్ కోతలు

  ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. గ్రామాల్లో వారం రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. అనేక మండలాల్లో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవటంతో డిమాండ్ పెరగిపోగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. ఏపీకి ప్రస్తుతం పది నుంచి పదకొండు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది కానీ కేవలం ఎనిమిది వేల మెగావాట్స్ మాత్రమే ప్రస్తుతం విద్యుదుత్పాదన జరుగుతోంది. వర్షాలు పడటంతో పంటల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ మోటార్లను రైతాంగం విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. సౌర, పవన, విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను పున సమీక్షించాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సౌర, పవన, విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో సౌర, పవన, విద్యుత్ సంస్థలపై ఉన్న విభేదాలతో  వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం విద్యుత్ సరఫరాను తీసుకోవటం నిలిపివేసింది. దీనివల్ల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు థర్మల్ స్టేషన్ల పై ఆధారపడింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా పది లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కరిగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం బొగ్గు కొరత ఏర్పడింది. ఒడిశాలో ఉన్న బొగ్గు గనుల నుంచి కూడా సరఫరా తగ్గిపోయింది. మహారాష్ట్రలో ఎన్నికలుండటంతో ఒడిశా నుంచి బొగ్గును మహారాష్ట్రకు తరలించి అక్కడ విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏపీకి బొగ్గు సరఫరా నిలిచిపోయాయి ఫలితంగా థర్మల్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోయింది. అందువల్లే విద్యుత్ కోతలు పెరిగాయి. వివిధ విద్యుత్ కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడంతో జాతీయ విద్యుత్ ఎక్స్ చేంజ్ లో ఏపీని బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు సాధ్యం కాలేదు.వెంటనే నూట ఇరవై ఐదు కోట్లు కొన్ని విద్యుత్ సంస్థలకు చెల్లించింది ఏపీ ప్రభుత్వం .దాంతో ఏపీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే అక్కడ మిగులు విద్యుత్ అమ్మకాలు పూర్తి అయ్యాయి. వివిధ రాష్ట్రాలు తమ వద్ద ఉన్న మిగులు విద్యుత్ ను ఇప్పటికే వేరే రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏ రాష్ట్రం దగ్గరైనా మిగులు విద్యుత్తు ఉందేమోనని ఏపీ అధికారులు వాకబు చేస్తున్నారు. బొగ్గు లభ్యత పూర్తిగా పడిపోవడంతో విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన డెబ్బై శాతానికి పైగా పడిపోయింది. విదేశాల నుంచి ఓడల్లో వస్తున్న బొగ్గుతో ప్రస్తుత ఒక యూనిట్ లో మాత్రం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో యూనిట్ పాక్షికంగా పని చేస్తోంది. దీంతో విద్యుత్ కష్టాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఉండవల్లి నోట తిరుగుబాటు మాట... జగన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా?

  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే మొదట్నుంచీ సాఫ్ట్ కార్నర్ చూపించే ఉండవల్లి... పొంచివున్న ముప్పును సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గానే చెప్పేశారు. చరిత్రను గుర్తుచేస్తూమరీ హెచ్చరికలు చేశారు. 51శాతం ఓట్లు... 151 సీట్లు వచ్చాయని విర్రవీగొద్దని చెప్పకనే చెప్పారు. జాతీయ పార్టీల్లో నేతలకు తమ అసంతృప్తిని, ఆవేదనను చెప్పుకోవడానికి హైకమాండ్స్ ఉంటాయన్న ఉండవల్లి... వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు అన్నీ జగనేనని, అందువల్ల ఎమ్మెల్యేల మనసు గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి తామంటే నమ్మకముందనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలిగించాలన్నారు. లేదంటే తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని చరిత్రను తవ్వితీశారు. 1972లో పీవీ నర్సింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 56శాతం ఓట్లు... 219 సీట్లు వచ్చాయని, కానీ పీవీని 9నెలల్లోనే దింపేశారని గుర్తుచేశారు. ఇక, 1984లో టీడీపీకి 54శాతం ఓట్లు... 213 సీట్లు వచ్చాయని, కానీ 9నెలల్లోనే ఎన్టీఆర్ కూడా కుర్చీ దిగాల్సి వచ్చిందనే విషయం మర్చిపోవద్దన్నారు. అయినా, ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా? అన్న ఉండవల్లి... రాజకీయాల్లో ఊహించనవే జరిగే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను సూచించిన ఉండవల్లి.... ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.  అయితే, ఉండవల్లి నోట తిరుగుబాట మాట అనే మాటలను చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. లేదంటే జగన్ పరిపాలనపై మొదటి మీడియా మీడియా సమావేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఏదో ఆషామాషీగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేయరు. తనకొచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకే ఉండవల్లి రియాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పదేపదే మీ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉండాలంటూ ప్రస్తావించడం చూస్తుంటే.... మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. ఏదిఏమైనా అధికారం శాశ్వతం కాదని, ఎమ్మెల్యేలు సంతోషంగా లేకపోతే... మీ వాళ్లే మీ మీద తిరగబడతారంటూ... జగన్ కు పొంచివున్న ముప్పుపై ఉండవల్లి హెచ్చరించారు.

కేసీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న ఖమ్మం.. తుమ్మల, పొంగులేటి.. ఇద్దరిలో ఎవరో ఒక్కరే!!

  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. అయితే  ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రాష్ట్రమంతా కారు టాప్ గేరులో దూసుకుపోతే.. ఖమ్మంలో మాత్రం ఫస్ట్ గేర్ లోనే బ్రేకులు పడ్డాయి. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. 'సారు కారు పదహారు' అంటూ లోక్ సభ పోరుకి హుషారుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు.. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో షాకిచ్చాయి. కానీ ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఖమ్మం ఫలితాలు గులాబీ బాస్ కి ఎప్పటికీ అంతుబట్టని ఓ ప్రశ్నలా మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ఫలితాలే కాదు, రాజకీయాలు కూడా కేసీఆర్ కి అంత ఈజీగా అర్థంకావట్లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచినప్పటికీ.. తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ లో చేరి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకి టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ ని వీడరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పార్టీని వీడే ఆలోచనను అప్పుడు పొంగులేటి పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం.. అయితే ఇన్నున్నా తనకి ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తనకి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారట. కానీ కేసీఆర్ మాత్రం.. ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు తుమ్మలకి కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల మొదటినుండి కేంద్ర రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు కాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేయడం కష్టం అనేవాళ్ళు. మరి అలాంటి తుమ్మలను.. ఇప్పుడు రాజ్యసభకు పంపుతానంటే అంగీకరిస్తారా అంటే అనుమానమే. ప్రస్తుతం తుమ్మల, పొంగులేటి ఇద్దరిది ఇంచుమించు ఒకటే పరిస్థితి. జిల్లాలో పట్టుంది కానీ పదవి లేదు. ఒకవేళ భవిష్యత్తులో పదవి దక్కినా ఇద్దరిలో ఎవరో ఒక్కరికే దక్కే అవకాశముంది. దీనికితోడు జిల్లాలో వీరిద్దరి మధ్య వర్గపోరు కూడా నడుస్తుందని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ ని వీడి బీజేపీ గూటికి చేరే అవకాశముందని అంటున్నారు. తుమ్మలకు ఆయన అనుచరులు పార్టీ మారమని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల సమీప బంధువు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంతో.. ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు పొంగులేటి అనుచరులు కూడా పార్టీ మారాలని ఆయన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పొంగులేటి బీజేపీలో చేరే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. మరి ఆ పోటీలో పొంగులేటికి అవకాశం దక్కుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి తుమ్మల, పొంగులేటి ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీలో చేరతారో లేక ఇలాగే టీఆర్ఎస్ లో కొనసాగుతారో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు గులాబీ బాస్ ని తెగ కలవరపెడుతున్నాయట.