నాడు కోట్లకు అధిపతి..నేడు రూ.20 జీతం

నెల క్రితం వరకు కోట్లాది మంది ఆరాధించే గురువు..సన్యాసులు, బాబాలు ఇలా కూడా ఉంటారా అనిపించేలా రంగు రంగుల బట్టలు..రాజభోగాలు..విలాసవంతమైన జీవితం..ఎక్కడకు వెళ్లినా వెంట మందీ మార్బలం ఇదీ డేరా సచ్ఛా సౌధ అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీవితం..కానీ తన ఆశ్రమంలో ఉన్న ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలడంతో అతని జీవితం తలక్రిందులైంది.   న్యాయస్థానం డేరాకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించడంతో ప్రస్తుతం రోహ్‌తక్ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. మరి అంతటి రాజభోగాన్ని అనుభవించిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..? అందరి ఖైదీల మాదిరిగానే డేరా బాబాకు సైతం జైలు అధికారులు పనులు అప్పగించారు..అదేంటో తెలుసా రోజూ తోట పని చేసి కూరగాయలను పెంచే పని..ఇందుకు గాను గుర్మీత్‌కు రోజుకు రూ.20 వేతనంగా చెల్లిస్తున్నారు. టీవీ, వార్తా పత్రికలను సైతం అతడికి అందుబాటులో ఉంచడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా కనీసం ఫోన్ కాల్స్ చేసుకొనేందుకు సైతం గుర్మీత్‌ను అంగీకరించడం లేదు.

గోవాలో ఇక మందు కొట్టలేరు..!

ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు గోవా..సరదాగా ఎంజాయ్ చేయడానికి..రెండు పెగ్‌లు వేసి సరదాగా తిరగాలన్నా డెస్టినేషన్ గోవానే. అందుకే సెలవులొస్తే చాలా మంది చలో గోవా అంటారు. అయితే ఇలాంటి వారికి చేదువార్తను చెప్పారు గోవా సీఎం మనోహర్ పారికర్. అయితే అందుకు కారణం లేకపోలేదు..బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన కొంతమంది యువకులు తరచూ పర్యాటకులపై దాడులకు పాల్పడుతుండటంతో కఠినచర్యలకు సిద్ధమయ్యారు సీఎం.   దీనిలో భాగంగా ఎవరైనా రోడ్ల మీద మద్యం తాగితే జరిమానాలు విధిస్తామని, మద్యం షాపుల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని పారికర్ ప్రకటించారు. తాగినవాళ్లు తమ మానాన తాము పోకుండా మహిళా టూరిస్ట్‌లతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటం..బాటిళ్లను పగలకొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే గత ఏడాది నుంచే కొన్ని ప్రదేశాలను నో ఆల్కాహాల్ జోన్‌గా ప్రకటించారు. అయితే సీఎం నిర్ణయంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. గోవా టూరిస్టుల ఫస్ట్ ఛాయిస్ అవ్వడానికి కారణం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, బార్లు, పబ్‌లు, మద్యం దుకాణాలు. వీటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున యాత్రికులు గోవా ట్రిప్‌ ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారీగా ఖజనాకి గండి పడే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి మరోసారి పునరాలోచించుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.

"చీర"ల కోసం చించుకున్నారు..!

తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళీ శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డును ప్రతిపాదికగా తీసుకుని కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందజేయాలని భావించింది. కార్యక్రమం కింద మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అధికారుల సమన్వయ లోపంతో రసాబాసగా మారింది.   క్యూలైన్లలో తలెత్తిన వివాదం..ఒకరినొకరు కొప్పులు పట్టుకుని చెప్పులతో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. దీనిలో భాగంగా హైదరాబాద్ యాకత్‌పురా నియోజకవర్గం పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో భారీ స్థాయిలో మహిళలు అక్కడికి చేరుకున్నారు. కనీసం క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడం..గొడవలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో మహిళలు సంయమనం కోల్పోయారు. ఒకరినొకరు గొడవపడి..తోసుకుంటూ జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. పోలీసులు, అధికారులు వారించినప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు..అయితే పోలీసు సిబ్బంది ఎంతో శ్రమకోర్చి మహిళలను అక్కడి నుంచి పంపించివేయడంతో ప్రశాంతత నెలకొంది.

నోట్ల రద్దుతో దేశానికి జరిగింది ఇదే.. !

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఆర్థిక రంగాన్ని ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దు చేశారు. అయితే ఆయన నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించింది. సామాన్యూడి నుంచి ప్రముఖుల దాకా..నిరుద్యోగి నుంచి వ్యాపార సామ్రాజ్యాధినేతల వరకు ఇది ప్రభావాన్ని చూపించింది. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాశారు. ప్రభుత్వం ఏం చేసినా జనానికి ప్రయోజనం చేకూర్చాలి గానీ..కష్టాల పాలు చేయకూడదు అంటూ మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.   ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నోట్ల రద్దుతో దేశానికి మూడు రకాల ప్రయోజనాలు చేకూరాయట. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడంతో పాటు పన్ను రాబడి పెరిగిందని, పెద్ద నోట్ల చెలామణి నియంత్రించగలిగామని జైట్లీ అన్నారు. బ్యాంకులకు తిరిగి వచ్చిన సొమ్ము ఆధారంగా కొంత మంది తెలిసి..తెలియకుండా నోట్ల రద్దు విజయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. మరీ జైట్లీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

మూడేళ్ల కుమార్తెను..100 కోట్లను వదులుకుని

వద్దన్నా లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం..వందకోట్ల ఆస్తులు..ముద్దులొలికే మూడేళ్ల కూతురు..ముచ్చటైన కుటుంబం ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి..జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది..కానీ వీటన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడింది ఒక జంట.. ఎందుకో తెలుసా..? మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌కు చెందిన సుమీత్ రాథోడ్, అనామికలు జైన మతస్థులు..వీరికి రూ.100 కోట్లకు పైగా ఆస్తి, మూడేళ్ల చిన్నారి పాప కూడా ఉంది..అయితే వీరు పాపతో సహా వందకోట్ల ఆస్తిని వదులుకొని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 23న తాము తొలి అడుగు వేసేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు. అయితే వీరి నిర్ణయానికి బంధువులతో పాటు సన్నిహితులు, స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. మీ దారి మీరు వెతుక్కున్నారు..మరి పాప పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు ఎంతగా చెప్పి చూసినా ఫలితం మాత్రం శూన్యం..గత నెల 22న సుమీత్ తాను సన్యాసం తీసుకుంటానని చెప్పగా..భార్య అనామిక కూడా భర్త వెంట ఉండేందుకే ఇష్టపడింది. వీరిద్దరూ కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సుధామార్గి ఆచార్య రామ్‌లాల్ మహరాజ్ కింద శిష్యులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపనున్నారు. వీరి సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 

కేసీఆర్ నాటిన "మొక్క"కే దిక్కు లేదు

పల్లెలు పచ్చబడాలి..అన్నదాత తలెత్తుకుని తిరగాలి..ఇదంతా జరగాలంటే పచ్చదానన్ని పెంచడమొక్కటే మార్గం. అలా తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఊరూరా ఉద్యమంలా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మన్ననలు అందుతున్నాయి..తెలంగాణ బాటలో నడిచేందుకు అనేక రాష్ట్ర ప్ఱభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అయితే కేవలం మొక్కలను నాటడమే కాదు నాటిన వాటికి సరైన పోషణ కూడా లభిస్తేనే ముఖ్యమంత్రి ఆశయం నెరవేరినట్లు.   అయితే ఆర్భాటంగా మొక్కలను నాటడంతోనే అధికారులు పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది..సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాటినే మొక్క ఎండిపోవడం. హరితహారం కార్యక్రమంలో భాగంగా జూలైలో కరీంనగర్ జిల్లా మానేర్‌కట్ట వద్ద మహాఘని మొక్కను నాటారు సీఎం. ప్రస్తుతం ఇది వాడిపోతూ..పూర్తిగా ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే తాము మొక్కను సంరక్షించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని..కానీ ఈ నెల 9వ తేదిన రాత్రి ముగ్గురు వ్యక్తులు మొక్క వద్ద నిలబడి ఏదో చేశారని..ఆ రోజు నుంచి ఆ మొక్క క్రమంగా వాడిపోతోందని కాపలాదారు చెబుతున్నాడు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి నాటిన మొక్కనే నిర్లక్ష్యం చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా నాటిన మొక్కల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎంత మాట అన్నాడు!

తమిళ నాట చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ వైపు అధికార పార్టీ రెండు ముక్కలై... అగ్గి రాజేస్తుంటే, ప్రతిపక్షం అదనుకోసం చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమల్ హాసన్.. విజయదశమికి కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు మీడియాకు తెలిపి.. తమిళ రాజకీయాల్లో ఎక్కడ లేని ఆసక్తిని రేకెత్తించాడు.  మరో వైపు... రజనీకాంత్ కూడా పార్టీ పెట్టడానికి సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే.. సినిమాలను చకచకా పూర్తి చేస్తున్నాడట రజనీ. ఇదిలావుంటే.. ఇటీవల ఓ మీడియా సమావేశంలో రజనీపై కమల్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారం రేపాయ్.  ఏ పార్టీతో కలిసి పనిచేసే ఉద్దేశం తనకు లేదనీ.. నా భావజాలానికి తగ్గ పార్టీ ఎక్కడా కనిపించలేదనీ.. అందుకే పార్టీని స్థాపించబోతున్నానని తెలిపిన కమల్.. తనలాగే పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్న రజనీ గురించి ప్రస్తావిస్తూ... రజనీకాంత్ లాంటి బహుళ ప్రజాదరణ గల నాయకుడు రాజకీయాల్లో రావడం మంచిదేననీ..  రజనీ వస్తానంటే... తన పార్టీలో చేర్చుకోడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని కమల్ అన్నాడు.  మరి ఈ మాటంటే  రజనీ అభిమానులకు చిర్రెత్తకుండా ఉంటుందా? సోషల్ మీడియాలో కమల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లమీదకు వచ్చి కమల్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నట్లు తెలిసింది. మరి ఈ వ్యవహారం మీద రజనీ ఏ విధంగా స్పందిస్తారో..కమల్ ఏ విధంగా వివరణ ఇస్తారో చూడాలి.

గుర్మీత్ పారిపోవడానికి సహకరించిన ఆ ఇద్దరు ఎవరు...?

ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్‌ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లిన నాటి నుంచి డేరా కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనేక చీకటి కోణాలను బయటకు తీశారు. తాజాగా ఈ దర్యాప్తులో మరో వాస్తవం వెలుగు చూసింది. తీర్పు వెలువడిన రోజు అంటే ఆగస్టు 25 నాడు డేరా బాబాను తప్పించడానికి అనేక యత్నాలు జరిగాయి..గుర్మీత్‌ను రోహతక్‌లోని జైలుకు తరలింస్తుండగా..ఆయన అనుచరులు కొందరు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.   దీంతో మరో పథకం వేసింది డేరా టీం..పోలీసుల సహాయం తీసుకుని బాబాను తప్పించాలన్నదే ఆ ప్లాన్..దీనిలో భాగంగా ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‌‌ను లోబరుచుకున్నారు..వారు గుర్మీత్‌ దోషిగా తేలిన వెంటనే..అతడిని అక్కడి నుంచి తప్పించేందుకు అంగీకరించారు. ఒప్పందం ప్రకారం ఆగస్టు 25న డేరా బాబా భద్రతా చర్యలు చేపడుతున్న వీరు తీర్పు వెలువడిన వెంటనే రహీమ్‌ను ఆయన అనుచరుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు..అయితే దీనిని పసిగట్టిన ఉన్నతాధికారులు వీరి కుట్రను భగ్నం చేశారు..వారికి సహకరించిన హెడ్ కానిస్టేబుళ్ళు అమిత్, రాజేశ్, కానిస్టేబుల్ రాజేశ్‌ను అరెస్ట్ చేశారు..చేసిన నేరం అంగీకరించడంతో న్యాయస్థానం వీరికి కస్టడిని విధించింది.

నల్గొండ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలోకి రేవంత్..?

నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగనుంది. చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఎన్నికల నగరా మోగనుండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. వచ్చే ఎన్నికలకు కొలమానంగా..ప్రజల్లో ఎవరికెంత మద్ధతు ఉందో తెలుసుకునేందుకు ఈ ఉప ఎన్నిక వేదిక కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్ధిగా ఇక్కడ బరిలో దిగే సూచనలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.   ప్రజల్లో పాపులారిటీతో పాటు మంచి వాగ్ధాటీ ఉన్న రేవంత్ అయితేనే అధికార పార్టీకి సరైన పోటీ ఇవ్వగలరని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందట. దీనికి తోడు తెలుగుదేశానికి ఇక్కడ బలమైన క్యాడర్‌తో పాటు రెడ్డి సామాజిక వర్గం అండదండలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో రేవంతో బరిలోకి దిగితే విజయం తథ్యమని..కొందరు భావిస్తున్నారు..అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం ఏమిటా అనేది తేలాల్సి ఉంది. రేవంత్ లాంటి నేత నిలబడితే తమ తరపున ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలా అని గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారట. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఒక్కటి కావడంతో షాక్‌కు గురైన సీఎం..ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తన సత్తా ఏమిటో చూపించాలని భావిస్తున్నారట.

మరో మెంటల్ డెసిషన్ తీసుకున్న ట్రంప్

  మెంటల్ డెసిషన్లు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర్వాతే ఎవరైనా. నలుగురికీ నచ్చినదీ నాకసలే నచ్చదు.. నలుగురూ నడిచే దారిలో నేను నడవను అన్నట్టుగా ఆయన బిహేవియర్ వుంటుంది. పోనీ ఆ బిహేవియర్ అయినా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వుంటుందా అంటే అదీ కాదు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ట్రంప్‌కి అమెరికా అధ్యక్ష పదవి దొరికింది. దాన్ని అడ్డు పెట్టుకుని ఒక్క అమెరికాని మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలతో ఆడుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ పాకిస్తాన్‌ని తీవ్రవాద దేశమన్నాడు.. పాకిస్తాన్‌కి వార్నింగులు జారీ చేశాడు. ఇండియాకి అనుకూలంగా మాట్లాడాడు. అది చూసి మనం మురిసిపోయాం. ట్రంప్ మన జట్టే అనుకున్నాం. అయితే ఇప్పుడు ట్రంప్ భారత్ జుట్టు పట్టుకున్నాడు. ఇండియా పరువు తీసేలా వ్యవహరించాడు. డ్రగ్స్ ఉత్పత్తి చేయడంతోపాటు రవాణా చేసే 22 ఆసియా దేశాల లిస్టులో ఇండియాని కూడా చేర్చేశాడు. అది కూడా పాకిస్తాన్ పక్కనే మన దేశం పేరు కూడా పెట్టి తన మెంటల్ ప్రదర్శనకు తనకు ఏ దేశమైనా ఒకటేనని నిరూపించాడు. డ్రగ్స్ తయారీ కుటీర పరిశ్రమలా వర్ధిల్లుతున్న దేశాల లిస్టులో ఇండియాని కూడా చేర్చడం చాలా అవమానకరం. ఇండియాలో కూడా డ్రగ్స్ వినియోగం, అక్కడక్కడా తయారీ వుంది. ఇది కాదనలేని వాస్తవం. కానీ ట్రంప్ విడుదల చేసిన దేశాల వరసన చేర్చదగ్గ స్థాయిలో మాత్రం ఇండియా లేదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు పైకి స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, అప్పుడప్పుడు ఇలా అంతర్జాతీయ స్థాయిలో అవమానానికి గురిచేసే చర్చలు చేయడం మెంటల్ ట్రంప్‌కే చెల్లింది.

ఐఫోన్ X వచ్చేసిందోచ్, స్పెషల్ ఫీచర్లు ఇవే!

  ఐఫోన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొత్త మోడల్ ఐఫోన్ 10 (X) భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10.30 గంటలకు యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో యాపిల్ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అంతా సజావుగా సాగినప్పటికీ ఒక ఇబ్బందికర సంఘటన జరిగింది. టిమ్ కుక్ ఫేస్ ఐడీ గురించి వివ‌రణ ఇస్తున్న స‌మ‌యంలో ఐఫోన్ X లాక్ ఓపెన్ కాలేదు. దీంతో ఆయ‌న కొంత ఇబ్బందిగా ఫీల‌య్యారు. అయితే చివ‌రకు బ్యాక‌ప్ పాస్‌వ‌ర్డ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ మొదటి మోడల్ విడుదల చేసి 10 సంవత్సరాలు పూర్తయినందున అందుకు గుర్తుగా రోమన్ అంకె X పేరిట ఐఫోన్ X ను యాపిల్ విడుదల చేసింది. ఇక ఐఫోన్ X ఫీచర్ల గురించి తెలుసుకుందామా...   డిజైన్, కెమెరాలు, కలర్లు, ధర:   ఐఫోన్ X ముందు భాగంలో పైన వరుసగా ఫ్రంట్ కెమెరా, స్పీకర్, మైక్‌లు ఉంటాయి. ఇక కింది భాగానికి వస్తే, హోమ్ బటన్‌ను తీసేశారు. వెనుక భాగంలో కెమెరా, ఫ్లాష్, మైక్‌ లు ఉంటాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలను ఒకదాని కింద ఒకటి ఏర్పాటు చేశారు. f/1.8 అపర్చర్ సైజ్‌ గల ఈ కెమెరాల సామర్థ్యం 12 మెగాపిక్సల్. ఓఐఎస్ ఫీచర్ ఉండడం వల్ల కుదుపులు ఉన్నప్పటికీ ఫొటోలు, వీడియోలు షేక్ లేదా బ్లర్ అవకుండా వస్తాయి. ఇక ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరా సామర్థ్యం 7 మెగాపిక్సల్. f/2.2 అపర్చర్ సైజ్ ఉండడం వల్ల సెల్ఫీ ఫొటోలు నాణ్యంగా వస్తాయి. దీనితో ఫుల్ హెచ్‌డీ వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ ఎక్స్ సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తున్నది. ఇండియా లో ఐఫోన్ X 64 జీబీ ధర రూ.89వేలుగా ఉంది. ఇక 256 జీబీ వేరియెంట్ కావాలనుకుంటే రూ.1.02 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.   డిస్‌ప్లే:   ఐఫోన్ X లో బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే 5.8 ఇంచ్ సైజ్ తో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ 2436 x 1125 గా ఉంది. అధునాతన ఓలెడ్ డిస్‌ప్లే టైప్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను ఏర్పాటు చేసారు. తద్వారా, ఫోన్ తెరపై సులభంగా గీతలు పడవు. 3డీ టచ్ డిస్‌ప్లే ఫీచర్‌ను కూడా ఇందులో ఉంది. ఐఫోన్ Xలో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో, నీరు కానీ దుమ్ము కానీ పడినా ఫోన్‌ ఏమీ పాడవ్వదు.   ప్రాసెసర్, ర్యామ్, మెమరీ, ఆపరేటింగ్ సిస్టం, 4G , బ్యాటరీ:   ఐఫోన్ Xలో కొత్తగా హెగ్జాకోర్ తో యాపిల్ ఎ11 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందీ కాకుండా, ఇందులో ఎం11 మోషన్ కో ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్ ఉండగా, 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో దీన్ని యూజర్లకు అందిస్తున్నారు. అంటే, ఈ ఫోన్ వేగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్ Xలో సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 11ను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు వచ్చిన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా అనేక భిన్నమైన ఫీచర్లను ఇందులో ఉన్నాయి. డివైస్ సాఫ్ట్‌వేర్‌లో ఐకాన్లు, థీమ్స్, యాప్‌లను కొత్తగా డిజైన్ చేసి అందిస్తున్నారు. ఐఫోన్ Xలో 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయం ఉంది. గతంలో మాదిరిగా ఈ ఫోన్ లో కూడా సింగల్ సిం ఆప్షన్ ఉండడం ఒక మైనస్ గా చెప్పొచ్చు. ఇక మెమరీ కూడా మనం పెంచుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఐఫోన్ Xలో కొత్తగా వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. సో, కేబుల్స్ లేకుండానే ఫోన్ ని చార్జింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 7 కన్నా 2 గంటల ఎక్కువ బ్యాకప్‌ను ఐఫోన్ X ఇస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఒక గంటలో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది.   యాపిల్ పే, 3డీ యానిమేషన్లు, ఫేస్ ఐడీ:   ఐఫోన్ Xలో యాపిల్ పే యాప్‌ ఉంది. దీంతో వీసా, మాస్టర్‌కార్డు, అమెక్స్ కార్డు హోల్డర్లు కార్డ్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఫోన్‌లో డిఫాల్ట్‌గా వచ్చే ఎమోజీలకు తోడు ఐఫోన్ X యూజర్లు కొత్తగా 3డీ యానిమేషన్లను ఎమోజీలుగా వాడుకోవచ్చు. యూజర్‌ ముఖాన్ని స్కాన్ చేసుకున్న తరువాత ఒక ప్రత్యేకమయిన యాప్ యూజర్ ముఖానికి అనుగుణంగా వివిధ రకాల ఆకారాలతో కూడిన 3డీ యానిమేషన్స్‌ను క్రియేట్ చేస్తుంది. ఆ యానిమేషన్స్‌ను యూజర్లు ఎమోజీలుగా వాడుకోవచ్చు. ఐఫోన్ Xలో కొత్తగా ఫేస్ ఐడీ ఫీచర్‌ ఏర్పాటు చేశారు. ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి ఫోన్‌ను లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకు స్ట్రక్చర్డ్ లైట్ ట్రాన్స్‌మిటర్, స్ట్రక్చర్ లైట్ రిసీవర్, ఫ్లైట్/ప్రాక్సిమిటీ సెన్సార్‌లను జత చేశారు. దీని వల్ల ఫ్రంట్ కెమెరా యూజర్ కళ్లను స్కాన్ చేసి డివైస్‌ను లాక్, అన్‌లాక్ చేస్తుంది. అయితే, ఇంతకు ముందు చెప్పినట్టుగా, ఐఫోన్ X లాంచ్ సమయంలో ఫేస్ ఐడీ పనిచేయలేదు.

తిరిగొచ్చే ప్రయత్నాలు ప్రారంభం...

  ‘‘జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన నష్టం కూడా భారీగా జరిగింది... ఇక ఇక్కడే వుండి అవమానాల పాలు కావడం కంటే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతే మనశ్శాంతి అయినా మిగులుతుంది’’ ఇదీ ప్రస్తుతం శిల్పా సోదరుల మనసులో మెదులుతున్న ఆలోచన.. ఆచరణలోకి పెట్టడానికి సిద్ధమవుతున్న ఆలోచన. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీని విడిచి వైసీపీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తగిన మూల్యం చెల్లించారు. అన్నయ్య ఓడిపోయాడు.. తమ్ముడు నిక్షేపం లాంటి ఎమ్మెల్సీ పదవిని వదిలిపెట్టి, శాసనమండలి ఛైర్మన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు. రాజకీయాల్లో ఎంతమాత్రం పనికిరాని ఆవేశం ఆవహించిన ఈ సోదర ద్వయం ఇప్పుడు చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో వున్నారు.. మళ్ళీ టీడీపీ తలుపు తట్టడానికి సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.   ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరగాల్సిన నంద్యాల ఉప ఎన్నిక తమ అనాలోచిత చర్యల వల్లే పెద్ద ఇష్యూ కావడంతోపాటు తమకు పరాజయం, అవమానం దక్కాయని శిల్పా బ్రదర్స్ వాస్తవం తెలుసుకున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు వరకూ రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ వైసీపీ వర్గాలు కన్న కలలు ఆ తర్వాత కల్లలుగా తేలిపోయాయి. ఎప్పటి నుంచో వైసీపీ నీడలో వుంటున్న వారే ఆ పార్టీ నుంచి మెల్లగా జారుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఆ పార్టీలో చేరిన తాము అక్కడ కొనసాగడంలో అర్థం లేదని శిల్పా బ్రదర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో వున్న తమ సన్నిహితుల ద్వారా తమ ‘మారిన మనసు’ను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్నారు.   అయితే శిల్పా బ్రదర్స్‌ని వైసీపీలో పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్టుగా సమాచారం. ఎమ్మల్సీ పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరిన చక్రపాణిరెడ్డి ఆ తర్వాత కొద్ది రోజులకో జ్ఞానోదయం కలిగి నంద్యాలలో ప్రచారానికి కూడా దూరంగా వున్నారు. అప్పటి నుంచే ఆయన పార్టీకి డిటాచ్ అయిపోయారు. ఇక నంద్యాలలో ఓడిపోయిన మోహనరెడ్డి ఇప్పుడు చెల్లని కాసు అయిపోయాడు. అలాగే ఈ ఇద్దరు అన్నదమ్ములను తిరిగి టీడీపీలోకి తీసుకునే ఆలోచన పార్టీ అధినేత చంద్రబాబుకు లేనట్టు తెలుస్తోంది. నంద్యాల విషయంలో ఎంత బుజ్జగించినా వినకుండా ఎన్నికల పోరు జరిగేలా చేసిన వీరి విషయంలో మెత్తగా వ్యవహరించకూడదని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

వైసీపీ వర్గాల గుండె గుభేల్

  కుటుంబ సమేతంగా లండన్‌కి వెళ్ళినా జగన్‌కి దుర్వార్తలు  వినక తప్పని పరిస్థితి. అటు నంద్యాల, ఇటు కాకినాడ జగన్ సారుకి జాయింట్ దుర్వార్తలయ్యాయి. ప్రస్తుతం జగన్ ఫ్యామిలీ లండన్లో వుంది. సారు లండన్ వెళ్ళింది కూతురి చదువు కోసం అని చెబుతున్నప్పటికీ, కూతురి చదువు సాకు చెప్పి వైద్య పరీక్షల నిమిత్తం లండన్ వెళ్ళాడన్న గుసగుసలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తు్న్నాయి. సరే, ఆయన ఏ కారణంతో లండన్ వెళ్ళినప్పటికీ, అక్కడ కూడా ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది. అలా చేసిన వ్యక్తి మరెవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.   నంద్యాల ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు అక్కడి రాజకీయ పరిస్థితి మీద సర్వే నిర్వహించిన కేసీఆర్, నంద్యాలలో వైసీపీ గెలవటం ఖాయమని, భవిష్యత్తులో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలు సదరు సర్వేని తుస్సు్మనిపించాయి. ఇదిలా వుంటే కేసీఆర్ ఇటీవల కూడా మరో సర్వే నిర్వహించారన్న వార్తలు వచ్చాయి. సదరు సర్వేలో ఏపీలో వచ్చే ఎన్నికలలో టీడీపీ భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమనే రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కూడా అధికార టీఆర్ఎస్ ఎదురీదక తప్పదనే విషయాన్ని కూడా సదరు సర్వే వెల్లడించినట్టు సమాచారం.   తెలంగాణ విషయం అలా వుంచితే, ఏపీ విషయంలో సదరు సర్వే వెల్లడించిన విషయాలే జగన్ వర్గానికి గుండె గుభేల్మనిపించినట్టు సమాచారం. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మంచి మెజారిటీ వస్తుందట. పవన్ కళ్యాణ్‌తో కలసి పోటీ చేస్తే మరో 30 సీట్ల వరకూ పెరుగుతాయట. ఇక బీజేపీతో పొత్తు కూడా లాభిస్తుందట. ఆ సర్వే ద్వారా టీడీపీ విషయంలో ఇన్ని సానుకూల ఫలితాలు రావడం పట్ల వైసీపీ వర్గాల్లో వణుకు మొదలైందని తెలుస్తోంది. లండన్ వెళ్ళినప్పటికీ మనశ్శాంతి దొరకని జగన్ అక్కడి నుంచి ఇక్కడి వారికి ఫోన్ చేసిన ప్రతిసారీ సర్వేకి సంబంధించిన విషయాలనే మాట్లాడుతున్నట్టు సమాచారం.

కేసీఆర్‌కి‌ "టచ్‌"లో నాగార్జున..!

స్వతహాగా సినిమా వాళ్లతో..రాజకీయ నాయకులు ఎప్పుడు టచ్‌లోనే ఉంటారు. అలాగే పొలిటీషియన్స్ కూడా ఇండస్ట్రీ వాళ్లకి అందుబాటులోనే ఉంటారు..ఇందులో ఎవరి అవసరాలు వారివి..ఎవరి లెక్కలు వారివి. అందుకే రెండు భిన్న ధ్రువాల్లాంటి ఈ రెండు రంగాలు పాలు నీళ్లలా కలిసిపోయి ఉంటాయి. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హీరో నాగార్జున కలిశారు. అప్పటి నుంచి రాజకీయ వర్గాలతో పాటు పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.   నాగార్జున ఏం చేసినా..దాని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది. తనకు లాభం లేకుండా నాగ్ ఏ పని చేయరని ఆయన గురించి ఇండస్ట్రీలో అనుకునే మాట. తన రాజకీయ, వ్యాపార అవసరాల కోసం ముఖ్యమంత్రులతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ వచ్చారు నాగ్..ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్, కిరణ్‌ కుమార్‌లతో సన్నిహితంగా మెలిగిన కింగ్ ఇప్పుడు కేసీఆర్ భజన చేస్తున్నారు. ఆ ఫ్రెండ్‌షిప్‌తో ఎన్నో అంశాల్లో లబ్ధి పొందారు నాగార్జున. అక్రమ కట్టడాల విషయంలోనూ..ఆక్రమణల తొలగింపు విషయంలోనూ ప్రభుత్వం అక్కినేని ఆస్తుల జోలికి వెళ్లకపోవడానికి కారణం నాగ్‌తో కేసీఆర్‌ గల రిలేషనే అని అప్పట్లో ప్రచారం జరగింది.   ఇటువంటి పరిస్థితుల్లో నాగార్జున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగనున్న ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి..వచ్చే నెలలో జరగనున్న తన కుమారుడు నాగచైతన్య వివాహా రిసెప్షన్‌కు సీఎంను ఆహ్వానించారట నాగ్. కంటి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్‌ను పరామర్శించే పేరిట ఈ పలకరింత జరిగినప్పటికీ దీని వెనుక వేరే రహస్యం ఉందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి కారణం ఏదైనా కావొచ్చు..అదేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

జంప్ అవ్వడానికి భలే సాకు దొరికింది

ఎండిపోయి, మోడువారిపోయిన పార్టీని వదలి పచ్చగా కళకళలాడుతున్న పార్టీలోకి జంప్ కావడానికి రాజకీయ నాయకులు భలే భలే సాకులు వెతుక్కుంటూ వుంటారు. ఆ సాకు జనం ముందు పెట్టేసి ఎంచక్కా జంపైపోయి అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ వుంటారు. ఇండియన్ పాలిటిక్స్‌లో ఇలాంటివి మామూలే. ఒక నాయకుడు ఫలానా పార్టీ విధానాలు తెగ నచ్చేసి పార్టీ మారిపోయానంటాడు. మరో నాయకుడు కార్యకర్తల డిమాండ్ మేరకే పార్టీ మారుతున్నానని చెప్తాడు. ఇంకో నాయకుడు ఇప్పుడున్న పార్టీలో తనను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి పార్టీ మారేస్తున్నానంటాడు. మొత్తం మీద పార్టీ మారడం అనేది కామన్ పాయింట్. దానికి చెప్పే సాకు మాత్రం పరిస్థితిని బట్టి మారుతూ వుంటుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. మోడువారిపోయిన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి హవా నడిపించడానికి వీలున్న పార్టీకి మారిపోవాలని ఈ బ్రదర్స్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి ఆప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నట్టు పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి ఎమ్మెల్యే కమ్ మినిస్టర్‌గా అన్న వెంకటరెడ్డి, ఎంపీగా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి బోలెడన్ని కాంట్రాక్టులను సొంతం చేసుకుని ఆర్థికంగా బాగా ఎదిగిపోయారు. తెలంగాణ సాధన ఉద్యమంలో అన్నదమ్ములిద్దరూ మహా దూకుడుగా వ్యవహరించారు. అయితే తెలంగాణ  ఇచ్చిన తర్వాత ఆ క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్‌ని మూల కూర్చోబెట్టింది. దాంతో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కి కాలూ చేయీ ఆడటం మానేశాయి. అధికార  టీఆర్‌ఎస్‌లోకి జంప్ కావడానికి నానా ప్రయత్నాలూ చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా వున్న పొన్నాల లక్ష్మయ్య మీద ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. పీసీసీ నాయకత్వం బాగాలేదు కాబట్టి పార్టీ మారాం అని చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టడంతోపాటు ఈ అన్నదమ్ముల్ని పార్టీలోకి తీసుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం ఆసక్తి చూపించకపోవడంతో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యారు.   ఈమధ్యకాలంలో అటు కేంద్రంలో బీజేపీ బాగా బలపడిపోయింది. తెలంగాణలో కూడా ఈ పార్టీ విషయంలో ఆశావాద ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ విషయంలో అటూ ఇటూ అయినా కేంద్రంలో మాత్రం బీజేపీ జెండాకి ఢోకా లేని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఆ పార్టీలోకి జంప్ కావడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ స్కెచ్ వేశారు. తమ స్కెచ్‌ని అమల్లోకి పెట్టడం కోసం ఒక బలిపశువును వెతికారు. ఆ బలిపశువే ప్రస్తుత టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయన మీద మెల్లమెల్లగా విమర్శలు మొదలుపెట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇటీవలి కాలంలో విమర్శల ఘాటును మరింత పెంచారు. తెలంగాణ రావడం మూడేళ్ళు ఆలస్యం కావడానికి ఉత్తమ్‌కుమారే కారణమనే కొత్త పాయింట్‌ని లేవనెత్తారు. ఉత్తమ్ కుమార్‌ని పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగించకపోతే కాంగ్రెస్‌లో కొనసాగలేమంటూ మనసులోని మాటను కూడా బయటపెట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ పోరు భరించలేక ఇప్పటికే ఓసారి పీసీసీ అధ్యక్షుడిని మరోసారి మార్చిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అలాంటి పని చేయదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కి కావలసింది కూడా అదే కాబట్టి ఆ సాకు చూపించి ఎంచక్కా బీజేపీలోకి జంప్ అయిపోతారని విశ్లేషిస్తున్నారు. 

"ఇర్మా" ఇండియాలో వస్తే..?

గత కొద్ది రోజులుగా ప్రపంచం మొత్తం వినిపిస్తున్న మాట..మాట్లాడుకుంటున్న విషయం ఒకటే.. "ఇర్మా". అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఈ రాకాసి దెబ్బకు కరేబియన్ దీవులు, క్యూబా, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం చివురుటాకుల్లా వణికిపోయాయి. గంటకు సుమారు 350 నుంచి 400 కి.మీ వేగంతో వీచిన గాలులకు భారీ భవనాలు నామ రూపాల్లేకుండా పోయాయి..పెద్ద పెద్ద వృక్షాలు సైతం చీపురు పుల్లల్లా విరిగిపడిపోయాయి. సుమారు 65 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎంతటి విపత్తునైనా అంచనా వేసి అందుకు ధీటుగా స్పందించగల అగ్రరాజ్యం సైతం ఇర్మాను చూసి హడలిపోయింది.   అట్లాంటిక్‌లో ఏర్పడిన ఈ హరికేన్ ఎన్నో రెట్లు పెద్దదని..ఫ్లోరిడాకు ఏదో ఒక దిశ నుంచి కాకుండా నలువైపుల నుంచి భయంకరమైన గాలులు వీస్తాయని..ఫ్లోరిడా పెవిన్సులాలో ఎక్కడున్నా ప్రమాదమేనని..కాబట్టి సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని..హరికేన్ అగ్రరాజ్యం వైపు దూసుకోస్తున్న వేళ ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంత సాధనా సంపత్తి ఉన్న అమెరికాయే ఈ స్థాయిలో భయపడితే..అలాంటి హరికేను భారతదేశంలో వస్తే పరిస్థితి ఏంటి..? మనం ఎంత వరకు దానిని ఎదుర్కోగలం అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.   విపత్తులు మనకు కొత్త కాదు..వాటిని ఎదుర్కోవడంలో మనదేశానికి ఎంతో అనుభవం ఉంది. 1900 నుంచి నేటి వరకు ఇండియా అనేక విపత్తులను చవిచూసింది. ఈ మధ్యకాలంలో 90 లక్షలకు పైగా జననష్టం సంభవించింది. మొదట్లో మరణాల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రభుత్వం అమలు చేసిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రామ్‌ వలన నష్టశాతం తగ్గింది. అనేక అంతర్జాతీయ సంస్థల సహకారంతో పాటు భారత్‌ అభివృద్ది చేసుకున్న టెక్నాలజీ సాయంతో ఎన్నో ఘోరాలను ఆపగలిగాం. అయితే ప్రకృతితో పోరులో అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయామని నిపుణుల మాట. మనదేశ భూ భౌగోళిక పరిస్థితుల రీత్యా హరికేన్ల సమస్య మనకు లేదు. కానీ హరికేన్లతో పోలిస్తే అతి తక్కువ శక్తివంతమైన తుఫాన్లకి భారత్ విలవిలలాడిపోతోంది.   prevention is better than cure అన్న సూక్తిని ఈ విషయంలోనూ అన్వయించుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2010 ప్రాంతంలో హైతీ, చిలీ, కాలిఫోర్నియాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. చిలీ, కాలిఫోర్నియాల్లో సంభవించిన భూకంపాలు హైతీలో కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చినప్పటికీ..హైతీలో 2,30,000 మంది మరణించగా..చిలీలో కొన్ని వందల మంది, కాలిఫోర్నియాలో కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే మరణించారు.దీనికి కారణం భవనాల నిర్మాణాల విషయంలో ప్రమాణాలు పాటించడమే. ఒక్కటి మాత్రం నిజం ఆపదలు చెప్పిరావు..ఎప్పుడు ఏ రూపంలో..ఎంత తీవ్రతతో దాడి చేసినా అంతే ధాటిగా, ధీటుగా వాటిని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాల్సిందే. లేకపోతే రెప్పపాటులో అంతులేని అనర్థం జరిగిపోతుంది.

కోమట్లను రగిల్చిన "కంచె"

ఎప్పుడూ తమ వ్యాపారాలు..తమ పనులు తప్ప బయటి విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వని ఆర్యవైశ్యులు ఇప్పుడు రగిలిపోతున్నారు. ఏకంగా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇంతటి వివాదానికి కారణం ఎవరో తెలుసా..? సామాజిక వేత్త, ప్రముఖ రచయిత ప్రో. కంచె ఐలయ్య. ఆయన రాసిన "సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు" పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ పుస్తకం తమ మనోభావాలని కించపరిచేలా..తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు..ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సదరు పుస్తకాన్ని నిషేధించడంతో పాటు పబ్లిషింగ్ సంస్థపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.   చిన్ననాటి నుంచి ఏ సంఘటనలు ఐలయ్యపై ప్రభావం చూపాయో తెలియదు కానీ ఆయన అగ్రవర్ణాలకు బద్ధ వ్యతిరేకి అన్న ముద్ర పడిపోయింది. వారిలోనూ బ్రాహ్మణులు అంటే మంట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపాలు పొగొట్టుకునేందుకే బ్రాహ్మణుల కాళ్లకు మొక్కుతున్నారంటూ మీడియా సాక్షిగా ఆరోపించారు. భారతదేశంలో నిమ్మ కులాల వారికి నేటికీ తగిన గౌరవం దక్కలేదని వాదించే ఆయన..కులాల మధ్య వైషమ్యాలను..నిమ్న జాతుల స్థితిగతులను తన రచనల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా తాను హిందుమత వ్యతిరేకినని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.."నేను హిందువు నెట్లయితే" అనే పుస్తకాన్ని రాసి సంచలనం సృష్టించారు.   తాజాగా దేశంలోని కులాల గురించి ప్రస్తావిస్తూ 'సామాజిక స్మగ్లర్లు-కొమటోళ్లు' పుస్తకం రాశారు..హిందు ధర్మ శాస్త్రాలను అడ్డుపెట్టుకుని..గ్రామాల్లో వ్యాపారం కోమట్లు మాత్రమే చేయాలన్న నిబంధనను తీసుకొచ్చారని..ఈ విధానం వల్ల గ్రామీణ వ్యాపార వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయిందని..దేశంలో అంటరానితనం పెరగడానికి కోమట్లు కూడా ఒక కారణమేనని .. వేల యేళ్లుగా వ్యాపారం పేరు మీద వారు చేసిందీ..చేస్తున్నదీ స్మగ్లింగ్ కాకపోతే ఏమిటో చెప్పండి అంటూ ఐలయ్య ప్రశ్నించారు. అదే ఇప్పుడు ఆర్యవైశ్యులకు కంటగింపుగా మారింది. తాము బతుకుతూ పదిమందికి ఉపాధి చూపిస్తూ..సమాజ ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్న తమను స్మగ్లర్లు అనడం ఎంత వరకు సమంజసమమని ఆర్యవైశ్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఐలయ్య ఒక్కటి మరచిపోయినట్లున్నారు..మారిన కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు వ్యాపారాలు కేవలం వైశ్యులే చేయడం లేదు..అన్ని కులాలు, మతాలకు చెందిన వారు నిర్వహిస్తున్నారు. వీరిని అందరినీ కలిపి నిందించకుండా కేవలం కోమట్లను మాత్రమే వేలేత్తిచూపడం సబబు కాదు.

తెలుగు తమ్ముళ్లకు కేసీఆర్ గుడ్‌న్యూస్..?

లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయం ముందు తెలిసిందో లేక ఎప్పటి నుంచో ఈ ఆలోచన ఉందో కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు 2019లో కాదని..2018 చివరికల్లా వస్తాయి..సిద్ధంగా  ఉండాలంటూ శ్రేణులకు పిలుపునిస్తూ వస్తున్నారు. ఎన్నికలు సరే 2014 నాటి పరిస్థితులు వేరు..నేటి పరిస్థితులు వేరు..రాజధాని కోసం భూసేకరణ, భీమవరం మెగా అక్వా ప్రాజక్ట్, కాల్‌మనీ, భోగాపురం భూములు, కాపు రిజర్వేషన్లు సహా కొన్ని అంశాల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది.   ఇలాంటి పరిస్ధితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే జనాలు ఆదరిస్తారా..? లేక 2004 నాటి పరిస్ధితి ఎదురవుతుందా అంటూ సగటు కార్యకర్త భయపడ్డాడు. అయితే నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పచ్చ జెండా రెపరెపలాడటంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలోనే ముందస్తు ఎన్నికలకు వెళితే మంచి రిజల్ట్స్ వస్తాయని కార్యకర్తలు భావిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే శుభవార్తను చెప్పారు. ఆయన చేయించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 139 సీట్లు వస్తాయని తేలిందట.   టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేస్తే ఈ సీట్లు వస్తాయని..ఒక వేళ తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 157 సీట్లు దాకా రావొచ్చంటున్నారట గులాబీ బాస్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలుకావడం, రాజధాని నిర్మాణం, శాంతిభద్రతలు, తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకపోవడం తదితర అంశాలు ప్రజలపై ప్రభావం చూపి తెలుగుదేశం పట్ల ఆకర్షితులైనట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రాలో సర్వే చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అభిమానులు ఈ విషయం తెలిసిన దగ్గరి నుంచి ఆనందంలో మునిగి తేలుతున్నారు.

గుర్గావ్ బాలుడి హత్య వెనుక "రేప్"

దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని గుర్గావ్‌ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలులో ఏడేళ్ల చిన్నారి టాయ్‌లెట్‌లో శవమై తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చిన్నారి అని కనికరం లేకుండా కత్తితో అత్యంత పాశవికంగా బాలుడి గొంతు కోసి చంపడం అందరిని కంటతడి పెట్టించింది. పాఠశాలలో విద్యార్థుల మధ్య ఎటువంటి గొడవ జరిగిన దాఖలాలు లేవు..స్కూలు సిబ్బందిని ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్న సమాధానమే.. మరి హత్య ఎవరు చేసి ఉంటారు..ఇదే ఖాకీల మెదళ్లను తొలిచేసింది. దీంతో ఆ ప్రశ్నకు సమాధానాన్ని తమ కోణంలో వెతికారు. ఆ వెతుకులాటలో అసలు నేరస్థుడు ఇంటి దొంగే అని తేలింది. అతను ఎవరో కాదు ఆ స్కూల్‌లో గత ఎనిమిది నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తోన్న 42 ఏళ్ల అశోక్ కుమార్.   అతను చిన్నారిని ఎందుకు హత్య చేశాడో తెలుసా..? లైంగిక దాడిని ప్రతిఘటించాడని.. అవును మీరు వింటున్నది పచ్చినిజం. నిన్న హత్యకు గురైన చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్‌ని వాళ్ల నాన్న స్కూలు వద్ద దించివెళ్లాడు. అప్పుడే బస్ పార్క్ చేసి వస్తున్న అశోక్‌కు బాలుడు టాయ్‌లెట్ వద్ద ఒంటరిగా కనిపించడంతో..అతనిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు..బాలుడు తప్పించుకునేందుకు యత్నించడంతో చిన్నారిని టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని..కత్తితో రెండుసార్లు పొడిచానని అశోక్ తెలిపాడు. అనంతరం కత్తిని కడిగి ఘటనాస్థలంలో పడేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.   అయితే స్కూలు యాజమాన్యం ఏదో నిజాన్ని కప్పిపుచ్చేందుకే డ్రైవర్‌ని బలిపశువును చేసిందని కొందరు వాదిస్తున్నారు. హత్య జరిగిన సంగతి చెప్పకుండా మీ అబ్బాయి ఆరోగ్యం సరిలేదని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పడం.. రక్తపు మరకల్ని మాయం చేసేందుకు యత్నించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు కానీ..ఈ ఘటనతో సభ్యసమాజంలో అమ్మాయిలకే కాదు..అబ్బాయిలకు రక్షణ లేకుండా పోయిందని తేటతెల్లమైంది. మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు చాప కింద నీరులా భారతీయ సమాజంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయకపోతే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నడిరోడ్డుపై నడవలేని పరిస్థితి రావడం ఖాయం.