మండలి రద్దయితే... పిల్లి, మోపిదేవి పరిస్థితేమిటి?

మండలిలో పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే... కౌన్సిల్ రద్దు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో... తెలుగుదేశానికి రుచి చూపించాలన్న పట్టుదలతో... జగన్మోహన్ రెడ్డి ఉన్నారని... దాంతో, మండలి రద్దు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో జగన్ పట్టుదలకు పోతేమాత్రం మండలి రద్దు తప్పదంటున్నారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విశ్లేషించిన మీడియా, రాజకీయ విశ్లేషకులు సైతం మండలి రద్దు ఖాయమనే చెబుతున్నారు. అయితే, పట్టుదలకుపోయి మండలిని రద్దుచేస్తే, ముందుముందు జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. మరి, వీళ్లందరికీ ఏం సమాధానం చెబుతారు... ఏవిధంగా పదవుల్లో అకామిడేట్ చేస్తారనేది ప్రశ్నార్ధకమే. హామీలు పొందినవాళ్ల సంగతి పక్కనబెడితే... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న 9మంది తమ పదవులు కోల్పోయి రాజకీయ నిరుద్యోగులు మారతారు. ముఖ్యంగా శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.  అయితే, మండలి రద్దయితే, ఇప్పటికిప్పుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు వచ్చే ముప్పు లేకపోయినా, ఆరు నెలలు తర్వాత మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈలోపు... ఏవైనా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలొచ్చి... ఎమ్మెల్యేలుగా గెలిస్తే తప్ప.... వీళ్లిద్దరూ మంత్రి పదవుల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సుండదు. అయితే, ఏపీలో ప్రస్తుతం ఉపఎన్నికలు జరిగే పరిస్థితే లేదు. దాంతో, మండలి రద్దు జరిగితే మాత్రం ఆర్నెళ్ల తర్వాత కచ్చితంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు మాజీలుగా మారిపోతారు. అయితే, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు... వైఎస్ కుటుంబానికి ఎంతో నమ్మకస్తులు. పైగా ఎప్పట్నుంచో వైఎస్ ఫ్యామిలీతో అసోసియేటై ఉన్నారు. అదే సమయంలో జగన్ కు కూడా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. అందుకే, మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ ది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అయితే, మండలి రద్దయి ఆర్నెళ్ల తర్వాత మాజీలుగా మారితే... వీళ్లిద్దరికీ కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టొచ్చని అంటున్నారు.

విశాఖకు రాజధాని తరలిస్తే ఇంత నష్టమా? కలలో కూడా ఊహించలేరు!!

ఏపీ రాజధానిని మూడు భాగాలుగా విభజించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుండా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. అయితే ఈ మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించడం అంటే.. పసి పిల్లాడిని పెంచి పెద్ద చేయడం లాంటిది. పిల్లోడు పుష్టిగా పెరగాలంటే టైంకి పాలు, ఫుడ్, నీళ్లు సరిగ్గా అందించాలి. అలా కాకుండా పాలు ఒక దగ్గర, ఫుడ్ ఒక దగ్గర, నీళ్లు మరో దగ్గర అంటూ.. అటు ఇటు తిప్పితే పిల్లోడి ఎదుగుదలకే ప్రమాదం. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించి అభివృద్ధికి బలమైన పునాది వేయాలి. ఆ రాజధాని మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేయాలి. దానిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేకాని ఇలా పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల ఒరిగేదేమి లేదు. ఇలా మూడు నాలుగు రాజధానుల అనుకంటూ పొతే.. ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా పోతుంది. ఎక్కడా పూర్తిగా అభివృద్ధి జరగదు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపవు. మన దేశంలోని పలు రాష్ట్రాలను తీసుకోండి. వాటికంటూ రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాతే.. రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేసుకున్నాయి. తమిళనాడుని తీసుకోండి. రాజధాని చెన్నైని బాగా అభివృద్ధి చేసుకుంది. దాంతో పాటే కోయంబత్తూర్, తిర్పూర్, ట్రిచీ, సేలం ఇలా ఎన్నో నగరాలను అభివృద్ధి చేసుకుంది. మహారాష్ట్రని తీసుకుంటే ముంబై, నాగపూర్, పూణే ఇలా ఎన్నో నగరాలు అభివృద్ధి చెందాయి. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణను తీసుకుంటే.. తెలంగాణకు ఆదాయం తెచ్చే కామధేనువు హైదరాబాద్. రాష్ట్రానికి భారీగా ఆదాయం తెచ్చే పునాది హైదరాబాద్ ఉంది కాబట్టే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలలో.. ఐటీ హబ్ లు, మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాలు.. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని అభివృద్ధి చేసుకొని.. ఆ తరువాత రాష్ట్రంలోని మిగతా నగరాలని అభివృద్ధి చేసుకొని దూసుకుపోతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానులు పేరుతో.. అసలు ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా చేస్తోంది. హైదరాబాద్ కి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. వసతులు, ఆదాయ వనరులు ఉండటంతో.. లక్షల్లో ప్రజలు హైదరాబాద్ కి వలస వచ్చారు. ఇప్పుడు ఏపీలో ప్రాంతానికో రాజధాని పెట్టుకుంటే పొతే.. పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. ఈ మూడు రాజధానుల వల్ల ఏపీకి ఆదాయం తగ్గిపోవడమే కాదు.. భారీగా ఆర్ధిక భారం కూడా పడనుంది. గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖల కోసం పలు భవనాలు నిర్మించింది. అధికారులు, ఉద్యోగుల వసతి కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ పరిపాలనను విశాఖకు మారిస్తే.. కొత్తగా భవనాలు నిర్మించాలి, ఉద్యోగులకు వసతి కల్పించాలి. ఇదంతా ఆర్ధిక భారం కాదా? వివిధ శాఖలను తీసుకుంటే విశాఖకు తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు సుమారుగా లక్షమంది ఉంటారు. ఈ ఉద్యోగులందరికీ విశాఖ వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్రత్యేక గృహనిర్మాణ భత్యం (హెచ్‌బిఎ) ఇవ్వనుంది. ఇళ్ళు నిర్మించే వరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ .50 వేల నుండి గరిష్టంగా లక్ష రూపాయల వరకు షిఫ్టింగ్ భత్యం ఇవ్వనుంది. 1) ఒక్కొక్కరికి 200 గజాల ప్లాటు గవర్నమెంటు రేటు వైజాగ్ లో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు. అంటే 1,00,000x 200x 21,000 = 42,000 కోట్లలుతుంది. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టడటం సాధ్యం కాదన్న వారు.. కేవలం ఉద్యోగుల స్థలాల కోసం 42 వేల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? సరే ఎక్కడో సిటీకి దూరంగా ఇచ్చినా గజం రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు. పోనీ గజం 5,000 తీసుకున్నా.. 10,000 కోట్లు ఖర్చవుతుంది. 2) ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యం. 1,00,000 x 25,00,000 = 25 వేల కోట్లు 3) షిఫ్టింగు భత్యం 50,000 నుండి లక్ష వరకు. సగటు గా ఒక్కొక్కరికి 75,000 అనుకుంటే 1,00,000 x 75,000 = 750 కోట్లు అంటే కేవలం ఉద్యోగుల కోసమే దాదాపు 50 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఇంకా అయిపోలేదు. పలు శాఖల భవనాలు కూడా ఉన్నాయి. * విజయవాడలో 4 లక్షల చదరపు అడుగులలో వంద కోట్ల ఖర్చుతో R&B భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో వంద కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 2 లక్షల చదరపు అడుగులలో 108 కోట్ల ఖర్చుతో ఏపీఐఐసీ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 108 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో లక్ష చదరపు అడుగులలో 40 కోట్ల ఖర్చుతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 40 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * విజయవాడలో లక్ష చదరపు అడుగులలో 143 కోట్ల ఖర్చుతో విద్యుత్ సౌధ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 143 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో శాసనసభ, శాసనమండలి మరియు సచివాలయం భవనాలకు కలిపి నిర్మాణానికి సుమారు 500 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు మళ్లీ విశాఖలో సచివాలయం కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడతారు? * గొల్లపూడిలో 30 వేల చదరపు అడుగులలో నాలుగున్నర కోట్ల ఖర్చుతో దేవాదాయ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో 58 కోట్ల ఖర్చుతో కమాండ్ కంట్రోల్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 58 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 65 వేల చదరపు అడుగులలో 19 కోట్ల ఖర్చుతో ఏపీ పోలీస్ టెక్ టవర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 19 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? అమరావతిలో ఎన్నో భవనాల నిర్మాణం జరిగింది. వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజధానిని తరలించాలని నిర్ణయించింది. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఖర్చుతో రాజధానిని తరలిస్తే.. అదంతా ప్రభుత్వం మీద భారం కాదా? ప్రజా ధనం వృధా కాదా?. ఇప్పటికైనా ఆలోచించండి.

అప్పుడు పవన్ చెప్పింది వినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా?

కీడు ఎంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సమయంలో 2015 లో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట గుర్తుచేశారు. "అనేక వేల మంది రైతులు.. వారి నమ్మకాన్ని, వారి భవిష్యత్తుని, వారి పిల్లల భవిష్యత్తుని టీడీపీ ప్రభుత్వం చేతుల్లో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి?. కీడు ఎంచి మేలెంచమంటారు కదా. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాలేదు అనుకున్నాం. అప్పుడు మంత్రి నారాయణ ఉండరు, పత్తిపాటి పుల్లారావు ఉండరు. మరి రైతుల పరిస్థితి ఏంటి?. వారి భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి?. వారు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తున్నారు.. కానీ ఆ నమ్మకానికి గ్యారంటీ ఏంటి?" అని పవన్ ప్రశ్నించారు. పవన్ అనుమానమే నిజమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. రైతులు పెట్టుకున్న నమ్మకం కన్నీటి పాలైంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైపు అడుగులు వేస్తోంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంచి.. మిగతా పరిపాలన విభాగమంతా విశాఖకు తరలిస్తోంది. దీంతో రైతులు, మహిళలు.. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారు ఎంత గొంతు చించుకున్నా, ఎంత కన్నీరు పెట్టుకున్నా ఏం లాభం?. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోంది. అప్పుడు టీడీపీ నేతలు.. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం.. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రాకెట్ లా దూసుకుపోతుందని చెప్పారు.. ల్యాండ్ పూలింగ్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా వంటివారు.. ల్యాండ్ పూలింగ్ లో ప్రధాన పాత్ర పోషించారు. మీ భవిష్యత్తు ఆకాశాన్ని తాకుతుంది అంటూ.. రైతుల దగ్గర నుండి వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? పవన్ అనుమానించినట్టుగానే.. టీడీపీ అధికారంలోకి రాలేదు. రైతుల నమ్మకానికి గ్యారంటీ ఏంటని పవన్ ప్రశ్నించినట్టుగానే.. వారి నమ్మకం దుఃఖంగా మారింది. ఇప్పుడు రైతులు రాజధానిని తరలించొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు రైతులకు మాటలు చెప్పి భూములు తీసుకున్నవారు ఏమైపోయారు?. ముఖ్యంగా 'ల్యాండ్ పూలింగ్' అనే సినిమాకి తానే 'స్టోరీ-డైలాగ్స్- స్క్రీన్ ప్లే- డైరెక్షన్' అన్నట్టు ఫీలైన మాజీ మంత్రి నారాయణ ఏమైపోయారు?. అప్పుడు రైతులు భూములు ఇచ్చేవరకు తిరిగారు కాదా.. మరి ఇప్పుడు అదే రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే.. వారి పక్షాన పోరాడరా?. ఏమైపోయారు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలు?. దేవినేని ఉమా వంటి వారు అప్పుడప్పుడు బయటికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు కానీ.. నిజంగా రైతులకు మేమున్నామన్న ధైర్యం ఇస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారా? లేదు. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో.. రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడించాలని టీడీపీ ప్లాన్ చేసింది. కానీ ఏమైంది? టీడీపీ నేతలు ఎంతమంది పాల్గొన్నారు?. ఎవరికివారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే చాలు, మేం ఉద్యమంలో పాల్గొన్నట్టే అని ఫీలయ్యారు. ఈ తూతూ మంత్రం పోరాటాలు వల్ల ఒరిగేది ఏంటి?. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనని హౌస్ అరెస్ట్ చేస్తారని ముందే తెలిసి.. సీక్రెట్ గా ఒక చోట దాక్కొని, పోలీసుల కళ్ళు గప్పి సడెన్ గా ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యారు. అలాంటి దూకుడు ఏపీ టీడీపీ నేతల్లో కరువైంది. ఎలాగూ హౌస్ అరెస్ట్ చేస్తారు.. ఇంట్లోనే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిగా అన్నట్టుంది నేతల తీరు. ఎంపీ గల్లా జయదేవ్ మాత్రమే దూకుడు కనబరిచారు. కొందరి నేతల్లా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయకుండా.. పొలాల వెంట, గుట్టల వెంట నడిచి.. రైతులకి అండగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మరి మిగతా నేతలు ఏం చేస్తున్నారు? అప్పుడు రైతుల పొలాలు తీసుకున్నారు. ఇప్పుడు రైతుల కోసం పోరాడలేరా?

అప్పుడు విశాఖ వైపు కన్నెత్తి చూడని జగన్.. ఇప్పుడు మంచి చేస్తాడంటే నమ్మాలా?

కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది.  అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

పవన్ మళ్లీ మళ్లీ అదే తప్పు... పార్టీ బ్రతకాలని లేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. 2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.

చంద్రబాబు నెత్తిన పాలు పోసిన వైఎస్ జగన్!!

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ దూకుడు ముందు నిలబడలేక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇది మామూలు ఓటమి కాదు. టీడీపీ పునాదులనే కదిలించిన ఓటమి. అసలు ఈ ఓటమి నుండి టీడీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ క్యాడర్ లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మరోవైపు వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ నాయకత్వం, కేడర్ నూతనోత్సాహంతో పరుగులు పెట్టింది. 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ జోరు చూసి.. వైఎస్ జగన్ కి ఇక తిరుగులేదు అనుకున్నారంతా. ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు.. ఇక ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవాల్సిన పనికూడా లేదు. జగన్ కూల్ గా తనపని తాను చేసుకుంటూ పొతే చాలు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచి సీఎం అయిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ ఇప్పట్లో ఆ ఓటమి నుండి కోలుకొని జగన్ ని దెబ్బకొట్టే అవకాశమే లేదు అనుకున్నారంతా. కానీ జగన్ మాత్రం తనంతట తానే టీడీపీకి త్వరగా కోలుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు, ఇసుక కొరత.. ఇలా కొన్ని సందర్భాలలో టీడీపీకి స్వరం వినిపించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అయితే ఘోర ఓటమిలో కూరుకుపోయిన టీడీపీని ఇవేవి చెయ్యి పట్టి పైకి లాగలేకపోయాయి. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం రూపంలో టీడీపీకి ఓ వరం లభించింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించేలా చేసింది. రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ.. వారు గొంతెత్తి నినదిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా పిడికిలి బిగించి పోరాడుతున్నారు. వారికి టీడీపీ పూర్తిగా అండగా నిలబడింది. టీడీపీ నాయకత్వం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మేమున్నామన్న భరోసా ఇస్తోంది. ఇన్నిరోజులు ఓటమి చీకటిలో మగ్గిపోయిన టీడీపీ రేపటి వెలుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. కార్యకర్తలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి టీడీపీ మళ్లీ ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టింది. ఒక్కోసారి మనం వేసే ఒక్క అడుగు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ అలాంటి అడుగే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అంటున్నారు. తెలుగువన్ సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.  రాజధాని తరలింపు ప్రతిపాదనతో... కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమ ప్రజల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే తమకి బాగా దూరమువుతుందన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు టీడీపీకి కలిసొస్తున్నాయి. రాజధానిపై పోరాటంతో టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చిన్న పెద్ద నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు రైతులు వెంట పోరుబాట పట్టారు. దీంతో ఆకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్న రైతులకు పసుపు పచ్చ జెండా అండగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. మొత్తానికి.. 151 సీట్లతో ఘనంగా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రశాంతంగా ఉండకుండా.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చి.. టీడీపీకి పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేసిన ఈ ఒక్క రాంగ్ స్టెప్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసి.. వైసీపీ వారిని తలలు పెట్టుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మూడు రాజధానుల వెనుక ముగ్గురు వ్యక్తులు.. బాబు నిలబడటం కష్టమే!!

గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు అంశం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తుండటంపై.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ అమరావతి ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంత వాసుల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే బాగా దూరం అవుతుందనే అసంతృప్తి ఉంది. రైతుల నుండి తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. కమిటీల పేరుతో ముందుకెళ్తోంది. మరోవైపు ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుండి సరైన స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే గొప్ప నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. అయినా బీజేపీ నుండి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవట్లేదు. దీనినిబట్టి చూస్తుంటే.. అసలు జగన్ ఇంత దూకుడుగా వెళ్లడం వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ లేకుండా అంత తేలికగా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. దీంతో ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న ఒకేఒక బలమైన శత్రువు కాంగ్రెస్. కాబట్టి  కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే పని బీజేపీ ఎప్పటికీ చేయదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. టీడీపీ కేవలం అమరావతి ప్రాంతానికి చెందిన పార్టీ అనే ముద్ర వేసి.. మిగతా ప్రాంతాల్లో బీజేపీ బలపడాలని చూస్తోందట. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఓటమి నుండి టీడీపీని కోలుకోకుండా చేసి.. టీడీపీ ప్లేస్ ని బీజేపీ భర్తీ చేయాలని అనుకుంటుందట. మరోవైపు వైసీపీ కూడా టీడీపీని పూర్తిగా దెబ్బ కొట్టాలని చూస్తోంది. అసలు టీడీపీ, చంద్రబాబు వంటి మాటలు భవిష్యత్తులో వినపడకూడదు అనేలా చేయాలనుకుంటోంది. దానిలో భాగంగానే జగన్.. రాజధాని తరలింపుకు శ్రీకారం చుట్టారు అంటున్నారు. అమరావతిని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేసి, దానిని ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. కానీ ఆ దిశగా అడుగులు వేసేలోపే ఆయనకు అధికారం దూరమైంది. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన అమరావతిని ఎంత బాగా డెవలప్ చేసినా.. ముందుగా జనాలకు గుర్తొచ్చే పేరు మాత్రం చంద్రబాబు. అందుకే ఆ పేరు వినపడకూడదనే రాజధాని తరలింపు లాంటి పెద్ద నిర్ణయం జగన్ తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని తరలింపు వెనుక కారణం ఏదైనా.. పైకి మాత్రం రాజధానిగా అమరావతి సరైన ప్రాంతం కాదని, ఒక కులానికి చెందిన రాజధాని అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. గతంలో విశాఖ, కర్నూల్ తుఫాను-వరదలతో అల్లాడిపోయాయి కానీ అమరావతి కాదు. ఇక CRDA భూ యజమానులు లిస్ట్ చూస్తే అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. అయినా కుల ముద్ర వేస్తున్నారు. నిజానికి అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దానినో పవిత్ర ప్రాంతంగా భావిస్తున్నారు. అదీగాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరం ఉంది. ఇలా అనేక కారణాల చేత అప్పుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆ ఎంపికే తప్పు అంటున్నారు. నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అనుకోవడంలో తప్పు లేదు. రాజధానితో పాటు కొన్ని నగరాల్ని అభివృద్ధి చేయవచ్చు. తమిళనాడులో రాజధాని చెన్నైతో పాటు.. కోయంబత్తూర్, సేలం, వెల్లూర్ వంటి ఎన్నో నగరాలను అభివృద్ధి చేశారు. కానీ జగన్ సర్కార్ మాత్రం రాజధాని తరలించడం, విడదీయడమే అభివృద్ధి అనుకుంటోంది. ఇలా చేయడం వల్ల ఏపీకి అంటూ ఒక పెద్ద నగరం లేకుండా పోతుంది. ఇదంతా చూస్తుంటే.. కేవలం అమరావతి అంటే చంద్రబాబు బ్రాండ్ అనే ముద్ర ఉంటుందనే కారణంతోనే జగన్ రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రాజధాని తరలింపుతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో ప్రజలు రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ ప్రజలు కూడా విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తమకి బాగా దూరమవుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని తరలింపు వార్తలను జీర్ణించుకోలేక పలువురు రైతులు గుండె పోటుతో మరణించారు కూడా. ఇంత జరుగుతున్నా బీజేపీ నుండి సరైన స్పందన లేదు. రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలోని అంశమని ఒకరు, మూడు రాజధానులు వస్తే మంచిదే అని మరొకరు.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కాని ఇది ప్రధాని మోడీ భూమి పూజ చేసిన రాజధాని అంటూ.. అమరావతి కోసం ఒక్కరు కూడా బలంగా పోరాడటం లేదు. బీజేపీ మౌనంగా ఉండటం చూస్తుంటే.. ఈ రాజధాని మార్పు వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై ఇంత రగడ జరుగుతుంటే స్పందించని బీజేపీ.. మత పరమైన రాజకీయాలు అంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది. వైసీపీపై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోంది. తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని, దేవాలయాల సొమ్ముని పాస్టర్లకు దోచి పెడుతున్నారని ఇలా రకరకాలుగా వైసీపీ మీద విమర్శలు చేస్తోంది. అయితే ఇలా కావాలనే వైసీపీ పై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోందని అంటున్నారు. ఈ ప్రచారం వల్ల క్రిస్టియన్స్ అందరూ వైసీపీకి దగ్గరైతే.. నార్త్ ఇండియాలో జరిగినట్టుగా.. హిందువులు బీజేపీ వైపు వస్తారని బీజేపీ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ రిలీజియన్ సెంటిమెంట్ తో అటు వైసీపీ, ఇటు బీజేపీ రెండు పార్టీలు లాభపడి.. టీడీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి అంటున్నారు. మొత్తానికి మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జగన్ నడుస్తున్నారని.. ముగ్గురూ కలిసి ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రైతుల తరపున భువనేశ్వరి పోరాటం... లోకేష్ ని తప్పించడానికేనా?

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదంటూ.. అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మద్దతుగా నిలుస్తూ పోరాడుతోంది. ఈ పోరాటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాలుపంచుకున్నారు. తాజాగా భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలపటమే కాకుండా, రైతుల కోసం అమరావతి పరిరక్షణ సమితికి ఖరీదైన తన బంగారు గాజులు విరాళంగా కూడా ఇచ్చారు. అయితే భువనేశ్వరి ఉన్నట్టుండి.. ఇలా రైతుల కోసం ప్రత్యక్షంగా పోరాటంలో పాలుపంచుకోవడం వెనుక.. రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. చంద్రబాబు తరువాత ఆయన కుమారుడు లోకేష్ టీడీపీని నడిపిస్తారని మొదట్లో పార్టీ శ్రేణులు భావించాయి. కానీ లోకేష్ పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులకు నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ముఖ్యంగా మాటతీరు లోకేష్ కు పెద్ద సమస్యగా మారింది. ఆయన తెలుగు పదాలు పలకడంలో కాస్త ఇబ్బందిపడతారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు పప్పు అంటూ ఆయనను బాగా టార్గెట్ చేశాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడంలో, ప్రత్యర్థి పార్టీల మీద ఎదురుదాడి చేయడంలో లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. ఇక కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంలో కూడా లోకేష్ వెనకబడిపోయారు. ఒకరిద్దరిని పక్కన తిప్పుకోవడం తప్ప.. భవిష్యత్తు నేతనన్న భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనస్సు గెలుచుకోలేకపోయారు. ఇలా పలు కారణాల వల్ల చంద్రబాబు తరువాత టీడీపీ ని నడిపించే నేత లోకేష్ అనే భరోసా ఆ పార్టీ కార్యకర్తల్లో కలగలేదు. దీంతో చంద్రబాబు రిటైర్మెంట్ తరువాత పార్టీ నడిపించేది ఎవరనే ప్రశ్న పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అయితే ఆ లోటుని భర్తీ చేయడానికే చంద్రబాబు.. భువనేశ్వరిని రంగంలోకి దింపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరి అంటే తెలుగు ప్రజలకు గౌరవముంది. ఆమె మంచి వాగ్దాటి కూడా. గతంలో ఆమె పలు సందర్భాల్లో ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. తాజాగా అమరావతిలో కూడా ఆమె ప్రసంగం ఆకట్టుకుంది. మాకు కుటుంబం కంటే.. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల క్షేమమే ముఖ్యమంటూ సెంటిమెంట్ ని రగిల్చేలా మాట్లాడారు. ఆమె ఇలానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపిస్తూ ఉంటే.. టీడీపీ భవిష్యత్తు సారథిగా ఆమెపై పార్టీ శ్రేణులకు నమ్మకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఎన్టీఆర్ కుమార్తెగా, ఇటు చంద్రబాబు సతీమణిగా.. ఆమెకు కార్యకర్తలు బ్రహ్మరధం పట్టే అవకాశముంది. అంతేకాదు ఆమె ప్రసంగం మహిళలను కూడా ఆకట్టుకునేలా ఉంది. అదీగాక ఆమె మీద గౌరవంతో అంత త్వరగా ప్రత్యర్థులు విమర్శలు కూడా చేయకపోవచ్చు. ఇలా ఆమెకి పలు అంశాలు కలిసొస్తున్నాయని అంటున్నారు. అందుకే, ఆమె ఇలాగే ముందుకెళ్తే టీడీపీ భవిష్యత్తు సారధి అయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పై వస్తున్న విమర్శలకు బ్రేకులు వేయాలన్నా, పార్టీ భవిష్యత్తు గురించి కార్యకర్తల్లో భరోసా కల్పించాలన్నా.. భువనేశ్వరిని తెరపైకి తీసుకురావడం కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఆమె అమరావతి రైతుల తరపున పోరాటంలో పాలుపంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో టీడీపీని నడిపించే బాధ్యతని భువనేశ్వరి తీసుకుంటారేమో చూడాలి.

విశాఖకు రాజధాని మార్పు కేవలం భూముల కోసమేనా?

విశాఖకు రాజధాని మార్పు అన్న విషయం కొందరికి ఆనందాన్ని ఇస్తే, మరికొందరికి తీవ్ర నిరాశను ఇస్తొంది. రాజధాని ప్రకటన రాగానే విశాఖలో భూముల మాయాజాలం మొదలైంది. నిషేధిత 22 ఎ జాబితాలో ఉన్న భూములకు రెక్కలొస్తున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కాదని కొత్తగా వచ్చిన అభ్యర్థులకు ల్యాండ్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. జిల్లా యంత్రాంగం కాదూ కూడదు అని స్పష్టం చేసినా ఏకంగా సచివాలయం స్థాయి నుంచే ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. సర్కార్ కు సన్నిహితులైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు లభిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఐదారు దరఖాస్తులను నేరుగా అమరావతి నుంచే పరిష్కరించినట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మరో ఇద్దరు నేతలకు లబ్ధి చేకూరినట్టు సమాచారం. జిల్లాలో 22ఎ జాబితాలో నమోదైన భూములపై సుమారు 2,200 దరఖాస్తులొచ్చాయి.2018 నుంచి ఇప్పటి వరకు వస్తున్న దరఖాస్తులను జిల్లా యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలించి పక్కా ఆధారాలు ఉంటేనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా ఒక 1,800 దరఖాస్తుల పరిష్కరించినట్టు సమాచారం. 22 ఏ లో చేర్చిన వాటిలో ఎక్కువ భాగం భూ సేకరణలో ఉన్న స్థలాలే ఉన్నాయి. ప్రజావసరాలకు సేకరించిన భూమికి సబ్ డివిజన్ చేయాలి. లేకపోతే సర్వే నెంబరు మొత్తం ప్రభుత్వ భూమిగా నమోదు అవుతుంది. జిరాయితీ భూమికి ఆనుకొని గోర్జి, గెడ్డ పోరంబోకు చెరువులను ఆక్రమించుకుని కొందరు విక్రయాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి భూములను కూడా 22 ఏ కింద చేర్చుతుంటారు.వాటిని నిషేధిత జాబితా నుంచి తప్పించాలంటే ఆక్రమణకు గురై భూమిని సర్వే చేసి మిగిలిన జిరాయితీ భూమిని యజమానికి బదలాయిస్తారు. జిల్లాలో భూములకు విలువ పెరగటంతో 22ఏ కింద చేర్చిన భూములకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.వీటి విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తుంటారు.  నగరంతో పాటు విశాఖ రూలర్, భీమిలి, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, గాజువాక,పరవాడ, అనకాపల్లి మండలాల్లో 22 ఏ దరఖాస్తుల అధికారుల పై తీవ్ర ఒత్తిడి ఉంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 22ఎ జాబితాలో నమోదైన భూముల మినహాయింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి వాటికి సంబంధించిన సమాచారం కోరినపుడు అదే విషయాన్ని నివేదించారు. అయితే అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి అమరావతి నుంచి ఫైళ్లను పంపించినట్లు సమాచారం.రెండో సారి కూడా అధికారులు సదరు ఫైళ్లను తిరస్కరిస్తూ మళ్లీ ప్రభుత్వానికి పంపారు. ఉన్నత స్థాయి వ్యక్తులు రంగ ప్రవేశం చేసి 22 ఏ నుంచి మినహాయించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఆ ఆదేశాలను అమలు చేయటానికి అధికారులు నానా అవస్తలు పడుతున్నట్టు సమాచారం.ముడసర్లోవ, మర్రిపాలెం, మాధవధార, పెదవాల్తేరు, పోతినమల్లయ్యపాలెంతో పాటు రెండుచోట్ల ఇరవై రెండు ఏళ్ల ఉన్న భూముల కు మినహాయింపు సాధించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీని పై స్పందించేందుకు జిల్లా అధికారులు ఎవరూ సమాధానం ఇవ్వట్లేదు. ఒకటి రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తులను కాదని ఇటీవల వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి, ఇరవై రెండు ఏ లో చేర్చిన భూములు రాయితీలో ఉన్నాయా లేదా అనేది బహిరంగం గా విచారణ చేపట్ట కుండా హడావిడిగా ఫైళ్లు తప్పించుకోవటం వెనుక ఏం జరిగింది ఇప్పుడు ఇదే చర్చ నీయాంశంగా మారింది.అసలు అత్యవసరంగా విశాఖ భూముల పై ప్రభుత్వానికి దృష్టి ఎందుకు మళ్లిందో వేచి చూడాలి.

మోడీ ఆఫ్ ద ఇయర్... 2019 నేషనల్ పొలిటికల్ రిపోర్ట్...

రాజకీయ సంచలనాలకు కూడా 2019 వేదికైంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న మొదలైన సార్వత్రిక ఎన్నికలు... మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ టార్గెట్ ప్రకారం 300 ప్లస్ సీట్లను సాధించింది. గతంలో కంటే 21 స్థానాలను అదనంగా మొత్తం 303 స్థానాల్లో గెలుపొందింది, దాంతో, మే 30న మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఇక, కాంగ్రెస్ మరోసారి ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 52 స్థానాలకే పరిమితమైంది. దేశవ్యాప్తంగా బీజేపీ 37.36 శాతం ఓట్లను సాధించగా, కాంగ్రెస్ 19.01 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. మొత్తం మీద బీజేపీ కూటమి 353 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ కూటమి 91 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు 98 సీట్లలో నెగ్గారు. ఇక, కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక, 2019లోనే ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏపీ, అరుణాచల్, సిక్కిం, ఒడిషాకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో వైసీపీ... అరుణాచల్ లో బీజేపీ... సిక్కింలో బీజేపీ మిత్రపక్షాలు... ఒడిషాలో నవీన్ పట్నాయక్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానాకు ఎన్నికలు జరగగా... మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపు తిరిగాయి. చివరికి, కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారం చేపట్టింది. ఇక, హర్యానాలో హంగ్ ఫలితాలు వచ్చినప్పటికీ... బీజేపీనే అధికారం దక్కించుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో 2019 రాజకీయాలు ముగిశాయి. 2019 చివర్లో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో జేఎఎం ఘనవిజయం సాధించడం హేమంత్ సోరెన్  రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే, 2019 అనేక రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టగా... ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ... 50శాతం ఓట్లు, 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు దేశ దృష్టిని ఆకర్షించాయి. బీజేపీ, శివసేన గొడవలతో మహా పాలిటిక్స్ అనేక మలుపులు తిరిగాయి. అధికారం కోసం రెండు పార్టీలూ కొత్త దారులు వెతుక్కున్నాయి. చివరికి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారం దక్కించుకుంది. ఇక, కర్నాటక రాజకీయాలు కూడా రసవత్తరంగా సాగాయి. సరికొత్త నెంబర్ గేమ్ తో కర్నాటకలో అధికారాన్ని బీజేపీ దక్కించుకుంది. మొత్తానికి అనేక కొత్త రాజకీయాలకు సంచలనాలకు 2019 వేదికైంది.

విశాఖ రాజధానిపై సీమ ప్రజలు ఫైర్.. పక్క రాష్ట్రాల రాజధానులే దగ్గరగా ఉన్నాయి

రాజధాని అంటే రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి దిగేలా ఉండాలి. విశాఖ అంటే ఎటు నుంచి చూసినా దాదాపు 1000 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. దీనికంటే పక్క రాష్ట్రాల రాజధానులు మేలు, ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. కడుపులో నీళ్లు కదలకుండా అమరావతికు వచ్చిపోయే రాయలసీమ ప్రజలు విశాఖ రాజధాని అనగానే గగ్గోలు పెడుతున్నారు. బాబోయ్ రాజధానిగా ఆ నగరం మాకు వద్దే వద్దని అంటున్నారు. భౌగోళికంగా సుదూర ప్రాంతం కావడంతో సీమ ప్రజలు విశాఖను రాజధానిగా అంగీకరించడానికి సుముఖంగా లేరు. దీనికంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాజధానులు తమకు దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. చివరకు గోవాకైన విశాఖ కంటే వేగంగా చేరుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమ లోని నాలుగు జిల్లాల కేంద్రాల నుంచి విశాఖ చేరుకోవాలంటే సగటున 900 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రజలు 14 గంటల పాటు బస్సులో ప్రయాణం చేస్తే తప్ప ఆ నగరానికి చేరుకోలేరు. కడప నగరం నుంచి విశాఖకు 732 కిలోమీటర్ల దూరం ఉంది. అనంతపురం నుంచి విశాఖకు చేరుకోవాలంటే మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే.. 890 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 17 గంటల పాటు బస్సులో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు. ఇదే జిల్లా రాయదుర్గం నుంచి విశాఖకు 977 కిలో మీటర్లు అంటే మరో రెండు గంటలు అదనపు ప్రయాణం అవుతుంది. ఇక చిత్తూరు ప్రజల పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిత్తూరు నగరి నుంచి విశాఖకు వెళ్లాలంటే 832 కిలో మీటర్లు, 15 గంటల పాటు బస్సు ప్రయాణం చేయాలి. అదే టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతి నిధ్యం వహిస్తున్న కుప్పం నుంచైతే విశాఖకు 950 కిలో మీటర్ల దూరం, కర్నూలు ప్రజలు విశాఖ చేరుకోవాలంటే సుమారు 700 కిలో మీటర్ల దూరం వుంది. ఇలా ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాజధానికి వచ్చి వెళ్లడానికి సుమారు రెండు రోజుల సమయం కేటాయించాలి. విశాఖ కంటే వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తక్కువ సమయంలో వెళ్లిరావచ్చు. కడప నుంచి హైదరాబాద్ కు వెళ్లాలంటే 415 కిలో మీటర్లు, చెన్నైకి 260 కిలో మీటర్లు, బెంగళూర్ కు 289 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. ఇక చిత్తూరు నుంచి హైదరాబాద్ కు 570 కిలో మీటర్లు, చెన్నైకి 158 కిలో మీటర్లు, బెంగళూరుకు 181 కిలో మీటర్లు ప్రయాణించిసి కేవలం గంటల వ్యవధి లోనే చేరుకునే అవకాశముంది. ఇక అనంతపురం నుంచి బెంగళూరుకు 215 కిలో మీటర్లు, హైదరాబాద్ కు 360 కిలో మీటర్లు, చెన్నైకి 464 కిలో మీటర్లు ప్రయాణిస్తే  విశాఖ కంటే చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. కర్నూలు పరిధిలో విశాఖ కంటే ఈ మూడు రాష్ట్రాల రాజధానులకు తక్కువ సమయంలో వెళ్లిరావొచ్చు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు 218 కిలోమీటర్లు, బెంగుళూరుకు 360 కిలో మీటర్లు, చెన్నైకి 503 కిలో మీటర్లు ప్రయాణించి సులువుగా ఆయా ప్రాంతాలకు వెళ్లవచ్చు. కానీ విశాఖ కు వెళ్లిరావాలంటే రాయలసీమ ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. రాయలసీమ ప్రజలు రాజధానిగా విశాఖ కంటే అమరావతి మేలని భావిస్తున్నారు. ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాత్రికి బస్సు ఎక్కితే ఉదయానికల్లా అమరావతికి చేరుకోవచ్చు. ఒక్క అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల ప్రజలు కేవలం 7 గంటల్లో అమరావతికి రావచ్చు, అనంతపురం నుంచి కూడా 9 గంటల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఆ నాలుగు జిల్లాలకు అమరావతి 450 కిలోమీటర్ల లోపే ఉంది. అనంతపురం నుంచి అమరావతికి 438 కిలోమీటర్ల దూరం కేవలం 9 గంటలలో రావచ్చు. కడప నుంచి కూడా 6 గంటల్లో 348 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. చిత్తూరు ప్రజలు 447 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యల్పంగా కర్నూలు ప్రజలు 297 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే అమరావతికి సులువుగా చేరుకునే అవకాశముంది.

చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని... ముందు నుయ్యి వెనుక గొయ్యి

సామాన్యుల స్థలంలో బలమున్నోళ్లు బోర్డులు పాతేసి ఈ స్థలం మాదని దౌర్జన్యంగా ఆక్రమించడం చూస్తుంటాం. ఇప్పటికీ పలుచోట్ల కబ్జా భాగోతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వంద కోట్ల విలువైన ఓ భూ వివాదం తెరమీదకు వచ్చింది. ఇది స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నమో లేక తెలియక ఇరు వర్గాలు ఒకే స్థలం కొని మోసపోయాయో తెలియదు కానీ.. ఈ వివాదంలో కర్నూల్ జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలో గల కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాలూ తమదంటే తమదని వాదిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబరు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్‌-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్ వేశారు. సర్వే నంబరు 88, 89లో ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలంలో ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి జిపిఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించగా.. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పలువురు వీటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో ఎకరం రూ. 2 కోట్లకు పైగా పలుకుతుండటంతో.. మొత్తం దీని విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.  అయితే, ఈ భూమి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డు వెలిసింది. అంతేకాదు, ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా కందకాలు కూడా తవ్వారు. దీంతో స్థలాలు కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ అంశంపై కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నంబరు 89లోని పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించానని అన్నారు. నెల రోజులుగా కొంత మంది తనకు ఫోన్‌ చేసి ఇందులో తమకు ఫ్లాట్లు ఉన్నాయని అంటున్నారని తెలిపారు. అయితే, మా కంటే ముందే ఈ భూమిని వారికి అమ్మి ఉంటే వాళ్లకే ఇచ్చేస్తామని అన్నారు. కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉందని.. అప్పట్లో వెంచర్‌ వేసిన చంద్రమౌళీశ్వర్‌ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయని, గతంలో సీబీసీఐడీ విచారణలో ఆయన జైలుకు కూడా వెళ్లారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తమ వద్ద భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని కాటసాని అంటున్నారు. ఆ వివాదాస్పద 40 ఎకరాల స్థలంలో పదెకరాల స్థలం తనదని బల్లగుద్ది చెప్తున్నారు. సరే తుఫ్రాన్‌పేటలో సర్వే నంబరు 89లోని పదెకరాల భూమి కాటసానిదే అనుకుందాం. మరి ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఆ భూమి వివరాలు ఉండాలిగా?. ఆయన సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన పేరు మీద కానీ, ఆయన భార్య పేరు మీద కానీ.. తుఫ్రాన్‌పేటలో సర్వే నంబరు 89 తో పదెకరాల భూమి ఉన్నట్టు వివరాలు లేవు. పలు సర్వే నెంబర్ల పేర్లతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న భూమి వివరాలను పొందుపరిచిన ఆయన.. మరి ఈ పదెకరాల భూమి వివరాలను ఎందుకు పొందుపరచలేదు. భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయంటున్న ఆయన ఎన్నికల అఫిడవిట్ లో భూమి వివరాలను తెలియజేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అఫిడవిట్ లో ఆస్తులు, కేసులు ఇలా అన్నీ వివరంగా ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు దాచి చట్టపరంగా పదవి కోల్పోయిన వారు కూడా పలువురు ఉన్నారు. ఇక ఇప్పుడు కాటసానికి కూడా చట్టపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమి తనది అంటే అఫిడవిట్ లో ఎందుకు పొందుపరచలేదని అడుగుతారు. భూమి తనది కాదు అంటే బోర్డు ఎందుకు పాతావు అని అడుగుతారు. మొత్తానికి కాటసాని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది.

అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ నిజంగా జరిగిందా?.. ఇవిగో ఆధారాలు!!

అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రధానంగా ఈ ఆరోపణలతోనే రాజధాని తరలింపు నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు అమరావతిలో నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? నిజంగానే అమరావతి ఒక కులం గుప్పిట్లో ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014 లో అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతలు రాజధాని అమరావతిని 29 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారని ముందే తెలుసుకొని.. అధికార ప్రకటనకు ముందే రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి వేల ఎకరాల భూమి కొన్నారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా.. ప్రభుత్వం సేకరించిన 33,771 ఎకరాల భూమిలో 15,000 ఎకరాలు పైగా భూమిని రైతులు అమ్ముకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. CRDA వెబ్ సైట్ లో ఎవరెవరి నుంచి ఎంతెంత భూమి సేకరించింది పూర్తీ వివరాలు ఉన్నాయి. 2015 కౌలు లిస్టును గమనిస్తే... 81 శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఉన్నవారి చేతిలో ఉంది. 13 శాతం భూమి 5 నుండి 10 ఎకరాలు ఉన్నవారి చేతిలో ఉంది. 3 శాతం భూమి 10 నుండి 15 ఎకరాలు ఉన్నవారి చేతిలో ఉంది. 2.88 శాతం భూమి 15 ఎకరాలకు పైగా ఉన్నవారి చేతిలో ఉంది. 15 ఎకరాల కన్నా ఎక్కువగా పొలం ఉన్న భూయజమానులు సంఖ్య యాభై. వారి చేతిలో ఉన్న మొత్తం పొలం 973 ఎకరాలు. ఈ 973 ఎకరాలలో దేవుడి మాన్యం 447 ఎకరాలు. వక్ఫ్ బోర్డు భూమి 21 ఎకరాలు. అంటే బడా బాబుల వద్ద వందలు వేల ఎకరాలు ఉన్నాయనేది అసత్యమని ఈ లిస్ట్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే 15 ఎకరాలకు పైగా పొలం ఉన్నవారి పేర్లను గమనిస్తే ఆ లిస్ట్ లో అన్ని కులాల వారు ఉన్నారు. అంటే  973 ఎకరాలలో దేవుడి మాన్యం, వక్ఫ్ బోర్డు భూమి పోగా మిగిలిన ఆ కొద్ది భూమి కూడా ఒక్క కులం చేతిలో లేదనేది స్పష్టమవుతోంది. ఇక 2019 కౌలు లిస్టుని గమనిస్తే.. ప్లాట్లు అమ్ముకున్న వారికి కౌలు ఇవ్వరు. అందుకే 2019 కౌలు లిస్టులో రైతుల సంఖ్య 4564 మంది తక్కువగాను, మొత్తం పొలం విస్తీర్ణంలో 5083 ఎకరాలు తక్కువగాను ఉంది. అంటే గడచిన 4-5 సంవత్సరాలలో అమ్మకం జరిగింది 5083 ఎకరాలు మాత్రమే. అంటే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు ప్రభుత్వం సేకరించిన 33,771 ఎకరాలలో 15,000 ఎకరాల అమ్మకం జరిగింది అనేది అసత్యం. దీనిబట్టి చూస్తే అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అన్న ఆరోపణల్లో నిజం లేదని అర్థమవుతోంది.

మోడీకి పోటీగా చాపకింద నీరులా ఎదుగుతున్న యువ నాయకుడు!!

రాజకీయ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే వారి ప్రసంగం ఆకట్టుకునేవిధంగా ఉండాలి. ప్రసంగంతో ప్రజల్ని ఉత్తేజపరచాలి.. ఆలోచనలో పడేయాలి.. వారి వెంట నడిచేలా చేసుకోవాలి.. అలాంటి వారే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. బలమైన నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, ఎన్టీఆర్, కరుణానిధి వంటివారు ఆ కోవలోకే వస్తారు. వారి ప్రసంగం ప్రజల్ని ఉత్తేజ పరిచేది. వారి ప్రసంగం వినడం కోసం అప్పట్లో ప్రజలు కొన్ని కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లేవారు. అయితే ఈ తరంలో ఆ స్థాయిలో ప్రసంగించే నేతలు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న అతి తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన ప్రసంగం ప్రజల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అసలు విపక్ష పార్టీల నేతల్లో ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకునే నేతలు లేకపోవడమే మోడీకి కసిసొచ్చిందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇప్పుడొక యువ నాయకుడు మోడీకి పోటీగా చాపకింద నీరులా బలమైన శక్తిగా ఎదుగుతున్నాడని అంటున్నారు. ఆ యువ నాయకుడు ఎవరో కాదు కన్నయ్య కుమార్. గతంలో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేసిన కన్నయ్య కుమార్... ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతగా, సిపిఐ శక్తివంతమైన నేతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విద్యార్థి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై పోరాడటంలో కన్నయ్య ముందుంటాడు. ఎందర్నో ఆ పోరాటంలో నడిచేలా చేస్తాడు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం నుండి పౌరసత్వ సవరణ బిల్లు వరకు ఇలా ఎన్నో అంశాలపై కన్నయ్య పోరాటం చేసాడు, చేస్తున్నాడు. కన్నయ్య ప్రభావం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తోంది. ఆయన ప్రసంగం వినడానికి యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన మాటలతో యువతలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం ఉప్పొంగుతున్నాయి. ఇక ఇటీవల ఆయన ఆజాదీ నినాదం యువతలోకి బలంగా వెళ్లింది. ఆయన గొంతు వినిపిస్తే చాలు వేల గొంతులు జత కలుస్తున్నాయి. మొత్తానికి ఈ 32 ఏళ్ళ దళిత యువ నాయకుడు.. తన ప్రసంగాలతో యువతని కదిలిస్తూ బలమైన శక్తిగా ఎదుగుతున్నాడు. అతని ప్రస్థానం ఇలాగే కొనసాగితే.. కాన్షీరాం, మాయావతి వంటి శక్తివంతమైన దళిత నాయకుల సరసన చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ.. జగన్ తో కలిసి మాస్టర్ ప్లాన్!!

ఏపీలో ఏం జరుగుతోందో.. అసలేం జరగబోతోందో.. అర్థంగాక టీడీపీ కార్యకర్తలు తలలుపట్టుకుంటున్నారు. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులకి.. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటా అని టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను ఎక్కువగా కలవరపెడుతోన్న అంశం మూడు రాజధానులు. అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటన.. చంద్రబాబుకి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. జగన్ ప్రకటనని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి నష్టం. స్వాగతిస్తే పరువుప్రతిష్ఠలకు నష్టం. ఇలా ఎటుచూసినా చంద్రబాబు ఇరుకున పడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ తోనే ఏపీలో టీడీపీని దెబ్బకొట్టడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీ, బీజేపీల మధ్య దూరం పెరిగిందని.. అందుకే ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మీడియాలో తెగ వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ అమిత్ షాని కలిశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ సమయంలో మూడు రాజధానుల అంశం గురించి చర్చించారట. అమిత్ షా అంగీకారంతోనే జగన్ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. దీనికి తెరవెనుక విజయసాయి రెడ్డి చక్రం తిప్పారని తెలుస్తోంది. అందుకే మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నుండి అంతగా వ్యతిరేకత వ్యక్తమవట్లేదని అంటున్నారు. నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే పెద్ద నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ బీజేపీ సపోర్ట్ లేకుండా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. జార్ఖండ్ లో కూడా బీజేపీకి చేదు ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. జగన్ మెడకి బెయిల్ కత్తిని వేలాడదీసి గ్రిప్ లోకి తెచ్చుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ ఇరుకున పడింది. వ్యతిరేకించినా నష్టమే, సమర్ధించినా నష్టమే. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ మనుగడకే ప్రమాదం వచ్చి పడింది. అదే బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. ఈ మూడు రాజధానుల దెబ్బతో మరింతమంది టీడీపీ నుండి బీజేపీకి క్యూ కడతారు. ఓ రకంగా ఏపీలో వైసీపీకి ప్రత్యమ్నాయ శక్తిగా ఎదిగే అవకాశముంది. జగన్ మెడ మీద బెయిల్ కత్తి వేలాడుతుండటంతో.. ఆయన బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని అంటున్నారు. ఓ రకంగా బీజేపీ అజ్ఞాత మిత్రుడిగా మారిపోయి సాయం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ పునాదులను కలిదించి ఆ ప్లేస్ లోకి రావాలని బీజేపీ చూస్తోందని.. టీడీపీని లేకుండా చేయడం జగన్ కి ఇష్టం, జైలుకి వెళ్లడం కష్టం కాబట్టి పూర్తిగా సహకరిస్తున్నారని అంటున్నారు.

ఏపీకి మూడు రాజధానులు... జగన్ వ్యూహంలో చిక్కి విలవిల్లాడుతున్న చంద్రబాబు!!

ప్రస్తుతం ఏపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. నిజంగానే రాజధాని మూడు ముక్కలు కానుందా అని ఏపీలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఈ రాజధాని సెగ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉంది. వైఎస్ జగన్ సీఎం అయితే రాజధానిని అమరావతి నుండి మారుస్తారని టీడీపీ ఎన్నికల ముందే ఆరోపించింది. కానీ వైసీపీ మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేసింది. తీరా ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చాక.. కొద్దిరోజులకే రాజధాని గురించి ట్విస్ట్ లు ఇవ్వడం మొదలుపెట్టింది. మొదటగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని సెగకు ఆజ్యం పోశాయి. రాజధానికి అమరావతి సరైన ప్లేస్ కాదని, స్మశానంతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజధానిపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కూడా పలువురు వైసీపీ నేతలు అమరావతి గురించి అటువంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇక తాజాగా సీఎం జగన్ కూడా అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టే జీఎన్ రావు కమిటీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో మూడు చోట్ల రాజధాని ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో అయితే తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం మూడు చోట్ల రాజధాని అనేది అసాధ్యమని.. ఈ మూడు రాజధానుల వ్యాఖ్యల వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని అభిప్రాయపడుతున్నారు. జగన్ టీడీపీని, చంద్రబాబుని దెబ్బకొట్టి.. ఏపీలో అసలు టీడీపీ మనుగడే లేకుండా చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దానికోసం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్ములాని ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా చంద్రబాబును, టీడీపీని ఎంత ఇరుకున పెట్టారో అందరికీ తెలుసు. జై సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో పార్టీకి నష్టం, జై తెలంగాణ అంటే ఆంధ్రాలో పార్టీకి నష్టం అనే విధంగా ఎత్తుగడలు వేశారు. టీడీపీ అంటే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేలా ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చారు. కేసీఆర్ దెబ్బకి ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పుడదే ఫార్మూలాను జగన్‌ కూడా అప్లై చేయనున్నారని తెలుస్తోంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేస్తూ… అమరావతిలో రాజధాని ఉంటూనే, కర్నూల్‌తో పాటు విశాఖను కూడా రాజధానిగా చేయబోతున్నాం అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిణామం ఎదురవుతోంది. విశాఖకు రాజధాని వద్దు అంటే.. ఉత్తరాంధ్రలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కర్నూల్‌కు హైకోర్టు వద్దని అంటే రాయలసీమలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే.. జగన్ ఒక్క ప్రకటనతో రెండు ప్రాంతాల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించారు. ఓ రకంగా ఇది టీడీపీ మనుగడకే ప్రమాదం. పోనీ ఈ విషయాన్ని గుర్తించి..  జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించినా కూడా టీడీపీకే నష్టం. జగన్ నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు మరి మీరు అప్పుడు రాజధాని అమరావతిలో ఒక్క చోటే ఎందుకు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తారు? ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఇక.. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీ మీద వ్యతిరేకత రాదేమో కానీ.. ఆ ప్రాంతాల ప్రజలు మాత్రం జగన్ కే జై కొడతారు. ఎందుకంటే నిర్ణయం జగన్ దే కదా. ఇలా ప్రాంతీయ విభేదాలు, సెంటిమెంట్ తో చంద్రబాబుని ఇరుకున పెడుతున్నారన్నమాట. మొత్తానికి జగన్.. చంద్రబాబుని, టీడీపీని దెబ్బకొట్టడానికి.. కేసీఆర్ వాడిన 'ముందు నుయ్యి.. వెనక గొయ్యి' ఫార్ములాని వాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ మూడు రాజధానుల వ్యాఖ్యల వెనుక కొందరు మరోకోణం కూడా ఉందంటున్నారు. జగన్ వైసీపీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాలనే ఈ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. రాయలసీమలో వైసీపీకి మంచిపట్టుంది. ఇప్పుడు కర్నూల్ లో హైకోర్టు ప్రకటనతో.. రాయలసీమలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశముంది. ఉత్తరాంధ్రలో వైసీపీ అంతగా బలంగా లేదు. ఇప్పుడు విశాఖలో రాజధాని ప్రకటనతో.. ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభ పెరిగే అవకాశముంది. ఇక అమరావతిలో ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను అడ్డుకోవడానికి కుల రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అమరావతిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు వందలు, వేల ఎకరాల్లో భూములు కొన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. నిజానికి వ్యాపారాలు చేయడం, స్థలాలు కొనడంలో ఎప్పుడూ ఒకటిరెండు కులాలే ముందుంటాయి. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టినా వారే ముందుంటారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూడా స్థలాలు కొని వ్యాపారాలు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ వైసీపీ మాత్రం ఒక్క కులానిదే రాజధాని అని ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపిస్తున్నట్టు.. 20 శాతం స్థలం ఒక కులం చేతిలో ఉందనుకున్నాం.. మరి మిగతా 80 శాతం స్థలం ఎవరి చేతిలో ఉంది?. అది ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అసలు ఆ ఆలోచనే రాకుండా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దానిద్వారా మిగతా కులాలకు దగ్గరవ్వాలని చూస్తోంది. అంటే మూడు రాజధానుల ప్రకటనతో మూడు ప్రాంతాల్లోనూ టీడీపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు చోట్ల ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం, ఒక చోట కుల రాజకీయం చేయడం ద్వారా అసలు టీడీపీ మనుగడకే ప్రమాదం తీసుకొస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని కథ ఇంతటితో ముగియలేదు. మూడు చోట్ల రాజధాని ఏర్పాటు చేయడం అంత సులభం కాదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టంలో రాజధాని ఎంపిక అధికారం మొదటి సీఎంకి ఉంటుందని స్పష్టంగా ఉంది. విభజన తరువాత ఏపీ మొదటి సీఎం గా చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అసెంబ్లీ తీర్మానం జరిగింది. కేంద్రం అంగీకారం తెలిపింది. ప్రధాని అమరావతిలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అక్కడ పలు నిర్మాణాలు కూడా జరిగాయి. మరిప్పుడు మూడు చోట్ల రాజధాని అంటే రాజ్యాంగపరంగా చిక్కులు వచ్చే అవకాశముంది. కేంద్రం కూడా అంగీకరించకపోవచ్చు. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్పు అంటే రాష్ట్ర మనుగడకే ప్రమాదం అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్ ఇలా వేరు వేరు చోట్ల అంటే పాలకుల నుండి ప్రభుత్వ అధికారుల వరకు అందరికి ఇబ్బందే. దీనిబట్టి ఆలోచిస్తే మూడు రాజధానుల అంశం కేవలం ప్రకటనకు పరిమితమైనా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాకపోయినా.. జగన్ చంద్రబాబుని ఇరుకున పెట్టగలరని అంటున్నారు. ఎందుకంటే మూడు రాజధానుల కోసం నేను కృషి చేశాను.. కానీ చంద్రబాబే వ్యతిరేకించి ఆచరణ సాధ్యం కాకుండా చిక్కులు సృష్టించారని చెప్పే అవకాశముంది. ఇలా ఏ కోణంలో చూసినా జగన్.. చంద్రబాబుని పక్కా ప్లాన్ ప్రకారం ఇరుకున పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. మరి దీని నుండి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి.  

మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు..! కేంద్రం ఒప్పుకుంటుందా?

శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లులను శాసనమండలిలో చుక్కెదురు కావడం... రెండు బిల్లులను తిప్పిపంపుతూ మండలి తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు... అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఏర్పాటు బిల్లుల ఆమోదం మండలి కారణంగా ఆగిపోవడంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడంతో మరోసారి శాసససభలో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, రెండోసారి కూడా మండలి తిరస్కరించి పంపితే అప్పుడు శాసనసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడాన్ని జగన్ సర్కారు అత్యంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, ఏకంగా మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  58మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో టీడీపీకి 26మంది మెంబర్స్ ఉండటంతో ప్రతిపక్షానిదే పైచేయిగా ఉంది. అధికార వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దాంతో, మండలిలో అనేక విషయాల్లో ప్రతిపక్ష తెలుగుదేశానికే పైచేయిగా ఉంటుంది. శాసనసభలో వైసీపీ సభ్యులు.... టీడీపీని ఆడుకున్నట్లే.... మండలిలో అధికారపక్షాన్ని... తెలుగుదేశం వాళ్లు ఆటాడుకుంటున్నారు. దాంతో, ముఖ్యమంత్రి, మంత్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక, నారా లోకేష్ మండలిలో ఉండటం కూడా సీఎం జగన్ కు ఇబ్బంది మారిందనే మాట వినిపిస్తోంది. నారా లోకేష్ కు ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉండటంతో... అన్నేళ్లు మండలిలో అతడిని చూడటం జగన్ కు ఇష్టంలేదని, అందుకే రద్దు దిశగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, శాసనమండలిని రద్దు చేయాలంటే లోక్ సభ, రాజ్యసభల్లో చర్చ జరిపి తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రాన్ని ఒప్పించుకుంటే ఇది ఈజీగా జరిగిపోయే పనే. అయితే, ప్రస్తుతమున్న మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారు. అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే జరిగే అవకాశముందంటున్నారు.

వైజాగ్ లో అప్పుడే కేపిటల్ పనులు ప్రారంభం... ఏప్రిల్ నుంచే కార్యకలాపాలు...!

రాజధానిపై జగన్ సర్కారు నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇంకా రానే లేదు... కానీ, అసెంబ్లీ వేదికగా ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముందే ప్రభుత్వ నిర్ణయాన్ని దాదాపు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అప్పుడే పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టుకోవచ్చన్న జగన్....  అక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలకు కావాల్సిన పనులను    ప్రారంభించేశారు. అయితే, ప్రభుత్వ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం పరదేశిపురం ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ కోసం విశాఖ పరిసరాల్లో దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించారు.  అంతేకాదు ఇప్పటికిప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలను విశాఖ నుంచి జరిపేందుకు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన రెండున్నర లక్షల చదరపు అడుగుల క్యాంపస్ ను వినియోగించుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించిన ఈ భవనాలను ఇమిడియట్ యూజ్ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే, ఆంధ్రా యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న భవనాలను ప్రభుత్వం గుర్తించింది. అవసరమైతే ఈ బిల్డింగ్స్ ను కూడా అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని చూస్తోంది. ఇక, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ నివాసం కోసం భీమిలి దగ్గర సముద్ర తీరంలో మూడు ఎకరాల భూమిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించనుండటంతో ఎయిర్ కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది.  మూడే మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2020 ఏప్రిల్ లోపే మొత్తం ఏర్పాట్లు పూర్తిచేసి అధికార యంత్రాంగాన్ని తరలించనుంది. ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా పర్ ఫెక్ట్ గా సాగేందుకు పార్టీలో ఐదుగురు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక, రాజ్ భవన్ కోసం కూడా అనువైన ప్రాంతాన్ని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

భర్త తీరు వల్లే మంత్రి పదవి పోగొట్టుకున్న గొంగిడి సునీత.. అయినా మారని తీరు!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత గెలిచారు. ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి మాత్రం పెత్తనమంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మహేంద్రరెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారటంతో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం ఆయనకు బాగా అలవాటు. రియల్ సెటిల్ మెంట్లు చేస్తారని ఇక్కడి ప్రజలలో బలంగా టాక్ వినిపిస్తోంది.  నిజానికి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం గుర్తించిన కేసీఆర్ 2014 లో ఆలేరు ఎమ్మెల్యే టికెట్ సునీతకి ఇచ్చారు. కేసీఆర్ ప్రభంజనంలో సునాయాసంగా గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు సునీత. ఇక అక్కడి నుంచి ఆమె భర్త మహేందర్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారుల పై పెత్తనం చెలాయిస్తున్నారు. వారిని తన కనుసన్నల్లోనే ఉండేటట్లు చేస్తున్నారు గొంగిడి మహేందర్ రెడ్డి.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ విస్తరణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపించింది. ఫలితంగా యాదాద్రి చుట్టు పక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షల రూపాయల వున్న భూములు కాస్తా ఇప్పుడు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడ రియల్ వ్యాపారాలూ చెయ్యాలంటే ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డిని కలవాల్సిందే, ఆయన అనుమతి, వ్యాపారంలో వాటా లేకుండా ఇక్కడ రియల్ వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. సెటిల్ మెంట్ లు కూడా బాగానే చేస్తారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి సెటిల్ మెంట్ల గురించి బాధితులు ఆయన పై అనేకసార్లు ఆలేరు నియోజకవర్గం లోనే లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఆ ఫిర్యాదుల గురించి పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇక 2018 లో ఆలేరు నుంచి మరోసారి గొంగిడి సునీత ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. ఇటీవల ఓ ఐసీడీఎస్ అధికారిణి బాల్య వివాహం అడ్డుకున్నందుకు షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఆమెను బెదిరించాడు. తన విధులకు ఆటంకం కలిగించాడని ఏకంగా ఎమ్మెల్యే భర్తపైనే ఐసిడిఎస్ ఆఫీసర్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. అంటే ఆయన పెత్తనం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అధికారులను పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకుని ఎమ్మెల్యే భర్త చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ప్రజలలో బాగానే వినిపిస్తున్నాయి. అయితే గొంగిడి మహేందర్ రెడ్డి ప్రవర్తించే తీరు చూసి ఎమ్మెల్యే సునీతనా, మహేందర్ రెడ్డి నా అని కొందరు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే షాడో అని మరికొందరంటున్నారు. మహేందర్ రెడ్డి ప్రవర్తనతో ఎమ్మెల్యే సునీతకు చెడ్డ పేరు వస్తుందని నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.2018 ఎన్నికల ప్రచారంలో సునీతను గెలిపిస్తే ఈ సారి పెద్ద పదవి ఇస్తానని గులాబీ బాస్ కేసీఆర్ ఇక్కడి ప్రజలకూ చెప్పారు. అయినా ఎమ్మెల్యే భర్త దూకుడు చూసి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వ విప్ తో సరిపెట్టారని ఆలేరు నియోజక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.