Yeluka Vacche Illu Bhadram 45
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 45
ఇలపావులూరి మురళీమోహనరావు
ఇవాల్సిన దక్షిణకు వెయ్యో రెండువేలో తగ్గించుకుని ఇద్దామని మనసులో అనుకున్నా వెంకట్రావుకు శాస్త్రిగారి మాటలతో పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లు అయింది. దాంతో మనసులోనే బోరుమని ఏడుస్తూ పైకి నవ్వు నటిస్తూ ఇరవైవేల రూపాయల నోట్లను కడసారి చూసి శాస్త్రిగారికి తాంబూలంలో పెట్టి అందించాడు వెంకట్రావు.
ముగ్గురునీ ఒక నిమిషం పాటు రకరకాలుగా ఆశీర్వాదించారు శాస్త్రిగారు.
" మిగిలిన పదార్థాలన్నింటినీ శుభ్రమైన అరటి ఆకులలో పార్శిల్ చేసి నాకివ్వమ్మా ! దేవుడి నైవేద్యాలన్నింటిని ఆవులకు తినిపించాలి. దాంతో పాపం పూర్తిగా నాశనమైపోతుంది. మా యింట్లో నాలుగు ఆవులున్నాయి కాబట్టి వాటికి పెడతాను. జాగ్రత్తగా వినమ్మా సుందరి ఈ పూట వండిన పదార్థాలలో ఒక్క మెతుకు కూడా సాయంత్రానికి పనికిరాదు. ఆవు మాత్రమే తినాలి " అని చెప్పాడు శాస్త్రిగారు.
హతాశులైంది సుందరి.
" అయ్యో...బోలెడు పరమాన్నం, పులిహోర, కూరలు, గారెలు, బోలెడన్ని బజ్జీలు మిగిలిపోయాయి.వాటిని చుట్టుపక్కలవారికి మాకు తెలిసిన వారికి పంపించాలనుకున్నానే " అని అన్నది సుందరి,
" అన్నన్నన్న...ఎంతమాట ! ఇది యమబాధ నివారణా శాంతి పూజ దాంట్లో మిగిలినవాటిని ఇతరులకు పంచడం అంటే ఆ పాపాన్ని వారికి కూడా పంచడమే అవుతుంది. లక్ష్మీ అవతారమైన గోవుకు మాత్రమే ఆ పాపాలను హరాయించగల శక్తి గలది. ఇంకా నయం ముందే చెప్పావు " అని ఏదో మహా ఉపద్రవాన్ని నివారించినవాడిలా పోజు పెట్టారు శాస్త్రిగారు.
ఇక చేసేది ఏమిలేక పదార్థాలని అరటి ఆకులలో పెట్టి శాస్త్రిగారికి ఇచ్చింది సుందరి. వాటికి తీసుకుని ఇంటికి వెళ్లాడు శాస్త్రిగారు. ఊపిరి పీల్చుకున్నారు దంపతులు.
*********************
ఆ రాత్రి పడుకోబోయే ముందు సుందరి అన్నది " మనకేదో శని అంటుకుంది.లేకపోతే బోడిముండా ఎలుక వల్ల ఇన్నిన్ని నష్టాలా ? ఆ ఎలుక కోసం మందు తేవడం ఏమిటి ? తెచ్చాం పో ! ఆ మందును మన చంటి ముండ తినాలా ? తిన్నది పో! కాస్త వాంతి చేయిస్తే పోయేదానికి ఆ డాక్టర్ దగ్గరికి పోవడం ఏంటి ? పోయాం పో ! వాడేవో నాలుగు టాబ్లెట్లు ఇవ్వకుండా పద్నాలుగు వేలు గుంజడం ఏంటి ? అంతటితో ఊరుకోక మనం పిల్లిని తేవడం ఏంటి ? తెచ్చాం పో ! అది ఆడపిల్లి కావడం ఏంటి ! అయితే అయింది పో ! అది మనింట్లో ఈనడం ఏంటి ? ఈనింది పో ! అందులో ప్లా పిల్లి కూన చావడం ఏంటి ? చచ్చింది పో ! ఆ శవాన్ని చెత్తకుండీలో పారేయక ఈ శాంతి ఏమిటి ? ఈ గోల ఏంటి ? ఈ డబ్బు నష్టం ఏంటి ?" అని.
" శాంతి చెయ్యకపోతే నరక బాధ అనుభవించాలి కదా మరి " అన్నాడు వెంకట్రావు.
" ఏమో ఈ స్వర్గ నరకాలు ఎవడు చూశాడు ? ఆ శాస్త్రిగారు చెప్పగానే మనం గంగిరెద్దులా తలలూపుతూ ఉండడం ఏంటి ? అసలూ ఆ శాస్త్రిగారు చెప్పినా పురాణాలు పద్యాలు నిజమేనా ? ఏంటా పేర్లు ?"
" ఎవడికి గుర్తున్నాయి ? వాడు ఎంత వదిలిస్తున్నాడా అన్నదాని మీద ధ్యాస పెట్టాం గాని ఈ పేర్లన్నీ ఎవడు విన్నాడు "
" ఏదో సామెత చెప్పినట్టు ఎమ్మే చదివిన మీకంటే ఏడో క్లాసు చదివిన ఈ శాస్త్రిగారే నయం. మాటలతో భయపెట్టి బోల్తా కొట్టించాడు. రోజూ రోడ్లమీద లారీలకింద పడి ఎన్నో కుక్కలు పిల్లులు చావడం లేదా ! ఆ డ్రైవర్లంతా మనలా శాంతులు గీంతులు చేయిస్తున్నారా " అని అన్నది సుందరి.
ఆ మాట వినగానే వెంకట్రావు ముఖం జేవురించింది. కణతల మీద నరాలు ఎర్రగా ఉబ్బాయి. పళ్ళు బిగుసుకున్నాయి.
" ఈ మాట ఇప్పుడా చెప్పేది ? ఈ జ్ఞానం ఇంతకు ముందేమైంది ? అప్పుడే ఇలా చెప్పి ఉంటే ఇంత డబ్బు వదులుకుని ఉండేవాళ్ళం కాదు కదా " అని కోపంగా అన్నాడు వెంకట్రావు.
" బాగానే ఉంది ఆరునెలలు సావాసం చేసి మూలకున్న ముసలమ్మను తన్నినట్లు నామీద ఎగురుతారేం ? నేనంటే ఆడదాన్ని మీరు పెద్ద మగాళ్ళు కదా " అని వత్తి పలికింది సుందరి.
" అన్ని సలహాలు నువ్వు ఇచ్చినవే కదా ! అసలు నా బుర్రతో నను ఆలోచించినిస్తేగా? పిచ్చిగా వాగకు పళ్ళు రాలగోడతాను " అని మళ్ళీ కోపంగా అన్నాడు వెంకట్రావు.
" అంతేలెండి...ప్రతిదానికి నేనే కదా మీకు దొరికేది " అని ఏడుస్తూ దుప్పటి ముసుగు తన్నింది సుందరి.
"చీచీ...ఆడదాని పెత్తనం తంబళ్ళ దొరతనం అని ఊరికే అన్నారా ! జన్మలో చస్తే ఆడదాని మాట వినకూడదు " అనుకుని కోపంగా బయటికి వెళ్లాడు వెంకట్రావు.
(ఇంకావుంది)
( హాసం సౌజన్యంతో)