కాపు రిజర్వేషన్లకి బ్రేకులు వేసిన జగన్...ప్లస్సా... మైనస్సా ?

  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్ధల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడితో ఎటువంటి ఇబ్బందీ లేదు కానీ గత టీడీపీ ప్రభుత్వం కాపులకు ఈ కోటాలో భాగంగా ఇచ్చిన ఐదుశాతం రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తున్నట్టు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.  అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు బదులుగా ఓసీ జాబితాలో ఉన్న ఆర్ధికంగా వెనుకబడిన కాపులకు మాత్రం పదిశాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన ఎన్నిక మ్యానిఫెస్టో హామీని అమలు చేసేందుకు గాను  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం కోటాలో సగం కాపులకి కేటాయించింది.  అయితే తాజాగా జగన్ సర్కార్ దానిని తొలగించింది. తాజా చట్టం ప్రకారం ఇప్పటివరకూ ఏ రిజర్వేషన్ల పరిధిలోకి రాకుండా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. దీంతో పాటు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారు, వెయ్యి చదరపు అడుగుల స్ధలంలో ఇల్లు లేదా పట్టణ ప్రాంతాల్లో 100చదరపు గజాల స్ధలం, గ్రామీణ ప్రాంతాల్లో 200 గజాల ఇంటి స్ధలం కలిగిన వారిని ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు.  ఆయా నిబంధనల ప్రకారం విద్యాసంస్ధల్లో ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీ సంక్షేమశాఖ జీవో జారీ చేసింది.వాస్తవానికి గతంలో మోదీ సర్కారు విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనకబడ్డ వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేసింది..ఆ చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 10 శాతం పెంచి అందులో ఆర్ధికంగా వెనకబడ్డ వారికి కేటాయించాల్సి ఉంటుంది.  గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈబీసీ కోటాలో కాపులకు ఐదుశాతం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేంద్రం చేసిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యామండలి సూచనతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇప్పటికే సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లను పెంచి రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది.  ప్రభుత్వ జీవోతో దీని అమలుకు మార్గం సుగమమైంది. కేంద్రం తీసుకొచ్చిన పదిశాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదలకు భారీగా లబ్ది చేకూరనుంది. ఐదుశాతం కాపు రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో రాజకీయంగా మరో సారి దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద కాపులు మాత్రమే ఆసక్తితో ఉన్నా మిగతా సామజిక వర్గాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. నిజానికి చంద్రబాబుని సొంత సామాజిక్ వర్గం వారు కూడా ఈ విషయంలో విభేదించారు, సో ఈ రిజర్వేషన్లు నిలిపివేత ఒకరకంగా జగన్ కి ప్లస్సే అని అంటున్నారు.

జగన్ ఇచ్చిన స్వేఛ్చ...మంత్రులను అభాసుపాలు చేస్తోందా ?

  ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో రకరకాల పరిణామాలు అటు ప్రజలకు, ఇటు నేతలకు రకరకాల షాక్ లు ఇస్తున్నాయి. ఎవరూ ఊహించనివారందరూ మంత్రులయ్యారు. అయితే అధికారులు మాత్రం అందరి మంత్రుల మాటా వినడం లేదనే వాదన వినిపిస్తోంది. పరిపాలన అంశాల్లో ఎవరూ అనవసర జోక్యం చేసుకోవద్దంటూ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు చేస్తూనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ పూర్తిగా స్వేచ్ఛ నివ్వడంతో ఇప్పుడు ఎవరూ మంత్రులను లెక్కచేసే పరిస్థితుల్లో కనిపించడంలేదనేది ఇన్సైడ్ టాక్.  అధికారుల తీరుతో కొంతమంది మంత్రులు అవమానాలే కాక అభాసుపాలవుతున్నారట. తాజాగా ఇటువంటి అనుభవమే ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఎదురయ్యింది. ఆయనతో భేటీ అయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వచ్చింది. విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రతినిధి బృందం రాజధానికి వచ్చింది. ఈ బృందం రాష్ట్రంలో ప్రవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపిస్తామని ముందుకు వచ్చిందట. ఈ బృందం రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్‌'తో సమావేశమైందని, తాము పెట్టబోయే సంస్థల గురించి, ఇతర విషయాల గురించి మంత్రితో ఆ బృందం చర్చించిందట.  అయితే ఈ సమావేశానికి మానవ వనరులశాఖకు సంబంధించిన అధికారులు వస్తారని, రాష్ట్రంలో విద్యాపరిస్థితుల గురించి వారికి వివరిస్తారని మంత్రి భావించారట. కానీ ఈ సమావేశానికి సంబంధిత శాఖకు చెందిన సీనియర్‌ అధికారులెవరూ రాలేదట. సమావేశం ముగిసే వరకు మంత్రి సురేష్‌ వారి కోసం ఎదురు చూసినా వారెవరూ రాలేదని తెలుస్తోంది. దీంతో ఎజెండా ఏమిటి ? ప్రతినిధి బృందానికి ఏం చెప్పాలి అన్న విషయంలో మంత్రిగారికి క్లారిటీ మిస్ అయ్యింది. అసలు ఎందుకు వచ్చారో కనీస సమాచారం లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ ఆయన తన ఓఎస్డీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ మంత్రి ఉన్నత విద్యావంతుడు కావడంతో సమయస్ఫూర్తితో వారితో మామూలుగా మాట్లాడి పంపించేశారు కానీ మరొకరు అయితే వారి ముందు అభాసుపాలయ్యేవారేనని అంటున్నారు.  

కన్నడ స్పీకర్ ని టార్గెట్ చేసిన బీజేపీ...ముందరి కాళ్ళకి బంధం !

  కర్ణాటకలో విజయవంతంగా భాజాపా సీఎం ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఆ పార్టీ మేధావులు. ఇప్పటికే ముఖ్యమంత్రి కుమారస్వామి కథ ముగియడంతో తమకి భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న స్పీకర్‌ రమేష్‌కుమార్‌పై దృష్టి సారించారు కమల దండు. ఆయనపై ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగించి ముందరి కాళ్ళకి బంధం వేయాలని ఆ తర్వాత సభలో విశ్వాసం పొందాక ఏకంగా సాగనంపే ఉద్దేశంతో ఉంది.   దాదాపుగా ఏడాది క్రితం ఒకసారి సీఎంగా ప్రమాణం చేసి అది కుదరక మళ్ళీ తప్పుకుని ఆనాటి అధికారం కోసం ఎదురు చూస్తున్న కాషాయదళం కోరిక నెరవేరింది. కానీ సభలో బలనిరూపణ చేసుకోవాల్సిన పెద్ద గండం ముందుంది. ఇటువంటి సమయంలో స్పీకర్‌ వ్యవహారశైలి చాలా కీలకం. ఇప్పటికే రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. మిగిలిన వారి రాజీనామాలను ఆయన పరిశీలిస్తున్నారు.  ఇదే జరిగితే బీజేపీ గట్టెక్కడం కష్టమే. జేడీఎస్‌-కాంగ్రెస్‌ అనుకూలవాదిగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను సాగనంపకుంటే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం కష్టమని బీజేపీ భావిస్తోంది. అందుకే కొత్త వ్యూహానికి తెరతీస్తున్నట్లు సమాచారం. నిజానికి రాబోయే సోమవారం యడ్యూరప్ప సీఏమ్గా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. రెబెల్‌ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతు ఇస్తామని చెబుతున్నారు కానీ అలా అని వారి నుండి ఎటువంటి లిఖిత పూర్వక హామీ లేదు.  అది స్పీకర్ చేతికి వచ్చిన వెంటనే ఆయన అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు వేసే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం యడ్యూరప్పకు కష్టమవుతుంది. అందుకే ఆయనను వీలైనంత త్వరగా సాగనంపే ఏర్పాట్లను చేస్తున్నారని అంటున్నారు. సభలో మెజార్టీ ఉన్న పార్టీకి స్పీకర్‌ను తొలగించే అధికారం ఉన్నప్పటికీ బలనిరూపణ చేసుకోక ముందే ఇది సాధ్యం కాదు. ఈలోగా ఆయనను కంట్రోల్ లో పెట్టాలంటే ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగం ఉత్తమమని కమలనాథులు భావిస్తున్నారు.  స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను తొలగించేందుకు ఉద్దేశించిన ఈ చట్టంతో ఆయన్ని తొలగిస్తూ నోటీసు ఇస్తే, ఇప్పటికిప్పుడు తొలగించలేక పోయినా ఆయన అధికారాలకు మాత్రం బ్రేక్‌ పడుతుంది. 14 రోజుల నోటీసు పీరియడ్‌లో స్పీకర్‌కు కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదు. ముఖ్యంగా రెబల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ దిశగా అధికార బీజేపీ పావులు కదుపుతోంది. ఏది ఏమయినా దక్కక దక్కక దక్కిన పదవిని కాపాడుకోవడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. 

ఇసుక వ్యవహారం జగన్ కొంప ముంచుతుందా ?

  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ బస్తా కంటే అదే బస్తాలో వేసి ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా లారీ ఇసుక రూ. 25 నుంచి 30వేల వరకూ పలుకుతోంది. టీడీపీ నేతలు ఇసుకతో కోట్లు సంపాదిస్తున్నారని వైసీపీ ఉద్యమాలు చేసిన రోజుల్లో లారీ ఇసుక రూ. పదివేల లోపే ఉంది.  నిజానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఓడడానికి ఒక కారణం ఇసుక మాఫియా అనే అంటారు. పేరుకు ఉచితం అన్నా డ్వాక్రా మహిళల పేరిట కార్యకర్తలు అక్రమంగా సంపాదిస్తున్నా మిన్నకుండిపోయింది. దాని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని చావుదెబ్బే కొట్టింది. ఇసుక మాఫియా గురించి ప్రతిపక్షంలో వున్నన్ని రోజులు ఉద్యమాలు చేసి ఊదరగొట్టిన వైసీపీ అధికారం చేపట్టి రెండు నెలలు అవుతున్నా ఎటువంటి పాలసీ తేకపోవడం చాలా ఇబ్బంది కర పరిస్థితులకి దారి తీస్తోంది.  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో ఇసుక ర్యాంప్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తరువాత కలెక్టర్ ఇతర అధికారుల పర్యవేక్షణలో ఇసుకను విక్రయిస్తూ ఉండటంతో మళ్ళీ మాఫియా సీన్ లోకి దిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎమ్యెల్యే, ఎంపీలు తమ పరిధిలో వున్న కొద్దిపాటి రీచ్ లపై అనధికార పెత్తనం మొదలు పెట్టేశారని తెలుస్తూనే ఉంది.  ఇవి ఎంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుదామనుకుంటున్న వైఎస్ జగన్ కి ఇసుక వ్యవహారం లేని పోని తలవంపులు తెచ్చిపెడుతోంది. ఇసుక సప్లై నిలిచిపోయిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు మాత్రమే కాదు చాలా రంగాల్లో స్థబ్ధత నెలకొంది. సిమెంట్, ఐరన్, ఇటుక పరిశ్రమ, ఇతర భవన నిర్మాణ సామాగ్రి విభాగాలన్నీ పూర్తిగా డల్ అయిపోయాయి. నెలలు తరబడి నిర్మాణాలు వాయిదా పడితే బ్యాంక్ రుణాలతో గృహాలు నిర్మించుకునే వారికి వడ్డీల భారం అధికమౌతుంది.  లక్షలాదిమంది ఆధారపడే భవన నిర్మాణ రంగంలో ఏర్పడ్డ సంక్షోభం మరింత ముదరకముందే వైసిపి సర్కార్ ఏదో ఒక విధానం ప్రవేశపెట్టి కాపాడాలని మొత్తుకుంటున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు ఇసుక విషయంలో ఎన్ని కట్టడులు చేసినా మాఫియా చెలరేగిపోతూండటంతోనే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. రవాణా ఖర్చులు భరించి ఎవరైనా ఇసుకను తీసుకెళ్లే విధానాన్ని తీసుకొచ్చారు.  అయితే ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఆ పార్టీ నేతలు ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుక నుంచి భారీగా సంపాదించుకోవడం మొదలు పెట్టారు. ఎంత టీడీపీ నేతలు మాఫియాగా మారినట్లు ఆరోపణలు ఉన్నా అప్పట్లో లారీ ఇసుక రూ. పదివేల కన్నా తక్కువే ఉండేది. మరిప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ విషయంలో కట్టడి చేయకుంటే మరింత చెడ్డ పేరు రావడం ఖాయం.     

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంపముంచిన అక్రమ కొంప!!

  ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన చంద్రబాబు.. రాజధాని ప్రాంతంలో కనీసం సొంతిల్లు నిర్మించుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పని చెప్పక తప్పదు. ఒకవైపు కొందరు టీడీపీ నేతలేమో.. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ కి అమరావతిలో ఇల్లు లేదని, ఆయన హైదరాబాద్ లోనే ఉంటారని విమర్శలు చేసేవారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటారని, అప్పుడప్పుడే ఏపీకి వస్తారు అంటూ విమర్శించారు. కానీ జగన్, పవన్ ఇద్దరూ అమరావతికి దగ్గరలో సొంతిల్లులు నిర్మించుకున్నారు. కానీ బాబు మాత్రం ఐదేళ్లు అక్రమ కట్టడంలో ఉండి విమర్శలు ఎదుర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించారంటూ.. కరకట్ట దగ్గర ఉన్న పలు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది టీడీపీ సర్కార్. అందులో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. కట్ చేస్తే కొద్ది రోజులకు అదే ఇంట్లో బాబు నివాసం ఉన్నారు. అక్రమ కట్టడంలో సీఎం నివసించడం ఏంటని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కానీ బాబు పట్టించుకోకుండా అదే అక్రమ ఇంట్లో ఉన్నారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఒకవైపు జగన్, పవన్ లు సొంతిల్లు నిర్మించుకుంటే.. రాజధానిని నిర్మిస్తానన్న బాబు సొంతిల్లు కూడా నిర్మించుకోకుండా అక్రమ కొంపలో నివాసమున్నారు. ఇది బాబు మీద బాగా ప్రభావం చూపింది. వీటికి తోడు ఏపీకి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తానని చెప్పిన బాబు.. తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లోనే కొనసాగించారు. అంతేకాదు అమరావతి ప్రాంతంలో సొంతిల్లు కట్టుకోని బాబు.. హైదరాబాద్ లో మాత్రం అధునాతన ఇంటిని నిర్మించుకున్నారు. ఇవన్నీ బాబుని విమర్శలపాలు చేసాయి.

జగన్ ఆ అధికారిణి విషయంలో ఎందుకు అంత శ్రద్ద తీసుకుంటున్నట్టు ?

  ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలని పరిశీలిస్తే ఆయనలోని అనుభవరాహిత్యం, ఎవరి మాటా  లెక్కచేయని తనం రెండూ ముఖ్యంగా కనిపిస్తున్నాయి. పాలనా పరమైన విషయాలలో ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక రకంగా వాటిని సరిదిద్దుకుని మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది, కానీ అధికారుల నియామకాల విషయంలో ఏమాత్రం పక్షపాతం చూపినా అది ప్రతిపక్షాలకు పెద్ద స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది.  కానీ జగన్ తెలిసో తెలీకో, లేదో ఎవరేం చేస్తారన్న ధీమా వలనో కానీ జగన్ అదే తప్పు చేస్తున్నాడు.సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణి శ్రీలక్ష్మి ని ఏపీ సర్వీస్ లోకి తీసుకోని రావటానికి జగన్ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో ప్రభుత్వ అధికారులకి అర్ధం కావటం లేదట. ఏకంగా విజయసాయి రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన అమిత్ షా, మోడీలతో మాట్లాడి మరీ ఏపీకి రావటానికి ప్రయత్నిచడం హాట్ టాపిక్ గా మారింది.  ఆమె విషయంలో విజయసాయితో పంపి మరీ ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారనేది పెద్ద క్వస్చన్ మార్క్ గా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీ లక్ష్మి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైయస్ మరణం తర్వాత జగన్ మీద నమోదైన అక్రమాస్తుల కేసులలో శ్రీ లక్ష్మీ పై ఓబులాపురం గనుల అవినీతి కేసు సిబిఐ నమోదు చేసింది.  ఇక ఈ కేసులో శ్రీలక్ష్మి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం సైతం క్షీణించి అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఆమెకు క్లీన్ చిట్ లభించగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆమె ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కలిసి పనిచేస్తానని జగన్ ను కలిశారు. ఆమె విషయంలో సానుకూలంగా స్పందించిన జగన్ ఏపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.  అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అధికారిణికి అది కూడా జగన్ కేసులలోనే జైలుకు వెళ్ళిన అధికారిణికి అవకాశం ఇవ్వడం, పట్ల ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే అవకాశం ఉంది. అవినీతి అధికారులను ప్రోత్సహించే జగన్ అవినీతి నిర్మూలన అంటూ ప్రకటనలు ఇవ్వడం రెండిటికీ సింక్ కాదని అంటున్నారు. మరి జగన్ ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలి.    

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష....బీజేపీ మీద కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ ?

  నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష,  ఎవరికీ చెడు విద్యలు నేర్పించకు. అవతలి వాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించ గలదని చెప్పారు మహానుభావులు. ఇప్పుడు అదే బీజేపీ విషయంలో నిజమయ్యింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.  బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కౌల్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరించిన బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తగ్గినట్లైంది. నిజానికి కర్ణాటకలో ఆపరేషన్ కమలం పూర్తవ్వడంతో బీజేపీ తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్ అని చర్చ జరిగింది.  దానికి ఊతం ఇచ్చేలాగా మోదీ, అమిత్ షా కనుసైగ చేస్తే చాలు 24 గంటల్లోనే మీ ప్రభుత్వం కూలిపోతుందని అసెంబ్లీలోనే బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో ఆపరేషన్ కమలం మధ్యప్రదేశ్‌లో మొదలైనట్టేనని భావించారు. కానీ కర్ణాటకను చేజార్చుకున్న కాంగ్రెస్ ఇక్కడ ముందుకు ముందే జాగ్రత్త ఒఅడింది. శాసనసభలో నీ ప్రభుత్వం కూల్చేస్తాం జాగ్రత్త అని పరోక్షంగా తనకే వార్నింగ్ ఇచ్చిన కమలనాథులకు సీఎం కమల్‌నాథ్ ఎదురు దాడి చేశారు.  నిన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో క్రిమినల్ లా చట్ట సవరణకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఓటింగ్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. అంతేకాదు బుధవారం రాత్రి సీఎం కమల్‌నాథ్ ఇచ్చిన విందులో వీరు పాల్గొన్నారు.  దీంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దించుతామన్న ఆ పార్టీకి షాక్ తగిలింది.  క్రిమినల్ లా సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ దీనిపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దాంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ దానికి 122 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు స్పీకర్‌ది. విపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు. ఎందుకంటే ఓటింగ్‌లో బీజేపీ పాల్గొనలేదు.  అయితే, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక పరిణామాలు రిపీట్ ఆయె అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆపరేషన్ కమలానికి చెక్ పెట్టేలా ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుగా మేల్కొని ఆపరేషన్ కమల్‌నాథ్ చేపట్టింది.  మధ్యప్రదేశ్ లో శాసనసభ్యుల సంఖ్య 230 కాగా సాధారణ మెజారిటీ 116 సీట్లు, అయితే కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ బలం 121 సీట్లు, అందులో కాంగ్రెస్‌ (114), బీఎస్పీ (2), ఎస్పీ(1), స్వతంత్రులు (4) ఉండగా, బీజేపీ బలం 109 సీట్లు.  కమల్ నాథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్ ఓటు వేశారు. ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన హస్తాల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు అనుకూలంగా ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలిద్దరిని కాంగ్రెస్ ఎవరికి తెలియని ప్రదేశంలో రహస్యంగా ఉంచింది.    

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు పవన్ మధ్య చిచ్చు పెట్టిన లోకేష్!

  2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్న టీడీపీ.. తరువాత ఆయనను దూరం చేసుకొని తప్పు చేసిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలు టీడీపీ, వైసీపీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా జరిగాయి. చాలా తక్కువ తేడా ఓటు శాతంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ,జనసేనలు మద్దతిచ్చాయి. బీజేపీ వల్ల టీడీపీకి ఎంత ప్లస్ అయిందో చెప్పలేం కానీ జనసేన వల్ల మాత్రం టీడీపీకి కచ్చితంగా ప్లస్ అయిందనే చెప్పాలి. పవన్ కి యూత్ లో ఉన్న క్రేజ్ టీడీపీకి ప్లస్ అయింది. అలాగే మెజారిటీ కాపు సామాజికవర్గ ఓట్లు కూడా టీడీపీకి పడ్డాయి అంటారు. అంటే 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కూడా కారణమని చెప్పవచ్చు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత.. టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ మొదలైంది. పవన్ టీడీపీకి దూరమై టీడీపీని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అది నచ్చని టీడీపీ నేతలు ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. అలా పవన్ ని, పవన్ అభిమానుల్ని టీడీపీ దూరం చేసుకుంది. అయితే పవన్ టీడీపీకి దూరమవ్వడానికి కారణం లోకేష్ అని పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది. టీడీపీ గెలవడానికి పవన్ కారణం కాదు, పవన్ లేకపోయినా టీడీపీ గెలుస్తోంది అంటూ కొందరు లోకేష్ ని రెచ్చగొట్టడంతో.. లోకేష్ పవన్ పై చులకన వ్యాఖ్యలు చేశారట. ఈ విషయం పవన్ కి తెలియడంతో.. ఆయన హర్ట్ అయి టీడీపీకి దూరంగా జరిగారట. అందుకే పవన్ టీడీపీకి దూరమయ్యాక లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు అని అంటుంటారు. ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబే.. పవన్ ని దూరం పెట్టి డైరెక్ట్ చేసారని ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయాన్నీ ఎన్నికలకు ముందు వైసీపీ పదేపదే ప్రస్తావిస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ పనితీరుపైన, అవినీతి పైన ప్రతిపక్ష వైసీపీ కంటే.. పవన్ వేసిన వ్యాఖ్యలే జనంలోకి బలంగా వెళ్లాయని, అది టీడీపీకి తీవ్ర నష్టం చేసిందని అంటారు. అదేవిధంగా పవన్ దూరమవడంతో యూత్ ఓట్లు కూడా టీడీపీ దూరమయ్యాయి. మెజారిటీ యూత్ పవన్ కి, జగన్ కి జై కొట్టారు. మొత్తానికి తెలిసో తెలియకో పవన్ ని దూరం చేసుకొని టీడీపీ తప్పు చేసిందని చెప్పక తప్పదు.

జగన్ దెబ్బకి కేంద్రానికి షాక్....తప్పుకుంటామని హెచ్చరికలు జారీ !

  ఏపీ రాజధాని అమరావతికి రుణ మంజూరుకు మరో బ్యాంక్ వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదన విరమించుకున్న నేపథ్యంలో తాజాగా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అక్కడితో ఆగక ప్రాజెక్టులపై సమీక్షలు, నిలిపివేతల విషయంగా కేంద్రానికి లేఖ కూడా రాసిందని సమాచారం.  జగన్‌ సర్కారు వైఖరిని ప్రస్తావిస్తూ ఇలా చేస్తే మీ దేశంలో ఏ రాష్ట్రానికీ రుణం అందించలేమని తెలిపిందని చెబుతున్నారీ. ఒక ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టుల కోసం రుణం తీసుకుంటే అదే స్థానంలో వచ్చ్హిన మరో ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను సమీక్షల పేరిట నిలిపివేస్తుందని, ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్న బ్యాంకు పరిస్థితి ఇలాగే ఉంటే మొత్తం మీ దేశం నుంచే తప్పుకోవాల్సి వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించినట్టు సమాచారం.  గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల మీద సమీక్షలు, అలాగే పనుల నిలిపివేతలపై  జగన్‌ ప్రభుత్వం  మీద ఏఐఐబీ తీవ్రంగా హెచ్చరికలు చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చిస్తామని తెలిపింది. తాము ఇచ్చిన రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులను సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లని పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం జరిమానా కూడా విధించే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం.  తమ రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోతే తమ పరువు పోతుందని ఏఐఐబీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. అయితే ఈ విషయం మీద విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఏఐఐబీ లేఖ కాపీని ఏపీ ప్రభుత్వానికి పంపారు. బెంగుళూరు మెట్రో, ముంబైలో రవాణా మెరుగుదల, రోడ్లు, విద్యుత్‌ వసతుల మెరుగుదల వంటి పలు ప్రాజెక్టులకు ఏఐఐబీ రుణం అందిస్తోంది.  మరికొన్ని ప్రతిపాదన దశలో ఉండగా ఇప్పుడు గనుక ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించకుంటే ఆ ప్రభావం మిగతా వాటి మీద కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో ? చంద్రబాబు సర్కార్ ఎలా అయినా అవినీతి చేసిందని నిరూపించడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చీవాట్లు పెట్టిస్తున్నాయి. అంతా మనదే ఏమి చేసినా ఇబ్బంది లేదనుకుంటున్న జగన్ సర్కార్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇండియాలో మిగతా ప్రాజెక్ట్ లకి కూడా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది.

జగన్ సర్కార్ కి మరో షాక్...కేంద్రమే కారణమంటున్న సీఎంవో !

  అమరావతికి నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రుణం ఇవ్వకపోవడానికి మీరంటే మీరు కారణమని అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే మరో బ్యాంకు కూడా హ్యాండ్ ఇవ్వచ్చని ప్రచారం జరగగా ఇప్పుడు ఆ విషయాన్ని నిజం చేస్తూ అమరావతి ప్రాజెక్టుకి ఇస్తామన్న ఋణం విషయంలో తాము  తప్పుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రకటించింది.  రాజధాని అమరావతికి 200 మిలియన్ డాలర్ల రుణం ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) తెలిపింది. అమరావతిని సుస్థిరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌గా భావించడం లేదని, అందుకే రుణ ప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నామని పేర్కొంది. కాగా ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణ సాయంపై వెనక్కి తగ్గడంతో ప్రభుత్వానికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే  ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమరావతికి ప్రపంచబ్యాంకు తన ప్రతిపాదిత రుణాన్ని నిలిపివేసిందని సీఎంఓ వర్గాలు మరోసారి పేర్కొనగా, అమరావతికి ఋణం ఇచ్చే విషయంలో వరల్డ్‌ బ్యాంకుతో పాటు ఏఐఐబీ కూడా పార్టనర్ అని కేంద్రం తీసుకున్న నిర్ణయం వలన ఈ ప్రాజెక్టులోని భాగస్వాములందరికీ వర్తిస్తుందని సీఎంఓ వర్గాలు పెర్కొనట్టు చెబుతున్నారు. అమరావతిలో మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం 715 మిలియన్‌ డాలర్లు కాగా అందులో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి.  మిగతా 215 మిలియన్‌ డాలర్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలన్నది గత ప్రభుత్వ సమయంలో చేసిన ప్రతిపాదన. అయితే అమరావతికి రుణం విషయంలో చెకింగ్ లు లాంటివి కుదరవని చెప్పడంతో పాటు ఋణం కోసం చేసిన విజ్ఞప్తిని కూడా వెనక్కు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఏఐఐబీ సైతం నిర్ణయం తీసుకుంది. మరి ఈ విషయం మీద పాలకప్రతిపక్షాలు ఏమంటాయో వేచి చూడాలి మరి ?

మళ్ళీ కర్ణాటక సీఎంగా యడ్డీ....కానీ నిలబడడం కష్టమే ?

  గత కొద్దిరోజులుగా అనేక మలుపులు తిరుగుతూ కర్ణాటకతో పటు దేశం మొత్తాన్ని తీవ్ర ఉత్కంఠ రాజేసిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర పడింది ! నిన్న రాత్రి విశ్వాస పరీక్షలో పరాజయం పాలైన కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు నిన్నటితో కుప్పకూలింది. నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో డివిజన్ పద్ధతిలో స్పీకర్ రమేశ్ కుమార్ ఓటింగ్ నిర్వహించారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామికి మద్దతుగా 99 ఓట్లు రాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది.  దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్‌కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఓటింగ్ లో వీగిపోవడంతో ప్రభుత్వ సదుపాయాలను వదులుకొని ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌కు తన రాజీనామ లేఖను అందించారు. రాజీనామ లేఖ అందించిన కాసేపటికే గవర్నర్ కుమారస్వామి రాజీనామాను అమోదిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనకు సూచించారు.  మంచి ముహూర్తం చూసుకొని యడ్యూరప్ప సీఎం పదవిని అధిష్టించడమే ఇక తరువాయి. అయితే యడ్డీ ఆనందం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు మరోసారి ఇంత కాక రేపే అవకాశం లేకపోలేదు. ఎందుకనే విషయాన్ని విశ్లేషిస్తే కర్ణాటకలో మొత్తం 224 ఎమ్మెల్యే సీట్లు ఉండగా నిన్న విశ్వాస తీర్మానం సందర్భంగా స్పీకర్ సహా 204 మంది మాత్రమే హాజరయ్యారు.  కాంగ్రెస్‌-జేడీయూ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇలా 20 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొనలేదు. రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రప్పించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో ఈ ఫ్లోర్ టెస్టు జరగడానికి ముందు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విప్ జారీ చేశారు. రూల్ ప్రకారం విప్ అమల్లో ఉండగా ప్రతి ఎమ్మెల్యే తమ పార్టీ సూచించిన వారికే ఓటెయ్యాలి, అంతేకాక అసెంబ్లీకి గైర్హాజరు కాకూడదు.  కానీ కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. దీంతో ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు స్పీకర్ కేఆర్ రమేశ్ వీరిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరు అందరూ బీజేపీలో చేరే అవకాశాలు ఉండటంతో వీరి అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యం. ప్రస్తుతం 105 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీకి ఎమ్మెల్యేల గైర్హాజరీతో ఇప్పటికైతే సభలో మెజార్టీ నిరూపించుకుంటుంది. కానీ సాధారణ మెజార్టీ రావాలంటే మాత్రం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం.  బీఎస్పీ, ఇండిపెండెంట్లకు ఈ అనర్హత వేట్లు పడే అవకాశం లేకపోవడంతో మరో ఐదు సీట్లను బీజేపీ గెలుచుకోవాలి. కానీ ఇప్పుడు జరిగిన ఈ అధికార అపహరణను ప్రజలందరూ చూశారు, సో ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన వారు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువ, బీజేపీ ఈవీఎం మాయా జాలం చేస్తే తప్ప ! దీంతో సంకీర్ణ సర్కారుకు పట్టిన గతే యడ్యూరప్ప ప్రభుత్వానికి పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఓవైపు అండగా బీజేపీ పక్షపాత గవర్నర్, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో కర్ణాటకలో యడ్యూరప్ప సర్కారు ఎలాగోలా పనిచేయచ్చు. చూడాలి మరి ఏమవుతుందో ? 

ఒక పరాజయం 100 తప్పులు.. ఏపీలో టీడీపీ ఓటమికి తెలంగాణలో పునాది!

  తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో టీడీపీ ఓటమికి పునాది వేసాయా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీని బ్రతికించడం కోసం బాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి.. ఏపీలో కూడా పార్టీని ప్రమాదంలో పడేశారని చెప్పక తప్పదు. అసలు టీడీపీని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా భావిస్తున్నారు. అలాంటిది మహాకూటమి పేరుతో బాబు కాంగ్రెస్ తో దోస్తీ చేయడంతో టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారనేది వాస్తవం. టీడీపీ, కాంగ్రెస్ ల దోస్తీ.. ఇరు పార్టీలకు తెలంగాణలో నష్టం చేయడమే కాకుండా.. ఏపీలో టీడీపీకి తీవ్ర నష్టం చేసిందనే చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రా పెత్తనం అంటూ బాబుని కార్నర్ చేసి కాంగ్రెస్ గట్టిదెబ్బ కొట్టారు. మరోవైపు అసలే తెలంగాణ టీడీపీ అంతంత మాత్రం ఉందంటే.. ఈ దోస్తీ మూలంగా మరికొందరు కూడా టీడీపీకి దూరమయ్యారు. ఈ దోస్తీ ఎఫెక్ట్ ఏపీలో కూడా బాగా పనిచేసింది. ఎందరో కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారు. అదేవిధంగా ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం ఉండటంతో బాబు మీద పడింది. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపారని.. ఏపీ ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత ఏర్పడింది.

బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్, పేపర్ !

  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కోట అని ఫీలవుతున్న తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ జోష్‌లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని అధికారంలోకి రావాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.  గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి పచ్చ జెండా ఊపారట. ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు.  అనంతర పరిణామాల్లో గులాబీ తీర్ధం పుచ్చుకున్న ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు కేసీఆర్. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేసి ఆ తర్వాత టీఅయేఎస్ లో చేరిన వెంకటేష్ కి టికట్ ఇచ్చారు.  ఆయన అలా ఇవ్వడానికి కారణం సామాజిక వర్గమే అయినా అప్పటి నుండి వివేక్ ఆ పార్టీకి దూరం అయ్యారు.  అలా కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌ కి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని అందుకే ఆహ్వానం రాగానే వీరు కాషయ కండువా కప్పుకునేందుకు సిద్దమయినట్టు చేబుతున్నరు. వివేక్ బీజేపీలో చేరితే వినోద్ కంటే భాజ‌పాకే ఎక్కువ లాభం ఉంది.  ఎందుకంటే తెలంగాణ‌లో భాజ‌పాకి సొంత మీడియా అంటూ ఇంత‌వ‌ర‌కూ ఏదీ లేదు. అధికార పార్టీకి కొన్ని మీడియా సంస్థ‌లు తమ సహాకారం అందిస్తుండగా, టీవీ 9 మాజీ సీఈవో పెట్టె కొత్త ఛానల్ బీజేపీకి సపోర్ట్ గా ఉంటుందని అనుకున్నారు. దానితో పాటు ఇప్పుడు వినోద్ రాక‌తో ఒక న్యూస్ ఛానెల్‌, ఒక ప‌త్రిక భాజ‌పాకి అండ‌గా నిలిస్తుందని చెప్పచ్చు. అండగా నిలుస్తుంది అనడం కంటే కూడా బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్ అయిన వీ6 ఛానెల్‌తోపాటు వెలుగు పత్రిక దొరికినట్టే. ఎందుకంటే వీటిని రన్ చేసేది వివేక్ కుటుంబీకులే. ఒకప్పుడు టీఆర్ఎస్ కి మద్దతుగా వార్తలు ప్రచురించిన ఈ రెండూ ఆ తర్వత న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. తాజాగా పరిణామాలతో ఆ రెండూ ఇప్పుడు బీజేపీకి బాకా ఊదనున్నాయన్నమాట !     

ఒక పరాజయం 100 తప్పులు.. 'రాజకోట' రహస్యం

  ఓ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్ తో సత్సంబంధాలు కలిగి ఉండటం చూస్తుంటాం. అయితే గత ఐదేళ్ళలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ తో బాబు సత్సంబంధాలు కొనసాగించలేదనేది వాస్తవం. నిజానికి నరసింహన్ కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమించబడ్డారు. అయితే 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ నియమించిన ఎందరో గవర్నర్లు మారిపోయారు కానీ.. నరసింహన్ మాత్రం అలాగే కొనసాగారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగారు. అప్పుడు బాబు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. నరసింహన్ తమకి అంత అనుకూలంగా లేరని కూడా తెలుసు. అయినా బాబు ఎందుకనో ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించండని బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అదే బాబు చేసిన తప్పని కొందరి అభిప్రాయం. తరువాత బాబు బీజేపీకి దూరమయ్యారు. నరసింహన్ మాత్రం బీజేపీకి దగ్గరై గవర్నర్ గా కొనసాగుతూ వచ్చారు. బాబు, గవర్నర్ ల మధ్య దూరం కూడా.. టీడీపీని అధికారానికి దూరం చేసి, ప్రతిపక్షానికి పరిమితం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గవర్నర్ తో సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాబుకి దూరమవ్వడంలో గవర్నర్ పాత్ర ఉందని కూడా ప్రచారం జరిగింది. ఓ రకంగా గవర్నర్ బాబుని ఒంటరిని చేసారని కూడా అంటుంటారు. ఈ అంశంపై పూర్తీ విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.

కేబినెట్ హోదా పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ...చంద్రబాబు ఏమంటారో ?

  అసెంబ్లీలో నియమించనున్న కమిటీలను ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించాల్సి ఉంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి సభ్యులను జగన్ నియమించినా ఛైర్మన్‌ ను మాత్రం ప్రతిపక్షం నుండి నియమించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో  పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ మొదలయ్యింది. ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని సమాచారం.  ప్రతిపక్షానికి దక్కే వాటిలో ఇది కీలక పదవి కావడంతో టీడీపీ అధినేత అన్ని రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మన్ అంటే మంత్రి పదవికి దాదాపు సమానం ఏపీలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని అంశాల్లో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అందుకే కేబినెట్ హోదా ఉండే ఈ పదవి కోసం టీడీపీలో పోటీ ఉందని అంటున్నారు.  ఇంతటి కీలకమైన పదవి కావడంతో టీడీపీ సీనియర్ నేతలు సైతం ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవి రేసులో నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మాజీమంత్రి అచ్చెన్నాయుడు,  సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరామ్, సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  అయితే అధినేత చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తిగా మారింది. తొలుత తెలుగుఎసం అధిఅకారంలోకి రాగానే వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఈ పదవిని, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రరెడ్డికి ఇచ్చింది, ఆయన పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరాక ప్రస్తుత ఆర్ధిక మంత్రి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఈ పదవిని అడ్డం పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని చాలా సార్లు కానర్ చేయడానికి చూసారు. అందుకే ఈసారి కూడా కాస్త పదునైన నేతకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు,

అమరావతికి వరల్డ్ బ్యాంక్ హ్యండిచ్చింది కేంద్ర ప్రభుత్వం వల్లనేనట....అందుకేనా ?

  ఏపీ రాజధాని అమరావతికి  ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీ రాజధాని నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. అయితే అలా ఎందుకు ఆపామో ప్రకటించక ముందే ఈ విషయం మీద రాజకీయంగా దుమారం రేగి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో వెనక్కు తగ్గిందని టీడీపీ ఆరోపించింది.  మరోపక్క గత ప్రభుత్వ తీరువలన విసిగిపోయి నందువలనే ప్రపంచ  బ్యాంకు ఋణం ఇవ్వడం లేదని వైసీపీ కౌంటరిచ్చింది. అయితే ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసుకున్నా ప్రపంచ బ్యాంక్ సహకారం లేకుండా అమరావతి నిర్మించడం దాదాపు అసాధ్యం, అందుకే ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంతగా ఆసక్తి చూపలేదని, కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.  అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని అందుకే తాము తప్పుకున్నామని తెలిపింది. అయితే రుణ సాయం చేయలేకపోయినప్పటికీ ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల రుణ సాయం యధావిధిగా కొనసాగుతోందని పేర్కొంది. వినూత్నమైన ఆలోచనలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్వయం సహాయక బృందాలు వంటి సరికొత్త ఆలోచనతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏపీ కితాబిచ్చిన్న వరల్డ్ బ్యాంక్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని స్పష్టత ఇచ్చింది.   అయితే కేంద్రం వ్యవహరిచిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఏపీతో తమకు అవసరం లేదు కాబట్టే  సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ బీజేపీవాదుల వాదన మరోలా ఉంది, అదేంటంటే ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ చేసి నిధులు ఇస్తామని అన్నదని అలంటి సంప్రదాయాన్ని అలవాటు చేస్తే అన్ని చోట్ల అలాగే ఇన్స్పెక్షన్ లు చేస్తారని అందుకే వద్ద్దని కేంద్రం పేర్కొందని అంటున్నారు. అయితే ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రపంచ బ్యాంకు ఋణం ద్వారా కట్టే ప్రాజెక్ట్ లు కడుతున్నట్టు అయితే, ఈ బ్యాంక్ ఇన్స్పెక్షన్ లకి భయపడాల్సింది ఏముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని మీద కేంద్రం సమాధానం ఏమని చెబుతుందో ? వేచి చూడాలి. 

అఖిలప్రియకి ఇంటిపోరు....తమ్ముడితో కూడా పోరాడాలా ?

  కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గం గా పేరొందిన ఆళ్లగడ్డలో రాజకీయాలు పలు కీలక మలుపులు తిరుగుతున్నట్టు చెబుతున్నారు. తల్లి మరణంతో వైసీపీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ స్థానం నుండి ఓడిపోయారు. గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.  ఆమె మాత్రమే కాక ఆమె సోదరుడు కూడా నంద్యాల నుండి పోటీ చేసి ఓడిపోవటంతో వారింట ముసలం పుట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికల ముందే ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరిపోయారు. అలాగే సొంత బాబాయ్ గా భావించే సుబ్బారెడ్డి కూడా తనకు ప్రాధాన్యత తగ్గించిన క్రమంలో వారి కుటుంబానికి దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ భార్గవ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నాక భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్టు సమాచారం.  అఖిలప్రియ భర్త అన్నీ తానై వ్యవహరించడం కూడా భూమా వర్గీయులను దూరంగా జరగడానికి కారణమైందని అంటున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కూతురిని వివాహం చేసుకున్న భార్గవ్ ఆ తర్వాత అఖిల ప్రియతో ప్రేమలో పడి ఆమెకి విడాకులు ఇచ్చి మరీ అఖిల ప్రియను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఆ విషయం పక్కన పెట్టినా ఆమెను వివాహం చేసుకున్న నాటి నుండే మంత్రి భర్తగా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు.  అధికారిక పర్యటనలు మొదలు పార్టీ పర్యటనల దాకా అఖిల్ వెన్నంటే ఉండేవారు. ఇదే భూమా వర్గీయులకి కోపం తెప్పించిందట. భూమా తర్వాత భూమ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డిని తెరమీదకు తేవాలని భూమా వర్గం భావిస్తోంది, కానీ అఖిలప్రియ భర్త హోదాలో భార్గవ్ తానే భూమా వారసుడిననేలా ప్రవర్తిస్తుండడంతో అఖిలప్రియకు బదులుగా భూమా వర్గాన్ని లీడ్ చేసేందుకు విఖ్యాత్ రెడ్డిని, అలాగే వీరికి సోదరుడు వరసయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి వచ్చారు.  ఇప్పటికే వైసీపీలో గంగుల వర్గం ఉంది కాబట్టి, కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి భూమా లీగసీని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో అఖిలప్రియకు ఇప్పుడు ఆమె సోదరుడు కిషోర్ కుమారే పోటీ అని భూమా వర్గం భావిస్తుందట. విఖ్యత్ రెడ్డి ప్రస్తుతం చదువుకుంటున్నాడు, ఆయన లైన్ లోకి వచ్చే దాకా కిషోర్ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.    

లోకేష్ కి బిగుస్తున్న ఉచ్చు....అరెస్ట్ చేస్తారా ?

  ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ గత ఏడాది సెప్టెంబర్ లో అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు మీదా ఐటీ శాఖామంత్రిగా ఉన్న ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ మీద హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌ కుమార్‌ అప్పట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గత టర్మ్ లో ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్‌ గా ఉన్న వేమూరి రవికుమార్‌, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డిలకి కూడా ఈ అవినీతి కుంభకోణంలో హస్తం ఉందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, దీని ద్వారా లబ్ది పొంది భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని అప్పట్లో పిటిషనర్ పేర్కొన్నారు. కనీస అర్హత కూడా లేని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగేళ్లుగా కార్యకలపాలు చేపట్టలేదని పిటిషన్‌లో వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్‌ ప్రోకోపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే ఈ విషయం మీద పూర్తి వివరాలతో అంటే ఆరోపణలు చేస్తున్న కంపెనీల పూర్తి వివరాలతో మళ్ళీ రమ్మని కోర్టు పేర్కొనడంతో అసలు ఆర్టీఏ ద్వారా సమాచారం కోరినా తనకు ఆ వివరాలు ఇవ్వడం లేదని పిటిషనర్‌ హైకోర్టుకు విన్నవించుకుని కేసు ఉపసంహరించుకున్నారు.  ఈ విషయం మామూలు వార్తలాగా వచ్చి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతామారిపోయి జగన్ సీఎం కావడంతో లోకేష్ అవినీతిని జగన్ సర్కార్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ మధ్యనే పార్టీ మారి కాషాయం కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ హైలైట్ చేశారు. లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందనే విషయం మీద విచారణ చేపట్టమని కోరేందుకు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తానని ఆయన చెప్పారు.  కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. లోకేష్‌ తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పిన ఆయన లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని అన్నారు. ఇక త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని అది కూడా లోకేష్ కారణంగానే జోస్యం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే గత ప్రభుత్వ అవినీతి కోసం భూతద్దం వేసుకుని మరీ వెతుకున్న జగన్ కి ఊతం ఇచ్చినట్టు అవుతుంది.  వెదకబోయే తీగ కాలికి తగిలినట్టు జగన్ కి లోకేష్ అవినీతి కేసు దొరికిందని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా అవినీతి జరిగిందా ? లేదా అనేది పక్కన పెడితే ఈ విషయం మళ్ళీ హైలైట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ యంత్రాంగం, బీజేపీ కలిస్తే లోకేష్ ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమకి ఎదురుతిరిగిన వారికి షా-మోడీలు ఎంత వరకూ చుక్కలు చూపిస్తారో లాలూ వంటి వారి విషయంలో చూశాం కదా.  

జగన్ పట్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. ఇందుకేనా గెలిచింది?

  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ప్పటి నుండి అవినీతిలేని పాలన అందిస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. అయితే తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ‘ఎన్నికల్లో అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చుపెట్టుకున్నాం. తీరా గెలిచాక పైసా తీసుకోవద్దంటున్నారు. ఇలా అయితే ఇక రాజకీయాలు చేసినట్టే.’ అని కొందరు ఎమ్మెల్యేలు తెగ ఫీలై పోతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు అవినీతికి పాల్పడినా సహించబోనన్న జగన్ నిర్ణయం వారికి ఇబ్బందికరంగా మారిందట. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్న జగన్.. ఎమ్మెల్యేలు, మంత్రుల లావాదేవీలపై దృష్టిసారిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకున్న నలుగురు మంత్రులకు జగన్ ఇప్పటికే ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే బాటలో సీఐల బదిలీల్లో రూ.10 లక్షలు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించుకుని మరీ సదరు సీఐకి డబ్బులు వెనక్కి ఇప్పించారు. సీఐల బదిలీల్లో పది లక్షలు రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యే నుంచి జగన్ డబ్బులు వెనక్కి ఇప్పించడం ఇప్పుడు ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోందట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యం అన్న వాదన స్ధిరపడిపోయింది. ఏపీలో ఇటీవల ఎన్నికల్లో కూడా సగటున ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అభ్యర్ధి దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు ఓ అంచనా. చాలా మంది పొలాలు, స్ధలాలు అమ్ముకుని, కొందరైతే అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తన హయాంలో అవినీతి రహిత పాలన సాగాలన్న జగన్ నిర్ణయం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక కాంట్రాక్టులు, పైరవీల ద్వారా ఎంతో కొంత సంపాదించుకుందామనుకుంటున్న సమయంలో.. జగన్ ఇలాంటి అవినీతి రహిత పాలన నిర్ణయం తీసుకోవడం కొందరు ఎమ్మెల్యేలకు రుచించడం లేదట. ఇదే పరిస్ధితి కొనసాగితే ఇక రాజకీయాల్లో కొనసాగడం కూడా కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టింది అధికారంలోకి వస్తే తిరిగి సంపాదించుకునేందుకేనని, ఇప్పుడిలా ఆంక్షలు విధిస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు ఇంటిలిజెన్స్ వర్గాలతో తెప్పించుకుంటున్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాలతో పాటు సచివాలయంలో సైతం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఐదారుగురు మంత్రులు, వారి వద్ద పనిచేస్తున్న సిబ్బంది చేస్తున్న దందాలు జగన్ దృష్టికి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ వారి విషయంలో సీరియస్ గా ఉన్నారట. ఇదే పరిస్ధితి కొనసాగితే కఠిన చర్యలకు వెనుకాడేది లేదనే హెచ్చరికలు కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.